. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30
14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-2
ఆర్మీకి రాం రాం
విపరీత భావాలతో విసిగిపోయి ,మిలిటరీ కేడేట్ గా ఉండలేక మిలిటరీ మాన్ అని పించుకోటానికి ఇష్టపడక సమయాన్ని చదవటం లో రాయటం లో గడిపాడు టాల్ స్టాయ్ .అనేక భాషల్లో ప్రావీణ్యం సాధించాడు .ఫ్రెంచ్ భాషలో హాయిగా రాశాడు .గ్రీక్ ను స్వయం గా అభ్యసించి ,ఆ భాషలో చేసిన అనువాదాలు మహా మహా గ్రీకు ప్రొఫెసర్ల అనువాదాలకంటే మిన్నగా ఉన్నాయని పించుకొన్నాడు .రష్యా టర్కీ యుద్ధ సమయం లో తనను బదిలీ చేశారని తెలుసుకొని విభ్రాంతి చెందాడు .సేవేస్టపోల్ రక్షణ బాధ్యతలో ఉన్నాడిప్పుడు .ఈ కాలం లో పొందిన అనుభవాలతో సైన్యం అన్నా యుద్ధం అన్నా అసహ్యం కలిగింది .27 వయసులో సైన్యానికి రాజీనామా చేశాడు .యుద్ధ అనుభవం తో ‘’సేవేస్ట పోల్ కధలు ‘’రాశాడు .ఇప్పటికే రచనలో ప్రసిద్ధు డనిపించుకొన్నాడు .బోహీమియా అరిస్టాక్రటిక్ గా లేదు. తన అభిరుచులకు అనుకూలంగా లేదని భావించి మళ్ళీ పీచే మూడ్ గా యసన్యా పోల్యానాకు చేరాడు .కుర్రవయసులో ప్రశాంత జీవితాన్ని అనుభవించే స్తితిలో లేడు.మనసు స్థిమితంగా లేదు .ఏమి చేయాలో పాలు పోవటం లేదు అస్తిమితత్వం బాధిస్తోంది .చివరికి యూరప్ టూర్ చేయటానికి బయల్దేరాడు .తిరిగి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు .తనకు కావాల్సిన భార్య కోసం ప్రయత్నించాడు .అలాంటివారెవరూ తారసడ లేదు .దాదాపు కాలమంతా డెస్క్ దగ్గరే గడుపుతూ రాసుకొంటూ కూర్చున్నాడు .రాత విసుగని పించి రాత మానేద్దామనుకొన్నాడు .టాల్ స్టాయ్ ఊహించిన తీరులో రచనలు చేయటం అసాధ్యం అన్నారు విమర్శకులు .వాళ్ళ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నమేమీ చెయ్యలేదాయన .
పిల్లల స్కూల్ ఏర్పాటు -విద్యపై అభిప్రాయాలు
31 వయసులో తన సంస్థానం లోని పిల్లలకోసం ఒక స్కూల్ ప్రారంభించాలను కొన్నాడు .అంతకు ముందు చదువురాని కూలీలను విద్యా వంతుల్ని చేసే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు .తనకు ఈ విషయాలలో ఉన్న సామర్ధ్యం తక్కువ అని తెలుసుకొన్నాడు .మళ్ళీ యూరప్ ట్రిప్ చేసి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు .విద్య ఉచితంగా స్వచ్చందం గా అందించాలనే అభిప్రాయానికి వచ్చాడు .విద్యవలన నైతికత పెరగాలని ఆశించాడు .శీల సంపదను పెంచి స్వయం అభివృధికి తోడ్పడాలి .స్వీయ ప్రతిభకు ఊతమివ్వాలి .సృజనను ప్రోత్సహించాలి .తరగతిగది స్వేచ్చకు ,విముక్తికి ఆధారమై ప్రయోగ శాలగా ఉండాలని భావించాడు .
