ధర్మవీర పండిత లేఖరాం -2

ధర్మవీర పండిత లేఖరాం -2

ధర్మ ప్రచారానికి ఒక పత్రిక అవసరం అని గుర్తించి ‘’ధర్మోపదేశ ‘’మాసపత్రిక స్థాపించి ,సంపాదకు డయ్యాడు లేఖరాం .దీనితోపాటు వ్యాఖ్యానాలు కూడా చెబుతూవాటికి సంనద్ధుడవుతూ ఉండేవాడు .ఒకసారి మద్య నిషేధం పై ఈయన ఉపన్యాసం విన్న సైనికాధికారి సైన్యంలో మద్య నిషేధం విధించాడు శాస్త్రార్ధాలు  చేయటంలోనూ నైపుణ్యం సంపాదించాడు .పోలీస్ సూపరింటే౦డెంట్ తన డిప్యూటీ లీడర్ వజీర్ ఆలీ ఈయన తో వ్యాఖ్యానాలు చేస్తూ సమర్ధించే వాడు .ఈయన బదులువచ్చిన కొత్తాయన లేఖరాం ను పెషావర్ నుంచి ‘’సు ఆబీ ఠాణా ‘’కు మార్చాడు .అక్కడిను౦చికూడా తన వ్యాసంగాన్ని కొనసాగించాడు .ఒకసారి ఇక్కడి పోలీస్ ఇన్స్పెక్టర్ ఈయనతో సత్యాసత్యాలపై చర్చకు రాగా ,ఈర్ష్య చెంది ఈయన ఇంక్రిమెంట్ ఆరునెలలు నిలిపేశాడు .

   ఆర్య సామ్రాజ్యకా౦క్ష

  భారతీయ శిక్షా పద్ధతికి లేఖరాం వద్ద ఎప్పుడూ ఒక గ్రంథం ఉండేది .దాని ముఖ చిత్రంగా ‘’ఓ3మ్’’అనే జండా ముద్రి౦పజేయించారు. అంటే సమస్తభూప్రపంచ౦పై  ఈ పతాకం ఎగరాలి ఉద్దేశ్యం .వైదికం ప్రపంచానికి శిరోమణి కావాలనే భావం .కానీ ఇప్పటివరకు నెరవేరలేదు .ఏదైనా ముందు తానూ ఆచరించి ఇతరులకు చెప్పేవాడు .పెషావర్ లో జరిగే ఆర్యసమాజిక సాప్తాహికాలకు వెళ్ళాడు .ధర్మశాల అధ్యక్షుడైన తాసిల్దారునే సమాజానికి ప్రధాన్ గా చేయాలని అందరి ఆలోచనగా ఉంది .తాసిల్దార్ మద్య మా౦సప్రియుడు కనుక ఉండటానికి వీలులేదని ఆయన హాజరైఉండగా చెప్పాడు .సభ్యులు అంగీకరించకపోతే సభ వదిలి వెళ్లి పోయాడు లేఖరాం .

  ఉద్యోగానికి రాం రాం

 పోలీసు ఉద్యోగం ధార్మిక కార్యక్రమాలకు అడ్డంకి గా ఉందనిభావించి 24-12-1884న రిజైన్ చేశాడు .ఇప్పుడు స్వేచ్చ లభించింది .ఇంతలో దయానందుని నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి .ఒకదానిలో గోరక్షణ కోసం సంతకాల సేకరణ ,రెండవది పంజాబ్ లో హిందీ ప్రచారానికి విద్యా సంస్థకు నివేదన పత్రం పంపటం గురించి .ఎంతో ఉత్సాహంగా ఈ రెండూ పూర్తిచేశాడు .

