శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం
అనే శతకాన్ని తాడిపత్రి  వాస్తవ్యులు శ్రీ యమ చిడంబరయ్య  రచించి కడపలోని తమ భాగాధేయుడు కావ్య పురాణ తీర్ధ,విద్వాన్  శ్రీ జనమంచి వెంకట సుబ్రహ్మణ్య గారి చే పరిష్కరింప జేసుకొని 1934లో ముద్రించారు .మకుటం రంగ నాయకా . ,ఉత్పలమాల లతో అల్లిన భక్తీ శతకం .ఘటికా సిద్దుడైన శ్రీ ఘటికాచలేశ్వరుడే  తన ఆధి వ్యాధులను తీర్చగల సమర్ధుడని నమ్మిసేవిస్తే తగ్గి ఆరోగ్యం చేకూరినందువలన  కవి ఈశతకం రాసి స్వామికి సమర్పించినట్లు కవి చెప్పాడు .
  మొదటిపద్యం –‘’శ్రీ రఘుకుల వార్ధికులశేఖర మన్మధ కోటి సుందరా –కార ధరాత్మజాహృదయ కామిత పూర,మునీన్ద్రమానసా
ధార ధరాధరా దనుజ దైత్యహరా జగదేకవీర నా –కోరిక దీర్పు మొక్కటియకూరిమి తోడుత ‘’రంగనాయకా ‘’  .నీకధలు వింటూ నిత్యధ్యానం చేస్తూ ఉన్నవారు ఏ కులం లో ఉన్నా వారి బాధలు తొలగిస్తావు .పూర్వం విభీషణుడు శరణు అనగానే కాపాడావు .కోపం పోగొట్టి శా౦తం ఇచ్చి బుధజన సేవ ఇచ్చి నా ఆపదలు హరించు .’’మానము పోవు జీవనం మంచిదికాదు బిరాన ప్రాణమే మాన సుఖాలిస్తుంది .బుద్ధి పాడయిపోయింది .మనసు ఒక చోటనిలవటం లేదు .’’శ్రీరమణ వెంకట నాయకా ‘’అంటే అన్నీ సుఖాలే ఇస్తావు .అంటాడు .
‘’చప్పుడు కాని లోపల ను సన్నతలంపు లుగాని దాహమున్-జెప్పగరాని యాకలియు ,జిన్నని పిల్లలు భార్య యంచు నే –‘’స్రుక్కుతూఉన్నాను .’’నీ దయగల్గ నన్ ధనము నిర్మల తేజము జ్ఞానసంపదల్ –శ్రీ దయితా లభించును ‘’అని గట్టి నమ్మకంతో చెప్పాడు .’’శ్రీ రఘురామ సర్వ సుర సేవిత నామ సురారి భీమ దు –ర్వార పరాక్రమక్రమ ,సువర్ణ సుపర్ణ విహార రామా ‘’నా కోరికలు తీర్చు అని వేడుకొన్నాడు .’’నా టక్కరి బుద్ధి కోరికలతో తా౦డవమాడుతుంది ‘’అక్కటా నీ చరిత్ర ఒక్కనాడైనా నామనసులోకి రాలేదు క్షమించి కాపాడు .జాతి నీతి శాస్త్రం నిర్మలత్వం  లేకపోయినా  ‘’నీ స్మరణ పల్మరు జేసిన వారి బ్రేమతో నేతరియైన వత్సలత నెంతువు రంగనాయకా ‘’అని నమ్మకం తో ఉన్నాడు
‘’నా శిరస్సుకొట్టు ,దేహం తెగగొట్టు ,ఆలుపిల్లలను పట్టు .పొట్టకూటికి బట్టకు బెట్టక –నీపాదాలుపట్టాను వదలను నన్ను రక్షించు .’’కుండలి శాయి వైన నీ భజన పనికిరాదని దుర్జనులు మొండి శిఖండులై ముక్తిమార్గం తెలుసుకోలేక ‘’పాషన్డులైపాపులై యమలోకం లో బాధలనుభావిస్తారు .
