భావశ్రీ కిరణపు౦జ౦ చింతలపాటి పద్య’’ సిరికిరణం ‘’

భావశ్రీ కిరణపు౦జ౦ చింతలపాటి పద్య’’ సిరికిరణం ‘’

మిత్రుడు శ్రీ చింతలపాటి మురళీకృష్ణ ఇవాళ వాట్సాప్ లోతానురాసిన  ‘’సిరి కిరణాలు ‘’ పంపి ముందుమాట రాయమన్నారు .చింతలపాటి వారు మహా విద్వత్ కవి వరేణ్యులు .అందరు కండగల కవిత్వం  వార్చి  వడ్డించగల  బహునేర్పున్నవారు .అందునా మురళి కవిత్వం మోహన మురళీ సమ్మోహనమే.అది అనుభవి౦చి తీరాల్సిందే . మునకలు వేసి పరవశించాల్సిందే ఈ అనుభవం నాకు చాలాసార్లు జరిగింది .అంతటి విద్వత్ కవి రాసిన వాసిగల కవిత్వాన్ని బేరీజు వేసే శక్తి సామర్ధ్యాలు నాకులేవుకానీ మిత్రుని కోరిక మన్నించాలనే ఉబలాటం నన్ను నాలుగు మాటలు రాయటానికి పురిగొల్పింది .ప్రతిపద్యానికి భావం కూడా రాసి కవి హృదయం అర్ధం చేసుకోవటానికి మార్గం సుగమం చేశారు .కవి మురళి .

  మురళి . సూర్య చంద్రులు,,ప్రకృతి ,విరజాజి కలువబాల మొదలైన   

15 విభిన్నశీర్షికలలో దాదపుద్విశత పద్య కవితా మురళి వాయించారు . అందులో నాకు నచ్చిన మేలిమి కిరణాలను  మీ ముందు ఉంచుతాను .ఆకిరణ ప్రభ దర్శించి అనుభవించండి .ప్రభాత సూర్య కిరణం ‘’ఉజ్వలతర  జీవన శక్తి ప్రసారం చేసి ప్రణవోదయ  బీజ  విశాఖ రేఖ అనిపిస్తుంది .వాతావరణం లో ఎన్ని మార్పులు వొడిదుడుకులు వచ్చినా తన ‘’కిరణాలు గ్రుచ్చుతూ లోకానికి మేలుచేస్తూనే ఉంటాడు .’’చీకటిరాత్రులుజ్వల వశీకర తారక కా౦తి రేఖలున్ ‘’పద్యం ‘’శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులన్ ‘’పద్యాన్ని గుర్తుచేస్తుంది .రాత్రుళ్ళు చీకటి లో ఉండిపోవటం చేత శక్తితగ్గితే ఆయుర్వేద మందు ‘’ఊర పిచ్చుక లేహ్యం ‘’తినిపించి కళ్ళు తెరవమనటం గొప్పగా ఉంది హాత్ట్సాఫ్ కవిశేఖరా .అలసిన జీవ జనులకు జీవయాత్రనడిపే శక్తినిస్తాడు .జీవితం లో సగం నిద్రే .జగతః పిత అయిన రవి వేదరూపభగవాన్ .కసిగా జబ్బలు చరచె  కడలి వగలుపోతున్న వయ్యారి రాయుడిలా కనిపించాడుకవికి .సంద్రం నిత్య చైతన్యం .అంతరంగం బంగారం .ఉన్న చెత్తను బయటికి తోయటం అనుక్షణ పారిశుధ్యానికి నిదర్శనం .తరంగాలు శేషుని వేయి జిహ్వాలే .తరంగధ్వని ప్రణవ నాదం .ఆటుపోట్లు ఎన్నిఉన్నా ‘’చెలియలికట్ట ‘’దాటని జాలి కడలిది .భరి౦చ లేకపోతే సునామీయే .భీభత్సమే లోకోపద్రవమే .’’వేదార్ధమయి ,పా౦చ భౌతికమునై , వెల్గొందు నో౦కారమై’’న కడలికి ‘’టెంకణాలు’’.అర్పించాడుకవి.

  సైంధవ న్యాయం లో సముద్ర ఉపరితలం సమానత్వానికి ప్రతీకగా కన్పించినా లోపల బలహీనజ౦తువులపై బలమైన జంతువుల దోపిడీ కనిపిస్తు౦ది .ఇదేటిన్యాయం  ?అని ప్రశ్న .సమతాధర్మం సృష్టిలో నే లేదని ఆవేదన .’’ఉదధి వసించు జీవులు ఊడిగం చెయ్యటానికే ఉన్నాయా ?అందులోని జీవలోకం మానవ కులాలను జ్ఞప్తికి తేవటం లేదా ?సమత్వం అనే ఆశయం సమగ్రం,సంపూజ్యం అనే నీతి ని కడలి బోధిస్తుంది .ఇదే  సైంధవ న్యాయం .

