’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-2
7- వసంత లక్ష్మి –శ్రీ వేదాంతం శ్రీధరాచార్యులు –రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ –గండిగుంట
నవ్యా౦ధ్రై నా సమైక్యాంద్రైనా ఉగాది ఉగాదె
తెలుగు నేల రాజకీయం గా విడిపోయినా
హూద్ హూద్ తుఫాను విలవిల లాడించినా
శిశిరం తర్వాత వసంతం లా
చిగురులు తొడిగి ,అభివృద్ధి విరగ బూస్తుంది
నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర గా మారుతుంది
మరి ఈ ఉగాది మనకు ఎలా వస్తోందో చూద్దాం
చిగురుటాకుల చీర కట్టి –సిగలో వేపపూలు చుట్టి
మామిడి పిందెల అందెలు గట్టి –ఇక్షు దండము చేత బట్టి
నవ పల్లవ కేతనమ్ము తో –కలకోకిల స్వనమ్ముతో
అందాలు మెరయ –అందరి డెందాలు మురియ
వచ్చే నా వాసంత లక్ష్మి –తెచ్చే సౌభాగ్య లక్ష్మి .
8- ఉగాది –శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి –గుడివాడ
మన్మధ ఉగాది వైభవం అవతరించి
తోలి సంధ్య తొంగి చూసే వేళ
బహుమతిగా ఇలలో సుఖ శాంతులు పంచి మురిసి పోయే వేళ
నవ్య ఉగాదికి నాందీ ప్రస్తావన పలికి
హేమంతం విరిసే వేళ-చిత్రపు రంగు హంగులతో
ధరిత్రి అంతా పులకించి హోలీ ఆడిన వేళ
చైతన్యపు తళుకు బెళుకు లతో పుడమి తల్లి
సింగారించు కొనే వేళ
వెన్నెల కురిసే రాతిరి హొయలతో సన్నజాజులు
జాతర చేసే వేళ
మా మనస్సుల్లో మానవత్వపు మల్లికల మమతల
పందిరి అల్లాలని –మా హృదయ పీఠం పై
సౌభ్రాత్రుత్వపు గులాబీలు గుబాళింఛి
గుండె లోతుల్ని స్ప్రుశించాలని
మా మదిలో మంచితనపు మందారాలు
మొగ్గలు తొడిగి మురిపించాలనీ
మాలో పరమత సహనపు
పచ్చదనం పరిఢవిల్లి జగతికి నీరాజనం పట్టాలనీ
మా జీవితాలలో హేమంతపు చేమంతులు విరబూసి
పరిసరాలను ప్రభావితం చేయాలనీ
కోకిలమ్మలు కమ్మని గొంతుతో
సమతా గీతాల నాలాపిస్తూ
జనావళిని జాగృతం చేయాలని
కోరుతున్నాను నిన్ను
కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను
9-సమైక్య సాధన –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –ఉయ్యూరు
నవ్యాంధ్ర అభివృద్ధిని సమైక్యం గా సాధిద్దాం
చేయి చేయి కలిపి కలిసీ మేలిసీ మసలీ .
సగర్వంగా అందరూ మెచ్చేలా
దిశల మన ఖ్యాతి మార్మోగేలా
నవ్యాంధ్ర నవ్యతను చాటు కొందాం
నవ్యాంధ్ర నందన వనం లో సమైక్యతా సౌరభాలు వెదజల్లుదాం .
10- మాకు ముందే వచ్చింది ఉగాది –ఛి మాదిరాజు బిందు దత్తశ్రీ –ఉయ్యూరు
ఉగాదికోకిల మా ఉయ్యూరులో
పరవశం తో ముందే కూసింది
పుస్తకావిష్కరణ ,పురస్కార మహోత్సవాలతో
పులకించి కవి కోకిలలు
ముందే కలస్వనం వినిపించాయి
హాయిగా ఆహ్లాదంగా ఆనందం గా వసంతకాలం
మాకు వచ్చే సిందిక్కడ మీ అందరి రాకతో
ఈ హసిత వసంతం కలకాలం నిలవాలని నిలపాలని
మన్మధుడిని మరీ మరీ వేడుతాను .
11—నవ దుర్గాంధ్ర ప్రదేశ్ –శ్రీమతి సామినేని శైలజ –విజయవాడ
వెన్నెలలో స్వర్ణ కాంతులతో మెరుస్తున్న రూపం
ఎవరూ అది?ధవళ వర్ణపు ముక్కు పుడక మెరుపులు
ఇంద్ర కీలాద్రి పై నుండి దిగి వచ్చిన దుర్గా మాతలా ఉందే!
అవును ఆమెయే –సందేహమే లేదు
మా నవ్యాంధ్ర ఉగాది శోభ చూడ వచ్చావా తల్లీ !
