మార్గశిరం లో హరి-హర కైంకర్యం

మార్గశిరం లో హరి-హర  కైంకర్యం

మధురకవి శ్రీమతిముదిగొండ  సీతారామమ్మగారు మదినిండా భక్తి నింపుకున్న విదుషీమణి .వినయం ఆమె ఆభరణం .ఆమె తలిస్తే ,పిలిస్తే పద్యం వరదలై ప్రవహిస్తుంది .అతి సహజ సుందర పదాలతో క్లిస్ట విషయాన్ని సైతం సుందర పద్యంగా చెక్కగల నైపుణ్యమున్నవారు .ఇప్పటికే చాలా పద్య కావ్యాలు రాసి ప్రచురించిన అనుభవమున్నవారు .ఈ మార్గ శిరమాసం లో ఆమె దృష్టి గోదాదేవి ‘’తిరుప్పావై ‘’పాశురాలపై ,మాణిక్కవచకర్’’ తిరు వె౦బావై’’పడి, ఆ మాసంలోనే రెండిటినీ తన స్వంత బాణీలో సీసపద్యాలలోకి అనువదించి అటు ‘’ఆ౦డాళ్ళు’’ లాగా, ఇటు’’ శివబాల’’ లాగా తన భక్తిప్రపత్తులను చాటి, తానూ ఆ వ్రతాలలో అక్షర అర్చనతో భాగస్వామి అయి ధన్యమయ్యారు .అంటే హరిహరాద్వైతం సాధించారన్నమాట .తెలుగు సాహితీ లోకానికి వాటిలోని ఉదాత్తభావనలను సరళ సుందరంగా అందించి మన్ననలు అందుకొన్నారు .

              తిరుప్పావై

  తిరుప్పావై గురించి తెలుగునాట ఈ నాడు తెలియని వారు లేరు .ప్రతి వైష్ణవాలయం లో ధనుర్మాసం లో తిరుప్పావై గానం ,వాటిపై ప్రవచనం సర్వ సాధారణమే .అందులో శరణాగతి అందరినీ తన్మయులను చేస్తుంది .పేరుకు ‘’మేలి నోము ‘’కాని ,అంతరార్ధం చాలా వేదా౦త విషయ సమగ్రం .ముక్తికి మార్గం .సామీప్య సారూప్య సాయుజ్యానికి దగ్గరి దారి .శ్రీ కృష్ణావతారం లో శ్రీకృష్ణ పరమాత్మ అతిమానుష చేష్టలు ,సౌందర్యానికి వశులైన గోపకన్యలు ధూర్త గోపాలునిపై మనసు పారేసుకొని సర్వ సమర్పణ బుద్ధితో ఉంటె ,గోప వృద్ధులు ,తమ ఇంటి కన్యకలను వేణుమాధవునికి కనిపించకుండా నేల భోషాణం లో దాచారు .దీనివలన ప్రకృతి కన్నెర్ర జేయగా ,వర్షాభావం ఏర్పడింది .దీనికి పరిష్కారంగా వృద్ధులు రాజీపడి గోపకన్యలు వర్షం కోసం శ్రీ కృష్ణుని గురించి వ్రతం చేయమని ,వారికి , కృష్ణుడిచెప్పి  ఉభయుల అంగీకారం తో ఆయనకు వీరిని అప్పగించి వెళ్ళారు..ఇక ఆలస్యంచేయరాదని ఆ రాత్రిని కొనియాడి ,అర్ధ రాత్రి నోముకై స్నానం చేయటానికి తనను లేపమని ఆనతిచ్చి ,తాను’’నప్పిన్న పిరాట్టి ‘’అయిన నీళా దేవి గృహ ప్రవేశం చేశాడుకొంటె కిట్టయ్య .  .ఆయన చెప్పినట్లే శ్రీ కృష్ణ గుణ చేస్టితులైన గోపకన్యలు స్మరణానందం తో  నిద్రరాక ,లేచీ లేవక ,లేవనివారిని మేల్కొలపటానికి నందగోపుని ఇంటికి వెళ్లి ,శ్రీ కృష్ణుని మేల్కొల్పి ,తమ ప్రార్ధనలు విన్నవించి నోము అనే పేర భగవత్ సంశ్లేషానందం పొందినట్లు గోదాదేవి పారవశ్యం తో రాసిన పాశురాలు ఇవి .అన్నిటికీ భావ గంభీరంగా పద్యాలలోకి మధుమదురంగా మలచి తమ ‘’మధురకవి ‘’బిరుదు సార్ధకం చేసుకొన్నారు ‘’సరసభారతి ఆస్థాన కవయిత్రి’’ శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు .

                      తిరు వె౦బావై

   9వశతాబ్ది శైవకవి మాణిక్క వచకర్ పాండ్య రాజు రెండవ వరగుణ వర్మ మంత్రి .అనునిత్యం శివభక్తి తన్మయత్వం లో తేలియాడే వాడు .గొప్ప కావ్యాలు రాశాడు .కాని ఆయనపేరు 63నాయనార్ల పేర్లలో చేరకపోవటం ఆశ్చర్యం .తమిళనాడులోని మదురై జిల్లా వైగై నదీ(విశ్వనాథ వారి ‘’ఏక వీర’’నవల  కథ జరిగిన చోటు)  తీరం వాధవూర్ లో  జన్మించి,శివాలయం పూజారిగా జీవిస్తూ ,రాజు విశ్వాసం పొందాడు .అతనిలోని సైనిక పటుత్వం గమనించి రాజు ,తన సైన్యం కోసం మేలు జాతి గుర్రాలను కొనమని చాలాడబ్బు ఇచ్చాడు.సరే నని బయలేరి వస్తూంటే దారిలో శివుడే ఒక శివముని  రూపం లో కనిపించి,ఆత్మజ్ఞానం కలిగించగా  రాజు ఇచ్చిన ధనం తో ‘’తిరు పెరునత్తురై  ‘’లో గొప్ప శివాలయం నిర్మించి ,మన భక్త రామ దాసు అనిపించాడు .రాజునూ శివ భక్త శిఖామణిగా మార్చి ముక్తి పొందేట్లు చేసిన పరమ శివభక్తుడు మాణిక్య వచకర్ .ఈయన దేహం చాలించినప్పుడు ఆయన ఆత్మ దివ్యజ్యోతిగా మారి, పరమజ్యోతిలో కలిసి ,ఆయన శవం కనిపించకుండా పోయిందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు .  చిదంబరం లో శ్రీ లంక బౌద్దులతో వాదం చేసి ఓడించిన ప్రతిభ ఆయనది .ఆయన ఆరాధనోత్సవం తమిళనాడు అంతటా జూన్ –జులై లో వచ్చే ‘’ఆణి’’నాడు ఘనంగా నిర్వహిస్తారు .

  ఆయన రాసిన 20 పాశురాల ‘’తిరువె౦బావై ‘’తానేఒక మహిళగా భావించి ‘’పావై నొ౦బు’’ను అనుసరిస్తూ పరమ శివుని కీర్తిస్తాడు .ఆయన విగ్రహం ఆంద్ర ప్రదేశ్ ఆర్కేలాజికల్ మ్యూజియం లో త్రిభంగ భంగిమలో ఒక చేతిలోఓం నమః శివాయ అని రాయబడిన  తాళపత్రం తో ఉన్నది .కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి మాణిక్య వచకర్ గురించి ,తిరువె౦బావై ఘనత గురించి తరచుగా చెప్పేవారు .ఇందులోని 9వ పాశురం కావ్యానికి ఆత్మ,ఫలశృతిగా ఉందని సీతారామమ్మగారు చెప్పిన మాటలు యదార్ధం –ఒక సారి ఆపద్య వైభోగం చూద్దాం –

‘’చిన్మయ రూపుడాచిత్త చిదంబర –నటరాజ గిరివాస నందివాహ –కామేశ్వరీ పతి ,కామ సంహారుడా –కనికరించుము స్వామి కరుణ చూపు —-

‘’భస్మధారుల కిల భవబంధ వితతి –త్రెంపి బాస టగుడదువయ్య దీనబంధు –మార్గ శిర మాస తానముల్ మార్గ మిచ్చు –శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’

  ఈపద్యం శ్రీనాధుని భీమఖండం లోని ‘’చంద్ర బింబానన -,చంద్ర రేఖా మౌళి, నీలకుంతల ఫాల, నీల గళుడు ‘’పద్యాన్ని స్ఫురణకు తెచ్చింది .

  ఈ పాశురాలలో  ‘’ శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’మకుటం ‘’మకుటాయమానం’’గా ఉన్నది .పద్యాలు జలపాత సౌరుతో మానసిక విందు కూర్చింది .పూర్వం మన మగువలు చదివే ‘’ఆధ్యాత్మ రామాయణ  కీర్తన ‘’ల తన్మయత్వం కలిగిస్తుంది.అలా పాడుకోవటానికి అనువుగా కూడా  ఉన్నది . .అవును .తనువూ మనసు భగవంకితమైనప్పుడు వచ్చే శబ్దం ,అర్ధం అత్యంత ఉన్నతంగా నే ఉంటాయి .

   ఇలా శివ- కేశవుల అభేదాన్ని భక్తిభావ బంధురంగా రెండు రకాల పాశుర పద్యాలలో నిబద్ద౦  చేసి  తమ కలం కత్తికి రెండు వైపులా సునిశిత ’’ ధార’’ ఉందని నిరూపించారు శ్రీమతి సీతారామమ్మగారు .అభిన౦దనలు .

          గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో  సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న  రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము .

  ఈ వేడుకలలో1- ‘’స్త్రీ శక్తి ‘’అనే అంశం పై జిల్లాలోని  ప్రముఖ కవి మిత్రుల చేత ‘’కవి సమ్మేళనం నిర్వహింపబడుతుంది

 2-,కొందరు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ,

3-స్వయం శక్తితో ఎదిగిన వారికి ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాలు అంద జేయబడుతాయి

4.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి ,సరసభారతి ప్రచురించిన మూడు పుస్తకాలు 1-117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త ‘’అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకటరామయ్య’’( 117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త –అమెరికా )‘’ 2 –‘’ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత కీ.శే.డా.పుచ్చా వెంకటేశ్వర్లు’’ ( లేజర్ కిరణాలపై నూతన ఆవిష్కరణలు చేసి  ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ .ఐ .టి .,,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి ల నిర్మాణానికి కారకులైన తెలుగు శాస్త్ర వేత్త ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 –రెండవభాగం (254 శ్రీ ఆంజనేయ దేవాలయ విశేషాలు )ఆవిష్కరణ జరుగుతుంది .

  కార్యక్రమ౦లో పాల్గొను అతిధులు-1-శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు 2-శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –ప్రముఖ పర్వతారోహకురాలు ,ఆంధ్రప్రదేశ్ సూపరి౦టె౦డ్ ఆఫ్ పోలిస్ ,ఆక్టోపస్  -విజయవాడ , శ్రీ 3-జి.వెంకటేశ్వరావు – సి .ఇ.ఒ-కెసీపి  4-శ్రీ పులి శ్రీనివాసరావు-రోటరీక్లబ్ అధ్యక్షులు –5 శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు 6-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి, రమ్యభారతి సంపాదకులు,7-శ్రీ విద్యానంద ,శ్రీ చక్రార్చన పరాయణ ,ఆధ్యాత్మిక గ్రంథకర్త , నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి M.E..(హైదరాబాద్ ) 8డా ఉప్పలధడియం వెంకటేశ్వర –తెలుగు ,హిందీ భాషాకవి ,గ్రంథకర్త ,జనని సాహిత్య సంస్థ నిర్వాహకులు –చె న్నై 9-శ్రీ గీతా సుబ్బారావు –ప్రముఖ కార్టూనిస్ట్ ,కవి ,హాస్య రచయిత-హైదరాబాద్ 10-శ్రీ కొల్లూరి రమణ –తెలుగు విద్యార్ధి మాసపత్రిక నిర్వాహకులు 11-శ్రీ అల్లూరు శివ కోటేశ్వరరావు –వ్యాస బృందం –ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు –కారం చేడు 12-శ్రీమతి కమలాకర్ భారతి –కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ,శ్రీ వికాస భారతి స్కూల్ ,,ఓల్డేజి హోమ్ స్థాపక నిర్వాహకురాలు ,ప్రముఖ సామాజిక  సేవా కర్త  –హైదరాబాద్ -13కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళా వ్యక్తిత్వ వికాస రచయత్రి –విజయవాడ 14- శ్రీ మల్లంపల్లి విజయనీ మహా కాళేశ్వరావు-రిటైర్డ్ తెలుగు జూనియర్ లెక్చరర్ – కాకినాడ 15-డా.కోనేరు లక్ష్మీ ప్రమీల మొదలగువారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

నారాయణ కుమారుడైన చక్రపాణి దత్త 11వ శతాబ్ది సంస్కృతకవి .నరదత్త శిష్యుడు .లోధ్రవలీ కులీన బ్రాహ్మణ కుటుంబీకుడు .పశ్చిమబెంగాల్ భీర్భం నివాసి .ఇతని మాగ్నం ఓపస్ రచన ‘’శిక్షా సార సంగ్రహ ‘’లేక శిక్షా సమగ్రః అనే ఆయుర్వేదం పై ఒరిజినల్ గ్రంథం.శబ్ద చంద్రిక,ద్రవ్యగుణ సంగ్రహ ,చికిత్సాసార లేక గూఢ వాక్య బోధక ,సర్వ సార సంగ్రహ ఇతర రచనలు .చరక సుశ్రుతుల గ్రంథాలపై వరుసగా ఆయుర్వేద దీపిక ,భానుమతి అనే వ్యాఖ్యానాలు రాశాడు .

400-చంద్ర వ్యాకరణ కర్త -చంద్ర గోమిన్ (7వ శతాబ్ది )

7వ శతాబ్ది బెంగాల్ కవి చంద్ర గోమిన్ చంద్ర వ్యాకరణం రాశాడు .లోకానంద అనే నాటకం ,న్యాయ సిద్ధ్యాలోకం ,ఆర్య తారాదేవి స్తోత్ర మౌక్తికమాల ,కూడా ఇతని రచనలే .

401 –నిబంధ సంగ్రహ కర్త –దల్లాన (13వ శతాబ్ది )

దళ్బన ,దళ్హన అని కూడా పేర్లున్న దల్లాన 13వ శతాబ్ది ప్రముఖ వ్యాఖ్యాత .సూత్ర సంహితకు అమోఘమైన ‘’నిబంధ సంగ్రహ ‘’వ్యాఖ్యానం రాశాడు .అంకోల కు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి భరుపాల .

402-కుట్టానిమత కర్త –దామోదరగుప్త (8-9శతాబ్దం )

కామ కళాకేళీ గ్రంథమైన ‘’కుట్టాని మత ‘’ రాసినవాడు దామోదరగుప్త .క్రీ.శ.779-813కాలం కాశ్మీర రాజు జయాపీడుని మంత్రి అని కల్హణుడు రాజతరంగణిలో చెప్పాడు .

403-అవలోక వ్యాఖ్యాన కర్త –ధనిక (10వ శతాబ్దం )

ధను౦జయుని దశరూపకం పై ‘’అవలోక ‘’వ్యాఖ్యానం రాసిన ధనిక కవి  విష్ణు కుమారుడు. .10వ శతాబ్ది ఉత్పల దేవ రాజు  మంత్రి .కావ్య నిర్ణయం కూడా ఇతని రచనే అంటారు .ధనుంజయుని సోదరుడు అని కొందరంటారు .మరికొందరు ధనిక యే ధనుంజయుడు అన్నారు .

405-వాదగ్ధ ముఖ మండన కర్త –ధర్మ దాససూరి (13వ శతాబ్ది )

13వ శతాబ్దికి  చెందిన బౌద్ధకవి ధర్మ దాస సూరి .వాదగ్ధ ముఖ మండన అనే  ఛందో గ్రంథం  రాశాడు

406-పవన దూత కర్త –ధోయి (12-13శతాబ్ది )

12లేక 13వ శతాబ్ది బెంగాల్ రాజు లక్ష్మణ సేన ఆస్థానకవి ధోయి.ఇతనికే ధోయికా అనే పేరుకూడా ఉంది .బ్రాహ్మణుడని ,వైద్యుడని కొందరు అంటే చేనేత వాడని కొందరన్నారు .పవన దూత కావ్యం రాశాడని సదుక్తి కర్ణామృతం ,సుభాషిత ముక్తావళి ,సారంగధర పద్ధతిలో చెప్పబడినా అందులోని శ్లోకాలు అలభ్యం .

407-రసేంద్ర  చింతామణి కర్త –ధుందూక దత్త (15వ శతాబ్ది )

15వ శతాబ్దికి చెందిన ధుందూక దత్త ఆయుర్వేద వ్యాఖ్యానం ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు

408-చందోమంజరి కర్త –గంగాదాస (12వ శతాబ్ది )

12వ శతాబ్దికి చెందిన ఒరిస్సా కవి గంగాదాస చందోమంజరి అనే అలంకార గ్రంథంరచించాడు వైద్యగోపాలదాస ,సంతోష కుమారుడను అని కవే చెప్పుకొన్నాడు .తాను అచ్యుత చరిత ,కంసారి శతకం ,దినేశ శతకం కూడా రాశానని చెప్పాడు .

409-ఘట కర్పర కావ్య కర్త –ఘట కర్పర (105 బి.సి.)

క్రీపూ 105కు చెందిన విక్రమాదిత్య మహారాజు ఆస్థాన కవులైన నవరత్న కవులలో ఘట కర్పర ఒకరు.ఘటకర్పర అనే కావ్యం రాశాడు .ఇది 22శ్లోకాల సందేశ కావ్యం కొత్తగా  పెళ్ళైనవాడు భార్యకు పంపిన సందేశమే ఇతి వృత్తం .యమకాలతో కావ్యమంతా నింపేశాడు .

410-హరిభక్తి విలాస కావ్యకర్త –గోపాల భట్ట (1503-1578)

బెంగాల్ లోప్రముఖ  వైష్ణవ మత ప్రచారకులైన ఆరుగురు బృందావన గోస్వాములలో ఒకరైన గోపాలభట్ట బెంగాల్ కుచెందినవాడు .1503లో జన్మించి 75ఏళ్ళు జీవించి 1578లో మరణించాడు ,చైతన్య స్వామి శిష్యుడు .హరిభక్తివిలాసం  అనే ప్రముఖ రచన చేశాడు దీనిలో వైష్ణవులు  సామాజిక మత ధర్మాలను ఎలా నిర్వహించాలోసాధికారంగా రచించాడు వారికి ఇది కరదీపిక .సత్క్రియా సార దీపిక కూడా ఈయన రచనే అని అంటారు  .

మనవి – ఇప్పటివరకు నేను రాసి ,సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ౦   మూడు భాగాలలో 146+482+462=1090మంది సంస్కృత కవుల గురించి రాశాను .అంతర్జాలం లో రాస్తున్న ఈ నాలుగవ భాగం లో ఇప్పటికి 410మంది గీర్వాణ కవుల పై రాశాను .అంటే మొత్తం 1500మంది గీర్వాణ కవులపై రాసే అదృష్టం దక్కింది .కానీ ఇంకా చాలామంది ఉన్నారు .కనుక ప్రస్తుతం గీర్వాణం-4 కు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,మళ్ళీ వీలువెంట రాసేఅవకాశం తీసుకొంటానని సాహితీ బంధువులకు సవినయంగా తెలియ జేస్తున్నాను .

సశేషం

రేపు ప్రారంభమయ్యే  పవిత్ర మాఘమాసం  శుభాకాంక్షలు

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

సంపాదకుడు రచయిత,అనువాదకుడు కే .రామచంద్ర శర్మజనన వివరాలు తెలియదు .ఆయన ముఖ్య రచనలు 1-రామపనివాద వ్యాఖ్యానం తో వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశ 2-పౌస్కరాగమ 3-విరాట పర్వ మణిప్రవాళ మంజరి 4-యాజ్ఞికోపనిషద్వివరణం  5-సర్వజ్ఞోత్తమ రామః 6-అలంకార సంగ్రహః 7-డిస్క్రిప్టివ్ కేటలాగ్ ఆఫ్ తమిల్ మాన్యు స్క్రిప్ట్స్ 8-ది మెసేజ్ ఆఫ్ సెయింట్ తయామన్వార్  .

398-అర్వాచీన సంస్కృతం కర్త –రమాకాంత శుక్లా (1940)

1940లో ఉత్తరప్రదేశ్ ఖుర్జా లో జన్మించిన రమాకాంత శుక్లా తలిదంద్రులు సాహిత్యాచార్య పండిత బ్రహ్మానంద  శుక్లా శ్రీమతి ప్రియంవద శుక్లా లనుంచి  సంస్కృతం నేర్చాడు .సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగ  ఆచార్య డిగ్రీలు పొంది ,ఆగ్రా యూని వర్సిటిలో చేరి హిందీ ఎం.ఏ.గోల్డ్ మెడల్ తో  పాసై ,సంపూర్ణానంద యూనివర్సిటి నుంచి సంస్కృత ఎం.ఏ.పొందాడు .జైనా చార్య రవి సేన రచించిన పద్మపురాణం -తులసీ దాసు రాసిన రామచరిత మానసం ల తులనాత్మక పరిశోధన చేసి 1967లో పిహెచ్ డి సాధించాడు .

  మోడీ నగర్ లోని ముల్తానిమల్ మోడీ పిజి  కాలేజి లో 1962లో హిందీ లెక్చరర్ గా చేరి ,తర్వాత  ఢిల్లీ యూనివర్సిటిలోని రాజధాని కాలేజి లో హిందీ ఫాకల్టి  మెంబరయ్యాడు  .1986లో రీడర్ అయి ,2006లో రిటైరయ్యాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనం తో సహా చాలా సెమినార్ లకు  కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాడు .’’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ ఈస్తెటిక్స్ అండ్ పోయెట్రి ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కు అధ్యక్షత వహించాడు .’’అర్వాచీన సంస్కృతం ‘’అనే త్రైమాస పత్రిఅకు ముఖ్య స౦పాదకుడు గా ఉన్నాడు.ఈ పత్రిక ఆయనే ఢిల్లీ లో స్థాపించిన ‘’దేవవాణి’’పరిషత్ ఆధ్వర్యం లో వెలువడేది .రేడియోలో సర్వభాషా కవిసమ్మేళన లో సంస్కృత కవిగా పాల్గొన్నాడు .

  దూర దర్శన్ ప్రసారం చేసిన ‘’భాటీ మే భారతం ‘’అనే సంస్కృత సీరియల్ రాశాడు శుక్లా ఆయన జీవితం సంస్కృత సేవ పై  ‘’దేవవాణి సుయశః ‘’అనే ప్రత్యేకక సంచిక వెలువడింది . అర్వాచీన సంస్కృతం ,సారస్వత సంగమ౦,భారత జ్ఞానతాహం అనే రచనలు చేశాడు .ప్రస్తుతం ఢిల్లీ లోని రాష్ట్రీయ  సంస్కృత సంస్థాన్ ‘’లో ‘’శాస్త్ర చూడామణి విద్వాన్ ‘’గా సేవలందిస్తున్నాడు .

   శుక్లా సంస్కృత ,హిందీ భాషా పాండిత్యం కు తగిన సంస్కృత రాష్ట్ర (జాతీయ )కవి ,కవి రత్న ,కవి శిరోమణి ,హిందీ –సంస్కృత సేతు బిరుదులు  పొందాడు .కాళిదాస సమ్మాన్ ,సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్ అందుకొన్నాడు .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారం అందజేసింది .ఢిల్లీ సంస్కృత అకాడెమి  ‘’అఖిల భారతీయ మౌలిక సంస్కృత రచనా పురస్కారం ‘’అందించి గౌరవించి సత్కరించింది .2009లో భారత రాష్ట్ర పతి’’సంస్కృత విద్వాంస ‘’పురస్కారం ఇచ్చారు .2013 భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .’’ భారతీయ ప్రకార సంఘం ‘’కు శుక్లా వ్యవస్థాపక అధ్యక్షుడు .2018లో శుక్లా రచించిన ‘’మమ జనని ‘’పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది .

image.png

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

 కృష్ణా జిల్లా జగ్గయ్య పేట లో ఆంధ్రోపన్యాసకులుగా చేసి రిటైరైన  డా.శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి ,జాతీయ ,అంతర్జాతీయ సదస్సులలో 65దాకా విశ్లేషణాత్మక పత్రాలు రాసి సమర్పించిన విద్వన్మణి.’’రమణాయన కావ్య రమణీయం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ డిఅందుకొన్నారు .శ్రీ ఆంజనేయ శతకం ,శ్రీ గాయత్రి మాతృ ద్విశతి ,దేశభాష లందు తెలుగు లెస్స సంకలనం తో సాహితీలోకం లో  సుప్రసిద్ధులు .ఇప్పుడు తాజాగా2018 డిసెంబర్ లో  ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’వచన రచన చేసి ఆ మాతపై తమకున్న భక్తిప్రపత్తులను చాటుకొని ,.చాలాకాలంగా సాహితీ మిత్రులైన శాస్త్రి గారు నాకు సుమారు 20 రోజులక్రితం దానిని పంపారు .చదవటానికి ఇప్పటికి కుదిరి చదివి ఆనందించాను .వీరి జ్ఞాన సంపత్తికి డా .రామడుకు వేంకటేశ్వర శర్మగారు ‘’జ్ఞానాభి షేకం ‘’చేస్తే ,మహాకవి శేఖరులు శ్రీ భారత శ్రీమన్నారాయణ ‘’చిదంబర ప్రశస్తి ‘’చేసి చిదంబర విజ్ఞాన రహస్యం బయట పెట్టారు .శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్యులు అభినందన కంఠహారం-గ్రైవేయకం సమర్పించారు .స్మార్త క్రమాంత విశిష్ట స్వాధ్యాయి శ్రీ జగర్ల పూడి వీరభద్ర శర్మ ‘’జ్ఞాన యజ్ఞం ‘’గా శాస్త్రి గారి కృషిని అభివర్ణించారు .శాస్త్రి గారు’’ ఒక్క మాట ‘’లో సూర్యుడున్న చోట చీకటి ఉండనట్లే సనాతన ధర్మమున్న చోట దుఖ౦ ఉండదని  ,బ్రహ్మ సమానమైన దేవుడు ,బ్రహ్మ సమానమైన గురువు , బ్రహ్మ సమానమైన తపం లేదని భావిష్యపురాణ౦ చెప్పిందనీ కనుక గాయత్రీ మంత్రం బ్రహ్మ సమానమైనదని చెప్పారు .ఇప్పుడు గ్రంథంలోని కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుంచుతున్నాను .

  ‘’సూర్యుడు ,నక్షత్రాలు లేని ఆహోరాత్రాలమధ్య సందికాలాన్ని సంధ్య అంటారు ఇదికాలవాచకమే అయినా ,ఉపాస్య దేవత గా ఆరాధించాలి .అని చెప్పి గాయత్రి ఆవిర్భావ కథ తెలిపి ,’’యా వసేత్ ప్రాణి జిహ్వాసు సదా వాగుపవర్తనాత్-సరస్వతీతి నామ్నేయం సమాఖ్యాతా మహర్షి భిః’’అంటే జీవరాసులలో వాక్కు ఉన్నవారి నాలుక కొనపై నర్తించేది సరస్వతి అని ఋషులు చెప్పారని తెలియజేశారు .తర్వాత గాయత్రి విశిష్టతను చెబుతూ ముక్తినిచ్చే 6 గయలలో గాయత్రి కూడా ఒకటన్నారు .పరమేశ్వరుని ముఖం నుండి వెలువడిన మొదటి ఛందస్సు గాయత్రి .గానం చేస్తే రక్షించేదీ,గయ అనబడే ప్రాణాల్ని కాపాడేదీ,ఆరాధిస్తే మనస్సుకు ప్రశా౦తినిచ్చేదీ గాయత్రి అన్నారు .ఋగ్వేద ,అధర్వ వేద ,శతపథ బ్రాహ్మణ ,సూత సంహిత ,బృహదారణ్య  ఛాందోగ్య  నారాయణ ,నృసింహ పూర్వతాపి ,మైత్రాయణి, ఉపనిషత్ లలో నిర్వచి౦ప బడిన గాయత్రిని బహు శ్రమ కోర్చి వెలికి తీసి ముందుంచారు .బృహద్యోగి యాజ్ఞవల్క్యం ,విశ్వామిత్ర స్మృతి ,మను స్మృతి,స౦వర్త  ,యాజ్ఞవల్క్య ,హరీత, పరాశర,శంఖ ,స్మృతులలో ఉన్నగాయత్రినీ ,పద్మ ,కూర్మ అగ్ని ,మత్స్య,భవిష్య ,నారద పురాణాలలో  చెప్పబడిన గాయత్రిని ,సంధ్యా భాష్యం,మహాభారతం భగవద్గీత ,భాగవత గాయత్రినీ వివారించారు .శ్రీ వాసా సూర్యనారాయణ ,శ్రీ శేషావతారం గార్లు  చేసిన గాయత్రీ స్తుతి ,శ్రీనాథుని కాశీఖండ గాయత్రి ని వివరించి ,బ్రాహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్యగారు శ్రీనాథుని  సీసానికి చెప్పిన వివరణ ఇచ్చారు –‘’గాయత్రీ దేవికి మూడు వేదాలు మూడుపాదాలు,భూమి ఆకాశం నాలుగు దిక్కులు కలిసి ఆరు కుక్షులు ,సమస్త భవనం శరీరం ,స్వర్గమే పొట్ట ,ధర్మశాస్త్రం హృదయకోశం .ఛందస్సమితి స్తనద్వయం .ఈశ్వర నిరీశ్వర సాంఖ్యాలు రెండూ రెండు చెవులు .అగ్ని ముఖం .శిక్షా, వ్యాకరణ, నిరుక్త,జ్యోతిష ,కల్పాలు అయిదూ అయిదు తలలు  ,అధర్వణ వేదం చేస్ట,శిఖ శివుడు.  బ్రహ్మ శిరస్సు .విష్ణువు ఆత్మ ,.భావ లక్షణం తటస్థ లక్షణం .  పూర్వ మీమాంస స్థూల శరీరం ,వేదాంత శాస్త్రం సూక్ష్మ శరీరం .

   ఇలామనకు తెలిసినా, తెలీని అనేక విషయాలు తరచి రాసిన పుస్తకం .తర్వాత గాయత్రీ మంత్రాని శబ్దగత అర్ధం మంత్రాధి దేవతలు ,మంత్రాక్షర వర్ణాలు ,ఛందస్సులు బీజాక్షరాలు  ,తత్వాలు ,ఋషులు , కళలు ,,దేవీశక్తులు ,మంత్రాక్షర అవతారాలు ,సత్ ప్రవృత్తులు ,సిద్ధులు ,విద్యలు ,మాతృకలు ,కూడా సవివరంగా తెలిపారు .గాయత్రీ మంత్రం లో 24అక్షరాలకు 24 స్త్రీ ,పురుష దైవీ శక్తులున్నాయని వాటినీ వివరించారు .గాయత్రీ మంత్ర జపాన్ని  పది సార్లు ,28సార్లు ,108సార్లు ,వెయ్యిన్నూట ఎనిమిది సార్లు శక్తి ననుసరించి చేయాలి .

   పిమ్మట గాయత్రి మంత్ర హోమ విధానం ,గాయత్రీ మంత్ర మహిమ తెలిపే వృత్తాంత గాధలు చెప్పి గాయత్రీ మాహాత్మ్యాన్ని గురించి వేదవ్యాసుని దగ్గరనుంచి ,మహర్షులు ,జగద్గురు శంకరాచార్య ,రమణమహర్షి ,స్వామి శివానంద ,రామకృష్ణ పరమహంస ,స్వామి వివేకానంద ,అరవి౦దయోగి, గాంధీజీ ,  రవీంద్ర, తిలక్ ,మాలవ్యా దయానంద సరస్వతి,సర్ మోనియర్ విలియం దాకా ప్రస్తుతి౦చిన విషయాలు చెప్పి  చివరికి ఫలశ్రుతి చెబుతూ గాయత్రీ మంత్ర జపం చేసిన చోట అగ్ని జల,వాయు  పిశాచ సర్ప  భయం ఉండదని భరోసా తో ముగించారు .

  ఒక రకంగా డా సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారి ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’ఆల్ ఇన్ వన్ లేక ‘’గాయత్రీ విజ్ఞాన సర్వస్వం ‘’అని  ఢంకాపథంగా చెప్పవచ్చు .దీన్ని వారి గురు పాదులు స్వర్గీయ బ్రహ్మశ్రీ భాగవతుల సంజీవ శాస్త్రి గారికి అ౦కితమివ్వటం శాస్త్రిగారి గురుభక్తికి తార్కాణ.ఇంత విలువైన గ్రంథాన్నికీ.శే.శ్రీమతివేముల రాజ్యలక్ష్మి ,శ్రీ రాఘవరావు దంపతుల స్మృత్యర్ధం వారికుమారులు  ,కోడళ్ళు కీ.శే .వేముల సాంబశివరావు శ్రీమతి పద్మావతి దంపతులు ,శ్రీ వేముల నగేష్ ,శ్రీమతి స్వాతి దంపతులు ఆర్దికసాయమందించి ప్రచురించినందుకు అభినందనలు  .కీర్తి శేషులను అక్షరాలతో నిజంగా కీర్తి శేషుల్ని చేశారు .శ్రీ గాయత్రి మాత ఆ కుటుంబాలకు సర్వదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను  

     ‘’చిదంబర రహస్యం’’గా ఉన్న గాయత్రీ మాహాత్మ్యాన్ని శ్రీ చిదంబర శాస్త్రి గారు కరతలామలకం చేసినందుకు అభినదిస్తూ మరిన్ని ఆర్ష విద్యా గ్రంథాలు వారి నుండి వెలువడాలని ఆశిస్తున్నాను .

   ‘’త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీచ సరస్వతీ –బ్రాహ్మీచ వైష్ణవీ రౌద్రీ రక్తాశ్వేతా సితే తరా’’

‘’కమలా విష్ణు లోకే చ , గాయత్రీ బ్రహ్మలోక దా-రుద్ర లోక స్థితా గౌరీ హరార్ధాంగ నివాసినీ ‘’

గాయత్రీం చి౦తయేద్యస్తు హృత్పద్మేసముపస్థితం –ధర్మా ధర్మ వినిర్ముక్తః తయాతి పరమా౦  గతిం ‘’

‘’కర కమలంబుల యందున –వర వేద కమండలములు భాసిలు చుండన్ –శిరమున ఖండేందునితో –వరలెడి గాయత్రి !నీకు వందన శతముల్ ‘’

సుందరమైన ముఖ చిత్రాలతో ,పాల నురగవంటి తెల్లకాగితాలపై  207పేజీల అత్యంత విలువైన సమాచారం తో ఉన్న   ఈ గ్రంథాన్ని పొందటానికి మూల్యం –కేవలం శ్రీ గాయత్రీ ధ్యానమే .అంటే ఉచితంగా పొందవచ్చు .కావలసినవారు శాస్త్రి గారి ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి –

 డా.సర్వా సీతారామ చిదంబర శాస్త్రి –అక్షర భారతి కాన్సెప్ట్ స్కూల్ –పాత కోర్టు భవనం –వినాయకుడి గుడి దగ్గర –జగ్గయ్య పేట 521175 –కృష్ణా జిల్లా

సెల్ –9885383741

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు .

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

15-2-1949న రాధా వల్లభ త్రిపాఠీ జన్మించి ,1970 సంస్కృత ఎం.ఏ.లో గోల్డ్ మెడల్ సాధించి ,పి.హె.డి. పొంది,1981లో డి. లిట్ .అయ్యాడు  .మధ్య ప్రదేశ్ సాగర్ లోని డా.హరి సింగ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా చేరి 1983-2014వరకు పని చేసి ,2008-2013లో ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా పని చేసి ,సిమ్లాలోని ఇండియన్  ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్   అడ్వాన్స్ డ్ స్టడి ఫెలో అయ్యాడు .త్రిపాఠీ అభిమాన విషయాలు నాట్య శాస్త్రం ,సాహిత్య శాస్త్రం .

38 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యు ఏట్ క్లాసులు బోధించిన ,25ఏళ్ళు పిజి యూనివర్సిటి   సంస్కృత డిపార్ట్ మెంట్  హెడ్ గా ,6ఏళ్ళు డీన్ గా ,5ఏళ్ళకు పైగా వైస్ చాన్సలర్ ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా మరొక అయిదేళ్లకు పైన పని చేసిన అనుభవం త్రిపాఠీ ది.38ఏళ్ళు రిసెర్చ్ గైడ్ గా 50మందికి పిహెచ్ డిలు రావటానికి తోడ్పడిన మార్గదర్శి .

నాట్య శాస్త్ర   విజ్ఞాన సర్వస్వం 4భాగాలు ప్రచురించిన శేముషీ సంపన్నుడు త్రిపాఠీ.కోల్పోయిన నాట్య శాస్త్ర విషయాలను క్రోడీకరించి మోనోగ్రాఫ్ లు గా ప్రచురించిన ప్రతిభా సంపన్నుడు .సంస్కృత నాటకం ,జానపద నాటకరంగం లపై అనేక ప్రాజెక్ట్ లు నిర్వహించి ప్రచురించిన కళాభిమాని .

త్రిపాఠీ కి ఉన్న అపార అనుభవం వలన ఆయనను ఎన్నో ప్రధాన ప్రసిద్ధ పదవులు వరించాయి .1-డీన్ ఆఫ్ ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ ,2-మద్యప్రదేశ యూని వర్సిటి రిసెర్చ్ జర్నల్ ఎడిటర్ 3-సాగర్ యూనివర్సిటి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ మెంబర్ 4-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ సాంస్క్రిట్ కు చైర్మన్ 5-ఇంటర్నల్ క్వాలిటి అస్స్యూరెన్స్ చైర్మన్ ,6-సంస్కృత పాఠ్య     పుస్తకాల కమిటీ ముఖ్య సలహాదారు 7-కేంద్ర సాహిత్య అకాడెమీ ఎక్సి క్యూటివ్ మెంబర్ 8-N.C.E.R.T. సంస్కృత కర్రిక్యులం చైర్మన్ ,9-అనేక యూని వర్సిటీల ‘’నాక్ ‘’పీర్ టీం చైర్మన్ .

త్రిపాఠీ  విజ్ఞాన  సంపన్నతకు తగిన బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్నాడు

1-సంస్కృత సాహిత్య అవార్డ్ 2-బెస్ట్ రిసెర్చ్ పేపర్ అవార్డ్ 3-రాజ శేఖర అవార్డ్ 4-నాటక రచనకు సాహిత్య కళా పరిషత్ అవార్డ్ 5-బెస్ట్ రిసెర్చ్ పబ్లికేషన్ అవార్డ్ 6-వ్యాస పురస్కారం 7-వి వి .కాణే స్మారక పురస్కారం 8-భోజ పురస్కారం 9-కంబన్ సమ్మాన్ హిందీ అకాడెమి అవార్డ్ 10-వాగీశ్వరి అవార్డ్ 11-కాళిదాస సమ్మాన్  రెండు సార్లు 12-కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ 13-రామ కృష్ణ సంస్కృత పురస్కారం 14-కేకే బిర్లా శంకర్ అవార్డ్ 15-సంస్కృత మహామహోపాధ్యాయ బిరుదు 16-నాట్యాయన సంస్థ చే భవభూతి అవార్డ్ 17-సంస్కృత గౌరవ సమ్మాన్ 18-జాతీయ వేదం వ్యాస పురస్కారం 19-5వమహా కవి  కాళి దాస సంస్కృత జీవన్ వ్రతి అవార్డ్ 20-5వ జయదేవ సరస్వతి అవార్డ్ 21-సంస్కృత శిరోమణి సమ్మాన్ 22-మహా రాష్ట్ర ప్రభుత్వం చేత జీవన్ వ్రతి సంస్కృత సమ్మాన్ 23-పూనా యూని వర్సిటి నుంచి గౌరవ డాక్టరేట్ 24-రాజప్రభ పురస్కార 25-పండితరాజ జగన్నాథ పురస్కార 26-ఆచార్య సుమతీ సాగర్ స్మృతి అవార్డ్ 27-మీరా సమ్మాన్ 28-సమంతర్ సమ్మాన్ 29-అఖిలభారత అంబికా దత్త వ్యాస పురస్కార 30-శ్రీమతి చంద్రావతి జోషి సంస్కృత భాషా పురస్కార్31-నాట్య శాస్త్ర కళానిధి పురస్కారం .

