కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు

బాబళ్ళ శాస్త్రి గారి కుటుంబం శ్రీరామ పురం చేరేనాటికి శ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక యాజులుగారు అప్పటికే 17 ఏళ్ళనుంచి రోజు రెండు సార్లు అగ్ని హోత్రాన్ని చేస్తున్నారు . .వీరిని ‘దువ్వూరి యాజులుగారు’’ అనే అందరూ పిలిచేవారు .రెండుకుటుంబాలు ప్రక్కప్రక్కనే ఉండేవి.,చివరి ఏడేళ్ళు నూతన  గృహం లో అగ్ని హోత్రం చేశారు .1915 లో కపిళేశ్వరపురం లో జన్మించిన  ఆయన ఆత్రేయస గోత్రీకులు .ఉదార హృదయులు .వీరి కుటుంబం లో నాలుగు తరాలవారు వేదం లో సర్టిఫికేట్ పొందినవారు .ఈయన మూడవ కొడుకు 27 ఏళ్ళకే వేదపండితుడయ్యాడు .మూడవ కొడుకు కొడుకు అంటే యాజులుగారి మనవడు ఘనాపాఠి.

  యాజులుగారు నాలుగేళ్ళు తండ్రి వద్దనే వేదం అభ్యసించారు .మరో అయిదేళ్ళు ముక్కామలలో బాబళ్ళశాస్త్రి గారి తండ్రి చిన్న సుబ్రహ్మణ్య సోమయాజులు గారి వద్ద  నేర్చారు .పరీక్ష ఇచ్చాక ,పెద్దక్క గారి భర్తవద్ద అంటే బావగారి వద్ద కోరుమిల్లి ,తణుకు వ్యాఘ్రేశ్వరాలలో చదివారు .శ్రౌతం తో మిగిలిన విషయాలనూ 24 వయేట 1939 కి పూర్తి  చేశారు .అప్పటికే పెళ్లి అయి ఒక కొడుకు,కూతురు  కలిగారు .శ్రౌతం నేరుస్తూ వేద పాఠాలు బోధించారు .’’నేను చదువుకో లేదు సంతకం చేయటం కూడా రాదు ‘’అని ఆరోజులను జ్ఞాపకం చేసుకొన్నారు .తర్వాతే రాయటం చదవటం అలవాటైంది .బడికి వెళ్ళనే లేదు .వేదం  తప్పమరే వ్యాపకం లేదు .తమతాతగారు ‘’ వైదికోగ్రవాది’’(మిలిటెంట్ వైదిక్ )అని చెప్పేవారు

  స్వస్తి వాచకం ,ఋగ్వేదం 1-8 9  క్రమ ఘన జట లు తప్పులు లేకుండా వల్లి౦చి నందుకు  పారితోషికాలు పొందారు .తప్పులు లేకుండా స్వస్తి చెప్పిన వారిని  ‘’వీరుని ‘’గా  భావించేవారట .అంటే హీరో అన్నమాట .సామూహిక స్వస్తి అంటే ఆయనకు చాలా ఇష్టం. అలా చేయటం లో ఎంతో ఉత్తేజం కలుగుతుందన్నారు. ఒకసారి శ్రీరామ పురం నుండి తమ బృందం భార్యలతో సహా హైదరాబాద్ వెళ్లి 27 రోజులు స్వస్తి చెప్పారు. అది అద్భుతమైన కాలం అని గుర్తు చేసుకొన్నారు. వేదం నేర్వటానికి తరచు ఊరు వదలి వెళ్ళాల్సి రావటం తో   తన పోరుగువారైన లంకా వారిలాగా వ్యవసాయం పై దృష్టి పెట్ట లేక పోయానని బాధ పడ్డారు . లంకావారు యాభై ఏళ్ళు వ్యవసాయం చేశారని చెప్పారు .

