మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు… ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. ‘గూర్ఖా రైఫిల్స్’. ఇండియన్ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్’(జీఆర్) 2 శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 24న 200 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా వారి గురించి మీకోసం..
ఈస్ట్ ఇండియా కంపెనీ 1815వ సంవత్సరం, ఏప్రిల్ 24న గూర్ఖాలను తొలిసారిగా నియమించింది. బ్రిటీ షర్స్ పరిపాలనలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని శత్రువుల్లో వణుకు పుట్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గూర్ఖాలను యథావిధిగా కొనసాగించింది.
– ప్రస్తుతం భారత దేశంలో ఏడు గూర్ఖా రెజిమెంట్లు లేదా రైఫిల్స్ (1,3,4,5,8,9,11) ఉన్నాయి. ప్రతి రెజిమెంట్లో 5 లేదా 6 బెటాలియన్లు ఉంటాయి. ప్రతి బెటాలియన్లో 800 మంది సైనికులుంటారు.
– ఏడు రెజిమెంట్లలో దాదాపు 30,000 మంది గూర్ఖాలు సేవలిందిస్తున్నారు. సైనికుల్లో 65 శాతం మంది నేపాలీ నుంచే వసున్నారు. 35 శాతం మంది సైనికులు డార్జిలింగ్, డెహ్రడున్, ధర్మశాల, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నారు.
– 1814-16 సంవత్సరాల్లో ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గూర్ఖాల పరాక్రమం చూసిన బ్రిటీష్ వాళ్లు గూర్ఖాలను ‘బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ’లో భాగం చేశారు.
– ప్రస్తుతం ‘గూర్ఖా రైఫిల్స్’గా కొనసాగుతున్నా ఇంతకు ముందు దీన్ని ‘నుస్సిరీ రెజిమెంట్’ అని పిలిచేవారు.
– భారతదేశం స్వాతంత్య్రం పొందాక 1,3,4,5,8,9 రెజిమెంట్లకు చెందిన ఆరు గూర్ఖా రైఫిల్స్లను ఇండియన్ ఆర్మీలో భాగం చేసుకోగా, 2,6,7,10 జీఆర్లు బ్రిటీష్ ఆర్మీలో బ్రిగేడ్స్గా సేవలందిస్తున్నాయి.
– ఆర్మీలో చాలా కీలకమైన పాత్రను వీరు పోషిస్తారు. 1962 సంవత్సరం లడఖ్లో జరిగిన యుద్ధంలో, 1965,1971 సంవత్సరాల్లో జమ్మూకశ్మీర్లో జరిగిన యుద్ధాల్లో శత్రువులను మట్టుపెట్టి వీరులుగా నిలిచింనందుకు యుద్ధ పురస్కారాలు పొందారు. భారత్ – శ్రీలంకల మధ్య శాంతిని నెలకొల్పడంలో కూడా వీరి పాత్ర హర్షణీయం.
– 3 పరమ వీర చక్ర, 33 మహా వీర చక్ర, 84 వీర చక్ర వీరి ఖాతాలో ఉన్నాయి. గూర్ఖాల శౌర్యానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.
– గూర్ఖా రైఫిల్స్కు చెందిన ప్రతి సైనికుడు దగ్గర ‘ఖుక్రీ’ అనే ఆయుధముంటుంది. ఖుక్రీ అనేది నేపాలీకి చెందిన ఒక రకమైన ఖడ్గం.
– గూర్ఖాలంతా గోర్ఖలి భాషలోనే మాట్లాడుతారు.