గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )
కేరళలో తిరువనంత పురం లోని చెంపల0తి లో 1885 లో నారాయణ గురు జన్మించాడు .తండ్రి మదన్ ఆసన్ ,తల్లి కుట్టిఅమ్మ .గురుకుల పద్ధతిలో ప్రాధమిక విద్య ఉన్నత విద్య 1887 వరకు నేర్చాడు .ఈకాలం లోనే తర్క ,వ్యాకరణ కావ్య నాటక వేదాంతాలు క్షుణ్ణంగా అభ్యసించాడు . సకల సద్గుణ రాశి గా పేరు పొందాడు .మంత్ర వేత్తగా ఉపన్యాసకుడుగా గురువుగా బోధకుడుగా సన్యాసిగా ప్రముఖుడయ్యాడు .కేరళలో హిందూ మత ,పునరుద్ధరణకు ,అందులోని మూఢ ఆ ఛారాలను తొలగించి సంస్కరణ చేసినందుకు నారాయణ గురు ను సదా స0స్మరించుకొంటారు .
సంఘం లో అట్టడుగున ఉన్న అణగారిన కిందికి తొక్కబడిన జాతులవారిని కులమత భేదాలు లేకుండా చేరదీసి వారినీ సమాజం లో సమాన హోదాగలవారినిగా చేయటానికి చైతన్య వంతులను చేశాడు .తోటివారిని మానవులుగా గుర్తించాలే తప్ప హిందూ ముస్లిం క్రైస్తవాదులుగా గుర్తించరాదని బోధించాడు .వేద ,ఉపనిషత్తులు సర్వశాస్త్రాలు బాగా ఆకళింపు చేసుకున్నవాడుకా నుక వాటిలోని పరమ రహస్యాలను అర్ధం చేసుకొని ఆచరణ సాధ్యం చేశాడు .మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడు పడ్డాడు . దేశసంచారం చేస్తూ కట్టాంబి స్వామిని కలిసి ఆయన శిష్యుడై ఇద్దరూకలిసి సంఘ దురాచార నిర్మూలనకు నడుం కట్టారు .యోగ విద్యనూ సాధించాడు .వివాహమైందికాని సఫలం కాలేదు .
నారాయణ గురు అరివిప్పురం లో ఒక శివ లింగ ప్రతిష్ఠచేసి గుడికట్టించి దాన్ని గొప్ప యాత్రాస్థలంగా మార్చాడు . 1895 లో డా.పల్పు ను కలుసుకోవటం తో సాంఘిక సేవకు మంచి ఊపు లభించింది .1903 లో ‘’శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం ‘’స్థాపించి అదో జగత్ సహోదరుల ను ఆదుకున్నాడు .నారాయణ గురు యజ్వ కులంలో పుట్టాడు ఆకులం వారికి అప్పుడు విద్యాలయాలలో ఉద్యోగాలలో దేవాలయాలలో ప్రవేశం లేదు . ప్రముఖ మలయాళ వి కుమార ఆసన్ ఈయన శిష్యుడే .ఆ సంస్థకు సెక్రెటరీ గా ఉన్నాడు . సంస్థ ‘’వివేకోదయం ‘’దిన పత్రిక ను ఆసన్ సంపాదకుడుగా ప్రారంభించింది .వీరి కులాలలో కెట్టు కళ్యాణం అనే శాస్త్ర బద్ధమైన ఖర్చుతోకూడిన తంతు చేసుకొన్నవారికే వివాహ యోగ్యత ఉండేది .ఈ పద్ధతిని మానిపించి సూటిగా తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహ పద్ధతిని జరిపించి సఫలుడయ్యాడు నారాయణ గురు .శివ గిరిలో శారదా మఠం అలివిప్పురం మొదలైన చోట్ల ఆశ్రమాలు కట్టించి ,తాలస్సేరిలో జగన్నాధ దేవాలయం నిర్మించి అందరికి దేవాలయ ప్రవేశం కల్పించి గాంధీ ,ఠాగూర్ ల ను ఆహ్వానించి మన్ననలు పొందాడు .
వేదాంత సంబంధమైన గ్రంథాలెన్నో నారాయణ గురు రాశాడు .కొన్ని సమాజ ఉద్ధరణకు రాశాడు .ఆయన సంస్కృత రచనలలో దర్శన మాల ,ఆత్మోపదేశ శతకం ,దైవ దశకం ,అనుకంప దశకం ,జటిలాక్షణం , చిచ్ఛ దా చింతనం ,శివశతకం,అద్వైత దీపికా ,జనని నవారత్న మంజరి ,నిర్వృతి పంచకం ,వినాయకాష్టకం ,జ్ఞాన దర్శనం ,చిదంబర శతకం ,ఇంద్రియ వైరాగ్యం శ్రీ కృష్ణ దర్శనం కలినాటకం మొదలైనవి ఉన్నాయి . 1928 లో ఈ ఆధ్యాత్మిక పుణ్య పురుషుడు నారాయణ గురు 43 ఏళ్లకే నారాయణ సన్నిధానం చేరాడు .