ఈ మహా మహోపాధ్యాయ రచనలపై ఏడుగురు పరిశోధన చేసి గ్రంధాలు వెలువరించి ఆయన కీర్తిని మరింత పెంచారు .

రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా ఉంటూ ఖాళీ పోస్ట్ లను రిక్రూట్ మెంట్ ద్వారాభర్తీ చేశి ,అనేకమందికి ప్రమోషన్లు ఇచ్చి ,సంస్థను ఏ గ్రేడ్ స్థాయి సాధించాడు .ముక్త అధ్యాయ అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ విధానం ప్రవేశ పెట్టి ,23కాంపస్ లు ,23సంస్కృత మహా విద్యాలయాలు స్థాపించాడు .మూడు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు, పది జాతీయ సమావేశాలు  నిర్వహించాడు . అనేక జాతీయ ,అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు సెమినార్ లకు స్పాన్సర్ గా ఉన్నాడు .15 వ అంతర్జాతీయ సమావేశం న్యు ఢిల్లీ లోని విజ్ఞాన భవన్ లో2012లో 6రోజులు  జనవరి 6నుంచి 10వరకు  జరిపి ,పారిస్ లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఏర్పాటు చేయించాడు .

లక్నోలో పాళీ భాషకు రిసెర్చ్ సెంటర్ ,జైపూర్ లో ప్రాకృతభాషకు రిసెర్చ్ సెంటర్ ,సంస్కృత పాళీ ,ప్రాకృత భాషల తులనాత్మక అధ్యయనానికి’’ వాజ్మయి ‘’ సెంటర్ ,హిమాచల్ ప్రదేశ్ బలహార్ లో వుమెన్స్ స్టడీ సెంటర్ ,ముంబై లో సెంటర్ ఫర్ వొకేషనల్ స్టడీస్ ,భోపాల్ లో నాట్య శాస్త్రానికి స్టడీస్ సెంటర్ , శృంగేరిలో ఇండీజినస్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు అయ్యాయాయంటే అదంతా డా రాధా వల్లభ త్రిపాఠీ అకుంఠిత దీక్షా ,శ్రమ ఫలితమే .

ఇంతటి విద్యా వినయ సంపన్నుడు ,నిత్య కృషీవలుడు ,నాట్య, సాహిత్య  శేముషీ దురంధరుడు , అయిన డా .రాధా వల్లభ త్రిపాఠీ సాధించిన విజయ పరంపర భారత సంస్కృత క్షేత్రం లో శాశ్వత కీర్తి నార్జించి పెట్టాయి .లాంగ్ లివ్ త్రిపాఠీ.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు.

అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా మనియర్ విలియంస్ అను మహాశయుడు స్ఫోటసందర్భమున నిట్లు వ్రాసినాడు

” The eternal and imperceptible element of sound or words and the real vehicle of idea which bursts or flashes on the mind when a sound is uttered”.

కక్షీరపర్వతముపై ఓశిజ నామము గల ఒక యోగి నిజగ్రంథమున శబ్దమున కుండెడి అర్ధప్రకాశకశక్తి విశేషమును ప్రపంచించి, దానికి స్ఫోటమని పేరిడినాడు. ఈనుతన నామము వలన అతనికి స్ఫోటాయనుడను పేరు ప్రసిద్ధమయినది. అతడు పాణిని కెంత ముదరివాడో తెలియదు. వ్యాసభగవానునకు తరువాతి వాడు మాత్రము అగును. మహాభారతము న స్ఫోట శబ్దము కనబడదు. కాని వ్యాసభాష్యమున స్ఫోటతాత్పర్యము విహితమగుటచే స్ఫోటాయనుడు వ్యాసుడు తరువాతివాడని చెప్పవచ్చును.

వ్యాసభాష్యము వేదవ్యాస ప్రణీతము (వ్రాయబడిన) కాదనియు, మహాభాష్యప్రవర్తి అనియు చాలమంది అంటారు.

“Yoga system of Patanjali” అను గ్రంథ భూమికలో Haughton Woods, “There is little room to doubt that Varshaganya was an older contemporary of Vasubandhu”. అని వ్రాసినాడు. Professor Takakusu అను జపనీసు విద్వాంసుడు వసుబంధు క్రీ.శ. 5,6శతాబ్దములలోని వాడని నిర్ద్ధారణచేసాడు. కావున వ్యాసభాష్యము 5 వ శతాబ్దానికి ముందులేదని చెప్పవచ్చును.

స్ఫోట వాదము

స్ఫోట వాదము చాలా సనాతనమైనది. వాగ్దేవిని గూర్చిన స్తోత్రాలు ఋగ్వేదంలోనే కనిపిస్తాయి. అయినా వ్యాకరణ సాంప్రదాయం ప్రకారం స్ఫోట వాదానికి మూలపురుషుడు స్ఫోటాయనమహర్షి. భర్తృహరి, నాగేశభట్టు, మండవ మిశ్రుడు మొదలైనవారు ఈవాదాన్ని ప్రపంచించినవారు.

నిత్యమైన స్ఫోట, లేక శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ. పరా పశ్యంతీదశలలోని శబ్దాన్ని ఎవరో యోగులు తప్ప మన సాధరణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేమన్నారు. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చట. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.

పరావాక్కు నిత్యతత్త్వం; శబ్దబ్రహ్మ మూలాధార చక్రంలోని కుండలిని దానిస్థానం. దీనినే ‘నాదం’ అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డుదగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో ఉంటుంది. ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోట. హృదయ ప్రదేశంలోని అవాహత చక్రం మధ్యమా వాక్కు నెలవు. ఇది అంతర స్ఫోట. కంఠప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యస్ఫోట.

సర్వదర్శన సంగ్రహంలో పాణినీయదర్శనాన్ని వివరిస్తూ మాధవాచార్యస్వామి అంటాడు: “స్ఫోట అనబడే ఈ శబ్దం విభాగాలులేనిది; నిరవయవం; నిత్యమైంది; జగత్తు పుట్టుకకు కారణమైంది. నిజానికి ఇది బ్రహ్మపదార్ధమే!”. భర్తృహరీ బ్రహ్మకాండలో ఇదేమాట అన్నాడు.

”’ఆకాశం”’ అనగానే ఎత్తుగా నీలంగా, భూమిమీద బోర్లించిన కోళ్ళగంపలాగా కనిపించేదీ, మబ్బులకూ సూర్యచంద్రులకూ ఆధారంగా ఉన్నట్టు అనిపించేదీ మనకు స్ఫురిస్తేనే ఆమాట అర్ధమయినట్టు అనుకుంటున్నాము. ఇలా ఏశబ్దం తీసుకున్నా ఆశబ్దార్ధం వాక్యరూపంగానే మనకు స్ఫురిస్తున్నట్లు తేలుతుంది.

ఒకభాషలోని ఒకమాట ఆభాషతెలిసిన వ్యక్తి మనస్సులో ఒక అర్ధాన్ని, తెలియనివ్యక్తి మనస్సులో మరోఅర్ధాన్ని స్ఫురింపజేయగలదు.ఉదాహరణకి ”’కాఫీ”’ అనేమాట దక్షిణాదివారి మనస్సులో కఫీపానీయాన్ని స్ఫురింపజేస్తే హిందీ మాతృభాషగా గల ఉత్తరాదివారికి చాలు అనే అర్ధాన్ని బోధించవచ్చును.

ఇలాఒకేమాట వేరువేరుభాషల్లో వేరువేరు అర్ధాలని బోధించగల్గినట్లు, మానవులందరిలోనూ స్వతసిద్ధంగా ఒండే స్ఫోట ఏకరూపమే! ఒకేవ్యక్తికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ వచ్చుననుకోండీ అప్పుడు ”’మనిషి”’ అన్నా man, అన్నా ఆద్మీ అన్నా అతనిమనస్సులో అభివ్యక్తమయ్యే స్ఫోటఏకరూపమే.

దీనినిబట్టి, మానవైంద్రియాదిశక్తులచేత పరిమితమై మానవుడి జననంతోపాటే అతడు గ్రహించదగిన జ్ఞానరాశిఅంతా సూక్ష్మరూపంలో అతడిలో సన్నద్దమై ఉంటుందనీ, అదే స్ఫోట అనీ తేలుతుంది. అందుకే స్ఫోట నిత్యం అన్నారు. అలా సన్నద్ధమై ఉన్న జ్ఞానాన్ని అభివ్యక్తం చేసే పరికరాలే భాషలోని శబ్దాలన్నీ. ఒక చీకటికొట్లో ఎన్నోవస్తువులండవచ్చును టార్చిలైటు దేనిమీద వేస్తే ఆవస్తువునే కనిపిస్తుంది. ఆసంగతి బాగా తెలుస్తుంది. స్ఫోటని మనం సంపూర్ణంగా నిర్వచించలేకపోయినా అది మనందరి నిత్యానుభవంలోనూ ఉన్నదే! ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మరొకడు అర్ధం చేసుకొన్న ప్రతిసందర్భం లోను స్ఫోట పనిచేస్తూనే ఉంది. ఈస్ఫోట లోపించడం మూలానే మరమనిషికి ఏదిపడితే అదిమాట్లాడగలదు ఏదిమాట్లాడినా బోధపరచుకోగలగడం సాధ్యంకాలేదు.

వైయా కరణాంగీ కృతమగు వాదమునకే స్ఫోట వాదము ని పేరు. ఈ స్ఫోట వాదము పాణినికి ముందున్నదో లేదో చెప్పటము కష్టము.స్ఫోటాయనుడను పేరు పాణినీయమున ఉంది.ఈతడే స్ఫోట వాదమునకు కర్త. స్ఫుటత్యర్ధో స్మాదితి స్ఫోటః దీని వలన అర్ధము స్ఫుటమగును కావున స్ఫోటమనియు తెలియును.వాక్కును పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కును విభజించిరి.పరావాక్కు మూల చక్రస్థము, పశ్యంతి నాభి సంస్థితము.ఈరెండును యోగులకే అనుభవనీయము.హృదయ దేశమందలి వాక్కు మధ్యమ అనబడును.కంఠదేశమందలి వాక్కు వైఖరీ వాక్కు.ఈ మధ్యమ వాక్కునకే స్ఫోట శబ్దమని వ్యవహారము.ఇది నిత్యము, అఖండము, అవికారము, అచలము ఇదే బ్రహ్మ స్వరూపము.ఈ సిద్ధాంతులకే స్ఫోట బ్రహ్మవాదులని లేదా శబ్ద బ్రహ్మ వాదులని పేరు. వీరు శబ్దమునే బ్రహ్మముగా భావింతురు.మనము శ్రవణేంద్రియముచే గ్రహించు శబ్దముకాక, దానిచే అభివ్యక్తమై బుద్ధినిష్టమగు శబ్దమే స్ఫోటము.అదియే అర్ధమును ప్రకాశింపజేయును.అది నిత్యము.అది పదరూపమున కాని, వాక్య రూపమునకాని యుండును.వాక్యస్ఫోటమె ముఖ్య సిద్ధాంతము.

భర్తృహరి ముఖ్యముగా ప్రతిపాదించిన వాక్యజాతి స్ఫోట. అయినను తరువాతి వైయాకరణుల అష్ట విధములగు స్ఫోటల నీరీతిగా నిరూపించిరి. వర్ణములను మాత్రలుగను, పదములను ప్రకృతి ప్రత్యయములనుగాను, వాక్యమును పదములుగాను విభజించి అర్ధములేర్పరుచుట వ్యాకరణ శాస్త్రమునకు సంబంధించిన విషయము.వ్యవహారము ఉపయుక్తములగు పదములకు అఖండ పదస్ఫోటను కొందరు పేర్కొనిరి.ఏమైనను నవ్యులు అఖండ స్ఫోటమే ముఖ్యమందురు.ప్రాచీనులు వాక్యజాతి స్ఫోట ముఖ్యమని భావింతురు.వ్యక్తిస్ఫోట, జాతిస్ఫోటయను విభేదమును గూర్చి చాల వివాదము ఉంది. ప్రాచీన వైయాకరణులు జాతి స్ఫోట వాదులని, నవీన వైయాకరణులు వ్యక్తి స్ఫోట వాదులని ప్రసిద్ధి. భర్తృహరి జాతి స్ఫోటనే ప్రతిపాదించి బలపరిచెను.జాతి స్ఫోట తాత్వికముగా ఉన్నా ఆచరణయోగ్యము కాదని నవీనుల అభిప్రాయము.వ్యక్తి మూలముననే జాతి గ్రహింపబడును.వ్యక్తులన్నింటి యందుండు సమాన ధర్మమే జాతి.అందువలన చివరకు ఆధునిక విమర్సకులు వ్యక్తి జాతి స్ఫోటలు రెండును అవినాభావములని నిర్ణయించిరి.

పాశ్చాత్యదర్శన మనశాస్త్రాలలో స్ఫోటవాదంతో పోలికలు ఉన్నటు అనిపించే కొన్ని భావాలను మనం గుర్తించవచ్చును. గ్రీకుల ”’లాగాస్”’ (logos) కాంట్ ప్రతిపాదించిన కారణాత్పూర్వజ్ఞాన సిద్ధాంతం (apriori) మనశాస్త్రంలోని-స్ఫురణ (intuition) వంటివి. ప్లేటొ లాగాస్ ప్రంచానికి మూలరూపం అన్నాడు.అంటే లాగాస్ నుంచే ప్రపంచం అంతా వచ్చిందని. ఫైలో (philo) దేవుడికీ, ప్రపంచానికీ మధ్య అనుసంధానం కలిగించేది లాగాస్ అన్నాడు.హొరక్లైటస్ (Heraclitus) భౌతిక జగత్తునంతటనీ లాగాస్ ద్వారానే మనం గ్రహిస్తున్నామన్నాడు.

                         ఆధారం -1948భారతి మాసపత్రికలో శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు ,1963భారతి లో శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తం గారు రాసిన   ‘’స్ఫోట వాదం ‘’ ఆధారంగా వీకీ పీడియాలో వచ్చిన వ్యాసం .

393-కాశ కృత్స్న వ్యాకరణ కర్త –కాశ క్రుత్స్నుడు –(4వ శతాబ్దికి పూర్వం )

కాశకృత్స్న వ్యాకరణము అనునది సంస్కృత వ్యాకరణం.[1].

దానిని రచించినది కాశకృత్స్నుడో, కాశకృత్స్నియో. కవి కల్పద్రువ కాలము నందు బోపదేవగోస్వామి కాశకృత్స్నుడు ఆదిశాబ్దికుడని వ్రాసినాడు. కాశకృత్స్నుడు మీమాంసకుడని ప్రసిద్ధి. కాతీయసూత్రమునందు యాజ్నవల్క్య పుత్రుడు కాత్యాయనుడును, మహాభాష్యమున (4-1-14) పతంజలి డు ఇతనిని మీమాంసకుడని అన్నారు. కాశకృత్స్నుడే వ్యాకరణకర్త అని చెప్పవచును[2]అష్టాధ్యాయి యందు ఇతని నామము కనబడకున్నను ఈతడు పాణిని కి తరువాతి వాడు కాడు. పారాశర్యశిలాలిభ్యాం భిక్షునటసూత్రయోః అను సూత్రమున పాణిని వ్యాసుడు నామము,వేదాంతసూత్రమును స్మరించినాడు. అవస్థితేరితి కాశకృత్స్న అను వేదాంతసూత్రమున వ్యాసభగవానుడు ఇతనిని స్మరించినాడు[3]శ్రీభాష్యము న రామానుజాచార్యుడు పరశర్యుడే వ్యాసుడని సంబోధించినాడు. పాణిని వ్యాసుని పేర్కొన్నాడు, వ్యాసుడు కాశకృత్స్నుడుని పేర్కొన్నాడు. కావున ఇతడు వ్యాపాణినులకు పూర్వుడు అని అనుకొందురు. శతాచ్చ ఠన్యతావశతే అను సూత్రమును గూర్చి ప్రదీపమున కైయటాచార్యుడు ఆపిశల కాశకృత్స్నయో స్త్వగ్రంథ ఇతివచనా ద్ ప్యత్ర ప్రతిషేధాభావో నియతకాలాశ్చ స్మృతయో వ్యవస్థాహేతవ ఇతిమునిత్రయమతే నాద్యత్వే సాధ్వసాధుప్రవిభాగః అన్నాడు. ఇలా పలుచోట్ల ఈతని గూర్చి పలువురు పూర్వకవులు తెలిపినారు. అయినను పాణినీయ వ్యాకరణము పూర్వులగ్రంథములకంటే బలవత్తరమయిన దని పలువురు గ్రంథ కారుల అభిప్రాయము. పతంజలి కాశకృత్స్నవ్యాకరణమును జూచియుండవచ్చును; కాని భర్తృహరి చూచినాడో, లేదో తెలుపుట కష్టము. ఒకచోట తదర్హం ఇతి నారబ్ధం సూత్రం వ్యాకరణాంతరే అన్నాడు భర్తృహరి. దీనిపై వ్యాఖ్యవ్రాసిన హేలరాజు వ్యాకరణాంతరే కాశకృత్స్నే చాపిశలె అని వివరించినాడు.

ఈవ్యాకరణము మూడు అధ్యాయములగ్రంథము.ఈ వ్యాకరణమున మూడు,నాలుగు సూత్రములు మాత్రమే నేడు లభించుచున్నవి.

ఆధారం –భారతి మాసపత్రిక మరియు ఈ క్రింది వాటి ఆధారంగా వీకీపీదియాలోని వ్యాసం

  1.  काशकृत्स्न व्याकरणम्: Kashkritsna Vyakaran
  2.  हिंदी व्याकरण का संक्षिप्त इतिहास
  3.  अवस्थितेरिति काशकृत्स्नः।।1.4.22।।

 

394-కర్మంది వ్యాకరణ కర్త –కర్మందుడు (4వ శతాబ్ది పూర్వం )

కర్మంది వివరణము

 

కర్మంది ఒక  వ్యాకరణగ్రంథము. దీనిని కర్మందుడు వ్రాసినట్లు తెలియుచున్నది. అవైయాకరణులయిన శిష్యుల కొరకు వ్యక్తావధూత, క్రాంతదర్సియగు భగవాన్ కర్మందుడు తన భిక్షుసూత్రమునకు పూర్వవృత్తమయిన వ్యాకరణ సూత్రములు కొన్ని రచించినట్లు సన్యాసి సంప్రదాయమున ఉంది. ఇందు భిక్షుసూత్రాంసములు పెక్కు ఉన్నాయి. ఇది కేవలము జనశ్రుతికాదు. కవీంద్రాచార్య సూచీపత్రమున వ్యాకరణ ప్రస్తావనలో కర్మంది వివరణనామకగ్రంధోల్లేఖనము ఉంది. కవీంద్రాచార్యుడు సన్యాసి అని, గ్రంథముఈ గ్రంథముమూలముగా తెలిసింది. కర్మందప్రోక్తవ్యాకరణ సంబంధిసూత్రములు భిక్షుసూత్రముకంటె భిన్నముగా భావించువారు ఈగ్రంథమును కార్మందవివరణ అని అంటారు.

సరస్వతీదేవి ప్రథమమున కర్మందునికి ఈ సూత్రములు ఇచ్చెనని, అనుభూతిస్వరూపాచార్యునికి పూర్వుడగు పరివ్రాజకనరేంద్రాచార్యుడు ఈ సూత్రము లన్నింటికిని కూర్చి, స్వకీయవృత్తివార్తికాదులతో కలిపి సారస్వతవ్యాకరణమను పేరిట వేరగుది రచించినని కొందరౌ అంటారు. దీనికి పూర్వము ఈగ్రంథముసన్యాసుల దగ్గెర ఉండేది.

“కర్మందకృశాశ్వాదినిః” (అష్టా-4-3-111) సూత్రమువలన కర్మందమస్కరి పాణినికి పూర్వుడని తెలియుచున్నది. కర్మందుని భిక్షుసూత్రము వ్యాసుని భిక్షుసూత్రముకంటె పూర్వమని కొందరందురు. వ్యాసుని భిక్షుసూత్రమునకు తరువాత మరియొక భిక్షుసూత్రము ప్రకటిత కాలేదు.

ఆధారం –వీకీ పీడియా

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అప్పు చేసి పప్పు కూడు కు యాభై -భూమి

Posted in సినిమా | Tagged | Leave a comment

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం 

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

 మాఘ శుద్ధ పంచమి శ్రీపంచమి 10-2-19 ఆదివారం ఉదయం 9 గం లకు సరసభారతి 137 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి దేవాలయం లో సామూహికంగా పాలుపొంగించి పొంగలి తయారు చేయటం ,అనంతరం సామూహిక సత్య నారాయణ వ్రతం నిర్వ హింపబడుతోంది . దీనికి రుసుము చెల్లించ వలసినఅవసరం లేదు . పూజా ద్రవ్యాలు ,దేవతా విగ్రహాలు వగైరా ఎవరి పూజాసామగ్రి వారే తెచ్చుకొని  సాధ్యమైనంతవరకు దంపద్యుక్తంగా కూర్చుని చేసుకోవచ్చు .
   వ్రతం పూర్తయ్యాక 11-30గం లకు శ్రీ అయ్యప్ప దీక్షతో ఉయ్యూరు నుండి శబరిమలై కు సైకిల్ పై 18 సార్లు వెళ్లి వచ్చిన వారు ,శ్రీ  శివ దీక్షతో ఉయ్యూరు నుంచి శ్రీశైలం కు  నడకతో 5 సార్లు వెళ్ళివచ్చినవారు ,స్థానిక సుధీర్ టింబర్ డిపోలో గుమాస్తాగా ఉన్న శ్రీ బిరుదుగడ్డ వేంకటేశ్వరరావు (స్వామి )గారికి సన్మానం ,అనంతరం ”స్వామి”గారి  అనుభవ విశేషాల ప్రసంగం ఉంటుంది .
   అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన  .  వ్రతం లో పాల్గొని వారు అర్చక స్వామిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవలసినది ,
               గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -ఆలయ ధర్మకర్త  -2-2-19 -ఉయ్యూరు 

image.png

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము

             గ్రంథ కర్త పరిచయం

పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్

జననం -27-06-1940-ఉయ్యూరు

తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి

విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి.

వివాహం –ప్రభావతి తో(21-02-1964)

ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు

           కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998)

సంతానం -1-గబ్బిట  మృత్యుంజయ శాస్త్రి ,సమత (హైదరాబాద్ )

                  (సంకల్ప్,భువన సాయి తేజ )

             2-లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర(హైదరాబాద్ )

                    (శ్రీహర్ష సాయి ,హర్షితాంజని)

            3-నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి (ఉయ్యూరు )

                   ( గౌతమ్ శ్రీ చరణ్ ,రమ్య )

            4-వెంకట రమణ ,మహేశ్వరి (ఉయ్యూరు )

            5-కోమలి  విజయ లక్ష్మి , సాంబావధాని(షార్లెట్-అమెరికా )

                    ( శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్ )

సాహితీ వ్యాసంగం –రచనలు ,సరసభారతి అధ్యక్షులు

స్వీయరచనలు -1-ఆంధ్ర  వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథానిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం 6-సిద్ధ యోగి పుంగవులు 7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 9-దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 – 11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 12-కెమోటాలజి పిత  కొలచల సీతారామయ్య 13-దైవ చిత్తం 14-గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 ,15-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి కరదీపిక 16-ఆధునిక ప్రపంచ నిర్మాతలు ,జీవితాలలో చీకటి వెలుగులు 17-గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-3 ,18-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం 19-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య 20-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు 21-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2.

స్వీయ సంపాదకత్వం లో సరసభారతి ప్రచురణలు -1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-ఆదిత్య హృదయం 6-త్యాగి పే’’రెడీలు 7-శ్రీరామ వాణి 8-మా అన్నయ్య 9-శ్రీసువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

  సరసభారతి ,శ్రీ సువర్చలలాంజనేయ స్వామి  బ్లాగుల నిర్వహణ ,

   శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో ధన్యత ,అనునిత్య సాహితీ వ్యాసంగం .

———————————————————————————

                 శ్రీ హనుమతే నమః

              రెండవ భాగం రచనకు నేపధ్యం

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1మొదటిభాగం  దేశ ,విదేశాలలోని 201 శ్రీ ఆంజనేయ దేవాలయాల  గురించి నేను  రాసి, సరసభారతి ప్రచురించి 18-5-2015  శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో శ్రీ స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆవిష్కరణ జరిపాం .దీనిని  మా చిన్నక్కయ్య,  బావగార్లు శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద్ లకు వారి వివాహ వజ్రోత్సవ కానుకగా అ౦కిత మిచ్చాం  .దీని కి స్పాన్సర్ –మా మేనల్లుడు చి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ) శ్రీమతి విజయలక్ష్మి దంపతులు. (అమెరికా ).

   అప్పటి కి కొద్దికాలం ముందు నుంచే రెండవభాగం దేవాలయాలను అంతర్జాలం లో రాయటం మొదలు పెట్టాను .మధ్యమధ్య రాస్తూ ఆపేస్తూ  మరి కొన్ని పుస్తకాలు రాస్తూ ప్రచురిస్తూ 2018 అక్టోబర్ కు  మూడేళ్ళలో 100 దేవాలయాల గురించి మాత్రమే రాసి ,ఇక ఉండవులే అనుకొన్నాను .

  కాని మా రెండవ అబ్బాయి శర్మ ఇంకా చాలాఉన్నాయని ,వాటి వివరాలు వీకీపీడియా ,యు ట్యూబ్ ,ఇతర చోట్ల నుండి లింక్ లు పుంఖాను పు౦ఖంగా పంపటం ప్రారంభించాడు .వెంట వెంటనే వాటిని అదే వేగంతో ఇంటర్ నెట్ లో రాసేసేవాడిని .నవంబర్ కు రెండవభాగం లో దేవాలయాల సంఖ్య 254 అయింది .ఇందులో ఒక్కటి మాత్రమే అమెరికా దేవాలయం .మిగిలినవన్నీ మన దేశం లో వివిధ రాష్ట్రాలకు చెందినవే .ఇందులో కొన్ని దేవాలయ చరిత్రలు హిందీ , కన్నడం ,మలయాళం ,తమిళం మొదలైన వివిధ భాషలలో ఉన్నాయి .ఏదో రకంగా తంటాలు పడి విషయ సేకరణ చేసి రాశాను .కొన్నిటిని యు ట్యూబ్ లో చూస్తూ ,వింటూ రాయల్సివచ్చేది . హనుమ దయ వలన అన్నీ సక్రమంగా సాధ్యమైన౦త వరకు పూర్తి వివరాలతోనే రాశాను .కొన్ని దేవాలయాల చరిత్ర  అసమగ్రంగా నే దొరికింది .దొరికింది దొరికినట్లు రాసి సంతృప్తి చెందాను .

  మరీ అసలేమీ వివరాలు లేని దేవాలయాలను ఆయా రాష్ట్రాలలో చివర ‘’దర్శించదగిన ఇతర ఆంజనేయ దేవాలయాలు ‘’అనే శీర్షిక లో పొందు పరచాను .ఇవి సుమారు 50 దాకా ఉంటాయి.అంటే రెండు భాగాల లో కలిపి 201+254+50=555ఆంజనేయ దేవాలయాలను స్పృశించిన  అదృష్టవంతుడనయ్యాను .ఇంకా మా  దృష్టి లోకి రాని ఆంజనేయ దేవాలయాలు ఎన్నో ఉండే ఉంటాయి . కనుక ఇదే పరిపూర్ణం అని మేము భావించటం లేదని సవినయంగా మనవి చేస్తున్నాము .వివరంగా రాసిన అన్ని దేవాలయాల ఆంజనేయ స్వామి వారల విగ్రహాల  ఫోటోలు  పెట్టాము .ఒక వేళ విగ్రహం ఫోటో దొరకక పోతే, దేవాలయం ఫోటో అయినా పెట్టాం  .ఈ ఫోటోల సేకరణ ,ఫైల్ గా పెట్టటం ,రాష్ట్రాలవారీగా వరుసక్రమంలో  లిస్టు తయారు చేయటం ,కవర్ పేజీలలో ఏయే ఫోటోలు ఉండాలో నేను చెబితే వాటిని అలా ఎంపిక చేసి ,తయారు చేసే పని  అంతా మా అబ్బాయి శర్మ   తన డ్యూటీ తానూ చేసుకొంటూ,ఈపనులు  చేసినందుకు  అభినందనలు .దీనివలన నా శ్రమ, కళాసాగర్,  ,ప్రకాష్ గార్ల శ్రమ చాలా తగ్గింది .

          ఎందరో మహానుభావులు

  సరసభారతికి ఆప్తుడు ,రమ్యభారతి సంపాదకుడు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఇదివరకు లాగానే ఈ పుస్తకం ,డి.టి.పి .నిర్దుష్టంగా చేసి ,ముద్రణ చేయించి , సకాలం లో అందజేసినందుకు , మేము ‘’సరసభారతి స్టాఫ్ కళాకారుడు’’గా భావించే  శ్రీ కళాసాగర్ కోరిన డిజైన్ లోఅందమైన  ముఖ చిత్ర రచన చేసి గ్రంథానికి అదనపు ఆకర్షణ కలిగించినందుకు ధన్యవాదాలు .

             సరసభారతి ప్రగతి

   ఇది సరసభారతి ప్రచురించిన 33వ గ్రంథం,నేను రాసిన 21వ పుస్తకం అని విన్న  విస్తున్నాను .సరసభారతి స్థాపించి(2009-నవంబర్ 24 )9సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం లో ప్రవేశించిందని తెలియజేయటానికి ఆనందంగా, సంతృప్తిగా ఉన్నది . .2019 జనవరి 31 నాటికి సరసభారతి  136  వైవిధ్యభరిత  కార్యక్రమాలు నిర్వహింఛి’’అక్షరం లోక రక్షకం ‘’అన్న మా లక్ష్యానికి అనువుగా నడుస్తోంది   . సరసభారతి సాధించిన ,సాధిస్తున్నప్రగతి , విజయాలన్నిటికీ సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి , కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి,  కోశాధికారి  గబ్బిట వెంకట రమణ కార్యవర్గ సభ్యులు,  మా కుటుంబ సభ్యులు ,ముఖ్యంగా మా శ్రీమతి ప్రభావతి అందిస్తున్న సహాయ , సహకారాలకు  ధన్యవాదాలు .సాహితీ బంధువుల ,వదాన్యులైన వితరణ శీలురైన దాతల ప్రోత్సాహక సహాయాలకు  కృతజ్ఞతలు .

                  హనుమలకు అంకితం  

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం ను కృష్ణాజిల్లా ఉయ్యూరు లోని మా శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారికీ ,పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒకప్పటి గబ్బిటవారి అగ్రహారమైన  రామారావు గూడెం లో వెలసిన  గబ్బిట, చందోలు వారి శ్రీ భక్తాంజనేయ స్వామివారికీ ,ఉయ్యూరు లో మా మేనమామ  శ్రీ గుండు గంగయ్యగారి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారితో సహా అన్ని దేవాలయాల శ్రీ ఆంజనేయ స్వామి వారలకు అంకితమిస్తూ ధన్యులమవుతున్నాము .ఏదో మన భ్రమ కాని హనుమ లేని చోటున్నదా?శ్రీ హనుమ కృపా కటాక్షా  వీక్షణాలే  ఇంతటి బృహత్  రచన,ప్రచురణ మాతో  చేయించాయి .

                   శ్రీ ఆంజనేయ వైభవం

ఇంతటి వైభవం గా దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం  వస్తున్న సందర్భం గా, నామదిలో ఇందులో’’ శ్రీ ఆంజనేయ వైభవం’’ పై పద్యాలు రాయింఛి, చేర్చాలనే  కోరిక లీలగా మెదిలి ,సరసభారతి అభిమానకవులను కొందరికి చెప్పి, తలొక 11 వృత్త పద్యాలు రాసి పంపమని   తెలియ జేయగా ,వెంటనే స్పందించి , అది తమ అదృష్టంగా ,శ్రీ హనుమ ప్రసాదంగా, కర్తవ్యంగా భావిస్తున్నామని, సరసభారతి పై తమకున్నఆదరాభిమానాలను చాటి చెప్పి ,అతి తక్కువ వ్యవధిలోనే  రచించి పంపిన కవి మిత్రులు 1-డా.రామడుగు వేంకటేశ్వర శర్మ (గుంటూరు )2-శ్రీ మంకు శ్రీను (కొప్పర్రు )3-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ )  4-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య(విజయవాడ )5-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (విజయవాడ )6-మధుర కవి శ్రీమతి ముదిగొండ  సీతారామమ్మ(విజయవాడ )7-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని (విజయవాడ )8-శ్రీమతి వారణాసి సూర్యకుమారి (మచిలీ పట్నం )గార్లకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. ఈ ‘’వైభవ పద్య రాశి ‘’ గ్రంథానికి అదనపు ఆకర్షణ కాగలదు .శ్రీ హనుమ బహుముఖీన ప్రతిభావైభావానికి దర్పణంగా భాసించ గలదని భావిస్తున్నాను ..

              సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలు

 సరసభారతి  శ్రీ వికారి నామ  సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న 31-3-19 ఆదివారం నాడు ప్రముఖులకు ఉగాది పురస్కారం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,కవి సమ్మేళనం తో పాటు  నేను రచించిన మూడు సరసభారతి ప్రచురణలు 1-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య(స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ  శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) 2-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర  పరిశోధన పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లు (అంకితం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారికి(అమెరికా ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం  ఆవిష్కరణ జరగటం  సరసభారతి ప్రగతికి నిదర్శనమని సవినయంగా మనవి చేస్తున్నాను . ఈ కార్యక్రమ౦లో పాల్గొంటున్నఅతిధులకు,పుస్తకావిష్కరణ చేస్తున్న ప్రముఖులకు, కవి  సమ్మేళనంలో పాల్గొంటున్న కవి మిత్రులకు ,ఉగాది ,స్వయం సిద్ధ పురస్కారాలు అందుకొంటున్న  ఆత్మీయులకు శ్రీ వికారి ఉగాది శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .

‘’పూజ్యాయ వాయు పుత్రాయ వాగ్దోష వినాశన –సకల విద్యాం కురు మే దేవ రామ దూత నమోస్తుతే .

‘’ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీ శ్రద్ధా పుత్రాస్శుశీలతా –ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే ‘’

‘’సర్వ కళ్యాణ దాతరం  సర్వాపత్ నివారకం –అపార కరుణా మూర్తిం  ఆంజనేయం నమామ్యహం ‘’

‘’ఆంజనేయం మహా వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం –తరుణార్క ప్రభం శాంతం రామదూతం భజే ‘’

                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

———————————————————————————————

శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి సేవకు ,సరసభారతి పుస్తక ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు

1-శ్రీ  .వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ),శ్రీమతి విజయలక్ష్మి దంపతులు –ఫ్రీమాంట్ (అమెరికా ) –రూ-25,000

2-శ్రీ వేలూరి వివేకానంద్ –హైదరాబాద్ –రూ-15,000

3-శ్రీ మద్దాల జగదీశ్ ,శ్రీమతి లక్ష్మిదంపతులు –షార్లెట్ (అమెరికా )రూ-10,240

4-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు –హైదరాబాద్- రూ-10,000

5-శ్రీ గబ్బిట రామనాథ బాబు శ్రీమతి జయలక్ష్మి దంపతులు –ఉయ్యూరు –రూ-10,000

6-శ్రీ పువ్వుల సారధి ,శ్రీమతి రేణుక దంపతులు –హైదరాబాద్ రూ–5,120

7-శ్రీమతి చతుర్వేదుల జానకి –విజయవాడ –రూ-2,000

8-శ్రీ .టి.వి.ఎస్. బి .శాస్త్రి (ఆనంద్ ) శ్రీమతి రుక్మిణి దంపతులు-హైదరాబాద్  –రూ 1,116

9--శ్రీ చతుర్వేదుల మధుసూదనమూర్తి శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు –విజయవాడ –రూ-1,100

10--శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,శ్రీమతి ఇందిర దంపతులు –హైదరాబాద్-రూ-1,100

11-శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు –ఖమ్మం –రూ-1,000

12-శ్రీమతి కొల్లి భారతి –మచిలీపట్నం –రూ-1,000

13-శ్రీ కడవకొల్లు కృష్ణ దంపతులు –కడవకొల్లు -రూ-500

14– శ్రీ కూచిభొట్ల రాజ గోపాల కృష్ణ మూర్తి ,శ్రీమతి సీతారామమ్మ దంపతులు –ఉయ్యూరు –రూ-500  

                                  గబ్బిట దుర్గా ప్రసాద్  

  ———————————————————————————



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఛత్రపతి శివాజీ -ధ్వజమెత్తిన ప్రజాపతి -శ్రీ రామ కృష్ణప్రభ-జనవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)

సంస్కృత ,గణిత మహా విద్వాంసుడు సుధాకర్ ద్వివేది ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర ఖజోరి గ్రామం లో 1855లో జన్మించాడు .బాల్యం లో గణితాన్ని పండిట్ దేవ కృష్ణవద్ద నేర్చాడు .1883 లోవారణాసిలోని  ప్రభుత్వ సంస్కృత కళాశాలలో గణిత అధ్యాపకుడుగా చేరి  బాపుదేవ శాస్త్రి అనే ఆయన రిటైర్ అయ్యాక ఆస్ట్రాలజీ కూడా బోధించాడు .తర్వాత వారణాసి క్వీన్స్ కాలేజి లో గణిత శాఖ హెడ్ గా చేరి 1905లో రిటైర్ అయ్యేదాకా పని చేశాడు .

   సుధాకర్ ద్వివేదీ అనేక గ్రంథాలను అనువదించాడు .చాలావాటికి వ్యాఖ్యానాలు రాశాడు .ఎన్నో గ్రంథాలు  రాసి వెలువరించాడు ..అందులో గణిత విభాగం ఆల్జీబ్రా లోని పెల్లియన్ ఈక్వేషన్స్ ,స్క్వేర్స్ ,డయో ఫాన్టైన్ ఈక్వేషన్స్ లపై విస్తృతంగా రచనలు చేశాడు .

  సంస్కృతం లో ద్వివేదీ రచనలు -1-చలన్ కలన్ 2-దీర్ఘ వృత్త లక్షణ్(కేరక్టర్ స్టిక్స్ ఆఫ్ ఎల్లిప్స్)3-గోళీయ రేఖా గణిత్ (స్పియర్ లైన్ మాథమాటిక్స్ ) 4-సమీకరణ్ మీమాంసా (అనాలిసిస్ ఆఫ్ ఈక్వేషన్స్ )5-యాజుష జ్యోతిషం,అర్చా జ్యోతిషం 6-గణక తరంగిణి 7-యూక్లిడ్స్ ఎలిమెంట్స్ 6,11,12 భాగాలు 8-లీలావతి 9-బీజగణిత 10-పంచసిద్దా౦తికా ఆఫ్ వరాహమిహిర  11-సూర్య సిద్ధాంత 12-బ్రహ్మ గుప్తాస్ బ్రహ్మ స్ఫుట సిద్ధాంత 13-ఆర్యభట హిజ్ మాయా సిద్ధాంత .

  హిందీలో –డిఫరెన్షియల్ కాల్క్యులస్ ,ఇంటెగ్రల్ కాల్క్యులస్ ,థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ ,ఎ హిస్టరీ ఆఫ్ హిందూ మాథమాటిక్స్

  అరుదైన ఇంతటి గణిత మేధావి ,రచయిత సుధాకర్ ద్వివేది 55సంవత్సరాలు మాత్రమే జీవించి 1910 లో మరణించాడు .

   సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మందు బిళ్ళ ల్లాంటి డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు

మందు  బిళ్ళ ల్లాంటి  డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు ‘’

క్లుప్తత నిర్వచనాలకే కాదు కవిత్వానికీ బాగా వర్తింప జేస్తున్నారు కవులు .ఆకాశాన్ని అద్దంలో చూపిస్తున్నట్లు కొండ౦త భావాన్ని కుదించి అందంగా చెబుతున్నారు .ఇప్పటికే 6 రచనలతో లబ్ధ ప్రతిష్టులైన డా .మక్కెన శ్రీను తాజాగా 2019కానుకగా 500 ల  ‘’గోరంత కవిత ‘’నానోలను ఆంద్ర పాఠకులకు అందజేశారు . ఆయన పంపిన ఈ పుస్తకం ఈ ఉదయమే నాకు అందగా వెంటనే చదివాను . అప్రతిభుడనయ్యాను .చేయి తిరిగిన మహాకవి స్పర్శ కనిపించింది .దేనికదే సాటి గా ఉన్నాయి .ఎంత పెద్ద జబ్బైనా  చిన్న మందు బిళ్ళతో నయం చేసి గుణం కలిగించవచ్చు .ఆ లక్షణం  ఈ నానోలలో అంతటా గోచరించింది .ఆయనే నిర్వచించినట్లు ‘’నాలుగు –పాదాలు –నాలుగే –పదాలు ‘’నానో భావాలు ను చక్కగా పాటించి మెరుపులు ,వెలుగులు ,చమత్కారాలు ,ఆలోచనలు సృష్టించారు .గోరంత దీపం కొండంత వెలుగు కదా .అలా వెలుగులీనిన నానోల సమాహారం ఈ పుస్తకం . వివరణ అక్కర లేని నానోలివి . నోట్లో వేసుకొన్న  ‘’మెడిసిన్ పిల్ ‘’లా తక్షణ రిలీఫ్ ఇస్తాయి .అందుకే అందులోని కొన్ని నానోలు మీకోసం –

1 –నానో- గోరంత –భావం –కొండంత

2-తొలి –బడి –అమ్మ- ఒడి

3-చరవాణి –సంభాషణ –నరవాణి-సంహారం

4-తల్లి –పుట్టుక –తండ్రి –నడత

5-కంటి –దానం –లోక౦ –వెలుగు

6-నోట్లో –గుట్కా –మరణపు –చిట్కా

7-అమ్మ –ఆత్మ-నాన్న –జీవాత్మ

8-అమ్మ –లాలన –నాన్న –పాలన

9-ప్రేయసి –మధురం –ఒడి –సాంత్వనం

10-అచ్చు –సొంపు –హల్లు –ఒంపు

11-పఠనం-నిత్యం –వికాసం –సత్యం

12-రక్తం –ప్రసరణ –జీవం –ప్రజ్వలన

13-ఆర్ధికం –తాత్కాలికం –హార్దికం –శాశ్వతం

14-మండే –చెట్టు –ఎండే –ప్రకృతి

15-ఓర్పు –కష్టం –విజయం -ఓదార్పు

16-కష్టం –చేదు గుళిక –ఫలితం –తీపిమాత్ర

17-నీకు –నీవు –అన్వేషణ –జ్ఞానం

18-పాదాలు –నానీలు –పదాలు –నానోలు

19-విత్తనం –అంకురం –విత్తం –అంకుశం

20-మొగుడు -ధనాత్మకం –పెళ్ళాం –రుణాత్మకం

21-వాకిట –నాగలి –ఆకలి –మాయం

22-ఆకాశం –కవిత్వం –నక్షత్రాలు –నానోలు

23-ప్రకృతి -వీక్షణం –ఆకృతి –దర్శనం

24-జీవి –అండపిండం –విశ్వం –బ్రహ్మాండం

25-ఆదర్శం –వల్లించేది –కర్తవ్య౦  –ఆచరించేది

26-ప్లాస్టిక్ –ఆవరణం –పర్యావరణ –భూతం

27-దేవుడు –సముద్రం –జీవుడు –కెరటం

28-గోమాత –దీవెన –భూమాత –క్షేమ౦

29-కళ్ళ-తడి –మనసు –అలజడి

30-ఆలుమగలు –అనురాగం –ప్రేమ –లతలు

31-సమాజ –శిలలు –వీధి –బాలలు

32-కసువు –దివాళా-పశువు –కబేళా

33-శృంగారం –శ్రీనాథుడు-సంసారం –స్త్రీ నాథుడు

34-నుదుటి –విభూతి-దైవత్వ –అనుభూతి

35-నేడు –వ్యవసాయం –రైతు –ఎద గాయం  

36-పలుకు –సిద్ధాంతం –అరుపు –రాద్ధాంత౦

 37-ప్రశ్నల –నిఘంటువు –శ్రీ శ్రీ –మహా ప్రస్దానం

 38-విశ్వ వీధి –పూదండ –సినారె-విశ్వంభర

39-కవి –త్రాసు –భావన –తూనిక  

40-భావం –జీవం –భాష –సజీవం

అందమైన’’ అక్షర బంతి’’ముఖ చిత్రం తో  పాలనురుగు పేపర్ పై ముద్దులొలికే ముద్రణతో విడుదలైన  డాక్టర్ గారి నానోలు చప్పరించి ఉపశమనం పొందండి .తాత్విక, బౌద్ధిక ,మానసిక లౌకిక , శాస్స్త్రీయ ,ప్రబోధాత్మక ,చిత్తశాంతి జనక ,కవితాత్మక నానోలను ఆస్వాదించి ‘’గోరంత కవిత ‘’లలో కొండంత వెలుగులు దర్శించండి .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-19-ఉయ్యూరు

 

Posted in సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)

   బహుముఖీన ప్రతిభ

వాగీశ్ శాస్త్రిగా గౌరవింప బడుతున్న డా .భగవతీ ప్రసాద్ త్రిపాఠీ అంతర్జాతీయ సంస్కృత వ్యాకరణ కోవిదుడు ,భాషా శాస్త్రవేత్త ,తాంత్రికుడు ,యోగి.1935లో మధ్యప్రదేశ్ లోని ఖురాలీ సిటీ లో జన్మించాడు .విద్యాభ్యాసం బృందావనం బెనారస్ లలో సాగింది .వారణాసి తిక్ మణి సంస్కృత కాలేజిలో 1959లో లెక్చరర్ గా జీవితం ప్రారంభించి,అక్కడే ఉన్న సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి లోని రిసెర్చ్ సంస్థకు1970 లో  డైరెక్టర్ అయ్యాడు .మూడు దశాబ్దాలు దీనిలోనే సేవలందించాడు . 1959లోనే సంపూర్ణానంద యూని వర్సిటి నుండి సంస్కృత వ్యాకరణ ఆచార్య(ఎం. ఏ .) పి.హెచ్. డి,(విద్యా వారిధి )ను వ్యాకరణం ,హిస్టారిక్ లింగ్విస్టిక్స్ లో 1964లో పొందాడు .1966 జర్మన్ డిప్లొమా ,1969లో వాచస్పతి (డి .లిట్.)అందుకొన్నాడు .

            రచనా వాగీశం

   19వ ఏట నుండే డా వాగీశ్ శాస్త్రి సంస్కృత వ్యాసాలూ రాయటం ప్రారంభించి రెండువందలకు రిసెర్చ్ పేపర్లతో సహా వివిధ జాతీయ ,అంతర్జాతీయ జర్నల్స్ లో రాశాడు .అయిదవ సంస్కృత సమ్మేళనానికి సెక్రెటరి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .సరస్వతి భవన గ్రంథాలయం మొదలైన సంస్థలకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించాడు .300 వ్రాత ప్రతులను పరిష్కరించి తన సంపాదకత్వం లో గ్రంథాలుగా ప్రచురించిన వైదుష్యం ఆయనది .ప్రముఖ సంస్కృత జర్నల్ ‘’సరస్వతి సుషమ’’ ముఖ్య సంపాదకుడుగా చాలాకాలం ఉన్నాడు .వ్యాకరణం ,ప్రాచీన భాషాశాస్త్ర౦ (ఫైలాలజి) సంబంధ రిసెర్చ్ విషయాలు ,నాటకం చరిత్ర ,కవిత్వం ,వ్యంగ్యం ,చారిత్రిక పరిశోధన ,ఆధి భౌతిక (మెటా ఫిజిక్స్ )మొదలైన వాటిపై అనేక గ్రంథాలు రచించాడు .

                            మాగ్నం ఓపస్

   వాగీశ్ శాస్త్రి  మేధో సర్వస్వమైన  రచన’’ మాగ్నం ఓపస్’’ ఒకటి ఉన్నది .విట్నీ అనే పాశ్చాత్య పండితుడు పాణిని –పాణిని ధాతుపథం పై తీవ్ర విమర్శ చేస్తూ రాసిన దానిపై ప్రతి విమర్శ పై చేస్తూ ‘’పాణినీయ ధాతుపథ సమీక్ష ‘’రచించి 1965లో ప్రచురించాడు .విపరీతమైన శ్రమ చేసి వర్ణక్రమం లో వివిధ ధాతుపథాలలోఉన్నసంస్కృత ,పాళీ ,అపభ్రంశ ,మిగిలిన ప్రాకృత భాషలలోని  ధాతువుల కేటలాగ్ తయారు చేసి వాటి ధృవీకరణ ,వాటి క్రియా రూపాలు మామూలు రూపాలతో సహా కళ్ళముందు నిలబెట్టాడు .ఇది విట్నీ విమర్శను పూర్తిగా త్రిప్పికోట్టిన అరుదైన గ్రంథం గా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించింది .

          శరపరంపర రచన

  శాస్త్రి మరో ముఖ్య రచన ‘’కృష్ణం నాగ పాశః ‘’అనే రేడియో నాటకం .సింబాలిక్ గా రాయబడిన ఈ నాటకం దేశభక్తిని ,మతసామరస్యాన్ని ,జాతిపై గౌరవాభిమానాలను ,మాతృ దేశ సంరక్షణలో చూపాల్సిన త్యాగ నిరతిని బహు చక్కగా చెప్పింది .శాస్త్రి సృజనాత్మతకు నిలువెత్తు అద్దంగా ఈ నాటకం భాసించింది .ఇవికాక సంస్కృతం లో తద్ధితాన్తః కేచన శబ్దః ,అనుసాధన పధ్ధతి ,దాత్వర్ధ విజ్ఞానం రాశాడు .మిగిలిన రచనలలో శబ్ద నిర్వచన ఔర్ సబ్దార్ధ ,జిప్సీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ ,ఉప్సహితం  వంటివి ఉన్నాయి .సృజనాత్మక రచనలలో –కథా సంవారిక టాల్ స్టాయ్ కథాసప్తకం , భారత్ మే సాంస్క్రిట్ కి అనివార్యకోమ్ ,శ్రీ గంగా స్తవన చయనిక , శ్రీ శివ స్తవన చయనిక ,నర్మ సప్త శతి ,సాంస్క్రిట్ వాజ్మయ మ౦ధనం ,ఆతంకవాద శతకం ,నాద శాబ్దికం ,సంజయ క్రియా పాద,సంక్షిప్త సార్ వ్యాకరణ్,శివ సంకల్ప సూక్తం మొదలైన 24 ఉన్నాయి .

  చారిత్రిక రచనలు –జిప్సీ భాష ,మహాకు౦భ ఏవం సంగమ స్నానం ,ఆతోబయాగ్రఫీ ఆఫ్ వాగ్ యోగి ,మైగ్రేషన్ ఆఫ్ ఆర్యన్స్ ఫ్రం ఇండియా ,బుందేల్ ఖండ్ కీ ప్రాచీనత .పద్మ పురాణ అండ్ రఘు వంశ .

మెటా ఫిజిక్స్ –పర చేతన కి యాత్ర ,శక్తి ,శివ అండ్ యోగ ,యోగ చూడామణి ఉపనిషత్ ,సంవిత్ ప్రకాశ (వైష్ణవ తంత్రం ),త్రయంబకం యజామహే .

 నవ్య  సంస్కృత వ్యాకరణం –సాంస్క్రిట్ శిక్షన్ కి సరళ్ఔర్ వైజ్ఞానిక్ విధి ,వాగ్ యోగ –న్యుమానిక్ సాంస్క్రిట్ టెక్నిక్ ,వాగ్యోగ –కాన్వేర్సేషనల్ టెక్నిక్స్ ,సాంస్క్రిట్ మేడ్ ఈజీ -2 భాగాలు

నిఘంటు నిర్మాణం –వామన పురాణ విషయానుక్రమ శబ్ద కోశం ,ఎటిమలాజికల్ బుందేల్ డిక్షనరీ ,శబ్ద పరణ్యం నాం ధాతు నిర్భర్ శబ్ద కోష్.ఇలా బహువిధ ప్రక్రియలలో తన అసమాన శేముషీ ప్రతిభను చాటి ,చేబట్టిన ప్రతి విషయాన్నీ సువర్ణమయం చేసిన రచనా ఘనాపాఠీ శాస్త్రీజీ .

           మార్గ దర్శి

 వాగీశ్ శాస్త్రి మార్గదర్శకత్వం లో సంస్కృత వ్యాకరణం లో 20మంది , అలంకార  శాస్త్రం ,కవిత్వం లో 20మంది ,ఫిలాసఫీ ,తంత్ర లో 6గురు ,వేద,పురాణ ఆయుర్వేద  లలో ఇద్దరేసి , జ్యోతిషం లో ఒకరు విద్యార్ధులు పి.హెచ్ .డి  .పొందారు .సంస్కృత వ్యాకరణం లో ఒకరు ,అలంకారం కవిత్వం లో ముగ్గురు ,ఫిలాసఫీ, తంత్ర ,పురాణ లలో ఒక్కొక్కరు విద్యార్ధులు డి.లిట్ .అందుకొన్నారు .

               శాస్త్రీజీ సృజన విధానం –వాగ్యోగం

  వాగ్యోగ అనే తన సృజనాత్మక విధానం లో సంస్కృతాన్ని మాటల , సంభాషణల రూపం లో గణిత విధానం లో సంస్కృత వ్యాకరణం నేర్పుతున్నారు .ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులు వచ్చిఅతి తక్కువ సమయం లో సంస్కృతం నేర్చుకొని వెడుతున్నారు .పాప్ సింగర్ మడోన్నా ‘’యోగ తారావళి ‘’గానం చేసింది .ఆమెగానం లో ఉచ్చారణ దోషాలు కనిపెట్టి తెలియజేశాడు శాస్త్రీజీ .ఆమె బిబిసి రేడియో ద్వారా శాస్త్రి గారితో పరిచయం పొంది తన ఉచ్చారణ ను చక్కగా తీర్చి దిద్దుకోన్నది .

    వైదుష్యానికి తగిన  బిరుదులూ సత్కారాలు పొందిన పద్మశ్రీ వాగీశ శాస్త్రి

1966లో కాళిదాస అవార్డ్ ,1982మహా మహోపాధ్యాయ ,1990బాణభట్ట అవార్డ్ ,1994లో వేద వేదా౦గ  అవార్డ్ ,1995లో అను సంధాన్ పురస్కార ,స్వామి విష్ణు తీర్ధ సమ్మాన్ ,యశ్ భారతి పురస్కార్, విశ్వభారతి పురస్కార్, సాంస్క్రిట్ సాధన సమ్మాన్ ,ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమీ నుంచి 6 సార్లు గౌరవపురస్కారం వంటి అనేక విశిష్ట పురస్కారాలు బిరుదులూ సన్మానాలు శాస్త్రిగారిని వరించి ఆయన శేముషికి వన్నె తెచ్చాయి.2018లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించి విశేష గౌరవం కలిగించింది .

83 ఏళ్ళ మహా సంస్కృత కవి శిరోమణి, భారత దేశ ఆధ్యాతిక జాతి రత్నమైన డా.భగవతీ ప్రసాద్ త్రిపాఠీ-వాగీశ  శాస్త్రీజీ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లి,గీర్వాణి పద సమార్చనలో తరించాలని కోరుకొందాం .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోషలిస్టు డైనమైట్ ,రెబెల్ ,ఏక వ్యక్తి సైన్యం ,నిర్భయ నిరాడంబరుడు -”జార్జి ది జైన్ట్ కిల్లర్ ”ఫెర్నాడజ్

image.png

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా సంస్కృత విద్వాంసుడు లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి

మహా సంస్కృత విద్వాంసుడు  లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి  

భారతీయ సంస్కృత మహా విద్వాంసుడు మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ వారణాసి లో జన్మించాడు .ఆ పరిసరాలలో ఆయనొక్కడే అయిదవ తరగతి పాసైనవాడు అంటే యెంత వెనకబడిన ప్రాంతం వాడో అర్ధమౌతుంది .హైస్కూల్ చదువులో తప్పటం వలన అతని టీచర్ ‘’రతన్ లాల్ శాస్త్రి’’ రోజు కొక భగవద్గీత అధ్యాయం చదవమని ,దానివలన కస్టాలు గట్టే  క్కటమేకాకుండా  పరమాత్మ కృప కలుగుతుందని  సలహా ఇచ్చాడు .భగవద్గీతా పఠనానికి అలవాటు పడిన ఖాన్ ,క్రమగా అందులోని లోతైన విషయాలకు ఆకర్షితుడై , సంపూర్ణంగా అధ్యయనం చేసి అందులోని రహస్యాలను ఆకళింపు చేసుకొని స్నేహితులకు బోధించేవాడు తన జీవిత పరమార్ధం నెరవేరాలంటే సంస్కృతం నేర్చి అందులో  ప్రావీణ్యం  సంపాదిస్తేనే భగవద్గీత అధ్యయన ఫలప్రాప్తి కలుగుతుందని విశ్వసించాడు .

  పట్టుదలతో చదివి సంస్కృతం లో ఎం. ఏ .పాసయ్యాడు ఖాన్ శాస్త్రి .వారణాసి లో సంపూర్ణానంద్ వద్ద పురాణాలు కూలంకషంగా చదివి నిష్ణాతుడై ఆచార్య ,శాస్త్రి పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు .కంపారటివ్ రెలిజియన్ లో డాక్టరేట్ పొందాడు .ఆయన పరిశోధన అంశం ‘’మహా మంత్ర గాయత్రి ఔర్ సురాఫతా కా అర్ధ ప్రయోగ్ ఏవం మహాత్మ్యా కి దృష్టిసే తులనాత్మక్ అధ్యయన్ ‘’దీన్నే ఇంగ్లీష్ లో ‘’Comparative Analyisis of Gayatri Mantra and Surah Fatiyah with reference to meaning and importanace ‘’అంటారు .భారతీయ సంస్కృత సంస్థాన్ లో ఖాన్ శాస్త్రి సంస్కృత ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు ..

ఖాన్ శాస్త్రి రచనలు –మోహన్ గీత ,గీత ఔర్ ఖురాన్ మే సామంజస్య ,  వేద ఔర్ ఖురాన్ సే మహామంత్ర గాయత్రి ఔర్ సురా ఫతాః,వేదోం మే మానవ అధికార్,మీజోయ్ ,మహామంత్ర గాయత్రి కా బౌద్ధిక్ ఉపయోగ్,శ్రీమద్భగవద్గీతా ఔర్ ఖురాన్ ,విశ్వ బందుత్వకా ప్రత్యచ్చ్ ప్రమాద్ ‘’.

మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రికి 2009లో  ‘’నేషనల్ కమ్యూనల్ హార్మని అవార్డ్ ‘’(జాతీయ మతసామరస్య పురస్కారం )అందజేశారు .2019లో భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందించి గౌరవించింది.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-19-ఉయ్యూరు

 image.png

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

      భాషా ప్రవీణులు ,పొన్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర సాహిత్యాధ్యయన శీలి ,ఆంధ్రో పాద్యాయులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి గ్రామ వాస్తవ్యులు ,కవిరాజు సాహిత్య సరస్వతి బిరుదాంకితులు ,కనకాభిషేకి ,సంస్కృతాంధ్ర రచనా దురంధరులు శ్రీ కడెము  వేంకటసుబ్బారావు గారు  సహస్రాధిక పద్యాలతో రచించిన  వీర రస ప్రదానకావ్యం ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’.ఖడ్గ తిక్కనకు ముందు శ్రీ చేర్చటం లోనే కవిగారికి ఆ సాహస వీరునిపై ఉన్న అనన్య భక్తీ తాత్పర్యాలు వ్యక్తమౌతున్నాయి .ఖడ్గ తిక్కన కథ అరవై ,డెబ్భై ఏళ్ళ క్రితం అయిదు ఆరు తరగతుల తెలుగు వాచకాలలో పాఠ్యాంశం గా మనం  చదువుకొన్న వాళ్ళమే.కాలక్రమం లో అది కనుమరుగైంది .కాని తెలుగు దేశం లో కవి తిక్కన ఖడ్గ తిక్కన పేర్లు తెలియని వారు ఉండేవారు కాదు . ఇద్దరూ నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి మహా రాజు ఆస్థానం లో మంత్రిగా ,సేనాపతిగా గౌరవస్థానాలు అందుకొన్నవారే .భారతాంధ్రీకరణలో కవిత్రయం లో రెండవ వాడుగా తిక్క యజ్వ సుపరిచితుడే .ఆయన తేట తెలుగు, నాటకీయత చవి చూసి మురిసిపోని వారు లేరు .ఖడ్గ తిక్కన పేరు చెబితే  పల్నాటి బాలచంద్రునిలా ,ఝాన్సీ లక్ష్మీ బాయిగా వొడలు పులకరిస్తుంది .అంతటి అవినాభావ సంబంధం ఉన్న కీర్తిమంతులు వీరిద్దరూ .

   శ్రీ కడెము   వేంకట సుబ్బారావు మాస్టారు గారు చాలా సాహసంగా ,కవితాత్మకంగా నాటకీయంగా ,సహజ సరళ ధారా పద్య విన్యాసం తో ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం తీర్చి దిద్దారు .’’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేత సంస్కృతాంధ్రాలు ,గ్రాంథికవ్యావహారికాలు ,సంప్రదాయ ఆధునికతలు రచనలో పడుగు –పేకయినవి ‘’అని మెచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.వి . రాఘ వేంద్ర రావు గారి  మాటలు అక్షర సత్యాలు .ఈ కావ్యానికి ముందుమాటగా ‘’గ్రంథ పరిచయం ‘’చేసిన విశ్రాంత ఆంధ్ర శాఖాధిపతి శ్రీ మేడూరి ఉమామహేశ్వరం కవినీ కావ్యాన్నీ క్షుణ్ణంగా ఆవిష్కరించి మహోపకారం చేశారు .కనుక నాకు దీన్ని పరిచయం చేయటం చాలా తేలికయినది .ఎక్కువభాగం వారి మాటలలోనే కావ్య సౌరభాన్ని మీకు అందిస్తున్నాను .

  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం  ఏడాశ్వాసాల గ్రంథం.సహస్రాధిక పద్య సమన్వితం .పూర్వాపర విరుద్ధం కాకుండా చరిత్రా౦శాలను కవి కథా కథనమున చక్కగా నిరూపించారు .ఇతివృత్తం ,పాత్ర పోషణ, రసము పరస్పరాశ్రయంగా పూర్వ పూర్వా శ్వాశాలు ,ఉత్తరావుత్త్రా రాశ్వాశాలు పోషకంగా కథ మలచబడింది .సంగ్రహంగా ఇందులోని కథ తెలుసుకొందాం .

 మొదటి ఆశ్వాసం –పాకనాటి సీమ రాజధాని నెల్లూరు .దీనికి విక్రమ సింహ పురం అనే పేరుకూడా ఉంది .పాలకుడు మనుమసిద్ధి మహారాజు .కొమ్మన కుమారుడు కవి తిక్కన మంత్రి .అరొక మంత్రి భీమన .సిద్దన మంత్రి కొడుకు ఖడ్గ తిక్కన సర్వ సేనాపతి .ప్రక్కరాజ్యం కనిగిరి సీమ పాలకుడు  కాటమ రాజు . మంత్రి పద్మరాఘవుడు .బ్రహ్మ రుద్రయ్య సేనాపతి .కనిగిరి విస్తారమైన గో సంపదతతో అలరారు తోంది .మూడేళ్ళుగా వర్షాలు లేక ,కరువు కాటకాలతో అలమటిస్తోంది కనిగిరి .కాటమరాజు మనుమసిద్ధి దగ్గరకు వచ్చి పశువుల మేతకు పుల్లరి( పశువుల మేతకోసం ఇచ్చే డబ్బు )ఒడంబడిక చేసుకొన్నాడు .

   రెండవ ఆశ్వాసం – ఒప్పందం ప్రకారం యాదవులు నల్లమల అడవులలో లక్షకు పైగా ఆవులు మేపుకొంటున్నారు  .అక్కడ నెల్లూరు గిరిజనులు రక్షకులుగా ఉన్నారు .పశు కాపరులైన యాదవులు అడవిలో పిట్టల్ని జంతువుల్ని కొట్టటం తో గిరిజనులకు యాదవులకు భేదాలు ,తగాదాలు ఏర్పడ్డాయి .రాణీగారు తన పెంపుడు చిలుకను యాదవులు కొట్టారని పగబట్టి గిరిజనుల్ని ఉసి గొల్పింది .వాళ్ళు ఆవులను చంపటం మొదలెట్టారు .పశు వధ మనుమసిద్ధి మహా రాజే చేయించాడని యాదవులు భావించి ,ఒక అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ,ఇవ్వాల్సిన పుల్లరి చెల్లించకుండా ఆవులతో సహా పారిపోయారు .

   మూడవ ఆశ్వాసం –గొల్లలు పుల్లరి ఎగ గొట్టి పారిపోవటం మనుమసిద్ధి రాజుకు కోపం తెప్పించింది .పుల్లరి వసూలు చేసుకొని రమ్మని భట్టును రాయబారిగా కనిగిరి పంపాడు .కాటమ రాజు తమ గో నష్టాన్ని లెక్క తేల్చమని పేచీ పెట్టాడు .తాము ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల పుల్లరికన్నా ,గోనస్టం చాలా ఎక్కువకనుక దాన్ని బిగపట్టుకొని మిగిలిన డబ్బు ఇమ్మన్నాడు కాటమరాజు .అన్యాయపు మాటలు అన్నాడు భట్టు .సంధి చెడింది .యుద్ధం లో మనుమ సిద్ధిని బందిస్తామని యాదవులు ప్రగల్భాలాడారు .భట్టు చెప్పిన మాటలు విన్న మనుమసిద్ధి మారాజు సేనాపతి తిక్కనకు ‘’వీర ఖడ్గ తాంబూలం ‘’ఇచ్చి యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు .

  నాలుగవ ఆశ్వాసం –ఖడ్గతిక్కన ఇంటికి వచ్చి భార్య చానమ్మ తో కనిగిరి వెళ్లి పుల్లరి వసూలు చేసుకొని వస్తాను లేదా యుద్ధమైనా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు .ఇంతలో రాయశృంగార భట్టు వచ్చి యుద్ధానికి ప్రోత్సహించాడు .వీరపత్ని చానమ్మ భర్తకు రక్త తిలకం దిద్ది  విజయం తో తిరిగి రమ్మని వీరగీతం ఆలాపించింది .

  ఐదవ ఆశ్వాసం –యుద్ధరంగం లో సైన్యం సమాయత్తమైంది .యాదవుల స్కంధావారం లో వీరాలాపాలు మిన్నంటాయి .పంబ జోళ్ళ కథ  వీరరస స్పోరకంగా సాగుతోంది .భట్టుతో ఖడ్గతిక్కన తన శౌర్య పరాక్రమాలే చాలు అనుకొని  ,కొద్దిమంది సైనికులతో  ప్రవేశించి కాటమను పుల్లరి ఇమ్మని అడుగగా ,యాదవులు మిగిలినడబ్బు ఇమ్మన్న్నారు .వాద ప్రతివాదాలు తీవ్రమయ్యాయి కాని పరిష్కారం కనిపించలేదు .యుద్ధం ప్రారంభమైంది .తెలివిగా యాదవులు యుద్ధరంగం లోకి అశేషమైన ఆవులమంద ను తోలారు .’’ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య ‘’లా తయారైంది పరిస్థితి .ఖడ్గ తిక్కన ఖంగు తిన్నాడు ఈ ఆకస్మిక పరిణామానికి .యాదవ సేన నెల్లూరి సేనను చంపింది .ఖడ్గ తిక్కన ఒంటరి పోరాటం చేసి సూర్యాస్తమయం అవుతుండటం తో  కాటమ కోరికపై యుద్ధం ఆపేసి ఇంటికి వచ్చాడు .

ఆరవ ఆశ్వాసం –విషయం తెలియని నెల్లూరు పౌరులు ఖడ్గ తిక్కన యుద్ధం లో వోడిపోయి వస్తున్నాడని గేలి చేశారు .బొగ్గులు పేడ,పిడకలతో కొట్టి అవమానించారు .ఎలాగో భరించి ఇంటికి వస్తే తండ్రి ‘’మీసం ఉన్న పేడి’’అని  నిందించాడు .భార్య చానమ్మ భర్త స్నానం కోసం మంచం చాటు పెట్టి ,పసుపు ముద్దా, నీళ్ళు పెట్టి మరీ అవమానించింది .ఇవన్నీ భరిస్తూ తల్లి అనురాగం తో వడ్డించే అన్నమైనా తిందామని కూర్చుంటే ‘’విరిగిన పాలు ‘’పోసి కొడుకు మనసు విరిచింది .భరించలేని అవమానం ఊరిలో ఇంట్లోనూ జరిగాక ఖడ్గతిక్కన రక్తం ఉడికి పోయి ‘’విజయమో వీర స్వర్గమో ‘’తేల్చుకొంటానని ,ఆ రాత్రికి రాత్రే మలి యుద్ధం లో పాల్గొనటానికి యుద్ధభూమికి వెళ్ళాడు .

   ఏడవ ఆశ్వాసం –యాదవులు తమ సేనాని బ్రాహ్మ రుద్రయ్యను యుద్ధ ముఖద్వారం దగ్గర నిలిపారు .ఖడ్గ తిక్కన వీరావేశం తో ఆతడిని నిరుత్తరుని చేసి  ,రణభూమిలో వీర విహారమే చేశాడు.కాటమ రాజు   మొదలైన వారందరికీ తన ఖడ్గమహిమ చాటి చెబుతూ, యుద్ధ రంగాన్ని యాదవ సేనల పీనుగుల  పెంటగా మార్చేశాడు .తెగిపడిన యాదవ శిరస్సు ల గుట్టపై’’ ఈటెను పాతి,తన ఉత్తరీయం తగిలించి విజయస్త౦భ౦ గా వీర పతాకం ‘’గా నిలబెట్టాడు ఖడ్గతిక్కన .సొమ్మసిల్లిన బ్రహ్మరుద్రయ్య తేరుకొని తిక్కన తో కలియబడ్డాడు .చాలాసేపు ద్వంద్వ యుద్ధం చేశారు .ఖడ్గ తిక్కన రుద్రయ్య తలనరికాడు కత్తితో  .కిందపడిపోతూ రుద్రయ్య తిక్కనను కత్తితో పొడిచి చనిపోయాడు .జవసత్వాలను కూడ గట్టుకొని ఖడ్గ తిక్కన పాక్కుంటూ పోయి తాను పాతిన విజయ ధ్వజాన్ని పట్టుకొని మరణించి వీర స్వర్గం అలంకరించాడు .భట్టు వచ్చి గుర్తించి వీర తిక్కనను ప్రశంసించాడు .తండ్రి ముసలి సిద్దనామాత్యుడు వచ్చి నెత్తురు వర్రులో ఎగసి పడే కొడుకు ఖడ్గ తిక్కన కండలను శాలువలో సేకరించి ఇంటికితెచ్చాడు .వీరపత్ని చానమ్మ తిక్కనతో సహగమనం చేసింది

  మనుమసిద్ధి ,కాటమ రాజులమధ్య యుద్ధం సాగింది .కవిబ్రహ్మ తిక్కనామాత్యుడు పల్లకిలో వచ్చి యుద్ధాన్ని ఆపి ,’’ధర్మాద్వైతాన్ని’’ ఇద్దరికీ బోధింఛి ,స్నేహహస్తాలు కలిపి , సంధి కుదిర్చి , శాంతి గీతం ఆలాపించాడు .తెలుగు నాట శాంతి కేతనం రెపరెపలాడింది .తిక్కనగారి హరిహరాద్వైతం  పరమ శాంతిని చేకూర్చింది ‘’ .

  కవిగారు శ్రీ కడెము  వేంకట సుబ్బారావు గారు తన ‘’విన్నపం ‘’లో ‘’ఖడ్గ తిక్కన కథ-‘’కాటమ రాజు కథలు’’పేరిట ద్విపద ఛందస్సులో ఉన్నది .’’పిచ్చుగుంటలవారు’’  దీన్ని బాగా ప్రచారం చేశారు .పల్నాటి వీర చరిత్రకు ఉన్న ప్రాశస్త్యం ఖడ్గ తిక్కనకూ ఉంది .అందులో లాగా లోలాగా ఇందులో వంచనలు,మాయలు  లేవు .మనుమసిద్ధి కాటమరాజు ఇద్దరూ దీరోదాత్తులే .ఇద్దరూ నిజాయితీగానే వ్యవహరించారు .అక్కడ మగువ మాంచాల, ఇక్కడ చానమ్మ ఇద్దరూ వీరవనితలే .ఇద్దరూ భర్తలను యుద్ధానికి సమాయత్త పరచి వీర తిలకం దిద్ది పంపిన  తెలుగు ఆడపడుచులని పించారు .ఖడ్గ తిక్కన తన శౌర్య పరాక్రమాలతో శత్రువులను సైతం మెప్పించాడు .బాలచంద్రుడు నరసి౦గుని తల నరికి వీరస్వర్గం అలంకరిస్తే ,ఇందులోఖడ్గ  తిక్కన బ్రహ్మ రుద్రుని తలనరికి వీర స్వర్గం చేరాడు .ఈ ఇద్దరూ వీరాభిమన్యుని పౌరుష పరాక్రమాలకు వారసులే .

‘’’ఖడ్గ తిక్కన కథను పరిగ్రహించేముందు నేను యోగ సమాధి కి రావలసి వచ్చింది .ఆయోగ చక్షువులతో లోపాలన్నీ తొలగిపోయాయి .చక్కని ప్రేరణాలు ,సముచిత పూరణాలు బొమ్మకట్టి నా మనో వేదికపై ఆటాడాయి ,మాటాడాయి.మూల కథకు భంగం రాకుండా  ,ఇరు వర్గాలవారి గౌరవోన్నతులకు పోషకంగా రచన చేశాను .కావ్యం చివరలో కవి బ్రహ్మ తిక్కనను ప్రవేశ పెట్టి ‘’పోరునస్టం –పొందు లాభం ‘’అనే ధర్మోక్తి తో సఖ్యం కావించి ,మంగళప్రదంగా ఆంద్ర పౌరుష జ్యోతి వెలిగింప జేశాను .ఈ కావ్య రచన చేశాకనే డా శ్రీతంగిరాల వేంకట సుబ్బారావు గారి ‘’కాటమ రాజు కథలు ‘’గ్రంథం చూశాను .అందులో కొన్ని సముచిత విషయాలున్నాయి .

  ‘’ఖడ్గ తిక్కన ,కవితిక్కన అన్నదమ్ముల బిడ్డలు .ఇద్దరూ మనుమసిద్ధి మహారాజు సేనాపతిగా కవిగా ఉన్నారు . కవితిక్కన తన ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’కావ్యకన్యను మనుమసిద్ధికి అంకితమిచ్చి ‘’మామా ‘’అనిపించుకొన్నాడు .ఖడ్గ తిక్కన అనేక యుద్ధాలు జయించి మనుమసిద్ధికి జయశ్రీ కలిగించి ‘’గంధ వారణ’’బిరుదుపొండాడు .కవి తిక్కన లాగానే నేనూ నా కావ్యాన్ని హరిహర నాథునికి  అ౦కితమిచ్చాను ’’అని ఎంతో సమ దృష్టి తో కవిగారు సుబ్బారావుగారు చెప్పుకొన్నారు .

  నేను చెప్పాలంటే ఈ కావ్యం లో  ప్రతి పద్యం హృద్యంగా ఉంది . మంచి మాటల పోహళింపు ,చమత్కారం ,అలంకార సౌందర్యం ,పాత్రోచిత భాష ,నాటకీయ సన్నివేశ చాతుర్యం, ఒకే పద్యం లో వివిధపాత్రల సంభాషణ దేనికదే సాటిగా ఉన్నాయి .ఉదాహరించాల్సి వస్తే కావ్యమంతా ఉదాహరించాల్సి వస్తుంది .నాకు అంతబాగా నచ్చిన కావ్యం .ఇంతటి ఉత్తమ వీర కావ్యం మన సాహిత్య పరిషత్ ల దృష్టిలో పడకపోవటం ఆశ్చర్యంగా ఉంది .దగ్గరే ఉన్న నాగార్జున  విశ్వ విద్యాలయం వారికీ ఆనక పోవటం విడ్డూరం .నవ్యాంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సచివోత్తములు శ్రీ డి.విజయభాస్కర్ గారికీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికీ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘానికీ ఈ కవిగారి గురించి కావ్యం గురించీ తెలియదని పిస్తోంది .నన్నడిగితే ‘’అక్షర లక్షలు ‘’చేసే కవిత్వం ఇందులో ఉంది .హాయిగా చదివిస్తుంది .ఇంత తేలికగా పద్య రచన చేయవచ్చా అని పిస్తుంది ,మార్గ దర్శనం చేస్తుంది .మనల్ని ఎలివేట్ చేస్తు౦ది కావ్యం .

  ఆధారం –వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం శత వార్షిక  వేడుకలో నేను శ్రీ చలపాక ప్రకాష్ గారి  బృందం తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒక మహానుభావుడు శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం నాకు ఆత్మీయంగా అందజేశారు .  మూడు రోజుల క్రితమే  దాన్ని చదివి వారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం ‘’రాయటం చేత నిన్ననే   గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 లో 389 వ గీర్వాణకవిగా వారి గురించి రాసి సంతృప్తి చెందాను .ఇప్పుడు ఈ వ్యాసం రాశాను .

    ఇప్పుడే వేటపాలెం లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి గారికి ఫోన్ చేసి శ్రీ సుబ్బారావు గారి గురించి కావ్యం గురించీ నేను రాసిన విషయం గురించీ తెలియజేసి కవిగారి ఫోన్ నంబర్  ఉంటేతెలియజేయమని కోరాను .ప్రస్తుతం తనవద్ద నంబర్ లేదని తెలుసుకొని తెలియ జేస్తానని చెప్పి ,కవిగారు ఇప్పుడు 94ఏళ్ళ వయో వృద్ధులని  ,మాట్లాడలేకుండా ,కదలలేకుండా ఉన్నారని చెప్పారు .మొన్ననే తానూ వారి ఇంటికి వెళ్లి పలకరించి వచ్చానని చెప్పారు .అంతటి మర్యాద ఆమె పాటించినందుకు అభినందించాను .