  మీర్జా గులాం అహమ్మద్ కాదియాని తానూ పైగంబర్ అని చెప్పుకొంటూ జమ్మూలోని ,హిందువులను ముస్లిం లుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు .ఈయన చాలాసార్లు అక్కడికి వెళ్లి ఆప్రయత్నాలకు అడ్డు పడ్డాడు ..కాదియానిరాసిన ‘’బురాహీన్ ఆహామదియా ‘’లో ఆర్యసమాజం పై దూషణలు చేశాడు .కనుక తన చర్యలను తీవ్రతరంచేయటంతో  మతమార్పిడి చాలాభాగం తగ్గింది .ఇంకో అడుగు ముందు వేసి క్రైస్తవ ,ముస్లిం లనుకూడా వైదిక ధర్మ౦ లోకి తెచ్చాడు .ఎవరైనా తనదగ్గర ఏడాదికాలం ఉంటె తన చమత్కారాలు ప్రత్యక్షంగా చూడచ్చు అని కాదియానా ప్రకటించగా,ఖండించి , ఈయన వెళ్లి ,ఆయన రహస్యాలు బట్టబయలు చేసి ,జనాల భ్రమలను వదిలించి ఆర్యసమాజం స్థాపించాడు .కాదియాకు చెందినా హిందువు విష్ణుదాసు ఇస్లాం లోకి మారకపోతే ఏడాదిలోపే చచ్చి పోతాడనిమీర్జా  ప్రచారం చేయగా ,లేఖరాం వెళ్లి సందేహాలు సంతృప్తితో తీర్చి ఆర్య సమాజ సభ్యుని చేశాడు .ఎందఱో సామాన్యులని మీర్జాకుతంత్రానికి  బలికాకుండా కాపాడాడు .సురమా చాస్మ ఆరియా అని మీర్జా రాస్తే దాన్నిఖండిస్తూ లేఖరాం’’సుస్తా ఖబ్దఆహ్మదియా ‘’రాసి నోరుకాదుకాదు కలం మూయించాడు .

  లాహోర్ లో ఉపన్యాసాలిస్తూనే సంస్కృత వ్యాకరణం సాయంతో వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .ఫాదరీ ఖడక్ సింహ్ క్రైస్తవాన్ని సమర్ధిస్తూ ఆరు వ్యాసాలురస్తే ,వాటికి ఖండిస్తూ ఆరు చిన్న పుస్తకాలు రాశాడు .’’ఆర్యగజేట్ –ఫిరోజ్ పూర్’’ కు ఆయన సంపాదకు డయ్యాడు .దయానందుని నిర్యాణం తర్వాత లేఖరాం బాధ్యత పెరిగింది .ఆర్య ప్రతినిధి సభ దయానందుని జీవిత చరిత్ర లేఖరాం రాయాలని తీర్మానించింది .దీనికోసం విషయ సేకరణకు దేశమంతా పర్యటించాడు .ముందుగా  స్వామి విరజానందుని  శిష్యులైన పండిత యుగళ్ కిషోర్ ,పండిత దామోదర్ చౌబే వంటి వారినికలిసి విషయాలు గ్రహించాడు .వీరు దయానండునిక్లాస్ మేట్స్ .మధుర ,సంయుక్త పరగణాలు కూడా వెళ్లి విషయాలుసేకరించాడు .అజ్మీర్ లో అబ్దుల్ రహమాన్ తక్జీబ్ ,నుస్కా ఖబ్ద్  పుస్తకాలు చదివి ఇస్లాం వదిలి ‘’సోమదత్త ‘’పేరుతొ వైదికం లోకిచేరి ఆర్యసమాజానికి గొప్ప ప్రచారకుడయ్యాడు  .ఆర్య సమాజ హేతువాద ప్రచారం పౌరాణికులను, జైనులను కూడా కలవర పరచింది .లేఖరాం గారికి ప్రాణాపాయం ఉంటుందేమో అని భయపడి ఆయనకు కాపలాగా నలుగుర్ని నియమించాలని ఆర్యులుకోరగా ఈయన ఒప్పుకోలేదు .తనకు భయం లేదన్నాడు .ఒక మౌల్వీకి హిందీనేర్పించాడు

  శూద్రునికి యజ్ఞోపవీతం

మీర్జాపూర్ ఆర్యసమాజంలో ఉన్న ఒక శూద్రుడు  వైశ్యులకు  వైదికకార్యాలుచేస్తాడు. ఆయనకు యజ్ఞోపవీతం వేయటానికి అక్కడి ఆర్యసమాజం ముందుకురాలేదు .ఇది తెలిసి  లేఖరాం ఆయనకు యజ్ఞోప దేశ సంస్కారం దగ్గరుండి చేయించాడు .మీర్జాపూర్ లో ఒక గూండా మౌలీతో శాస్త్రార్ధం  చేశాడు .ఆతనికి భయపడి ఎవరూ ఎదురు వెళ్ళేవారు కాదు .ఈయన సాయ౦కాలం నిర్భయంగా దుడ్డుకర్ర చేత్తోపట్టుకొని వాహ్యాళి వెళ్ళేవాడు .కాశీలో రెండు ననెలలున్నాడు .ఓజస్వీ భాషణ చేశాడు .పౌరాణికులు అడ్డుపడినా నిర్భయంగా తనవాదాన్ని వెలువరించి ఆమోదం పొందాడు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.