‘’ఉత్పల పద్యపుష్పముల నుంచితి హారము గూర్చి నీ మెడన్ –సత్పురుషుల్ సుహారముల జాలగ నియ్యరే ఎత్తుకెత్తుగా-సత్పధ గామిగాక నుతి సన్నుతి కెక్కునె యంచు నెంచకీ –నీ ఉత్పల మాలికాళిగొను మోపికతో నిక రంగనాయకా ‘’  అని కవి శతక సమర్పణ చేశాడు గడుసుగా .
  ఈ శతకం లో కవి తనను గురించి ఏమీ చెప్పుకోలేదు .రంగనాయకుని గురించీ ప్రత్యేకంగా చెప్పలేదు .వెలకూడా తెలియదు .కానీ పద్యాలన్నీ రసబంధురాలే .సరలపద సంజాతాలే.భక్తిభావ సుమవిలసితాలే .చక్కని ధారాశుద్ధి మనసులను ఆకర్షిస్తుంది .ఈకవి ఈశాతకం గురించి మనవాళ్ళు ఎవరూ ఎక్కడా పేర్కొన్నట్లు లేదు .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .
ఇప్పుడు ఆలూరు కోన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం గురించి తెలు అనంతపురానికి 67 కిమీల దూరంలో ఉంది. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతం భలే నచ్చేస్తుంది. కొండ పైభాగాన 400 ఏళ్లకు పైబడిన చరిత్ర గల హజీ వలీ దర్గా ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడి ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా చూడదగినదిసుకొందాం –
అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించి, ఆమె ప్రాణాలు వదిలిన స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు. పెన్నానది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాధుడు స్వయంభువ లింగరూపంలో దర్శనమివ్వడంతో పరమానందభరితుడయ్యాడు. పరుశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు. ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు.
తాటకికి మోక్షం శ్రీరాముడి పరిణయం ఈ దృశ్యాలన్నిటిని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో ఏనాడో తెలుసుకున్న విషయాలు. తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు. ఆలయం నిర్మించబడింది. క్రీ.పూ. 1460 సంవత్సరంలో మొదలైన ఆలయనిర్మాణం క్రీ.పూ 1475 సంవత్సరంలో ముగిసింది. బుక్కా రామలింగస్వామి ఆలయం పేరున పిలువబడుతుంది. ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం చూడగలం. విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో వున్న కొండ చరియపై నెలకొన్న ఆలూరుకోన అని అంటారు. పురాణకధ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు.
ఆ ఆలయంలో తాటకికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.కొండపై చిన్న ఆలయ ద్వారం దాకా మనం వాహనాల్లో వెళ్ళగలిగేంత సౌకర్యంగా ఉన్నాయి రహదారులు. తాడిపత్రి నుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆల్లొరు కోన దట్టమైన అడవిలో పక్షులు కలకలరవాలు మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు. ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మంద్రంగా వినిపిస్తాయి. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్తే ఒక మండపం ఆ తర్వాత ఆలయగోపుర ద్వారం గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార చివర బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ ్భగవాన్‌ సన్నిధి. గరుడ భగవాన్‌ శ్రీరంఘనాధుని సేవలoోనిరంతరం తన్మయత్వంతో ఉన్నట్టు దర్శనమిచ్చే శ్రీ రంగనాయక విగ్రహం.
  గరుడ భగవాన్‌ ఎదుట ఒక మండపం ఆ తర్వాత గర్భగుడి. భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రీరంగనాధుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకొని తూర్పువైపుకి కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవళించిన విగ్రహం పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చున్నట్టున్న విగ్రహాలు దర్శనమిస్తాయి. నాభియందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. మాములుగా శేషశయనంపై పవళించే శ్రీరంగనాధుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కాని ఈ క్షేత్రంలో వున్న శయనించిన శ్రీరంగనాధుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీరామానుజల వారికి గర్భగుడి నిర్మించారు.
బయటి ప్రాకారంలో వరుసగా శంఖుచక్రాలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం. ఇంటి దైవముగా బాసిల్లుతున్నాడు. తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు. ఆలయంలో వాయువ్య మూలలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు. పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీరంగనాధుని దర్శించి స్వామి వారి అనుగ్రహం పొందుతాం.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.