శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2
పూలు వచ్చే ఏడాదైనా పూస్తాయి దానికోసం కన్నీరు కార్చకు .సజ్జనుడికి సంతోషం కలిగించేది ఇలాంటి వెండి నాసికే అంటాడు కీట్స్ కవి .దేనికైనా సిద్ధమై ,సాధిస్తూ సాధిస్తూ శ్రమిస్తూ ముందుకు వెళ్లాలని నేచర్ పోయేట్ వర్డ్స్ వర్త్ అన్న విలువైనమాట .పోయి౦ది అనుకొన్న పాటఒక స్నేహితుని యెదలో పూర్తిగా చూసి సంతృప్తిచెందాడు ఆయనే .ఆశకంటే నిరాశ బలమైనదైనానా ‘’ఆశ స్ప్రింగ్ లాగా అజేయమై పైకి లేస్తుంది అని హామీ ఇస్తుంది షార్లెట్ బ్రాంటే .ఈమె సోదరి ఎమిలి బ్రాంటే వి అయిదు కవితలున్నాయి ‘’సంకెళ్ళు లేని స్వచ్చమైన హృదయాన్నీ ,చావు బతుకల్లో ఓదార్చే ధైర్యం ‘’కోరింది .శోకాన్ని మంచురూపం లో శిశిరం కురిపిస్తే ,పునర్జీవనంతో బతుకు ముడి పడిఉంది కనుక ముందుకు మునుముందుకె సాగిపోమ్మన్నది .తాను ఏడుస్తుంటే ‘’ఆమె ‘’పాడుతూ ,తాను వింటుంటే ఆపేస్తుంది .తన వేదనలకు శాంతి కలిగించ గలిగినా ఆమె మాత్రం ఆకాశం లోకి ఎగిరిపోయి తిరిగి రాలేదని బాధ పడింది కొరవడిన ఆశ గురించి .మెరుస్తున్న జ్యొతి ఎప్పుడూ ముందుకే ఉంటుంది కానీ పట్టుకొంటే ఆరిపోతుంది .తెలియని స్వప్నం లో లాగా త్రోవ చూపటం దానికున్న విలువ .ప్రాణం ,ప్రాణీ అదే .అనశ్వరమూ అదే. అదే ఆత్మ. ఇవి ఎమిలీ కవితాత్మ పంక్తులు .ఈమె ‘’ఉదరింగ్ హైట్స్’నవల విఖ్యాతమైనది .మగాడు రాశాడని లోకం అనుకొన్నది .విచ్చలవిడితనం తో వెర్రెక్కించింది .ఈ సోదరీత్రయం ముగ్గురూ కవిత్వం లో సిద్ధహస్తులే .
ఫోబ్ కేరి ‘’మహనీయ స్వచ్చమైన ఆత్మనే దర్శిస్తాను ‘’అని కోరుకొన్నది .పరిపూర్ణ మానవత దైవ సమాన ప్రమాణం పొందుతుందని నమ్మింది .స్వేచ్చదాత విశ్వాత్మ ప్రేమతో చేయి వేయన౦తకాలం అంధురాలుగా నిలబడ్డా నంటుంది .కడలిలో ఆఖరి అంగుళం పై కాలు పెట్టి అస్థిరమైన ఆ నడక కు అనుభవం అంటా రన్నది ఎమిలి డికిన్సన్ .’’నన్ను గుర్తుకు తెచ్చుకొని దుఖించటం కన్నా –చిరు నవ్వుతో నన్ను మర్చిపోవటం చాలమంచిది ‘’అని హితవు చెప్పింది క్రిష్టియానో రోసేట్టి .’’జీతానికి తగిన పని చేసినఆనందం తో నాకోసం పగలు ముగిసిన తర్వాత ఒక పాట పాడగలవా ?’’అని అభ్యర్ధించాడు ఆచార్య జోసెఫ్ మారిసన్ .’’ఓడిపోయినా పోరాడేవాడు నా కవల సోదరుడు’’అని అభినందించాడు జోసెఫ్ మిల్లర్ .రంగులు పులుముకున్న రాత్రి మేఘాన్ని చూసి ‘’తొందరగా తెల్లారు తుంది ‘’అని ఆశా గీతం పాడాడు ధామస్ హార్డీ .’’ప్రతి ఎదలో దాగి ఉండే మాట దయ ‘’అంటాడు ఒరేల్లీ .అన్నిట్నీ ‘’లైట్ తీస్కో ‘’అన్నట్లు ఎల్లియట్ కవి ‘’నవ్వేసి ఊరుకో వివేక శీలిగా ఉండాలనుకొంటే నవ్వు కన్నా మంచి మందు లేదు .కనుక నవ్వేసి ఊరుకో భయ్యా ‘’అని చిట్కా వైద్యం చెప్పాడు .ప్రముఖ కవి లూయీ స్టీవెన్సన్ స్వర్లోకశస్త్రవైద్యుడితో ‘’మొద్దుబారిన నా గుండె ను నిశితాగ్ర ఆనందం తో గుచ్ఛి తెలివి తెప్పించు .నా ప్రాణం పోకముందే మొనదీరిన బాకు వంటి బాధను ,ప్రాణాంతక పాపాన్నీ గుండెలో నిర్దాక్షిణ్యంగా గుచ్చు ‘’అని ప్రాధేయపడ్డాడు .జ్ఞానం పంచటానికి ముందు మనం జ్ఞానం ఆర్జించాలి .బతికి నేర్చుకోవాలి బతకటం నేర్చుకోవాలి .శాంతి విత్తనాలు చల్లు .నాటిన మర్రి విత్తనం మానై ,ఊడలు దిగి ఎందఱో సైనికులకు నీడ ఇచ్చి నట్లు సౌఖ్యం పంచు ‘’అన్నది సూటిగా వీలర్ విల్కాక్స్ కవయిత్రి .’’ఇవాళే నా రోజు రేపు ఎంతో ఆలస్యం ‘’తస్మాత్ జాగ్రత అని జాగృతి పల్కాడు ఎడ్విన్ మార్క్ హాం .సిడ్ని లిసాట్ ‘’తలుపు తెరవక పోవటం కంటే ,తలుపు నుంచే పంపేయటం హీనం ‘’అని చివాట్లు పెట్టాడు .