మనసుల మందారాలు పరచి స్వాగతిస్తున్నాం తల్లీ
అదిగో ఉదయ సూర్యునిలా మా నవ్యాంధ్ర
కృష్ణమ్మ తల్లి తీరాన అమరావతికి తోడుగా మా నవ రాజధాని .
ఎన్ని అవమానాలు అవాంతరాలు భారించామమ్మా
నీ దీవేనలుంటే చాలు ముందడుగేస్తాము తల్లీ
మేము వదిలోచ్చిన చోట ఏముందమ్మా
హరిత వనాలా ?సశ్యశ్యామల కేదారాలా ?
మాకున్నవి బంగారం లాంటి నేలలు
నిత్య శ్రోతస్వినులైన నదీమతల్లులు
ఏనాడో మేల్కొని ఉంటె –ఈ నాడు స్వర్ణాంధ్ర మనదే అయి ఉండేది .
కవిపండిత వాగ్గేయకారులకు మనకేం కొదవమ్మా ?
వేదానికే కాదు మేధస్సుకు ,శాస్త్ర సాంకేతికకూ మనమే మిన్న ఎన్నటికీ
నీ ఆవాసం ఒకప్పుడు కనక వర్షం కురిసిన చోటు తల్లీ
సింగపూరు ,మలేషియా నాగరకత మనకెందుకమ్మా ?
అనాది మన సంప్రదాయం సంస్కృతికి సాటి ఎక్కుడున్నదమ్మా?
నీ ఆశీర్వాద బలం మాకు అస్తైశ్వర్య ప్రదం
అన్నీ ఉన్న లక్ష్మీ సరస్వతీ నిలయంగా మారుస్తామమ్మా
అన్నపూర్ణ అనే మాట కలకాలం నిలిచేలా చేస్తాం
నీ కృపా వీక్షణం అనుక్షణం ప్రసరించమ్మా .
12- వచ్చిందోయ్ వచ్చింది –శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ
ఉగాది పండుగ వచ్చింది –వసంత ఋతువు తెచ్చింది
తీపి వగరు పులుపు చేదు కారం ఉప్పు ఆరు రుచులతో
మన్మధ నామ వత్సరం వచ్చేసింది
కష్టాల కడలిలో ఈదా౦ ఇప్పటిదాకా
సమస్యల వలయాల ఊబిలో దిగిపోయాం
అయినా నిశ్చలంగా నిబ్బరం గా నిల బడినాం
ఇకనైనా శాంతి సుఖలతో జీవిద్దాం
అందరి క్షేమం ఆశిద్దాం
సత్సంగం తో జీవిద్దాం
ఆశల పల్లకీలో నిజంగానే ఊరేగి కల నిజం చేసుకొందాం .
13-నవ్యాంద్రాలయం –శ్రీమతి కోనేరు కల్పన-విజయ వాడ
సీస –రాక్షసముగా ఈడ్చి రాజధాని యను సా –వాడి నుంచి వేగను వెళ్ళగొట్ట
నిలచెను నవ్యాంధ్ర నిలువ నీడయు లేక –నడి రోడ్డుమీదనే న్యాయ మేది?
కేంద్రము వీక్షించే క్రీగంట వేడ్కతో –ఆ ధర్మ మేమందు అనము అనక
వేవేగ యనుకొని బుద్ధు లికిలిం చిరి కనక తెలుగు చిమురు శక్తి
తే గీ.-కీర్తి ,కలిమియే యగు పోట్ల గిత్తమాకు –ఆత్మ బలమే నందీశ్వరునాత్మ రూపు
మట్టి గరిపి౦చు దూర్తుల మట్టగి౦చి –కామదేను వౌ సఖ్యత కలుగ జేయ .
సీ –భయమేమో నిదులివ్వ బలవంతుదగునని –బాస కూడ విడచి ,బాగు మరచె
కూట నీతి వలదు,కుత్సితంబు తగదు –కూడి ఉంటె మేలు ,కూర్మి బలము
అసమర్దులముగాము ,అలుసు చేయక మా క –డుపు మంట దీర్చరే దొగరు దిద్ది
నవ్యాంధ్ర హక్కుల న్యాయ రక్షను చేసి –విజ్ఞత చూపరే వేగముగను
తే.గీ.కార్మికులు కర్షకులు కార్య కర్తలు ఇక –పౌరులుద్యోగు లందరు ఫౌజు వలెను
అందరొక టైరి ,కట్టి తీరెదముగాక –ఆలసింపక నవ్యాంధ్ర ఆలయమిక .
తే.గీ. అవని కీర్తించు నవ్యాంధ్ర అనఘ ఘనము –దశ దిశలు మనఖ్యాతులే తావి పంచు
తెలుగు తేజము అగుగాక దిచ్య పదము –భారత దేశము గర్వించు భవ్య వరము .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-15- ఉయ్యూరు
