గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

శేషం(శేష ) వారు గొప్ప విద్వత్ కుటుంబానికి చెందినవారు. గోదావరిజిల్లాకు చెందిన శేషం నరసింహ వారణాసికి 16 వ శతాబ్ది మొదట్లో  వెళ్లి బెనారస్ దగ్గరున్న తాండవ రాజ్యమేలే గోవింద చంద్రుని ప్రాపు సంపాదించాడు .ఆ కాలం లో మహా వ్యాకరణ వేత్తగా ప్రఖ్యాతుడు .అక్కడ వ్యాకరణ విద్యాలయం స్థాపించి నేర్పాడు .ఇందులోచదివిన వారిలో భట్తోజీ నాగోజీ లున్నారు .నరసింహుని ఇద్దరుకోడుకులు చితామణి,కృష్ణ లు గొప్ప విద్యావేత్తలు రచయితలూ .కృష్ణ కుమారులు  వీరేశ్వరుడు నారాయణుడు .ఇందులో వీరేశ్వరుడు పండిత రాజు భట్టోజి ,అన్నం భట్టు లకు గురువు .శేషా లేక శేషం కుటుంబం వారణాసి వాస్తవ్యులైనా ఆంధ్ర దేశీయులే .

శేష కృష్ణ గిరిధారి అనబడే గోవర్ధన దారి అక్బర్ ఆస్థానం లో ఆర్ధిక మంత్రి అయిన రాజా తోడర్ మల్ కుమారుడు . కనుక కృష్ణ కవి 16 వశతాబ్దం చివరిదాకా 17 వశతాబ్దం ప్రారంభకాలం దాకా జీవించి ఉండ వచ్చు .ఈ కవి కంస వధ  మురవిజయం ,ముక్త చరిత్ర సత్యభామా పరిణయం అనే నాటకాలను ,పారిజాత హరణం ,ఉషాపరిణయం ,సత్యభామా విలాసం ,క్రియా గోపన రామాయణం చంపూ కావ్యాలు రాశాడు .ఇవికాక ప్రక్రియా ప్రకాశంఅనే వ్యాఖ్యను రామచంద్ర విరచిత ప్రక్రియా కౌముది పై రాశాడు  ,స్ఫోటత్వం ,యంగ్లు ఘంటా శిరోమణి అనే వ్యాకరణ గ్రంధాలను ,శేష కృష్ణ కారిక రచించాడు కాని లభ్యమైనవి కంసవధ నాటకం ,పారిజాతహరణం చంపు మాత్రమే .

కంస వధ 7 అంకాల నాటకం .1588 లో రాశాడు .భాగవత కద.గురువు గిరిధారి ప్రోద్బలం తో రాసినట్లు చెప్పాడు

‘’తస్యాస్తి తండన కులామల మండస్య శ్రీ తోడర క్షితి పతే స్తనయో న్యాజ్ఞః –ఆనాకలా కుల గృహం స విదగ్ధ గోస్టీమేఖో దితి గురుర్గిరి దారీ నామ్నా ‘’

ఈ నాటకాన్ని కాశీ విశ్వేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .మహా వ్యాకరణ వేత్త అయిన కృష్ణకవి వ్యాకరణ జ్ఞానం లేక పొతే యెంత గోప్పకవినైనా లోకం చులకనగా చూస్తుంది అన్నాడు

‘’రసాలంకార రసాసపి వాణీ వ్యాకర ణోజ్నితా-రివత్రేవనం రంజయతి సజ్జనాన్ ‘’

సాధారణం గా అన్ని శ్రవ్యకానాట కాలు లాకుండా ప్రదర్శన యోగ్యం గా ఉంది .మొదటి అంకం లో కంసుడు ఆకాశవాణి చెప్పింది విని కృష్ణుడిని సంహరించే అన్ని విధానాలు అమలు చేయమని ఆజ్ఞాపిస్తాడు .రెండవ అంకం లో కృష్ణలీలలు శకటాసుర ,కేశిని పూతన సంహారాలు ఉంటాయి .మూడవ దానిలో కంసుడు బలరామ కృష్ణు లను మధురకు ఆహ్వానించి చంపే కుటిల ప్రయత్నం చేయటం ఉంది .నాలుగవ అంకం లో శ్రీకృష్ణ బలరామూల మధురానగర ప్రయాణం ,యమునా ,గోకుల బృందావన వర్ణన ,చెలికత్తె విలాసవతి ద్వారా రాధ కృష్ణుడి కి  పంపిన సందేశం ,రాసక్రీడ ఉంటాయి .అయిదులో బలరామ కృష్ణులు చాకలి నుండి బట్టలు తీసుకోవటం సుదాముని ఆతిధ్యం ,కుబ్జకు సుందర రూపమివ్వటం ,మధురానగర ప్రవేశం ఉన్నాయి ఆరు లో కువలయాపీడ ఏనుగును చాణూర మర్దన మల్లులను చంపటం ,చివరికి కంస వధ ఉన్నాయి .ఏడవ చివరి అంకం లో దేవకీ వసుదేవులను కంసుని చెరనుండి విడిపించటం ,ఉగ్రసేనుడిని  రాజుగా అభిషిక్తుడిని చేయటం తో నాటకం పూర్తవుతుంది .

