‘’బ్లాగ ‘’వతం
బ్లాగవతమునులందరూ ‘’నెట్టా’’రణ్యం లో చేరి పరమ బ్లాగవతోత్తముడైన బ్లాగానంద మహర్షిని తమకు ఈ జన్మలో అన్నిపాపాలనుండి విముక్తికలిగించే ధర్మార్ధ మొక్షాలనిచ్చే ‘’బ్లాగవ్రతం ‘’బోధించమని కోరారు .ఆయన కాసేపు మౌన ముద్రలో ఉండి,’’మంచి ప్రశ్న వేశారు మహాత్ములారా !శీఘ్రంగా ఫలితమిచ్చే ఒక బ్లాగవ్రత కద చెబుతాను .జాగ్రత్తగా విని ,ఆచరించి సత్ఫలితాలను పొందండి ‘’అన్నాడు .బ్లాగమునుల్లో శునక బ్లాగర్షి ‘’ ఆవ్రత విధానమేమిటి ?పూర్వం ఎవరైనా చేశారా ?ఫలితాలను పొందారా ?’’అని అడిగాడు .లేని గడ్డాన్ని దువ్వుకొంటూ బ్లాగానంద ముని ‘’ఫేస్ బుక్ వ్రతం ‘’అనే వ్రతం ఉత్తమోత్తమైనది ,త్వరలో ఫలితాలనిచ్చేది ,అందరితో పరిచయాలు పెంచి అదే లోకమై సర్వం మరపించేట్లు చేసి ,కళ్ళు కాయలు కాసి ,చేతులు వణికి అంత్యం లో ఆనంద మొక్షాలనిస్తుంది .ఆచరించి తరించని వారు లేరంటే నమ్మండి .అయినా ఎవరైనా ఆచరించి బాగుపడ్డారా? అని అడి గారు కనుక చెబుతున్నా వినండి .’’ అని లాప్ టాప్ దర్శనం చేసుకొని అందులో మొదటికద చదివి వినిపించాడు .
పరమ దరిద్రుడైన ఒక సన్నాసి ఏ ప్రయత్నం చేసినా డబ్బు రాలక ,పెళ్ళాం పిల్లల్ని పోషించలేక అల్లాడి పోతున్నాడు .ఒక రోజు అతనికి’’ బ్లాగేశ్వరుడు’’ దర్శనమిచ్చి బాగు చేయాలని భావించాడు .గాలిలో చేయి ఊపి ఒక ఐపాడ్ సృష్టించి దాన్ని చేతికిచ్చి ,దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొంటే సర్వమూ కరతలామలకం అవుతాయన్నాడు .మరి ఎవరు నేర్పిస్తారని అడిగితె వీధికో కోచింగ్ సెంటర్ ఉందని ఎక్కడ నేర్చుకొన్నా చేతి చమురు వదిలి౦చు కోవాల్సిన్దేనని అప్పుడే జ్ఞాన జ్యోతి వెలుగుతుందని జ్ఞాన బోధ చేశాడు .సరేనని సన్నాసి కోచింగ్ సెంటర్ లో చేరి డబ్బు’’ దోచింగ్ ‘’చేసుకొని మిడిమిడిజ్ఞానం పొందాడు .రోజూ ఆ ఐపాడ్ దేవతను స్తుతిస్తూ తాకుతూ ,మురుస్తూ అందులో దుర్భిణీ లో వెదికి ‘’మొక పొత్తాన్ని’’సృష్టించుకొని ,ముఖ స్నేహితుల్ని సాధించుకొని ,ఒకరికొకరు అవీ ఇవీ పంపుకొంటూ ,ఇహాన్నీ పరాన్నీ మరిచి అదే స్వర్గంగా గడిపాడు .భార్యా పిల్లలు మళ్ళీ మొదటికే వచ్చారు తిండీ లేదు పాడూ లేదు .చివరికి భార్యామణికి విసుగొచ్చి తానూ దొంగ చాటుగా దాన్ని వాడటం మొదలెట్టి అందులోనే ఐక్యమయింది .పిల్లలిద్దరూ అదే దారి పట్టి బ్లాగేశ్వర స్వామి లో ఐక్యంయ్యారు .ఈ కద విన్నా చదివినా చేసినా పుణ్యమూ పురుషార్ధమూ లభిస్తాయి అని బ్లాగానంద స్వామి కద ముగించారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15 –ఉయ్యూరు