   ఆహితాగ్ని మనవడు, ఆహితాగ్ని కుమారుడు ఆహితాగ్ని అయిన తమ్ముడికి అన్న ,ఆహితాగ్ని బాబళ్ళ శాస్త్రి గారి ఆహితాగ్ని తండ్రిగారి  శిష్యుడు అయిన యాజులుగారు ‘’నా జీవితమంతా  శ్రౌతం లోనే గడిచింది .అది తప్ప నాకు వేరే ఏమీ తెలీదు ‘’అని చెప్పారు .ఇది పూర్తి సత్యం కాదు .ఎందుకంటె ముసలితనం లో కళ్ళు కనబడకపోయినా ,ఇతరుల సాయం తో నదికి వెళ్లి నిత్య స్నానం చేసేవారు .86 ఏళ్ళ వయసులో కూడా మనవడు కిరణ్ కు  వేదం నేర్పేవారు .ఈ వయసులోకంటి చూపు లేని వారెవ్వరూ  అలా బోధించినవారు లేరు .  జీవితం లో 1-ప్రధాన 2-మధ్య ౩- ముసలితనం అనే మూడు దశలుంటాయి .33 ఏళ్ళ వయసులోఅంటే మధ్య వయసు ప్రారంభం లో  యజ్ఞం చేయాలి .61వ ఏట కదలలేని స్తితి వస్తుంది .ఈ వయసులో కాళ్ళు చేతులు మనం చెప్పినట్లు వినవుకనుక కర్మకాండ కు ఇబ్బందికలుగుతుంది .బాబళ్ళశాస్త్రి గారు  అగ్ని హోత్రం ప్రారంభించే సమయానికి యాజులుగారు 30 వ ఏటనే 1945 నాటికి అగ్ని స్టోమం చేసి ఆహితాగ్నిలలో కూడా  ముందున్నారు  .  ఒక దశాబ్దం తర్వాత  ఆయన మేనల్లుడు  మిత్రనారాయణ అగ్ని హోత్రం ప్రారంభించి 22 వ ఏటనే యజ్ఞం చేసి  యాజులుగారి రికార్డ్ ను అధిగమించాడు .

   యాజులుగారి ఆధానం, అగ్ని హోత్రం కపిళేశ్వర పురం లోనే జరిగాయి .అన్నగారు చేస్తుంటే చూసి నేర్చుకున్నారు .నాలుగేళ్ల తర్వాత 1949 లో అక్కడే  అగ్ని చయనం,శ్రౌతం నిర్వహించారు  .ఇప్పుడూ పెద్దన్నగారిని ముందు చేయించి తాను చేశారు . చయనం,40 రోజుల అగ్ని చయన౦ ను పౌ౦డరీకం అంటారు. వీటిని చేయిస్తున్నప్పుడు తానే ఎందుకు పౌండ రీకం చేయకూడదు అనే ఆలోచనకలిగింది .శాస్త్రాలు తిరగేసి కావలసిన సమాచారం సేకరించారు .పౌ౦డరీకం లో ఉన్న మహా వ్రతం లో ‘’అంతర వేది’’పై   వేదం చదివిన బ్రహ్మచారి బ్రహ్మ చర్య దీక్ష చేబట్టలటానికి పుంశ్చలి అంటే వేశ్యతో సంభోగం చేయిస్తారు దీనివలన అతనిలో బ్రహ్మాండమైన వీర్య వృద్ధి జరుగుతుందని నమ్మకం .చాలా తెలివిగా దీన్ని నిర్వహించారు యాజులు గారు .

  వ్యాఘ్రేశ్వరం లోనిఆహితాగ్ని  బులుసు కామేశ్వర ,సత్యవతి దంపతులు తమ అగ్ని హోత్రాన్ని ఫోటోలు తీయటానికి ఆనందంగా ఒప్పుకున్నారు   .యాజులుగారి కి మనవడు సీతారామ శాస్త్రి  ఈ విషయం చెప్పగా దిగ్భ్రాంతి చెందారట .’’అగ్ని హోత్రాన్ని ఇతరులకు చూపించటం అంటే కన్నతల్లి వస్త్రాలను ఊడదీయటమే’’అన్నారట యాజులు .తన అగ్నిహోత్రం పవిత్రం రహస్యం అనే వారట .భార్య సూర్యసోమిదేవమ్మ గారినీ ఎవరికీ కనిపించ నిచ్చేవారుకారు .

 దువ్వూరి దంపతుల ఫోటో జత చేశాను చూడండి

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-18 –ఉయ్యూరు   ,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.