గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

కేరళకు చెందిన 18 వ శతాబ్ది సంస్కృతకవి రామపనివాద గొప్ప సంస్కృత  విద్వా0సుడు .ఆ కాలపు ఎందరో రాజుల సంస్థానాలలో మన్ననల  నందుకున్నవాడు .ప్రాకృతభాషలోనూ అసామాన్య పాండిత్యం ఉన్నవాడు సంస్కృత ,ప్రాకృతాలలో చాలా రచనలు చేశాడు .వెత్తట్టు నాడు ప్రభువు వీర రాయల కోరికపై ‘’చంద్రికా వీధి ‘’ని ,అమలప్పుళ రాజు దేవనారాయణ కోరికపై ‘’లీలావతి వీధి ‘’ని ,తిరువనంతపురం సామ్రాజ్య స్థాపకుడు మార్తా0డ  వర్మ కోరగా ‘’సీతారాఘవ నాటకం ‘’చెన్నమగళం సైన్యాధియతి  కుబేర బిరుదాంకితుడు పలియాత్ అచ్చన్  అడగగా ‘’విష్ణు విలాసకావ్యం ‘’,కున్నమకులం లో మానాకులం కుటుంబం లో  ప్రసిద్ధుడైన ఆర్య శ్రీకంఠ రామవర్మ కోరికపై ‘’ముకుంద శతకం ‘’రాసి ప్రభువుల సైన్యాధికారులు ,ఉన్నత కుటుంబీకుల గౌరవ మన్ననలు పొందాడు . రామ ‘’పని వాద ‘’మంచి పనివాడు’’ అనిపించుకున్నాడు . పనివాద పేరును బట్టి ఆయన నంబియార్ కుటుంబం వాడని భావించారు . ఈ వంశం వారు ఛాక్యార్ లకు సంస్కృత నాటక ప్రదర్శనలో ‘’మిలవు ‘’అనే డ్రమ్ ను వాయిస్తూ సహాయపడేవారు .రామపని వాద నారాయణీయం రాసిన  నారాయణ భట్టు శిష్యుడు .తన రచనలన్నిటిలో గురుపాదుని సంస్మరించాడు .

 ఆయన రాసిన రాఘవీయ మహా కావ్యం లో 20కాండలు ,1572 శ్లోకాలున్నాయి .ఇవికాక మదన కేతు చరిత ప్రహసనం ,ముకుంద ,శివ ,సూర్య శతకాలు ,అంబర నాధీశ  స్తోత్రం  భాగవత చంపు ,వృత్త వార్తిక ,తాళ ప్రస్తార కావ్యం ,రాసక్రీడ తోపాటు కొన్ని సంస్కృత వ్యాఖ్యానాలు శాస్త్రీయ రచనలు చేశాడు .ఆయన రాసిన రాఘవీయానికి విష్ణువిలాసం మేలత్తూర్ దాతుకావ్యం గా భావిస్తారు .సుకుమార రాసిన కృష్ణ విలాసం పై విలాసిని ,వివరణ అనే వ్యాఖ్యలు రాశాడు .వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశకు వ్యాఖ్యానం ,కంస వధ  ,ఉషానిరుద్ధ లఘుకావ్యాలు .లలితా రాఘవ ,పాదుకా పట్టాభిషేక నాటకాలు  లీలాశుకుని ‘’గోవిందాభిషేకం ‘’కు వ్యాఖ్యానం కూడా కూడా ఈయన రచించాడని ఏం కృష్ణమాచారియార్ తెలిపాడు .ఇవికాక పంచపాది అనే సంగీత రూపకం ,ముక్కొల్లు దేవాలయదైవం పై 20 శృంగార శ్లోకాల శృంగార వింశతి  జ్యోతిషం పై కొన్ని గ్రంథాలు కూడా రాశాడని అంటారు .బహుముఖ ప్రజ్ఞాశాలి ,అన్ని ప్రక్రియలలో సమానమైనపాండిత్యం తో కవిత్వం చెప్పి మహాభిరామంగా రామ పనివాద ప్రశస్తి చెందాడు .

