భారతీయ విజ్ఞానం
‘’భారత దేశం కేవలం సాధువులు ,యోగులు ,మహాత్ములు తత్వ వేత్తలను మాత్రమె నిర్మించింది అనటం అసందర్భం .భారతీయజీవనం సర్వతోముఖ శక్తుల్ని ప్రదర్శించింది .గణితం లో సున్నా కున్న ప్రాముఖ్యం అంకెల స్థానాలను బట్టి విలువలేర్పడే పధ్ధతి ,సాంకేతిక గణిత విధానం మొదలైన అద్భుతాలు హిందూ దేశం లోనే జరిగాయి .దశ సంఖ్యామానం రుగ్వేదకాలం లోనే ఉంది ‘’అని పండిట్ నెహ్రు చెప్పాడు .19వ శతాబ్ది పారశీక పండితుడు అల్ జహీజ్ ‘’హిందువులు గణిత జ్యోతిష వైద్యాది పలు శాస్త్రాలలో అగ్రగణ్యులు .’’అన్నాడు ‘’అనేక విజ్ఞానాలకు ఆటపట్టు అయిన భారత దేశం ప్రస్తుతం ప్రపంచ లో ఎక్కువగా ఉపయోగించే 1,2,3,- – 0 వరకు ఉన్న అంకెల సంస్కృత సంఖ్యారూపాలను నిర్మించింది .గణితమే కాక ,న్యూటన్ పుట్టటానికి వేలాది సంవత్సరాలకు పూర్వమే భారతీయులకు గురుత్వ శక్తి తెలుసు ‘’అన్నాడు స్వామి వివకానంద .తత్వవేత్త ,రచయిత విల్ డ్యురాంట్ ‘’సర్వమానవాళికి మాతృ దేశం భారత భూమి యే.అన్నిభాషలకు తల్లి సంస్కృతమే .’తత్వ శాస్త్రం పుట్టింది కూడా ఇక్కడే ‘’అన్నాడు .’’అరబ్బీయుల వలన మన గణితానికి ,బుద్ధునిమూలంగా క్రైస్తవ మత ఆదర్శాలకు ,గ్రామ పంచాయితీల నుండి స్వరాజ్యం ,ప్రజారాజ్యలకు హిందూ మతమే తల్లిఅని చెప్పి .సర్వ జ్ఞాన ప్రదాత్రి అయిన భారతమాత పాద పద్మాలకు విల్ డ్యురాంట్ ప్రణామం చేశాడు .
‘’ భూగర్భం లో ఉండిపోయిన మొహంజ దారో హరప్పా ల త్రవ్వకాలవలన బయల్పడిన నాగరకతకు కనీసం 5 వేల సంవత్సరాలు .ఢిల్లీ దగ్గర ఉన్న ఇనుపస్తంభం శీతోష్ణాలకు మార్పు చెందకుండా ఇంతకాలం ఉండటం ఆధునిక సైంటిస్ట్ లకే ఆశ్చర్యం ‘’ అన్నాడు నెహ్రు .’’తమ కుశాగ్ర బుద్ధిని ఖగోళానికీ అను సంధించి సూర్య చంద్ర గమనాలను .అతి సూక్ష్మంగా పరైశీలించారనీ ,వారి చంద్ర కళాపరిణామ గ్రహణం నిర్దుష్టం ‘’అన్నాడు కోల్ బ్రూక్ .9వ శతాబ్ది పర్హియా పండితుడు జాకోబి ‘’అన్ని దేశాల వారి కంటే భారతీయులు ఖగోళ జ్యోతిష శాస్త్రాలలో నిర్దుష్టమైన పాండిత్యం ఉన్నవారు .’’అన్నాడు ‘’అందుకే భారతీయులు మాత్రమె ,అతి నిర్దుష్టమైన గమన విధానాన్ని గ్రహించారు’’అన్నాడు బాలగంగాధర తిలక్ .’’పతంజలి యోగ శాస్త్రం అధ్యయనం చేస్తే ‘భువనజ్ఞానం సూర్యే సంయమాత్ ‘’అంటే సూర్యుని యందు బుద్ధిని సంయమనం చేస్తే ,14లోకాల విజ్ఞానం తెలుస్తుంది ‘’అని పతంజలి భాష్యకర్త వ్యాస దేవుడు పేర్కొన్నాడు .’’చంద్రే తారా వ్యూహ జ్ఞానం’’అంటే చంద్రుని ఏకాగ్ర బుద్ధితో పరిశీలిస్తే నక్షత్ర మండల జ్ఞానం కలుగుతుంది .’’ధ్రువే తద్గతి జ్ఞానం ‘’ధ్రువ నక్షత్ర సంయమనం వలన నక్షత్ర గమన జ్ఞానం కలుగుతుంది అని పతంజలి సూత్రాలలో చెప్పాడు .