మలుపు తిరిగిన జీవితం
1862 లో టాల్ స్టాయ్ జీవితం అనూహ్యమైనపూర్తీ మలుపు తిరిగింది .బెర్స్ కుటుంబం చాలాకాలంగా ఆయనకు తెలుసు .తండ్రి డాక్టర్ తల్లి ఆతిధ్యం లో సమర్ధురాలు .పిల్లలు ఉత్సాహ వంతులు . సంతానం లో మధ్య పిల్ల పద్దెనిమిదేళ్ళ సోన్యా బెర్స్ పై మనసుపడ్డాడు .31 వయసులో అకస్మాత్తుగా ఆమెపై ప్రేమలో పడ్డానని గ్రహించాడు .చాలాకాలం సందేహం ,ఊగిసలాట సాగి చివరికి ఆమెను ప్రొపోజ్ చేయటం ఆమె అంగీకరించటం జరిగిపోయాయి .టాల్ స్టాయ్ అప్పటికే సోన్యా అభిమాన రచయిత.ఆయన్నే ఆరాదించేది .ప్రేమలేఖలతో బాటు డైరీలూ మార్చుకొన్నారు .ఇద్దరి మధ్య రహస్యాలేలేవు .ఆదర్శ దాంపత్యం అనిపించారు .ఒకరికోసం ఒకరు అన్న భావన ఏర్పడింది .ఈ హాయైన అనుబంధం 16 ఏళ్ళపాటు దివ్యం గా కొనసాగింది .భార్య సోన్యా భర్త టాల్ స్టాయ్ రచనకు ప్రేరణగా నిలిచింది .ఆయన రాసిన అనంత సాహిత్యాన్ని స్వదస్తూరీతో కాపీ చేసింది .ఆయన్ను సామాన్య విధులనుండి రిలీఫ్ కలిగించి తానె బాధ్యతలు చేబట్టింది .టాల్ స్టాయ్ కి 13 మంది పిల్లలను ‘’కని’’పెట్టింది .ఏడాది కేడాది గర్భిణీగా ఉండటం తో బాహిర ప్రణయ సౌఖ్యాన్ని అందించ లేక పోయింది .ఆయన సెక్స్ దాహాన్ని తీర్చలేక పోయేది .
యుద్ధము-శాంతి .-అన్నా కేరేనీనా
.కాని ఆయన రచనా వ్యాసంగం నిర్విఘ్నం గా కోన సాగుతూనే ఉంది .ఎన్నో రాసిన తర్వాత మనసులో ‘’యుద్ధము –శాంతి ‘’నవలకు బీజం పడి మొలకెత్తి మహా వ్రుక్షమైపోయింది .ఈ నవలలో టాల్ స్టాయ్ పియర్రీగా ప్రిన్స్ ఆండ్రీ గా రెండు విభిన్నపాత్రాలు పోషించాడు .కాని అందరు మగ వాళ్ళూ మెచ్చిన,ప్రేమించిన నతాషా పాత్ర మాత్రం భార్య సోన్యాకు పోలిక లేకుండా ఆమె చెల్లెలు తాన్యా లాతీర్చి దిద్దాడు .దీన్ని రాయటానికి ఏడేళ్ళు పట్టింది .ప్రచురణ పొందిన తర్వాత ఈ నవల బృహత్తర మహా రచనగా ఆధునిక ఇతిహాసం గా గుర్తింపు పొందింది .రష్యా సాహిత్య చరిత్రలో డి.ఎస్ .మిర్క్సి రాస్తూ ‘’చాలాముందు చూపున్నమహా రచన అని ,కాల్పనిక సాహిత్యపు అవధిని పెంచిందని ,యుద్ధం అవా౦చనీయమని ,సాధారణ మానవుని మహోన్నతంగా మలిచాడు ‘’అని కీర్తించాడు .మనుషుల సాధారణ స్వభావాలను చాలా చక్కగా చిత్రించాడు ఇందులో . ‘’war and piece is a panoramic spectacle and social drama .The horror of battle ,the death throe struggle of great armies ,the accidents of war and the sense of fatality are depicted on the largest scale ever attempted by a novelist .but here also are superbly detailed domestic situations ,illuminations of a society which is both effete and barbarous and the intricately tangled lives of human beings who are un forgettable .వ్యక్తిలోని సమాజం లోని నిజ జీవితాన్ని వైరుధ్యాలను ప్రతిబి౦బి౦ప జేశాడు . చరిత్ర వేదాంతపు లోతులను తరచాడన్నారు .చరిత్రలో జరిగే సంఘటనలునెపోలియన్ లాంటి ఏ ఒక్క వ్యక్తీ కోరిక ననుసరించి జరగవని ,అవి ముందే నిర్ణయించబడి ఉంటాయని అంటాడు .చరిత్ర అనేది రాజుకు బానిసకాదని అన్నాడు .చరిత్ర సంఘటన వెనుక ఎప్పుడూ ఒకే ఒక కారణం ఉండదు ,అనేక కారణాలు ఉండచ్చు .అవన్నీ ఏ ఒక్క వ్యక్తీ అధీనం లోనూ ఉండవు .
ఈ చారిత్రాత్మక నవల రాస్తూనే అనేక కధలను,వ్యాసాలను రాశాడు టాల్ స్టాయ్ . ఫస్ట్ గ్రేడ్ విద్యార్దులకోసం పుస్తకం రాశాడు .ఇందులో రష్యా జానపదకధలను చేర్చాడు .దీనిని సంప్రదాయ వాదులు అడ్డుకొన్నారు .రష్యన్ మెసెంజర్ పత్రికలో అన్నా కేరేనీన నవల ధారావాహికం గా రాస్తున్నాడు .అయిదేళ్ళ తర్వాతా ఇదంతా నవలగా వెలువడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-15- ఉయ్యూరు