398-కేరళలో వివిధ రూపాలలో వర్ధిల్లిన సంస్కృత నాటకాలు
సంప్రదాయ ,జానపద పద్ధతులలో సంస్కృత నాటకాలు కేరళలో బహుళ వ్యాప్తి పొందాయి .అభినయ శైలి అద్భుతం .ఈ ప్రదర్శనా రూపకాలు -కుట్టియాట్టం ,ఛాక్యార్ కుట్టు ,నంగ్యార్ కుట్టు ,కృష్ణాట్టం అని వేర్వేరురకాలు ..
1-కుట్టి యా ట్టమ్ – కేరళలో సంస్కృత నాటకాలు ఆడటం ప్రారంభమైనది దీనితోనే .ఇది దేశంలో మిగిలిన చోట్లకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది .అతి ప్రాచీన కళ ఇది .కుట్టి అంటే కూడి అంటే కలిసి అని ,అట్టం అంటే నటించటం .అంటే కలిసి నటించటం అన్నమాట .నృత్యనాటకం లో ఉపరూపక విధానం . భరతముని చెప్పిన అన్ని సిద్ధాంతాలను దీనిలోపాటిస్తారు .ఈ కళ 10 వ శతాబ్దికి బాగా వ్యాప్తి చెందిన అతి ప్రాచీన ప్రదర్శన విధాన0 .కులశేఖర వర్మ కేరళలో దీన్ని మొదటిసారిగా ప్రదర్శించారు . దీనిలో ఆంగిక, వాచిక, సాత్విక ,ఆహార్య అభినయాలుంటాయి .ముద్ర ,చారి పద్ధతులను వాడతారు .తాళానికి మిలవు ,ఇడక్క ,కూడంకుల ,కూళితాళం ఉపయోగిస్తారు . కుట్టియాట్టోమ్ లో ప్రదర్శించే సంస్కృత నాటకాలు -శక్తి భద్రుని ఆశ్చర్య చూడామణి నాటకం ,సుభద్రా ధనుంజయం ,కులశేఖరుని తపతీ స్వయంవరం హర్షుని నాగానందం ,నీలకంఠుని కళ్యాణ సౌగంధికం ,బోధాయనకవి రాసిన భగవదజ్జుక ,భాసుని అభిషేక, స్వప్న వాసవ దత్త , దూత వాక్య నాటకాలు
2-చాక్వార్ కుట్టు -ఇందులో న0జి యార్ ,నంబియార్ లు ఉంటారు .కుట్టియాట్టోమ్ లో ఇది విదూషక భాగం .ముఖ్యకథను హాస్యపద్ధతిలో అప్పటికాలానికి అన్వయిస్తూ విదూషకుడు చెబుతాడు .ఇది సంఘ దురాచారాలను ఖండించే రూపక విధానం .
3-నగరికుట్టు -ఇందులో ఆడవారే స్త్రీపాత్రలను ధరించటం ప్రత్యేకత .నంబియార్ కుటుంబాలకు చెందిన నంగియార్ లు నటిస్తారు .శ్రీ కృష్ణ కథలనే ప్రదర్శిస్తారు .వీటిలో ఏకాంకికలూ ఉంటాయి .చేటి నిర్వహణ బాధ్యత తీసుకొని కదా వృత్తాన్తమ్ తెలియ జేస్తుంది
4-కృష్ణాట్టం -ఇది అతిప్రాచీన సంప్రదాయ నృత్యనాటక ప్రదర్శన విధానం. దీనిని 1654లో గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం లో మొట్టమొదట ప్రదర్శించారు .ఇందులో శ్రీకృష్ణుని జన్మ వృత్తాన్తమ్ దగ్గరనుంచి స్వర్గారోహణ వరకు 8 కధలను 8 రాత్రులు ప్రదర్శిస్తారు.ఇందులో నృత్య సంగీతాలకే అధిక ప్రాధాన్యం .సంస్కృత సంగీత నాటకాలకు కేరళ ప్రజలు ఇస్తున్న ఆదరణకు ఇవన్నీ అద్దం పడుతూ వారి సాంస్కృతిక అభిరుచికి జోహార్లు అందుకొంటున్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
— నారాయణ గురు
