-పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7
31-‘’కృశ పరిణతి చేతః క్లేశ వశ్యం కవ చేదం –కవ చ తవ గుణ సీమోల్లంఘినీ శశ్వ దృద్ధిః
ఇతి చకితమ మందీకృత్య మాం భక్తి రాధాత్-వరద చరణ యోస్తే వాక్య పుష్పోపహారం ‘’.
భావం –భక్త వరదా శివా !నామనస్సు కృశించే లక్షణం కలది .ఎన్నో కష్టాలకు వశమైనది .కనుక నా మనస్సెక్కడ ?ఎల్లప్పుడూ పరిమితులు మించి ఉండే నీ మహిమ ఎక్కడ ?ఏవిధంగా నీ గుణాలను నామనసు భావి౦చ గలదు ?దానికి అది సాధ్యం కాని పనికదా అని ఎంతో భయపడుతున్నాను .కానీ నీ పై భక్తి నన్ను మండుడిని చేయటం లేదు .అది నన్ను యెంతో ఉత్సాహ వంతుణ్ణీ,సమర్దుడిని చేస్తుంది .దాని ఫలితం గా నీ పాద ద్వయానికి ఈ శ్లోకాలనే పుష్పాలను కానుకగా ఆ భక్తియే సమర్పింప జేస్తోంది .
‘’భక్తిః కిం న కరోత్యహో వనచరో భాక్తావత౦సాయతే ‘’అన్నారు శంకర భగవత్పాదులు శివానంద లహరి లో .భక్తిచేయలేని పని లేదని తాత్పర్యం .
32-అసిత గిరి సమం స్కాత్కజ్జలం సింధు పాత్రే –సుర తరు వర శాఖా లేఖినీ పత్ర ముర్వీ
లిఖతి యది గృహీత్వా శారదా సర్వ కాలం –తదపి తవ గుణానా మీశ పారం న యాతి ‘’
భావం –పరమేశా !సముద్రం పాత్రగా ,కాటుక కొండ అంత కాటుక మసి తో ,కల్ప వృక్షపు కొమ్మ ఘంటం గా భూమి అంతా రాసే పత్రం గా ఏర్పడి వీటినన్నిటి సాయం తో సాక్షాత్తు సరస్వతీ దేవి యే లేఖకురాలై వ్రాయటానికి పూనుకొన్నా నీ గుణాలనన్నిటినీ వ్రాయటం సాధ్యం కాదు కదా .
‘’యాత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ‘’అని శ్రుతి .ఒకప్పుడు వాక్కులు పరమాత్మను వర్ణించటానికి పూనుకొని కొంతదాకా వెళ్లి శక్యం కాక మనసుతో అవి తిరోగమనాన్ని పొందాయని .సర్వం తానె అయిన పరబ్రహ్మను వర్ణించటం అసాధ్యం అని భావం .
33-అసుర సుర మునీన్ద్రై రర్చిత స్యేందు మౌళేః-గ్రథిత గుణ మహిమ్నో నిర్గుణ సేశ్వరస్య
సకల గుణ వరిస్టః పుష్పదంతాభి దానో –రుచిర మలఘు వృత్తైః స్తోత్ర మేతచ్చకార ‘’
భావం –శ్రేష్ట రాక్షస ,దేవ ,ముని గణాలచే అర్చింపబడే పరమేశ్వరుడు చంద్రుని శిరోభూషణంగా ఉన్నవాడు ,గుది గుచ్చిన సద్గుణాల మహిమకలవాడు ,త్రిగుణాలకు అతీతుడు .అలాంటి సర్వేశ్వరుని మహిమలను వర్ణించే ఈ స్తోత్రాన్ని పుష్పదంతుడు కూర్చాడు .అతడు భక్తులకు ఉండాల్సిన లక్షణాలున్న శ్రేష్టుడు.భావ గర్భితమైన ఈ స్తోత్రం ఎంతోమధురమైనది ఛందస్సుసంబంధించిన విశిష్టమైన వృత్తాలతో రచి౦ప బడింది.
34-‘’అహరహరనవద్యం దూర్జటేః స్తోత్రమేతత్ –పరతి పరమ భక్త్యా శుద్ధ చిత్తః పుమాన్యః
స భవతి శివ లోకే రుద్రా తుల్య స్తథాత్ర-ప్రచురతర ధనాయుః పుత్రవా న్కీర్తి మాంశ్చ’’
భావం –పరమేశ్వరుని సంబంధించిన ఈ స్తోత్రం ఉత్తమమైనది .ప్రతి రోజూ రాగ ద్వేషాదులతో కలుషితం కాని శుద్ధమనసు కలిగి ,పరమభక్తి తో దీన్ని పఠించే వాడు ,ఈ లోకం లో అత్యధిక ధనాన్ని ,పూర్ణాయుస్సును ,పుత్రులను కీర్తినీ పొందుతాడు .మరణించాక శివ లోకం లో రుద్రునితో సమానుడవుతాడు.
ధూర్జటి అంటే-‘’ధూః భార భూతా జఃటిః జటా యస్యేతి ధూర్జటిః’’-భారమైన జడలు కలవాడని అర్ధం
35-మహేశాన్నాపరో దేవో మహిమ్నోః నా పరాస్తుతిః-అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరం ‘’
భావం –సృష్టిలో పరమేశ్వరునికి మించిన దైవం లేడు.పరమేశ్వరునికి చెందిన అఘోర (సౌమ్యమైన )మంత్రమైన పంచాక్షరికి మించిన మరో మంత్రం లేదు ,శివునికంటే ,పంచాక్షరికంటే మించినవీ గురువు కంటే పరతత్వ మైనదీ ఏదీ లేదని తాత్పర్యం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-16 –ఉయ్యూరు
పుష్పదంతు ఎవరు, అతని చరిత్ర ఏమిటి.అతను శివమహిమ్ని స్తోత్రం ఎందుకు చేసాడు.దాని ఫలితము ఏమిటీ.
LikeLike