కుటుంబ తగాదాలు హత్యలు నారలాగా సా—-గిన ‘’నారప్ప సినిమా
మాఅబ్బాయి రమణ ఇవాళవాక్సిన్ వేయించటానికి బుక్ చేస్తే వాలంటీర్ ఆంటీ సాయంత్రం 4-30కి ఇంటికి వస్తే మా మనవడు చరణ్ మనవరాలు రమ్య దగ్గరుండి వేయించారు .ఆతర్వాత చరణ్ ‘’తాతా!కొంచెం కళ్ళు తిరగవచ్చు కనుక ‘’నారప్ప సినిమా సెల్ లో పెడతాను చూస్తూ రిలాక్స్ అవండి ‘’అంటే చూశాం .దాదాపు రెండున్నరగంటలపాటు సా—గిన చిత్రం. రెండు కుటుంబాలమధ్య తగాదా ,హత్యలు ఊరంతా పాకిన చిత్రం .చెడును తు౦చాలె కానీ పెంచకూడదు అనీ, చదువుకొని ఫాక్షనిజాన్ని రూపు మాపాలనీ సర్వస్వం కొడుకుకోసం కోల్పోయి నారప్ప బోధించే నీతి .
చూస్తున్నంత సేపు బాగానే ఉంది అందరూ బానే నటించారు .అర్ధవంతమైన పాటలు మణిశర్మ సంగీతం భావ ప్రాధాన్యంగా ఉంది .రాజీవ్ కనకాలకు చివరిదాకా ఉండే పాత్ర లభించింది దాన్ని యాస బాసతో ముతక ప్రవర్తనతో చెల్లెలిపై ,మేనల్లుడి పై మమకారం తో బావ పై గౌరవంతో బాగా చేశాడు .రావు రమేష్ పేదల పక్షాన లాయర్ .నాజర్ కు పాపం దుష్టపాత్ర ఇచ్చిచంపేయటం నాకు బాధకలిగింది .ప్రియ మణి చక్కని హావభావాలతో ఎమోషన్స్ తో ప్రాణం పోసింది కసుందరమ్మ పాత్రకు .నారప్ప గా వెంకటేష్ బాగానే మెప్పించాడు .అతని దుందుడుకు పెద్దకొడుకు మధ్యలోనే హతం .రెండోకొడుకు గా కుర్రాడు బాగా చేశాడు .అన్నను హత్య చేసిన మోతుబరిని కత్తితో నరికేస్తాడు దీనితో అందరూ ఊరి వదిలి పోవాల్సివచ్చింది .చివరికి కలుస్తారు .మళ్ళీ తగాదాలు హత్యలు .చివరికి పంచాయితీ. అప్పటికే అన్ని పోగొట్టుకొన్న నారప్ప ఇక్కడ సంతకం పెడుతుండగా రెండవ కొడుకును కామందులు ఎత్తుకు వెళ్లి కొడుతున్నారని తెలిసి పరిగెత్తుకొని వెళ్లి బల్లెం దెబ్బలు ,శరీరం లో బల్లెం చాలాసార్లు గుచ్చుకొన్నా ,కత్తి గాట్లుపడినా’’ హీరో’’ కనుక అన్నీ తట్టుకొని వాళ్ళందర్నీ నరికి పోగులు పెట్టి ,కోర్టు లో తీర్పుకోసం వెడుతూ తన వారందరికీ నవ్వు ముఖం చూపిస్తే , వారు నవ్వుముఖాలతో సెండాఫ్ ఇవ్వటం తో సమాప్తం .హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొంటాం .
సన్నివేశాల రూపకల్పన బాగున్నా మనసూ హత్తుకొని ఆహా ఎంతబాగా చెప్పాడు,చూపాడు అనుకోలేం. అది పెద్ద లోపం అనిపించింది .హృదయాన్ని టచ్ చేసే సీన్లు ఒకటి రెండుకూడా లేకపోవటం వెలితి .ఫీల్ రాలేదు .అరవ సినిమా అసురన్ కు ఇది రీ మేక్.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో కాంతులు తలుక్కు మానలేదు .అడ్డదిడ్డంగా ఉందేమో అనిపించింది. సినిమా అంతా చీకటిలో సాగినట్లు ఉండటం కూడా కారణం కావచ్చు .అన౦తపురం ఉరవకొండ లో ఈ సినిమా షూటింగ్ చేశారు .యాక్షన్ సన్నివేశాలు తమిళనాడు తిరునల్వేలి దగ్గర చిత్రీకరించారు .అరవం లో ధనుష్ చేసినంత గొప్పగా వెంకీ చేయలేదనే విమర్శకూడా ఉందిట. కానీ తమిళ సినిమా చూడనివారికి నారప్పలో వెంకటేష్ జీవించాడు అనిపిస్తుంది .నారప్ప చారిత్రిక పురుషుడు అనుకోని చూస్తె ఎంజాయ్ చేయలేం .సినిమా చూసినా నాకు వాక్సిన్ నెప్పి ఇతరత్రా ఇబ్బంది లేకపోవటం ఇది రాయటం చేశానుకనుక మా మనవడు చెప్పినట్లు రిలీఫ్ పొందానేమో ?వెంకటేష్ అంటే నాకున్న అభిమానమూ కావచ్చు .ఈ సినిమా 50కోట్లకు అమ్మడయి, 17కోట్లు లాభం తెచ్చిందని మా మనవడు చెప్పిందే నిజమైతే ఇక దియేటర్లలో సినిమాలు చూసే అవసరమే ఉండదు .240దేశాలవారు ఈసినిమాను హాయిగా ఇంట్లో కూర్చుని చూస్తున్నారని నిర్మాత సురేష్ బాబు చెప్పటం ఈరకమైన కొత్త ట్రెండ్ తో విడుదల చేయటానికి అతని పార్ట్ నర్ కూడా ఒప్పుకోవటం ,విక్టరీ వెంకటేష్ సందేహించకుండా పచ్చ జెండా ఆపటం శుభ దాయకం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-21-ఉయ్యూరు