సంస్కృతి వ్యక్తీ నిష్టమై వికసించి నాగరకత రూపం లో సంఘం లో వ్యాపిస్తుంది .ఇదివరకే మనం తెలుసుకున్నట్లు రెండురకాల సంస్కృతీ విభాగాలు పూర్తిగా సా౦ఘికాలై నాగరకత అవుతోంది .నాగరకత కు రెండు విస్పష్ట భావనలున్నాయి అవి కృషి ఫలితంగా ఏర్పడతాయి .కృషి రూపం అంటే వ్యక్తిని సాంఘికం చేయటం .దీనివలన సాంఘిక వాది అవుతాడు మనిషి .కనుక నాగరకత అంటే సాంఘిక వ్యవస్థయే..ఇది జీవిత విదానాన్ని తెలియ జేస్తుంది .ఇతరులతో ఏకత్వాన్ని చేస్తుంది .ఇదే నాగరకత ముఖ్య విధానం అంటాడు దీరేంద్రనాథ రాయ్.
విజ్ఞాన ప్రదాత్రి అయిన భారత దేశం అసమాన సర్వతోముఖ సంస్కృతీ సంపదను పెంపొందించి అనుభవించి , ఆనందించటమేకాక త్యాగం తో విశ్వమానవ కల్యాణాన్నే అపేక్షించే ప్రేమైక స్వరూపిణి ,తనను ఆశ్రయించిన వారికీ ఆశ్రయించని వారికీ కూడా విజ్ఞాన భిక్షపెట్టి ,ప్రాపంచిక సుఖాలకు అతీతులు గా మానవ జాతిని ఉద్ధరిస్తోంది .’’ఈజిప్ట్ దేశం అతి ప్రాచీనకాలం లో తన నిబంధనలు సాంఘిక వ్యవస్థ, కళలను భౌతిక శాస్త్రాన్నీ భారత దేశం నుంచే గ్రహించింది ‘’అని దివ్యజ్ఞాన సమాజ వ్యవస్థాపకురాలు మేడం బ్లావట్స్కి తన’’ సీక్రెట్ డాక్ట్రిన్’’ లో చెప్పింది .గ్రీకు విజ్ఞాని ప్లేటో తనగురువు సోక్రటీస్ చనిపోయాక ,హిందూ దేశానికి వచ్చి ,తత్వ శాస్త్రం అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.సోక్రటీస్ కాలం లో భారతీయ బ్రాహ్మణ గురు పండితులు ఎధేన్స్ నగరం లో బోధించారు .క్రీ.పూ.550వాడైన పైథాగరస్ కూడా .
‘’యవన దండ యాత్రలలోనే కాక ,వివిధకాలలలోని రాజ్య సామ్రాజ్య విధానాలలో ,చక్రవర్తుల విధానాలలో కూడా భారతీయ ఐక్యత మరో రకంగా కనపడింది అన్నాడు సురేంద్రనాథ దాస్ ..ఆధ్యాత్మిక తృష్ణ ,పారమార్ధిక నియమపాలన ,అన్నిటికంటే ముఖ్యం అని పించటం వలన ,భారత దేశం అనేకానేక అసంఖ్యాక రాజకీయ పరివర్తనాలను అధిగమించి నిలబడింది ‘’ఆన్నాడు దాస్ .శిశిర్ కుమార్ సేన్ కూడా ‘’భారతీయ చిత్తానికి పారమార్ధిక దృష్టి మాత్రమె మూల సూత్రం ‘’అన్నాడు .ఇదే భారత దేశ అపూర్వ అసమాన విచిత్ర తత్త్వం .
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ వేదాంత సౌరభం ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-21-ఉయ్యూరు