శ్రీ ఖడ్గతిక్కన కావ్యం లో కవిగారి కవితా ప్రౌఢి కి మచ్చుకు కొన్నిపద్యాలు –

‘’శ్రీ గౌరీ హృదయేశ్వర –ఆగమ నిగమాది వినుత ,హరిహర నాథా-భోగీశ్వర ,యోగీశ్వర –బాగుగ రణ తిక్కన కథ పలుకుదు వినుమా ‘’

‘’శ్రీ కరుడవు ,జగతీ సృజ –నాకరుడవు ,కర్మ యంత్ర నాథుడవగుచున్ –లోకుల నేలెడి హరిహర –తేకువతో వినుము ఖడ్గ తిక్కన కథలన్’’(ఖడ్గ తిక్కన పౌరుష౦ )

‘’హృదయ పాత్రలో రక్తాజ్య మింత నించి –ప్రాణ వర్తి రగిల్చి ,శౌర్యాగ్ని పెంచి –తెలుగు పౌరుష జ్యోతియై తేజరిల్లి –వీడె’’ఖడ్గ తిక్కన ‘’వచ్చెచూడ రండు ‘’

‘’తెలుగు గడ్డ మగంటిమి వెలుగు బిడ్డ-మేఘ గర్జానుకారి ,క్రొమ్మెరు పనంగ-అశ్వ మెక్కి ఖడ్గో జ్వాల  హస్తుడగుచు  -‘’ఖడ్గ తిక్కన ‘’అరుదెంచె,కనుడు బుధులు ‘’(వీర తిక్కన )

‘’హరిహర నాథు డంట,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –హర గిరి జాద్వయంబు ,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –

పరము నిహమ్ముకున్ దిగిచి భక్తి రసామృత మందజేసి అం –దరకు దైవ దృష్టియును ,దర్శనమున్ కలిగింతురా ప్రజల్ ‘’(నెల్లూరు వర్ణన )

‘’జ్యోతి ప్రణవమైన చూడాంబ సుతులు దే-వాంగ జనులు మగ్గమందు నేసి –సన్న నూలు పట్టు అరి బుటా చీరెలు –అఖిల దేశములకు అ౦పు  చుంద్రు’’( నేత మగసిరి )

‘’పుల్లరడుగ బోయి పోరాట నిలబడి –ముచ్చముడిగి వోడి వచ్చినావు –నమ్ముకొన్న నృపతి నట్టేట ముంచితి –పరువు బరువు లేని పిరికి పంద‘’ (  తండ్రి ఈసడింపు ) )

‘’పెరటికి నన్ను తెచ్చితివి –పేర్మిని స్నానము చేయుమంటి ,వీ-పరిసరమంత స్త్రీలయిన వారికి మాత్రమె స్నాన యోగ్యమై-పరగుచు నుండెగాని –మగవారికి న్యూనత గల్గు నట్లుగా –స్వరచన మిచ్చటన్ జరుప జాలితి  వీ యెగతాళిసైతునా ?’’( భార్యతో తిక్కన )

‘’నాన్నగారు బైటకు వెళ్ళినారు పురుషు –లెవ్వరిటలేరు ,మరి పోతుటీగ రాదు –సిగ్గు పడకుండ స్నానంబు చేయవచ్చు –పసుపుతో స్నానమును చేసి త్వరగరండు ‘’-(భర్తతో చానమ్మ )

‘’పత్ని భుజోపరి మూట పట్టునంట-తల్లి కొమరు నాకలి పొట్ట తడుము నంట-కన్నతల్లి ఎవ్వరికైన కల్పవల్లి –అమ్మ పిలిచెను ,లోపలి కరుగువాడ ‘’( భోజనానికి సిద్ధమైన తిక్కన )

‘’వీర వనితనైతి ,వీర పత్నియు నైతి –వీరమాత నగుచు వీగిపోతి-వారపోసి నీకు హరతిచ్చిన నాడె-వీరమాత నగుదు వేడ్క పడుదు ‘’(కొడుకుతో తల్లి ప్రోలమ్మ  )

‘’అసదృశముగ నరి వీరుల – మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్ –కసవును మేయగ బోయిన –పసులును విరిగినవి తిక్క !పాలును విరిగెన్ ‘’(తల్లి అవమానం )

‘’ఇంక నాకు శాంతి ప్రశాంతి ఏమి లేదు –అంతకంత కావేదన అధికమయ్యె-అజ్ఞతాబ్ది నిర్మథన జీవాత్మ నేను –ప్రజ్వలత్ భిన్న భౌమాగ్ని పర్వతమను ‘’(క్రోధాగ్ని పరాభావాగ్ని తో తిక్కన )

‘’జడ వస్తువున శక్తి ,శక్తిలో చేతన –చైతన్య మానంద సాగరమగు –జీవాత్మ పరమాత్మ చేరిక ఒక్కటై –సచ్చిదానందాత్మ సాగరమగు –ప్రకృతిపురుష లాస్య భావ ,తా౦డవభావ –సహితాభినయ కళాసాగరమగు –ఊర్ధ్వ దృష్టికి ముక్తి –ఒగిఅధో దృష్టికి-సంసృస్టి యుగ సౌఖ్య సాగరమగు –అదియె బ్రహ్మ ముహూర్త నిత్యాభినవత –పొంగి పొరలు వేగురు జుక్క పొడుపు వేళ-గండు మగడైన ఖడ్గ తిక్కన్న తేజి –చూపు దాటె’’( వేకువ జాము వర్ణన )

‘’కుంతముల వంటి దంతాల క్రుమ్మి పొడిచి –కంబముల వంటి నాలుగు కాళ్ళ ద్రొక్కి –అరటి గెలల తోటల వంటి అరి బలముల –కూల ద్రోయుచు౦డెను మత్త కుంజరములు ‘’(భీకరయుద్ధం )

‘’ఘల్లు ఘల్లున మ్రోగు గజ్జల చెడ్డిపై –కుదురుగా పెనుకాసెకోక జుట్టి –ఘణఘణమని  మ్రోగు గంట లోడ్డాణ౦బు –నడుముపై బిగువుగా నాచికట్టి –ఉక్కు చొక్కావంటి చక్కని మరువును –బలుపైన ఎదరొమ్ము పైన బెట్టి –పాగా శిరస్త్రాణ వస్త్వాదికమ్ములు –శిరసున సొగసుగా జేర్చి చుట్టి –టముకు తప్పెట్లు మేళ తాళముల తోడ –చిందులను త్రొక్కుచు పదాతి సేనలపుడు –వారి వారి ఆయుధముల తీరు లెసగ –పొలికలని యందు వేర్వేర తలపడిరటె’’(సైన్య వర్ణన )

‘’ధర్మమును ,క్షాత్రమును నాకు ద్వ్యక్షు లంటి-జ్ఞాననేత్ర మొక్కటె ఆత్మ శక్తి యంటి-సోహమే బ్రహ్మమే నేను –జయము నేను –ఇటుల నా రాజ ఋణము నే నీగు చుంటి ‘’ (యుద్ధం లో  ఖడ్గ తిక్కన )

‘’రెండు పెద్దపులులు గా౦డురు గాండ్రంచు-బొబ్బరించి గ్రుడ్లు నుబ్బరించి –పళ్ళు కొరుకు చుండి పంజా విసరు చుండి –పోరునట్లు వారు పోరిరపుడు ‘’(ఖడ్గ తిక్కన ,బ్రహ్మ రుద్రయ్యల ద్వంద్వ యుద్ధం )

‘’ప్రళయ కాల రౌద్రోద్రేక భయద కాళి-నాల్క వంటి తిక్కన కత్తి నాట్యమాడె-మిత్తి మిడి గ్రుడ్ల జిగి వంటి మెరపులుమిసె-నిప్పు రవ్వలు పువ్వులు నింగి విరిసె’’(ప్రళయ భయంకర ఖడ్గ తిక్కన )

‘’కొంచె మూపిరితో ప్రాకి కొనుచు పోయి –ఖడ్గతిక్కన్న ధ్వజభూమి కన్ను మూసె-జ్ఞాన కర్మ యోగముల సంస్కారులైన – ఎట్టి వారికి నైన మోక్షైక  ఫలమె’’(ఖడ్గ తిక్కన వీర మరణం )

‘చిజ్జగాత్మక మీ విశ్వ సృష్టి యెల్ల-ఈశ్వరోత్పన్న ,మాత్మజులెల్ల జనులు –సోదరులుగ జీవింపక ,ఒకరి నొకరు –చంప జూతురే?వారికి చావు రాద?’’(కవి తిక్కన శాంతి సందేశం )

‘’తిక్క యజ్వ మహా మంత్రి ధీ నిదాన –నా నమస్కృతుల్ మీ ఉపన్యాసమునకు ‘’(మనుమా సిద్ధి )

‘’తిక్కన మహా కవీ !మీ సుదీ గరిమకు –మాకు కనువిప్పు కలిగె నమస్కృతు లివె’’(కాటమ రాజు )

‘’ఖడ్గ తిక్కనతో పోరాడగలుగు వాడు –రుద్రమూర్తికి ఈడైన భద్రమూర్తి –అట్టి జగదేక వీరులే అంతమైరి –అయ్య బ్రహ్మ రుద్రయ్య ! జోహారులయ్య ‘’(వీరులకు తిక్కయజ్వ నివాళి )

‘’యుద్ధమె ఆన్ని తీర్చునను యోజన మంచిది కా,దదేఅసం –బద్ధము –గెల్చి ,గద్దె గొని పాండవులే ,యువరాజు నెన్నుచో –ఇద్ధ కళా నిరాత్ముని పరీక్షితునిన్ గొనినారు ,శాంతి సం-సిద్దత బూని యెల్లరును క్షేమమునన్ బ్రతుకంగ  జెల్లదే’’(కవి  తిక్కనార్యుని ప్రజాహిత శాంతి సందేశం )

    ఈ కవిగారి గురించి వారి కావ్య రచన గురించి నేనూ ఇప్పటిదాకా తెలుసుకోకపోయినదుకు సిగ్గు పడుతున్నాను .ఇంతటి కావ్యాన్ని చదివి ఆస్వాదించలేక పోయినదుకు బాధగా ఉంది .ఇప్పటికైనా చదివి అందులోని సారాన్ని మీతో పంచుకొన్నదుకు మిక్కిలి సంతృప్తిగా ఉన్నాను .. మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-19-ఉయ్యూరు

  ఇప్పుడు మీకు శ్రీ  కడెము వేంకట సుబ్బారావు కవి వరేణ్యుల గురించి నేను నిన్న గీర్వాణం-4లో రాసిన వ్యాసం పొందుపరుస్తున్నాను

    గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .

  కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో సాగింది .1954లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్టం పొందారు .1954నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో ఆంధ్రోపాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .

 సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-1980 న మద్రాస్ లో గ్రామ ఫోన్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964లో తమ హైస్కూల్ లోనే ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975లో ఆవిష్కార మహోత్సవం జరిపారు  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసోదంచిత౦గా  వీర శృంగార స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత్ర  రాసి 6-41984లో ఆవిష్కారం జరిపించారు .

   విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975నకరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు  ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న  దేవాంగ సత్ర ప్రారంభోత్సవ సమయంలో   ఆంద్ర ,కర్ణాటక ,ఒరిస్సా రాష్ట్రాల వారిచే ‘’సాహిత్య సరస్వతి ‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త్ర నిర్మాత ‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .

  కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని  వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ తిక్కన తో ద్వంద్వ యుద్ధానికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ పరమేశ్వర  సుప్రభాత  శ్లోకాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు –

‘’శ్రీ సహస్రార పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్తతే సుప్రభాతం  -ఉత్తిష్ట పరమేశ్వర

‘’శృంగార శోభి గురు మస్తక జూట గంగ –చంద్రావతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార రాక్షస  విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.

  సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ  కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రాలు ,గ్రాంధిక  వ్యావహారికాలు ,సంప్రదాయ –ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రులు ,బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు  అక్షర సత్యాలు .

ఆధారం -30-12-18ఆదివారం వేటపాలెం లైబ్రరీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-19-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరసభారతి 136 వ కార్యక్రమంగా 25-1-19 శుక్రవారం సాయంత్రం శ్రీ సువర్చాలాంజ నేయ దేవాలయం లో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172 ఆరాధనోత్సవం

సరసభారతి 136 వ కార్యక్రమంగా 25-1-19 శుక్రవారం సాయంత్రం శ్రీ సువర్చాలాంజ నేయ దేవాలయం లో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172 ఆరాధనోత్సవం

 

No photo description available.
Image may contain: 2 people
No photo description available.
Image may contain: 2 people, people sitting and indoor

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి ౧౨౦వ జయంతి మహోత్సవ ఆహ్వానం -6-2-19 సా 6-త్యాగరాజ గాన సభ -హైదరాబాద్

కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి ౧౨౦వ జయంతి మహోత్సవ ఆహ్వానం -6-2-19 సా 6-త్యాగరాజ గాన సభ -హైదరాబాద్

Posted in సభలు సమావేశాలు | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .

  కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో సాగింది .1954లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్టం పొందారు .1954నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో ఆంధ్రోపాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .

 సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-1980 న మద్రాస్ లో గ్రామ ఫోన్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964లో తమ హైస్కూల్ లోనే ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975లో ఆవిష్కార మహోత్సవం జరిపారు  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసోదంచిత౦గా  వీర శృంగార స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత్ర  రాసి 6-41984లో ఆవిష్కారం జరిపించారు .

   విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975నకరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు  ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న  దేవాంగ సత్ర ప్రారంభోత్సవ సమయంలో   ఆంద్ర ,కర్ణాటక ,ఒరిస్సా రాష్ట్రాల వారిచే ‘’సాహిత్య సరస్వతి ‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త్ర నిర్మాత ‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .

  కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని  వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ తిక్కన తో ద్వంద్వ యుద్ధానికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ పరమేశ్వర  సుప్రభాత  శ్లోకాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు –

‘’శ్రీ సహస్రార పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్తతే సుప్రభాతం  -ఉత్తిష్ట పరమేశ్వర

‘’శృంగార శోభి గురు మస్తక జూట గంగ –చంద్రావతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార రాక్షస  విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.

  సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ  కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రాలు ,గ్రాంధిక  వ్యావహారికాలు ,సంప్రదాయ –ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రులు ,బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు  అక్షర సత్యాలు .

ఆధారం -30-12-18ఆదివారం వేటపాలెం లైబ్రరీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)

అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం

  అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కు౦జరుడు  .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి .కొత్తవారినెవ్వరినీ ప్రోత్సహించనివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వెల్లాల కవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ .తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగ రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,’’శృంగార శేఖర భాణం’’కూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డిత్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అనీ  అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు  అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .

  భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం  చారు చంపూ ప్రబంధం ”.

అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చివర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .

  ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –

”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేత శృ౦ఖలితమ్

రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”

  ఇప్పుడు వెల్లాలవారి’’ శృంగార శేఖర భాణ౦ ‘’గురించి తెలుసుకొందాం –

ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వెలువరించిన ఈ గ్రంథం మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండాగారం లోని ఒకే ఒక  వ్రాతప్రతి ఆధారంగా పరిష్కరించి ముద్రించింది .పీఠికలో ఆంధ్రులు రాసిన భాణాలను ఎన్నిటినో పేర్కొని ,అభినవ కాళిదాస బిరుదా౦కితులను గురించి ప్రస్తావించి  వెల్లాలవారు భాగవత చంపూ ప్రబంథాదులు రచించిన కవి అని తెలియజేశారు .ఇవికాక శ్రీ రంగాచార్య కృత పంచభాణ విజయం (1887),శ్రీ వరదాచార్య కృత వసంత తిలక భాణ౦  (1872)ఈచంబాడి శ్రీనివాసాచార్య కృత శృంగార తరంగిణీ భాణ౦  (1883)తమ  ఇంట ఉన్నాయని ఈ ముగ్గురూ తెలుగువారే అనీ  సమీక్షకులు శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు చెప్పారు .పీఠికలో పేర్కొన్న రేచర్ల సింగన కృతమైన ‘’కందర్ప సంభవ భాణం’’ లభించలేదని ,దీన్ని తన రచనయే అని చమత్కార మంజరిలో విశ్వేశ్వర కవి ,రసార్ణవ  సుధాకరం లో సర్వజ్ఞ సింగ భూపాలుడు పేర్కొన్నారని చెప్పారు .

    దశ విధ రూపకాలలో భాణం ఏకాంకిక . .శృంగార లేక వీర రస ప్రధానం .కాని శృంగార ప్రదానాలే ఎక్కువై  జుగుప్స కలిగిస్తాయన్నారు శాస్త్రీజీ .భాణకర్తలు దాదాపు అందరూ వ్యాకరణ తర్క మీమాంస వేదాంతాలలో నిష్ణాతులే .

  భాణం ఏక పాత్ర ప్రయోగం తో ,రంగ ప్రవేశం చేయని పాత్రల ప్రస్తావనతో ,ఆ పాత్రల స్వరాలను చక్కగా అభినయిస్తూ రక్తి కట్టిస్తుంది .ఖడ్గయుద్ధాలు ,పొట్టేళ్ల పోరాటాలు ,కోళ్ళపందాలు ,జార ధర్మాసనాలు  వర్ణింపబడతాయి .ఆయాపాత్రల ,శబ్దాల అనుకరణ వలన ప్రయోజన సిద్ధి లభిస్తుంది .అందుకే భాణం శ్రవ్య కావ్యానికి దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది అంటే  ధ్వన్యనుకరణ విద్యా ప్రదర్శనానికి భాణం గొప్ప వేదిక అవుతుందన్నమాట .ఒకే పాత్ర అద్భుతమైన నాటకీకరణ ,అసాదారణమైన ధ్వన్యనుకరణ వలన భాణం బహు  రక్తికడుతుంది .  శృంగార శేఖర భాణంలో ప్రధమ శ్రేణికి చెందిన ప్రాతిభా విలాసం తక్కువగాఉన్నా ,కవితాధార ,శృంగార రసవర్ణన ,చమత్కారం పుష్కలం  గా ఉన్నాయి .కవి కవిసమయాలను అనువుగా ఉపయోగించుకొన్నాడు అని సంపాదకులు చెప్పింది యధార్ధమన్నారు నోరివారు .ప్రస్తావనలో సూత్రధారుడు ప్రేక్షక సమాజం గురించి చెబుతూ –

‘’అధీతరతి తంత్రాణా మనంగ –బ్రహ్మ వాదినం –సోయం విదగ్ధ మిశ్రాణా౦ –సమాజ సముపస్థితిః’’అంటాడు .నాయకుడు దారిలో చందనలత తల్లి రమ్మని లోపలి పిలువగా అనుకొన్నమాటలు –

‘’కిమాత్ధ?అంతర్న ప్రవిశ్యతే  భావే వేతి-శిఖి సాంప్రతముత్పలమాలాయా దర్పణ పరిణయ నోత్సవార్ధం గమ్యతే –శ్వః సమాగామాన్తాస్మి –ఇయ మాశీః

‘’స్తవ శాలి సుతా యాస్తే తరంగిత రతిక్రియం  -అస్తు మన్మథ సర్వస్వ మఖండిత మిదం వయం ‘’

 చివరలో భరత వాక్యం కూడా కాముకుల ఆశయాలకు అనుగుణంగానే సాగింది –

‘’అనితర రసా ధీనం భూయా దనంగ పదం పదం(పరం ) –హృదయ మసకృచ్చ్సంగా రాద్వైత శృంగలితం నృణాం-శశిధర కలా పీడం శ్యామామయం కరుణామయం   –శమయతు పునర్జన్మ క్లేశం మమాపి వరం మహః ‘’

  ఆధారం –శృంగార శేఖర భాణ౦ పై శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు 1973 జనవరి భారతి మాసపత్రికలో చేసిన సమీక్ష .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.[

జీవిత విశేషాలు
ఆయన జూన్ 16 1949 న సాంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ ఘనపాఠీ గారివద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1969లో వ్యాకరణవిద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ (న్యాయ ప్రవీణ) ను ఉత్తీర్ణులయ్యారు. తరువాత గురుకుల విద్యావిధానంలో తర్క, వ్యాకరణ మరియు వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితుడు అయిన గోడ సుబ్రహ్మణ్యశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, లంక నరసింహశాస్త్రి, పేరి వెంకటేశ్వరశాస్త్రి, పేరి సూర్యనారాయణ శాస్త్రి మరియు రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి లవద్ద అభ్యసించారు.[2]

సత్కారాలు, బిరుదులు
శాస్త్రనిధి
శాస్త్ర రత్నాకర
శాస్త్ర మహాదధి
శాస్త్ర భూషణ
పండిత రత్న
శాస్త్ర విద్వాన్ మణి
విద్యా వాచస్పతి
శ్రీ రాఘవేంద్రస్వామి అనుగ్రహ పురస్కారం[1]
దర్శన అలంకార బిరుదు – శ్ర్ంగేరి పీఠాదిపతిచే.[1]
ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాలలో సత్కరించాయి. తిరుపతి లోని రాష్ట్రీయ విద్యా పీఠ్ వారు మహామహోపాధ్యాయ బిరుదును యిచ్చి సత్కరించారు.ఆయన రాజమండ్రిలో శాస్త్రపోషక సభ నిర్వహించినందుకుగానూ శృంగేరి మహాస్వామి ఆయనకు “సంచాలకత్వం” బిరుదును యిచ్చారు.[2]

ఆయన అనేక వేదసదస్సులలో పాల్గొని సంస్కృత సాహితీ జ్ఞానాన్ని అందిస్తుంటారు.[3]

ఆధారం -వీకీ పీడియా
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-19

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

387-పోతన భాగవతం  సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

  వ్యాసమహర్షి సంస్కృత భాగవతం మహా ప్రశస్తి రచన .దానికి పోతనామాత్యుని అనువాదం మందార మకరందం .అలాంటి పోతనగారి తెలుగు భాగవతాన్ని సంస్కృతం లోకి తర్జుమా చేయటం అంటే ఆషామాషీ కాదు .అసాధ్యం అని కూడా అని పిస్తుంది .కాని దాన్ని సుసాధ్యం చేసిన పండితకవి శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు .పోతనగారి రచనలో ప్రహ్లాద చరిత్ర ,గజేంద్ర మోక్షం ,,వామనావతారం ,గోపీ కృష్ణ విలాసం ,కంస వధ ,ఉద్దవ సందేశం భ్రమర గీతాలు  రాత్నాలవంటి భాగాలను ఎన్నుకొని సంస్కృతీకరించారు .పోతనగారి మాధుర్యానికి ఏమాత్రం భంగం రాకుందే  సంస్కృ తానువాదం సాగటం చాలా గొప్ప విషయం .పోతనగారి తెలుగు పద్యాలకు దీటుగా సంస్కృత శ్లోకాలు రాసి సెభాష్ అనిపించుకొన్నారు .పోతన చెప్పని విషయాలను కూడా చెప్పి మెరుగులు కూడా దిద్దారు .

  ధర్మరాజు నారదుని ప్రశ్నించటం లో మూలం లో లేని ‘’ప్రహ్లాదస్తుల పీలతా సురకలం జారణ్య జాతాః భవత్ ‘’అనే రూపకాన్ని చేర్చి పవిత్రతను కాపాడారని శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు తన సమీక్షలో తెలిపారు .పోతన అనుప్రాసాలను ఉన్నది ఉన్నట్లుగా ,కొన్ని చోట్ల వేరే శబ్దాలతో సన్నిధానం వారు సొగసు చేకూర్చారు .’’బాలం హరిపద చిన్తాలోలం దూరీ కృతాఘ జాలం త౦ శ్రీలం పితాజిఘాం సత్కథ  ,మిత్యాహస్మ –సూనుం శాంత గుణ ప్రదాను’’మొదలైన పద్యాలను ‘’పుత్రం పాప లతా లవిత్ర మమలజ్ఞానైకపాత్రం మహా భ్రాత్రం’’మొదలైన స్వతంత్ర అనుప్రాసలతో సంస్కృతీకరించి వన్నె తెచ్చారు .-

‘’హాలాపాన విజ్రుంభమాణమద గర్వోద్రిక్త దేహోల్లసత్ –బాలాలోకన శ్రుమ్ఖలా నిచయ స౦బద్ధొన తర్తు౦ క్రమః –సంసారంబు నిధిం కదాపి చమహా విద్యా౦శ్చధిక్కామినీ –హేలా కృష్ణ కురంగ శాబక ఇవ స్యాద్ భ్రాతరఃపశ్యత ‘’.

  నృసింహావతార౦ లో వచనం విభక్తి ప్రత్యయాల మార్పుతో  ఎక్కువభాగం మూలమే ఉండటం చేత పోతన ప్రదర్శించనట్లే అయింది అంటారు నోరివారు .గజేంద్ర మోక్షం లోని ‘’లావొక్కింతయు లేదు ‘’పద్యానికి  సంస్కృతాను వాదం చూద్దాం –

‘’క్షీణం మే అంగబలం ధృతి ర్విచలితా ,స్థానాచ్చ్యవంతే నవః –నమ్ముగ్దోస్మి,భ్రుశం ,కృశోస్మి భిన్నోస్మి చ –

నత్వద్వేద్యపరం శరణ్య మనమాం క్షాంతాపరాదాన్ ,రయా –దాయా హేశ్వర,పాహిమాం ,వరద  భో రక్ష సర్వేశ్వర’’

  వామనావతారం లో ‘’ఆదిన్ శ్రీసతికొప్పుపై ‘’అనే పోతన ప్రశస్త పద్యానికి  సన్నిధానం వారి    సంస్కృతానువాదం –

‘’ఆదౌ శ్రీ యువతేః కచేష్యద తనూ వల్క్యాంతదంశోత్తరా-సంగే గంగ తలేతతః కుఛ తటే పాదాంబుజా తద్వయే

యోస్తే వ్యాపృత యేష పాణి రధరో మేపాణి రస్త్యుత్తరః-శ్రేయో స్మాత్కిము శాశ్వతం భవతి కిం శరీరం శ్రియః ‘’

అలాగే ‘’ఇట్లు విష్ణుండు గుణ త్రయాత్మక౦ బగు విశ్వ రూపంబు ధరియించిన భువియు ,నభంబును ,దివంబును దిశలు ‘’అనే విశ్వ రూప వర్ణన వచనం అంతా,   సంస్కృతానువాదం లో ప్రత్యయాలమార్పుతో –‘’ఏవం వటునా ధృతే  గుణ త్రయాత్మకే విశ్వ రూపే ద్యావా పృధివ్యౌదిశః ‘’అనే పోతనగారి శబ్దాలతోనే చేయటం సంమోదావహంగా ఉంది అన్నారు నోరి నరసింహ శాస్త్రి గారు .

  మను చరిత్రను శ్రీ కుంటి మద్దిశేష శర్మగారు సంస్కృతం లోకి  అనువాదం చేసినప్పుడు నోరి వారు ‘’ఆంద్ర కావ్యాలను సంస్కృతం లోకి అనువదించేవారు సంస్కృత భూయిష్ట భాగాలను ఆ ఛందస్సులతోనే అనువదించినందుకు అభినందించాను .ఇతర అనువాదకులు కూడా ఈమార్గాన్నే అనుసరించాలి అని సూచించాను .సన్నిధానం వారు అదే మార్గాన్ని అనుసరించటం అభినందనీయం ‘’అన్నారు .’’ఈ  సంస్కృతానువాదం లో పోతన కవితా మాధుర్యం సంస్కృత భాషా విదులకు చవి చూపి నందుకు సన్నిధానం శాస్త్రి గారు స్తవనీయులు ‘’అని శ్లాఘించారు .

2-సన్నిధానం వారు కొన్ని ప్రసిద్ధ  కావ్యకథలను’’ ‘’కావ్య కథా’’పేరిట సంస్కృతీకరించారు . .ఈకథలను ఇంగ్లీష్ లో చార్లెస్ లాంబ్ షేక్స్పియర్ నాటక కధలను రాసినట్లు రాశానని శాస్త్రిగారు చెప్పుకొన్నారు  .శాస్త్రిగారి ప్రయత్నం మంచిదేకాని కాని అందులో మాధుర్యం లేదన్నారు నోరి వారు .కొన్ని ఆంధ్రకావ్య కథలను అనుసరించక స్వతంత్రత చూపారనే అన్నారు .కాని జాగ్రత వహించనందున అనౌచిత్యాలేర్పడ్డాయంటారు .శ్రీరాముడు సముద్ర తరణం ‘’సాగరోయం దశ యోజన విస్తీర్ణఃశతకాల దఘ్నశ్చ’’అని మాత్రమె అన్నాడుకాని శాస్త్రిగారు దాన్ని’’’శతయోజనమాయతమ్’’అని చెప్పటం భ్రమ జనితం .ఉడత సాయాన్ని ;;చిక్రోడకధ’’గా రాశారు .ఉడతకన్నా ముందే కాకులు గ్రద్దలు ,చీమలు సేతుబంధనానికి సాయం చేసినట్లు  శాస్త్రిగారు కల్పనా చేశారని ,కాని రాముని దయ ఉడతపై మాత్రమె చూపి మిగిలిన జంతువులపై చూపక పోవటం సందర్భ శుద్ధిగా లేదంటారు నోరివారు .రంగనాధ రామాయణం లో ఉడుత సాయమే ఉందికాని మిగిలినవాటి సాయం లేనేలేదన్నారు .ఏమైనా ఇదంతా అవాల్మీకం .

  ‘’ఏకలవ్య కధ’’లో ద్రోణుడే కుడి బొటన వ్రేలును గురు దక్షిణగా కోరినట్లు చేసిన శాస్త్రిగారికల్పన ఆంద్ర భారత కధకు కూడా విరుద్ధమే అని తేల్చారు శ్రీనోరి ..ప్రస్తావనలో శాస్త్రిగారు ‘’సంస్కృతం లోని వాసవదత్త మొదలైన వాటిని ప్రస్తావించి వాటిలో కదా సరస్వతీ నది లాగా కనబడీ కనబడనట్లున్నది ,అందుచే వాటిని చదవటానికి బుద్ధిపుట్టదు’’అని ఆక్షేపణ సమంజసం కాదు .లోకోత్తర చమత్కారం అయినప్పుడే రసవంతం అవుతాయి ‘’అని తీర్పు ఇస్తూ ఈ సంస్కృత  కథలు  సంస్కృత భాషాధ్యయనం చేసే విద్యార్ధులకు ఉపయోగపడుతాయి అనటం లో ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా చెప్పారు .

3- భర్తృ దానం –అనేది సన్నిధానం వారు పారిజాతాపహరణ కధకు చేసిన    సంస్కృతానువాదం శృంగారం .దీనికి ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు ఇంగ్లీష్ లో అద్భుతమైన ఉపోద్ఘాతం రాశారని నోరి వారు కితాబిచ్చారు .పారిజాత కధవరకు శృంగార రస ప్రాదాన్యమనీ ,తులాభార కథ శాంతరస ప్రదానమైనదనీ, శృంగారం  అంగరసమై ,ఇంద్రునితో యుద్ధాన్ని రెండుపద్యాలతో సంక్షిప్తఎపింఛి ,అంగ కధకు అతి విస్తృతి దోషం రాకుండా చేశారని పుల్లెలవారు మెచ్చారనీ ,కాని సన్నిధానం వారి కథలో 23పేజీలు  పారిజాత కథ ఉంటె శీర్షికగా పెట్టిన భర్తృ దానకద 12పేజీలే ఉందని కనుక పుల్లెలవారు చెప్పిన దోషం ఇక్కడా వర్తి౦చిదనీ   నోరి వారు ఉవాచ .సంస్కృత దృశ్యకావ్యాలలో ఉన్న కథా బిగువు శ్రవ్యకావ్యాలలో ఉండదనటం ప్రసిద్ధం .వ్యాకరణ శాస్త్రం చేత సాధించలేని ప్రయోగాలు   సంస్కృతానువాదం లో సన్నిధానం వారు చేయటం ఉచితంకాదని నోరి శాస్త్రిగారి అభిప్రాయం .పునీత శబ్దాన్ని తానూ సమర్దిస్తాననీ నోరి ఉవాచ .పారిజాత కథను సులభ  సంస్కృతం లో రచించి అఖండ భారత వ్యాప్తికల్గించిన శాస్త్రిగారి ప్రయత్నాన్ని తాను ‘’అగ్గించు చున్నాను ‘’అన్నారు నోరిశ్రీ .

4-నందచరితం అనేది సన్నిధానం వారు ‘’భక్తనందనారు ‘’చరిత్రగా సంస్కృతం లో రాసిన రచన .దీనికి ఆంగ్లం లో ఉపోద్ఘాతం శ్రీ కేవిఎన్ అప్పారావు రాశారు .’’నక్క ఎక్కడ నాగలోకమెక్కడ ‘’వంటి  తెలుగు సామెతలను చాలా సులభంగా  సంస్కృతీకరించినందుకు అప్పారాగారూ నోరివారూ సన్నిధానం శాస్త్రిగారిని మనస్పూర్తిగా శ్లాఘించారు .

5-కళాపూర్ణోదయః – పింగళి సూరన కళాపూర్ణోదయ కథకు సన్నిధానం వారి   సంస్కృతీకరణం ఇది .ఆంద్ర కావ్యాలలోనే కాదు భారతీయ భాశాకావ్యాలన్ని టి లోనూ విశిష్టమైంది పింగళి సూరన కళాపూర్ణోదయం అనీ,రామరాజ భూషణుడి ‘’ వసు చరిత్ర’’వచ్చిన వందేళ్ళకు’’ కాళహస్తి ‘’కవి దాన్ని  సంస్కృతీకరింఛి గొప్ప గౌరవం కలిగించాడనీ , పూర్వం సంస్కృత భాషమీద దండయాత్ర చేసిన ప్రాకృత భాషాకవుల కావ్యాలు వాటిలోని సంస్కృత చాయవలననే  ఇప్పటికీ నిలిచిఉన్నాయని ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ దూరదృస్టి తో చేబట్టిన సంస్కృతీకరణ చాలా విశేషమైనదని నోరి నరసింహ శాస్త్రిగారు అభిప్రాయ పడ్డారు .

  ‘’కళాపూర్ణోదయం సరస్వతీ చతు ర్ముఖుల లీలా కేళి ని ఆధారం గా చేసుకొని ,దాని ఆధారంగా ‘’గృహరాజు మేడ ‘’గా నిర్మించిన సుందర కథా మందిరం ..దీన్ని  సంస్కృతీకరించే పని చేబట్టిన సన్నిధానం వారు మిక్కిలి అభినదనీయులు .’’అని మెచ్చారు నోరివారు .పుల్లెలవారి ప్రస్తుతిపొందిన ఈ అనువాదం అదే స్థాయిలో నడచింది అనవసర విషయాలు తీసేసి చిక్కని చక్కని కథను సంస్కృతం లో నడిపించారు .సంస్కృత కావ్యాలలో సర్గలో శ్లోకాలన్నీ ఒకే వృత్తం లో ఉండి,సర్గాంతం వేరే వృత్తం లో ఉంటుంది .సన్నిధానం వారు ఆంద్ర సంప్రదాయాన్నే అనుసరించారు .మూలం లోని 105పద్యాల మంగళాచరణం ,కృతిపతి వంశ వర్ణన వదిలేశారు అనువాదం లో .ద్వారకాపుర వర్ణనతో ప్రారంభించారు .దీనివలన తెలుగు కావ్యమర్యాద సంస్కృత భాష వారికి తెలియదు .కొన్నిపద్యాలను సంక్షేపించి కొన్ని యధామూలంగా అనువదించారు .

  మొదటి ఆశ్వాసం లో కలభాషిణి నోట సూరన వినిపించింది సీసపద్యం  -’’పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన’’  దీనికి శాస్త్రిగారి   సంస్కృతానువాదం –

‘’పదాని పంధాయ మిథో హితాని –కావ్యే రాసానా మనుకూల రీతీః-గుణానలంకార గణా౦ స్తదర్హాన్ –బద్నన్ కవీ౦ద్రో న మహీయతే కైః’’

 పద్యం తాత్పర్యమైతే వచ్చిందికాని ,కాని తెలుగుపద్యం అందం అసలు రానేలేదు .వాచ్య ,లక్ష్య ,వ్యంగ్యార్దాల ,నిర్దోషిత సంగతి మచ్చుకైనా అనువాదం లో రాలేదు .

సూరన లయభాతి పద్యం –‘’చలువల వెన్నెలలు చెలువునకు సౌరభము ‘’దీన్ని శాస్త్రిగారు స్రగ్ధరా వృత్తం లో అనువాదం చేశారు –

జ్యోత్స్నాయా శ్శీతలాయా యది సురభిలతా –శైత్య సౌరభ్య భాజాం –కర్పూరాయాం మృదుత్వం యదిచ ,మధురిమా –విద్యతే చే న్నిగాఢం-వాతానాం చంద్ర వాద్రేర్మసృణ మ్రుడులతా –శైత్య సౌరభ్య భాజా –మర్హం త్యాఖ్యాతు మేతే సదృశ ఇతి కవే –రస్య కవ్యస్య వాగ్భిః’’

  ఈ సంస్కృతానువాదం యధా మూలంగా హృద్యంగా ప్రౌఢం గా సాగిందని దీని తో శాస్త్రిగారి సంస్కృత కవన సమర్ధత జగత్తుకు  చాటిందని మనస్పూర్తిగా నోరి శాస్త్రిగారు మెచ్చుకున్నారు .శాస్త్రి గారి సంస్కృత అవతారికలో ఆంధ్రకవుల ఆచారాన్ని  సహృదయులకు నమస్సు లర్పించారు  –

‘’గోస్ఠశ్వా  విమృశ౦తియే కవి కృతీః కర్తుం –న శక్తాః స్వయం –తాన్ సంప్రీ జయితుం వహి ప్రభవతి బ్రహ్మాసి –తేభ్యో నమః ‘’

  ఇదీ బ్రహ్మశ్రీ సన్నిధానం సూర్యనారాయణ  శాస్త్రిగారు తెలుగు కావ్యాలకు సంస్కృతం లో చేసిన మహోపకారం .ఆంధ్ర గీర్వాణాలలో జగజ్జెట్టీలు కనుక వారి అశేష పాండితీ వైదుష్యానికి వారి అన్ని రచనలు మచ్చుగా నిలిచాయి .

  సన్నిధానం వారి మహుముఖీన ప్రతిభను గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం లోనే రాశాను .ఇప్పుడు ఈ అదనపు సమాచారం లభించటం చేత దాన్ని విస్తృత పరచాను .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద కావ్య ,నాటక అలంకార  వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు .తిరుపతి ,మద్రాస్ ప్రాచ్య కళాశాలలలో చదివి శిరోమణి ,విద్వాన్, పి.ఒ.ఎల్.మొదలైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు .సికందరాబాద్ మహబూబ్ కాలేజి హైస్కూల్ లో ఉపాధ్యాయులుగా చేరి ముప్ఫై అయిదేళ్ళు పనిచేశారు .తర్వాత రావు బహద్దర్ వెంకట రామ రెడ్డి కాలేజిలో  సంస్కృతోతోపన్యాసకులుగా 1954 నుండి ఎనిమిదేళ్ళు ఉన్నారు .

   శాస్త్రి గారి భార్య అకాల మరణం చెందారు .ఈ బాధను మర్చిపోవటానికి సాహిత్య రచన ప్రారంభిం చారు .రచన అంటే వీరికి నిద్రా హారాలు గుర్తుకు రావు .అలా పని చేసి రామ రాజ భూషణుని ‘’కావ్యాలంకార సంగ్రహం ‘’కావ్యానికి సమగ్ర మైన వ్యాఖ్య రాసి సమర్ధత ను రుజూవు  చేసుకొన్నారు .ఈ అపూర్వ గ్రంధం ప్రాచ్య ,పాశ్చాత్య ఆలంకారికుల పాలిటి చింతామణి , కల్ప వృక్షమే, కామ దేనువే  అయింది .వీరి ‘’తత్సమ చంద్రిక ‘’వ్యాకరణ గ్రంధం వ్యాకరణ శాస్త్రం లో తలమానిక మైనది .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి కూడా వ్యాఖ్యానం రాశారు .సంస్కృతాంధ్ర వ్యాకరణాలు మొత్తం చదివి అర్ధం చేసుకొని వ్యాఖ్యానించి రాసిన శాస్త్రి గారి పై రెండు గ్రంధాలు వ్యాకరణ విద్యార్ధులకు ,వ్యాకరణం బోధించే పండితులకు శిరో దార్యాలుగా నిలిచాయి .శాస్త్రి గారు సంస్క్తుతం లో 20 కి పైగా గ్రంధాలు రచించారు .తెలుగులో 25వరకు అరుదైన పుస్తకాలు రాశారు .రెండు భాషల లోను వీరు రచించిన గ్రంధాలు మృదు మధుర శైలిలో ఉండి  రసజ్నులను ఆకట్టుకొన్నాయి .వీటిలో కొన్ని ముక్తకాలు, కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి .తెలుగు నుంచి సంస్కృతం లోకి ,సంస్కృతం నుండి తెలుగు లోకి శాస్త్రి గారు తర్జుమా చేసిన గ్రందాలెన్నో ఉన్నాయి .అంటే అనువాదకులుగా శాస్త్రిగారు గొప్ప కృషి చేశారు .రచనలన్నీ శిష్ట వ్యాకరణ ప్రయోగాలతో ఉంటాయి. అందుకే వీరిని ‘’ఆ జన్మ సిద్ధ కవి ‘’అన్నారు .జాతక కధలను కొన్నిటిని ‘’జాతక కదా గుచ్చం ‘’పేరుతొ సంతరించారు .’’గోవర్ధనుడి ‘’సప్త శతీ సారం ‘’ను తెలుగు లోకి అనువాదం చేశారు . ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ను ‘’భర్త్రు దానం ‘’గాను ,పోతన గారి కొన్ని భాగవత ఉపాఖ్యానాలను ‘’భాగవతాను వాదః ‘’,పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని ‘’కళా పూర్ణోదయం ‘’గా సంస్కృతీకరించారు .దీని వలన తెలుగు కవుల ప్రబంధ నిర్మాణ సౌందర్యాన్ని యావద్భారత సంస్కృత పండితులకు మ్రుస్టాన్న భోజనం గా అందజేశారు .రుక్మిణీ కళ్యాణం ను ‘’కీర సందేశం ‘’గా ,రాశారు .ద్వంద్వ యుద్ధం ,ఖడ్గ తిక్కన ,వాసవ దత్త ,రేణుక విజయం వివేకానందం అనే సుప్రసిద్ధ రచనలు చేశారు .

అమృత కణాలు ,స్మరగీతి ,మొదలైన ముక్తక సంకలనాలు తెచ్చారు .’’నది మంత్రపు సిరి ‘’అనే అధిక్షేప కావ్యాన్ని రాశారు .తెలుగు లోని మను చరిత్రాది పంచ మహాకావ్య కధలను ‘’ఆంధ్ర ప్రబంధ కధలు ‘’గా రాశారు .దీనినే ‘’ఆంద్ర కావ్య కతాః’’గాను ,తెనాలి రామ కృష్ణుని కధలను ‘’ఆంద్ర దేశ హాస్య కదాః ‘’గా ను సంస్కృతం లో రాసి ఆ భాషాభిమానులకుతెలుగు రుచి చూపించి  పరిచయం చేశారు .శాస్త్రి గారు ‘’కాదంబరీ పరిణయః ‘’అనే స్వతంత్ర సంస్కృత నాటకం రాశారు .స్వంత తెలుగు రచనలను సంస్కృతం లో కి అనువదించుకొన్న వారిలో సూర్య నారాయణ శాస్త్రి గారే ప్రప్రధములు .ఆ కీర్తి చిరస్మరణీయం .

వన పర్తి ,గద్వాల ,సంస్థానాధీశులు శాస్త్రి గారిని ఆహ్వానించి  గౌరవించి సత్కరించారు .ప్రతి ఏటా వార్షికాలు ప్రదానం చేశారు .ఎందరో జమీన్ దారులు ,సాహిత్య సంస్థలు శాస్త్రిగారిని సన్మానించాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ లో విశిష్ట సభ్యులను చేసి ప్రభుత్వం గౌరవించింది .ఖమ్మం జిల్లా ఇల్లెందువిద్వత్ సమావేశం లో ‘’విద్యా రత్న ‘’బిరుదు అందుకొన్నారు .ఆఖరి శ్వాస వరకు సాహిత్య జీవనం సాగించిన సాహిత్య్పజీవి సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారుఎనభై  అయిదేళ్ళు జీవించి 14-10-1982న సరస్వతీ సన్నిధానం చేరారు .వారి లోటు సాహిత్య లోకం లో తీరనిదిగా మిగిలిపోయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 ప్రస్తుత కథనానికి ఆధారం –శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1972 జులై భారతి మాసపత్రిక ,1964డిసెంబర్ భారతి ,మాసపత్రికలో చేసిన సమీక్షలు అని సవినయంగా మనవి చేస్తున్నాను .వీటిని నాకు అందించిన వారి కుమారులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2002లో అమెరికాలోని హూస్టన్ లో మా మనవడు చి శ్రీకేత్ చిన్నతనం లో మా ఫోటోలు

2002లో అమెరికాలోని హూస్టన్ లో మా మనవడు చి శ్రీకేత్ చిన్నతనం లో మా ఫోటోలు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం )

మైసూర్ ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరీ లో అసిస్టెంట్ పండితుడుగా ఉన్న లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య ‘’భగవద్గీతా మీమాంస ప్రబందం’’రాశాడు .తనకుటుంబం  గురించి చెప్పుకోలేదు కాని ,తన గురించి రెండు శ్లోకాలలో ఈ గ్రంధం లో చెప్పుకొన్నాడు .

‘’నానా భాషాసు భాషాపతిరివ మధురోదార గంభీర వాదీ-విద్వద్గోస్టి సుభాషా  సుఖ రసిక మనాః

మైసూర్సమ్రాట్ట దేశే సదధి కృతి పదే ప్రోన్నతే భాసమానః –శ్రీమాన్ దీమాన్ యశోమాన్ భువి జయతి శ్రీ వి.యెన్.నృసింహార్య శర్మా ‘

తస్మై శ్రీ నృసింహ య్యంగార్య వార్యాయ ధీమతే –సమర్పితం సవినయమే తత్పుస్తకమస్తు శమ్’’

అసలు విషయం లోకి ప్రవేశిస్తూ ఇలా రాశాడు –

‘’  అధ ఖాలు భగవద్గీతా నామకం మహాభారత భీష్మ పర్వాన్తర్గత మధ్యాత్మ శాస్త్ర ముపనిషచ్చబ్ద  వ్యపదేస్య౦  క౦చన ప్రబంధ ముపబామహె –అధీమహోమాచాన్వహం సర్వేపి వయం పరమ నిశ్రేయస కరమితి.

386-ధవళేశ్వర స్తోత్ర సుధకర్త –సామవేదం రామ మూర్తి శర్మ (1931)

జీవిత విశేషాలు

బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం నందలి రమాధీర సంస్కృత కళాశాలలో గురుకులపద్ధతిలో ముడెగుర్తి వి.ఎస్.ఎన్.శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేసారు. ఆయన భాషాప్రవీణ, సాహిత్యాచార్య, పురాణశాస్త్రి అర్హతలను సాధించారు. ఆంధ్ర సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేసి 1989లో పదవీవిరమణ చేసారు[1]. వీరు చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితిని స్థాపించి ఎన్నో సాహితీ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య సంస్కృత పాఠశాల స్థాపించి ఎందరికో సంస్కృత బోధన గావించి, విద్యాదానం చేశారు. దాదాపు అర్ధ శతాబ్ది కాలం పురాణ ప్రవచనములు చేసిన పండిత ప్రకాండులు వీరు. కవిగా ప్రబంధ కర్తగా బహు ప్రసిద్ధి వహించారు. ధవళేశ్వర స్తోత్ర సుధ, శ్రీదేవి లీలాసుధ, ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర, ధృవోపాఖ్యానము, కామేశ్వర స్తోత్రసుధ, శ్రీగణేశాభ్యుదయం, శ్రీమదభీష్టద రామాయణము జగన్నాథ స్తోత్రసుధ, వేంకటేశ్వర నక్షకోమాల, భగవన్నుతి దండకమాల, నేనెవడు?, శ్రీసుబ్రహ్మణ్య సీసపద్య శతకము, నిరాలంబోపనిషత్,సుబ్రహ్మణ్య ‘సకార ‘సహస్రం, వంటి గ్రంథాలను రచించారు.

ఈ మహనీయుని పాండిత్య కవిత్వాలు సుబ్రహ్మణ్యాంకితాలై వారి యోగసాధనకు రూపాలై ఉన్నాయి. అరుదైన పురాణాంశాలను శోధించి వాటిని పరతత్త్వంతో సమన్వయించడం వారి సరణి. స్కందోపాసకులైన వీరు నిష్కపట భక్తితో కూడిన జ్ఞాని. వీరి రచనలు ఆర్షతేజోవిరాజితాలు. సాధారణంగా హరికథల్లో వాడే “తొహరా” అనే రగడ వంటి దేశీయ వృత్తాలతో బ్రహ్మవైవర్త పురాణాంతర్గత బ్రహ్మఖండ ప్రకృతి ఖండాలను రచించారు. “దేవీభాగవతం” అనే ఒక అరుదైన ప్రాచీన గ్రంథాన్ని (సాధారణంగా లభిస్తున్నదేవీభాగవతానికి విభిన్నమైన) అదే వృత్తంతో “దేవీలీలాసుధ” పేరుతో రచించారు. ఇవి బృహత్ గ్రంథాలు. థర్మ వేదాంతశాస్త్ర చర్చ చేసిన గ్రంథాలు నేనెవడను?”, “తత్త్వదర్శిని కామేశ్వర స్తోత్ర సుధ, నిరాలంబోపనిషత్ ప్రశ్నోత్తర గర్భితంగా రచించిన సుబ్రహ్మణ్యసీస పద్య శతకం, ధవళేశ్వర స్తుతి, జగన్నాథ నక్షత్రమాల వంటి గ్రంథాలు ఆర్ష విజ్ఞానాన్ని ఛందోబద్ధంగా అందించిన రచనలు. ఋషిధర్మ సముపాసనతోనే ప్రతిక్షణం ఒక జ్ఞాన దీప్తిగా వెలిగిన వారి భావన నుండి వెలువడిన మరొక పద్యగద్యాత్మిక కావ్యం శ్రీమదభీష్టద రామాయణము” వాల్మీకి, అధ్యాత్మ రామాయణాలనే కాకుండా బహుపురాణాల, మంత్రశాస్త్రాల సమన్వితంగా సంపూర్ల రామాయణాన్ని రచించారు. వీరి ప్రతి రచనా తన అభీష్టదైవమైన కుమారస్వామి వచరణాలకు అర్పించుకున్నారు. జీవితంలో ఆటుపోట్ల ఎన్ని ఎదురైనా తన ప్రతిభావ్యత్పత్తులకు తగిన రాణింపరాకున్నా అధ్యాత్మ విద్యా సంస్కారంతో హిమశైల సమాన ధీరగుణంతో నిలచిన పరిపూర్ఖులు వీరు. ఆబాల్యం వీరి వైఖరిని గమనించడమే సాధనగా విరిసిన ఆధ్యాత్మిక తేజో విలాసమే “ఆర్షధర్మోపన్యాసకేసరి”.

ఆయనకు ఫిబ్రవరి 10,2008 న విశాఖపట్నం లో స్వర్ణకంకణం యిచ్చి సత్కరించారు.[2]

వ్యక్తిగత జీవితం

సామవేదం నరసింహాచార్యులు(తండ్రి), సత్యవతి (తల్లి) దంపతులకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమారుడు సామవేదం రామమూర్తిశర్మ. రామమూర్తిశర్మ మూడవ కుమారుడు “సామవేదం సత్యనరసింహశర్మ”[3]. మరొక కుమారుడు సామవేదం షణ్ముఖశర్మ ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత, ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.

రచనలు

“శ్రీ ధవళేశ్వర స్తోత్ర సుధ”
గణేశాభ్యుదయం [4]

ఆధారం –వీకీ పీడియా

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)

సంస్కృత మహా విద్వాంసుడు మహాకవి అనేక గ్రంథ రచయిత కాళీ ప్రసన్న విద్యారత్న 1849లో బెంగాల్ లో జన్మించి 75వ ఏట 1924లో మరణించాడు .1908నుంచి 10వరకు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .భట్టా చార్య కుటుంబానికి చెందిన ఈ కవి బరిశాల్ లోని ఉజిర్ పూర్ గ్రామం లో జన్మించాడు .ఫరీద్ పూర్ జిల్లా ధనూకా గ్రామం లో చతుష్పతి అంటే వీధి బడిలో సంస్కృతం అభ్యసించాడు.బారిశాల్ లో ఎంట్రన్స్ పాసై కలకత్తా స్కాటిష్ చర్చ్ కాలేజి  చేరి బి .ఏ ,ఎం.యే లు పాసై ,1881 లో ఢక్కాజగనాథ కాలేజిలోసంస్కృత  టీచర్ గా చేరి ,తర్వాత 1901వరకు ప్రెసిడెన్సి కాలేజిలో పనిచేసి ,తర్వాత ఆకాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు .

భారతీయ పురాణాల ను తనసంపాదకత్వం లో వెలువరించి ,సంస్కృత రచనలు ఎన్నో చేశాడు .ఆయన రచనలలో బృహత్ శివ పురాణం ,శ్రీ శ్రీకృష్ణ చరితం ,వేదాంత దర్శనం ,బృహద్యాగమిత,బృహద్దహ పురాణం ,శివ సంహిత ,సంజీవ్ చందర్ గ్రంధావళి ,కాళీ కైవల్యదాయిని ,కల్కిపురాణ౦ ,స్తబ్ కోవచమాల ,కైతంత్ర మొదలైనవి ఉన్నాయి .సంస్కృత విద్యా వ్యాప్తికి టోల్ లను సందర్శించి ,టోల్ వ్యవస్థను పటిస్టపరచాడు .1911లో సంస్కృత సాహిత్య పరిషత్ అధ్యక్షుడయ్యాడు .మహా మహోపాధ్యాయ బిరుదు అందుకున్నాడు.

384-విష తంత్ర కర్త – కవిరాజ్ జైమిని భూషణ్ రే(1879- 1926)

కవిరాజపంచానన రే కుమారుడు కవిరాజ్  జైమిని భూషణ్ రే 1879లో ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఖుల్నా జిల్లా పోయోగ్రాం లో జన్మించాడు .స్థానికంగా విద్యాభ్యాసం ప్రారంభించి ,తర్వాత దగ్గరే ఉన్న కలకత్తా లో14వ ఏట సౌత్ సబర్బన్ స్కూల్ లో  సెకండరీ విద్య పూర్తి చేసి ,కలకత్తా  సంస్కృత కళాశాలలో బి ఏ చదివి ,ప్రభుత్వ సంస్కృత కాలేజి లో మాస్టర్ డిగ్రీ పొంది ,కలకత్తా మెడికల్ కాలేజీ లో డాక్టర్ డిగ్రీ అందుకొన్నాడు .ఇంటిదగ్గర తనతండ్రి వద్ద ఆయుర్వేద విద్య క్షుణ్ణంగా అభ్యసించాడు .విద్యా తృష్ణ తీరక సంస్కృతం లో ఎం .ఏ .చేశాడు .మెడిసిన్ లో గోల్డ్ మెడల్ పొందాడు .ఆయన అభిమాన విషయం గైనకాలజీ అండ్ మిడ్ వైఫ్రి ‘’ఇంగ్లిష్ వైద్యం పై వ్యామోహం పెంచుకోకుండా తండ్రిలాగా కవి రాజ్ అవ్వాలని నిశ్చయించుకొన్నాడు .బంగ్లా –మార్వారీ హాస్పితలో లో నెలకు నలభై రూపాయలజీత తో కవిరాజ్ గా ఉద్యోగం పొందాడు .

ఆయుర్వేదం పై ఉన్న విపరీతమైన అభిమానం తో దానిలోనే  రాణించా లనుకొని ,’’ఆయుర్వేదవైద్యం  కడుపుకు కూడు పెట్టకపోతే  ఆయుర్వేద ‘’పంచన్ ‘’అంటే  విరేచనాలమందు అమ్ముకొని అయినా బతుకు తాను ‘’అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు .ఆనాటి ప్రభుత్వం కూడా ఆయుర్వేదానికి ఏరకమైన ప్రోత్సాహం ఇవ్వలేదు .చివరికి ‘’వైద్యరాజ్ ఫార్మసి ‘’ఏర్పాటు చేసి ఆయుర్వేద మందుల అమ్మకం సాగించాడు .ఆయుర్వేదాన్ని ఆధునిక  వైద్యానికి సరిపోయేట్లు ఆయుర్వేద మందులను ఆయనా, ఆయన సిబ్బంది శ్రమించి తయారు చేశారు .దీని ఖర్చులకు తనఫీజును 4 నుంచి 32 రూపాయలకు పెంచాడు .బీదలకు ఉచిత వైద్యం అందించేవాడు .గ్వాలియర్ ఇండోర్ మొదలైన పట్టణాలకు వెళ్లి  మహారాజులకు  వైద్యం చేయటానికి ఫీజు వెయ్యి రూపాయలు తీసుకొనేవాడు.క్రమంగా కవిరాజ్ పేరు ప్రఖ్యాతులు వ్యాపించి1915కు  కలకత్తాలో సేలిబ్రేటి అయ్యాడు .మద్రాస్ లో జరిగిన  ఏడవ అఖిలభారత ఆయుర్వేద సభకు అధ్యక్షుడయ్యాడు .

కలకత్తా 29 ఫరియా పుకూర్ వీధిలో అద్దె భవనం లో ‘’కవిరాజ్ అష్టాంగ ఆయుర్వేద కాలేజి హాస్పిటల్’’ స్థాపించాడు .ప్రాచీన ,అధునాతన ఆయుర్వేద వైద్యవిధానం బాగా ప్రచారమై మహాత్మాగాంధీ ని ఆకర్షించింది .9ఏళ్ళ తర్వాత  రాజా దినేంద్ర స్ట్రీట్ లో నెలకొల్పిన స్వంతభవనానికి మహాత్ముడు తన అమృత హస్తాలతో శంకుస్థాపన చేశాడు .ఇప్పుడు అక్కడ ‘’జే .బి .రాయ్ స్టేట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ ‘’ హుందాగా అందరికీ దర్శనమిస్తోంది .దాని శతవార్శికోత్సవం 2016లో ఘనంగా నిర్వహించారు .కవి రాజ్ ఈ హాస్పిటల్ నిర్మాణానికి తన స్వంత డబ్బు 70 వేల రూపాయలు ఖర్చు చేయటమే కాక ,తన చిరాస్తులను కూడా అమ్మి అభి వృద్ధి చేశాడు .ఆయుర్వేదం లో అనేక విషయాలమీద అంటే శాలక్య తంత్ర ,ప్రసూతి తంత్ర ,విషతంత్ర ,కుమార తంత్ర లను ఆధారంగా గ్రంథాలు రాశాడు  ర .ఆయన రాసిన ‘’వ్యాధులు –మూలకారణాలు –గుర్తించటం ‘’అనే పుస్తకం చాలా ప్రసిద్ధమై గొప్ప పేరు తెచ్చింది .’’ఆయుర్వేద ‘’అనే మాసపత్రిక కూడా నడిపాడు .

కవిరాజ్ జైమిని భూషణ్ రాయ్ సరోజ బాలాదేవిని వివాహమాడి ఆరుగురు సంతానం పొందాడు .కలకత్తాలో 11-8-1926న 47ఏళ్ళ వయసులోనే చనిపోవటం దురదృష్టకరం .చనిపోవటానికి ఒక్క రోజు ముందు తన అష్టాంగ ఆయుర్వేదవిద్యాలయానికి 2 లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన మహా వితరణ శీలి .ఆయన మరణానంతరం  పాతిపుకూర్ లో ఆయన నివాసమున్న ఇంటిని గార్డెన్ ను క్షయ ఆస్పత్రిగా మార్చారు . స్వాతంత్ర్య సమరయోధుడు ,ప్రముఖ వైద్యుడు, బెంగాల్ ముఖ్యమంత్రి బి. సి .రాయ్ అని పిలువబడే డా బిధాన్ చంద్ర రాయ్ ఈ హాస్పిటల్ కు శంకు స్థాపన చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318)

ద్వైతమతస్థాపకుడు మధ్వాచార్య శిష్యుడైన త్రివిక్రమ పండితాచార్య సుబ్రహ్మణ్య పండితా చార్య కుమారుడు . అరుదైన ‘’వాయుస్తుతి ‘’సంస్కృతం లో రాసి చాలా ప్రఖ్యాతుడయ్యాడు .ఈయన గురించి పూర్తివివరాలను కుమారుడు నారాయణ పండితాచార్య ‘’సుమద్వ విజయం ‘’లో రాశాడు .యవ్వనం లోనే త్రివ్క్రముడు సంస్కృత సాహిత్యం లో అవక్రపరాక్రమ౦ చూపించిన ధీశాలి .మధ్వమతం పుచ్చుకొని సంస్కృతం లో ‘’ఉషాహరణ మహా కావ్యం ‘’రచించాడు .

కాసర్ గోడ్ రాజు జయ సింహకు గురువు త్రివిక్రమ .ఒక సారి మధ్వా చార్య కాసర్ గోడ్ సంస్థానానికి రాగా ,ఆయనకు త్రివిక్రమ పండితా చార్య కు ఎనిమిది రోజులు సుదీర్ఘ చర్చ జరిగింది .స్వతహాగా అద్వితీ అయిన త్రివిక్రముడు ఆచార్యులవారి చేతిలో ఓటమి పాలై ,శిష్యుడై ,మధ్వ మతాన్ని స్వీకరించాడు .మధ్వా చార్యులు రాసిన ‘’బ్రహ్మ సూత్ర భాష్యం ‘’కు త్రివ్క్రమ పండితా చార్య ‘’తత్వ ప్రదీపిక ‘’వ్యాఖ్యానం రాశాడు .ఇవికాక విష్ణు స్తుతి ,తిది నిర్ణయం ,మధ్వ స్తోత్రం మొదలైనవి కూడా రచించాడని ప్రతీతి .బృందావనం అని పిలువబడే త్రివిక్రమ పండితాచార్య సమాధి కేరళలో కుద్లూ దగ్గర కావు మఠం లో ఉంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945)

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945)

1945లో పశ్చిమ బెంగాల్ కలకత్తా లో జన్మించిన జయశ్రీ చట్టోపాధ్యాయ వాల్మీకి రామాయణం లో సంగీత మూలాలు అంశం పై పరిశోధన చేసి పిహెచ్ డి పొందింది .విశ్వకవి  రవీంద్రుని    నిపై ‘’బౌద్ధ అవదాన సాహిత్య ప్రభావం ‘’అనే అంశం పై పరిశోధన చేసి డిలిట్ సాధించింది .తాను  రాసిన సంస్కృత గీతాలను ‘’నిస్సంగః ప్రణయః ‘’పేరుతొ వెలువరించింది .దీని సిడి ని 2015 జూన్ లో బాంగ్ కాక్ లో జరిగిన 16 ప్రపంచ సంస్కృత సభ లో ఆవిష్కరి౦పజేసింది .దీనికి ఆంగ్ల అనువాదం ‘’లవ్ వితౌట్  అటాచ్ మెంట్ ‘’గా వచ్చింది .కలకత్తాలోని క్రిస్టియన్ మహిళాకళాశాలలో రీడర్ గా ఉద్యోగించింది .బిషప్ కాలేజీ లో థియాలజి బోధించింది .కలకత్తా సంస్కృత కాలేజీలో సంస్కృత గెస్ట్ లెక్చరర్ గా ఉన్నది .’’రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ‘’వారి స్కాలర్షిప్ పొంది ,సీతారాం బాల్దిక్ ఆదర్శ సంస్కృత మహా విద్యాలయ లో సంస్కృతం , .జాదవ్ పూర్ యూనివర్సిటిలో సంస్కృత అలంకార శాస్త్రం బోధించిన  విదుషీమణి డా చట్టో పాద్యాయ   జయశ్రీ ముఖ్య సంస్కృత రచనలు –ఆసఫ్ విలాస సమీక్ష ‘’,సంస్కృత సాహిత్య స్వప్న ‘’,మహా వస్తూని రామాయణానుభవ ‘’ అధ్యర్ధ శతక సమీక్షా ‘’మృచ్చకటికే వర్ష ‘’,’’బుద్ధ చరితే రామాయణ సామ్యం’’,జగన్నాథస్య’’,’’జగదాభరణం ‘’,’’సాహిత్య స్మృత్య లోక ‘’,’’ఉషా వరవర్ణిని’’,దేవీ సూక్తం ‘’.ధ్వన్యాలోకః ‘’.ఇవన్నీ అనేక సంస్కృత జర్నల్స్ లో వచ్చాయి .

బెంగాలీ భాషలోకి ‘’కాకోలూకీయం ‘’’’,’’లబ్ధ ప్రనాశనం’’ పంచ తంత్రం లోని రెండు తంత్రాలు  అనువాదం చేసి తన సంపాదకత్వం లో విడుదల చేసింది .’’నిస్సంగ ప్రణయం ‘’కాకుండా ‘’రాత్రి ‘’,’’శిలా భట్టారిక ‘’,అవసర ‘’,కల్కితా నగరస్య దుర్గా ప్రతిమాంగ్ ప్రతి ‘’ కవితలనూ  రాసింది  .దీని ఆంగ్ల అనువాదాన్ని 2015 సెప్టెంబర్ 5న దిబ్రుఘర్ లో జరిగిన సాహిత్య అకాడెమి సమావేశం లో ‘’అభి వ్యక్తి’’ప్రదర్శనలో చదివి వినిపించి మన్ననలు పొందింది .

 ’అభివ్యక్తి’’ప్రదర్శనలోచదివి వినిపించి మన్ననలు పొందింది .

సషేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి చే  సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం 

సరస భారతి చే  సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

పుష్యబహుళ పంచమి  25-1-2019 శుక్రవారం  సంగీత  సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా సరసభారతి 136వ  కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30 గంటలకు శ్రీ త్యాగరాజ స్వామి కి  అష్టోత్తర పూజ ,అనంతరం సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో స్థానికి గాయనీ గాయకులు శ్రీ మతి విజయ ,(మ్యూజిక్ టీచర్ )శ్రీమతి గూడ మాధవి ,కుమారుడు ,శ్రీమతి పోపూరి పద్మజ ,శ్రీమతి  వేమూరి సదాశివ,  కుమారుడు మొదలగు వారిచే  ”త్యాగరాజ పంచ రత్న  కృతులు  ”గానం నిర్వహింపబడుతాయి  .సంగీత ,సాహిత్యాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి -గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-19-ఉయ్యూరు 

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హిందూ మహా సముద్రం లోని పురాతన తమిళనాడు ను ”కుమారి ఖండం ”అన్నాడు కంచిపప్ప శివ చారియర్

కుమారి ఖండం

Kumari Kandam
కుమారి ఖండం

కుమారి ఖండం భౌగోళికంగా భూ పరిమాణంగా సిద్ధాంతీకరించబడింది భారతదేశం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న పురాతన తమిళ నాగరికత. ప్రత్యామ్నాయ పేరు కుమారినాడు. గురించిన కధనాలు వివిద గ్రంధలలో ప్రస్ధావనలు ఉన్నవి.

19 వ శతాబ్దంలో, యూరోపియన్ మరియు అమెరికన్ పండితుల్లో ఒక విభాగం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు మడగాస్కర్ల మధ్య భూగర్భ మరియు ఇతర సారూప్యతలను వివరించడానికి లెమురియా అనే మునిగి ఉన్న ఖండం ఉనికిని ఊహించారు. పురాతన తిమింగలం మరియు సంస్కృత సాహిత్యంలో వర్ణించబడినట్లుగా, తమిళ పునరుద్ధరణకర్తల యొక్క ఒక విభాగం ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, సముద్రానికి కోల్పోయిన భూములను పాండ్యన్ పురాణాలకు అనుసంధానించింది. ఈ రచయితల అభిప్రాయం ప్రకారం, పురాతన తమిళ నాగరికత లెమురియాలో ఉనికిలో ఉంది, ఇది ఒక విపత్తులో సముద్రంలోకి పోవడానికి ముందు. 20 వ శతాబ్దంలో, తమిళ ముస్లింలు ఈ మునిగి ఉన్న ఖండంను వర్ణించడానికి “కుమారి ఖండం” అనే పేరును ఉపయోగించడం ప్రారంభించారు. ఖండాంతర చలనం (ప్లేట్ టెక్టోనిక్స్) సిద్ధాంతం తరువాత లేమురియా సిద్ధాంతం వాడుకలో లేనప్పటికీ, ఈ భావన 20 వ శతాబ్దపు తమిళ పునరుజ్జీవవాదులలో బాగా ప్రాచుర్యం పొందింది. వారి ప్రకారం, కుమారి ఖండం పాండియన్ పాలనలో మొదటి రెండు తమిళ సాహిత్య అకాడమీలు (సంఘములు) నిర్వహించబడే ప్రదేశం. తమిళం భాష మరియు సంస్కృతి యొక్క ప్రాచీన కాలం నిరూపించడానికి నాగరికత జన్మస్థానంగా వారు కుమారి ఖండం అని వాదించారు.

పద చరిత్ర మరియు పేర్లు

తమిళ రచయితలు 1890 లలో లెమురియా భావనను ప్రవేశపెట్టిన తర్వాత, వారు ఖండం యొక్క పేరు యొక్క తమిళీకరించిన సంస్కరణలతో వచ్చారు (ఉదా. “ఇల్లెమురియా”). 1900 ల ప్రారంభంలో, వారు ప్రాచీన తమిళ నాగరికత లెమూరియా చిత్రణకు మద్దతుగా, ఖండం కోసం తమిళ పేర్లను ఉపయోగించడం ప్రారంభించారు. 1903 లో, V.G. సూర్యనారాయణశాస్త్రి మొట్టమొదటి పదం “కుమరినాటు” (లేదా “కుమారినాడు”, “కుమారి భూభాగం”) అనే పదం తన తమిళం మోజియన్ వరలరు (తమిళ భాష యొక్క చరిత్ర) లో ఉపయోగించారు. కుమారి ఖండం మొట్టమొదటిగా 1930 లలో లెమూరియాను వివరించడానికి ఉపయోగించబడింది[1].

రంగుల-కోడ్ లతో యానిమేషన్ చేయబడిన చిత్రం, వివిధ ఖండాలు చూపబడినవి. ఖండములు విడదీయబడు నమూనా, కొన్ని ఖండాలు మరిన్ని ఖండాలుగా విడదీయబడినవి: ఉదా. యూరేషియాయూరప్ మరియు ఆసియా (ఎర్రని రంగులో), అలాగే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా కొన్ని సార్లు అమెరికాలుగా గుర్తింపబడుతాయి. (ఆకుపచ్చ రంగులో).

బక్మిన్‌స్టర్ ఫుల్లర్ గీసిన “డైమాక్సియాన్ మ్యాపు“, ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడింది.

“కుమారి ఖండం” అనే పదము మొదట, కంచిపప్ప శివచారియర్ (1350-1420) చే వ్రాయబడిన స్కంధ పురాణము యొక్క 15 వ శతాబ్దపు తమిళ సంస్కరణ అయిన కందా పురాణములో కనిపిస్తుంది. తమిళం పునరుద్ధరణలు స్వచ్ఛమైన తమిళ పేరు అని వాదించినప్పటికీ, ఇది నిజానికి “కుమారికికా ఖనకు” సంస్కృత పదం యొక్క ఉత్పన్నం. కంద పురాణం యొక్క అండకోసప్పదళం విభాగం విశ్వం యొక్క కింది విశ్వోద్భవ నమూనాను వివరిస్తుంది: అనేక ప్రపంచాలు ఉన్నాయి, వాటిలో అనేక ఖండాలు ఉన్నాయి, వీటిలో అనేక రాజ్యాలు ఉన్నాయి. అలాంటి రాజ్య పాలకుడు పరాటన్కు ఎనిమిది మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతను తన రాజ్యాన్ని తొమ్మిది భాగాలుగా విభజించాడు మరియు అతని కుమార్తె కుమారి పాలించిన భాగం ఆమె తర్వాత కుమారి ఖండం అని పిలువబడింది. కుమారి ఖండం భూమి యొక్క రాజ్యం అని వర్ణించబడింది. బ్రాహ్మణ వ్యతిరేక తమిళ తమిళ జాతీయవాదులలో కుమారి ఖండం సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది అయినప్పటికీ, కందా పురాణం వాస్తవానికి బ్రహ్మణుల నివాసం ఉన్న కుమారి ఖండం, శివ భగవంతుడిని పూజిస్తుంది, వేదాలు ఎక్కడ చదువుతాయో అక్కడ వర్ణిస్తాయి. మిగిలిన రాజ్యాలు మెల్చిస్ యొక్క భూభాగంగా వర్ణించబడ్డాయి.

ప్రపంచము

20 వ శతాబ్దపు తమిళం రచయితలు “కుమారి ఖండం” లేదా “కుమారినాడు” యొక్క శబ్దవ్యుత్పత్తికి వివరించడానికి వివిధ సిద్ధాంతాలతో ముందుకు వచ్చారు. పూర్వపు తమిళం మాతృభూమిలో ఒకరైన ఆరోపణలు లింగ సమతుల్యతపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఉదాహరణకు, యం. అరుణాచలం (1944) ఈ భూమిని స్త్రీ పాలకులు (కుమారిస్) పాలించారు. భూమికి చెందిన స్త్రీలు తమ భర్తలను ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారని డి.శవియోరాయణ పిళ్ళై పేర్కొన్నారు. అందువల్ల ఈ భూమిని “కుమారినాడు” (“కన్య భూమి”) అని పిలిచారు. హిందూ దేవత కన్యా కుమారిపై మరొక దావా వేయబడింది. కందియా పిళ్ళై, పిల్లల కోసం ఒక పుస్తకంలో, దేవతకు కొత్త చరిత్ర సృష్టించింది, ఆ భూమి పేరు ఆమె పేరు పెట్టబడింది. కుమారి ఖండం మునిగిపోయిన వరదలను మనుగడలో ఉన్నవారిని కన్యాకుమారి వద్ద నిర్మించారు అని ఆయన అన్నారు. సాంప్రదాయిక చరిత్రకారుడు సుమతీ రామస్వామి ప్రకారం, “కుమారి” (కన్య లేదా కన్య అర్థం) పై తమిళ రచయితల ఉద్ఘాటన ఇండో-ఆర్యన్ల వంటి ఇతర జాతుల వారి సంబంధాల ముందు, తమిళ భాష మరియు సంస్కృతి యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది.

తమిళ రచయితలు కోల్పోయిన ఖండంలోని అనేక ఇతర పేర్లతో కూడా పిలిచారు. 1912 లో, సొమసుందర భారతి మొదట “తమిళం” అనే పేరును ఉపయోగించారు (ప్రాచీన తమిళ దేశపు పేరు) లెమురియా యొక్క భావనను కవర్ చేయడానికి, తన తమిళ క్లాస్సిక్స్ మరియు తమిళం లో, నాగరికత యొక్క ఊయలని ప్రదర్శించారు. తమిళ వంశీయులలో పురాతనమైనదిగా భావించిన పాండ్యాస్ తరువాత, “పంటియా నాటు” అనే మరొక పేరు ఉపయోగించబడింది. కొందరు రచయితలు మురికి ఉన్న భూమిని వర్ణించేందుకు “నవలన్ టివు” (లేదా నవలం ద్వీపం), జంబూద్వీపా యొక్క తమిళ పేరును ఉపయోగించారు. ప్రాచీన భారతీయ సాహిత్యంలో మునిగి ఉన్న భూములు అనేక పురాతన మరియు మధ్యయుగ తమిళ మరియు సంస్కృత రచనల్లో దక్షిణ భారతదేశంలో భూభాగాల పురాణ ఖాతాలు సముద్రంలోకి పోతాయి. ఇరాన్నానార్ అకాపోరాల్లో వ్యాఖ్యానంలో కాటల్కోల్ (“ఓజోన్చే స్వాధీనం”, బహుశా సునామీ) యొక్క మొట్టమొదటి స్పష్టమైన చర్చలో ఉంది. ఈ వ్యాఖ్యానం, నకియెరర్ కి ఆపాదించబడింది, ఇది 1 వ సహస్రాబ్ది తరువాత శతాబ్దాలుగా చెప్తుంది. మొదటి తమిళ సామ్రాజ్యానికి చెందిన పాండ్యన్ రాజులు, మూడు సాహిత్య అకాడమీలు (సంఘంలు) స్థాపించారు: మొట్టమొదటి సంఘం 549 మంది కవులు (అగస్త్యాతో సహా) హాజరైన టెన్మాటారు (దక్షిణ మధురై) అనే పట్టణంలో 4,400 సంవత్సరాలు వృద్ధి చెందింది, శివ, కుబేర మరియు మురుగన్. రెండవ సంఘం కపోతపురం అనే నగరంలో 3,700 సంవత్సరాలు కొనసాగింది, 59 మంది కవులు (అగస్త్యాతో సహా) హాజరయ్యారు. వ్యాఖ్యానం ప్రకారం, రెండు నగరాలు “సముద్రంచే స్వాధీనం” అయ్యాయి, ఫలితంగా మొదటి రెండు సంఘలు సృష్టించిన అన్ని పనులన్నీ నష్టపోయాయి. మూడో సంఘం ఉత్తరాన (నార్త్) మధురైలో స్థాపించబడింది, ఇక్కడ 1,850 సంవత్సరాలు కొనసాగింది.

నకియెరర్ యొక్క వ్యాఖ్యానం సముద్రంలో పోగొట్టుకున్న భూభాగం యొక్క పరిమాణం గురించి చెప్పలేదు. సైలపతికరంలో 15 వ శతాబ్దపు వ్యాఖ్యానంలో ఈ పరిమాణం మొదట ప్రస్తావించబడింది. ఉత్తరాన పాహ్రులీ నది నుండి దక్షిణాన కుమారి నదికి లాస్ట్ ల్యాండ్ విస్తరించిందని వ్యాఖ్యాత అడియార్కుణల్లర్ పేర్కొన్నాడు. ఇది కన్యాకుమారికి దక్షిణాన ఉంది, మరియు 700 కవతం (తెలియని కొలత యొక్క యూనిట్) విస్తరించింది. ఇది 49 భూభాగాలు (నాటు) గా విభజించబడింది, ఈ క్రింది ఏడు వర్గాలలో వర్గీకరించబడింది.

ఎలు తెన్కు నాటు (“ఏడు కొబ్బరి భూములు”) ఎలు మటురై నాటు (“ఏడు మామిడి భూములు”) ఎలు ముంపలై నాటు (“ఏడు ముందు ఇసుక భూములు”) ఎలు పిన్పాలై నాటు (“ఏడు తిరిగి ఇసుక భూములు”) ఎలు కునారా నాటు (“ఏడు కొండ భూములు”) ఎలు కునకరై నాటు (“ఏడు తీర ప్రాంతములు”) ఎలు కురుంపనై నాటు (“ఏడు మరగుజ్జు-పామ్ భూములు”) ఇతర మధ్యయు రచయితలు ఇల్లంపునురర్ మరియు పెరసిరైర్ వంటివారు, కన్యాకుమారికి దక్షిణాన అన్నెడీలువియన్ భూములను కోల్పోవడమే కాక, టోల్కప్పయం వంటి పురాతన గ్రంథాలపై వారి వ్యాఖ్యానాలలో కూడా తప్పుగా ప్రస్తావించారు. సముద్రంలో పాండియన్ భూభాగాన్ని కోల్పోవడం గురించి మరొక పురాణం పురాణనూర్ (1 వ శతాబ్దం బిసి మరియు 5 వ శతాబ్దం మధ్యకాలం) మరియు కలితతోకై (6 వ -7 వ శతాబ్దం) మధ్య చెల్లాచెదురైన శ్లోకాలలో కనుగొనబడింది. ఈ లెక్కల ప్రకారం, పొరుగు రాజులు చెరోస్ మరియు చోళుల నుండి సమానమైన మొత్తం భూమిని స్వాధీనం చేసుకుని పాండ్యన్ రాజు తన భూమిని కోల్పోయాడు.

సముద్రపు నష్టపోయిన పందియాన్ భూభాగం యొక్క ఇతర పురాతన చరిత్రలు కూడా ఉన్నాయి. హిందూ పురాణాలలో పేర్కొనబడిన వరదలను మనుగడలో ఉన్న అనేక తమిళ హిందూ పుణ్యక్షేత్రాలు పురాణ గాధలు కలిగి ఉన్నాయి. వీటిలో కన్యాకుమారి, కాంచీపురం, కుంబకోణం, మదురై, శీర్కాళి మరియు తిరువోటియూర్ యొక్క ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. మహాబలిపురం యొక్క ఏడు పగోడాస్ వంటి సముద్రాల కింద మునిగిపోయిన ఆలయాల పురాణములు కూడా ఉన్నాయి. పురాణాలు అత్యంత ప్రాచుర్యం పొందిన హిందూ వరద పురాణం ప్రారంభంలో – మను యొక్క పురాణం – దక్షిణ భారతదేశం లో. సంస్కృతం-భాష భగవత పురాణం (500 బిసి-1000 నాటిది) దాని ప్రధాన పాత్ర మను (సత్యవర్తనం) గా వర్ణించబడింది, ఇది ద్రవిడ (దక్షిణ భారతదేశం) లార్డ్. మత్స్య పురాణం (250-500) దక్షిణ భారతదేశంలోని మౌంట్ మలయాపై మను పాటలను అభ్యసించడం ప్రారంభమవుతుంది. మయేమేఘఘలై (సుమారు 6 వ శతాబ్దం నాటిది) కవితీపుంపట్టితనం (ఇప్పటి పహర్) పురాతన చోళ ఓడరేవు నగరం వరద వల్ల నాశనం చేయబడిందని పేర్కొంది. ఈ వరద హిందూ దేవత ఇంద్రుడు చేత పంపబడిందని చెపుతుంది, ఎందుకంటే రాజు అతనికి అంకితమిచ్చిన పండుగను జరుపుకునేందుకు మరచిపోయాడు.

ఈ పురాతన గ్రంథాలలో లేదా వారి మధ్యయుగ వ్యాఖ్యానాలు ఏవీ లేవు “కుమారి ఖండం” లేదా “కుమారినాడు” అనే పదాన్ని సముద్రంతో పోయాయి. కన్యాకుమారికి దక్షిణాన ఉన్న మొత్తం ఖండం సముద్రంతో కోల్పోయిన భూమి అని వారు చెప్పలేరు. ఈ భూమిని కోల్పోయిన వారు తమిళ ప్రజల చరిత్రకు సమాజాన్ని అనుసంధానిస్తున్నారు.

భారతదేశంలో లెమురియా సిద్ధాంతం

1864 లో, ఇంగ్లీష్ జూలాయిస్ట్ ఫిలిప్ ఎస్క్లెటెర్ భారతదేశం, మడగాస్కర్ మరియు ఖండాంతర ఆఫ్రికా మధ్య మునిగిపోయిన భూమి కనెక్షన్ ఉనికిని ప్రతిపాదించారు. అతను ఈ మునిగిపోయిన భూమి లెమూరియాను పేర్కొన్నాడు, ఎందుకంటే ఈ మూడు డిస్కమ్డ్ ల్యాండ్ల మీద లెముర్-లాంటి ప్రైమేట్స్ (ప్రెప్సిరిణిని) ఉనికిని వివరించడానికి చేసిన ప్రయత్నాలలో ఈ భావన మూలంగా ఉంది. ఖండాంతర చలనం సిద్ధాంతం ద్వారా లెమూరియా సిద్ధాంతం వాడుకలోనికి రాకముందే, పలువురు పండితులు మద్దతు ఇచ్చారు మరియు విస్తరించారు. హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్ఫోర్డ్చే 1873 భౌగోళిక భౌగోళిక పాఠ్య పుస్తకంలో భారతీయ పాఠకులకు ఈ భావన పరిచయం చేయబడింది. బ్లెన్ఫోర్డ్ ప్రకారం, క్రెటేషియస్ కాలంలో అగ్నిపర్వత చర్యల కారణంగా భూకంపంతో మునిగిపోయింది. 1870 ల చివరిలో, లెమురియా సిద్ధాంతం ప్రస్తుత తమిళనాడులో దాని మొదటి ప్రతిపాదకులను కనుగొంది, ఆదియర్-ప్రధాన కార్యాలయం ఉన్న తత్వసంబంధ సమాజం యొక్క నాయకులు దీని గురించి రాశారు.

చాలామంది యూరోపియన్ మరియు అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆధునిక మానవుల ఆవిర్భావానికి ముందు కాలం వరకు లెమూరియా యొక్క అదృశ్యంతో డేటింగ్ చేశారు. అందువలన, వారి ప్రకారం, లెమురియా ఒక పురాతన నాగరికతకు ఆతిధ్యం ఇవ్వలేదు. అయినప్పటికీ, 1885 లో, ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి చార్లెస్ డి. మక్లీన్, ది మాన్యువల్ అఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీని ప్రచురించాడు, దీనిలో లెమోరియా ప్రోటో-ద్రవిడియన్ మూత్రాశయం అని అతను సిద్ధాంతీకరించాడు. ఎర్నెస్ట్ హేకెల్ యొక్క ఆసియా పరికల్పన గురించి ఈ కధనంలో ఒక ఫుట్నోట్ లో అతను మానవ మహాసముద్రంలో ఇప్పుడు మునిగిపోయిన భూభాగంలో ఉద్భవించిందని సిద్ధాంతీకరించాడు. ఈ మునిగిపోయిన భూమి ప్రోటో-ద్రావిడియన్ల స్వదేశం అని మక్లీన్ పేర్కొంది. ఇతర జాతుల పురోహితులు లెమూరియా నుండి దక్షిణ భారతదేశం ద్వారా ఇతర ప్రదేశాలకు వలస వచ్చారని ఆయన సూచించారు. ఈ సిద్ధాంతం ఎడ్గార్ తుర్స్టన్ మరియు హెర్బెర్ట్ హోప్ రిస్లే వంటి ఇతర కాలనీల అధికారులు కూడా 1891 మరియు 1901 నాటి జనాభా లెక్కల నివేదికలతో సహా చర్చించారు. తరువాత, మాక్లీన్ యొక్క మాన్యువల్ను తమిళ రచయితలచే అధికారిక రచనగా పేర్కొనబడింది, వారు తరచూ తప్పుగా “శాస్త్రవేత్త” మరియు “డాక్టర్” గా పేర్కొన్నారు.

స్థానిక తమిళ మేధావులు మొదట 1890 ల చివరిలో మునిగిపోయిన తమిళ మాతృభూమి యొక్క భావనను చర్చించారు. 1898 లో, జే. నల్లాసమి పిళ్ళై ఒక తాత్విక-సాహిత్య జర్నల్ సిధ్ధాం దీపిక (ది ట్రూత్ ఆఫ్ లైట్) లో ఒక కథనాన్ని ప్రచురించాడు. అతను హిందూ మహాసముద్రంలో కోల్పోయిన ఖండం యొక్క సిద్ధాంతం గురించి వ్రాసాడు (అనగా లెమురియా), పురాతన శాంగాల సమయంలో నిర్మించిన సాహిత్య రచనలను ధ్వంసం చేసిన వరదలు గురించి తమిళ పురాణములు చెపుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా, ఈ సిద్ధాంతం “తీవ్రమైన చారిత్రక లేదా శాస్త్రీయ నిలకడ లేదు” అని తెలిపారు.

తమిళనాడులో ప్రజాదరణ

1920 లలో, లెమోరియా భావన ఇండో-ఆర్యన్లు మరియు సంస్కృతుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి తమిళ పునరుజ్జీవాదిచే ప్రాచుర్యం పొందింది. తమిళ పునరుద్ధరణ రచయితలు లెమురియా, దాని వరదకు ముందు, అసలు తమిళ మాతృభూమి మరియు తమిళ్ నాగరికత జన్మస్థలం అని పేర్కొన్నారు. పాశ్చాత్య విద్వాంసులు తమ వాదనలకు విశ్వసనీయతను మంజూరు చేయటానికి తరచుగా వారు తప్పుగా లేదా తప్పుదారి పట్టారు. బ్రిటీష్ కాలంనాటికి, తుఫానులకు భూములను చిన్న పాచెస్ కోల్పోవడం వలన అనేక జిల్లా నివేదికలు, గెజిటర్స్ మరియు ఇతర పత్రాల్లో జాబితా చేయబడింది. ఈ కాలానికి చెందిన తమిళ రచయితలు సముద్రంతో ఓ పురాతన భూభాగం గురించి సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు.

పాఠ్య ప్రణాళికలో కుమారి ఖండం సిద్ధాంతాన్ని చర్చిస్తున్న పుస్తకాలు 1908 లో ప్రస్తుత తమిళనాడు కళాశాల పాఠ్యాంశాలలో చేర్చబడ్డాయి. 1908-09లో మద్రాస్ యూనివర్శిటీ యొక్క మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో సూర్యనారాయణ శాస్త్రి పుస్తకం ఉపయోగం కోసం సూచించబడింది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో మద్రాస్ యూనివర్శిటీ మరియు అన్నామలై యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో ఇతర రచనలను చేర్చారు. వీటిలో పూర్ణిలింగం పిళ్ళై యొక్క తమిళ సాహిత్యం యొక్క ఒక ప్రైమర్ (1904) మరియు తమిళ సాహిత్యం (1929), కంధయ్య పిళ్ళై యొక్క తమిళం (1934) మరియు శ్రీనివాస పిళ్ళై యొక్క తమిళ వరలరు (1927) ఉన్నాయి. తొమ్మిదవ తరగతి విద్యార్థుల కోసం 1940 నాటి తమిళ భాషా పుస్తకంలో, టి.వి. కళ్యాణసంధురామ్ ఈ విధంగా వ్రాసాడు, యూరోపియన్ పరిశోధకుల లెమురియా తమిళ సాహిత్యంలో కుమారినటుగా ఉన్నాడు.

1967 మద్రాస్ రాష్ట్ర ఎన్నికలలో ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత, కుమారి ఖండం సిద్ధాంతం పాఠశాల మరియు కళాశాల పాఠ్యపుస్తకాల ద్వారా విస్తృతంగా వ్యాపించింది. 1971 లో తమిళనాడు ప్రభుత్వం (ప్రాచీన తమిళ భూభాగం) చరిత్రను వ్రాయడానికి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆర్. నెడున్సెలియన్ శాసనసభలో “చరిత్ర” ద్వారా “మహాసముద్రం స్వాధీనం చేసుకున్న లెమురియా నుండి” అని అర్ధం.

1971 లో తమిళనాడు ప్రభుత్వం ఎం. వరదరాజన్ నేతృత్వంలోని చరిత్రకారుల మరియు లిటరేటేర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. తమిళుల యొక్క “గొప్ప పురాతనత్వం” ను హైలైట్ చేయడానికి కమిటీ లక్ష్యాలు ఒకటి. ఈ కమిటీ వ్రాసిన ఒక 1975 పాఠ్యపుస్తకం, కుమారి ఖండం సిద్ధాంతాన్ని వివరంగా పేర్కొంది, ఇది “అగ్రశ్రేణి భూగోళ శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రవేత్తలు” మద్దతు ఇచ్చింది. 1981 లో, తమిళనాడు ప్రభుత్వం యొక్క చరిత్ర పాఠ్యపుస్తకాలు కుమారి ఖండం సిద్ధాంతాన్ని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క “సమాచార్” (ఏకరీతి) సిలబస్ లోని తమిళ భాష పాఠశాల పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ లేమురియా – కుమారి ఖండం సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తాయి.

లక్షణాలు తమిళ రచయితలు కుమారి ఖండం ను ఒక ప్రాచీన, కానీ అత్యంత ఆధునిక నాగరికతగా హిందూ మహాసముద్రంలో ఒక వివిక్త ఖండంలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారు తమిళ భాష మాట్లాడేవారు మాత్రమే నివసించే నాగరికత యొక్క ఊయలని కూడా వర్ణించారు. కింది విభాగాలు ఈ లక్షణాలను వివరంగా వర్ణిస్తాయి.

వివిక్త కుమారి ఖండం ఒక వివిక్త (తాత్కాలికంగా మరియు భౌగోళికంగా) భూ పరిమాణంగా సిద్ధాంతీకరించబడింది. భౌగోళికంగా ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. తాత్కాలికంగా, ఇది చాలా పురాతన నాగరికత. చాలామంది తమిళ రచయితలు కుమారి ఖండం యొక్క మురికివాడకు ఏ తేదీని కేటాయించలేదు, “ఒక సారి” లేదా “అనేక వేల సంవత్సరాల క్రితం” వంటి పదబంధాలను ఉపయోగించారు. 30,000 సా.శ.పూ. నుండి 3 వ శతాబ్దం బిసి వరకూ ఉన్నవారు చాలామంది మారుతూ ఉంటారు. అనేక ఇతర రచయితలు ఈ భూమిని వేల సంవత్సరాల కాలంలో క్రమక్రమంగా కోల్పోయారని పేర్కొన్నారు. 1991 లో, తమిళనాడు ప్రభుత్వం యొక్క తమిళం ఎటిమోలాజికల్ డిక్షనరీ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన సంపాదకుడు ఆర్.మతీవనాన్, కుమారి ఖండం నాగరికత సుమారుగా 50,000 బిసి వృద్ధి చెందిందని మరియు 16,000 బిసి చుట్టూ ఖండం మునిగిపోయిందని పేర్కొన్నారు. ఈ సిద్ధాంతం తన ఉపాధ్యాయుడైన దేవనాయ పవానార్ చేత సిఫారసు చేయబడిన పద్దతి మీద ఆధారపడింది.

ఒంటరి బాహ్య ప్రభావాలు మరియు విదేశీ అవినీతి నుండి ఒక ఆదర్శధామ సమాజంగా కుమారి ఖండంను వివరించే అవకాశం ఏర్పడింది. కంద పురాణం లో దాని వర్ణన కాకుండా, తమిళ పునరుద్ధరణకర్తలు కుమారి ఖండం ద్రవిడ ఉద్యమ సమయంలో ఇండో-ఆర్యన్ల వారసులుగా గుర్తించబడుతున్న ఉన్నత-కుల బ్రాహ్మణులని ఖాళీగా చిత్రీకరించారు. 20 వ శతాబ్దపు తమిళ హిందూ సమాజంలోని అహేతుక ఆచారాలు, అటువంటి మూఢనమ్మకాలు మరియు కులాధార వివక్షత వంటివి అన్నింటినీ ఇండో-ఆర్యన్ ప్రభావానికి కారణమయ్యాయి.

ఈ మహాసముద్రం గురించి చారిత్రాత్మకంగా పరిశీలించదగిన లేదా శాస్త్రీయంగా ఆమోదయోగ్యమైన భౌతిక సాక్ష్యాలు లేనందున తమిళ పునరుద్ధరణకర్తలు ఒక వివరణను అందించారు. మూడవ సంఘంనకు చెందినదిగా చెప్పబడిన ప్రాచీన తమిళ రచనలు, సంస్కృత పదజాలం కలిగివుంటాయి, అందుచేత పూర్తిగా తమిళ నాగరికత సృష్టించబడలేదు. లెమురియా భావనను పురాతన తమిళ నాగరికతకు అనుసంధానిస్తూ తమిళం పునరుద్ధరణకర్తలు ఇండో-ఆర్యన్ ప్రభావముతో పూర్తిగా భిన్నమైన సమాజాన్ని వర్ణించటానికి అనుమతించారు. వారు ప్రాచీన తమిళ నాగరికత యొక్క వివిధ చిహ్నాలు లోతైన సముద్రంలో పోయాయని వాదించారు. ప్రాచీన తమిళ రచనల ఉద్దేశపూర్వక విధ్వంసానికి మరో వివరణగా సంస్కృత ఆధిపత్యం ఇవ్వబడింది. 1950 వ దశకంలో, తమిళనాడు విద్యాశాఖ అయిన ఆర్. నెడున్సెలియయాన్, మరైన్ త్రవితిమ్ (“లాస్ట్ ద్రావిడ భూమి”) అని పిలిచే ఒక కరపత్రాన్ని ప్రచురించాడు. బ్రాహ్మణ చరిత్రకారులు సంస్కృతి పట్ల పక్షపాతంతో ఉండటం, ప్రజల నుండి దాగివున్న తమిళ గొప్పతనాన్ని తెలిపేలా ఉద్దేశపూర్వకంగా ఉంచారని ఆయన పట్టుబట్టారు.

దక్షిణ భారతదేశంతో అనుసంధానించబడింది

కుమారి ఖండం ప్రతిపాదకులు కన్యకమారి నగరం మొట్టమొదటి కుమారి ఖండంలో భాగంగా ఉందని చెప్పుకునే గొప్ప ప్రాధాన్యతనిచ్చారు. వారిలో కొందరు తమిళనాడు, మొత్తం భారతీయ ద్వీపకల్పం (వింధ్యాల దక్షిణానికి) లేదా మొత్తం భారతదేశం కూడా కుమారి ఖండంలో భాగం. ఆధునిక తమిళులు దక్షిణ భారతదేశంలోని స్వదేశీ ప్రజలుగా మరియు కుమారి ఖండంలోని ప్రజల యొక్క ప్రత్యక్ష వారసులని వర్ణించటానికి ఇది దోహదపడింది. ఇది, తమిళ భాష మరియు సంస్కృతిని ప్రపంచం యొక్క పురాతనమైనదిగా వివరించడానికి వీలు కల్పించింది.

బ్రిటిష్ రాజ్ సమయంలో, కన్యాకుమారి ట్రావన్కోర్ రాష్ట్రానికి చెందినది, వీటిలో ఎక్కువ భాగం 1956 పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్తగా ఏర్పడిన కేరళ రాష్ట్రంలో విలీనం అయ్యింది. కన్యాకుమారి తమిళ-మెజారిటీ మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు) లో చేర్చబడిందని నిర్ధారించడానికి తమిళ రాజకీయ నాయకులు తీవ్ర ప్రయత్నం చేశారు. కుమారి ఖండం తో కన్యాకుమారి యొక్క అనుసంధాన సంబంధం ఈ ప్రయత్నానికి కారణాల్లో ఒకటి.

నాగరికత యొక్క ఊయల

కుమారి ఖండం ప్రతిపాదకులు ప్రకారం, చివరి మంచు యుగం ముగిసినప్పుడు మరియు సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ఖండం మునిగిపోయింది. తమిళ ప్రజలు తరువాత ఇతర దేశాలకు వలస వచ్చారు, మరియు ఇతర సమూహాలతో కలిపి, కొత్త జాతులు, భాషలు మరియు నాగరికతలు ఏర్పడటానికి దారితీసింది. కొంతమంది మొత్తం మానవత్వం కుమారి ఖండంలోని నివాసుల నుండి వచ్చిందని కూడా సిద్దాంతం చేస్తున్నారు. తమిళ సంస్కృతి ప్రపంచంలోని అన్ని నాగరిక సంస్కృతుల మూలం, మరియు తమిళం ప్రపంచంలో అన్ని ఇతర భాషల మాతృభాష అని రెండు కథనాలు అంగీకరిస్తున్నాయి. చాలా సంస్కరణల ప్రకారం, కుమారి ఖండం యొక్క అసలు సంస్కృతి తమిళనాడులో ఉనికిలో ఉంది.

1903 మొదట్లో, తన తమిళమాలిన్ వరాలారులో సూర్యనారాయణ శాస్త్రి, కుమారి ఖండం నుండి మానవులందరూ పురాతన తమిళుల వారసులు అని పట్టుబట్టారు. ఇటువంటి ఆరోపణలు ఎమ్.ఎస్. పూర్ణిలింగం పిళ్ళై మరియు మరియమలై అడ్డిగల్ వంటి అనేకమంది పునరావృతమయ్యాయి. 1917 లో, అబ్రహం పండితార్, లెమురియా మానవ జాతి జన్మస్థానం అని వ్రాసాడు, మరియు మానవులు మాట్లాడే మొట్టమొదటి భాష తమిళం. ఈ వాదనలు 20 వ శతాబ్దంలో తమిళనాడులోని పాఠశాల మరియు కళాశాల పాఠ్యపుస్తకాలలో పునరావృతమయ్యాయి.

ఎం.ఎస్.పూరింలింగమ్ పిళ్ళై, 1927 లో రాస్తూ, వరద-హిట్ కుమారినాడు నుండి వచ్చిన తమిళ ప్రాణాలతో సింధు నాగరికత స్థాపించబడింది. 1940 లలో, ఎన్.ఎస్. కంధయ్య పిళ్ళై ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కుమారి ఖండం నివాసుల వలసలను చూపించే పటాలను ప్రచురించింది. 1953 లో, తమిళనాడు విద్యాశాఖ అయిన ఆర్. నెడున్సెలియన్, దక్షిణ భారతదేశం నుండి సింధూ లోయ మరియు సుమేర్ వరకు వ్యాప్తి చెందిందని, అటు తర్వాత అరేబియా, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ మరియు ఇతర ప్రదేశాలకు ” . వారు కుమారి ఖండంలో మాట్లాడే అద్భుతమైన ప్రాచీన తమిళ భాష యొక్క ఆధునిక శిల్పంగా ఆధునిక తమిళాన్ని అందించారు.

కుమారి ఖండం యొక్క ప్రోటో-ద్రవిడియన్ల యొక్క ఇండో-ఆర్యన్లు కూడా వారసులు అని కొందరు తమిళ రచయితలు పేర్కొన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం, ఈ ఇండో-ఆర్యన్లు మధ్య ఆసియాకు వలస వచ్చి, భారతదేశానికి తిరిగి వచ్చిన ఒక శాఖకు చెందినవారు. మధ్యధరా ప్రాంతం నుండి ప్రోటో-ద్రావిడీస్ భారతదేశానికి వలసవచ్చిన ప్రముఖ సిద్ధాంతాన్ని పునరుద్దరించటానికి ఇలాంటి వివరణలు ఉపయోగించబడ్డాయి. కుమారి ఖండం యొక్క ద్రవిడియన్లు తమ ఖండం యొక్క మునగడం తరువాత మధ్యధరా ప్రాంతానికి వలస వచ్చారని తమిళనాడు కాలేజ్ టెక్స్ట్ పుస్తకం 1975 ప్రభుత్వం ప్రకటించింది; తరువాత, వారు హిమాలయాల పాస్లు ద్వారా భారతదేశానికి వలస వచ్చారు.

ప్రిమోర్డియల్ కానీ పురాతన కాదు తమిళ్ పునరుద్ధరణకర్తలు కుమారి ఖండంను ఒక ప్రాచీన సమాజంగా లేదా గ్రామీణ నాగరికతగా పరిగణించలేదు. దానికి బదులుగా, మానవ ఆచారం యొక్క అత్యున్నత స్థాయికి చేరుకున్న ఆదర్శధామం అని వారు వర్ణించారు, మరియు ఇక్కడ ప్రజలు విద్య, విద్య, ప్రయాణం మరియు వాణిజ్యానికి అంకితమైన జీవితాన్ని గడిపారు. కుమారి ఖండం యొక్క “స్థానచలనం” తరచుగా బోధన సాధనంగా ఉద్దేశించబడినదని సుమంతి రామస్వామి పేర్కొన్నారు, ఆధునిక తమిళులను శ్రేష్టమైనదిగా ఎంచుకునేందుకు ఇది ఉద్దేశించబడింది. కానీ “నాగరికత” తో ముందస్తు ఆక్రమణ కూడా బ్రిటీష్ పాలకులు ‘యూరోపియన్లు తమిళుల కన్నా ఎక్కువ నాగరికతగా అంచనా వేయడం.

1903 లో సూర్యనారాయణ శాస్త్రి, సమైక్యులైన తమిళులను నిపుణులైన రైతులు, మంచి కవులు మరియు దూర ప్రయాణం చేసే వర్తకులుగా వర్ణించారు, వీరు సమైక్య మరియు ప్రజాస్వామ్య సమాజంలో నివసించారు. కొన్ని సంవత్సరాల తరువాత రాసిన సావియోరాయణ పిళ్ళై, కుమారి ఖండం ను విద్యాభ్యాసం మరియు సంస్కృతిగా పేర్కొన్నారు. శివనాన యోగి (1840-1924) ఈ ప్రాచీన సమాజం ఏ కుల వ్యవస్థలో లేనిదని పేర్కొంది. 1945 లో పిల్లలతో పనిచేసిన కంధయ్య పిళ్ళై, కుంకింకనంను సెంగన్స్ నిర్వహించిన ఒక బలమైన మరియు కేవలం చక్రవర్తి సేన్గాన్ పాలించినట్లు వ్రాసాడు. 1981 లో, తమిళనాడు ప్రభుత్వం కుమారి ఖండంలో ఒక డాక్యుమెంటరీ చిత్రం నిధులు సమకూర్చింది. ఈ సినిమాని ముఖ్యమంత్రి ఎం. జి. రామచంద్రన్ మరియు పి.ఇ నీలకంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మదురైలోని తమిళ అధ్యయనాల ఐదో అంతర్జాతీయ సమావేశంలో ప్రదర్శించబడింది. ఇది ఖండాంతర డ్రిఫ్ట్ సిద్ధాంతాన్ని మునిగి ఉన్న ఖండాంతర సిద్దాంతంతో లెమ్రియాను శాస్త్రీయంగా చెల్లుబాటు అయ్యే భావనగా పేర్కొంది. ఇది స్మారక కట్టడాలు, తోటలు, కళలు, సంగీతం మరియు నృత్యాలతో కూడిన కుమారి ఖండం నగరాలను చిత్రీకరించింది.

లాస్ట్ రచనలు

తమిళ రెవివాలెలిస్టులు మొదటి రెండు తమిళ సంగతులు (సాహిత్య అకాడెమీలు) పౌరాణిక కాదు, మరియు కుమారి ఖండంలో శకంలో జరిగాయి. చాలామంది తమిళ పునరుద్ధరణకర్తలు గుర్తించిన లేదా జాబితా సంఘం రచనలను జాబితా చేయకపోయినా, కొందరు వారి పేర్లతో ముందుకు వచ్చారు మరియు వారి విషయాలను కూడా జాబితా చేశారు. 1903 లో సూర్యనారాయణ శాస్త్రి ఈ రచనలలో కొన్ని ముత్తూరైరై, ముతుకురుకూ, సూరపురం మరియు పుపుపురం అని పేర్కొన్నారు. 1917 లో, అబ్రహం పండితార్ ఈ ముగ్గురు రచనలను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సంగీత రచనగా పేర్కొన్నాడు: నరతియం, పెరునారై మరియు పెరుంకూరుడు. అతను వేలకొద్దీ అరుదైన సంగీత వాయిద్యాలను కూడా వెయ్యి తీగల లౌత్ గా పేర్కొన్నాడు, ఇది సముద్రంలోకి పోయింది. మునిగిపోయిన పుస్తకాల జాబితాను దేవనాయ పవానార్ ముద్రించారు. ఇతరులు ఔషధం, మార్షల్ ఆర్ట్స్, లాజిక్, పెయింటింగ్, శిల్పకళ, యోగా, తత్వశాస్త్రం, సంగీతం, గణితం, రసవాదం, మేజిక్, వాస్తుకళ, కవిత్వం మరియు సంపదతో సహా విస్తృత అంశాలపై పుస్తకాలను జాబితా చేశారు. ఈ పనులు సముద్రంలో పోయాయి కాబట్టి, కుమారి ఖండం ప్రతిపాదకులు తమ వాదనలకు ఎలాంటి అనుభావిక రుజువు ఇవ్వలేదని పట్టుబట్టారు.

1902 లో, చిదంబరన్ సెన్కోనరరాసె సెలవు అనే పుస్తకాన్ని ప్రచురించాడు, అతను “కొన్ని పాత ఆకులు” నుండి మాన్యుస్క్రిప్ట్ను ‘కనుగొన్నాడు’ అని వ్యాఖ్యానించాడు. ఈ పుస్తకం మొదటి పదిమందిరైలోని మొదటి సంఘం యొక్క కోల్పోయిన-కనుగొన్న పనిగా సూచించబడింది. ఈ పద్యం యొక్క రచయిత శైలిలో. ఈ పని ఆండులియువియన్ తమిళ రాజు సేన్గాన్ యొక్క దోపిడీల గురించి మాట్లాడారు, ఇతను ప్రస్తుతం మునిగి ఉన్న రాజ్యమైన పెరువాలానాటు రాజ్యం, కుమారి మరియు పహ్రులీల మధ్య ఉన్న ప్రాంతం. చిదంబరంర్ ప్రకారం, సెగాన్ ఓనినాడుకు జన్మించాడు, ఇది భూమధ్యరేఖకు దక్షిణాన ఉంది; రాజు టిబెట్ వరకు అనేక యుద్ధనౌకలు మరియు స్వాధీనం చేసుకున్న భూములను నిర్వహించాడు. 1950 వ దశకంలో, సెంకనరరాచెల్లవు ఎస్.ఎస్. వైయపూరి పిళ్ళైచే ఒక ఫోర్జరీగా ప్రకటించబడింది. అయితే, ఇది తమిళ పునరుజ్జీవవాదులను టెక్స్ట్ను ప్రేరేపించకుండా ఆపలేదు. తమిళనాడు ప్రభుత్వం నిధులు సమకూర్చిన 1981 డాక్యుమెంటరీ దీనిని ప్రపంచపు మొట్టమొదటి యాత్రగా ప్రకటించింది.

విస్తృతి మధ్యయుగ వ్యాఖ్యాత అడియార్కుణల్లర్ మాట్లాడుతూ కన్యాకుమారికి దక్షిణాన ఉన్న సముద్రం సముద్రంతో పోయిందని 700 కవతం అంత ఉండవచ్చని అని చెప్పాడు. కవతం యొక్క ఆధునిక సమానమైనది తెలియదు. 1905 లో, అరాసన్ శాన్ముగమ్ పిళ్ళై ఈ భూమి వేలాది మైళ్ళ వరకు విస్తరించి ఉండవచ్చని రాశాడు. పూర్ణిలింగం పిళ్ళై మరియు సూర్యనారాయణ శాస్త్రి ప్రకారం, ఈ సంఖ్య 7000 మైళ్ళకు సమానం. అబ్రహం పండొరొర, ఐయాన్ ఆరిథాన్, దేవనియన్ మరియు రాఘవ ఐయంగర్ వంటి ఇతరవారు 1,400 నుండి 3,000 మైళ్ళు వరకు అంచనా వేశారు. యు.వి. స్వామినాథ అయ్యర్ ప్రకారం, కేవలం కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితం చేయబడిన భూమి (రెండు కుర్రామ్ యొక్క తమిళ కొలతకు సమానం) మాత్రమే కోల్పోయింది. 1903 లో దక్షిణాన ఉన్న కన్జ్యులెన్ దీవులకు, మరియు పశ్చిమంలో మడగాస్కర్ నుండి తూర్పున సుండా ద్వీపాలకు కుమారి కంమామురి నుండి కుమారి ఖండం విస్తరించిందని సూర్యనారాయణ శాస్త్రి సూచించారు. 1912 లో, సోమసుందర భారతి చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు కన్యాకుమారిలను నాలుగు వైపులా తాకినట్లు రాశారు. 1948 లో, మెరైమలై ఆడిగల్ ఈ ఖండం దక్షిణ ధృవం వరకు విస్తరించిందని పేర్కొంది. సోమసుందర భారతి 6000-7000 మైళ్ల అంచనా వేసింది.

చిత్ర పటాలు లెమురియాను పురాతన తమిళ భూభాగంగా చూసేందుకు మొట్టమొదటి మ్యాప్ 1916 లో ఎస్. సుబ్రమణ్య శాస్త్రి ప్రచురించింది. ఈ చిత్ర పటం వాస్తవానికి కోల్పోయిన ఖండం గురించి నకిలీ విమర్శనాత్మక వాదనలను విమర్శించిన ఒక కథనంలో భాగం. అదియర్కునల్లర్ యొక్క రికార్డులు లో పేర్కొన్న కోల్పోయిన భూమి తాలూకా (కేవలం కొన్ని వందల చదరపు మైళ్ళ కంటే పెద్ద కాదు) సమానంగా ఉంది అని శాస్త్రి పట్టుబట్టారు. ఈ చిత్రం రెండు వేర్వేరు సంస్కరణలు కుమారి ఖండం: శస్త్రీ, మరియు ఎ. శంముఖం పిళ్ళై ఉన్నాయి. కోల్పోయిన భూమి నేటి భారతీయ ద్వీపకల్పం మాదిరిగానే ద్వీపకల్పంగా చిత్రీకరించబడింది.

1927 లో, పూర్ణిలింగం పిళ్ళై “డ్యూగ్యూస్ ముందు పౌరాణిక భారతదేశం” అనే పేరుతో ఒక చిత్ర పటం ప్రచురించారు, దీనిలో అతను పురాతన తమిళ మరియు సంస్కృత సాహిత్య రచనల నుండి వచ్చిన పేర్లతో కూడిన కుమారీ కందమ్ అనే పేరుతో అనేక ప్రదేశాలు ప్రచురించారు. కుమారి ఖండం యొక్క చిత్ర పటాల్లో పెన్వార్ కులతై తన 1946 పటంలో మొట్టమొదటిది. అనేక చిత్ర పటాలు కూడా కుమారి ఖండంలోని వివిధ పర్వత శ్రేణులు మరియు నదులను చిత్రీకరించాయి. అత్యంత విస్తృతమైన కార్టోగ్రాఫిక్ విజువలైజేషన్ 1977 చిత్ర పటాల్లో అడికర్కుల్లాల్ పేర్కొన్న 49 చూపించింది మరియు తమిళనాడు ప్రభుత్వం యొక్క 1981 డాక్యుమెంటరీలో కనిపిస్తుంది.

మహలింగం ప్రచురించిన ఒక 1981 మ్యాప్ కోల్పోయిన భూమి 30,000 బి.సి. లో “సబ్మెర్జడ్ తమిళనాడు” గా వర్ణించబడింది. ఆర్. మతివనాన్ రూపొందించిన 1991 పటము, భారతీయ ద్వీపకల్పమును అంటార్కిటికాకు అనుసంధానిస్తున్న ఒక భూ వంతెనను చూపించింది. కొందరు తమిళ రచయితలు గోంద్వానాల్యాండ్ కుమారి ఖండం అని కూడా చిత్రీకరించారు.

భావన యొక్క విమర్శ లెమురియా యొక్క భావన నకిలీ శాస్త్రీయ సాహిత్యంలో ఉంది. తమిళ చరిత్రతో లెమూరియా పురాణం కలపడానికి చేసిన ప్రయత్నాలు 19 వ శతాబ్దం చివరలో విమర్శలను ఆకర్షించాయి. తొలి విమర్శలలో ఒకని, “తమిళ కవచాల యొక్క అద్భుతమైన కల్పితమైన ఊహాజనిత పునాది” అని పిలిచే యం శేషగిరి శాస్త్రి (1897) నుండి వచ్చినది. సి.మ మోనాహన్ సూర్యనారాయణ శాస్త్రి తమిళ్మోలియం వరలరు (1903), త్వరలో దాని ప్రచురణ తరువాత, “పురాణశాస్త్రం కోసం శాస్త్రీయ పరిశోధనను వదిలివేసిన” రచయితని నిందిస్తూ. సంఘం రచన యొక్క చారిత్రక ప్రామాణికతను మరియు వారి వ్యాఖ్యానాలను పరిశీలించడానికి అవసరమైన విధంగా కె. యన్. శివరాజ పిళ్ళై (1932) అదేవిధంగా నొక్కిచెప్పారు.

1956 లో, కె. ఎ. నీలకంఠ శాస్త్రి కుమారి ఖండం సిద్ధాంతం “అన్ని బోష్” గా వర్ణించబడింది, లక్షల సంవత్సరాల క్రితం జరిగే సంఘటనల గురించి భూగర్భ సిద్ధాంతాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ చరిత్రకు అనుసంధానించబడకూడదని పేర్కొంది. 1966 లో రాసిన చరిత్రకారుడు యన్. సుబ్రహ్మణ్యన్, తమిళనాడులో “చరిత్ర వ్యతిరేక” యొక్క అత్యంత లక్షణాత్మక ఉదాహరణగా లెమూరియా పురాణాన్ని వర్ణించారు. ఆధునిక విద్య ఉన్నప్పటికీ తమిళ ప్రజల మనస్సుల్లో ఈ పురాణాలు కొనసాగాయి. అతని ప్రకారం, పురాతన తమిళ పురాణాలలో వివరించినట్లు సముద్రంతో పోయింది, ప్రస్తుతం ఉన్న జిల్లాలో పోల్చదగిన చిన్న ప్రాంతం, మరియు 5 వ లేదా 4 వ శతాబ్దం బి.సి లో మునిగిపోయింది.

అదే అభిప్రాయాన్ని చరిత్రకారుడు కె. కె. పిళ్ళే కూడా పంచుకున్నారు. అతడు వ్రాస్తాడు. అంగీకరించి, అంగీకృతం కావడమే, తమిళ లెగ్యూరియా లేదా గోండ్వానా ఖండం తమిళ సంగమం యొక్క యుగంలో ఉనికిలో ఉన్న అభిప్రాయాన్ని అంగీకరించలేదు. దక్షిణ తమిళనాడులోని దక్షిణ తమిళనాడులో దక్షిణ తమిళనాడు అకాడమీ వర్ధిల్లింది తమిళ సౌందర్యం గురించి కొంతమంది రచయితలు కొందరు దక్షిణ దక్షిణ మధురైలో వర్ధిల్లారు. లెమురియన్ సిద్ధాంతం ద్వారా ఈ అభిప్రాయాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దీర్ఘకాలం క్రితం, లేమిరియన్ ఖండం ఉనికిలో ఉండినట్లు గమనించడం ముఖ్యం. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, లెమోరియన్ లేదా గోండ్వానా ఖండాన్ని అనేక విభాగాలలో ముక్కలు చేసి, మెసోజోక్ యుగంలో దగ్గరగా ఉండాలి.

జనాదరణ పొందిన సంస్కృతిలో కందమ్ (2016), ఇది తమిళ ఆంగ్ల కెనడియన్ / శ్రీలంక చిత్రం ప్రసా లింగం దర్శకత్వం వహించింది. ఈ చిత్రం కుమారి ఖండం యొక్క ఖండం యొక్క ఉనికి ఆధారంగా మరియు తమిళ నాగరికత యొక్క ప్రాబల్యం యాన్డిలియువియన్ కాలంలో ఉద్భవించింది.

కుమారి ఖండం ది సీక్రెట్ శనివారాలలో భాగాలు “ది కింగ్ ఆఫ్ కుమారి ఖండమ్” మరియు “ది అట్లాస్ పిన్” లో కనిపించారు. ఈ సంస్కరణ ఒక పెద్ద సముద్రపు పాము వెనుక ఉన్న నగరంగా ఉంది, దాని నివాసితులు అన్ని చేపలు.

కుమారి ఖండం సీజన్ రెండు, ఎపిసోడ్ త్రీ అఫ్ ది హిస్టరీ ఛానల్ టెలివిజన్ కార్యక్రమం “ప్రాచీన ఎలియెన్స్” లో కనిపించింది.

విస్తీర్ణము మరియు జనాభా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

1-1-19-పుష్యపూర్నిమ సోమవారం ఉదయం మా ఇంట్లో మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చిత్రాలు

1-1-19-పుష్యపూర్నిమ సోమవారం ఉదయం మా ఇంట్లో మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చిత్రాలు

Image may contain: 1 person, smiling, indoor and food
Image may contain: indoor
Image may contain: flower and food
Image may contain: food and indoor

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వామి అగేహానంద భారతి

స్వామి అగేహానంద భారతి : జర్మనీ నుండి ఇండియా వచ్చి సన్యాసిగా వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి లెపాల్క్ ఫిషర్final sanyasi satyempalikete

మంచి పుస్తకం .ఇన్నయ్యగారి అనువాదం మిన్నంటింది .అందరు చదవాల్సిన పుస్తక .రచయితకు ,అనువాదకులు ధన్యవాదాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6

అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం )

కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి వంగడాలు౦డేవట .1522లో హంపీ విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ‘’డోమింగో ఫేస్ ‘’విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి కనీసం సంవత్సరకాలమైనా కావాలని ,రోమ్ కన్నా చాలా విశాల సామ్రాజ్యమని ,ఏడు ప్రాకారాలమధ్య అత్యంత విశాల కట్టు దిట్టమైన సైనిక బందో బస్తు మధ్య అత్యంత విశాల భవనాలలో జ్వాజ్వల్యమానంగా అలరారేదని ,సామాన్యప్రజలు కూడా మంచి ఆభారణాలు  నాణ్యమైన దుస్తులతో అలంకార ప్రియత్వంగా ఉండేవారని ,జాజి గులాబీ పూలంటే ప్రజలకు చాలా ఇస్టమని ,ఎక్కడ చూసినా సంతృప్తి తా౦డవి౦చేదని ,రాయలు రాజ్య ధనాగారం నుండి తనకోసం, తన కుటుంబం కోసం ధనంవాడుకోవటం జరగలేదని ,సంవత్సరానికి కోటి బంగారు నాణాలు ప్రజలనుండి ప్రభుత్వానికి జమ అయ్యేదని ,ఆ డబ్బు అంతా ప్రజల సాంఘిక ధార్మిక కాభి వృద్దికే వెచ్చి౦చేవారని ,కటకం నుండి గోవా వరకు ,హిందూ మహా సముద్రం నుండి రాయచూరు వరకు విస్తరించిన విజయనగర సామ్రాజ్యం శాంతి సౌభాగ్యాల సంక్షేమ సామ్రాజ్యమని వేనోళ్ళ పొగిడాడు .

పోర్చుగీసు యాత్రికుడు ‘’బార్బోసా ‘’రాయల పరమత సహనాన్ని ప్రత్యేకించి మెచ్చాడు. ప్రతి వ్యక్తికీ తాను నమ్మిన ధర్మాన్ని అనుసరించే స్వాతంత్య్రం ఉండటం రాయల వ్యక్తిత్వానికి ప్రతీక అన్నాడు .వీరిద్దరికంటె ముందు 1420లో వచ్చిన ఇటలీ యాత్రికుడు నికోలాకొంటీ ,1446లో మధ్య ఆసియా నుంచి వచ్చిన అబ్దుల్ రజాక్ లు రాయల సామ్రాజ్య విభాగాన్ని తనివితీరా పొగిడారు .రజాక్ ‘’Pupil  have never seen,and the ear of intelligence never heard of such city ‘’అని ఘనంగా చెప్పాడు .ధార్వాడ జిల్లాలో మాసూర్ లో రాయలు త్రవ్వించిన కాలువను’’ ఫ్లె ఫేర్’’అనే  బ్రిటిష్  ఇంజనీర్ చూసి అంతపెద్ద కాలువ త్రవ్వించటం 19 వ శతాబ్ది సెంట్రల్ యూరప్ దేశాలకు ఇప్పటికే సాధ్యమయ్యే పనికాదని  ఆశ్చర్యం లో మునిగిపోయాడు .థామస్ మన్రో అయితే కృష్ణరాయల సామర్ధ్యాన్ని వర్ణించటానికి వేయి నోళ్ళు చాలవు అన్నాడు .ఇదంతా చరిత్ర చెప్పిన సాక్ష్యమే అని మనం గ్రహించాలి .ప్రజలనూ, సైనికులనూ, వాణిజ్య సముదాయాన్నీ ఒకే రకమైన ఆదరాభిమానాలు చూపాడు రాయలు .కళలపట్ల దీనికి రెట్టింపు అభి రుచి ఉండటం రాయల ప్రత్యేకత .హంపీవిరూపాక్ష దేవాలయం ,రాతిరధం, విఠలేశ్వరాలయం ,రాణీ వాసపు స్నానాగారమైన లోటస్ మహల్ , సప్తస్వర మండపం ,బృహదీశ్వరాలయం ,లేపాక్షి, తిరుమల వెంకటేశ్వర దేవాలయ స్వర్ణఖచిత గోపురం,  పెనుగొండ రామాలయం కృష్ణరాయల కళా ధార్మిక సేవకు నిలువెత్తు నిదర్శనాలు .

వీటన్నిటికి మించి రాయల ‘’భువన విజయం ‘’దేవేంద్రుని ‘’సుధర్మ ‘’కు సాటి .భువన విజయకవుల కవితా పాండిత్యం నభూతో అనిపిస్తుంది .తొలి ప్రబంధం అల్లసాని  పెద్దనా మాత్యుని ‘’ మను చరిత్ర ‘’పురుడు పోసుకొన్న నేల .ఇది ఎన్నో ప్రబంధాలకు బాట వేసింది .సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని పించాడు ఆముక్తమాల్యద ప్రబంధ రచనలో రాయలు .ధూర్జటి గారి కాళహస్తీశ్వర మహాత్మ్యం శివ భక్తీ తత్పరమై జేజేల౦దుకొన్నది తెనాలి రామలింగని పాండురంగ మహాత్మ్యం ,ఆయన చుట్టూ అల్లుకొన్న కథలు చాటువులు నేటికీ నిత్య వినోదాలు .రాయల ఆముక్తమాల్యద కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో ఆంద్ర మహా విష్ణువు సన్నిధానం లో రూపు దాల్చింది .భక్త శిఖామణి పురందరదాసు ,వాది రాజు ,కన్నడ భక్త శిఖామణి కనకదాసు రాయలకాలం లోని వారి స్వర్ణయుగానికి రేకులు తొడిగారు .ఇదేకాలం లో భరతముని భారత శాస్త్రమూ వర్దిల్లిందట .

కన్నడ సరస్వతిని అర్చించి వీర శైవామృత ,భావ చిన్తారత్న సత్యేంద్ర చోళ గాదె వంటి రచనలు చేసిన మల్లనార్యుడు’’కృష్ణనాయక ‘’రచయిత తమ్మన్నకవి,భేదో జ్జీవన ,తాత్పర్య చంద్రిక ,న్యాయామృతం ,తర్క తాండవ వంటి అజరామర గ్రంధాలను రచించి ,కృష్ణరాయల కులగురువుగా గౌరవ స్థానం అలంకరించిన వ్యాసరాయలు రాయల కీర్తి కిరీటానికి వన్నెలు చిన్నెలూ తీర్చి దిద్దిన మహానుభావులు .732శ్రీ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు నిర్మించిన  మహాహనుమభక్తులు వ్యాసరాయలు .వ్యాసరాయల పేరువింటే పులకించి పోయే పుట్టపర్తివారు ‘’ దేశాధినేతగా ,పాలన దక్షునిగా ,కళాభిమానిగా ,వాణిజ్య వేత్తగా ,న్యాయ సంరక్షకునిగా  బహు ముఖీన వ్యక్తిత్వం తో దక్షిణ దేశ చరిత్రనే తన వెంట నడిపిన రాయలవారిని తన ఉపాసనా బలం తో తిరుగు లేని నాయకునిగా నిలిపిన పరమ పవిత్ర యోగి వర్యులే వ్యాసరాయలవారు ‘’అని పొంగి పోయి చెప్పారు .మధ్వమత మూల స్తంభం శ్రీపాద రాయలవారి శిష్యుడైన వ్యాసరాయలు  ఆజన్మ మేధావి .అమేయ సాధనా సంపత్తికి ప్రసిద్ధి .బాలునిగా ఉండగానే సన్యసించిన వారు. దీని వెనుక ఒక కధఉంది .సాలువ నరసింహ రాయల కాలం లో తిరుమల ఆలయం లో పూజాదికాలలో జరిగిన దోషాలను నివారించటానికి వ్యాసరాయలనుప్రార్ధించి  పంపారు .ఆయన అక్కడ 12ఏళ్ళు నిరాఘాటంగా పూజాదికాలు నిర్వహించి  దోషనివారణ చేసి ,నిత్యపూజకై వంశ పారంపర్య పూజారులను నియమించి ,తాము తపస్సమాదిలోకి వెళ్ళిపోయారు .ఈలోగా విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యాడు .కానీ రాయల జాతక రీత్యా ఉన్న ‘’కుహూ యోగం ‘’ఆయన్ను కబళిస్తుంది అని జాతక పండితుల హెచ్చరిక .

అమర సి౦ హుని ‘’నామ లింగాను శాసనం ‘’లో చెప్పినట్లు ఒక అమావాస్య నాడు రవి, కుజ,శని, రాహు గ్రహాలకలయిక 12 వ ఇంట జరిగినపుడు జాతకునికి ప్రమాదం అని హెచ్చరించింది దీనినే కుహూ యోగం అంటారు ..రాయల జాతక రీత్యా ఇది 1514సంవత్సరం ఫిబ్రవరి 4న అంటే స్వభాను నామ సంవత్సర మాఘ అమావాస్య  శతభిషానక్షత్రం రోజు .ఆరోజు సూర్యగ్రహణం కూడా ఉండి ఉండచ్చు.కుహూ యోగ ఫలంగా జాతకునికి బంధు మిత్ర పరి వార జనుల౦దరి నుండి వియోగం సంభవించి ,నివసించటానికి నీడ కూడా కరువై చివరికి ప్రాణహాని సంభవిస్తుంది .ఈ ఆపద నుంచి రక్షించే పుణ్య పురుషునికోసం వెతుకుతూ గజరాజు కు పూలదండ ఇచ్చి వదిలి దాని వెనక సైనికులు పరుగులు పెడుతున్నారు .అది తిరిగి తిరిగి ఎక్కడో కొండాకోనల్లో ధ్యాననిమగ్నుడైన వ్యాసరాయలను చేరి పుష్పహారాన్ని ఆయన కంఠ సీమను అలంకరించింది .కృష్ణరాయలకు ఊపిరి లేచి వచ్చింది .వెంటనే వ్యాసరాయల సన్నిధి చేరి శరణు వేడి సగౌరవం గా  విజయనగరానికి ఆహ్వానించగా ,ఆయనా సంతోషం తో వచ్చి కుహూ యోగం ఉన్న రోజున విజయనగర సింహాసనాన్ని అధిస్టించి మహారాజయ్యారు .ఆ విష ఘడియలలో కుహూ యోగం ఒక విష సర్పం రూపం లో వారిని కాటు వేయటానికి వచ్చింది .వారు చిరునవ్వుతో దానివైపు చూసి తన పై ఉత్తరీయాన్ని దానిపై వేయగా ,అది కనురెప్పకాలం లో మలమల మాడి  బూడిదగా నేల రాలింది .తాను  సింహాసనం అధిరోహించిన అవసరం ,అలా శుభ ప్రదంగా మారిన సందర్భంగా వ్యాసరాయలు శ్రీ  కృష్ణ దేవరాయలను పట్టాభి షిక్తుని చేశారు .తనకు ప్రాణ భిక్ష పెట్టినందుకు రాయలు వ్యాసరాయలవారిని స్వర్ణ సింహాసనం పై సగౌరవంగా కూర్చోబెట్టి ,నవ రత్నాభి షేకం నభూతో గా  చేసి కృతజ్ఞత ప్రకటించాడట రాయలు ..

కుహూ యోగాన్నే ఉపాసనాబలం తో భక్తి తన్మయత్వం తో లొంగ దీసిన మహా శక్తి తపో సంపన్నులు వ్యాసరాయలు బాలకృష్ణుని కూడా తమ కను సన్నలలో  ఆడించేవారట .దీనికి సాక్ష్యమే వారు యమునాకల్యాణి రాగం లో రచించిన ‘’కృష్ణా నీ బేగనే బారో ‘’కీర్తన .వారు పిలిస్తే ‘’కిత్తమూత్తి మామయ్య’’ పట్టు పీతాంబరం ధరించి శ్రీ చందన ఘుమఘుమలతో ,కాలిగజ్జెల దిమి ధిమి  ధ్వనులతో నాట్యం చేస్తూ లీలా మానుష వేషధారి ప్రత్యక్షమవ్వాల్సిందే .అంతటి భక్తి శక్తి సంపన్నులాయన .

హంపీలో వ్యాసరాయలు ‘’యంత్రోద్ధారక ప్రాణ దేవరు ‘’హనుమను ప్రతిష్ట చేయాలని సంకల్పించి ,అనేకమారులు చిత్రం గీసేవారు. వెంటనే అది మాయమై పోయేది .ఇలా 12రోజులు గడిచాయి .13వ రోజు వాయు చిత్రం గీసి దాన్ని యంత్రం లో బంధించారు .చిత్రం లో 12 వానరాలు ఒక దాని తోక మరొకటి పట్టుకొని ఉన్నట్లుగా వాయు చిత్రం చుట్టూ గీశారు  .ఈ బంధం లో చిక్కుకునిపోయిన వాయు జీవోత్తముడు బయటికి రాలేక అలాగే నిలిచి పోయాడని ,ఆయ౦త్ర౦ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నదని పుట్టపర్తి వారు చెప్పారు .

అయ్యకు గత జన్మలో హంపీ ప్రాంతం తో గట్టి బంధమే ఉండి ఉంటుందని నాగపద్మిని గారి గట్టినమ్మకం .అక్కడి శిల్పాలలో సహజ శృంగారం ,బంధాలు అన్నీ శాస్త్రబద్ధంగానే ఉన్నాయని ఆయన చెప్పేవారట .క్రోధ ప్రదర్శన కోసం భీమ సేన దర్వాజా దగ్గర భీముని ముఖ కళను చూడాలని చెప్పేవారాట .మహర్నవమి దిబ్బ వెనకాలున్న భేతాళాకారాన్నీ చూడాలట .విఠలాలయం కళ్యాణ మండపం లోని లోపలి స్తంభాలపై చెక్కిన శిల్పం మరీ ప్రత్యేకమైందిట .ఒక హిందువు ఒక తురకవాడిని కోపం తో నిండినకళ్ళతో గడ్డం కింద కత్తి పెట్టి చంపబోతున్నట్లు చెక్కిన శిల్పం చూచి తీరాల్సి౦ దే నట .విఠలాలయ భిత్తికా (గోడ )భాగాలలో,చుట్టూ ఉన్న బొమ్మలలో ,గుర్రాలను నడిపించుకొని వస్తున్న ఒక పోర్చు గీసు వ్యాపారి బొమ్మ ఉందట .అతని కళ్ళల్లో తన గుర్రానికి తగిన ధర వస్తుందా రాదా అనే సందేహం కొట్టవచ్చినట్లు శిల్పి చెక్కిన తీరుపరమాద్భుతమట .ఇలాంటి భావాలు కవిత్వం లో సాధ్యమేమోకాని చిత్రాలో సాధ్యమా అని పిస్తాయట .సాధ్యమే అని ఆశిల్పి నిరూపించాడట .                               స్వచ్చమైన దేదీ లేదని సా౦కర్యమే రసపోషణకు మూలమని విజయనగర శిల్పం కూడా సాంకర్య సూత్రానికి లోబడిందే అని ,కాని దాని సహజ లక్షణం హైందవం అని ,హైందవం లో ద్రావిడం ద్రావిడ శిల్పకళ లో ఎన్నో సా౦కర్యాలు ఉన్నాయో ఇందులోనూ అన్నీ ఉన్నాయంటారు లోచూపున్న పుట్టపర్తి వారు . అరబ్బీ యవన కళాలక్షణాలు హంపీ శిల్పాలలో  ఉన్నాయి .ఈ సాంకర్యం వల్ల కళ తేజో వృద్ధి పొంది౦దేకాని ,సహజత్వాన్ని కోల్పోలేదని తీర్పు ఇస్తారు .విజయనగరాన్ని స్వర్గ ఖండం అంటారు కాని విదేశ ఖండం అని ఎవ్వరూ అనరు అని అయ్య వాక్యాలతో ఈ సుదీర్ఘ వ్యాసాన్ని ముగించారు నాగపద్మిని .

ఎన్నెన్నో ‘’అయ్యా ,అమ్మడూ’’ తవ్వి తలపోసిన మధురాను భూతులివి .అందుకే ఎక్కడా వదలకుండా మీకు ప్రతి విషయమూ అందజేశాను .నాకు ముంజేతి జున్ను గా అనిపించింది ,జుర్రి జుర్రి తృప్తి చెందాను .మీకూ ఆ అనుభూతి కలగాలని ఆరాటపడి ఆ రచన అంతా ‘’ఏతం తో తోడాను.’’ ఈ సారి హంపీ విజయనగరం సందర్శించినపుడు కనువిందు పొందటానికి ఇందులో చెప్పినవి సహకరిస్తాయని నమ్మకం .ఇంత మధురోహల హంపీ విజయనగరాన్ని మనముందుంచిన  ఆ ఇద్దరికీ ధన్యవాదాలు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2

ప్రాకృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గతొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి మొదటి వ్యాసం లో వివరించారు శ్రీమతి నాగపద్మిని . జయవల్లభ సంకలించిన ‘’వజ్జా లగ్గ’’లో 795గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తావన .ఒకే  విషయానికి  చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే అదొక వజ్జ అవుతుంది .ఒక్కో వజ్జలో ఒక్కో విషయం ఉంటుంది .కావ్యం ,సజ్జనులు, స్నేహం, దేవుళ్ళు మొదలైన శీర్షికలతో వజ్జలున్నాయి అని విశ్లేషించారు పద్మిని ..’’స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం ‘’అనే సినీకవితా పంక్తి మనకు తెలిసిందే .స్నేహాన్ని గురించి ఒక  ప్రాకృతకవి ‘’స్నేహం పాలూ నీళ్ళు లాగా కలిసి పోవాలి. పాలను వేడి చేస్తే ముందుగా ఆవిరయ్యేది నీళ్ళే .ఆపదలో తాను  ముందు ఎదుర్కొని, మిత్రుడిని రక్షించినవాడే నిజమైన స్నేహితుడు ‘’అంటాడు .అలాగే పది మందికీ ఉపయోగపడని ధనవంతుడి వలన సమాజానికి ఏమి లాభం ?వాడిని తాటి చెట్టు తో పోల్చి చెప్పాడు కవి అందంగా నీతి బోధకంగా –‘’ఛాయా రహి నిరాసమస్స దూర వరదావి య ఫలస్స-దొసెహి సమజా కా వి తుంఇ యా తుజ్జరే తాల ?’’

తాటి చెట్టూ !నీడ ఇవ్వలేవు ,నీ ఫలాలూ అందన౦త ఎత్తులో ఉండటం వలన ఎవరికీ ప్రయోజనం లేదు నువ్వు యెంత ఎత్తుగా ఉన్నా మాకేమిటి నీ వల్లలాభం ?.12వ శతాబ్ది హేమచంద్రకవి పవిత్రత గురించి చెప్పిన ‘’గంగా యమునా సరస్వతీ నదులలో స్నానం చేసినంత మాత్రాన శుద్ధి జరుగు తుందా ?అలా అయితే వాటిలో రోజూ ఈదులాడే గొడ్లకుకూడా శుద్ధి లభిస్తుందా ?తెలిసీ తెలియకస్నానం చేస్తే ఫలితం రాదు అని తమాషాగా చెప్పాడు .కోపం ,అభిమానం మాయ లోభం మనిషి లోంచి దూరమైతే తప్ప అంతశుద్ధి సాధ్యం కాదని కమ్మగా చెప్పాడు హేమ చంద్రుడు .హాలుడు సేకరించిన గాదా సప్త శతి శృంగార౦ రంగరించినది మాత్రమే కాదు అది సామాజిక దర్పణం అని కూడా గ్రహించాలన్నారు పద్మిని .సోమరి , సొంబేరు ను ఎప్పుడో హెచ్చరించాడు ఒక  ప్రాకృతకవి –‘’ఆరంభతస్స ధు అం లచ్చీమరణం వి హోయి పురిసస్స-త౦ మరణ మణా రంభే వి హోయి లచ్చీ వుణ ణ హోయి ‘’-ఏదైనా పని మొదలు పెట్టేవారికి లక్ష్మీ ,చావు రెండూ వరిస్తాయి .అసలు పనే చేయని వారికి చావు మాత్రం తప్పదు .

లక్ష్మణ పాత్రనుఉపయోగించి  ఒక వదిన తనమరిది దురాలోచన ను యెంత సున్నితంగా మరల్చే ప్రయత్నం చేసిందో తెలియ జెప్పే ప్రాకృత గాధ చూడ౦డి –‘’దిఅరస్సఅసుద్ధ మనస్సకులవహూ ణి అఅ కుడ్డలిహి ఆ ఇం-ది అహం కహేయి రామాణు లగ్గ సోమిత్తి చరి ఆ ఇం’’.ఒక పల్లెటూరులో ఒక వదినపై మరిది దురూహను పెంచుకొన్నాడు .అది బయట పడితే కుటుంబ గౌరవం బజారున పడుతుంది .కానీ వాడిని దారిలో పెట్టాలి లాఘవంగా ఎలా ?అన్యాపదేశంగా మరిదికి రామ లక్ష్మనులున్న చిత్రాన్ని పదేపదే చూపిస్తూ లక్ష్మణుడు లాగా అన్న పెద్దరికాన్ని నిలబెట్టు.వదిన నైన నన్ను చెడు దృష్టి తో చూడకు ‘’అని హితవు బోధించి అపాయం నుంచి తననూ ,కుటుంబ గౌరవాన్ని చాలా తెలివి తేటలతో కాపాడింది ఆ వదిన .

మంచి సంప్రదాయాలను తండ్రి తన వారసుల చేతకూడా కొన సాగించటం సంప్రదాయం .కానీ ఇలాంటి వారు అరుదుగానే ఉంటారు లోకం లో .దీన్ని అందంగా చెప్పాడు కవి –స్నేహం వలన ఏర్పడే అనురాగం ఏ మాత్రం తరగకుండా ,అప్పులాగా తన తరవాత తరాలకూ సంక్రమింప జేసే సత్పురుషులు లోకం లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు అంటాడు .సప్త శతి సంతరించిన హాలుడు రాజనీతిజ్ఞుడైన చక్రవర్తి కనుక రహస్యం విలువ ఎలాంటిదో గొప్పగా తెలియ జెప్పే గాధ ను ఎన్నుకొన్నాడు –సజ్జనులు తమకెవరైనా రహస్యం చెబితే ,దాన్ని ఆ ఆ తర్వాత వాళ్ళతో పోట్లాట వచ్చినా కూడా బయట పెట్టరు .అది వారి హృదయం లోనే ఇంకిపోయి వారితోపాటే చితికి ఆహుతైపోతుంది .బ్రతికి ఉండగా ఎన్నడూ అది బయట పడదు .ఆచరణలో అసాధ్యం అనిపించినా చాలా గొప్ప నీతి వాక్యం కదా ఇది .’’ఇల్లు చూడు ఇల్లాలిని చూడు ‘’అన్నారు మనవాళ్ళు .ఇల్లాలు అంటే స్నేహపూరిత హృదయం  తో ,మంచి ఆలోచనలతో రూప గుణ సంపన్నత తో ,భర్త సుఖ  దుఖాలలో భాగస్వామిని అయి శాంతిగా జీవితం సాగించేది .అలాంటి అర్ధాంగి దూరమైతే భర్త పడే మనో వేదన వ్యక్తం చేసే గాధ-‘’సుఖ దుఖాలను సమానంగా పంచుకొని  జీవించిన దంపతులలో ఎవరు ముందు చనిపోయినా  వాళ్ళే బ్రతికి ఉన్నవారితో సమానం .మిగిలిన వాళ్ళు బతికి ఉన్నా జీవన్మృతులే అంటాడు కవి .భార్యపై అత్యంత మమకారం ప్రేమల ఉన్న ఒక రైతు భార్య మరణిస్తే ,తట్టుకోలేక ఆమె లేని గృహం శూన్యంగా  అనిపించి ,ఇంటికి  వెళ్ళాలి అనిపించక పనులేమీ లేకపోయినా పొలం లోనే కాలం గడుపుతున్నాడట .భార్య జ్ఞాపకాలను అతడు మనసు నుంచి తుడిచి వేయలేకపోవటం వారి మధ్య ఉన్న అనురాగానికి పరాకాష్ట.అందరికీ ఆదర్శం ,ప్రేరణ కూడా –

దీర్ఘాయుర్దాయానికి కూడా సూక్తులు ఇందులో చోటు చేసుకొన్నాయి అందులో ఒకటి –‘’సిల దమ ఖంతి జుత్తా దయావరా మంజు భాషిణోపురిసా –పాణవహావు ణి యత్తా దీహావూ హో౦తి సంసారే ‘’-అంటే శీలం ,దయ, క్షమా, ఇంద్రియ నిగ్రహం ,మంచి సంభాషణ లతోపాటు అహింస ఉన్నవాడే దీర్ఘాయుస్సు పొందగలాడు .2016 ఆంద్ర ప్రభలో ప్రచురితమైన వ్యాసం ఇది .

మానవ ప్రకృతిని ప్రాకృత భాషలో అక్షరబద్ధం చేసి ,నిక్షిప్తం చేసి సర్వకాల సర్వావస్థలకూ మార్గ దర్శనం చేసే గాధా లహరి కి తనదైన బాణీలో మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసిన డా నాగపద్మిని  అభిన౦దనీయురాలు .

సశేషం

శుభా కాంక్షలతో

మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

పుష్యబహుళ పంచమి  25-1-2019 శుక్రవారం  సంగీత  సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా సరసభారతి 136వ  కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30 గంటలకు శ్రీ త్యాగరాజ స్వామి చిత్రపటానికి అష్టోత్తర పూజ ,అనంతరం సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో స్థానికి గాయనీ గాయకులచేత ”త్యాగరాజ పంచ రత్న కీర్తనల ”గానం నిర్వహింపబడుతాయి  .సంగీత సాహిత్యాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి -గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-19

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్‌ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

380-విక్రమాశ్వత్థామీయమ్‌ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951)

.జననం

చిలుకూరి నారాయణరావు గారు విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 న జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం ల లోని మహారాజా కళాశాలలో చదివి పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి జె.ఎ.యేట్స్తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశారు. తరువాత అనంతపురం దత్తమండల కళాశాల (తరువాతి కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశారు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చే ‘కళాప్రపూర్ణ’ బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే ‘మహోపాధ్యాయ’ బిరుదును పొందారు. ‘ఆంధ్ర బెర్నార్డ్ షా’ అనే బిరుదుకూడ ఉంది.
మరణం

ఇతడు 1951, జూన్ 22 న పుట్ట కురుపు వ్యాధి వలన చెన్నైలో పరమపదించారు.

చిలుకూరి నారాయణరావు గిడుగు రామ్మూర్తితో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశారు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించారు. అందుకే 1937లో వెలువరించిన ఆంధ్ర భాషా చరిత్రని అప్పట్లోనే వాడుక భాషలో రాశారు.

దత్తమండలానికి రాయలసీమ అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించారని, గాడిచర్ల హరిసర్వోత్తమరావు సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర శ్రీ సర్వోత్తమజీవితంలో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునరుద్ధరించి ఉంటారని అనుకోవచ్చు[1] రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని పప్పూరు రామాచార్యుల చే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.
విశేషాలు

· మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడు.

· 240 గ్రంథాలు వ్రాశారు. ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.

· నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షుడు.

· తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారు. తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది, తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు, స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించారు.

· తెలుగులోకి ఖురాన్ గ్రంథాన్ని అనువదించిన తొలివ్యక్తి చిలుకూరి నారాయణ రావు. మొదటి “తెలుగు కురాను” (1925), రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నారు “ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది. ఇదియే గ్రంథకర్తకును, గ్రంథ ప్రకాశకులకును బహుమానము”.

· ఉమర్ ఖయ్యూమ్ వ్రాసిన రుబాయత్‌లను ముత్యాలసరములు అనే పేరుతో తెలుగులో వ్రాశారు.
రచనలు

1. కురాను షరీఫు – ముస్లీముల పవిత్ర గ్రంథం కురాన్‌కు మొట్టమొదటి తెలుగు అనువాదం.

2. అశోకుని ధర్మశాస్త్రములు

3. సంస్కృతలోకోక్తులు

4. ఉపనిషత్తులు

5. ఉమర్ ఖయాం రుబాయతు (ముత్యాల సరములు)

6. ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు)

7. చక్కటులు – సామెతలు: 80,000 (అముద్రితం)

8. అశ్వత్థామ (తెలుగు నాటకం)

9. అంబ (మొండి శిఖండి) (నాటకం)

10. అచ్చి (కాపువలపు) (నాటకం)

11. పెళ్ళి (హాస్యము)

12. నాటకనాటకము

13. నందుడు (మాలభక్తుడు) (నాటకం)

14. ఆరోగ్య నాటకము

15. గుజరాతీ వాజ్మయ చరిత్రము

16. అశోకచక్రవర్తి ధర్మశాసనములు (అనువాదం)[3]

17. పదనకొండవ శతాబ్దమునాఁటి తెనుఁగు భాష (సిద్ధాంత గ్రంథము)

18. ఆంధ్రభాషా చరిత్రము (రెండు సంపుటాలు – రాయల్ సైజు 1750 పుటలు)

19. ప్రాచీన విద్యాపీఠములు

20. జర్మనీ విద్యావిధానము

21. విక్రమాశ్వత్థామీయమ్‌ (సంస్కృత నాటకం)

22. వాడే (నాటకం)

23. శూరసేనుడు (అముద్రిత నాటకం)

24. నిగమశర్మ (అముద్రిత నాటకం)

25. బ్రహ్మశిరము (అముద్రిత నాటకం)

26. మదాలస (అముద్రిత నాటకం)

27. శిరోమణి (ద్రౌపదీ విజయము) (అముద్రిత నాటకం)

28. బొమ్మపొత్తికలు (అముద్రిత నాటకం)

29. ప్రకృతి నాటకం (అముద్రిత నాటకం)

30. జపాను కవితలు

31. ఆంధ్ర దేశపు జానపద గేయాలు

32. బాలల గేయసాహిత్యము

33. శ్రీమద్భగవద్గీత కావ్యము

34. సృష్టి రాద్ధాంతము

35. తుక్ఖాంబ

36. రాగసూచిక

37. వైదిక వాజ్మయ చరిత్ర

38. హిందీవాజ్మయ చరిత్ర

39. జపాన్-తెనుఁగు పదకోశము

40. తెనుఁగు-జపాన్ పదకోశము

41. మరాఠి-తెనుఁగు పదకోశము

42. ఆంగ్లాంధ్ర నిఘంటువు

43. వనస్పతి నిఘంటువు

44. జపాన్ భాషాబోధిని

45. జర్మను భాషా స్వయంబోధిని

46. హేమచంద్రుని దేశి నామమాల

47. నన్నయ భారత పదకోశము

48. కవులు-కావ్యములు సూచిక

49. పార్శీవారి ప్రార్థనలు (అముద్రితం)

50. అథర్వణవేదము (అముద్రితం)

51. An Introduction to Dravidian Philology

52. The Dance of Rain Drops

53. The Nomenclature of Karnataka Ragas

54. An Index to the Achchika Words in Srinatha’s works

55. English – Telugu Technical Dictionary

56. The Bhagavat Geetha

57. Lectures on Geetha

58. A short Survey of Telugu Literature

59. Florilegia

60. Sanskrit Aphorism with English Explanation (అముద్రితం)

61. Songs of Tyagaraja

ఆధారం –తెలుగు వీకీ పీడియా

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి  

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి

—  తెలుగు సారస్వత రంగంలో ఎందఱోమహానుభావులు ,వారిలో ఒక అనర్ఘరత్నం బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు .నాకు గురుతుల్యులు ,నా భార్య శ్రీ సుశీల కి ప్రపితామహులు అయిన అయ్యప్పశాస్త్రి వంటి మహానుభావులగురించి  గురించి ఇప్పటి తరం తెలుసుకోవాలనే  తాపత్రయం తో ఆయన జీవిత విశేషాలు ,ఆయన ప్రతిభాపాటవాలు గురించి మేము విన్నది,తెలుకున్నది క్లుప్తం గా ఇక్కడ వివరిస్తున్నాం .అవధరించండి .
బ్రహ్మశ్రీ అయ్యప్ప  శాస్ర్త్రి గారు ఆంద్ర ,గీర్వాణ భాషలలో అపారమైన పాండితీ పటిమనార్జించి ,ఆంధ్ర భాషారాధకులై బహు రమణీయమ,మృదు మధుర శైలితో కూడిన పదజాలంతో పాతికకి పైగా గ్రంథరచనలు చేసి,అద్భుతమైన ఆశుకవితాపటిమ తో ఎన్నో అష్టావధానాలు,శతావధానాలు చేసి ఆశుకవితలు చెప్పి పండిత పామర లోకాన్ని అలరించి,మన్ననలు పొందారు

    అయ్యప్ప  గారు కృష్ణా జిల్లా ముదినేపల్లి( కృష్ణాజిల్లా)లో  1888 లో జన్మించారు .పూర్వ నివాసం పశ్చిమ  గోదావరి జిల్లా .ఆకువీడు ,తరువాత కృష్ణా జిల్లా సిద్ధాంతం ,గుడివాడ ,విజయవాడ

            బ్రహ్మశ్రీ అయ్యప్ప శాస్త్రిగారి కుటుంబ వివరాలు

—————————————————

తండ్రి :భమిడిపాటి సుబ్బావధానులు గారు
తల్లి :భమిడిపాటి గారమ్మ గారు
ఒక సోదరుడు కామేశ్వర శాస్త్రి
రామమ్మ ,సుబ్బమ్మ ,మహాలక్ష్మమ్మ ,సూర్యకాంతమ్మ ,లక్ష్మీనరసమ్మ, దుర్గమ్మ అను ఆరుగురు సోదరీలు
భార్య :భమిడిపాటి పేరమ్మ
పుత్రులు ; అచ్యుతరామ శాస్త్రి ,సుబ్బావధాని ,విజయకృష్ణ మూర్తి ,పాండురంగ స్వామి
పుత్రికలు :సుబ్బమ్మ ,వెంకట సుబ్బమ్మ ,పోషిత కనక దుర్గాoబ ,రోచిష్మతీ సౌభాగ్య కామేశ్వరి ,సత్యవాణి ,దయావతి ,మధురవాణి ,కమలావతి ,మధురావతి
విద్యాభ్యాసము
బాల్యం లో యజుర్వేద సంహిత బ్రాహ్మణములను అధ్యనం చేశారు. ప్రసిద్ధ విద్వాన్సుల వద్ద సంగీతం  పిమ్మట గీర్వాణ భాషకూడా అభ్యసించి కావ్య,నాటక ,అలంకారాలను సంపూర్తి చేశారు వ్యాకరణ సిద్ధాంత కౌముది చెళ్లపిళ్ల చిన వెంకటశాస్త్రి (చెళ్ళపిళ్ళ వెంకట  శాస్త్రి శతావధాని గారి సోదరుడు)  ఉపాధ్యాయ వృత్తికై ఎలిమెం టరీ గ్రేడ్ ట్రైనింగ్ పాసై,యానిమల్ ఫిజియోలజీ,హైజిన్ అను టెక్నికల్  పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు . 1921 లో మద్రాస్ యూనివర్సిటీ ఏ  గ్రేడ్ విద్వాన్ పరీక్షలలో కృతార్ధత పొందెను .
ఉద్యోగం

కృష్ణా జిల్లాలో వివిధ స్థలముల లో ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా,ప్రధాన ఉపాధ్యాయుని గా పని చేశారు
1918 వ సంవత్సరం నుండి 1921 వ సంవత్సరం  వరకు పశ్చిమ  గోదావరి జిల్లా `ఉండి ” బోర్డు హై స్కూల్ సీనియర్ తెలుగు పండితుడిగాను . 1922 వ సంవత్సరం నుండి 1942 వరకు కృష్ణా జిల్లా గుడివాడ బోర్డు హై స్కూల్ లో తెలుగు ,సంస్కృతం భాషలు రెండింటిలోనూ సీనియర్ పండితులుగా పనిచేశారు ..
1943 వ సంవత్సరం లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బోర్డు హై స్కూల్ లో సీనియర్ తెలుగు పండితునిగా పనిచేసి రిటైర్ అయ్యారు .
తరువాత  అనేక స్థలములలో పనిచేశాక విజయవాడ ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల (ప్రింటింగ్ ప్రెస్ )సంశోధకుడిగా పనిచేశారు ఆయన శిష్యులు అనేకులు  వృద్ధిలోనికి వచ్చి మంచిస్థితికి వెళ్లారు
అయ్యప్పశాస్త్రి గారు చక్కని కవి.ఎన్నో అష్టావధానాలు,శతావధానులు చేసి ఆశుకవిత్వము చెప్పి ప్రజల మన్ననలు పొందారు 
అయ్యప్ప శాస్త్రి గారు  రచించిన గ్రంధాలు 
1రామతారకావళి 2.రామ శతకము 3.నాగేశ్వర శతకము 4. భక్తి రస ప్రధాన కీర్తన శతకము 5.ఆంధ్ర రఘు వంశము 6.అనిరుద్ధ వివాహం 
7.హనుమద్ విజయం 8.అన్నదాన మహిమము .9.మీరాబాయి చరిత్రము .10.వేమన తారావళి . 11.సుశీల 12.భవిష్యత్ పురాణము 
13.సీతారామచంద్ర ప్రభోధము . 14,వేంకటేశ్వర మహాత్మ్యం 15.చంద్రమౌళీశ్వర చిద్విలాసం 16.చెన్నకేశవ వినోదము 17.రంగనాయక స్త్రోత్రము .18.హయగ్రీవావతారము 19.మధుకై టభ భంజనము . 20పురూరవ జననము .21  శుక విలాసము 22.సాధ్వీమణి (అనసూయ )
 23..శ్రీవేదాద్రి లక్ష్మి నృసింహ గర్భ వృత్త సామరస్యము 24.అక్రూర చరిత్రము 25.గణపతి మాహాత్మ్యము 26.శ్రీ కుమారాభ్యుదయము 
27.మేఘ సందేశము 28.గణపతి సంగ్రహ చరిత్ర 29.కిరార్టార్జ్యునీయం 30.దుర్గామల్లేశ్వర స్త్రోత్రము 
                                  ———–
  

బ్రహ్మశ్రీ అయ్యప్ప శాస్త్రి గారిని వరించిన బిరుదులు 
1.బన్ధగర్భ కవి సమ్రాట్ 
2.ఆశుకవి 
3.శతావధాని 
4.విచిత్ర కవి                                    ———–
   ప్రముఖ శతావధాని మరియు మద్రాస్ ప్రభుత్వ ఆస్థాన కవీశ్వరుడు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి పలికిన పలుకులు శ్రీ  అయ్యప్పశాస్త్రి  గారిని ఆశీర్వదిస్తూ;
“భగవంతుడు ఇతనికి శ్రేయహ్ప్రదాత యగుగాక యని ఆశీర్వచనం చేయుచున్నాడను ”
                              పండితుల ప్రశంసలు 
                         —————————-
మీ “వేదాద్రి లక్ష్మీ నరసింహ వృత్త నరసింహ గర్భవృత్త సామరస్యము ”అను గ్రంధరాజము ను; మేఘసందేశము చదివి ఆనందించితిని . 
“బన్ధగర్భ కవి సామ్రాట్ ;; అను బిరుదు తమకే చెల్లునని నా మనవి . 
                                              శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వఝల చిన సీతారామ శాస్త్రి 
                                                  విశాఖపట్నం ,23/07 /1949
                                  —————–
“ అవధాని బహూనమస్కారపూర్వకముగా చేసుకున్న విన్నపాలు .మీ  “వేదాద్రి లక్ష్మీ నరసింహ వృత్త నరసింహ గర్భవృత్త సామరస్యము ” శ్రద్ధతో పఠించితిని .తాము పడిన శ్రమకును ,గర్భవృత్తము అభిప్రాయము చెడకుండా ధార సడలకుండా కూర్చిన తమ నేర్పునకు నేను ఎంతయో అచ్చెరువు నొందితిని .మేఘసందేశము సాంతము గ చదివితిని .అనువాదమయ్యు ,స్వతంత్ర కావ్యమవలే మిక్కిలి మనోహరముగా నున్నది 
                                          దివాకర్ల వెంకటావధాని M.A (honours )
                          తెలుగు లెక్చరర్ ,Mrs. A .V.N కాలేజీ ,విశాఖపట్నం
                                         ——— 
మహా కవి కాళిదాసు మేఘసందేశమునకు అనువాదముగా శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు రచించినఆంద్ర పద్య కావ్యము గీర్వాణ భాష నభిజ్ఞులకు అందరాణిఫలమును చేతికందించుటయే కాక మూలమును చదువుకొనువారికి కూడా మిక్కిలి ఆనందమును కలిగించుచున్నది . 
                                         జటావల్లభుల పురుషోత్తం M.A 
                           సౌంస్కృత లెక్చరర్ ,S.R.R.College ,విజయవాడ 
                                   ————–
శ్రీ శాస్త్రి గారు“బంధకవి సామ్రాట్ ” “ఆశుకవి ”“శతావధాని ” “విచిత్రకవి ”
ఇత్యాది బిరుదాంచితులని నడుపుటలో నా చదివిన వీరి రచనలే తార్కాణములు . 
గ్రంథకర్తగా ఆంధ్ర గీర్వాణ భాషలందు అపార పాండితీ పటిమ ఆర్జించి ఆంధ్రభాషారాధకులై తర్కవితావాసనా పరంపరలచే బహు రామణీయంబులును ,మృదు మధుర శైలి సంశోభితములును అయి చెలువొందునచ్చ తెలుగుపడజాలములచే విలసితంబులై యొప్పు తెలుగు కబ్బముల పెక్కింటిని రచించితిరి .దానికి దృష్టాంతమీ “మేఘసందేశమ”య్యు ,ఇందు ముఖ్యముగా ఉత్తర మేఘము మిక్కిలి యొప్పుచున్నయది . 
                                                           సుసర్ల వెంకటేశ్వర శాస్త్రి , 
                                         ఆంద్ర గ్రంధాలయ ప్రెస్ పండిట్ విజయవాడ 

image.png
ఆధారం -శ్రీ వినుకొండ మురళీమోహన్ పంపిన వ్యాసం 
మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -17-1-19-ఉయ్యూరు 
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5

                  అయ్య చూసి (పి)న హంపి-3

మాధవుని తల్లి, భార్య మరణించారు .భవబంధాలు తెగిపోగా ఇక శ్రీ భువనేశ్వరీ సేవలోనే జీవిస్తున్నారు .దేశాన్ని రక్షించే మార్గం నిర్దేశించమని మనసార ప్రార్ధిస్తున్నారు .పంపా౦బిక  పరమేశ్వరుని పతిగా పొందేందుకు తపస్సు చేసిన చోటే ,అంజనాదేవి ఆంజనేయుని వాయుపుత్రునిగా పొందిన చోటు , శ్రీరాముడు  వాలి సంహారం చేసి సుగ్రీవ పట్టాభి షేకం చేసిన చోటు ,కుక్కలు కుందేలును తరిమికొట్టిన పౌరుష గడ్డ అయిన పంపా తీరం లోనే 12 ఏళ్ళు ఘోర తపస్సు  చేశారు ఆహార పానీయాలు లేకుండా .  .అమ్మ కరుణించి ప్రత్యక్షమై ‘’ఇక నుంచి నువ్వు ‘’విద్యారణ్యుడు’’ అని పిలువబడుతావు .త్వరలోనే నీ మనస్సులోని సంకల్పం నెరవేరుతుంది ‘’అని  అభయమిచ్చి  ఆశీర్వదించింది జగన్మాత .’’త్వరలో అంటే ?’’అని అడిగాడు అమ్మను .‘’వచ్చే జన్మ లోనే .కారణం నువ్వు  సన్యాసికావాలి  ‘’అని వెంటనే అమ్మ సమాధానం .అంతే వెంటనే ‘’ఇదుగో ఇప్పుడే’’ అంటూ సన్యాసం స్వీకరించగా అమ్మ పెదవులపై దరహాసం ద్విగుణీకృతమై ‘’కొన్ని రోజుల్లోనే నీ కోరిక నెరవేరుతుంది ‘’అని చెప్పి తృప్తి కలిగించింది .

  విద్యారణ్యులు  విరూపాక్ష సన్నిధానం లోనే ధార్మిక ప్రవచనాలు చేస్తూ , సమర్ధులైన భావి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు .ఆనె గొందే యుద్ధం లో రాజు జ౦బుకేశ్వరుని మహమ్మద్ బీన్ తుగ్లక్ చంపేసి మల్లిక్ నబీ ని ప్రతినిధిని చేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు .అదే అదనుగా భావించి కొంతమంది యువకులతో తిరుగుబాటు చేయించారు విద్యారణ్యులు   .వాడు భయం తో ఢిల్లీ కి  పారిపోయి తుగ్లక్ కు చెప్పగా తనవద్ద ఖైదీలుగా ఉన్న హరి హర ,బుక్క రాయలను తిరుగుబాటు అణచి వేయమని పంపాడు .తమకూ మంచి రోజులు వచ్చాయని గ్రహించి సోదరులు విద్యారణ్యులను శరణు వేడారు .వీరిలో రాజ ఠీవి గమనించారు .వీళ్ళను అంతకుముందు తురకలు కుమ్మట దుర్గాన్ని నాశనం చేసి ధిల్హీకి బందీలుగా పట్టుకెళ్ళి  మతం మార్పించారు .దేశికుల ‘’అభీతి స్తవం ‘’ప్రభావం ఇక్కడా కనిపించిందని సంతోషించారు .వారిద్దరినీ హిందూమతం లోకి మార్చి ,తన పాండిత్య ప్రకర్ష హిందూ ధర్మ దేశ రక్షణ ,రాజతంత్రం మేళవించి సోదరులను ఆనె గొందే కోట జయించి మల్లిక్ నల్లీ ని బందీగా పట్టుకోనేట్లు వ్యూహం పన్ని తొలి విజయం సాధించారు .

  ప౦పా క్షేత్రం లో అనువైన ప్రదేశం లో 1336లో వైశాఖ శుద్ధ సప్తమినాడు వియనగర సామ్రాజ్య స్థాపనకు శంకు స్థాపన చేశారు .అన్నీ బాగానే ఉన్నాయి .మరి రాజ్యానికి కాసులు లేవు .అమ్మవారిని ఆర్తిగా వేడుకున్నారు .అమ్మ కృపా వర్షం తో పాటు  ఏడున్నర ఘడియల సేపు కనకవర్షం కురిపించింది .ఈ ధనంతో సైన్యం,ఆయుధాలు సమకూర్చుకొని ,హరిహర బుక్క సోదరులు రాజ్య విస్తరణ చేసి ముందుగ హరిహరుడు తర్వాత బుక్క రాయలు రాజ్యపాలన చేశారు  .విద్యారణ్యులు   ప్రధానమంత్రిగా పథనిర్దేశనం చేశారు .అధికార కాంక్ష ఇసుమంతైనా లేకుండా, సన్యాసి గానే జీవిస్తూ తమ్ముడు సాయనుని సాయం తో ‘’సర్వ ధర్మ దర్శన సంగ్రహం ‘’రచించారు .అక్షోభ్యులవారిని ఆహ్వానించి గౌరవమర్యాదలు చేశారు వారి శిష్యులు జయతీర్దుల వారిని విజయనగరానికి  ఆహ్వానించి గజా రోహణ గౌరవం కల్పించి సత్కరించి ,భారతీ తీర్ధుల నిర్యాణం తర్వాత శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాదిపతిగా అభిషిక్తులయ్యారు శ్రీ విద్యారణ్య స్వామి .55  సంవత్సరాల  సేవలో తరించి ‘’పంచదశి ‘’,జీవన్ముక్తి వివేక ‘’అనుభూతి ప్రకాశిక ‘’,పరాశర మా౦డవీయ’’ తో పాటు శ్రీ  శంకర భగవత్పాదుల ‘’జీవిత చరిత్ర ‘’శంకర విజయం ‘’రచించారు .ఇదే చాలా సాధికారమైన రచన గా గుర్తింపు పొందింది .మొత్తం మీద 16 ధార్మిక గ్రంథాలు రచించి ఆర్ష ధర్మానికి ,అద్వైత  మత ప్రచారానికి విశేష కృషి చేశారు . కర్ణాటక సంగీతం లోనూ నిష్ణాతులుకనుక 16రాగాలకు రూప కల్పన చేసి తాను రాసిన ‘’సంగీత సార ‘’లో వివరణ కూడా ఇచ్చారు .విశాల హిందూ సామ్రాజ్య స్థాపనకోసం చెల్లా చెదురుగా ఉన్న పాండ్య ,చోళ కేరళులను మేధా శక్తితో సైన్యబలం తో లోబడేట్లు చేసి ,దక్షిణ దేశాన్ని అంతటినీ ఒకే త్రాటిపై నిలబెట్టిన మేధావి .వారు శృంగేరిలో సమాధి చెందలేదని ,’’ముడుబాగల ‘’లో అని అభి ప్రాయ భేదం ఉందని పుట్టపర్తి వారు ఉవాచ .విరూపాక్ష ఆలయం లోని భూగృహం లో విద్యారణ్యుల  వారి సమాధి ఉందని శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత క్రిష్ణ శర్మగారి చివరి సోదరుడు ,విజయనగర చరిత్ర పరిశోధకులు శ్రీ గోపాల కృష్ణమాచార్యులు  పుట్టపర్తి వారికీ చూపించారట .పరమ శివావతారం అయిన విద్యారణ్యస్వామి పై అచంచల భక్తి విశ్వాసాలున్న హరిహర బుక్కరాయలు ఇలా స్వామి వారిని విరూపాక్ష స్వామి దేవాలయ భూగృహం లో సమాధి చేయించి ఉంటారని పుట్టపర్తివారూ సమర్ది౦చారట  .’’దక్షిణభారత చరిత్రనే మార్చి వేసి,118 ఏళ్ళు జీవించిన  విద్యారణ్యుల   వారిని తలచుకొని కన్నీరు కార్చేవారు అయ్య’’అని కుమార్తె పద్మిని చెప్పారు  .ప్రజాక్షేమమే ధ్యేయంగా ,నిజాయితీ ఉన్న కార్యకర్తగా, స్వార్ధ రాహిత్యం తో,దేశ రక్షణకు దైవీ శక్తి ,తన సంకల్పం తో తపస్సంపన్నతతో , ధార్మిక ప్రవక్త గా శిఖరాయమైన ప్రజ్ఞా పాటవాలతో వెలుగొందిన హిమాలయోన్నత మనీషి శ్రీ విద్యారణ్య స్వామి అని అ౦జలి ఘటించారు శ్రీమతి నాగపద్మిని.

  సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం నారాయణీయము

 

శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం
నారాయణీయము (తెలుగు లిపి)ముందు మాట
మేలపత్తూరు నారాయణ భట్టతిరి కృతం ఇది నారాయణీయము. శ్రీమన్నారాయణీయము వ్యాస భాగవత పురాణానికి సంస్కృత భాషలో వెలువడిన సంగ్రహ రూపము ఇది. ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రములో వెలసిన శ్రీ కృష్ణుని సంభోదిస్తూ దైవస్తుతి రూపంలో కొనసాగుతూ ఉంటుంది. భక్తి, జ్ఞాన వైరాగ్యములు పెనవేసుకొని సాగిన అద్భుత రచన ఈ కృతి. దీనిని దేశమంతా, ముఖ్యముగా కేరళ, తమిళనాడులలో అధికముగా, పారాయణ చేస్తూ ఉంటారు. మంచి ఆయురారోగ్యాలకు, వ్యాధుల ఉపశమనానికి తిరుగులేనిది నారాయణీయ పారాయణ అని ప్రసిద్ధి పొందింది. ఇది కవిత్వ పుష్టి గల 1036 శ్లోకాలుతో పరిపుష్ట మైన గ్రంథము. ఇది క్రీశ. 1586 లో భట్టతిరి వారిచే వ్రాయబడింది అంటారు. వీరి జీవిత కాలం క్రీస్తు శకం 1560 నుండి 1646/1666 అంటారు. కొందరు నూట ఆరు సంవత్సరాలు జీవించారు అంటారు. కనీసం ఎనభై సంవత్సరాలు జీవించారన్నద నిర్వివాదాంశము.

కేరళలోని నంబూద్రి వంశములో మేలపత్తూరు వారి ఇంట క్రీశ. పదహారవ (16) శతాబ్దములో జన్మించిన నారాయణ భట్టతిరి మంచి సంస్కృత పండితుడు. గొప్ప గురుభక్తి పరాయణుడు. పదహారేళ్ళకే వేద వేదాంగములను అభ్యసించి, వ్యాకరణాది శాస్త్రములను ఔపోసన పట్టాడట. వీరు సంస్కృతములో ఎన్నో గ్రంథాలను రచించారు. వీటిలో శ్రీపాద స్తుతి, గురువాయుపుర స్తోత్రము, నారాయణీయము ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

ఒక మారు వృద్ధులైన వీరి గురువుగారు రోగగ్రస్తులు అయితే, నారాయణ భట్టతిరి వారు గురు దక్షిణగా తమ భక్తి, యోగ బలములతో గురువు గారి రోగాన్ని తన మీదకు స్వీకరించాడట. పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. అలా ఇరవైఏడేళ్ళకే (27) రోగగ్రస్తుడై ఎన్ని ఔషధములు సేవించినా స్వస్థత చేకూరలేదు. ఈ మళయాళ సంస్కృత కవి తన వ్యాధి ఉపశమనము నిమిత్తము గురువాయూరు వచ్చి తమ ఆరాద్య దైవము గురువాయూరు శ్రీకృష్ణునికి దినమునకు ఒక దశకము, దశకము అనగా సుమారు పది శ్లోకముల స్తుతి, చొప్పున సమర్పించారు. ఆ విధంగా అవిఘ్నంగా శత (100) దశకములు (10) సమర్పించారు. ఈ స్తుతికి ప్రసన్నుడైన భగవానుని అనుగ్రహంతో భట్టతిరి తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడు.

క్షేత్రపురాణము ప్రకారము ఇక్కడి మూర్తి బహు శక్తిమంతము పురాతనము అయినది. ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి ‘త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయ’మనీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి, వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి తీసుకొని వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

జాతకరీత్యా పాముకాటు ఉన్న పాండ్యరాజునకు, తెలియకనే జరిగిన పాముకాటు వల్ల ప్రమాదం తప్పిపోవుటకు కారణం, ఆ సమయములో ఆయన గురువాయూరప్పను సేవిస్తూ ఉండటమే అని పండితులు చెప్పారు. అంతట ఆయన గురువాయూరు మందిరాన్ని పునరుద్ధరించినట్లు ప్రతీతి. నేటికీ మహావ్యాధులకు గురైన వారు స్వామిని దర్శించి పారాయణ చేసినచో సంపూర్ణ ఆరోగ్యముతో వర్ధిల్లుతారు అని, క్షేత్రాన్ని దర్శించలేకపోయినా నారాయణీయము పారాయణ చేసినచో సత్పలితాలు ప్రాప్తిస్తాయని నమ్మకం పాతకాలం నుండీ ఉంది.

ఈ పవిత్రమైన విష్ణు క్షేత్రం కేరళ రాష్ట్రంలో త్రిసూరు జిల్లాలో త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణము. గురువాయూరును దక్షిణ ద్వారక అంటారు. ఈ క్షేత్రములో శ్రీకృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం “గురువాయూర్”. ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో ఉన్నాయి. వాటిలో నారాయణీయము విశిష్టమైనది.

image.png

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి(1905)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి (1905

కాకరపర్తి కృష్ణశాస్త్రిగారి తాతగారైనబాపన్నగారు పద్మనాయక వంశ్య ప్రభువుల (నాయకరాజుల) ఆస్థానవైద్యులుగా ఉన్నారు. తండ్రిగారైన వేంకటరాయుడుగారు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురము వద్ద గల లక్ష్మీనరసాపుర ఆస్థానములో శ్రీరావుచెల్లయాంబికా రాజ్ఞీమణి వద్ద ఠాణేదారుగా, సంస్థానవైద్యునిగా పనిచేశారు.

వేంకటరాయుడు, వేంకమాంబిక దంపతుల సంతానములో ప్రథముడు కాకరపర్తి కృష్ణశాస్త్రి. 1905వ సంవత్సరంలో (స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామసంవత్సర ఆశ్వయుజ శుద్ధ ఏకాదశీ గురువారం) జన్మించిన వీరు పిఠాపురం, పెద్దాపురం, కాకినాడలలో ఆంగ్ల విద్యాభ్యాసం అనంతరం తండ్రిగారివద్ద సంస్కృతవిద్య, సంస్కృత కావ్యములు, నాటకములు, ఆంధ్ర గీర్వాణ భాషా వ్యాకరణములు, ఆయుర్వేదము, జ్యోతిష, సాముద్రిక, వాస్తు శాస్త్రములు నేర్చుకున్నారు.

వంశపారంపర్యంగా వస్తున్న వైద్యవృత్తిని చేపట్టి కాకినాడ పట్టణంలో సుమారు 36 సంవత్సరాలపాటు ప్రజల శారీరక ఆరోగ్యాన్ని కాపాడారు. శ్రీ రావు చెల్లయాంబికా రాజ్ఞీమణుల ఆస్థానవైద్యులుగా ‘రాజవైద్య’ బిరుదాంకితులైనారు. తూర్పుగోదావరి జిల్లా వైద్యసంఘముకు అధ్యక్షులుగా ఆయుర్వేదాభివృద్ధికి కృషి చేశారు.

సంస్కృత పంచకావ్యాలు చదువుతున్న రోజులలోనే తన పద్దెనిమిదవయేట ‘సంయుక్తా కల్యాణము’ అనే ఆంధ్ర ప్రబంధాన్ని రచించారు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారిచే పీఠిక రాయబడిన ఈ కావ్యాన్ని శ్రీ రావు చెల్లయాంబికా జమీందారిణివారు కృతిగా స్వీకరించారు. తన ఇరువదవయేట చంద్రహాస విలాసము అనే ఆంధ్రప్రబంధాన్ని సృజించి శ్రీ చెలికాని సత్యనారాయణ కవిగారికి కృతిగా సమర్పించారు. మూడవ కృతి కౌశికాభ్యుదయము, శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారి కోరిక మేరకు రచింపబడి, వారికే కృతిగా నొసంగబడినది. ఆనాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరువారి యధ్యక్షతను జరుపబడిన పండితమహాసభలో దీని ఆవిష్కారం జరిగింది.

సంస్కృత, ఆంధ్రభాషలలో పది అద్వైత గ్రంథములు వీరిచే రచింపబడ్డాయి. వాటిలోని ‘సదాముక్తి సుధార్ణవము’ అనే గ్రంథము వావిళ్ళ ముద్రణాలయమువారిచే ప్రచురింపబడింది. దీని ప్రతి ఒకటి హైదరాబాదులోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఉన్నది. ప్రత్యక్షమోక్షసౌధము అనే గ్రంథము జర్మనీభాషలోనికి అనువదింపబడింది. వీరు రచించిన జగద్గురు పూజా విధానము అనే గ్రంథాన్ని అనుసరించి శంకరాచార్యుని పూజలను ప్రతి సంవత్సరమూ ఆచరించేవారట!

షష్టిపూర్తి అనంతరము వీరు ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ అధ్యక్షునిగా ఉన్నారు. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికకు సంపాదకులుగా, ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు’ ముద్రణ వ్యవహారాలను వీరు పర్యవేక్షించారు.

వీరు రచించిన ‘అభయసిద్ధి’ అనే అద్వైత వేదాన్త గ్రంథము హైదరాబాదుకు చెందిన ఒక మహనీయునిచే ఆంగ్లభాషలోనికి, పెద్దాపురము నకు చెందిన ఒక విద్యాధికునిచే హిందీ భాషలోనికి అనువదింపబడినది అని తెలుస్తోంది. మరి ఆ అనువాదాల ప్రతులు ఎవరివద్దనైనా ఉన్నవో, లేవో తెలియదు.

కృష్ణశాస్త్రి గారికి కవికంఠీరవ, కవిమూర్ధన్య, ప్రౌఢకవిచంద్ర, విద్వత్కవివర, బ్రాహ్మీభూషణ. అనే ఐదు బిరుదులు ఉన్నాయి. వాటిలో కవికంఠీరవ బిరుదము ఆనాటి ఫ్రాన్స్ దేశ ప్రభుత్వ అధికారులచే బహుకరింపబడింది. కవిమూర్ధన్య బిరుదము శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి గారిచే కౌశికాభ్యుదయము కృతిని స్వీకరించిన సందర్భంలో ఇవ్వబడింది. ప్రొఢకవిచంద్ర బిరుదు కాకినాడ పట్టణంలో ప్రతివాదిభయంకరపార్ఠసారథిగారికి కంచుఢక్క కృతిని సమర్పించినపుడు ఒసగబడింది. విద్వత్కవివర బిరుదముతో రాజమండ్రి గౌతమీ గ్రంథమండలి వారు సత్కరింపగా, బ్రాహ్మీభూషణ బిరుదము గుంటూరు నగర పండితసభలో అప్పటి ఆంధ్రప్రభుత్వ ఆస్థానకవి శ్రీ కాశీకృష్ణాచార్యులచే ఒసగబడింది. ఆగస్టు 06, 1944వ తేదీన కాకినాడ పురప్రముఖులచే సువర్ణఘంటా కంకణముతో సన్మానం జరిగింది.

ఆనాడు అత్యంత ప్రఖ్యాతులైన వ్యక్తుల చేత,సంస్థల చేత ఇవ్వబడిన ఈ బిరుదులు కృష్ణశాస్త్రిగారి భాషాపాండిత్యానికి సూచికలుగా నిలుస్తున్నాయి. అయితే ఈ బిరుదులన్నీ వారికి గల లౌకికమైన గుర్తింపును మాత్రమే సూచిస్తున్నాయని గమనించాలి. వారి గురువైన అల్లంరాజు నరసింహమూర్తి మహాత్ముల వద్ద ఆర్జించిన అద్వైత జ్ఞానం, దాని ద్వారా పొందిన అనుభూతి, అంతకంటే ముఖ్యం, ఆ జ్ఞానాన్ని అతి సరళమైన, సులభమైన రీతిలో శిష్యులకు, ప్రజలకు పంచిన తీరు – ఇవి ఎక్కడాగ్రంధస్థం కాని విషయాలు.

సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1

సరస్వతీ పుత్రులు ‘’అయ్య’’శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారి  సరస్వతీ ప్రసాద౦ కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు కీర్తి పొందింది .1972-73 లో అయ్య పుట్టపర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి అంటే చిలకల గుంపు దగ్గర ఆమె మనసు హత్తుకు పోయింది .రించోళి అంటే సమూహం గుంపు అని అర్ధం ..ఆకాశం నుంచి దిగుతున్న చిలకల గుంపు గగన లక్ష్మి మెడ నుంచి కి౦దికిజారుతున్న పచ్చలపతకం లా కనిపించిందట ప్రాకృత కవికి .  అప్పటి నుంచీ ‘’రించోళి’’పదం ఆమెను ‘’హాంట్ ‘’చేస్తూనే ఉంది .దాన్ని ఎలాగైనా తనరచనలలో వాడుకోవాలని తపిస్తున్నది .అమెరికాలో ఉండగా తమకుమార్తె శ్రీమతి వంశీ ప్రియ  ,అల్లుడు శ్రీ కార్తీక్ ధర్మరాజు దంపతుల కుమారుడు,తమ ప్రధమ దౌహిత్రుడు  ,చిరంజీవి  అక్షయ్ జన్మించి ఆటపాటలతో మురిపించినప్పుడు రూపు దిద్దుకొన్న అక్షర సంపుటికి ‘’వ్యాస రించోళి’’గా నామకరణం చేసి ఎన్నాళ్ళను౦చో కంటున్నకలకు సార్ధకత చేకూర్చింది. పద్మిని గారి’’ సాహితీ రించోళి’’ లో నన్నూ ఒకనిగా గుర్తించి ,ఆమె విజయవాడ రచయిత్రుల సభ మొదటి రోజు నాకు సరస్వతీ ప్రసాదంగా అందజేశారు .ఇవాళే సంక్రాంతి రోజు సాయంత్రం తీరిక  చేసుకొని చదవటం ప్రారంభించి కొంత చదివి,  ఇక ఆపుకోలేక అందులో కొంతైనా అర్జెంట్ గా’’ నా సరసభారతి ‘’సాహితీ రించోళి ‘’ కి అందించాలని తపనతో మొదలు పెడుతున్నాను. ఈ సాహితీ వ్యాస సమూహం లో అధికభాగం  గాదా సప్తశతి  కి చెందిన వ్యాసాలే ఉన్నందున ఆమె పెట్టిన పేరు చాలా సమర్ధనీయంగా ఉందని పి౦చింది .మధుర పదార్ధాలను ,మధుర భావాలనూ కలసి పంచుకోవాలి అన్నది ఆర్యోక్తి .’’కలాసీమా కావ్యం ‘’.కవులు  హృదయ నేత్రాలతో దర్శించి అనుభవించిన అనుభూతులకు ,సత్యాలకు కవితా రూపమిచ్చి సంతోషిస్తారు .సమాజం అంటే ఒకరి అవసరాలకు ఒకరు ఆదుకుంటూ ,ముందుకు అడుగు వేసే ఒక సామాజిక వ్యవస్థ అనీ ,అది భౌతిక అవసరాలకే కాక మానసిక ఆనందాలకూ సమభావ సౌరభ  వేదికగా ఉండాలి అని పద్మిని చెప్పారు .ఇలాంటి వేదికలు ఆమెకు ఇండియాలో విశేషంగానే లభించాయి. అమెరికాలో కూడా  డల్లాస్ లోని శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం,న్యు జెర్సీ లోని డా వైదేహీ  శశిధర్ లు అందించారు .పద్మిని గారి శ్రీవారు శ్రీ నల్లాన్ చక్రవర్తుల హర్ష  వర్ధన్ గారి తోడ్పాటు తోనే తాను ఇంతగా ఎదిగానని కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .ఈ వ్యాస రించోళి ని దౌహిత్రులు ఛి అక్షయ్,విరజ్ లకు అమ్మమ్మ కానుకగా అందిస్తూ తన అమ్మ ,అయ్యలు శ్రీమతి కనకమ్మ ,శ్రీ నారాయణా చార్యులవార్లను సంస్మరించారు . ఈ వ్యాస సమూహం లో ముందే చెప్పినట్లు అధికభాగం గాదా సప్త శతికి చెందినవే .అందులోని మానవ ప్రకృతి ,అలంకార ప్రియత్వం ,రుతు వర్ణనలో నవ్యత ,చందమామ అందాలు ,గ్రామ జీవితం ,ప్రకృతి,హేమంత సీమంతినీ విలాసం ,ఉన్నాయి .ఇవికాక ‘’అయ్య చూపిన హంపి ,’’గుణిని గుణజ్ణో  రమతే ‘’ సూర్యాయ విశ్వ చక్షుషే,సుప్రసన్న దీప వృక్షం ,ఏవితల్లీ నిరుడు విరిసిన స్మృతి లతా౦తాలు కూడా ఉన్నాయి. అనుబంధంగా ఆమె రాసిన ‘’అంతర్జాలం లో మాటల తేటలు ‘’చేర్చారు .

   రించోళిపదం నన్నూ బాగా ఆకర్షించింది .ఇదేకాక చేకూరి రామారావు గారు వాడిన ‘’స్మృతి కిణాంకం ‘’లోని కిణాంక శబ్దమూ చాలా ఇంపుగా ఉంది .మూడోసారి 2008లో మేమిద్దరం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తో ఫోన్ సంభాషణలలో చేకూరి రామారావు గారి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది .చేరా తన రూమ్ లోనే ఉండేవారని తామిద్దరికీ మంచి మైత్రీ బంధం ఉండేదని అమెరికావస్తే తమ ఇంటికి రాకుండా చేరా దంపతులు ఉండరని  చెప్పారు .మేము ఆ అక్టోబర్ చివర్లో ఇండియా వస్తూ ఉంటే మైనేనిగారు చే రా గారి అడ్రస్ ,ఫోన్ నంబర్ నాకు ఇచ్చి ,నేను ఆయనను కలవటానికి వస్తున్నట్లు ము౦దే చేరా గారికి ఫోన్ చేసి చెప్పారు   .2008 నవంబర్ 1వ తేదీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు నేనూ మా అబ్బాయి రమణ  చేరా గారింటికి  వెళ్లి కలిశాము. ఆ రోజే కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రాచీనభాషగా గుర్తించిన చిరస్మరణీయమైన రోజు . చేరా దంపతులు యెంతో ఆప్యాయంగా ఆహ్వానించి కాఫీ టిఫిన్ ఇచ్చి తమ అమూల్య గ్రంధాలను సంతకం పెట్టి నాకు అందజేశారు చేరా  ..అందులో  ‘’స్మృతి కిణా౦కం ‘’కూడా ఉంది .అప్పటినుంచీ ఆపదం నన్నూ ‘’హాంట్’’ చేస్తూనే ఉంది.

 ‘’ గాదా సప్త శతి అమూల్య మౌక్తిక రాశి .ముక్తకాలు –వేటికవే సంపూర్ణార్ధం కలిగి ,చదువరులను ఆహ్లాద పరచే రసగుళికలు .దీనినే అనిబద్ధ కావ్యముక్తకం అంటాడు భామహుడు .’’చమత్కార సృష్టిలో సామర్ధ్యమున్న శ్లోకమే ముక్తకం అన్నది అగ్నిపురాణం’’.పూర్వాపర నిరపేక్ష ణాపియేన ,రస చర్వణా క్రియతే తదేవ ముక్తకం ‘’అని లోచనకారుడు అన్నాడు. వ్యంజనం తోపాటు రస  సృష్టిలోనూ సామర్ధ్యమున్న ముక్తకాన్ని ‘’సరస ముక్తకమని ‘’,కల్పనా, నీతీ గంభీరంగా ఉంటె ‘’సూక్తి ‘’అనీ అంటారు .చమత్కారం లేకపోతె ‘’వస్తు కథన ముక్తకంఅంటారు .మనిషిలోని మానసిక శక్తి 1-పూర్ణ నియంత్రణాత్మక బౌద్ధిక దృష్టి 2-పూర్ణ భావాత్మక చేతన 3-నైతికత 4-కవిత్వ శక్తి ఉంటాయని వీటిలో కవిత్వ శక్తి శ్రేష్టమైనది ‘’అని గాధలలోని వైశిష్ట్యాన్ని నాగపద్మిని విశ్లేషించారు .

   ఈ రించోళి లో నాకు తెలియని విషయాలు చాలా తెలిశాయి .వీటిని మీకు వరుసగా అందించే ప్రయత్నం చేస్తున్నాను .

   సశేషం

  సంక్రాంతి శుభాకాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14-1-19 సోమవారం ఉదయం ఉయ్యూరులో భోగి మంటలు, ముగ్గులు ,శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శాకంబరీ పూజ చిత్రాలు

14-1-19 సోమవారం ఉదయం ఉయ్యూరులో భోగి మంటలు, ముగ్గులు ,శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శాకంబరీ పూజ చిత్రాలు

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6646189696551415249/6646189703528623154?authkey=CISeh_LtteegywE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాంతి నాడు ఆచార్య శ్రీవత్స పద్యాలతో నాకు ఫుల్లు గా కొట్టిన” పంపు ”

సంక్రాంతి నాడు ఆచార్య శ్రీవత్స పద్యాలతో నాకు ఫుల్లు గా కొట్టిన” పంపు ”

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006)

ఆంద్ర రచయితలు రచించిన సంస్కృత గ్రంథాలను ప్రచురించినట్లే ,ఆంద్ర సాహిత్య అకాడెమి వారు విజయవాడ ఆకాశవాణి ప్రసారం చేసిన సంస్కృత ప్రసారములను కవిసామ్రాట్ డా శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి చేత సంకలింప జేసి ప్రచురించించింది .ఇందులో నాలుగుమాత్రమే సంస్కృతం లోను ,మిగిలినవి తెలుగులో ఉన్నాయి .వీటిలో ఎనిమిది సూరి రామకోటి శాస్త్రి గారి వి ,అయిదు శ్రీ అప్పల్ల సోమేశ్వర శర్మ గారివి ఉన్నాయి . .వీటిని చదివితే ,కావ్యాత్మను గురించిన వివిధ సిద్ధాంతాలలో ప్రధానమైనవి ,వేదాంత విషయాలు స్థూలంగా తెలుసుకోవటానికి వీలవుతుంది .సంస్కృత పండితులలో జగత్ప్రసిద్ధులైన అన్నంభట్టు ,అప్పయ్య దీక్షితుల గూర్చి రామ కోటి శర్మగారి ప్రసంగాలు ,సంస్కృతం లోని సాంఘిక రూపకాలు ,ఉపహాస కావ్యాలను గురించి సోమేశ్వర శర్మగారి ప్రసంగాలు ,నాట్య శాస్త్రం ,ఆంధ్రుల సేవ గూర్చి డా పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేసిన ప్రసంగాలు అభినంద నీయాలు అని సంకలనకర్త డా పైడిపాటి శాస్త్రిగారన్నారు .ఈ ప్రసంగాలన్నీ సంస్కృతం లో శాస్త్రాలలో ,సాహిత్యాలలో సామాన్యులకు ప్రవేశం కలిగించేవిగా స్పూర్తి దాయకంగా ఉన్నాయి . ఈ పుస్తకం లో ఉన్న 118 పేజీలలోప్రసార భాగాలు ఉంటె , సుబ్బరామ శాస్త్రిగారి సింహావలోకనం 205పేజీలున్నాయి .’’భారతీయ సంస్కృతే రేకత్వం ‘’అనే మొదటి ప్రసంగానికి డా శాస్త్రిగారి పరిచయం 117పేజీలకు దేకింది .మిగిలిన 70పేజీలలో సంస్కృత భాష విశిష్టత ,దాన్ని అనుసందానభాషగా చేయాల్సిన అవసరం ,ప్రస్తుతం దానికి లభిస్తున్న ప్రచారం మొదలైన విషయాలున్నాయి .బిషప్ కాడ్వెల్ చెప్పిన ద్రావిడ భాషా సిద్ధాంతం వలన ఆర్య ,ద్రావిడ జాతి భేదాలేర్పడి ,అవిచ్చిన్న భారత భూమి అంతర్ ద్వేషాలతో విచ్చిన్నమయ్యే ప్రమాద స్థితికి చేరిందని డా పైడిపాటి బాధపడ్డారు .విదేశీపాలనవలన దేశం బలహీనమైనది అనటానికి ఇది ప్రధానకారణం .మానవ జాతికి అంతటికి భారత దేశమే జ్ఞాన స్థానమని ,ప్రపంచ ప్రజలంతా భారత దేశం నుండి వెళ్ళినవారే అని పైడిపాటివారి నమ్మకం .వీటికి తగిన హేతువులను చెప్పలేదాయన .

హైదరాబాద్ ,ఇతర రాష్ట్రీయ రేడియో కేంద్రాలు ప్రసారం చేసిన అమరవాణి కార్యక్రమాలను విచక్షణతో సేకరించి ,సాహిత్య అకాడెమీ ప్రచురించి భారతీయ సంస్కృతికి విశేష సేవ చేయాలని ఈ పుస్తకానికి1971 మార్చి భారతి లో సమీక్ష చేసిన శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు అన్నమాట నిజం కావాలి .

ఇప్పుడు పైడిపాటివారి జీవిత విశేషాలు తెలుసుకొందాం ఆయన కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, సాయిపురం గ్రామంలో 1918లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యుడిగా ఉన్నారు. వీరికి కవిసామ్రాట్ అనే బిరుదు లభించింది. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గరిమెళ్ల సత్యనారాయణ వంటి వారితో కలసి జాతీయ భావాలను తన కవిత్వం ద్వారా పెంపొందించారు.

1. నీలం (కథాసంపుటం)

2. మేనరికం (కథాసంపుటం)

3. అభిషేకము (రామలింగేశ్వర స్తవము)

4. మగదిక్కు (నవల)

5. మహారుద్రము

6. అనిరుద్ధ చరిత్రము

7. నృత్యభారతి (గేయాలు) [3]

8. జాతీయభారతి (గేయాలు)

9. జయభారతి (గేయాలు)

10. మధురభారతి (గేయాలు)

11. విక్రమభారతి

12. దిశమ్‌

13. తుణీరం

14. మధుర సంక్రాంతి (గేయాలు)

15. బాలభారతి (గేయాలు)

16. వఱద కృష్ణమ్మ (గేయాలు)

17. ఆంధ్ర భారతి (పద్యములు)

18. ఉషాసుందరి (నాటకము)

19. అమరవాణీ ప్రసారములు

20. అంకితం (నాటకము)

21. శతపత్రము[4] (పద్యములు)

22. దివ్వటీలు (పద్యములు)

మరణం
ఇతడు తన 89వ యేట ఆగస్టు 19, 2006న విజయవాడ, మారుతీనగర్‌లో తన స్వగృహంలో మరణించారు

2013 ఏప్రిల్ 11వ తేదీ న డా ఆచార్య ఫణీ౦ద్రకు ‘’పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాహిత్య పురస్కారం ‘’అందజేశారు .

విజయవాడ లో ఇద్దరు కవి సామ్రాట్టులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ,శ్రీ పైడిపాటి సుబ్బరామయ్య గారు సమకాలీనులుగా ఉండటం అరుదైన విషయమే .మన అదృష్టం కూడా .అందుకే పైడిపాటి వారు ‘’శ్రీ విశ్వనాథ కులమణి-నీ వన్నటులీవు నన్నవే,తమ్ముడ నే –వావిరి ‘’పద్మ –శ్రీ ‘’విభవుని జేయ నిన్ను ,జేతము పొంగెన్ ‘’అంటూ అన్న విశ్వనాధ పద్మశ్రీ వైభవాన్ని పొంగి ప్రశంసించారు తమ్ముడు పైడిపాటి .అంటే కాదు ‘’అన్న నీ వొక యుగ కర్త వగుట నిజాము –నీ యుగమున నేను జన్మించుటన్న-ఒక యదృష్ట౦పు ఫలము ‘’అనీ పొంగిపోయారు పైడిపాటి. అంతేనా తమ ‘’శతపత్రం ‘’కావ్యాన్ని విశ్వనాథ కు అంకితమిచ్చి ధన్యు లయ్యారు పైడి పాటి .ఒకరకంగా సుబ్బరామ శాస్త్రిగారు ‘’పైడి పాళి’’అనచ్చు నెమో ?

సశేషం

సంక్రాంతి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చంద్ర గిరి సుబ్బు సంక్రాంతికానుక

సాహిత్యాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు -నిన్న రాత్రి ”యు ట్యూబ్” లో చంద్ర గిరి సుబ్బు ఈటివి ప్లస్ కోసం తీసిన ”అత్తారింట్లో  సంక్రాంతి అల్లుడు”  రెండు ఎపిసోడ్ లు (”60,61)  చూశాను చాలాకాలం తర్వాత సంక్రాంతికి చక్కని తెలుగు హాస్యం తెలుగు పల్లెటూరు ,అల్లుడికి మర్యాద ,పిండివంటలు బామ్మర్ది సహకారం మరదలు పిల్లను బావ హాస్యం పెట్టటం భేషజాలు, కోతల రాయుళ్ల బండారం పెట్టమారి మగడు ”హెన్ పెకేడ్ ”హజబండ్ ”అయిన తనపేరు మర్చిపోయిన” కృష్ణవేణి మొగుడు”  ,కూతురంటే ప్రేమకున్న తండ్రి , అల్లుడంటే గౌరవమున్న అత్తగారు ,మంచీ మర్యాద కలగలిపిన సున్నితమైన హాస్య 0తో ఉన్న రెండు ఎపిసోడ్ లు ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తాయి .వెకిలి డోకు హాస్యానికి స్వస్తి చెప్పి ,కమ్మని హాస్యానికి ప్రాణం పోసిన చంద్ర గిరి సుబ్బు బహుధా అభినందనీయుడు

  సుమారు ఇరవై ఏళ్ళక్రితం దూర దర్శన్ లో సంక్రాంతికి ఇలాంటి కమ్మని హాస్యం వండి వడ్డించిన ఎపిసోడ్ లు వచ్చేవి ధర్మవరపు సుబ్రహ్మణ్యం  సృష్టించిన ఆహాస్యం గిలిగింతలు పెట్టేది మళ్ళీ ఇన్నేళ్లకు ,ఇన్నాళ్లకు చక్కని హాస్య రసాస్వాదన చేశాను . మీరూ చూడండి .మంచి హాస్యాన్ని ఆస్వాదించండి ,ప్రోత్సహించ0డి -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment