పతంజలి మహర్షి యోగ శాస్త్ర బోధనా -రచన గురు రవిశంకర్ మరియు యక్ష ప్రశ్నలు -జవాబులు

యోగ జ్ఞానం ఒక బహుమతి
ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా   వారికి తెలియజేయాలని అతడు ఆశించాడు. తీరా చూస్తే ఇలా జరిగింది.

అదే సమయంలో, లఘుశంకకు బయటకు వెళ్ళి కుర్రవాడు తిరిగివచ్చాడు. నువ్వెక్కడికి వెళ్లావని
అతడిని పతంజలి అడుగగా, ఆ కుర్రవాడు జరిగింది చెప్పి క్షమించమని వేడుకున్నాడు. పతంజలి దయతో అతడిని క్షమించి, ఈ ఒక్కడైనా మిగిలాడని అనుకున్నాడు. యోగ సూత్రాలలోని మిగిలిన భాగమంతా పతంజలి ఆ శిష్యునికి బోధించాడు. అక్కడికి విద్య పూర్తి అయింది కాని, ఈ శిష్యుడు నియమాన్ని అతిక్రమించి తప్పు చేశాడనే విషయం పతంజలి మర్చిపోలేదు. దానికి శిక్ష అనుభవించాల్సి ఉంది. కాబట్టి ‘‘నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ చెట్టుకు వేలాడు’’ అని ఆదేశించాడు. తన జ్ఞానాన్ని మరొక శిష్యునికి బోధించినపుడు అతడికి శాపవిముక్తి కలుగుతుందని చెప్పి పతంజలి మహర్షి అదృశ్యమైనాడు.
ఇక బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టుకు వేలాడుతూ ఉండి దారిన పోయేవారిని ఒక ప్రశ్న అడిగేవాడు. వారు సమాధానం చెప్పలేకపోతే వారిని తినివేసి తన ఆకలిని తీర్చుకునేవాడు. అంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇదే కథ సాగింది. అతడి వద్ద విద్య నేర్చుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అతడు బ్రహ్మరాక్షసుడిగానే చాలా కాలం ఉండిపోవలసి వచ్చింది. ఈ కథనుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి? గొప్ప జ్ఞానం కలిగినవారు ఎవరైనా తప్పు చేసినపుడు బ్రహ్మరాక్షసుని వంటి స్థితిని పొందుతారు. తెలివితేటలు బాగా ఉన్నవారు నేరస్తులు కావటం అనేది అమాయకులు నేరం చేయటం కంటే ఎక్కువ ప్రమాదకరం. మరి విజ్ఞానం అంతా తెలుసుకున్న మనిషి నేరాలు చేయటం మొదలుపెడితే అది చాలా చాలా హానికరం కదా.
అలా చాలాకాలం పాటు బ్రహ్మరాక్షసుడు శాపవిమోచనం కోసం ఎదురుచూస్తూ ఉండటం చూసి దయాహృదయుడైన పతంజలి మహర్షి తానే ఒక శిష్యుని రూపంలో వచ్చి అతని వద్ద విద్య నేర్చుకుని దానిని తాళపత్రాలపై రాశాడు. ఒక్కో శిష్యుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ గురువే శిష్యుని రూపంలో వస్తాడని దీని భావం.
బ్రహ్మరాక్షసుడు ఏ చెట్టుపైనైతే కూర్చొని ఉన్నాడో ఆ చెట్టుపైనే పతంజలి కూడా కూర్చొని యోగసూత్రాలను లిఖించాడు. రాక్షసులు నిశాచరులు కాబట్టి పాఠం రాత్రిపూటే సాగేది. బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉండగా పతంజలి ఒక్కో ఆకునూ కోసి, తన చేతిపై చిన్న గాటు పెట్టుకుని స్రవించిన రక్తంతో ఆ ఆకుపై రాసేవాడు. ఇలా ఏడురోజుల పాటు విద్య సాగింది. పూర్తయ్యేసరికి పతంజలి అలసిపోయాడు. అప్పటివరకూ రాసిన ఆకులన్నిటిని ఒక గుడ్డలో చుట్టి చెట్టుకింద పెట్టి తాను స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఒక మేక ఆ ఆకులను చాలా భాగం తినివేస్తూ కనిపించింది. చేసేదేమీ లేక పతంజలి ఆ మిగిలిన ఆకులనే తీసుకుని వెళ్ళాడు. ఆ కొద్ది భాగమే మనకు లభించిన పతంజలి యోగ. అదీ కథ!
శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు

2 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు – 2వ భాగం

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- “నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు” అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. కిందటివారం 35 ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకున్నారు. ఈ వారం మరికొన్ని…

36. సుఖాల్లో గొప్పది ఏది? జ. సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? జ. అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? జ. మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు? జ. సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? జ. యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు? జ. సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?  జ. భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది? జ. అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది? జ. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?

జ. వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో…

46. తపస్సు అంటే ఏమిటి? జ. తన వృత్తికుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి? జ. ద్వందాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి? జ. చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడు? జ. ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి? జ. మంచి చెడ్డల్ని గుర్తించగలగడం
51. దయ అంటే ఏమిటి? జ. ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి? జ. సదా సమభావం కలిగి ఉండటం
53. సోమరితనం అంటే ఏమిటి? జ. ధర్మకార్యములు చేయకుండుట
54. దుఃఖం అంటే ఏమిటి? జ. అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి? జ. ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి? జ. మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.