396-కట్టాంబి స్వామి  (1853-1924 )

కేరళకు చెందిన కట్ఠంబి స్వామి హిందూ వేదాంతి గొప్ప సంఘ సంస్కర్త .భారతీయ తత్వ శాస్త్రానికి యోగం జ్ఞానం ఉచ్చావ నిస్వాసాలు అని చెప్పాడు .అద్వైత బ్రహ్మ స్వరూప దర్శనానికి ఇవే  మార్గ దర్శకాలు .కేరళలో రాజకీయ ,మత, సాంఘిక ,సాహిత్యాలలో సంస్కరణలు చేయాలని భావించాడు . 1853 ఆగస్టు లో కేరళలో తిరువనంతపురం దగ్గర కొల్లూర్ లో జన్మించాడు .తండ్రి వాసుదేవ శర్మ .తల్లి నాగమ్మ .చిన్నప్పుడు అందరూ కుంజు అని ముద్దుగా పిలిచేవారు అదే తర్వాత కుంజుపిళ్ల గా  మారింది .తలిదండ్రులకు చదువుచెప్పించే స్తొమత లేకపోవటం తో పెట్టియిల్ రామం పిళ్ల  ఆసన్ నడిపే గురుకులం లో చేరాడు .క్లాస్ లీడర్ అయినందున ‘’కట్టాంబి ‘’అనే పేరు వచ్చి అదే స్థిరమైంది .స్వామినాధ దేశికులవద్ద తమిళం ,సుందరం పిళ్ల వద్ద తత్వ శాస్త్రం ,టిక్కట్టు అయ్యావు వద్ద యోగా నేర్చాడు . ఒక సంచారస్వామి ఆఊరి కి వచ్చి బాల సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశాడు .దీన్ని నిత్యం జపం చేసి గొప్ప అనుభూతిపొంది ‘’షణ్ముఖ దాస ‘’బిరుదుపొందాడు .కుటుంబ భారం మీద పడగా చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించి పోషించాడు .త్రివేండ్రం ప్ర భుత్వ సెక్రెటేరియట్ లో గుమాస్తాగా చేయాడు .

 తమిళనాడువెళ్లి శుభా జట పాటిక అనే శాస్త్ర కోవిదుని శిష్యుడై చాలా కాలం ఉండి సంస్కృతం శాస్త్రాలు ,సిద్ధ వైద్యం ,సంగీతం  మార్షల్ ఆర్ట్ వగైరా నేర్చాడు .హిందూ, క్రిస్టియన్ ,ముస్లిం మత పెద్దలవద్ద, అవధూతల వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొన్నాడు .ఒక గొప్ప విద్యావేత్తగా ,మహర్షిగా మారి కేరళకు తిరిగిరాగా  నారాయణ గురు1882 లో ఈయన్ను కలిసి  , ఆయన కొట్టాంబి శిష్యుడైపోయాడు  .ఇద్దరూకలిసి హిందూమతం లోని మూడాఛారాలను సంస్కరించాలని నిర్ణయించారు .ముందుగా మహిళా విమోచన ఉద్యమం చేబట్టి వారికి అన్నిటా సమాన ప్రా తినిధ్యమివ్వాలని ఉద్యమించారు .మత  మార్పిడులను ఎదిరించారు .

 కిట్టాంబి స్వామి రచనలు ఆయన మేధో శక్తిని వివరిస్తాయి .సంస్కృతం లో ఎన్నో ముక్తకాలు  భజన గీతాలు ,వ్యాసాలూ రాశాడు .ఆయన రచనలో ‘’వేదాధికార మిరూపణ ‘’ప్రసిద్ధ గ్రంథం .అద్వైత పధ్ధతి ,ఆదిభాష  ,క్రీస్తు మత నిరూపణం ,దేవీ మానస స్తోత్ర వ్యాఖ్యానం ,నిజానంద విలాసం ,సర్వమత సామరస్యం లు కూడా బహుళ ప్రచారం లో ఉన్నవే .ఆయనను ‘’కవి వస్త్రం లేని సన్యాసి’’ అంటారు . 1924 లో పన్మన వద్ద కిట్టా0బి స్వామి 71 వ ఏటమహా సమాధి చెందాడు .ఆయనను విద్యాధిరాజా అని ,విద్యారాజరాజతీర్ధ పరామభట్టార అని కేరళ ప్రజలు  గౌరవంగా సంబోధిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.