యోధుడైన తన భర్త చనిపోయి ఇంటికి తెస్తే ‘’ఏడు, లేకపోతె ప్రాణం వదులు ‘’అనిస్త్రీలు చెప్పినా ,అతని గొప్పతనాన్ని గానం చేసినా ,ముఖం పై కప్పినవస్త్రం తొలగించినా ,ఆమె యేడవనే లేదు .ముసలి నర్సు ఆమె శిశువును తెచ్చి మోకాలిపై ఉంచితే ఆమె వేసవిలో వరదలా కన్నీరు కార్చి ‘’నీ కోసమే బతుకుతాను బిడ్డా ‘’అని తెప్పరిల్లింది .చక్కని నాటకీయ కవిత్వం .ప్రబోదాత్మకం .కర్తవ్య బోధనం తో ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాసిన కవిత ఇది .గుండె పట్లు కదిలిస్తుంది .అవకాశం చేత దీబ్బతిన్ననడుం వంగిన ముసలి కైజర్ కవి ‘’ఓడిపోయిన వారిలో నన్ను కలపవద్దు .మళ్ళీ శక్తి యుక్తులు కూడగట్టుకొని రేపు ప్రయత్నిస్తాను ‘’అని దీమాచాటి, ఆదర్శానికి దారి చూపాడు .పోరాటంవలన మనసు దిట్ట పడిఉత్సాహం ఇస్తుంది . పోరాటమే ఆశలకు ప్రాణం పోస్తుందని ,,సంశయ నివృత్తి చేసుకొని ,తనకోరికలకు పరిష్టితులు ప్రతికూలంగా ఉన్నా ,’’పోరాటమే నాలో కలిగిస్తుంది మనో బలం ,నేనింకా అపరాజితుడను ‘’అంటూ ఉత్సాహంకల్గిస్తాడు జీవిత పోరాటంలో .ఇతడి రెండు కవితలు రత్న మాణిక్యాలే .ఎడ్మండ్ వాన్స్ కుక్ కవి అదృష్టదేవత మన దగ్గర ఉండకపోవచ్చు .వీధిలో జనాలు మనల్ని వెక్కిరించచ్చు .దేన్నీ ఖాతరు చేయకుండా కొంచెమైన నువ్వుతో ముఖం వెలిగితే మనల్ని పట్టుకోనేవాడు ఉండడు. గెలుపుకు ఇదే విశ్వాసం కావాలని బోధ చేశాడు .అతడిదే మరో కవితలో ‘’గోడకు కొట్టిన బంతిలా మరింత ఎత్తుకు ఎగరాలి గోడకు కొట్టిన పిడకలా కాదు .ఎందుకు పోరాడాను ఎలా పోరాడాను అనే ఆలోచించు .నువ్వు చనిపోయావన్నది ముఖ్యం కాదు .ఎలా మృతి చెందావు అన్నదే లెక్కలోకి వస్తుంది ‘’అని పోరాట పటిమ బోధించాడు .జాన్ ఆపిల్టన్ కవి శాశ్వత అపజయం తో ఆత్మ నిందతో చనిపోబోతున్న నౌకా శిధిలాల మధ్య నైరాశ్యం అంచున పడిఉన్న భగ్న స్వాప్నికుని చూసి తాను భాగమైన ఆత్మను కనుగొని ,ఆత్మీయనురాగం ,సంపూర్ణాధికారంతో ‘’గెలవాలి నువ్వు ‘’అని చెవిలో చెప్పి ,తనభయాలను లోతుగుండేలో దాచుకొని ,కనిపెట్టిరక్షిస్తూ ‘’గెలుస్తావు గెల్చి తీర్తావు .’’అని ఉత్సాహపరచింది .పూలబాటలో నైనా ముళ్ళ దారిలో నైనా జీవనమార్గం లో నడుస్తూ చేయూతనిస్తూ ఉంటుంది పతాకం .అదే స్వర్ణ దండం .గెల్చిన మగవాళ్ళందరూ ఆమె సహాయం పొందినవారే .అందుకే ఆమె’’ అర్ధం చేసుకో గలిగిన వనిత ‘’అయింది జాన్ కవికీ ,శర్మగారికీ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.