మనకు తెలియని మహాత్ముని కబుర్లు -4(చివరిభాగం )

‘మనకు తెలియని మహాత్ముని కబుర్లు  -4(చివరిభాగం )
శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు మహాత్మునితో తన పరిచయాన్ని వివరిస్తూ ‘’1942ఫిబ్రవరి నెలలో హిందూస్తానీ ప్రచార సభ కార్యక్రమం  గాంధీజీ  అధ్యక్షతన వార్ధాలో జరిగింది.ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా నేనూ హాజరయ్యాను .ఇంకా అప్పటికి జవహర్ లాల్ ,ఆజాద్ ,రాజేంద్రప్రసాద్ ,డా పట్టాభి  జైళ్ళలోనే మగ్గుతున్నారు .గాంధీజీ తన అధ్యక్షోపన్యాసంలో ‘’నాయకుల్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని యాచిస్తానా ?మనం నిర్మాణ కార్యక్రమం తీవ్రం చేస్తే ,మనశక్తి పెరిగి ,అప్పుడు వారంతట వారే విడుదల అవుతారు .అంతేకాని వాళ్ళంతా జైలులో చచ్చినా సరే ప్రభుత్వాన్ని మటుకు యాచించను’’అని గద్గదస్వరంతో గాంధీ అన్నమాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి .ప్రభుత్వ విధానం వల్లా ,కొపాతి రేకం వల్లా జేవురించిన ఆముఖమూ ,,అనుచరులు జైళ్లలో అనుభవిస్తున్న నరకయాతన తలచుకొని పడే ఆవేదనవల్ల ,కంపిస్తున్న ఆధరం ‘’చచ్చినా సరే ప్రభుత్వాన్ని యాచించను ‘’ అనే దృఢప్రతిజ్ఞను సూచించే జ్యోతిర్మయ నేత్ర యుగ్మమూ ఇప్పటికీ నా మనసులో ప్రత్యక్షమౌతూనే ఉంది .ఎంత తపన పడ్డారో ఆ మహాత్ముడు అర్ధమయింది .
  గాంధీజీ మాటలే కాక ,చేతలు కూడా ఒక్కొక్కప్పుడు మహా కఠొరంగా,మరొక్కప్పుడు మహా మృదులంగా ఉంటాయి .కొన్ని పెద్ద విషయాలలో చాలా లొంగుబాటు తనం ,కొన్ని చిన్నవిషయాలలో అమితమైన పట్టుదల చూపిస్తారని పిస్తుంది .’స్వరాజ్యం ఇవ్వండి అని బ్రిటిష్ ప్రభుత్వం ముందు సాగిల పడతా ‘’  అన్నారొకసారి .ఆశ్రమం లో పెట్టెకు చిన్న తాళం వేసిందని కస్తూర్బా తో సంవత్సరం మాట్లాడలేదాయన..’’వజ్రాదపి కఠొరాని,మృదూనికుసుమాదపి ‘’అనే సూక్తి ఆయనకు పూర్తిగా సరిపోతుంది .
‘’  బాపూజీ ‘’అంటే నాన్న అని అర్ధం .గాంధీజీకి తన బిడ్డలేకాదు యావద్భారత ప్రజలకూ, కాదుకాదు అఖిల ప్రపంచానికీ తండ్రి అయ్యాడు .అందుకే ఆయన్ను బాపూజీ అని పిలుచుకొంటూ ఆయన్ను మనం అతి సన్నిహితుని చేసుకొన్నాం .కనుకనే ఆయన మనల్ని విడిచి వెళ్లేసరికి ఇంతగా పరితపిస్తున్నాం .ఆయన భౌతిక శరీరాన్ని మనం ఇక చూడలేం. ఆయన వాణి ప్రత్యక్షంగా వినలేం .కానీ విశ్వ శరీరాన్ని ధరించి ,ప్రణవ నాదం తో తన వాణిని మేళవించి ,బాపూజీ తరతరాలకు అదివ్య సందేశాన్ని అందిస్తూనే ఉంటారు .ఆసందేశాన్ని మనకు ప్రసాది౦ప బడుగాక ‘’అంటూ ముగించారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్య గారు.
మహాత్మునితో ఇంతటి ప్రత్యక్ష సంబంధం ఉన్న మహితాత్ముడైన ఈ హిందీ ఉద్యమకారుని గురించి ఎక్కడా ఎవరూ ప్రస్తావించిన దాఖలా లేదు .మా అబ్బాయి శర్మ ఎక్కడో రెండు పేజీలు  సంపాదించి నాకు పంపించి ఆయనమీద ఎవరూ రాయలేదు అయన చెప్పిన విషయాలు ఎవరూ ఎక్కడా చెప్పినట్లు లేదు మనమే రాయాలి అంటే కనిపించీ కనిపించని చిన్నచిన్న అక్షరాలలో ఉన్న ఆ సమాచారాన్ని కళ్ళు పెద్దవి చేసుకొని ,భూతద్దంలో చూసి నట్లు పెంచి చూసి ఆదివ్య సందేశాన్ని మీకు అందించగలిగినందుకు నేను ధన్యుడిని .అలాంటి ఉన్నవ వారి మాటలు అమృతపు ఊటలు అనిపిచాయి .అందుకే ఈ వ్యాస పరంపర బాపూకే కాక, ఉన్నవ వారికీ చిరుకానుకే .  .
  గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.