గౌతమీ మహాత్మ్యం-56
78-అప్సరోయుగ సంగమ తీర్ధం
గౌతమమీనదికి దాక్షిణాన ఉన్న ఈ తీర్ధం ముక్తిదాయకం .వంద్య స్త్రీ భర్తతో మూడు నెలలు ఇక్కడ స్నానం చేస్తే పుత్ర సంతానం ఖాయం .దీని విశేషాలను నారదునికి బ్రహ్మ చెప్పాడు .విశ్వామిత్ర వసిస్ట మహర్షి లమధ్య వైరం మొదటి నుంచి ఉంది .బ్రహ్మర్షి అవాలనే కోరికతో విశ్వామిత్రుడు గంగా ద్వారంలో తీవ్ర తపస్సు చేస్తుంటే ఇంద్రుడు తపోభంగానికి ప్రయత్నింఛి మేనకను ప్రయోగించాడుఆమె వెళ్లి భంగం చేసి ఒక కూతురును కనీ ఆయనకిచ్చి వెళ్ళిపోయింది .చేసిన తప్పు తెలుసుకొన్న గాదితనయుడు దక్షణ తీరం చేరి కాలంజర తీర్ధం లో మళ్ళీ తపస్సు చేయగా దేవేంద్రుడు రంభ తిలోత్తమలను పురిగొల్పాలనుకొంటే కాదనగా ,గంభీర ,అతి గంభీర అనే అప్సరసలను ప్రేరేపించ గా వెళ్లి ప్రయత్నించారు .కాని మృత్యువుకంటే భయంకరుడు , భూలోకశంకరుడుగా ఉన్న మహర్షిని ఒక వేయ ఏళ్ళదాకా చూడనైనా చూడలేకపోయారు .తర్వాత దూరం నుంచే నృత్య గీతాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా ,మహర్షి కోపం తో వారిని ద్రవరూపంగా మారిపొమ్మని శపించాడు .వారు మునిపాదాలపై పడిప్రార్ధించగా ,గంగా సంగమం పొందితే మళ్ళీ దివ్యరూపాలు వస్తాయని అనుగ్రహించాడు .ఇలా ఏర్పడిన ఈ రెండునదులను ‘’అప్సారో యుగం ‘’అంటారు .ఈ రెండునదులూ గంగానది నికలిసి పరమపవిత్రమై ,మహాశివుని ఆవాస క్షేత్రమై పవిత్రమయ్యాయి .ఇక్కడి స్నానం సర్వ బంధ విమోచనం కలిగిస్తుందని బ్రహ్మ నారదునికి ఉవాచ .
79-కోటి తీర్థం
కోటీశ్వర శివ మహా దేవుడు ఉండే గంగానది దక్షిణ తీర తీర్ధమే ఇది .కణ్వుని కొడుకు బాహ్లికుడిని కాణ్వుడు అంటారు .వేద వేదాంగ పారగుడై ,భార్యతో పార్వాయణాది ఇష్టులు బహు శ్రద్ధగా చేశాడు .నిత్యాగ్ని హోత్రుడు .ఒకరోజు అగ్నిహోత్రునికి హవనం లో ఒక ఆహుతి సమర్పించి ,మరొకటి ఇవ్వటానికి హవిర్ ద్రవ్యాన్ని చేతిలో తీసుకోగా ,అనుకోకుండా అని చల్లారి పోయింది .విచారం తో ఏం చేయాలోఆలోచి౦చాదు .రెండు ఆహుతులమధ్య అగ్ని చల్లారింది కనుక మరో అగ్ని చేస్తే అది వైదికాగ్ని ఔతుందా ,లౌకికాగ్ని అవుతుందా అనే సందేహం కలిగింది .అప్పుడు అశరీరవాణి ‘’వేరే అగ్ని ఇక్కడ ఉపాదేయం కాదు. అగ్ని చుట్టూ ఉన్న నిప్పుకణికలను చేర్చి సగ౦కాలిన సమిధలతో జ్వాలచేసి అందులో ద్వితీయ ఆహుతి సమర్పించు ‘’అనగా కాణ్వుడు’’అది సరియైన పద్ధతికాద’’న్నాడు .అపుడు మళ్ళీ ఆకాశవాణి ‘’అగ్ని పుత్రుడు హిరణ్య గర్భుడు .తండ్రి ,కొడుకూ అతడే .పుత్రునికోసం ఇచ్చేది తండ్రికి సంతోషం కలిగిస్తుంది .తండ్రికివ్వాల్సింది కొడుక్కు ఇవ్వచ్చు .ఇలాచేస్తే అది కోటి రెట్ల ప్రీతి కలుగ జేస్తుంది ‘’అన్నది .వేదవాణి వాస్తవ ధర్మాన్ని చెప్పింది అని అక్కడి మహర్షులు సమర్ధించారు .అలాగేకాణ్వుడు చేశాడు .ఈ తీర్ధం లో చేసినదానం కోటిరెట్ల ఫలితమిస్తుంది కనుక కోటి తీర్ధం అన్నారు .దీనికే కాణ్వ తీర్ధమని పేరు .పితరులపేర ఇక్కడ దానమాచరిస్తే కోటిరెట్ల ఫలం కలుగుతు౦దని నారదునికి బ్రహ్మ చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-19-ఉయ్యూరు
