రామ చక్రం
రామ మంత్రం తెలుసు పూజలో ఉండే రామయంత్రం తెలుసు .ఈ రామ చక్రం ఏమిటి ?వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండలో కాయినేజ్ చేసిన మాట ఇది .దీన్ని ఆయనమాటలలోనే తెలుసుకొందాం .
యుద్ధకాండ 93వసర్గలో శ్రీరాముడు వీర విహారం చేసి రాక్షస సంహారం చేసిన సందర్భం ఇది .అప్పటికే కొడుకు ఇంద్రజిత్ తో సహా రాక్షస వీరులంతా యుద్ధం లో చనిపోయారు .కోపం ఆవేశం పట్టలేకపోయాడు రావణ బ్రహ్మ .రాక్షస వీరులందర్నీ సమావేశపరచి చావో రేవోతేల్చుకోమని సకల సెనా సమాయత్తంగా వెళ్లి రాముడిని చుట్టుముట్టి బాణ వర్షం కురిపించమని హుకుం జారీ చేశాడు .వాళ్ళు అలా రామ శరీరాన్ని బద్దలుకోడితే ‘’నేను అందరూ చూస్తుండగా రామహననం చేస్తాను ‘’అని బీరాలు పలికాడు ‘’భవద్భిఃశ్వో నిహన్తాస్మి రామం లోకస్య పశ్యతిం’’ఇంకేముంది నిప్పుతోక్కిన కోతుల్లా రాక్షస వీరులంతా సమరోత్సాహం తో బయల్దేరారు ఒంటరి రాముడిపైకి .వానర వీరులూ తక్కువ తినలేదు .వృక్షాలు పర్వతాలతో రాక్షసులపై పడ్డారు .భీకర యుద్ధం జరిగింది .ఏనుగులురథాలు వొడ్లుగా గుర్రాలు చేపలుగా .ధ్వజాలు వృక్షాలుగా అయిన రక్తనదులు ప్రవహించాయి .అందులో చనిపోయిన సైన్యం శరీరాలు తెప్పలు తెప్పలుగా కొట్టుకుపోతున్నాయి .వానరులురక్తం తో తడిసిపోయి ఎగిరిఎగిరి గంతులేస్తూ శత్రువుల ఆయుధాలను రథాలను ముక్కలు ముక్కలు చేశారు .రాక్షసుల చెవులు.ముక్కులు కోరుక్కుతిని చప్పరించారు .ఒక్కొక్క రాక్షసుడిమదకు వందమంది వానరులు దూకి భీభత్సం చేశారు.రాక్షసులు వీర విజ్రు౦భణ చేయగా భరించలేక వానరులు ‘’రామ౦ శరణం గచ్చామి’’అని శ్రీరాముడి కాళ్ళమీద పడ్డారు .ఇదీ నేపధ్యం రామ పరాక్రమ ప్రదర్శనానికి .
అక్లిష్టకర్మ గలశ్రీరాముడు వానరులను’’మై హూనా ‘’అంటూ ఓదార్చి ధనస్సు ధరించి యుద్ధానికి బయల్దేరాడు .తుముల బాణ వర్షం కురిపించాడు అసురులపై ఉసురులు తీయటానికి.బాణాగ్ని చేతకాల్చేసే రాముడిని ఆకాశంలో మేఘాలు సూర్యుడిని చూడలేక పోయినట్లు దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు .ఇతరువెవరూ చేయలేని రాముడు మాత్రమె చేయగల పనులను రాక్షసులు చూశారు .చేయబడుతున్న వాటిని చూడ లేకపోయారు .’’దద్రుశుస్తే ,న వై రామం కర్మాన్య సుకరానిచ ‘’’’. రాక్షస మహా సైన్యాన్నిఊపేస్తూ ,మహా రథాలను ఎగరగొడుతూ , వనం లోని వాయువులాగా కనిపించాడు –‘’వాత౦ వన గతా యథా ‘’బాణాలచేత బద్దలుకొట్టి ,కాల్చేసి ముక్కలు చేసి ఆయుదాలచేత పీడించిన సైన్యాన్ని మాత్రమె వాళ్ళు చూశారుకానీ రాముడు చేస్తున్న పనులు చూడలేకపోయారు –‘’బలం రామేణదద్రుశుర్న రామం శీఘ్రకారిణం ‘’ తమ శరీరాలపై కొడుతున్న రాముడిని యింద్రియాలద్వారా భోగ్యవస్తువులను అనుభవిస్తున్నా జీవాత్మను చూడలేనట్లు రక్కసులు చూడలేకపోయారు .’’ఇంద్రియార్దేషు తిష్టంతం భూతాత్మాన మివ ప్రజాః ‘’
ఇదిగో ఇక్కడ యేనుగుసైన్యాన్నిచంపుతున్నాడు అదిగో మహారధ సైన్యాన్ని చంపేస్తున్నాడు ,ఇదుగో అశ్వ సైన్యాన్ని కాల్బలాన్ని సంహరిస్తున్నాడు రాముడు అంటూ రాక్షసులు భయభ్రాంతులై యుద్ధంలో రాముడిని పోలిక ఉన్నవాళ్ళనే చూస్తూ,తమ ఎదురుగా వున్నవాడు తమవాడే అయినా రాముడిగా తలుస్తూ ఒకరినొకరుచంపుకొన్నారు ఇదొక విచిత్రం .’’అన్యోన్యం కుపితా జఘ్నుః సాద్రుశ్యా ద్రాఘవస్యతు.’’
మాహాత్ముడు రాముడు గా౦ధర్వాస్త్రం చేత మోహి౦పజేయుటచే తమల్ని కాల్చేస్తున్నా రాక్షసులు రాముడిని చూడలేకపోయారు .’’మోహితాః పరమాస్త్రేణ గాన్ధర్వేణ మహాత్మనా ‘’రాక్షసులకు వేలకొలదీ రాముళ్ళు కనబడుతున్నారు .మరుక్షణం లో ఒకే రాముడు దర్శన మిస్తున్నాడు .-‘’రామ సహస్రాణి రణే పశ్యన్తి రాక్షసాః-పునః పశ్యన్తి కాకుత్సమేక మేవ మహాహవే ‘’రాక్షసులకు రామ ధనుస్సు ఆలాత చక్రమే అగ్రభాగమే కనబడుతోంది కానీ రాముడు కనబడటం లేదు .’’భ్రమంతీం కాంచనీం కోటీ౦ కార్ముకస్య మహాత్మనః-అలాతచక్ర ప్రతిమాం దద్రుశుస్తే న రాఘవం ‘’
యుద్ధం లో మృత్యు చక్రం లాగా రాక్షసులని చంపుతున్న రాముడనే చక్రం అంటే ‘’రామ చక్రం ‘’ను ప్రజలు చూశారు . రామ చక్రానికి ఆయన శరీరమేమధ్యభాగం ధనుస్సును గట్టిగా లాగటం చేత అది రాముని నడుము చుట్టూ తిరిగి మండలం గా ఏర్పడగా దానిమధ్య రామ దేహం చక్రనాభి లాగా ఉన్నది .రామబలమే అగ్నిజ్వాలలు బాణాలు ఆకులు ధనస్సు చక్రాంతంనారివలన,తలం వలనా కలిగే ధ్వని ఘోషం .తేజస్సు బుద్ధీ దాని కాంతి దివ్యాస్త్రాల గుణాలు దాని చివరిభాగాలు .ఇలాంటి రామ చక్రం రాక్షస సైన్యాన్ని అంతటినీ కాల్చేసింది అని మహర్షి వాల్మీకి భావం .
ఒకే ఒక్క రాముడు ఒకేఒక జాము-అంటే మూడు గంటలలో కోరిన రూపాలు ధరించే మదించిన రాక్షసుల వాయువేగంకల పదివేల రథాలను ,మహాబలం కల 18వేల ఏనుగులను రౌతులతోసహా 14వేల గుర్రాలను ,రెండు లక్షలమంది కాల్బలాన్ని అగ్ని శిఖలవంటి బాణాలతో సంహరించాడు .ఈ భీభత్సం చూడలేక బతికిన వారు బతుకు జీవుడా అంటూ లంకవైపు దౌడు తీశారు ‘’అభిపేతుః పురీం లంకాం హత శేషా నిశాచరాః’’.రణభూమి శివుడు విహరించే రుద్ర భూమి అనిపించింది .’’అక్రీడ భూమిః క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః ‘’ శ్రీరాముని వీరవిక్రమ పరాక్రమానికి ఫిదా అయిన దేవతలు మునులు సిద్ధ సాధ్యులు ‘’సెబాష్ ‘’అంటూ రాముని కీర్తించారు .అప్పుడు రామ చంద్రుడు వినమ్రంగా ‘’ఇలాంటి దివ్యమైన అస్త్రప్రయోగ శక్తి నాకూ పరమ శివుడికి మాత్రమె ఉన్నది ‘’అన్నాడు వానర మహావీరుల సమక్షం లో-‘’ఏత దస్త్రబలం దివ్యం మమ వా త్ర్య౦బకస్య వా’.’’
ఇదీ రామ చక్ర రహస్యం .జనస్థానం లో 14వేలమంది రాక్షస సంహారంచేశాడనే విషయం లోకం లో బాగా ప్రచారమయింది కానీ ఈ రామ చక్ర మహాత్మ్యం ఎందుకో బహుళ ప్రచారం కాలేదు అనిపించింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-7-26-ఉయ్యూరు .