  ప్రకృతి భాగం లో సకల చరాచరమ్మునుప్రసన్నముగా కనుముందు నిల్చు  .అవన్నీ ప్రకృతి భావంతో మెలగుతాయి అన్నట్లు కనిపించేదంతా నాటకమే .జగాలు నిద్రలో మునిగినప్పుడు భగవాన్ అనుగ్రహంతో రవి దేవుడు ఉదయించి చైతన్యస్పూర్తి కలిగిస్తాడు .కనపడేది అంతాప్రకృతి శక్తిస్వరూపాలే అనే ఉపనిషద్రహస్యం చెప్పాడుకవి .కానీ పోషించి పెంచి కళలతో ఆకర్షించి ,పెనుఘాతాలతో వెన్ను చరచినా ,వొడిలో చేర్చిముద్దాడినా అన్నీ ప్రకృతి వరాలే అంటాడు కవి ప్రకృతిలో మమైక్యం కావటం జీవధర్మం అని భావన .విరజాజిని మనుష్యులప్రాణాలను తనలో ఇముడ్చుకొన్న జాణ అంటాడు .జాజి సువాసన ‘’పరిమళమా ,ప్రసన్న భావ పరంపర కేళికేంద్రమా ?మనోభవుని  సోంపు దలిర్చు రతీ విలాసమా ?అనే విచికిత్స .’’మారోదార విరాజమాన జయ  సమ్రాడాభిరామమ్ము .సిర వెన్నెలపాట లా బహు లాలిత్య కోమల సురభిళ౦  అని ఆకాశానికి ఎత్తేశాడు .

  కలువబాల చేరడేసి కన్నులతో వెన్నెలలో ఆడుకొనే ఆడపిల్లలా అనిపించింది .పిల్లగాలులకదలికలు గిలిగింతలు పెడుతుంటే సిగ్గుపడి సరస్సులో మునగానాం తేలానాం అనిపించే కన్నెపిల్లలా ఉంది అనటం భావుక పరాకాష్ట .’’.లోరియల్’’ లాంటి కాస్మెటిక్స్ వాడావా అని చిలిపి ప్రశ్న .రుతువిలాసం అంతా కమనీయ పద్య విలాసమే .ప్రేమతత్వం లో కంటికినచ్చినప్రతిదాన్నీ ప్రేమించేస్తావా ?అని ప్రశ్నిస్తాడు .ఆత్మీయ సుఖంతో ప్రేమించాలి అని హితబోధ .అనేక సందర్భాలలో ఆడవారితో కలిసి మాట్లాడినప్పుడు దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు అది స్నేహం గా భావి౦చాలి కాని ప్రేమ దోమ అని పేట్రేగరాదు .ప్రకృతి వైపరీత్యం ఎక్కువ  ఆధునిక కాలం లో  .క్షణం  తీరికలేకుండా  పెద్ద ముసలి ముతకా టివి కి ఠీవిగా  అఅంకితమైతే మనపిల్లలు ఏం నేరుస్తారు మనల్ని చూసి ?ప్రేమ పేరు తోకాముకత్వం పనికి రాదు .’’నలపటం’’ రసికతకాదు.

‘’సర్వజనులు సుఖమ్మొదవి సాత్వతనొందగ కోరు రీతి ‘’ని మానవత్వం లో కోరాడుకవి.ఇచ్చిపుచ్చుకోవటంతో మంచితనం పెరుగుతుంది . విశ్వనాథ్  సినిమాలలో లాగా గుండె నిండా ఆర్ద్రత ఉండాలి  .ఇందులో విదుర నీతులన్నీ గుదిగుచ్చాడుకవి .మనదేహాలలోని ఆత్మలన్నీ దేవుని రూపమే .జ్ఞానంతో జీవించటమే మానవత్వం .ఒకరికి తోడుగా ఉండాలనుకొని జీవించటమే పరమార్ధం మానవ జన్మకు .అమ్మతో అనుబంధాన్ని కమ్మని పద్యాలతో కూర్చాడుకవి .సృష్టిలో అనుబంధమనే సంబంధమే అన్నిటికి కారణం .బీడు ను సాగుచేసి మంచి ఫలసాయం సాధించి ,అదే తన సర్వస్వం అనుకొన్నవాడు దాన్ని వదిలిపోయేటప్పుడు వాడికి బీడు ఏమౌతుంది అని మౌలిక ప్రశ్న సంధించాడు .కామ సంబంధాలు క్షణికం .తస్మాత్ జాగ్రత అంటాడు .

 11వ శీర్షిక ‘’ఇష్టారాజ్యం ‘’లో అందరూ ఎవరికివాడు నా ఇష్టారాజ్యం అని భావిస్తే వినాశనమేకాని వికాసం రాదు .పూర్వం గూడుపుఠాణీ రాజ్యాలు ,ఇప్పుడు వోటు రాజకీయాలు .కులరాజకీయంలో ధర్మ విచక్షణ లేదని వాపోయాడు కవి .’’సినేమాలు ‘’యువకుల బలహీనలతలతో ఆడుకొంటున్నాయి .లక్ష్యం గమ్యం మరచిపోతోంది యువత .దాంపత్య సుఖం కన్నా స్త్రీలకూ అధికార పెత్తనం కోరిక ఎక్కువైంది .విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు  వామపక్ష భావజాలం లో కూరుకుపోతెదేశ భవితవ్యం యేమౌతుందో అని ఆందోళన.’’బుడుతల్ సన్యాసులై యెవ్వియో పొదలన్ దూరిన దూరుగాక-గురులన్ బూతాడి యేబ్రాసులై చదలన్ బోయిన బోవుగాక గురువు ‘’లైట్ తీసుకోవాలి .

  కడివెడుపాలలో కమ్మని మీగడ పైకి తేరుకొన్నట్లు మనసుకు ప్రశాంతత ,సుఖప్రదమైన గొప్పశక్తియే సంప్రదాయం అని నిర్వచన చేశాడుకవి మురళి..సంప్రదాయం వారసత్వ సౌభాగ్యం .పండుగ పబ్బాలు,సూర్యోదయ సూర్యాస్తమయాలు అన్నీ సంప్రదాయ గణనాలే.13 మనో నియంత్రణలో మనసు జవనాశ్వం .రౌతు దాన్ని కట్టడిచేయాలి .దానికి స్వేచ్చనిస్తే ఎత్తిపడేస్తుంది .ఏదొచ్చినా అనుభవిస్తే సుఖమయ జీవితం అవుతుంది .కష్టసుఖాలు కావడి కుండలు .మనోనిగ్రహం ఈ శరీర విగ్రహానికి ముఖ్యావసరం .  వొంటరిపడవ శీర్షికలో  -ఈ శరీరం అనే నావనిచ్చి ఎలాగోఅలాగా బతుకు అంటే తోడు ఎవరొస్తారా అని ఎదురుచూపు .నలుగురన్నదమ్ముల తీరు తెన్నులకు కలత చెందాడుకవి .’’వొంటరినైపోయాను నేనింటికి యేమని పోనూ ‘’అంటూ యేడుస్తూకూర్చోక కడదాకా తోడుండే జీవిత భాగస్వామిని తెచ్చుకొని సుఖపడాలి తృప్తిచెందాలి .పడమటి సంధ్యారాగం లో సముద్రతీరాన మార్కస్ బే లో కావ్యం రాస్తుంటే భార్య తోడుగా  ఉన్నదట .మురిసిపోయాడుకవి. అక్కడి సరస్వతీ తీరం చూసి పరవశించిపోయాడు .’’వేదనాదమట్లు ,పరివృద్ధి నొసంగెడి యోగమట్లు ,సంపాదిత విత్తమట్లు ,పరభాషలకున్ కుసుమాస్త్రమట్లు ‘’ఈ మేదినిలో సుస్వర స్వర ప్రమేయము నేర్చిన భావమట్లు గా ,ఆవేదన తీర్చే తల్లిలా విందుగా తెలుగు వినిపించింది .ఈ మాటలన్నీ సంప్రదాయం లో మునిగి తేలిన వాడి నోటినుంచి అంటే కలం నుంచి జాలువారే పవిత్రపదాలే .

  14 శీర్షిక ‘’కలి ‘లో-కలికాల విపరీత పోకడల విన్యాసం చూపాడుకవి .కలిప్రభావం చేత ఇనుపకచ్చడాలు కట్టిన ముని మ్రుచ్చులైనా మూర్ఖులు దుర్మార్గులు అవుతారట .కలిదోషానికి దుర్యోధనుడే సాక్షి అట . దొరికిన రాజ్యభాగంతో ప్రశాంతంగా  రాజ్యపాలన  చేసుకొని ఉంటే భారతయుద్ధం గుమ్మం తొక్కేదికాదుకదా .చివరి 15వ ‘’మహాప్రస్థానం ‘’శీర్షికలో –ప్రశా౦త సాగరం పసిఫిక్ సముద్ర తీరం లో ఒకడు జీవితం పై విరక్తితో పడవలో ప్రయాణం చేస్తూ టెన్షన్ భరించలేక నీటిలోదూకాదట. వాడేమై పోయాడో తెలీదు. కాలపాశం ఎటుఈడిస్తే అటు పోవాల్సిందే .గత్యంతరం లేదు .’’కాలకరాళకర్కశ ముఖమ్మున చిక్కు గజేంద్రుని’’కుయ్యాలించి ‘’భక్తవరదుడు కాపాడినట్లు జీవుడిని భగవంతుడే దరికి చేరుస్తాడు అనే వైరాగ్య భావం నిండిన పద్యంతో ‘’సిరికిరణం ‘’పూర్తి చేశాడు మురళీ కృష్ణకవి .పద్యాలన్నీ రసబందురాలు .కవితాధార గంగా ఝరి .ఉత్పల చంపకాలతో పద్యమాల కట్టి సరస్వతీ కంఠాభరణం గా అలంకరించారు చింతలపాటి కవి .  

గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-26-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.