శేష కృష్ణ కవితా ప్రతిభ ఆద్యంతం కనిపిస్తుంది .కవికి జ్యోతిశ్శాస్త్రం లో ప్రవేశామున్నట్లు అర్ధమౌతుంది .బలరామ కృష్ణులు మధురకు బయల్దేరే ముహూర్తం దివ్యంగా ఉండేట్లు దైవజ్నుని చేత చెప్పించాడు .కాలిందీ నది సోయగాన్ని కమనీ యంగా వర్ణించాడు –

‘’పశ్యన్నేతాం చపల శఫరీ లోచనాంపంకజస్య –కోక ద్వంద్వస్తన భారనతాం బాల శైవాల కేశీం.

భ్రున్గశ్రేణీ మధుర వచనాం రాజ హంస ప్రచారం –వ్యాసక్తో పిక్షణమిహ పునః ప్రేయసీం స్మరితోస్మి ‘’

రాధ విరహ వేదనను పరమాద్భుతంగా విలాసవతి చేత చెప్పించాడు –

‘’మాలా వ్యాలానుకారా పరిమళ బహుళ స్నిగ్ధ చంపాను శంపా –పంపా కంపానిలోస్యా మలయా జని లయాశీ విషోద్గర ఘోరః

నస్యా దస్యా విభవ్య జ్వరమిహ కత మస్యో త్సకంపాను కంపా -ఝంపా సంపాత జగ్ర త్రుహిన కర హరి ప్రోద్గమో న్నాస భాజః ‘’

‘’పారిజాత హరణ చంపు ‘ను  తాండవ రాజు సోదరుడు నరోత్తముని ప్రేరణ పై రాశాడు –‘’

‘’సానందం మకరంద బిందు నికర ప్రస్యంద బందీ భవన్ –మందీ భూతి మిలింద  తు౦దిల దలన్మందార మందాదరం

భూయః సౌరభ లోభ సంభ్రమ భరాత్  భ్రుంగీ భిరంగీ కృతే –భామాయః కిల పారిజాత కుసుమే జీయాత్రుష్ణ౦ మనః ‘’అలాటి దివ్యపారిజాతాన్ని కోరకుండా ఎవరు ఉండగలరు .నందితిమ్మనతెలుగులో రాసిన ‘’పారిజాతాపహరణం ‘’ను  శేష కవి బాగా అధ్యయనం చేసి రాసినట్లు కనిపిస్తుంది .దీని పై  నంది కవి ప్రభావం అడుగడుగునా ఉంది .గంభీర రచనలో సిద్ధ హస్తుడైన కవి అతి సరళంగా సుందరంగా పారిజాత సుమాల౦త కోమలంగా కవిత్వం చెప్పాడు . తిమ్మన పద్యాలను ఒకరకంగా సంస్క్రుతీకరించాడని చెప్పచ్చు .సత్యభామ కోపాన్ని అనునయించే కృష్ణుడి పాట్లు –

‘’త్వం చంద్రికా చేత్తదహం చకోరే స్త్వందీపికా చేత్తదహం ప్రకాశః –కాదిమ్బినీ త్వం యది చాతకోహం ,మా మన్యదా మానిని మా స్మబుద్ధః ‘’.

మిగతా పారిజాత కావ్యాలలో పుణ్యక కవ్రతాన్ని వివరంగా వివరిస్తే మన శేష కవి ఒకే ఒక శ్లోకం లో చెప్పేశాడు –‘’

‘’అమర ముని సమాజే తత్ర సాత్రాజితీ సా గురుభి రధ నియుక్తా నారదాయా ర్చ యిత్వా –అదిత విదిత పుణ్యో పుణ్యకే పారిజాతం విదివదఖిల భర్త్రా వాసు దేవేన సార్ధం ‘’

ప్రతి సర్గ చివర్లో తన పోషకరాజు పేరును ప్రస్తావించాడు శేష కృష్ణ పండితకవి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27 11 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

‘’

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.