డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం)

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం)

‘’అక్షర సరస్వతిని కళామూర్తి ,రసస్వరూపిణిగా అవతరింపజేసిన ఆలంకారిక చక్రవర్తులు  ఆనంద వర్ధనుడు , అభినవగుప్తుడు కుంతలాచార్యుడు మొదలైనవారు.ఈ ఆలంకారిక సరస్వతి అభినయాత్మిక .అందుకే  కుంతలుడు ఆమెను ‘’లాస్య మందిర నర్తకి గా ,,సూక్తి పరిస్పంద గా  సుందరాభినయోజ్వల ‘’గా అభి వర్ణించాడు .కావ్యం ప్రత్యక్షంగా అనుభవించేది కనుక వార్తమానిక సత్యం లేకపోతే తన్మయీ భావం ఉండదు .కనుక కావ్య శబ్దమే అభినయాత్మకం .అదే వక్త్రోక్తి .అదే సూక్తి .అదే స్పందనం .కాశ్మీర శివాద్వైతం లో స్పందం శివుని శక్తిగా చెప్పింది .ఆమె చతుర్విధ వాక్య స్వరూపిణి .చతుర్విధ అభినయ మూర్తి .కావ్య శబ్దం అంటే అదే ‘’అంటారు మహా వ్యాఖ్యాత డా.శ్రీ తుమ్మపూడి కోటేశ్వర రావు గారు కావ్య విమర్శ చేస్తూ .’’కావ్యం లో వర్ణ నాదులు –  శబ్దం ,అలంకారం ,ఛందస్సు  .సన్ని వేశాల వలన అభినయాత్మకం అవుతోంది .భూతం లోని కథ వర్తమానమై ప్రత్యక్షమౌతోంది .ప్రతి +అక్షం =ప్రత్యక్షం –అంటే కనులకు ఎదురుగా నర్తిస్తోంది అని అర్ధం .ఆనాట్యత ను వక్రత,ద్వని మొదలైన విగా   వ్యాఖ్యానించారు .ధ్వనితార్ధం పాఠకునిమనసు లోనిది .వాచ్యార్ధం లోకం .లోకాను కృతి యైన కావ్యం  వర్ణనాదుల ద్వారా ధ్వనిత రమణీయం కాకపొతే సుందర అభినయోజ్వల కాదు .ఈ దృష్టి తోనే మొవ్వవారి రాయ విజయ ప్రబంధకావ్యాన్ని విశ్లేషణ చేసుకోవాలి ‘’అనీ అన్నారు .

కావ్యం వర్ణనాత్మకం.వర్ణనం అంటే లౌకిక వస్తువునకు శబ్దాదులు అనే రంగులద్వారా ,రేఖలద్వారా చిత్రించటం  ఈ వర్ణన మే ,రంగు రేఖలే లోకం నుంచి కళను వేరు చేసే సామగ్రి అంటారు తుమ్మపూడి .ఈ కావ్యం లో కథ వెయ్యేళ్ళ భారత దేశ చరిత్ర .గజనీ నుండి క్కృష్ణరాయలవరకు వ్యాపించిన కథా వస్తువు .మధునాపంతుల వారి ‘’ఆంద్ర పురాణం’’తర్వాత ఇంతటి బృహత్కథా కావ్యం రాలేదు .రాయలపై చాలాకావ్యాలు వచ్చినా ,అవి ఆయన చరిత్రకే పరిమితం .కాని ఇది ఆ వెయ్యేళ్ళలో భారత దేశం ,సంఘం ,రాజ్యాలు ,రాజులు –వారి స్థితిగతులు –పాలన అన్నిటిని గర్భీకరించుకోన్నకావ్యం అన్నారు ఆచార్యశ్రీ .మొదటి ఆశ్వాసం లో 50 వ పద్యం నుంచి దేశ భౌగోళిక పరిచయం ఉంది .ఆనె గొందే రాజుల పాలన క్రీ.శ.1150 గా చెప్పటం వలన చదువరిలో దేశ ,కాల మర్యాదల అవగాహన కలిగించారు కవి. ఆ నాటి వాతావరణం అర్ధం చేసుకుంటాడు .నగర  వర్ణ లలో సాంఘిక స్థితి బాగా వర్ణించారు .కావ్య ప్రారంభ ,అంతాలు ,ఆశ్వాసా౦తాలు  కావ్య శిల్పానికి పార్శ్వాలు .ఇవి చక్కగా కథ నొక్కబడి ఉండాలి .మాళవికాగ్ని మిత్రం లో కాళిదాస మహాకవి నాయిక వర్ణన అందమైన శ్లోకం లో చేస్తూ ఆమె నడుము ప్రక్క అందాలను చెబుతూ ‘’పార్శ్వే ప్రమృస్టే యివ’’అన్నాడు .మహా శిల్పి శిల్పానికి అంటే సుర సుందరీ మణుల పార్శ్వాలు మలచటం చూస్తే కాళిదాసు మాటలు జ్ఞాపకమొస్తాయి .కనుక కధ ను పార్శ్వములు ప్రారంభ అంతాలు గా మలచుకో గలిగితే కథన విద్య తెలిసినట్లే ‘’అని తీర్పు ఇచ్చారు .

కావ్యం లో వృక్ష గాభీర్యం ,లతా మార్దవం ఉండాలి .స్త్రీ ,పురుషులలో వారి సహజ లక్షణాలు ఉంటాయి .కాని పురుషకారం లో స్త్రీత్వం గర్భితంగా ఉంటాయి .అంటే ప్రతి వ్యక్తీ అర్ధ నారీశ్వరుడే . ఆధునిక స్త్రీత్వ మనో విజ్ఞాన వేత్తలు దీనినే‘’ANUMA-ANIMUS’’అంటారు ఇందులో స్త్రీత్వం హృదయ సంకేతం  .పురుషత్వం మనస్సంకేతం .ఇది అనుభవ స్థానం .ఇది ఆలోచనా కేంద్రం .దీనికే ఆలంకారికులు పురుష శైలి గా ,స్త్రీ మాధుర్యాన్ని సుకుమార శైలిగా చెప్పారు .పాశ్చాత్యులు -మాస్కులైన్ ,ఫెమినైన్ గా గుర్తించారు . ఇవే క్లాసికల్ లిటరరీ స్టైల్స్ అన్నారు ఆచార్యపాదులు .ఈ రెండు అంశాలూ ఉంటటే మహాకావ్యమే అన్నారు .పైన చెప్పిన పార్శ్వ ప్రమృస్టత కావ్యానికి స్త్రీత్వశోభ ను ఆపాదిస్తుంది(లిరిసిజం ) .అదే కనుక లేకపోతే మహాకావ్యాలు పఠన యోగ్యం కావు అని నిష్కర్షగా చెప్పారు .ఈ మహాకావ్యం లో ఎక్కడ చూసినా ఏదో ఒక సొగసు దర్శనమిస్తుంది .అది శాబ్దికం కావచ్చు ,అర్ధ సౌందర్యం కావచ్చు .అంటే శాబ్దికమో ఆర్ధికమో  కావచ్చు .

మనపూర్వ మహాకవుల కావ్యాలు మనకు ఆయుస్సు ,ఆరోగ్యం  ఇచ్చేవే అని మన నమ్మకం .నన్నయగారు ‘’ఆయురర్ధులకు దీర్ఘాయుర వాప్తి యుడువ ‘’అని ఊరికే అనలేదు .సరస్వతీ ఉపాసకులకు తెలుసు దీని సత్యం .పద్యకవులు అందునా మహా కావ్యకవులు అరుదౌతున్న ఈకాలం లో ఇంతటి బృహత్తర కావ్యం వ్రాసిన సాహితీ వాచస్పతి ,ఉపన్యాస చతురానన ‘’డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు ధన్యులు అన్నారు కోటేశ్వరార్య .’’ఈకావ్యం ఒక వైష్ణవ ధనుస్సు .వినగలిగితే దాని సి౦జాన ధ్వనుల్లో ప్రణవనాదమైన ఓంకారం వినిపిస్తుంది .అది ధర్మ ప్రబోధ ,దేశభక్తి ప్రబోధకంగా జగద్రక్షణ కారకం . ఈ కావ్యం ఆపని చేస్తుంది .కవి సూక్తులు అవధరించిన పాఠకులూ ధన్యులే ‘’అని ఈ కావ్యానికి రాసిన సమీక్షకు స్వస్తి పలికారు ఆచార్య డా శ్రీ తుమ్మపూడి కోటేశ్వరావు గారు .

సమాప్తం

ఆధారం –సాహితీ వాచస్పతి ,ఉపన్యాస చతురానన డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు రచించిన ’’శ్రీ కృష్ణ దేవ రాయవిజయ  ప్రబంధం ‘’లో ఆచార్య శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు గారు రాసిన సాధికార సమీక్ష .

మనవి –నేనేదో ఈ ప్రబంధం లోని విషయాలను మీకు తెలియబరచాలని ఉవ్విళ్ళూరి మొదలు పెట్టాను .కానీ తుమ్మపూడి వారి సమీక్ష రెండు మూడు సార్లు చదివి మనసుకు పట్టించుకున్నాక  ,ఇక నేను రాయవలసి౦దేమీ లేదని, అంతా విస్పష్టంగా వారే ప్రవచి౦చా రని అవగతమైంది .అందుకే వారి మాటలూ ,వాక్యాలే దాదాపు యధా తధంగా ,అంటే డు, ము,వు,లు చేర్చి తెలుగు మాటలు తయారు చేసినట్లు ఇందులో రాశాను . నాకు తెలియని ఎన్నో విషయాలు వారి సమీక్ష వలన తెలుసుకున్నాను . మీకూ వాటిని అందించాలనే ఆరాటమే ఈ రచన. మన్నించగలరు .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-18 –ఉయ్యూరు

 

 

 


 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7

తురక రాజులాక్రమించిన ప్రాంతాలలో వారి పైశాచిక పాలన ,చేసిన పాపాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు మొవ్వ  వృషాద్రిపతి  కవి గారు –

‘’పరమ పతివ్రతా తరుణీ మణీశీల –మహిమ తత్కామాగ్ని మాడిపోయె

మార్కొని నిలచిన మగవారి తలలెల్ల-గ్రామ శృంగార తోరణములయ్యె

మాతృమూర్తులకెల్ల మాఱట యగు నాల –పలలంబు రుచి యయ్యె బాలకంటె

శాస్త్ర సిద్ధాంత చర్చా గోష్టి శాలలు –కైతవ కేళి రంగమ్ములయ్యె

జుట్టుపై బన్ను ,కట్టిన బట్ట పన్ను –బొట్టుపై బన్ను ,మెడ తాళి బొట్టు పన్ను

కట్టకు౦డినచో దలకట్టు పన్ను –కనబడని జుట్టు పన్నును కట్టుటయ్యె’’.

దేశం ఆ పాలన లో యెంత అలమటిం చిందో పై పద్యమే సాక్ష్యం .గుండెలు అవసి పోఏ దీన  స్థితి అంటారు ఆచార్య తుమ్మపూడి .ఇక్కడే మన రాష్ట్రము లో 1945  – 47 కాలం లో రజాకార్ల దౌస్ట్యమూ  ఇలాగే ఉంది అనీ ,తమతాతగారు ఖమ్మం జిల్లా’’ గార్ల’’ లో సంపాదించుకొన్న ఆస్తి పాస్తులన్నీ ఉన్నపళాన వదిలేసి వచ్చి గుంటూరు జిల్లా ‘’ఈమని ‘’గ్రామం లోతలదాచుకున్నారని గుర్తు చేసుకొన్నారు .’’ఎట స్త్రీ నయనంబుల చిందు బాష్పముల్ ‘’అన్న నానుడి ఆనాటికే ఎంతగా ఆదర్శ౦ గా   ఉందో చెప్పారు.

బుక్క రాయల కాలం లో విజయనగర పాలనం ,విరూపాక్ష దేవుని పాద పద్మోపజీవి గా ,ప్రతినిధిగా సాగింది .అప్పుడు –

‘’ప్రతి పౌరుండును రాజ్య రక్షనమునన్ భాగస్ధుడై ,స్వీయ బా –ధ్యతగా బూనుడు,ఎవ్వడో మనల గాపాడంగ రాబోవడ

ర్హత ,శక్తిన్ మనమే సదా మనల రక్షించు కోనెంచి యు –ద్యతమై పోరిన ,సంశయింపక విరూపాక్షుండు తోడయ్యె డున్’’

ప్రతి పౌరుడు రాజ్య రక్షణలో భాగస్వామి అనటం ఈ నాటి వివేకానంద సూక్తి,సందేశాలను జ్ఞప్తికి తెస్తుంది అన్నారు ఆచార్యశ్రీ .

కృష్ణ దేవరాయల రాజనీతిలో ‘’ప్రజలు  శరీరం ,రాజు ఆత్మ.ఈ రెండూ అన్యోన్య ఆశ్రితాలు .’’రాజుకు సంతానం ప్రజలు .రాజ్యం అతని గృహం .ఇది ఉత్కృష్ట ఆచరణీయ ధర్మ సూత్రం .

రాయలు తన కావ్యం లో తురుష్కులు మరణించి స్వర్గానికి పోయి ,అక్కడ కూడా చేసిన దుష్క్రుత్యాలు వర్ణించాడు .ఈకవీ అలానే రాశాడు .రాయలు రాజనీతిగా ‘’పరరాజుల స్త్రీలను పుట్టింటి రూఢి నెరపుము’’అన్నాడు .ఇక్కడ కూడా కొడుక్కి రాజు అలానే బోధించాడు . ఇది రాజధర్మం.  నీతి కూడా కాదన్నారు తుమ్మపూడి .రాజ ధర్మాన్ని ప్రకృస్టంగా ఆచరించిన వాడు ధర్మరాజు .దీన్ని తిరగేస్తే వచ్చేదే రాజ ధర్మం అని గొప్ప వివరణ ఇచ్చారు .

హరిహర రాయలు రాజయ్యాక అతని ధర్మ శాసనం ప్రవచించిన పది పద్యాలు అతని రాజ్య పాలనా విధానానికి దర్పణంగా నిలిచాయి .ఇది చరిత్ర కావ్యం .శృంగారానికి  చోటు ఉండదు .కాని ఈ కవి చోటు కల్పించి ఉత్తమ సంతాన లబ్ధికి ఉత్తమ దాంపత్యం అవసరమని చెప్పాడు .సోరోకిన్ అనే సామాజిక విజ్ఞాన శాస్త్ర వేత్త ‘’ఇప్పుడు ఉత్తమ దాంపత్యం లోపించింది ,అందుకే అనుత్తమ సంతానం వలన విప్లవకారులు వస్తున్నారు ‘’అన్న విషయం జ్ఞాపకం చేశారు విమర్శకులు .

కృష్ణ రాయల జన్మ సందర్భంగా తండ్రి తన ముగ్గురు భార్యల వర్ణన చేశాడు .వారు దశరధుని భార్యలతో సమానం అన్నట్లు ఉంటుంది .కౌసల్యా సుప్రజా రామా లాగా నాగలాంబ కు కృష్ణ రాయలు జన్మించాడని భావం .నాగలాంబ వర్ణన ఆదికవి కౌసల్య వర్ణన పోలి ఉండటం విశేషం .కేవలం స్త్రీ వర్ణన కాదు .నాయకుడు నరసనాయకుడు –

‘’బాలే౦దూదయరేఖ వోలె ,మృదు లావణ్యంబు ధారాంబు ము –జ్మామాలా కైశ్యము ,పద్మ గంథిల వపుః సౌందర్యమున్ ,నేత్రయుక్

హేలా లోలవిలాస విభ్రమ కళా హేవాక సంపత్తి ,సు –శ్రీలం గ్రాలెడు నాగమాంబ ,నులసత్సీ మంతినీ రత్నమున్ ‘’

ఆమె ‘’రాజాన్తఃపుర హర్మ్య దీపకళికారాజిన్ ‘’వెలిగించేదట .అంతఃపురం లో దీపకళికా రాజి వెలుగుతుంటే ,రాకా చంద్రుడు వెన్నెల ఆరబోస్తుంటే నరసనాయకుల ,నాగమాంబ  ల సంయోగం జరిగిందట .ఇది శృంగార ఘట్టమే అయినా కవి సూచనమాత్రంగా వర్ణించిన రేఖా చిత్రం గా చూపించటం విశేషం అంటారు ఆచార్య శ్రీ .సంగమ విషయాన్ని వర్ణిస్తూ కవి ‘మణితధ్వనుల్ పొలిచె నస్పస్టంపు రమ్యంబులై ‘’అని వ్యంజనం చేసి వర్ణించటం సొగసైన తీరు .అంటారు .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-18 –ఉయ్యూరు

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు రాసిన కథ -సులోచన -జ్యోతి ఆదివారం స్పెషల్ -15-7-18

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘గరుడగమనం” లో కోటి మంది 

శృంగేరి  జగద్గురువులు శ్రీ భారతీ తీర్ధ స్వామి రచించిన ”గరుడ గమన తవ చరణ  కమల మిహ ”కృతి   యు ట్యూబ్ లో కోటి మందికి పైగా  వీక్షకులను అలరించి రికార్డ్ సృష్టించింది ‘శృంగేరి సిస్టర్స్ ,శ్రుతి రంజని, చి కోమలిఆశుతోష్ ,పీయూష్ బ్రదర్స్ , మొదలైన గాయకులు పాడిన విభిన్న వెర్షన్లు కోటి కి పైగా వ్యూలు సాధించటం అరుదైన విషయం రచించిన స్వామీజీ గారికి, గానంచేసిన గాయకులకు అభినందన శతం -దుర్గాప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1

ఆంజనేయ విజయం   అనే కసాపుర క్షేత్రమాహాత్మ్యం కావ్యాన్ని డా శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు రచించారు .దీనికి ఆశీర్వాద శ్రీముఖం అందజేశారు వారి గురువర్యులు ,కుర్తాళం సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములవారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ).స్వామి హనుమయే సాక్షాత్తూ తమకు ఈ కథను అనుగ్రహించారని కవి వాక్కు .తన అనుభవమూ ఇదేనని గురువుగారి తీర్పు . ఈ కథ రామాయణం తో  సంవది౦చబడి ఉండటం ఆశ్చర్యకరం అన్నారు మొవ్వ వారు .లోనికి వెడితే అభూతకల్పనగా ,మూఢ విశ్వాసంగా తోచవచ్చునని కాని ఇది నూటికి నూరు శాతం సత్యం సత్యం అని వక్కాణించారు కవి .21 ఖండాలతో  22 వది అయిన కసాపురాజనేయ శతకం తో ఈ కావ్యం వర్ధిల్లింది .ప్రతిఖండం లో వచనం లో ముందు కథ చెప్పి ,తర్వాత దాన్ని కవిత్వీకరించటం విశేషం  .చరిత్రే కావాలనుకున్నవారు ఆభాగాలను చదివి కవిత్వం జోలికి వెళ్లనక్కరలేదు .కవిత్వపు హాయి అనుభవి౦చాలనుకున్నవారికి చేతినిండా అమృతోపమాన మైన కవిత్వ విందే .శ్రీ కాకర్ల నాగేశ్వరయ్యగారు గారు మన బ్లాకు ను చదువుతూ ఉంటారు .వారు నిన్న కసాపుర ఆంజనేయ విశేషాలు వ్రాయమని కోరారు .’’దర్శనీయ ఆంజనేయ క్షేత్రాలు ‘’లో ఈ క్షేత్ర విశేషాలు ఇదివరకెప్పుడో రాసేశాను .ఇప్పుడు మొవ్వవారి కావ్య కధను సంక్షేపంగా ఖండాలవారీగా ఖండ శర్కర లా అందించే ప్రయత్నం చేస్తాను .

మనకు తెలిసిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి చరిత్ర

నెట్టి కంటి ఆంజనేయ స్వామిగా కసాపురం ఆంజనేయస్వామి ప్రసిద్ధులు .నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్ను కలవాడు .విజయనగర సామ్రాజ్యం లో కృష్ణ దేవరాయల గురువువ్యాసరాయలవారు 1521 లో హంపీ దగ్గర తుంగభద్రా నదిలో  లో స్నానం చేసి ,తాను వొంటికి పూసుకునే గంధం తో తనకు ఎదురుగా ఉన్న శిలమీద శ్రీఆంజనేయ స్వామి రూపం చిత్రించారు .అది నిజరూపం ధరించి నడవటం ప్రారంభించింది .ఇలా అయిదారు సార్లు ఆయన చిత్రం గీయటం అది నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది .చివరికి వ్యాసరాయలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామాల బీజాక్షరాల తో ఒక యంత్రం తయారు చేసి ,దానిలో స్వామి వారి నిజ రూపం చిత్రించారు .కదలలేదు .ఆ రోజు రాత్రి స్వామికలలో కన్పించి చిత్రాలు గీయటమే కాదు  తనకొక ఆలయం నిర్మించమని శ్రీ నెట్టికంటి ఆ౦జ నేయస్వామి  కోరారు .వ్యాసరాయలవారు ఆ ప్రాంతం లోనే అందరి సహాయ సహకారాలతో 732 ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేశారు .ఇదొక రికార్డ్ . .

ఒకసారి వారు’’ చిప్పగిరి ‘’అనే చోట శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం లో నిద్రిస్తుండగా  స్వామి కలలో కన్పించి తాను అతి చిన్నరూపం లో భూమిలో ఉన్నానని బయటికి తీసి ,ఆగమోక్తంగా ప్రతిస్టించమని కోరారు .తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవటం ఎలా అని ప్రశ్నిస్తే ,ఎండిన వేప చెట్టు దగ్గరకు వెడితే అది చిగురించిన చోట తానున్నాను అని చెప్పారట .మర్నాడు శిష్యగణం తో వెతుకులాట ప్రారంభించి ఒక ఎండిన వేప చెట్టు దగ్గరకు చేరగానే అది చివురించింది .అక్కడ భూమిలో త్రవ్వి చూస్తే  ఒంటికంటి ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది .దాన్ని బయటికి తీసి ఆగమ విధానంగా ప్రతిష్టించి దేవాలయం కట్టించారు వ్యాసరాయలు.   ఈ ఆలయం కసాపురం అనే గ్రామానికి దగ్గరగా ఉండటం తో కసాపురం ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు .నెట్టి కల్లులో  ఆవిర్భవించాడు కనుక నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తితో పిలుచుకొంటారు .ఒంటి కంటి తోనే భక్తులకు అనంత సుఖ సంతోషాలను ప్రసాదించే స్వామి .విగ్రహం తూర్పు ముఖంగా ,దక్షిణం వైపు చూస్తూ భక్తుల మొరలాలించేట్లుగా ఉండటం విశేషం .

కసాపురం అనంతపురం జిల్లా గుంతకల్లు కు అయిదు కిలోమీటర్ల దూరం లో, గుత్తి కి 35 కిలో మీటర్లలోనూ ఉంది .ఒక చర్మకారుడు ప్రతి ఏడాదీ ఒక ఏడాది పాటు ఏక భుక్తం ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ ,శ్రీ స్వామివారికి ఒక చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు .మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు ,చిరిగి పోయినట్లు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది .స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రి వేళ విహారం చేస్తారని భక్తుల గాఢ విశ్వాసం. ప్రతి వైశాఖ ,శ్రావణ ,కార్తీక ,మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు సందర్శించి తరిస్తారు .చైత్ర పౌర్ణమినాడు హనుమజ్జయంతి వైభవంగా జరుపుతారు .ఒంటికన్ను హనుమ సకల వర ప్రదాయి .భక్తుల పాలిటి కొంగుబంగారం కసాపుర ఆంజనేయ స్వామి .

రేపటి  నుంచి వృషాద్రి పతిగారు రచించిన  కసాపుర  క్షేత్ర మాహాత్మ్యం లోని విశేషాలను గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి

శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి

తండ్రి గారి ఇంటిపేరు తుమ్మలపల్లి .తుమ్మలపల్లి వారిలో కవులు రచయితలూ ,చరిత్ర ,రాజకీయ ,వాణిజ్య ,కళా ,సాంస్కృతిక రంగాలలో లబ్ధ ప్రతి స్టులు. అందులో శ్రీ తుమ్మలపల్లి రామ లింగేశ్వరరావు ముఖ్యంగా పేర్కొన దగిన మహారచయిత ఆధ్యాత్మిక విషయ వివేకి .శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు పుష్కలంగా పొందినవారు .మామగారి ఇంటిపేరు రాజనాల .అందరికీ సుపరిచితులు ,మహా కధకులు ,భారతీయ సాహిత్య పరిషత్ పూర్వాధ్యలు  విమర్శకులు ,బుద్ధి జీవి ,ఆర్ .ఎస్ .ఎస్ .తో మమేకమైన,స్వీయ వ్యక్తిత్వం తో భాసించే  బందరు హిందూ హై స్కూల్ లోప్రముఖ గణిత ఉపాధ్యాయులు,  జాగృతి వారపత్రిక నిర్వహణలో సింహ భాగమైనవారు   ,తెలుగు చలన చిత్రాలపై హాస్యం అ౦తర్లీనంగా అద్భుత సమీక్షలు రాసినవారు, అందరి చేతా ఆర్ .ఎస్ .కే . గా పిలువబడిన స్వర్గీయ శ్రీ రాజనాల శివరామ కృష్ణ మూర్తి గారు .రెండు వైపులా ఉన్న సాహిత్య  సంబంధం తో  శ్రీవాణీ సమార్చనలో  దూసుకు పోతున్న వారు డా.శ్రీమతి వాణీ కుమారి గారు .

కృష్ణా జిల్లా అడ్డాడ దగ్గరున్న ఐనంపూడి మాతామహస్థానం .గుడివాడలో తండ్రి గారింట పెరిగి ,శ్రీ రాజనాల వెంకటరమణ గారిని వివాహం చేసుకొని ,అక్కడే మాంటిస్సొరి హైస్కూల్ లో ఉపాధ్యాయినిగా పనిచేసి ,ప్రస్తుతం  హైదరాబాద్ విద్యానగర్ లో  దంపతులు ఉంటున్నారు . ఆయన హైదరాబాద్ బాటరీస్ లో ఉన్నతాధికారి . ఉద్యోగానికి స్వస్తి చెప్పి ,సాహిత్యానికి పాదు చేసి ,రచనా నీరంతో పెంచి పోషిస్తున్న విదుషీమణి శ్రీమతి వాణీకుమారి .ధన్యజీవి .పుట్టింటి, అత్తింటి వ్యాసంగమైన సారస్వతాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్నారు .స్వర్గీయ డా.జి వి. .ఎస్ .సుబ్రహ్మణ్యం గారు మొదలైన సాహితీ  భీష్ములతో మంచి పరిచయమున్నవారు . చారిత్రిక నవలా చక్రవర్తి డా.ముదిగొండ శివప్రసాద్ ,డా కసిరెడ్డి వెంకట రెడ్డి వంటి సరస్వతీ మూర్తులు ఈమెకు ఆరాధ్యులు .హైదరాబాద్ లోని సాహిత్య పరిషత్ లో క్రియా శీలి .మంచి వక్త ,కవి అవటం తో సభలలో రేడియోలో వందలాది ప్రసంగాలు చేసినవారు .  అవధానాలలో పృచ్ఛకులుగా తమ సమర్ధత చాటుకున్నవారు . భర్తగారి ప్రోద్బలం తోడ్పాటు ఆమెకు శ్రీరామ ‘’సారీ’’ శ్రీరమణ రక్ష. దిల్ షుక్ నగర్  లో ఉంటున్న మాజీ ప్రిన్సిపాల్ శ్రీ పోతుకూచి విజయ గోపాల్ దంపతులు వీరి కుటుంబ మిత్రులు .కలిసి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు .పోతుకూచి దంపతులు ఆమ్మాయి శ్రీ మతి పద్మశ్రీ దగ్గరకు అమెరికా వెళ్ళినా ,నిత్యం వాణీ గారితో మాట్లాడనిది నిద్రపోరట . ఇంతకీ ఈ పద్మశ్రీయే అమెరికా లో నార్త్ కారోలీనా రాష్ట్రం షార్లెట్ లో ఉంటున్నమా మనవళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లకు అంటే  మా అమ్మాయి శ్రీ మతి కోమలి విజయ లక్ష్మి అల్లుడు  శ్రీ సా౦బావధాని దంపతుల కుమారులకు సంగీతః౦ నేర్పే టీచర్ .మా పెద్దమనవడు చి శ్రీకేత్ ఉపనయనం  మాఅమ్మాయి వాళ్ళు అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్ లో ఏప్రిల్ 2 న చేసినపుడు పోతుకూచి వారు పరిచయమయ్యారు . ఈల శివప్రసాద్ ,శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గార్లతో పాటు ఈ దంపతులకు సన్మానం  చేసి నగదు బహుమతి నంది౦చా౦ . అప్పటి నుంచి ఇప్పటిదాకా మామధ్య గప్చీప్ సాంబారు బుడ్డి . అంటే పలకరింపులు లేవు ..

వర్తమానానికి వస్తే ఈనెల 3 వ తేదీ మధ్యాహ్నం నాకు ఒక ఫోన్ వచ్చి ఆగి పోయింది .ఎవరో తెలీని వారు . అరగంట తర్వాత ఆ నంబర్ కు నేనే ఫోన్ చేశాను .అప్పుడు అవతలి గొంతు తాను వాణీ కుమారినని ,ఆర్ ఎస్కే గారి రెండవ కోడలినని ,గుడివాడ మాంటిస్సొరిలో పని చేశానని , అడ్డాడ దగ్గర ఐనంపూడి తన అమ్మమ్మ గారి ఊరు అనీ ,చిన్నతనం అక్కడే గడిచిందని ,28వ తేదీ గుడివాడ మాంటిస్సొరి పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి వస్తున్నానని ,అప్పడు ఉయ్యూరు రావచ్చా అనీ అడిగింది .తప్పని సరిగా రమ్మని ఆహ్వానించా .సరసభారతి బ్లాగ్ ను నిత్యం చదువుతానంటూ , ,పోతుకూచి వారితో అనుబంధమూ చెప్పింది .నేను ఆమెతో 5 వ తేదీ బయల్దేరి  హైదరాబాద్ వస్తున్నాననీ ,8 ఉదయం నల్లకుంట వస్తాననీ చెప్పగా తమ ఇంటికి రమ్మని కోరింది .సరే అన్నా .అలాగే 8 ఆదివారం వాళ్ల ఇంటికి నేనూ మా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు సమత వెళ్ళగా ఆత్మీయంగా ఆహ్వానించారు రమణ దంపతులు .’’షార్లెట్ సాహితీమైత్రీ బంధం ‘’వారికి కానుకగాఇచ్చాను . నాకు వాణీకుమారి రచించిన 1-తెలుగు చారిత్రిక కావ్యాలలో సాంస్కృతిక మూల్యాలు అనే ఆమె రిసెర్చ్ గ్రంధం 2- సాహిత్య సౌజన్యం ౩-వాల్మీకి వ్యాసులు తీర్చి దిద్దిన రామకధ 4-ఊరు కొత్తబడిందిఅనే నాస్టాల్జియా ఇచ్చారు .ఆర్ ఎస్ కే గారితో నా అనుబంధం ఆయనతో కలిసి రాజమండ్రి సభలకు వెళ్ళటం కొల్లూరి ఎన్నికల ప్రచారం నిర్వహించటం  అంతా మాట్లాడుకున్నాం .మా మేనల్లుల్లు అశోక్ ,శాస్త్రి ,మా అన్నయ్యగారబ్బాయి రామనాథ్ లతో రమణ కున్న అనుబంధం చెప్పారు .స్వర్గీయ కాంతారావు గారితో సాహితీ మైత్రిని, కొల్లూరి కోటేశ్వరరావు గారితో మాకున్న స్నేహాన్నీ ,ఆయనకూ కాంతారావు కు ఉన్న గాఢ మిత్రత్వాన్ని ,ఆర్ ఎస్ కే గారితో మా అందరికీ ఉన్న స్నేహ పరిమళాలను జ్ఞాపకం చేసుకొని ,అక్కడే పవిత్రంగా భద్రంగా ఉంచిన మూర్తి గారి చిత్ర పటానికి నమస్కరించి ఫోటో తీసుకున్నాం .మిగిలిన వివరాలు 8వ తేదీ ‘’సాహిత్యాదివారం ‘’లో రాసేశాను . గీర్వాణా౦ధ్ర ,ఆంగ్ల సాహిత్య కృషీ ,పోషణ బాధ్యతగా నిర్వహిస్తున్న శ్రీమతి వాణీ కుమారి అంతకంటే గొప్ప బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించటం ప్రశంసనీయం .

గాజు బొమ్మ

శ్రీ రమణ వాణీ దంపతులకు ఒకకుమారుడు చి రవికిరణ్ ,కుమార్తె ఉన్నారు .అమ్మాయి చదువు పూర్తి  చేసి వివాహం చేసుకొని అమెరికా లోని మేరీ లాండ్ లో ఉంటోంది .రవి వయసు 30 .అతనికి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు యాక్సి డెంట్ జరిగి హెడ్ ఇంజరి అయి ,మూడు నెలలు కోమాలోనే ఉండిపోయాడు .అప్పటికి ఇంతటి ఆధునిక వైద్యం అందుబాటు లోకి రాలేదు .ఫలితం గా అతను మాట్లాడలేడు.అన్ని శబ్దాలూ పలుకుతాడు కానీ వాటి ధ్వని మనకు వినిపించదు . ఒక రకంగా ధ్వని లేని మాట గా వస్తుంది .దీన్ని పశ్యన్తి వాక్కు అనవచ్చు నేమో ? మంచి అందగాడు రవి కిరణ్ .నిరంతరం చిరునవ్వుతో ఉండటం అతని ప్రత్యేకత .అదే అతని వైపుకు మనల్ని ఆకర్షిస్తుంది .వీల్ చైర్ కే పరిమితమవటం బాధాకరం.వీల్ చైర్ లో ఉన్న’’గుబురుమీసాల యవ్వన  కమల్ హసన్’’ అనిపిస్తాడు . స్వాతి ముత్యం లా భాసిస్తాడు .మాట్లాడలేడుకాని అతనికి తెలియని విషయం లేదు .మనం మాట్లాడింది చక్కగా అర్ధం చేసుకొని దానికి తనదైన శైలిలో సమాధానమిస్తాడు .వాళ్ల అమ్మగారు దాని భావం మనకు స్పస్టపరుస్తారు .మన వైఖరీ ప్రవర్తన పసిగట్టి అభిప్రాయం ఏర్పరచుకొంటాడు .మనలో ఉన్న క్వాలిటీని గుర్తించి దాన్ని బహిర్గతం చేస్తాడు .వీటితో పాటు అతనికి మంచి జ్ఞాపక శక్తి ఉంది. తెలుగులో కవిత్వం రాస్తాడు .అతని కవితలను తలిదండ్రులు ముచ్చటపడి ముద్రించి అందరికీ  అందజేశారు .వాటి డిమాండ్ ఎలాంటిది అంటే ఇప్పుడు వారిదగ్గర ఒకే ఒక్క కాపీ ఉంది .కంప్యూటర్ పై కాలం గడుపుతాడు .తెలుగూ ఇంగ్లీష్ లలో దానిలో రాస్తాడు .నా సంభాషణా ధోరణి గ్రహించి ,నాకు గొప్ప జ్ఞాపక శక్తి ఉంది అని తనభాషలోనూ, సౌ౦జ్ఞలతోనూ చెప్పాడు. దాని భావాన్ని అడిగితె వాణీ గారు చెప్పారు.అతని కుడి చేతిమీద ముద్దు పెట్టుకొని నా అభినందన తెలియజేశాను .తలిదండ్రులు అమెరికా వెళ్ళేటప్పుడు రవినీ తమతో తెసుకు వెడతారు .వాళ్లమ్మాయి  అక్కడ వీలున్నప్పుడల్లా అతన్ని కారులో తిప్పి అన్నీ చూపిస్తుందట .అందమైన ‘’గాజు బొమ్మ ‘’లా ఉన్న రవి కిరణ్ ను అంతే జాగ్రత్తగా ,పదిలంగా  ప్రేమ ఆప్యాయతా రంగరించి బాధ్యతగా రమణ ,వాణీ దంపతులు  సాకుతున్నారు .వారికి శతాధిక అభినందనలు . .

వాణీ కుమారి గారి రిసెర్చ్ బ్రెయిన్ యెంత విశిస్టమైనదో ‘’ చారిత్రకకావ్యాల లో సాంస్కృతిక మూల్యాలు’’బాగా విశదీకరిస్తుంది .ఆమె పరిశీలనా, పరిశోధనా ఫలితమే ఇది. దీనికే డాక్టరేట్ అందుకొన్నారు .ఒకరకంగా అది ఆమె’’ ప్రతిభా సర్వస్వం’’.సాహిత్య సౌజన్యం లో ఆమె తుమ్మలపల్లి కవుల పై రాసిన వ్యాసం వారిపై ఆరాధనా ,వారి కృషికి ప్రతిఫలం .విశ్వనాథ రామాయణం లో శూర్పణఖ మూర్తి మత్వాన్ని దర్శించిన సౌజన్య శీలి ఆమె .వాల్మీకి స్త్రీ మూర్తులను, భారతం లో  జాతి ధర్మం వంటి 21 వశిష్ట వ్యాస గుచ్చం ఇది .రామకథ ను వాల్మీకి వ్యాసర్షులు ఎలా తీర్చి దిద్దారో తులనాత్మక పరిశీలన చేసి రాసిన గ్రంథం ఆమె వాజ్మయ పరిచయానికి అద్దం పట్టేది గా ఉంది .ఆమెకున్న గాఢ సంస్కృత పరిచయమూ ,అభిజ్ఞత  ,లోతులు తరచే విశిష్టత కు ఆశ్చర్యపడుతాం .వాణీ కుమారికి తనబాల్యం గడిపిన ఐనంపూడి అంటే మహా మోజు .అక్కడికి వెళ్ళిన ప్రతిసారీ ఆమెలో పాతజ్ఞాపకాలు గుఫ్ఫుమని గుబాళిస్తాయి  అప్పుడు తనకు ఆ ఊరు కొత్తదిగా అనిపిస్తుంది .అందుకే’’ఐనంపూడి ఊసులను  ‘’ఊరు కొత్తబడింది ‘’గా అక్షరబద్ధం చేసి ప్రచురించారు.ఎవరి చూపు వారిది .ఆ చూపులో లో చూపూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత .ఒక మంచి సహృదయ శీలి అయిన రచయిత్రి ,నాకు ఆరాధనీయులు ఆర్ ఎస్కే మూర్తిగారి కోడలుగా ,వారబ్బాయి వెంకటరమణ గారి ఇల్లాలుగా శ్రీమతి వాణీ కుమారి పరిచయమవటం ఆనందంగా ఉంది .శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి మరిన్ని సాహితీ కుసుమాలను సృష్టించి అలంకరించాలని కోరుకుంటున్నాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

‘’

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Attachments area

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార

శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు  గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ,పులిచి౦తలప్రాజేక్ట్ స్పెషల్ ఆఫీసర్ . ఉద్యోగరీత్యా జిల్లా అధికారి అయినా  ప్రవ్రుత్తి  రీత్యా కవి, విమర్శకులు .సాహిత్యోపజీవి .1959 మే డేనాడు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం గన్నవరం లో శ్రీ హనుమంతరావు ,శ్రీమతి నాగరత్నమ్మదంపతులకు జన్మించారు .పూనూరులో సెకండరీ విద్య ,చిలకలూరి పేటలో ఉన్నత విద్యా నేర్చారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ప్రైవేట్ గా ఎం .కాం .అందుకున్నారు . ఆంద్ర జ్యోతి దినపత్రిక లో ఉపసంపాదకులుగా చేరి ,గ్రూప్ 2 పరీక్ష పాసై ,ఎం .ఆర్. వో .అయి ,గుడివాడ ఆర్ డి వో గా పదోన్నతి పొంది ప్రస్తుతం పులిచి౦తలప్రాజేక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు .

శ్రీమతి విజయలక్ష్మి ని వివాహమాడి  శ్రీ వశిష్ట ,శ్రీ విశ్వనాథవిరించి లకు జన్మనిచ్చారు .

సోమేపల్లి స్వీయకవిత్వం -1 లోయలోమనిషి మినీ కవితాసంకలనం ,2-తొలకరి చినుకులు –నానీలు ౩-చల్లకవ్వం వచన కవితా సంకలనం 4-రెప్పల చప్పుడు –నానీలు 5-తదేక గీతం –వచన కవితా సంకలనం 6-పచ్చని వెన్నెల –నానీలు రాసి ప్రచురించి ఇప్పుడు 7 వ పుస్తకంగా ‘’మట్టి పొరల్లోంచి ‘’వచన కవితా సంపుటి వెలువరించారు .తమ పేరిట ‘’సోమేపల్లి కథా పురస్కారం ‘’ఏర్పరచి  ,ఆ కథలను 2012 ,20 17 లో  పుస్తకాల  రూపం గా తెచ్చారు .గుంటూరు జిల్లా రచయితల సంఘం ఏర్పరచి అవిరళ కృషితో దాన్ని వ్యాప్తి చేసి అందరి ఏకగ్రీవ అంగీకారం తో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులయ్యారు .అవిశ్రాంత కృషి ,పట్టుదల,  నిర్భీతి ,సరైన ఆలోచన,అవగాహన ,అంకితభావం   వీరి విజయాలకు కారణాలు .

‘’విశిష్ట నానీ ‘’ల కవిగా సోమేపల్లి గుర్తింపుపొందారు. సృజనలో ఆయనది ప్రత్యేక  గొంతు. .వాస్తవికత, స్వభావోక్తి ఆయన కవిత్వ లక్షణాలు .ఆర్తి ,భావుకత ,ఆవేశాలతో లోపలి ,బయటి లోకాలను కలిపే నేర్పు ఆయన ప్రత్యేకత .అచ్చమైన స్వచ్చమైన రైతుబిడ్డ కనుక ఆయనకవిత్వం మట్టిలోంచి అంటే గుండె లోతుల్లోంచి వెలువడుతుంది ‘’అని ‘’నానీల నాయన’’గోపీ కితాబిచ్చారు .ఈ సంపుటిని సాహితీ పోషకులు ,గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు కు అంకితమిచ్చి సాహితీ సౌజన్యం ప్రకటించారు .

కవికి ఉండాల్సిన అంతర్ దర్శనాన్ని గుర్తించి దాన్ని తన కవితలో పొదిగి ‘’నేను నిత్యం నాలోకి ప్రవ హిస్తుంటాను .నిశితంగా పరామర్శించుకుంటాను ‘’అంటూ మానవీయ పలకరింపులు –మనో పేటికలో –జ్ఞాప పకాల దొంతరలై –పరిమళిస్తుంటాయి ‘’ ‘’అన్నారు ‘’నాలో నేను ‘’లో .ఇది అందరికీ అబ్బాల్సిన ముఖ్య లక్షణం .శతాబ్దాల ప్రయాణం లో  శరీరపు  వన్నె తగ్గినా –మనో శ్వాస కొత్తచిగురై పల్ల విస్తూనే ఉంది –మనసెప్పుడూ మానవీయపు మల్లెల చెండే’’అని మనో  సౌందర్యాన్నీ  దాని స్వచ్చతను పరిమళాన్నీ ఆస్వాదించమని కోరారు .రైతు బిడ్డకనుక , రైతే దేశానికి వెన్నెముక కనకా ,వాళ్లకస్టసుఖాలు ఎరిగున్న అధికారీ అవటం వలన ‘’రైతు నిఘంటువు లో –అన్నీ ఉన్నాయి కానీ –పేగు నింపే –గిట్టుబాటు ధరతప్ప ‘’అని అనగలిగారు ‘’వెన్నెముక గోడు ‘’లో .ఇప్పటి కల్చర్ లో ‘’అక్షరాల ఆచూకీ గగన కుసుమమై –అచ్చం –అంకెలే మిగులుతాయేమో నని ‘’కించిత్ భయ్యా పడ్డారు ‘’అంకెలు ‘’లో .మాటల బేహారి –‘’అన్నదాతకీ –వాణిజ్య విహారికీ మధ్య –రాయ ‘’భార ‘’మౌతుంటాడు అంటూ, అతన్ని మోసే భారం తో రైతు క్రుంగి కృశించి పోతున్నాడని అర్ధవంతంగా చెప్పారు .’’వాడు అనుసందాత కాదు –అన్నదాత అడుగుల్ని –శాసించే విధాత మురిగ్గా చెప్పాలంటే రంకు మొగుడు ‘’అయ్యాడని బాధ పడ్డారు .

‘’సుడి గుండం ‘’చుట్టూ నిత్య బతుకు పోరు చేసే వలల మనుసులు సంద్రం లోకి  వేట కెడితే వాళ్ల బతుకు ఎగిసిపడే అలలకు – ఎదు రోడ్డే ఆశల వేట’’అవుతుందనీ ,’’పండుగోప్పా సందువా పడితే –‘’ఆ రోజు పండగే పండగని ,ఆశల వల విసిరి వాళ్ళు ఆశగా చూస్తుంటే ,వాళ్ళపై ఆధార పడ్డ –బుడతలు తీరం ‘’వెం’’ బడి’’ ఉప్పూ కారం తో సిద్ధమై అ౦గ లారుస్తుంటారు ‘’అని నాచురల్ సీన్ మనముందు ఆవిష్కరిస్తారు .వెం’’బడి ‘’మాటలో అదే వాళ్ల బడి ,గుడిఅని అన్యాపదేశంగా చెప్పారు .అలజీవులు కస్టాల సునామీ  తట్టుకు నిలబడుతారు,వృద్ధాప్యం వలలలో చిక్కుకున్నా .వాళ్ల జీవన నౌకమాత్రం చిక్కుల సుడి గుండం చుట్టూ పల్టీలు కొడుతూనే ఉంటుంది ‘’అని వాళ్ల జీవన భాష్యం చెప్పారు .పిల్లలను పసివాళ్ళు అంటాం .వాళ్ళు కవి గారికి ‘’పసిడి ప్రపంచం ‘’గా కనిపించారు .ఆ భావుకత అట్టిది .’’తనపల్లె ఇప్పుడు –వృద్ధ జనాశ్రయం ,నిస్తేజపు నిలయం ‘’గా ఆయనకు దర్శనమిచ్చింది .’’మూడుకాళ్ళతో అత్తపత్తి లా –అడుగులేస్తూ –జవం జీవం పోసే వాళ్ళకోసం –పొలిమేరల్లో –ఆబగా ఎదురు చూస్తూ –కళతప్పి జీవచ్చవంళా సోమ్మసిల్లింది’’ట .అయినా కవి గుండెల్లో చిన్నప్పటి పల్లె చిత్రం ఛిద్రం కాని చిత్రం గా   భద్రంగా నిక్షిప్తమై ఉంది . ‘’జిందగీ అంటే ఏం లేదు భాయ్ –కాష్ అండ్ కారీ –యూజ్ అండ్ త్రో ‘’అని తేలికైన ఈ నాటి నిజాన్ని మూడే మూడు ముక్కల్లో చెప్పిన కవి ‘.’’డాలర్ యవనిక ‘’లో ‘’హార్దిక దీపం –ఆరిపోతోందన్న భయం లేదు ‘’అని ఆవేదన చెంది  మనుషులబుర్రలో –అస్సలు ఖాళీ లేదు –నిండా ఆర్ధిక గణాంకాలే ‘’అని నిట్టూర్చారు నేటి విలువలుడిగిన మనుష్యులను చూసి .

‘ఋణం చిన్నదైనా పెద్దదైనా  ‘’మహావ్రణ మై ‘’బతుకు ను కాల్చి వేస్తుంది ‘’చిటికెడు ఋణం –చేటంత బతుకుని –చక్రవడ్డీ బంధం లో చిరిగేస్తుంది అంటూ ‘’సూక్ష్మ ఋణం రంగుల భ్రమ అనీ ,కసాయి కళ అనీ ,ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టకపోతే –మరణమే దాని వెల అని ’’’’దా’’రుణో’’పనిషత్’’ సెలవిచ్చారు వెంకట సుబ్బయ్యగారు .’’అవయవ దానం చేసే వారందరూ త్యాగానికి ప్రతీకలే ,చిరంజీవులే’’అని శ్లాఘించి సాల్యూట్ చేశారు .తనలో పొంగెడి రక్త కాసారం మాత్రమే కాదని ,స్వేదసముద్రం కూడా నని ‘’’’శ్రమ నా వారసత్వం-శ్రమ నా ఆదర్శం –శ్రమే జీవన సౌందర్యం ‘’అంటూ తన ‘’దృక్పధం ‘’ తెలియజేశారు. ‘’పాదు –నీడ’’కవిత లో మంచి కవిత్వం ప్రవహించి సశ్యశ్యామలం చేసిందని నాకనిపించింది-

‘’మట్టిదీ చెట్టుదీ-చెట్టుదీ చినుకుదీ –చినుకుదీ చేనుదీ  -చేనుదీ మనిషిదీ-గొప్ప హరితాను బంధం ‘’అన్నారు .ఎడం ఎడం గా నాటిన మొక్కలు కూడా ఏపుగా పెరిగి వృక్షాలై కొమ్మలై రెమ్మలై కౌగలించుకొంటాయి.’’మరి మనిషికే౦ రోగమొచ్చింది ఆప్యాయంగా మెలగలేక పోవటానికి?.చివరి పంక్తుల్లో కవితను చిరంజీవి చేసే మహా లక్షణం ఉంది చూడండి –‘’ఇంటికి బదులు –ఇంద్ర భవనమిచ్చినా –చెట్లపాదులే –మనల్ని చిరంజీవులను చేసేది ‘’అని వృక్షనీతి బోధించారు .గిజిగాళ్ళు ,పిచ్చుకలు ,బుల్లి పిట్ట కవి కి బుల్లి ఇంజనీర్లుగా కనిపించారు ఇప్పుడు  శబ్ద కాలుష్యానికి ,  సెల్ ఫోన్  టవర్లకు అవి జనారణ్యం లోకి రాలేక కనుమరుగయ్యాయి .వాటి గూడు నిర్మాణం మహాద్భుతం .వాటి’’ సవసవల’’ సవ్వడి ,కంకుల చుట్టూ మూగే రెక్కల ‘’రెపరెపలు ‘’వినిపించటం లేదని పిట్టలభాషలో  బాధ పడ్డారు కవి. ‘’రేడియేషన్ కిరణాలు –పిట్టల గుండెల్లో –తుపాకీ తూటాలైపేలుతున్నాయని’’మననవనాగరక నాగరకతను చేరిగిపారేశారు.

‘’ఉట్టి’’పై కవిత్వం రాసిన వారెవరూ నాకు కనిపించలేదు .ఆ పని ఈకవి చేశారు –‘’ఐదారు తాళ్ళతో కుండ బరువును మోసే ఉట్టి ‘’ఆయనకు ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది .గొప్పమాట .మనిషికి అందకుండా వేలాడే ఉట్టి-ప్రేమాభిమానాలకు ఎప్పుడూ ప్రతీకే ‘’అనటం బాగుంది .ఇప్పటి మనిషి –‘’వావి వరసలు మరచిన –సంచార మృగం ‘’.దాని పంజా దెబ్బకు బలై పోతున్న జనం ను చూసి ఒక సూచన చేశారు –‘’మనిషిని వెతకాలి –బయట కాదు –మనిషిలోనే వెతకాలి ‘’.ఉప్పు మడులు చేసేవారి బతుకూ దీనమై ‘’నీటి ఉప్పుదనం పై –చెమట చేవ్రాలు చేసి -కొఠారుల్లో –కొలువు దీరుతుంది ‘’అని ఆ ఉప్పు అందరకూ రుచినిస్తే వారికి మాత్రం ‘’చప్పిడి బతుకు ‘’నిచ్చిందని వాపోయారు కవి .ఇక్కడా దళారీల దాస్టీకమే  రాజ్యమేలు తోంది .’’ఉప్పు మడికి-బతుకు బడికి –దళారులే –అనుసంధానం  ‘’అయి  వాళ్ల బతుకులు ఉప్పులేని చప్పిడి బతుకులయ్యాయన్నారు .’’గుండె తడి ‘’తో నేటి కాన్వెంట్ పిల్లల జీవితం వర్ణించారు –‘’ఆటా పాటా కంప్యూటర్ తోనే- టకటకలాడిస్తూ బూట్లూ –ఖరీదైన యూనిఫాం –కళ్ళకి ఓ జోడూ ప్రత్యక్షం ‘’బహుశా ముందు తరాలలో పసిపిల్లలు  కళ్ళ జోడుతోనే పుడతారేమో ?అందుకే ‘’ఈచదువులకు హృదయపు తడి కావాలి –ఈ ఆరాటానికి –వినయమూ విధేయతా –జతకలవాలి ‘’అని మానవీయ కోణం లో చెప్పారు .దేనిలోనైనా శిఖరారోహణం  చేసిన వ్యక్తి అక్కడ ‘’మానవత్వపు పతాక ప్రతిష్టించి –జేగ౦టలు మోగించాలి ‘’అని ఆశిస్తున్నారు .ఇప్పుడు మానవాళి జపించాల్సినమంత్రం ‘’జలం జలం జలం’’అంటారు దాని అవసరం స్వచ్చతా దృష్టిలో పెట్టుకొని. అందుకే ‘’జలో రక్షతి  రక్షితః ‘’అంటూ మరో గీతం లోనూ నినదించారు .ఉపేక్షిస్తే ఇక ‘’ఆక్సిజన్ బాటిల్స్’’ కూడా కొనాల్సి వస్తుంది ‘’అని ముందు హెచ్చరిక జారీ చేశారు కవి .’’నాన్నగారి ‘’లింకుల కర్ర ‘’కు దణ్ణం పెట్టారు కవితలో .అది చేతిలో ఉంటె తనతండ్రి దండధారీ ,న్యాయమూర్తి గా భాసి౦చేవారట .’’ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా –ఊరు గుండెలో పచ్చనిజ్ఞాపకం –రామయ్య పంతులు గుడి’’ఆ సరస్వతీ నిలయానికీ ,అక్కడి సరస్వతీ స్వరూపమైన రామయ్య మాష్టారు గారికీ మొక్కిడి-‘’ఆబడి చరిత్ర –నిరంతర చైతన్య దృశ్యకావ్యం ‘’గా అభి వర్ణించారు శిష్యుడు వెంకటసుబ్బయ్యగారు .ఇప్పటిపల్లె ఆయనకు –‘’శోభ కోల్పోయిన పడుచు –బతుకు పరిమళాలు లుప్తమైపోతున్న అడుసు ‘’గా కనిపించింది .వెదురు తో వేయి రకాల పరికరాలు చేసేవారు ఆనాడు .విసనకర్ర, బుట్ట, చేట జల్లెడ నిచ్చెన వంటి అల్లికలతో జీవితాలు శోభిల్లాయి అప్పుడుశ్రమజీవన సౌన్దర్యాలై .ప్రపంచమంతా మాట్లాడేది ‘’ద్రవ్య భాష ‘’మాత్రమె నని ఆవేదన చెందారుకవి ప్రపంచమార్కేట్ లోమనిషి అమ్మకపు  సరుకు అయిపోయాడని వ్యధ చెందారు .’’జీవితం ఒక సుదీర్ఘ కావ్యం ‘’అన్నారు సోమేపల్లి .జీవితానికి విశ్రాంతి వద్దు విరామమే ముద్దు ‘’అని 25 వ చివరి కవితతో  సంకలనానికి  స్వస్తిపలికారు వెంకటసుబ్బయ్యగారు .

ప్రతి కవితలో ఆలోచనా ,ఆవేదనా, కృతజ్ఞత ,భక్తీ,సామాజికస్పూర్తి ,వివేచనా ,తెలుగుభాషపై అభిమానం ప్రస్పుటంగా కనిపించి మనలో చైతన్యం కలిగిస్తాయి అందరూ చదివి ఆనందించాల్సిన కవితా సంకలనం సోమేపల్లివారి ‘’మట్టి పొరల్లోంచి –‘’ .

భూమి పొరలు చీల్చుకొని పైకి వచ్చి ,రెమ్మా ఆకులతో ప్రకృతికే సౌందర్యం అద్ది , లోపలి కవితలకు అర్ధవంతమైన భావనగా తీర్చి దిద్దబడిన ముఖ చిత్రం ఈ కవితా సంకలనానికే మకుటాయమానంగా ఉండటం మరో ప్రత్యేకత .

మనవి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు పంపిన ఈ సంకలనం ఈ ఉదయమే నాకు చేరింది .వెంటనే చదివేశాను .కాదు కాదు చదివించింది .అందుకే ఈ స్పందన .

మీ- దుర్గాప్రసాద్ -11-7-18 –ఉయ్యూరు

 

 

 

‘’

 

 

 

 

 

 

 

 



 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

8-7-18 సాహిత్యాదివారం 

8-7-18 సాహిత్యాదివారం

హైదరాబాద్ లో 8-7-18 ఆదివారం చక్కని సాహిత్యాదివారం గా గడిచింది . బహుశా కిందటి మంగళవారంఅనుకొంటా  నేను ఉయ్యూరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుండి శ్రీమతి వాణీ కుమారి గారు ఫోన్ చేసి తాను  సరసభారతి బ్లాగు ను నిత్యం చదువుతానని , అమెరికాలో షార్లెట్ లో ఉన్న మామనవాళ్లు అంటే మా అమ్మాయి చి సౌ  విజ్జి అనే కోమలి విజయ లక్ష్మి  సాంబావదాని కుమారులు చి ఆశుతోష్ ,పీయూష్ లకు సంగీతం నేర్పుతున్నగురువు  శ్రీమతి పోతుకూచి పద్మశ్రీతలిదండ్రులు తనకు మంచి సాహితీ మిత్రులని  ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు  కలసి హైదరాబాద్ లో నిర్వహిస్తామని  తాను  గుడివాడ మాంటిస్సోరి హై స్కూల్ లో పదేళ్లు పని చేసి వచ్చానని తన అమ్మమ్మగారి ఊరు అడ్డాడ దగ్గరున్న ఐనంపూడి అనీ ,తాతగారు అక్కడ కరణం అనీ ,తనభర్త శ్రీ వెంకట రమణ బందరు  హిందూ హై స్కూల్ లెక్కలమాస్టారు ,భారతీయ సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ  రాజనాల శివరామ కృష్ణమూర్తి (ఆర్ ఎస్ కె )గారి రెండవ కుమారులని ,ఇక్కడ విద్యానగర్ లో ఉంటున్నామని  ఈ నెల 28 గుడివాడలో మాంటిస్సోరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తనను ఆహ్వానించారని,  తాను  అక్కడికి వచ్చేటప్పుడు ఉయ్యూరు కూడా రావాలని అనుకొంటున్నానని రావచ్చా అనీ అడిగారు .సంతోషంగా రమ్మని ఆహ్వానం పలికాను . నేను గురువారం హైదరాబాద్అ బయల్దేరి వస్తున్నాను అంటే తమ ఇంటికి రమ్మని కోరారు   నేను 5 వతేదీ రాత్రికి ఉయ్యూరులో బయల్దేరి 6 ఉదయం బాచుపల్లి మా రెండవ అబ్బాయి శర్మ ఇంటికి వెళ్లి ,7శనివారం శర్మా నేను మామనవుడు హర్ష కారులో బోయినపల్లి  మా అక్కయ్యగారింటికి వెళ్లి  అక్కడినుంచి ,యశోదా హాస్పిటల్ లో ఉన్న మా పెద్ద తోడల్లుడు శ్రీమూర్తిగారిని పరామర్శించి  తర్వాత మల్లాపూర్ మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంటికి చేరాం మధ్యాహ్నం 1-30 కి అందరం భోజనం చేసాం  మా వాళ్లిద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకుని బాచుపల్లి వెళ్లారు .  ఇవాళ ఆదివారం నేనూ మా అబ్బాయి శాస్త్రి ,  కోడలు సమత  విద్యానగర్ సొనాటా అపార్ట్ మెంట్ లో ఉంటున్న శ్రీమతి వీణాకుమారి గారింటికి వెళ్లాం ,. చాలా సాదరంగా ఆహ్వానించారు దంపతులు .అక్కడ ఆర్ ఎస్ కె గారి ఫోటో చూసి మహదానందపడ్డాను .ఫోటో తీశాను కెమెరాతో . మూర్తిగారి గురించి ఎన్నో  ముచ్చట్లు అందరం చెప్పుకున్నాం ఆయన  దగ్గర మా పెద్దమేనల్లుడు  అశోక్  ,చిన్నవాడు శాస్త్రి ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాధ్ బందరులో ట్యూషన్ చదివారు .ఆయననాకు సాహితీబంధు .తాము రాసినవన్నీ నాకు చదవటానికి పంపేవారు వారు నిర్వహిస్తున్న సాందీపనిలో నాకవితాలు వేసేవారు .వారి సినీ విశ్లేషణ పరమాద్భుతంగా ,హాస్యం అండర్ కరెంట్ గా ఉండేది జాగృతి వారపత్రికలో  అదే హై లైట్ . ఆర్ ఎస్ ఎస్ లో బౌద్ధిక్ గా సుప్రసిద్ధులు . జనసంఘ్ తర్వాత భారతీయ జనసంఘ్ పార్టీలకు క్రియా శీలక మార్గదర్శి . ఆయన భారతీయ సాహిత్య పరిషత్ కు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాజమండ్రి లో 19 94 ఫిబ్రవరిలో మూడు రోజుల సభలు రంగరంగ అవైభవంగా జరిగాయి నన్నూ  మా బావమరిది ఆనంద్ నూ ఆయనే రమ్మని ఆహ్వానించారు .కప్పగంతుల మల్లికార్జునరావు గారు అనే ప్రసిద్ధ కథానికా రచయిత నిర్వహణ చేశారు .కాఫీ టిఫిన్లు భోజనాలు సౌకర్యాలు అన్నీ పెళ్లి వైభవాన్ని మించి జరిపారు అక్కడి స్థానిక కార్యకర్తలు.  .డా .జివి సుబ్రహ్మణ్యం  కసిరెడ్డి ,,సదాశివరావు ,తనికెళ్ళ భరణి  వాకాటి పాండురంగారావు  ,జానకీ జానీ గారు వంటి  లబ్ధ ప్రతిష్టులను చూడగలిగే భాగ్యం కలిగింది. కవిసమ్మేళనాలు జరిగాయి  కవితలకు బహుమతులు ఎంపిక చేసే బాధ్యత నాకూ  మా బావమఱఁదికి అప్పగించారు మూర్తిగారు .ఎందరెందరో యువకవులు పరిచయమయ్యారు .విశ్వనాధ పై రీసెర్చ్ చేసిన శ్రీ నటరాజన్ ,శ్రీ టి రంగస్వామి లు దగ్గరయ్యారు మాకు అంతకంటే  శ్రీజానకీ జానిగారు మా ఇద్దరికీ బహు దగ్గరై  సభలు  అయ్యాక మాతో అర్ధరాత్రిదాకా కూర్చుని సాహితీ కబుర్లు చెబుతూ విశ్వనాథవారి రామాయణ వాల్మీకి రామాయణ రహస్యాలెన్నో తెలియ జేశారు .ఈ బంధం బలవత్తరమై వారిని ఉయ్యూరు ఆహ్వానించి మా ఇంట్లోనే అప్పటికప్పుడు ఆహ్వానింపబడిన యాభై మందికి పైగా సాహిత్యాభిమానులు ఉన్న సభలో జానకీజానిగారు రెండుగంటలు వాల్మీకి, కల్పవృక్షాలపై అనర్గళంగా ప్రసంగించి మమ్మల్ని రసడోలికలో ఊగేట్లు చేశారు .మాపుస్తకాలు కాకినాడలో ఉన్న వారికి పంపితే తమవీ , తమ తండ్రి సామవేదం జానకి  రామ శర్మగారి రామాయణ కావ్యాలు , అమూల్య గ్రంధాలు నాకు పంపేవారు .అదీ మా సాహితీ బంధుత్వం .కాకినాడ వెడితే నేనూ మా శ్రీమతీ మా అమ్మాయి తప్పకుండా ఆదంపతులను చూసి వచ్చేవాళ్ళం  .ఇవన్నీ కుమారి గారింట్లో జ్ఞాపకం చేసుకున్నాను .రమణగారు మా మేనల్లుళ్ళతో మాట్లాడాలని ఉంది అంటే ఫోన్ లో మాట్లాడించాను . సంబరపడ్డారు ఆయన వాళ్ళూ కూడా.   నేను తెచ్చిన ”షార్కెట్ మైత్రీ బంధం ”రమణ దంపతులకు అందజేశాను ఆమె తమ అమూల్య గ్రంధాలను నాకు ఇచ్చారు . మా కోడలు ఆమె పరిచయం పెంచుకొని , తన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఆమెను ఆహ్వానించి సత్కరించే ఆలోచన చేసింది . ఆ దంపతులు మాకు కాఫీ ఇచ్చి నాకు శాలువాకప్పి సత్కరించారు .
        వీళ్ల పై అంతస్తులో మా అబ్బాయి స్నేహితుడూ క్లాస్ మేట్ పసుమర్తి శ్రీనివాస్ కిందకు వచ్చి పలకరించి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళాడు  .దంపతులు ఆధరంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చారు  వాళ్ళనాన్నగారితో మాట్లాడించాడు శ్రీనివాస్ .దంపతులు నాకు నూతనవస్త్రాలు ఇచ్చి సత్కరించారు.
  అక్కడినించి శ్రీనివాస్ మా ముగ్గుర్ని నల్లకుంట లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవుడు,కిందటివారం లో యాక్సిడెంట్ అయి కాలికి సర్జరీ జరిగిన రవి గాయత్రి  దంపతుల ఇంటికి కారులో తీసుకు వెళ్లి దింపాడు . అక్కడ కోలుకుంటున్న రవిని పలకరించాం .పిల్లాడు చి రేయాంశ్ చలాకీగా మా  అందరనీ పలకరించాడు .మా అన్నయ్యగారి అమ్మాయి వేదవల్లి జూన్ 26 న అమెరికా నుంచి వచ్చి 27 జరిగిన రవి పుట్టిన రోజు పండుగ జరిపింది  తర్వాత వాడికి ఆఫీస్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది .సర్జరీ జరిగి ఇంటికి వచ్చి కోలుకుంటున్నాడు  అందుకని చూడాటానికి వచ్చాము  .రవి ఇంట్లోనే భోజనం చేసి మల్లాపూర్ శాస్త్రి వాళ్ళ ఇంటికి చేరాం .మొత్తం మీద ఈ ఆదివారం  సద్వినియోగమైంది-
  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-18 కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్   

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -6

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -6

మొవ్వకవి’’ రాయ కావ్యం’’ లో ఆయా వంశాల చివరి దశలను అందంగా ఔచితీయుత౦గా వర్ణించారు .ఆనె గొంది రాజు వీరస్వర్గమలంకరిస్తాడు .అప్పుడు స్వర్గం లో అప్సర గణం ఆహ్వానించింది .తర్వాత కాకతీయ శకమూ ముగిసింది .ఆ పద్యం –

‘’కాల చరిత్రకున్ విలువగట్టి ,శతత్రయ చైత్ర మాధురీ  -బాల రసాల సాలపిక పంచమ స్వర గాన వాహినీ

జాల సుధార సోర్మి వివశత్వ మొనర్చిన కాకతీయ రా-ట్పాలన మంతరించినది పాప విధాత కృతాస్స్య రేఖలన్ .’’

ఇందులో విషాదధ్వని ఉంది .ఆనే గొంది రాజుల పాలన అంతమయినపుడు ఈ విషాదం లేదు .ఇక్కడ విషాదం ఎందుకూ అంటే –కాకతీయ సామ్రాజ్యపతనం కావటమే దక్షిణ దేశం తురుష్క క్రాంతం కావటం .భారతీయత నశించటానికి అదే చివరి ఘట్టం .వసంత ఋతు సౌ౦దర్యం  రసాలం ,పికస్వరం మొదలైన శోభాయమానమైన  వసంతర్తు సౌందర్యం

మాసిపోవటం దుఃఖ కారకం .ఇలా ఘట్టానికి  తగిన ఔచితిని పాటించి  వర్ణించటం కవి ప్రతిభకు నిదర్శనం .చివరి ఆశ్వాసం లో చెప్పిన ఒక వృద్ధురాలి కథ లో కృష్ణరాయలకు విషమిచ్చి చంపమమని నరసనాయకుని పెద్ద భార్య పురమాయిస్తుంది .అ ముసలి రోజూ రాయలకు తనచేత్తో పాలు ఇవ్వటం రివాజు .ఆ రోజు బయటి ప్రపంచం లో దుర్దినం అంటే ముసురు పట్టిన రోజు .ఆమె మనో వ్యధను వర్ణిస్తూ కవి చెప్పిన పద్యం గుండె లోతులను తాకుతుంది –

‘’అని ,లోలో వెత నందుచు –మనమున మదిలేక ,శవము మాదిరి గడుపున్

దినములు కనుగొను చుండగ-ఘనతరమైన దుర్దినంబు కదిసె కడంకన్’’

ఇక్కడ దుర్దశ శబ్దం సాభిప్రాయంగా ప్రయోగించాడు కవి .అది ఆమె మనసులోని  చింతా దుర్దినం అన్నారు తుమ్మపూడి .లోపలి జగత్తే ,మనస్సే బాహ్య జగత్తుగా పరిణమిస్తుందట.’’మతిలో ఎంతో గతిలోనూ అంతే ‘అని తేల్చి చెప్పారు ఆచార్య .

 నగర వర్ణలలో కవి చాలా సూక్ష్మా౦శాలూ దర్శించటం ఆశ్చర్యకర విషయం .ఇదే కవి విశాల పఠన పరిస్ధితికి చెందిన విషయం .పాఠకుడు  కూడా  భావుకుడు కాకపొతే ఆ విషయం గ్రహించలేక జారిపోతుంది .

 వరంగల్లును మహమ్మదీయులు వశం చేసుకున్నాక అక్కడ మసీదు కట్టించారు .దీనికి ఆధారం క్రీడాభిరామం అంటారు తుమ్మపూడి .యుద్ధవర్ణనలను వీర రౌద్ర  రసాత్మకంగా రచించి చరిత్రకు మెరుగులు దిద్దారు .అల్లాఉద్దీన్ ఖిల్జీ -హరిపాల దేవుని రాజ్యం ఆక్రమించినపుడు ఆనేగొందే ఘట్టం ,ద్వారకాసముద్ర ఆక్రమణ ఘట్టాలను భిన్నభిన్న రీతులలో కవి వర్ణించారు .అంటే మొనాటమి తప్పించారన్నమాట .యవనుల క్రూర కృత్యాలను కవి –

‘’అంతి పురంబు జొచ్చి ,తన యంగనలన్ వసివాడ బోని ,పూ –బంతుల గూతులన్ ,దనదు బాంధవ మొప్పిన రాజకా౦తలన్

గొంతులు కోసి చంపి ,మది ఘూర్ణిల వేదన వారి దేహముల్ –సుంతయు గానరాని విధి జొప్పడ జేసెను నగ్నికాహుతిన్ ‘’

స్త్రీలను దారుణంగా చంపిన చోట రౌద్రం కరుణరసం ద్వారా ద్ధ్వనితమఔతు౦ది .-‘’రౌద్రాత్తు కరుణోమతః ‘’అని నాట్య శాస్త్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆచార్యశ్రీ .

’’కలకల లాడు నంతిపురి కమ్రవసంతపు బూలతోటగన్ –జెలగును నింతదాక వికసించెడు పూవుల బల్లవంబులన్, –జలముల లిప్త లోననె శ్మశాన సమబుగ మాసిపోయె,న-గ్గలమగు కాల మాంత్రికుని గారడి కావె ధరిత్రి బంధముల్ ‘’అని నిట్టూర్చారు వేదనా ,వేదాంతం మిళితం చేస్తూ .ఇప్పటిదాకా పూలతోటలాగా అందాలొలికించిన అ౦తిపురి ఒక్కసారిగా నిజంగానే అన్త్యపురి అంటే శ్మశానం గా   మారిపోవటంతో  కరుణ రసానుభూతి కలుగుతుంది .శ్మశానం –పూలతోట రెండూ వ్యతిరేక సంవిదానాలద్వారా అంటే కాంట్రాస్ట్ ద్వారా పరస్పర ఘర్షణ పడటం కనిపించేవిషయం .

  ద్వార సముద్ర౦పై  యవ్వనసేన ఒక్కసారిగాతుఫానులాగా  విరుచుకు పడింది .

‘’ఘోర తుఫాను తాకిడికి గోంపలు, కోళ్ళును  గూళ్ళు బోయి ,దు –ర్వారత గాటి నేల వలె,బాడయి పోయెను ,ఊళ్లు కూళ్ళు ,క-

న్నీరును గూడ నింకి గరుణి౦చెడు నాథుడు లేక ,లేవగా-నేరక ఆస్థి పంజరపు నీడలుగా గ నిపించి రెల్లరున్’’.

  ఈ పద్యం రిఫరెన్స్ 1974 దివిసీమ ఉప్పెన స్పూర్తి కావచ్చు .’’మహనీయ దేవతా గృహ శిల్ప సౌందర్య –మఖిలంబు బాడయ్యె నడగు బట్టి ‘’అంటూ నాశనమైన సంపద స్వరూపాన్ని తెలియజేశారు కవి .’’దిక్కుమాలిన కాలంబు వెక్కి రింతగా  ఉన్నది ‘’అనే ఉపమ చాలా దయనీయ స్థితికి కట్టిన ఫోటో ఫ్రేం .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-18-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -5

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -5

మొవ్వవారి కావ్యం లోని వర్ణాలను విశ్లేషిస్తూ ఆచార్య తుమ్మపూడి కొన్ని విషయాలు  స్పృశించారు .’’కావ్యం  వర్ణనాత్మకం కావటం వలననే ప్రాధాన్యం పొందింది .ఇందులో కవి భావనాశాక్తీ ,అలంకారాలు ఔచిత్యం ఉంటాయి దీనికి ‘’తొడుగు ‘’గా పద్యం ఉంటుంది .శబ్దౌచితి –ప్రౌఢ సమాస కల్పనా మొదలైనవి అంగాలు .వీటిని విడివిడిగా చూస్తూ ,అన్నిటినీ సమన్వయము చేయటమే విమర్శ శాస్త్రం ,కళా ఔతుంది .విశ్లేషణ శాస్త్ర సమన్వయమే కళ.ఆనెగొంది ,విజయ నగర౦ మొదలైన నాలుగు నగర వర్ణనలున్నాయి రాయకావ్యం లో .అనేక రాజవంశాల చరిత్ర త్రవ్వి పోశారుకనుక నగర వైవిధ్యం తోబాటు ,వర్ణనా వైదగ్ది కూడా అవసరమౌతుంది .ప్రాచీనకావ్యాల్లో ఉన్న వర్ణనలకు ఏమాత్రం తీసిపోకుండా ఈకవి వర్ణనలు  ఉత్క్రుస్టంగా  చేశారు .

హంపీ,విజయనగరాలను పాశ్చాత్య చరిత్రకారులు గొప్పగా వర్ణించారు .వీటిని కవి స్వయంగా చూశాడుకనుక ఆ వర్ణలను మహా భేషుగ్గా చేయగలిగారు .లాంగ్ హారేస్ట్ లేక పేయస్ అనే చరిత్రకారుడు ‘’అచ్యుతరాయలు రామాలయం ప్రక్కనే తుంగభద్రానది ఒడ్డున ఉన్నకొండ ( రాయలవారి అంతఃపురం  వెనకాల ) నెక్కి నగరాన్ని చూస్తే ,అంతటి అందమైన పట్టణం ప్రపంచం లో లేదు .’’ రోమ్ నగరం కంటే చాలా అద్భుతనగరం ‘’అన్నాడు .కనుక ఈకవి వర్ణించిన పద్యం అతిశయోక్తి కాదు .చారిత్రక  సత్యమే .

‘అంతటి సుందరభూమి విశ్వా౦నతరాళ -మందు లేదన గడు నొప్పు ,నట్టి చోట

రమ్యమగు రాజధాని నిర్మాణమునకు –బూనుకొని రా సహోదరుల్ పోతుగడ్డ’’

తెనాలి రామకృష్ణుడు తళ్ళికోట యుద్ధం లో విజయనగరం ధ్వంసమైనతర్వాత రాయలపాలన

లోని నగర వైభవం  చూశాడు . పాండురంగ మహాత్మ్యం లో అగస్త్యుడు తన అనుభవాన్నిఈ ప్రాంతానికి వచ్చినప్పు చూసి వర్ణించాడు. అంటే కాలవ్యత్యాసాన్ని కూడా పరిగణించ కుండా  ఆ నగర సౌందర్యం ఎంతటిదో తెలుస్తోంది .ఆ పద్యాలు  చదివి అనుభవించిన వారికి ఆ గత స్మృతులు చరిత్రలో కనిపించిన వ్రాతలతో సమన్వయము చేసుకొని పులకా౦కి తులమవుతున్నా మంటారు తుమ్మపూడి .మనమనసులలో స్థిరముద్ర వేసిన ఆ అంశాలు రాసే కవి అనుభవాలు ఎంతలోతులో ఉంటాయో ఊహించమన్నారు .ప్రౌఢదేవరాయల పాలన వర్ణిస్తూ కవి రాసిన పద్యం పెద్దనగారి మనుచరిత్రలో రాయల వంశావతారం వర్ణనలో ఉన్న పాలనా మాధుర్యాన్ని గుర్తుకు తెస్తోందన్నారు –

‘’బలవత్ప్రౌఢధరాదినాధుడు ధరంబాలింప ముక్కారులన్ – బొలముల్ బండెను ,ధాత్రిపై నెల నెలన్ ముమ్మారు వర్షించె,ను

జ్జ్వల సౌఖ్యంబుల జొక్కె భూమి ,ప్రజ విశ్వాసంబుతో ,మంత్రి వ –ర్యులు సామ్రాజ్య మహాభి వృద్ధి కొరకుద్యోగింప నుత్కంఠ తోన్.’’

‘’ఆరవీడు వంశం ‘’లో’’ ఫాదర్  హీరాన్ ‘’’’ఆనాటి ప్రజలు రాత్రిళ్ళు గుండెపై చేయి వేసుకొని ఆరుబయట నిర్భీతితో నిద్రించేవారు ‘’అని రాసిన చారిత్రిక సత్యాన్ని వృషాద్రి పతికవి స్త్రీపరంగా అన్వయించి రాసాత్మక౦గా చెప్పారు –

‘’అపరాత్రంబని ,అర్ధరాత్రమని శంకాల్పంబు లేకుండభీ –తి పరాదీనలు గాక ,పంకజముఖుల్ ,దీరాయత స్వా౦తులై

అపురూపంబుగ సంచరించెద రనన్య స్వేచ్చానిచ్ఛా విహా-రపరత్వంబున నొంటిగా గృతయుగ ప్రారంభ సంస్తుత్యమై ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-18 –ఉయ్యూరు

‘’

 

 

 


 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ వెబ్ పత్రిక జులై

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్

గుజరాత్ ను పాలించిన గొప్ప రాజ వంశాలున్నాయి .ప్రసిద్ధులైన రాజులెందరో ఉన్నారు .వారితో పాటు సుపరిపాలన అందించిన శేముషీ మణులైన మహా రాణీలు కూడా ఉండటం విశేషం .అలాంటి వారిలో,,మినాల్ దేవిసు పరిపాలనతో ప్రజా హృదయం చూరగొ౦టే , నాయికీ దేవి మహమ్మద్ ఘోరీని ఓడి౦చి జగద్విఖ్యాతమయ్యారు .ఆ ఇద్దరు మహారాణుల గురించే ఇప్పుడు మనం తెలుసుకొంటున్నాం .

1-న్యాయ ధర్మ రక్షకురాలు -మినాల్ దేవి

క్రీ శ.11 వ శతాబ్దికి చెందిన గుజరాత్ ను పాలించిన మినాల్ దేవి మహారాణి సమర్ధతకు ,న్యాయానికి ,ధర్మానికీ ప్రతీక .ఈమెను ‘’మయనల్లా’’ అనికూడా పిలుస్తారు .కర్నాటక పాలకుడు కాదంబ వంశానికి చెందిన జయకేశి కుమార్తె మినాల్ దేవి .ఈమెను గుజరాత్ లో అనహిల పతన్ వాడా పాలకుడైన చాళుక్యరాజు మొదటి కర్ణ మహారాజు వివాహం చేసుకున్నాడు .కాని విధి వశాత్తు వారిద్దరికీ జన్మించిన సిద్ధరాజ జయసింహుని చిన్నతనం లోనే రాజాకర్ణ మరణించాడు .

రాజ్యానికి వారసుడైన కుమారుని తరఫున రాజమాత మినాల్ దేవి రాజ్యపరిపాలన చేబట్టింది .యవ్వనం రాగానే అతను రాజై, ఎదురులేని చారిత్రాత్మక మహారాజు అనిపించుకున్నాడు . తల్లి ఇచ్చిన శిక్షణ ఫలితమే అది .రాజ శేఖర సూరి అనే కవి రచించిన ‘’ప్రబంధ కోశ ‘’గ్రంధం లో మహారాణీ గొప్పతనాన్ని గురించిన వివరాలెన్నో ఉన్నాయి . యుద్ధ తంత్ర నైపుణ్యం లో రాణి తనకొడుకును అద్వితీయ ప్రతిభా శాలి గా తీర్చి దిద్దింది .రాజరిక వ్యవహారాలన్నీ పూర్తిగా ఆకళింపు చేసుకొని రాజ్యానికి శత్రుభయం లేకుండా చేసింది .ప్రజోపకరమైన ఎన్నో పనులు చేసి ప్రజలకు కన్నతల్లి అనిపించింది .న్యాయం ,ధర్మం ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించింది .ధర్మం కోసం అనుక్షణం తపన పడింది .ప్రజా సంక్షేమమే రాజ్యానికి శ్రీరామ రక్షగా భావించి పరిపాలన సాగించింది .అనేక స్మృతి చిహ్నాలు నెలకొల్పింది . తాగునీటికోసం సాగునీటికోసం అవసరైన ప్రతి చోటా తటాకాలు నిర్మించింది .ప్రముఖ జ్యోతిర్లి౦గ మైన శ్రీ సోమనాథ దేవాలయాన్ని సందర్శించే యాత్రికులపై ఉన్న సుంకం తీసేసింది .

ఆమె పాలనా కాలం లోరెండు పెద్ద ప్రముఖ సరోవరాలను నిర్మించింది .అందులో ఒకటి మినాల్ సరస్సు లేక మున్సార్ సరస్సు.దీనిని వీరం గావ్అనే చోట కట్టించింది .రెండవది అహ్మదాబాద్ లో ధోల్కా లో నిర్మించిన మాల్వా సరస్సు .

మాల్వా సరస్సు నిర్మిస్తుండగాఒక గొప్ప ఆమె ఔదార్యానికి దార్మికతకు పరీక్ష గా ఒక విషయం చోటు చేసుకున్నది .ఆసరస్సు నిర్మించే చోట ఒక పేదరాలి ఇల్లు ఉన్నది .సరస్సు నిర్మాణం లో ఆ ఇల్లు పూర్తిగా పడ గొడితేకాని నిర్మాణం ఆశించిన విధంగా పూర్తికాదు .ఆ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేస్తే కోరినంత ధనం అందజేస్తానని రాణి కబురు చేసింది ముసలామెకు .దానికి ఆముడుసలి బదులిస్తూ ‘’ఈ సరస్సు వలన నాకు కూడా గొప్ప పేరొస్తుంది ‘’అని చెప్పి బలవంతంగా తన ఇంటిని ఆక్రమిస్తే తాను ఆత్మాహుతి చేసుకొంటానని ప్రకటించింది .మహారాణి కి ఆ ముసలమ్మ ను బలవంతపెట్టి స్వాధీనం చేసుకోవటానికి మనస్కరి౦చ లేదు . ఇప్పటిదాకా తాను సత్య, న్యాయ, ధర్మాలకు ప్రతీకగా కీర్తి పొందింది .అందుకని ముసలమ్మ ఇంటి జోలికి వెళ్ళకుండానే సరోవరం పూర్తి చేయించింది మహారాణి .ఈ దృష్టాంతం కావ్యాలలో గ్రంథాలలో విశేషంగా కీర్తింపబడి, రాణి ఔదార్యాన్నిన్యాయ నిర్వహణను ప్రపంచానికి చాటి చెప్పారు కవులు .ఈ సందర్భం గా గుజరాత్ లో ఒక సామెత వాడుకలోకి వచ్చింది –‘’న్యాయధర్మాలను చూడాలని అనుకొంటే ధోల్కా వెళ్లి మాల్వా సరస్సును చూడు ‘’ .సరస్సు ఆకారం బాగుండాలంటే ముసలమ్మ ఇంటిని స్వాధీనం చేసుకొని చక్కగా కట్టాలి .కాని ధర్మ న్యాయాలను పరిరక్షించే రాణి సరస్సు ఆకారానికంటే ఆ ముసలమ్మ సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చింది .

మీనాల్ దేవి మహారాణి గొప్పతనం ,మంచితనం, వివేకం ఔదార్యం ,న్యాయ ధర్మాల గురించి అనేక గ్రంధాలలో వర్ణించబడి ఉంది .’’ముద్రిత కుముద చంద్ర ప్రకరణ ‘’అనే సంస్కృత నాటకం లో మరొక విషయం పేర్కొనబడింది .గుజరాత్ లోని జైన మత శాఖలైన దిగంబర ,శ్వేతాంబర జైనులమధ్య ‘’స్త్రీలకు నిర్వాణం లభిస్తుందా ?’’ .అనే అంశంపై గొప్ప ధర్మ సందేహం కలిగింది .శ్వేతాంబరులు ‘’సత్వ గుణ సంపన్నులైన మహిళలు తప్పక నిర్వాణం అంటే ముక్తి పొందుతారు ‘’అని వాదించారు .దీనికి ఉదాహరణగా రామాయణం లోని సీతాదేవి ,ప్రస్తుతం తమ పాలకుడైన సిద్ధరాజ జయసింహ మహారాజు తల్లి అయిన రాజమాత మీనాల్ దేవి అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు .అదీ చరిత్రలో మీనాల్ దేవి మహారాణికి ఉన్న విశిష్ట స్థానం .

2-మహమ్మద్ ఘోరీని ఓడించిన -నాయకీ దేవి

ఝాన్సీ లక్ష్మీ బాయ్ చూపిన పోరాటపటిమ అందరకు తెలుసు .ఇది చరిత్రలో సువర్ణా ధ్యాయంగా రాయబడింది .కాని ఘోరీ మహమ్మద్ తో ఢీకొని ఓడించిన నాయకీ దేవి గురించి పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి .అజయపాల మహారాజు తర్వాత రాజైన బాల మూల రాజు లేక రెండవ మూలరాజు తల్లి నాయకీ దేవి గోవా కాదంబ మహా మండలేశ్వరుడైన పెర్మడి లేక శివ చిత్తుని కుమార్తె .రెండవ భీమరాజు మరణానంతరం మూలరాజు సోదరుడు రాజయ్యాడు .మూలరాజు మూడేళ్ళు మాత్రమే రాజ్య పాలన చేశాడు .కాని ఈ బాల రాజు ఆ స్వల్పకాలం లోనే ఒక ముస్లిం సైన్యాన్ని జయించాడు .అందుకని ఇతడు ‘’ప్రభూత దుర్జయ గర్జనకాధి రాజు ‘’అనీ ‘’మ్లేచ్చతమో మేచయచ్చాన్న మహీవలయ ప్రద్యోతన వలార్క ‘’అని కీర్తి౦పబడినాడు . బాలరాజు సాధించిన ఈ విజయాన్ని బాల చంద్ర ,అరిసింహ కవులు తమకావ్యాలలో గొప్పగా వర్ణించారు .

ఇంత కంటే వీర రస ప్రధానంగా జైనకవి మేరుతుంగ తనకావ్యం ‘’ప్రబంధ చింతామణి ‘’లో వర్ణించి చెప్పాడు .రాణి నాయకీ దేవి పసిపిల్లాడైన మూలరాజును ఒడిలో వేసుకొని చాళుక్య సైన్యానికి నాయకత్వం వహించి మౌంట్ ఆబూ వద్ద ఉన్న గదరార ఘట్ట రణరంగం లో మ్లేచ్చరాజుతో స్వయంగా పోరాడి గెలిచింది .ఆ సమయం లో దట్టంగా ఆకాశమంతా పరచుకున్న మబ్బులు ,విపరీతమైన కుండపోత వర్షం ఆమె విజయానికి తోడ్పడినట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆమె చేతిలో ఓడిపోయిన ఆ ముస్లిం రాజెవరో చారిత్రకులు చెప్పలేక పోయారు .ఫోర్బ్స్ ,బూలర్ ,జాక్సన్ వంటి పరిశోధకులు ‘’మూజుద్దీన్ మొహమ్మద్ బిన్ సం’’అని తేల్చారు .ఈ తిరకాసు ఎందుకు ఆ ఓడిపోయిన ముస్లిం రాజు ‘’మహమ్మద్ ఘోరి ‘’యే..సైన్యమంతా నశించి అయిదారుగురు అంగ రక్షకులతో ఘోరీ పలాయనం చిత్త గించాడు .ఈ యుద్ధాన్నే ‘’కసహ్రద యుద్ధం ‘’అంటారు . గర్జనకులు అంటే గజని లో ఉండే వాళ్ళను మూలరాజు జయించినట్లు జయస్తంభం ఉన్నది .దీనిపై ‘’ఇక్కడే ఒక స్త్రీ హమ్మీరులను అంటే అమీర్ లను మూలరాజు పాలనలో ఓడించింది ‘’అని రాయబడి ఉంది .

ఇక్కడ గెలిచి ఉంటె ఘోరీ దక్షిణ రాజపుటాన ,గుజరాత్ మొదలైనవన్నీ ఆక్రమించి ఉండేవాడు .1178 లో జరిగిన ఈ ఓటమితో తన ప్రణాళిక మార్చుకున్నాడు .వెనక్కి వెళ్ళిపోయి మరుసటి ఏడాది కైబర్ కనుమ దాటి పెషావర్ ,లాహోర్ లను వశపరచుకున్నాడు . ఈ యుద్ధం తర్వాత మూలరాజు చనిపోయాడు .నాయకీదేవి కుమార్తె కూర్మదేవి కూడా వీరవనితయే .ఈమె కుతుబుద్దీన్ ఐబక్ ను యుద్ధం లో జయించి చరిత్ర సృష్టించింది .ఇదీ భారతీయ స్త్రీ శక్తి అంటే ..

.13 వశతాబ్దం లో సోలంకి రాజు ల రాజధాని నహర్వాలా వైపుకు ఉచ్హా ముల్తాన్ లమీదుగా దండెత్తివచ్చాడు ఘోరి . .అప్పటి సోలంకి రాజు యువకుడు .అతనివద్ద ఉన్న గజసైన్యం అమోఘమైనది .ఈ గజ సైన్యం ఘోరీ సైన్యాన్ని గజగజ లాడించి నిర్దాక్షిణ్యం గా తొక్కేసి చంపేసి ఘోరీని ఘోరంగా ఓడించింది .ఆశించిన ఫలితం రాక తోకముడిచి మళ్ళీ వెనక్కి వెళ్లి పోయాడు ఘోరీ .

-గబ్బిట దుర్గాప్రసాద్

!~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Posted in రచనలు | Tagged | Leave a comment

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -4

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -4

కావ్య విమర్శపై ఆచార్య తుమ్మపూడి వారి అభిప్రాయాలు మాన్యమైనవి –అందులోకొన్ని-

చరిత్రను లేక లోకాన్ని కావ్యంగా పరిణమింప జేయటం ,రసలోకాలలో విహరి౦పజేయటం లేదా రసమయ తనువుగా ఆవిష్కరింప జేయటం ఎలా ?ఇది కవి సమస్య .దీనికి మార్గ దర్శనం చేసింది ప్రాచీనకవులే .రామకథ భారతం చరిత్రలే .అంటే ఒకప్పుడు జరిగిన కథలే.కల్పనలు కావు ,వాటిని కావ్య వస్తువుగా మలచటం ,శిల్పించటం ఎలా ?ఆకావ్యాలతో మనకు అనుబంధం ఉంటేనే తెలుస్తుంది అన్నారు తుమ్మపూడి .రాయలు పొట్నూరి దగ్గర నాటించిన విజయ స్థంభం 1516 మార్చి నాటి చరిత్ర .దాన్ని అల్లసాని పెద్దన ‘’అభిరతి కృష్ణ రాయడు జయాంకములన్ లిఖియించి ,తాళ స-న్నిభముగా పొట్టునూరి కడనిల్పిన కంభము ‘’పద్యం లో శిల్పీకరించాడు .ఇందులో మొదటిరెండుపాదాలు చరిత్ర .ఇది భౌతికం .దీన్ని కవి తన మహా  దర్పణం అంటే పట్టకం లో ప్రతి బింబింపజేసి ,తనభావనలో దానిని రంగరించి వక్రీభ వింప జేయటం వలన –సూర్యకిరణం స్పటికం అంటే పట్టకం ద్వారా పరివర్తన పొంది సప్తవర్ణాత్మక ఇంద్ర ధనుస్సు అయినట్లు  కవిత్వమైంది అన్నమాట .కావ్యం లోకం తో ఎక్కడ విడిపోతోంది ?రెండిటికీ మధ్య సరిహద్దు రేఖ ఏమిటి ?సాధారణ దృష్టి వాస్తవికంగా వస్తు సంబందియే .త్రిదశాత్మక వస్తువే .కవి భావన సరస్వతీ రూపం .స్ఫురణ ప్రతిభామయం కనుక ఆవస్తువును రసమయం చేసి ఆవిష్కరిస్తుంది అన్నారు ఆచార్య .ఈ రస దృష్టికి వ్యక్తీకరణయే, శబ్ద౦ మొదలైనవి . వ్యావహారిక శబ్దం వేరు ,కావ్య శబ్దం వేరు.అంటే భావనమాత్రమే తప్ప భౌతికంకాదు అని వివరించారు .గడ్డిపరక అందరికీ గడ్డిపరకే .కానీ కవికి అది మహాకావ్య వస్తువు .అది కవికి చిత్రకారుడికి ఒక రసవద్వస్తువుగా ,చిత్ర వర్ణాత్మకంగా గోచరిస్తుంది  .భక్తుడికి అదే ఆత్మపదార్ధంగా భాసిస్తుంది .   మొవ్వకవి గారికి ఈ సమస్యే ఎదురైంది .చారిత్రిక పద్య కావ్య రచన సంక్లిష్టం అనిపించింది అందులో విఘాతాలు ఎక్కువ .సత్యాలు, అసత్యాలూ ఎదురౌతాయి .దేన్ని తీసుకోవాలనే సందిగ్ధత ఏర్పడుతుంది .ఒక్కో గ్రంథం ఒక్కో రీతిగా చరిత్రను రాయటం  కవికి ఇబ్బంది కలిగించేవిషయం .దీనికి విరుద్ధంగా ప్రజాబాహుళ్యంలో అనుస్యూతంగా వచ్చే చరిత్ర కూడా లెక్కకు తీసుకోవాల్సి వస్తుంది .దీనికి ఉదాహరణ తాజమహల్ .ఓక్ అనే చరిత్రకారుడు అది శివాలయం అని నిరూపించాడు .కనుక చరిత్రకు వాస్తవానికి సరైన సరిహద్దు ఉండదు .విజయనగర సామ్రాజ్యం పై అనేక ఉద్గ్రంధాలు వృషాద్రి పతి గారు మధించారు .విజయనగరసామ్రాజ్య స్థాపనకు విద్యారణ్యు లవారు పల్లకీలో వచ్చినట్లు కవి రాశారు .అది ఆనాటి ప్రయాణ సాధనం గా భావించాలి .అంతేకాదు దీనికి ఆధారంగా ఒక చిత్రం హంపీ విరూపాక్ష దేవాలయం గోడ లోపల కనిపిస్తు౦దికూడా. ఈ బొమ్మే కవిగారి పద్యానికి ఆధారమైంది అన్నమాట .దీనినే కావ్యాన్వయం అంటారని విశ్లేషించారు కోటేశ్వరార్యులు.కాని చదువరికి ఆ చరిత్ర  విస్మ్రుత మయింది. అసలు విజయనగర చరిత్రనే ‘’విస్మృత సామ్రాజ్యం –‘’ఎ ఫర్గాటెన్  ఎంపైర్’’ అన్నారు కూడా

ఈనాటి ఆంధ్రులకు ఆంధ్రుల చరిత్ర  చాలామందికి తెలియదు .దీనితోబాటు మహాకావ్య సంప్రదాయమూ కూడా కనుమరుగైంది లేక అవుతోంది. తెలియక పోవటం రెండు విధాలు కావ్యస్వారస్యం.ఇది ఈనాటి పాఠకుడికి మృగ్యం .చదివే వాళ్ళు బహుకొద్దిమంది అవటం. వావిళ్ళవారు’’ హరివంశం ‘’రెండో సారి ముద్రించినపుడు పీఠిక లో శతావధాని వేలూరిశివరామ శాస్త్రిగారు’’రెండో సారి ఈ మహా కావ్యం 50 ఏళ్ళ తర్వాత ముద్రణమౌతోంది అంటే  ఏమనుకోవాలి ?’’ అని  బాధపడ్డారట .అంటే తెలుగువారిలో కావ్య రసాస్వాదన లోపిచింది అని భావం  .ఇదే బాధ ఈకవీ అనుభవించాడు  రాయకావ్యం లో –

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-18 –ఉయ్యూరు

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”మూడవ జలప్రళయం ”నా సమీక్ష రమ్య భారతి లో

”మూడవ జలప్రళయం ”నా సమీక్ష రమ్య భారతి లో

Posted in రచనలు | Tagged | Leave a comment

రమ్యభారతిలో శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారిపై నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -3

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -3

గోదా దేవిని ముందు స్తుతించాడు కవి .కాని ఆమె కన్నా ముందు తరంవాడు నమ్మాళ్వా  రున్నాడు .అయినా  గోదాదేవినే ముందు పేర్కొన్నాడు .కారణం పన్నిద్దరాళ్వా ర్లకుముద్దుల కూతురట ఆమె అందుకనిట.అంతే కాదు అ కల్ప వృక్షానికి చిటారు కొమ్మన పూచిన పూవట ఆమె .ఇతర ఆళ్వార్లు నిద్రపోతుంటే ,స్వామి వచ్చి తట్టిలేపితేనే వాళ్ళు లేచారట .కానీ గోదా దేవి తానే నిద్రించే స్వామిని లేపి ‘’స్వామీ !నేను వచ్చాను ‘’అన్న యోగ్యురాలట .అదీ ఆమె విశేషం .అందుకే ఆళ్వార్ కంటే ఈమెనే ముందు స్తుతించారు వృషాద్రిపతి కవి.ఆళ్వార్ల భక్తి  సంప్రదాయానికి ఈ తల్లి తత్వ దర్శనం ప్రసాదించటం మరో విశేషం  కూడా  ,యతీంద్రుల వారి స్తుతి చేసి ఆపేశారు కవి .అంటే గోదా స్తుతి తో ప్రారంభమైన ఆళ్వార్ల సంప్రదాయం భగవన్ రామానుజుల స్తుతి తో సమాప్తమైంది అని విశ్లేషించారు తుమ్మపూడివారు .ఇది ఔచిత్యవంత౦గా  ఉన్నదన్నమాట .పూర్వ కవులను స్తుతి౦చటమేకాడు ,వర్తమాన ,భవిష్యత్ కవులకూ  కుసుమాంజలి సమర్పించి గౌరవించారు విశాల హృదయుడైన ఈ కవి .

రాయాల్సిన కావ్యం మహా విస్త్రుతమైనది .కలంపట్టుకొంటే భావం రాక ,తగిన శబ్దం తట్టక గిజగిజలాడాడు కవి. ఇలాంటి అనుభవమే తిమ్మనకవికి పారిజాతాపహరణ కావ్యం లో జరిందని చెప్పారు విశ్లేషకులు .ప్రతిభ అంటే శబ్ద స్పురణం .భావానికీ సందర్భానికీ తగినట్లు శబ్దం తన౦తట తాను స్ఫురించాలేతప్ప ప్రయత్నం వలన సాధ్యమయ్యే పనికాదు అది .ఈ విషయం లో ‘’ధ్వన్యాలోకం ‘’కూడా –‘’తదర్ధ వస్తు నిష్య౦దమానా  మహితాం కవీనాం ఆలోక సామాన్య మభి వ్యనక్తి ‘’చెప్పినట్లు గుర్తు చేశారు వ్యాఖ్యాత .ఇదంతా దానికోసం తపన .ఇది అశక్తత కాదన్నారు .పదబ౦ధం ,సమాస సంపద ,భావాలు ,సన్నివేశ కల్పన,సరసత అన్నీ ప్రతిభతో జని౦చేవే అని పిండితార్ధం ,పండితార్ధం కూడా .’’ఇది యొక కావ్యమా ?పద బంధ గతి లేదటంచు మిక్కిలి ఈసడించు వాడొకడు ‘’అన్నకవి పద్యం ప్రభావతీ ప్రద్యుమ్నం లో ‘’శబ్ద సంస్కార మెచటను జారగ నీక ,పదమైత్రి  అర్ధ సంపదల బొంద ‘’పద్యాన్ని స్పురణకు తెస్తు౦దన్నారు వ్యాఖ్యాత .అసలు ప్రతి వర్తమాన కవి లోనూ ప్రాచీన కవి వాక్య భావ సంపద దోబూచులాడటం సహజం అన్నారు .పురాతన సంపద ఆధారం గానే వర్తమాన కవితా సౌధ నిర్మాణం జరుగుతుందన్న సత్యం చెప్పారు .కవివేరు, స్పురణ వేరు .అందుకే ‘’కవి +త్వం ‘’అన్నారు .కవి వేరు అతనికి తోడుగులాగా ఉన్న సమాజం లోని వ్యక్తి వేరు .ఇదంతా కవికి తెలుసా ?అంటే వాడికీ రహస్యం తెలియదనాలి అన్నారు  ఆచార్యశ్రీ .’’పిన్నటనాడే రాయ పృధివీ పతి వృత్తము వింటి భక్తి  సంపన్నత ‘’అనే పద్యం చూస్తే రాయలకథ చిన్ననాటి నుండే వింటూ కవి దానిలో ఊరిపోయాడని భావించాలి .’’పద్యాలనడ్డి ని దుడ్డు కర్రతో విరిచేస్తాను’’  అన్న కవి’’ నడ్డి విరిగి చతికిలబడటం’’ ,ఆయన నమ్మిన సిద్ధాంతం దుంప నాశనం అవటం ,ఆయనకాలం లోనే విచిత్ర  ఛందోమయ కావ్యాలే రావటం ,’’ఛందశ్శిల్పం ‘’వంటి అద్భుత సిద్ధాంత గ్రంథాలు రావటం జరిగిందని తుమ్మపూడివారు గుర్తు చేశారు ‘’మనిషినీ ,అతని ఊహా వైచిత్రినీ నువ్వు తయారు చేసుకున్న శోధన నాళిక (టెస్ట్ ట్యూబ్ ) లో బంధించలేవు.నువ్వు ప్రమాణం కాదు .అలాంటి సిద్ధాంతాలన్నీ పది లేక ఇరవై ఏళ్ళు తిరక్కుండానే గతించి పోవటం చరిత్ర చాటిన సత్యం ‘’’అని హెచ్చరించారు కూడా . ఈ కవి అందుకే ఇలా అన్నారు –

‘’కాలమొకే విధి సాగదు-వాలాయము మారుచుండు ప్రాతవి యెల్లన్

గ్రాలవు రోతగ గ్రొత్తవి –కాలేవు సమస్తములను ఘనతర శుభముల్ ‘’

‘’మన ఇష్టానిష్టము తో –జనదీ కాలము నెపుడు సాగును స్వేచ్చన్

తనమార్గము తనయదిగా –మనమద్దాని గ్రహించి మనుటొప్పారున్ ‘’.

‘’పద్య విద్య ‘’అనే మాట ఋషి కల్పుని పవిత్రమైన నోట బుట్టినది ‘’అని అందరూ గ్రహించాలి అని హితవు చెప్పారు .

ఈ కావ్యం లో కవి కుల ప్రసక్తి గురించి చర్చించి ,ఈ వింత జాడ్య౦ వలన ద్వేషాగ్ని విజ్రుంభించి   సమాజం చిన్నా భిన్నమౌతోందని ,కులం పోవాలి అని నినాదాలు చేస్తూనే దాన్ని రాజకీయనాయకులు పెంచి పోషిస్తున్నారనీ ,దాని ప్రసక్తి రాయల విషయం లో అప్రస్తుతం అని తేల్చారు కవి తాను రాసిన అర్ధవంతమైన పద్యాలలో –

‘’రాయలవారిదేకులమొ వ్రాయ మనంగ నికేమి చెప్పగా –ఆయన సర్వ మానవ  నుతార్హుడు నందు తెలుంగు జాతికిన్

మాయని మానికంబు ,జనమండలి వేడెద దక్షిణోర్వికిన్ –బాయక తెల్గు భాషకు నొనర్చిన మేలును జూడుటన్నిటన్’’అని వేడుకొన్నారు కవి .

‘’ఆయన పౌరుషంబు ,సమరాంగణ శౌర్యము ,కావ్య కల్పనా –మేయ విపశ్చితికిన్ బరిణ మించిన పాలన సత్కళాప్రియ

త్వాయత పోషణ౦బు,కవితాద్భుతపోషణ లెల్ల నొక్కటై-రాయలుగా జని౦చెనని రాజిత రీతి నివాళు లేత్తుడీ’’అంటూ కృష్ణరాయల మూర్తిమత్వాన్ని ఆవిష్కరించారు మొవ్వకవి.

కాక తీయ సామ్రాజ్యం విచ్చిన్నం కావటానికి కారణం రెడ్లూ,వెలమలు వేరుకావటమే అని చరిత్ర చెప్పిందీ ,ఈ కావ్యమూ అదేచేప్పింది .వీళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకొని ఉంటె అంతటి కాకతీయ సామ్రాజ్యం విచ్చిన్నమయ్యేది కాదు .పీఠిక లోనే కావ్యవస్తువును నిక్షిప్తం చేశారు కవి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-18 –ఉయ్యూరు

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రతిభా త్రిమూర్తుల పరిచయకార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -2(చివరిభాగం )

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -2(చివరిభాగం )

నిన్నటి వ్యాసం లో జరిగిన సభా కల్లోలం గూర్చి సవివరంగా రాశాను .ఇప్పుడు వక్తల అభిప్రాయ మాలిక ,నేను చెప్పదల్చుకున్నదీ కలిపి తెలియ జేస్తాను .దీనిలో సీమోల్లంఘనం జరిగి ఉండచ్చు .ఆమహానుభావుల వైదుష్య ఆవిష్కరణమే మనం చేస్తున్న ప్రయత్నం కనుక ఇబ్బంది ఉండదనుకొంటా .ఇందులో సింహభాగం రజని గారికే చెందటం సహజం .అక్కడి నుంచే ప్రారంభిస్తా .

1-      శ్రీ బాలాంత్రపు రజనీ కాంతారావు గారు

28-1- 1920 లో పిఠాపురం లో జన్మించిన రజనీ కాంతారావు గారి తండ్రిగారు ‘’వెంకట –పార్వతీశ కవులు ‘’అనే జంటకవులలో బాలాంత్రపు వెంకటరావు గారు .వీరి ‘’ఏకాంత సేవ ‘’మణిపూసలాంటి కావ్యం .రజని గారు 6 వ ఏటనే పాటరాసి స్వరం కూర్చి పాడిన ‘’చైల్డ్ ప్రాజెడి.’’ 16 వ ఏట అదే వ్యాసంగంగా బహు రచనలు చేసి ట్యూన్ కట్టి పాడి వినిపించేవారు అంటే అప్పటికే బాల వాగ్గేయకారులన్నమాట.ఏది విన్నా చూసినా మనసుకు పట్టించుకునే తత్త్వం ఉన్న.ఏకసంతాగ్రాహి.ఉత్తరభారత దేశ సంగీతం ,పాశ్చాత్య సంగీతం ,మ్మధ్య ప్రాచ్య అంటే మిడిలీస్ట్ సంగీతాలను ఔపోసనపట్టిన ఘనులు .1941లో మద్రాస్ ఆలిండియా రేడియో లో ఉద్యోగం లో చేరి అహమ్మదాబాద్ ,విజయవాడ ,బెంగళూర్ లలో స్టేషన్ డైరెక్టర్ గా చేశారు .మద్రాస్ ,బెజవాడలలో  వారు పనిచేసిన కాలం రేడియోకి శ్రోతలకు స్వర్ణయుగం .ఘంటసాల మాస్టారును రేడియోకి పరిచయం చేసింది రజని గారే .అందుకే మాస్టారి మాస్టర్ పీస్ ‘’భగవద్గీత ‘’ను ఘంటసాలగారు రజని గారి సువర్ణ హస్తాలతోనే ఆవిష్కరింప జేశారు.

రేడియోలో భక్తి రంజని ,ఉషశ్రీ గారి ధర్మసందేహాలు ,కార్మికుల కార్యక్రమం ,వనితావాణి మొదలైన కార్యక్రమాలకు ‘’సిగ్నేచర్ ట్యూన్ ‘’స్వరపరచింది రజని గారే .అన్నమయ్య కీర్తనలకు గొప్ప ప్రాధాన్యం కలిపించారు .సినీ దర్శకుడు మల్లీశ్వరి ఫేం శ్రీ బి యెన్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యం ఉండేది రజని గారికి .వారి స్వర్గ సీమ సినిమాలో పాడి ఘంటసాల  తెరంగేట్రం చేశారు .ప్రముఖ దర్శకుడు ఎల్వి ప్రసాద్ సినిమా ‘’గృహ ప్రవేశం ‘’కు రజని గారు- కథారచయిత, దర్శకుడు శ్రీ త్రిపుర నేని గోపీచంద్ తో కలిసి పని చేశారు .దీనికి ‘’నళినీకా౦తారావు ‘’అనే మారుపేరుతో పాటలు రాశారు .రజని గారి సోదరుడు నళినీ కాంతారావు కూడా గొప్ప రచయితయే .ఇందులో రజని రాసిన పాట’’మై డియర్ తులసమ్మత్తా’’హిట్ అయి ఆంద్ర దేశమంతా మారు మోగి ఆయనకు పెద్ద పేరు తెచ్చింది .ఇందులో పెండ్యాల నాగేశ్వరరావు రజనీ గారికి సహాయ సంగీత దర్శకుడు గా పని చేయటం విశేషం .బిఎన్ గారి ‘’రాజమకుటం ‘’చిత్రం లో ‘’ఊరేది ,పేరేది ఓ చందమామా ‘’పాటకూడా బహుళ ప్రజాదరణ పొందింది .

సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంగళం పల్లి బాలమురళీ కృష్ణ ,నాగయ్య ,రావు బాలసరస్వతి ,ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎస్ రాజేశ్వరరావు ,గళాలన్నీ రజని సంగీత సాహిత్యాలతో రంజిల్లినవే .రజని మార్గ దర్శకత్వం లో రేడియోలో షావుకారు జానకి గొంతు విని బి .యెన్ .ఆమెను విజయా సంస్థకు పరిచయంచేశారు .స్వర్గ సీమ సినిమాలో రజని చేత రెడ్డిగారు ‘’ఓహో పావురమా ‘’పాటరాయించి స్వర కల్పన చేయించారు .నాగయ్య గారి సంగీత దర్శకత్వం లో ఈ పాటను భానుమతి పాడి గొప్ప ప్రచారం తెచ్చింది .ఈ పాట శివాజీ గణశన్ కు చాలా ఇష్టమైన పాటగా జనం చెప్పుకుంటారు .శోభనాచలా వారి ‘’లక్ష్మమ్మకథ’’చిత్రానికి ‘’తారానాద్ ‘’పేరుతొ రజని పాటలు రాసి స్వరపరచారు ఇందులోని ‘’దిగుదిగునాగా ‘’,అటో ఇటో ఎటు పోవుటో,’’చిన్ననాటి స్వప్న సీమ ‘’పాటలు ప్రజలనాలుకలపై చాలాకాలం నర్తించాయి .ఆరోగ్యం బాగులేక రికార్డింగ్ ను ఘంటసాలకు అప్పగించారు రజని .కారణాలేవో తెలీదుకాని సంగీత దర్శకుడుగా ఘంటసాల పేరే వేశారు.

‘’రజని బాణీ అంటే లలిత సంగీత బాణీ ‘’అనేట్లు ఉండేది .పాట రాసి స్వరపరచి పాడేవారిని వాగ్గేయ కారులు అంటారని మనకు తెలుసు .అలాంటి సుప్రసిద్ధ వాగ్గేయకారులు రజనీ గారు .అంతేకాదు ఎంతో శ్రమించి ‘’వాగ్గేయ కార చరిత్ర ‘’రాసి ఋణం తీర్చుకున్నారు రజని .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం ఆయన 41 వ ఏటనే పొందటం మనమందరం గర్వించదగిన విషయం .సృజన పరాకాష్ట గా రజని నిలిచారు .అందుకే శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు రజనిగారిని ‘’పాటల పాదుషా ‘’అని అన్వర్ధంగా అన్నారు .రజనిగారి ఇతర రచనలలో  ప్రసిద్ధమైనవి –శతపత్ర సుందరి ,విశ్వ వీణ ,ఏకాంత సేవ , భావ తరంగిణి .రజనీ గారిలో గొప్ప పరిశోధకుడు ఉన్నాడు .ఆయన చూపు బహు సునిశితమైనది .త్యాగయ్యగారి పంచరత్న కృతి  ‘’గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర ‘’లో శరభోజీ మహారాజు లలో ‘’తులరాజు ‘’పేరును త్యాగయ్యగారు ధ్వనింప జేశాడని తన పరిశోధనలో వివరించారు .క్షేత్రయ్య పదాలను ఆంగ్లం లోకి అనువదించిన సవ్య సాచి రజని .ఆయన సంగీత వరుసలను ఎవరూ మార్చి పాడలేరు అని వింజమూరి సీతాదేవి అన్నట్లుగా ము౦జులూరి అన్నారు .ఆయన పాటలు శ్రోతలను స్వర లహరిలో విహరి౦చేట్లు చేస్తాయి.హైదరాబాద్ ను ‘’దక్షిణోత్తర మాధురీ సమ్మిళితశర్కరీ ఖండం ‘’అని అత్యంత కవితాత్మకంగా రుచి భరితంగా అనగల నేర్పరి రజని  .

అనేక కూచిపూడి యక్షగానాలను పరిష్కరించి రేడియోలో ప్రసారం చేయించారు రజని .కొత్త నృత్య రూపకాలు రచించి నర్తకులకు కొంగు బంగారమే అయ్యారు .’’కొలువైతివా రంగశాయి ‘’అనే’’ దరువు’’ ఆయన స్వకపోలకల్పిత సృజనయేఅన్నారు కృష్ణకుమారి .ఆయన కూర్చిన రూపకాలలో ‘’ఆదికావ్యావతరణం ‘’,కామదహనం ‘’,విశ్వయానం ‘’జాతీయస్థాయిలో సృజనకు గొప్పపేరు తెచ్చిపెట్టాయి .వీనిలో జంత్ర వాద్య సమ్మేళనం జర్మనీ సంగీతకారులు మోజార్ట్ ,సి౦ఫనీ మాంత్రికుడు బీథోవెన్ లను గుర్తుకు తెస్తాయి .సంగీతం రక్తి కట్టించటం లో వీటి పాత్ర ఏమిటో తెలియబరచారు రజని .

నిత్య ప్రయోగ శీలి రజని .ఢిల్లీ మద్రాస్ ఆకాశ వాణి  సంగీత బృందాలను కలిపి ‘’ఆంద్ర కల్యాణి ‘’అనే అపురూప పరిశోధనాత్మక కృషి చేశారు .’’కొండ నుంచి కడలి ‘’దాకా సంగీత రూపకం లో శ్రీనాథ ,విశ్వనాథ ,బాపిరాజు, రామదాసు ల పద్యాలు, పాటలు చేర్చి స్వర విన్యాస మాలికగా కూర్చారని ము౦జులూరి అంటారు .

1937-43 లో ‘’పూషా ‘’పేరుతొ అబ్బురపరచే కవితలు రాశారు .వీటిని అబ్బూరి ట్రస్ట్ వారు ‘’ఏటికి ఎదురీత ‘’పేరుతో 1999లో ప్రచురించారు .ఇవన్నీ ఆనాటి వచనకవితకు కొత్తదారి చూపించినవే .’’ఇవి ఒక అనివార్యమైన ఫేజ్ ‘’అన్నారు ఆవంత్స సోమసుందర్.బాలలకోసం ఎన్నో పాటలు రాసి స్వరపరచి పాడి రికార్డ్ చేసి వాళ్లకు అందుబాటులో కి కేసేట్స్ ,సీడీ లుగా తెచ్చారు .’’జేజిమామయ్య ‘’పేరుతో బాలగీతాలెన్నో రాశారు .1978 లో రిటైర్ అయ్యారు రజని .తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కు నాలుగేళ్ళపాటు స్పెషల్ ఆఫీసర్ గా పని చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .రజని చేసిన అత్యద్భుత సాహసం ఎక్కడో అరుణాచలం లో ముక్కు మూసుకుని ఏకాంతంగా గడుపుతున్న సంచలన రచయిత’’చలం ‘’గారిని శ్రీ శ్రీ తో ఇంటర్వ్యు చేయించి ప్రసారం చేయటం.ఇదొక్కటే చలం పై రేడియో ట్రాక్ గా మిగిలి ఉంది అంటారు కృష్ణకుమారి .’’సారంగదేవ’’పేరుతో రజని ఎందరో కవుల జీవితాలను పరిచయం చేసి వెలుగులోకి తెచ్చారు .

‘’మాదీస్వతంత్ర దేశం మాదీస్వతంత్రజాతి ‘’గేయం రాసిస్వరపరచి టంగుటూరి సూర్యకుమారి గారితో బహుకమ్మగా పాడించి చిరకీర్తి సాధించి పెట్టారు  జాతికీ, ఆయనకు ,సూర్యకుమారి గారికీ.రజని చేసిన మరో గోప్పప్రయోగం 1947 ఆగస్ట్ 15 నాడు ఎర్రకోటపై ప్రధమ ప్రధాని నెహ్రు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగం పూర్తి  చేయగానే రజని గారు ‘’మోగింది జయభేరి ‘’గీతాన్ని రాసి స్వరపరచి సూర్యకుమారిగారి చేత పాడించి అవ్యవధానంగా ప్రసారం చేయించారు .ఇదొక మైలురాయిగా నిలిచింది .19 56 లో ఆయన ప్రసిద్ధమైన సూర్య స్తుతి ‘’శ్రీ సూర్య నారాయణా మేలుకో –హరి సూర్యనారాయణా మేలుకో ‘’రచించి పాడి ప్రసారం చేశారు .ఘంటసాల భగవద్గీత లాగా ఈ పాట ఆదివారం స్పెషల్ గా వీనుల వి౦దు చేస్తోంది తెలుగు లోగిళ్ళలో .ఉదయభానుని క్రమవికాసం అప్పుడు పొందిన రంగులకు  తెలుగుసోబగులుఅద్ది నభూతో అనిపించారు ఆభావుకతకు ఆ నిశిత పరిశీలకు జోహార్లు .విశ్వనాథ ఆవహించాడేమోనని పిస్తుంది  అంతకంటే కావాల్సినదేముంది ?ఒక్కమాటలో చెప్పాలంటే ‘’నడిచే పాట రజని ‘’.

శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు

గుంటూరు జిల్లాలో1938లో జన్మించి  విజయవాడ లో చదివి విశ్వనాధ అంతేవాసియై  లయోలాలో ఆంధ్రోపన్యాసుకులుగా నలభై ఏళ్ళు సేవలందించారు శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు .దాదాపు 200 కథానికలురాశారు . ఒకరకంగా ‘’కృష్ణా జిల్లా సాహిత్య కెరటం ‘’ఆయన .సామాన్యుడికి కూడా అందుబాటులోఉండేట్లు రాయాలన్న  తపన ఉన్నవారు .ఎంత ఎత్తుకు ఎదిగినావొదిగి ఉందాలి అన్న  అసాధారణ వ్యక్తిత్వం ఆయనది .తెలుగు భాషాతత్వంమూర్తీభవించిన పండితరూపం అంటారు ఆయనను .సాహిత్య అకాడెమీ తోపాటు ఎన్నో పురస్కారాలు పొందిన శేముషీ మూర్ధన్యుడాయన .ఆయన విశ్వనాధ శిష్యుడే అయినా శ్రీ కెవి రమణారెడ్డి గారి ప్రభావతం తో లెఫ్ట్ వైపు ఒరిగారు .నిత్య జీవితం లోని సంఘటనకు స్పందించి రాసినవే ఆయన కథలన్నీ.అందుకే మట్టి గుబాళింపు ఉంటుంది .12 నవలలు  రాసిన మహా రచయిత పెద్దిభొట్ల .ఈ నవలలపై శ్రీ గుమ్మా సాంబశివరావు గారు పరిశోధన చేసి డాక్టరేట్ పొందినట్లు నాకు డా పూర్ణచంద్ తెలియ జేశారు .రచనలలో మానవత్వం ప్రతిబి౦బి౦చాలని ,నైతిక విలువలకు స్థానం ఉండాలని కోరుకున్న పిచ్చమహారాజు.ఎప్పుడూ ని౦డా నీళ్ళని చూడని వాడు కృష్ణానది వరదను చూసి తనివితీరా ఆనందం అనుభవించి ,ఆ నీళ్ళలో  మునిగి చనిపోవటం గా ‘’నీళ్ళు ‘’కథ రాశారు అని చెప్పారు శ్రీ చంద్ర శేఖరరావు .పెద్దిభోట్లవారి స్వంత గొంతుకతో కధలను చదివించి ,రికార్డ్ చేసి  అపురూపంగా భద్రంగా దాచుకొని ఇక్కడ వీలు ఐతే వారి స్వరం వినిపిద్దామని తెచ్చారు కూడా .ఆ అవకాశం నిన్న దక్కకపోవటం మన దురదృష్టం . .ఇంగువ ఎలా వస్తుంది అనే సందేహం తో జీవితాంతం గడిపిన ఒక సందేహి చనిపోయేముందు స్నేహితుడు వస్తే వాడిని కుశల ప్రశ్నలు అడగకుండా ‘’ఇంగువ ఎలా చేస్తారు ‘’అని ప్రశ్నించటం లో చచ్చేదాకా మనిషిలో ‘’ఇంక్విజిటివ్  నేచర్ ‘’ఉండాలి అనే నీతి ఉంది అన్నారు పూర్ణచంద్ .సినిమా చూడాలని మనవడితో ఒకముసలమ్మ పాత దియేటర్ కు వస్తుంది .విశ్రాంతి తర్వాత వచ్చే సన్నివేశం కోసం ఆమె ఆతురతగా ఎదురు చూసింది .తీరా ఆ సన్నివేశం వచ్చే సమయానికి ప్రింట్ నలిగిపోయి మసగబారి కనిపించలేదు .ఉసూరుమన్నది ఆమె ప్రాణం .ఆసన్నివేశం లో ఆమె భర్త ఒక చిన్న వేషం వేశాడు .భర్త చనిపోయి చాలాకాలమైంది తెరమీదనైనా చూసి ఆనందించాలని అనుకున్న ఆమె ఆశ భగ్నమైంది .ఈ మానవ సంబంధాన్నే తీసుకుని ‘’ముసురు ‘’కథ రాశారు సుబ్బరామయ్యగారు అని నేను ‘’కృష్ణా తీరంలో సాహితీ కెరటం ‘’లో ఆయన గురించి రాశాను.

పెద్దిభొట్లవారిని’’ వర్షించే మేఘం ‘’  అన్నారు ప్రముఖ కధారచయిత మధురాంతకం రాజారాం  గారి తండ్రికి తగ్గ తనయుడు శ్రీ మధురాంతకం నరేంద్ర .అంతేకాదు ఆయనను ‘’ఆధునిక భవభూతి’’గా కూడా అభివర్ణించారాయన .యదార్ధం అని ఆయన కధలు చదివితే తెలుస్తుంది .పతనమై పోతున్న సమాజ విలువలకు ,తెగి పోతున్న మానవ సంబంధాలకు ఆయన తీవ్రంగా కలత చెందారు .పేద పిల్లలలోని ప్రతిభను ప్రోత్సహించలేని పెద్దల వ్యవస్థపై ఆయన నిప్పులు చెరిగారు .క్రీడలు నేపధ్యంగాఆయన రాసిన కథలు ఆణిముత్యాలే .ఆలోచి౦ప జేసేవే  .అలాంటి అరుదైన మానవీయ మూర్తి పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు .తనపుట్టినరోజున ప్రముఖ కథా రచయితను ఎంపిక చేసి సన్మానించిన ఉదాత్త చరితులాయన .అలాంటి అరుదైన సందర్భ౦గానే నేను 20 16 లో బొడ్డపాటి ఆహ్వానం పై వెళ్లి వారికి శాలువాకప్పి సాహితీ ఋణం తీర్చుకున్నాను .అదే చివరి సారి చూడటం .

శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి

తెలుగు సినిమాలకు బెంగాలీ నవలలే దిక్కు గా ఉన్న సమయం లో ఆంద్ర దేశం గొడ్డుపోలేదని సమర్ధులైన మహిళా రచయితలున్నారని రుజువు చేసిన నవ నవలా సామ్రాజ్ఞి శ్రీ మతి యద్దన పూడి సులోచనా రాణి .కృష్ణా జిల్లా కాజలో 2-4-19 40 జన్మించి  హైదరాబాద్ లో స్థిరపడి నవలలు పుంఖాను పుంఖంగా రాశారు .దాదాపు నవలన్నీ సినిమాలుగా వచ్చి గొప్ప ట్రెండ్ నే సృస్టించాయి.కనకవర్షం కురిపించాయి. నట నటీమణులకు దర్శక సంగీత దర్శకులకు, నిర్మాతలకు అప్పుడు స్వర్ణయుగమే .ఆమె రాసిందల్లా అచ్చై బంగారమై  ఆంద్ర దేశం అంతా సంచలనం సృష్టించింది .  అడిగి,ప్రాదేయపడీ రాయించుకొనే స్థితి ఆమె కల్పిచింది .అదొక నవ కెరటం ఉద్ధృతంగా ,ఉవ్వెత్తుగా ఎగసిపడింది. అప్రతిభులను చేసింది మహా మహా మగ రచయితలను .దాసోహం అనిపించాయి ఆ నవలలు . సెక్రటరి ,మీనా,జీవన తరంగాలు ఒక ఊపు ఊపేశాయి. ఎక్కడవిన్నా వాటి గురించి చర్చోపచర్చలే ఆనాడు .అందుకే తిలక్ ‘’నవలలు డూప్లికేట్లు క్వాడ్రూప్లికేట్లు రాసి పారేస్తున్నారు ‘’అన్నాడేమో ?సినీ రంగం లో ట్రెండ్ సెట్టర్ గా నిలబడింది సులోచన .

ఏమైనా సులోచనా రాణి ఒక సంచలనమే సృష్టించింది .రీడబిలిటిపెంచింది మధ్యతరగతి మహిళలలో .ఆ తరగతి స్త్రీ అస్వతంత్రురాలుకాదని తబలా వాయించటానికి అబల కాదనీ సమర్ధురాలని ఆమెకూ చీమూ నెత్తురూ ఉన్నాయని ,అవకాశం వస్తే సత్తా చాటి చెప్పగలదని ఆమె నవలలోని పాత్రలు నిరూపించాయి .దీనితో వారిలో కొత్త చైతన్యం తొణికిసలాడింది  .చైతన్యం పెల్లుబికింది .మహిళా వ్యక్తిత్వానికి సి౦హాసనమే వేసింది సులోచనా రాణి .ఇంతకంటే మహిళాభ్యుదయం ఎక్కడుంటుంది ?.స్లోగన్లు పరిష్కారం కాదు కార్యాచరణ ముఖ్యం అని తెలియ జెప్పింది. ఒకరకంగా ఆమె’’ సైలెంట్ విప్లవమే ‘’తెచ్చింది .ఇదికాదనరాని సత్యం .ఆనవలలలోని నాయకులు వంటి వారు తమకు జీవిత భాగస్వామి కావాలని యువతులు ఆశపడ్డారు .

అప్పటిదాకా స్త్రీ బాహ్య సౌందర్యాన్ని మాత్రమె వర్ణించే నవలలు వచ్చాయి వీటికి భిన్నంగా ఆమె వాళ్ల అంతరంగాలను  ఆవిష్కరించే  నవలలు రాసి ట్రెండ్ సృష్టించారు .నవలలోని నవలలు అంటే స్త్రీమూర్తులు ‘’మకుటంలేని మహా రాణులు’’గా ఉండటం ఆమె తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ .ఇటీవల  త్రివిక్రం ,నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘’అ ఆ ‘’సినిమాకు కథ ఆమె దే అవటం ఆమె కాలం కంటే  వెనుకబడి లేదు అని తెలియ జేస్తుంది .జీవన పోరాటం నేర్పింది ఆమె .మహిళ స్వయం సిద్ధ కావాలని చెప్పింది తనను తాను తీర్చి దిద్దుకొని ,కుటుంబాన్నీ సమాజాన్నీ తీర్చి దిద్దుకోవాలని హితవు చెప్పింది .వెనకడుగు వేస్తె శాశ్వతంగా వెనకబడి పోతారని మహిళలను హెచ్చరించింది .మానవ సంబంధ ఇతి వృత్తాలుగా ఆమె  రాసిన  70 కి పైగా నవలలు ఆడవాళ్ళకు స్పూర్తి నిచ్చాయి .ప్రేరణ కలిగించాయి పథ నిర్దేశం చేశాయి  .తెలుగువారి ఆరాధ్య రచయితగా నవనవలా సామ్రాజ్ఞి గా శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి స్థానం శాశ్వతం’

ముక్తాయింపు –ఇంత చిరకీర్తినార్జించిన ఈ ప్రతిభా త్రిమూర్తులకు ప్రభుత్వం పద్మశ్రీ లైనా కనీసం ఇవ్వకపోవటం విడ్డూరం .

. సరిగమలు –జూన్ మొదటి వారం లోనే కాలేజీకి వెళ్లి నేనూ శ్రీగంగాధరరావు గారు  రెడ్డితో కలిసి ప్రిన్సిపాల్ గారికి చెప్పి  శ్రీ శ్రీనివాస్ సహకారంతో నిన్నటి కార్యక్రమం ఫిక్స్ చేశాం. వారానికి కనీసం రెండుసార్లు అయినా రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొంటూ బానర్ మీద రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి ల చిత్రాలు వచ్చేట్లు చూడమని ,మాతెలుగు తల్లి పాట పాడే విద్యార్ధినులను చూడమని చెబుతూనే ఉన్నా సరే అంటున్నాడు ఆతను .తీరా నిన్న వెళ్ళే సరికి బానర్ పై త్రిమూర్తులు ఫోటోలులేవు. అసహనంగా ఇది బాగాలేదు అని చెప్పి ‘’కంపు లాబ్ ‘’కు వెళ్లి ఫోటోలు డౌన్ లోడ్ చేసి తెచ్చి అతికించమని చెబితే కాని ఆపని జరగలేదు .ప్రెస్ వాళ్లకు ఇన్విటేషన్స్ ప్రింటౌట్ తీసి పంపమనీ ముందు నుంచి చెబుతూనే ఉన్నాను . .ఇవాళ ఆంద్ర జ్యోతి విలేకరి శ్రీ గోపాలస్వామి కనిపించి ‘’సార్!అంతపెద్దకార్యక్రమం జరిపి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారేమిటి “’?అని అడిగేదాకా  వాళ్లకు కాలేజీ వాళ్ళు సమాచారం అందించలేదని అర్ధమైంది .ఇవాళ పొద్దున్న శ్రీమతి  ముంజులూరి  కృష్ణ కుమారిగారు నిన్నటి నా మెయిల్ కు ఇచ్చిన జవాబు లో ‘’ thanks for ur initiative but to wrong audience.’’అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.

సరసభారతి టెక్నికల్ సలహాదారు శ్రీ వీరమాచనేని గంగాధరరావు గారు నిన్న చేసిన సేవలు మరువలేనివి .మాటలతో ,ధన్యవాదాలతో ఋణం తీర్చుకోలేనివి .మాజీ హిస్టరీ లెక్చరర్ శ్రీ నారాయణ మూర్తిగారు కార్యక్రమ భాగస్వామ్యం లో లేని లోపం బాగా కనిపించింది

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1

సరసభారతి 126 వ కార్యక్రమంగా ప్రతిభా త్రిమూర్తులైన ప్రముఖ వాగ్గేయకారులు ,ఆలిండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు ,ప్రఖ్యాత కధారచయిత ,లయోలాకాలేజి రిటైర్డ్ తెలుగు ఉపన్యాసకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత   శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య ,నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులొచనారాణి గార్లపై డిగ్రీ విద్యార్ధులకు అవగాహన సదస్సు స్థానిక ఏజీ అండ్ ఎస్ జి డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో ,ఆకాలేజి తెలుగు శాఖతో సంయుక్తంగా 30-6-18 శనివారంమధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాం .సదస్సుకు విచ్చేసిన అతిధులను తెలుగు లెక్చరర్ శ్రీ గుంటక వేణుగోపాల రెడ్డి స్వాగతం పలికి  వేదికపైకి విద్యార్దులిచ్చిన పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు .మా తెలుగు తల్లిగీతాన్ని పాడే విద్యార్ధులు లేకపోవటం తో  రికార్డెడ్ గీతం వినిపించారు .నాఅధ్యక్షత న జరిగిన సభ లో వక్తలు చక్కని స్పూర్తి దాయకమైన ప్రసంగాలు చేశారు .విద్యార్ధులు మొదట్లో కొంచెం అసహనం గా ఉన్నా క్రమేపీ బాగా శ్రద్ధ చూపారు .మధ్యాహ్నం ౩ గంటలకు షార్లెట్ సరసభారతి (అమెరికా ) సౌజన్యం తో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధినికి 2 వేల రూపాయలు  జిల్లాపరిషత్ హై స్కూల్ పదవతరగతి విద్యార్ధులకు నలుగురికి ,వి ఆర్ కే ఏం హైస్కూల్ పదవతరగతి విద్యార్ధి కి ,ఎనిమిదవ తరగతి విద్యార్ధినికి ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 8 వేలరూపాయలు నేనూ అతిధులు అందజేశాం విద్యార్ధులు స్కూల్ ఉండటం వలన రాలేకపోతే లెక్కలమాస్టారు శ్రీ త్రినాద్ ద్వారా అందించాం .ఇందులో నలుగురు బాలికలు ,అందులో ఒక ముస్లిం విద్యార్ధిని ఉండటం విశేషం .ముగ్గురు బాలురున్నారు .జడ్. పి .లెక్కలమేస్టారు  శ్రీ త్రినాద్,   ఆర్కేయం సైన్స్ టీచర్ శ్రీ రామనాధ బాబు విద్యార్ధుల ఎంపికను నిష్పక్ష పాత౦గా  బీదరికం ప్రాతిపదికగా ,తలిదండ్రులు లేకపోవటం పైనా దృష్టి పెట్టి ఎంపిక చేసి నాకు లిస్టు ఇచ్చారు .ఆ ఇద్దరికీ ధన్యవాదాలు .నగదు బహుమతి తోపాటు సరసభారతి కవితా సంకలనం  ‘’వసుధైక కుటుంబం ‘’కూడా అందించాం .

గౌరవ అతిధిగా ,సమన్వయ కర్తగా విచ్చేసిన కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధానకార్య దర్శి ,116 గ్రందాల రచయిత,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,మహా వక్త శ్రీ పూర్ణచంద్ తమ  శ్రీమతి తో కలిసి రావటం వారికి ఈ సదస్సుపై ,సరసభారతి పై ఉన్న అనుబంధం తెలియ జేస్తుంది .రజని గారి బహుముఖీన ప్రతిభను తెలియబరచటానికి  విచ్చేసిన విజయవాడ రేడియో కేంద్రం మాజీ డైరెక్టర్ శ్రీమతి ము౦జు లూరి క్రిష్ణకుమారిగారు విజయవాడ నుంచి బస్సులో రావటం నాకు చాలాఆశ్చర్యమేసింది .వారికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ?ఆ సౌజన్యం అలాంటిది .పెద్దిభొట్ల వారి కథా విశేషాలపై మాట్లాడటానికి వచ్చిన ప్రసిద్ధ సాహితీవేత్త ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,సెలవు పెట్టి రావటం ,ఇవాళ శనివారం కనుక ఉపవాసం ఉండి మరీ రావటం ,మా ఇంట్లో టిఫిన్ పెడతామన్నా ఒద్దని  టీ మాత్రమే త్రాగి నాతో సభకు రావటం ఆయన నిబద్ధతకు నిదర్శనం  నాపై అభిమానం .యద్దనపూడి నవలలలో స్త్రీల వ్యక్తిత్వం పై ప్రసంగం చేయటానికి వచ్చిన శ్రీమతి గుడిపూడి రాధికా రాణి  టీచర్ కావటం వలన సెలవు పెట్టి బందరు నుంచి రావటం నేను ఆమెను’’యువసాహితీ కెరటం’’  అనటం లో యదార్ధం గోచరమైంది .తెలుగు లెక్చరర్ శ్రీ శ్రీనివాస్ ,సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ఆఫీస్ కు మధ్యాహ్నం సెలవు పెట్టి భర్త శ్రీ శ్రీనివాసశర్మ, కుమార్తె కుమారి బిందు దత్తశ్రీ తో నిండుగా పాల్గొనటం ఆమెసాహితీ  సేవా తత్పరత తెలుస్తుంది .ఇందరు ఇన్నిరకాలుగా సహకారం అందించటం వలననే సభ విజయవంతమైంది. రావలసిన రజని గారి కోడలు శ్రీమతి ప్రసూన ,పెద్దిభొట్లవారి శ్రీమతి శ్రీమతి గీతారాణి రాలేక పోయారు .ఆ వెలితి ఎలానూ ఉన్నది . ఈసభలో ప్రసంగించిన వారంతా ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ననుసరించి ,సమయం విలువ గ్రహించి విద్యార్ధుల స్థాయికి దిగి ప్రసంగించి ఆకట్టుకున్నారు .వారి అమూల్య భావాలను , నేను చెప్పదలచుకున్న వాటినీ కలిపి మీకు అందిస్తున్నాను .రెండుగంటల సేపు జరిగిన సభ సాయంత్రం 4 గంటలకే ‘’ ఇక్కడే మరో సభ ఉంది అని’’ రెడ్డి నాచెవిలో ఊదటం ‘’వలన  అసంతృప్తిగా ముగించటం వక్తలకు తీవ్ర ఆశాభంగం కలిగింది .మన్నించ మని వేడుకొంటున్నాను . వారు మాట్లాడాల్సిన సమయాన్ని కబ్జాచేయాల్సివచ్చింది అయిష్టంగానే .దీనికి తోడు మొదట్లో విద్యార్ధులు చాలా గోల గా ఉండటం తో మా సహనం దెబ్బతి౦ది కూడా .మనసులు వికలంయ్యాయి ..ఒక లేడీ టీచర్ బహుశా శ్రీమతి రమాదేవి అనుకుంటా హైస్కూల్లో నా శిష్యురాలు శ్రీమతి శివలక్ష్మి  కొంచెం శ్రద్ధ తీసుకుని విద్యార్ధులను కంట్రోల్ చేశారు  .లేకపోతె కాలేజీ పరువు ,మా పరువు గోవిందా అయ్యేది .ఇదంతా చూసి శ్రీ పూర్ణచంద్ ఏ మాత్రం మొహమాట పడకుండా విద్యార్ధుల క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎండగట్టారు .డిగ్రీ తీసుకుంటే చాలదు మర్యాదా ,పద్ధతీ నేర్చుకోకపోతే చదువు నిరర్ధకం .ముగ్గురు ప్రతిభామూర్తులమీద మాట్లాడటానికి వారిని కాచి వడబోసిన ముగ్గురు సుప్రసిద్ధులు వారిపై అవగాహన కలిపించటానికి ఎంతో శ్రమపడి వస్తే ఇదామీరు చూపే మర్యాద ?ఇది ఏమాత్రం క్ష౦తవ్య౦ కాదు.మీ ప్రవర్తనతో మేము తలవంచుకోవాల్సివచ్చింది .అని చాలాతీవ్రంగా దులిపేశారు .సభ సమాప్తం చేయటానికి ముందు నేను కూడా అంతకంటే తీవ్ర స్వరం తో ‘’ఇక్కడ మేము కనీసం ఎనిమిది సభలు జరిపాం .ఏ సభలోనూ మాకు ఇలాంటి సంఘటన జరగలేదు. మాహృదయాలు గాయపడలేదు .ఎంతో డిసిప్లిన్  గావిద్యార్ధులు వ్యవహరించారు .వారికి పోటీలు పెట్టి బహుమతులిచ్చాం. చక్కగా పాటలు కూడా పాడారు .రెండు పుస్తకాలు ఇక్కడ  ఆవిష్కరించాం .రెండుసార్లూ  వందేసి పుస్తకాలు మీ లైబ్రరీకి ఇచ్చాం .ఒక సభ ఉదయం నుండి సాయంత్రం వరకు జరిపాం .అప్పుడు వచ్చిన సహకారం, పిల్లలు చూపిన మర్యాదా , మన్ననా మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి .అప్పటి విద్యార్ధుల వినయానికి ,డిసిప్లిన్ కు మేము ముగ్దులమయ్యాం .ఆ సభల్లో పూర్ణచంద్ గారున్నారు అప్పుడెప్పుడూ రాని ఆవేశం ,ఆవేదనా ఇప్పుడు ఈ సభలో ఆయనకు వచ్చాయంటే ఆయన మనసు ఎంత బాధ పడిందో గ్రహించండి .మీ తప్పులు మీకు తెలియ జెప్పకపోతే మేమూ అందరి వాళ్ళలాగే అవుతాం .అందుకే ఇంతగా మేమిద్దరం చెప్పాం .మీప్రవర్తనకు సిగ్గు పడండి . ముందుగా మేడం కృష్ణకుమారి గారికి అంతా లేచినిలబడి ‘’సారీ ‘’చెప్పండి .’’అన్నాను .వారి లోమార్పు వచ్చి అందరూ లేచినిలబడి సారీ చెప్పారు .మళ్ళీ ఇలా ఎప్పుడూ చేయం అని అన్నారు .అందరం సంతోషించాం .సభ పూర్తి అయి బయటకొస్తుండగా  తెలుగు లెక్చరర్స్ శ్రీనివాస్ ,వేణులు నాదగ్గరకొచ్చి ‘’మాస్టారూ ! మీరూ పూర్ణచంద్ గారు చాలాబాగా గడ్డిపెట్టారు .ఇలా చెప్పక పొతే వాళ్లకు తెలియనే తెలియదు , తెలుసుకోలేరు ‘’అన్నారు .సంతోషించాను .తర్వాత కొoతమంది ఆడపిల్లలు నాదగ్గరకొచ్చి’’సారీ సార్ !మేము చాలా బాడ్ గా బిహేవ్ చేశాం .క్షమించండి .’’అని ప్రాధేయ పడ్డారు .నేను ‘’అమ్మా ! మీలో ఏ నలుగురైదుగురో  అల్లరి చేయటం వలన మీ అందర్నీ అనాల్సి వచ్చింది .వచ్చిన గెస్ట్ లను గౌరవించటం నేర్చుకోకపోతే చదువుకు అర్ధం ఉండదు .డోంట్ రిపీట్ హియరాఫ్టర్’’అని చెప్పి అనునయించాను .ఇలా వారిలో గుణాత్మక మార్పు వచ్చినందుకు అందరం హేపీ .మాకూ ఈ అనుభవం కొత్తదే .

ముక్తాయింపు –మధ్యాహ్నం పన్నెండు గంటలకు చెన్నై నుంచి 70 ఏళ్ళ ముసలాయన ఫోన్ చేసి ‘’సార్!ముగ్గురు ప్రతిభా మూర్తులపై అవగాహన సదస్సు పెట్టాలని మీకు ఆలోచన కలగటం ,దాన్ని సార్ధకం చేయటానికి అంతటి లబ్ధ ప్రతిస్టులను  ఆహ్వాని౦చటం నాకు ఆశ్చర్యం కలిగించింది .ఫేస్ బుక్ లో మీ ఆహ్వానం  చూసి ఫోన్ చేశాను .సభ జయప్రదం కావాలని కోరుతున్నాను’’అన్నారు పెద్దమనసుతో .ఉప్పొంగిపోయాను ఇంతగొప్ప అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందుకు .కాని మా ఆశలపై నీళ్ళు చల్లారు అక్కడ . అందుకనే ఈబాధ .ఇది అందరికీ తెలియాలనే ఇంత వివరంగా రాశాను .అర్ధం చేసుకోగలరు .ఎవరి హృదయాలైనా గాయపడితే బాధ్యుడను నేనే కనుక నన్ను మన్నించ ప్రార్ధన అని అతిధులకు సవినయంగామనవి చేసుకొంటూ ,సభలో వక్తలు అందించిన విశేషాల వివరాలు మరో ఆర్టికల్ లో తెలియ జేస్తానని చెబుతున్నాను . .   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-18 –ఉయ్యూరు

,

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

“సరసభారతి126వ సమావేశంగా ప్రతిభా త్రిమూర్తులు రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి లపై డిగ్రీ విద్యార్ధులకు సరసభారతి ,స్థానిక ఏ జి అండ్ ఎస్ జి దిగ్రీకలాశాల తెలుగు శాఖ సంయుక్తంగా30-6-18 శనివారంమధ్యాహ్నం నిర్వహించిన అవగాహన సదస్సు

“సరసభారతి126వ సమావేశంగా ప్రతిభా త్రిమూర్తులు రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి లపై డిగ్రీ విద్యార్ధులకు సరసభారతి ,స్థానిక ఏ జి అండ్ ఎస్ జి దిగ్రీకలాశాల తెలుగు శాఖ సంయుక్తంగా30-6-18 శనివారంమధ్యాహ్నం నిర్వహించిన అవగాహన సదస్సు

https://photos.google.com/share/AF1QipPDi5aM7H5GDQuJnw6dpAbDS7aqDz28ODTiawLHaNlc3fAni2NWWvPoidh2mXJWjg?key=UDJXTF9yMTNhcG96YXVUT1dUUlB2TDJILVNTUFl3

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2

‘సాహితీ వాచస్పతి’’ ,’’ఉపన్యాస చతురానన’’ డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి రాయ ప్రబంధం లో తొమ్మిది ఖండాలలో నేటి దుస్థితి తోబాటు ,ఆనాటి ఉత్కృష్ట స్థితీ వర్ణించారు .వీరి పద్య వ్యధ కళాతపస్వి విశ్వనాథ్ తనదైన శైలిలో తీసిన శంకరాభరణం ,స్వర్ణకమలం ,వంటి చిత్రాలలో భక్తీ , రక్తి ,భుక్తి నిచ్చే భారతీయ దివ్య  కళామూర్తులు ,నాట్యం ,సంగీతం వంటి మహోన్నత విద్యలకు నేటి కాలం లో పట్టిన దుర్గతి ,వ్యతిరేక సంవిదానకం అంటే కాంట్రాస్ట్ ద్వారా చూపించిన రీతి మనకు తెలుసు .అదే దృష్టితో మొవ్వవారి వ్యధను కూడా చూడాలి కూచి పూడినాట్య౦  లాంటి తెలుగు భాషా మాధుర్యం గా౦భీర్యాదులున్నపద్యం తెలుగు సరస్వతికి కిరీటం అంటారు డా తుమ్మపూడి వారు –

‘’తెలుగుకు ప్రాణము పద్యము –వెలదికి ప్రాణమ్ము శీల వినయాదికముల్

చెలమకు ప్రాణము నీరము – పొలముల ప్రాణమ్ము సస్య సంపూర్ణత్వంబుల్’’

మరి దీనికి వైముఖ్యం చూపించటానికి కారణం ఏమిటి ?అనుభవించే హృదయం లోపించటమే అని తేల్చారు .మహాకావ్య సంప్రదాయం కనుమరుగు అవటం బాధాకరమే అన్నారు తుమ్మపూడి .తిక్కన్న గారి భాషలో రాజరికపు ఠీవి ఉంటె ,రాయల భాషలాగా ,ఎర్రన హరివంశం లోని అమాయక పల్లెటూరి తెలుగు తీపి కనిపిస్తుంది .దీనికి వ్రేపల్లెలో యాదవుల వర్ణన హరి వంశం లో కనిపిస్తుంది .అందుకే ఈ కవి ‘’గ్రామీణ ప్రజాలు  మాటలాడు కొను వాగ్వరాశిలో’’ ,అని , ‘’పల్లెను వీడి వచ్చి పలువర్షములైనది ‘’లోను ‘’వారక ఆంగ్ల తెల్గు పదబంధము లేర్పడి సంకరంపు ‘’అని బాధ పడ్డాడు .గ్రామీణ భాషా మాదుర్యమంతా వాడి హృదయ నైర్మల్య వ్యక్తీకరణమే .ఇదిపోవటం యాంత్రిక మానవ సమాజావిర్భావం .విశ్వనాథ వేయిపడగలు లో ధర్మారావు ‘’మానవ సమాజం పోయి ,దానవ సమాజం వచ్చింది ‘’అని బాధ పడినట్లుగానే .’’మనిషిలో అమాయికత్వం పోరాని దివ్య ద్రవ్యం .అది ఉంటె సృష్టి అంతా అందాలరాశిగా ద్రస్టవ్యమౌతుంది .పోయిన స్థితి మనం చూస్తున్నాం ‘’‘’అంటారు తుమ్మపూడి .

‘’కాలమూర్తి’’ ఖండం తెలుసుకోవాలి అంటే –వ్యాళః,కాలః ,ప్రత్యయః ‘’అని కాలానికి పేర్లున్నట్లు విష్ణు సహస్రనామం చెబుతోంది .దీన్ని వ్యాఖ్యానిస్తూ సద్గురు శివానందమూర్తిగారు వ్యాళం అంటే కాలసర్పం అని ,దానిలాగా గ్రహించటానికి వీలు కానివాడు విష్ణు మూర్తి అని చెప్పారు వస్తువులను కాలం గ్రసిస్తుంది అని జార్జి గామో తన ‘’ఇన్ ఫినిటి’’లో చెప్పాడు అన్నారు ఆచార్య .మనిషి నిలుచున్న చోట నిలబడే ఉంటె ,కాలం అతని మీదుగా ప్రవహిస్తుందట  .చెట్టు చుట్టూ నదీ ప్రవాహం ఉన్నట్లు అన్నమాట .చివరికి కదలని చెట్టులాగా మనిషి కూడా వృద్ధుడై జీర్ణించి  నశించి పోతాడట .కాలం మనమీదనుంచి పోతోంది అని అర్ధం చేసుకోవాలి .కాలం అంటే గమన శీలం .దానికి రూపం లేదు .దానికి మూర్తి విశ్వం (స్పేస్ ).అది జడం .జగత్తు కదిలేదానిలాగా మారటం కాలం వలన కనుక కాలం రైల్ ఇంజన్ లాంటిది .సమస్త వస్తు ప్రపంచం కంపార్ట్ మెంట్ లాంటివి .వీటిని అది తీసుకు పోతుందన్నమాట .దాని శక్తి వలన అది కదలినట్లు అనిపిస్తుంది .పదం చివరలో చేరె-డు,ము వు మొదలైనవాటిని ప్రత్యయాలు అంటారు .ఇవి పదానికి అర్ధాన్ని కల్పిస్తాయి .కాలం కూడా ప్రత్యయం లాంటిదే . ఇది నాల్గవ దశ అంటే ఫోర్త్ డైమెన్షన్ అన్నమాట .విశ్వం మాత్రం త్రిదశాత్మకం అని మనకు తెలుసు ఇది ఒక చోటునుండి మరొక చోటుకు జరగటం వలన కాలం యొక్క పరిగణనం  ఏర్పడుతుంది .ఏతావాతా తేలింది ఏమిటి అంటే కాలం అనగా  ‘’ఉన్న ఉనికికి రూపం లేనిది ‘’.మరి దీన్ని గుర్తించటం యెట్లా ?వస్తు చలనం వలన గుర్తించవచ్చు .కనుక ‘’కాలమూర్తి ‘’అంటే విశ్వం యొక్క ‘’అమూర్త పదార్ధం ‘’అని భావన .విశ్వ చలనమే కాలం .ఈ మహాకాల మూర్తియే పరమేశ్వరుడు ‘’అని చాలా చక్కని వ్యాఖ్యానం చేశారు ఆచార్య తుమ్మపూడి .

‘’ ఈభావన ఉన్నకవి వృషాద్రి పతి గారు .తాను కాలపురుషుడు అన్న ఎరుక ఉన్నవాడు ఈయన ద్వాదశ ఉపనిషత్తులను పద్యాల్లో బంధించిన ప్రజ్ఞాశాలి .వంశావతార ