చెల్లికి ఘన నివాళిగా చెన్నాప్రగడ శర్మ ‘’కవిత్వం కురిసింది ‘’
ఇటీవలే మరణించిన తన చెల్లెలు కీ.శే.మానాప్రగడ దుర్గాభవానికి అంకితమిస్తూ చెన్నాప్రగడ శర్మ ఈ కవితా సంపుటి ‘’కవిత్వం కురిసింది ‘’ని జూన్ 28 వెలువరించాడు .ఇందులో 85కవితలున్నాయి .అమ్మ వంటింటి గిన్నెల చప్పుడు అలారం అనిపించింది .పెంచి విద్యనేర్పి తీర్చిదిద్దిన తండ్రి తొందరపడి వెళ్లిపోయాడని విచారించాడు .ఇందులోని కవిత్వం సినిమాలో ప్రకాష్ రాజ్ తల్లిపై చెప్పిన ఇన్ఫర్మేటివ్ కవిత్వాన్ని గుర్తుకు తెస్తుంది .చివరి 85వ కవిత ‘’దేవుడు సృష్టించిన దూతలు ,కంటికి రెప్పల్లాంటి అమ్మలైన’’ సేవామూర్తులైన నర్సుల పై కవిత్వం కురిపించి సంపుటి ముగించాడు కవి . మిగిలిన మెరికల్లాంటి కవితా పంక్తులను మీకు పరిచయం చేస్తాను మంచి ముఖ చిత్రాలులోపల దేవతలాంటి చెల్లెలు చిత్రం ,మంచి కూర్పు ముచ్చటైన ముద్రణ పుస్తకానికి అదనపు ఆకర్షణలు .
కోరిక గుర్రాలకు కళ్ళెం వేసి – ఆశలశ్వాస పై ధ్యాస పెడితే –కులాసాలు ధిలాసాలు స్వంతమౌతాయి .సర్దుకు పోయే మనస్తత్వం మధ్యతరగతి ప్రజలది .మిన్ను విరిగి మీదపడ్డా చలనం శూన్యం .ఆఖర్లో నీడ కూడా జారుకున్నా వెంటవచ్చేవి ఆర్జించిన కీర్తి ప్రతిష్టలు మాత్రమె .కుటుంబంతో సరదాగా గడిపితే వత్తిడి తగ్గిపోతుందని ‘’స్ట్రెస్ సూత్రం ‘’చెప్పాడు కవి .హరిత ప్రగతి కి బాట .కాకిపిండం పై కవిత్వం అద్భుతః .భార్యమేనులో ఇంద్ర ధనుస్సు చూసి ఆమెతో జీవితం నిత్యహోలీ గా భావించాడు గడుసు శర్మ .ఈ రోజుల్లో ఆడపిల్ల ఈడపిల్ల –డబ్బులు విరజిమ్మే ఎ .టి. ఎం .మంచి విశ్లేషణ .భార్యా భర్తా అన్నిటా సమానమే –ఏఒక్కరు తోణికినా బెణికినా ఉనికికే ప్రమాదం అంటూ దాంపత్యోపనిషత్ సూత్రం చెప్పాడు కవి శర్మ . .
చరవాణి ని ‘’చోర వాణి ‘’గా చేసిన నిర్వచనం బాగుంది .ఆవకాయ ఘాటు’’ హా—వకాయ’’ అనిపిస్తుంది .స్త్రీ యే రూపం లో ఉన్నా –సంసారం సాగిస్తున్న ఘనత ఆమెదే .కలలోని కన్య కవితై కావ్యమైంది .అమరావతి వైభవ గీతం పాడాడు కవి మధురంగా .చేతిలో చిల్లిగవ్వ లేకపోతె –రూపాయి పాపాయి అవుతుంది అని ధన సూక్ష్మం చెప్పాడు శర్మకవి .గోరింటాకు పండితే అతివలకు ఆనందం –పొలం బాగా పండితే దేశానికి వెన్నెముక రైతు కళ్ళలో ఆనందం .వయసు వారి చూపులు ‘’వయస్కా౦తాలు’’అని ముళ్ళపూడి భాషలో చెప్పాడు .’’సిందూరం, సుదర్శనం పేరేదైనా చక్రం తిప్పేది మేమే’’ అని కవి జవాన్ అయి ఉరిమాడు .ఉపసంపాదకుడి బాధలు చీకటి బతుకులు అని స్వానుభవంతో చెప్పాడు .’’ఒకటికీ రెంటికి నేనే తోడుగా ఉండాలా ?పడకగదిలో నేనెందుకురా కుయ్యా . నీకేనా విరామం ?నాకు ఇవ్వవా ‘’అంటూ సెల్ ఆత్మక్షోభ, ఘోష .ఊరపిచ్చుక లేహ్యానికైనా దొరకని,కనపడని పిచ్చుకను నిఘంటువులోనే ఇక చూసుకోవాలా ?మిలియన్ డాలర్ ప్రశ్న .కోవిడ్ గుణ పాఠం కాదు ఒక పాఠం కావాలన్నారు మాస్టారు.చిన్నప్పుడు కేర్ సెంటర్లలో వదిలేసిన తలిదండ్రులను ఒల్దేజ్ హోమ్స్ లో వదిలేయట౦ కుక్కకాటుకుచెప్పుదెబ్బ?
సమాజం లో ప్రతివాడూ కోయిల గా అనిపించి అవి కూసే రాగాలు పలికి౦చాడుసరదాగా ఉగాది నాడుకవి .బంగారు భవితను కాపాడుకోమని వాహన చోదకునికి హితవు చెప్పాడు .బంగారం పనీ, బంగారంలాంటి సాహిత్య ప్పనీ చేసే సవ్యసాచి’’ చలపాక’’ .
ఎరుపు పేదోడి ఆకలి ,ఆకుపచ్చ పెద్దోడి లోగిలి ,నీలం రైతుకిష్టమైన నిత్యం ఎదురుచూసే ఆకాశ౦ ,గులాబీ ప్రేమికులపరవశ౦ ,తెలుపు చత్వారం,నలుపు అనాధల అంధకారం ,ఊదా ఊరించే ఊహాలోకం ,పసుపు శుభం సంక్షేమ దాయకం అంటూ ‘’సామాజిక హోలీ ‘’గీతం పాడారు శర్మాజీ . ఇలా తవ్వినకొద్దీ దొరుకుతాయి బంగారు నలుసుల్లాంటి మెరుపుల కవితా విశేషాలు .శర్మగారి కవిత్వం అనునిత్యం ఇలా కురుస్తూనే ఉండాలని కోరుకొందాం.
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-26-ఉయ్యూరు .
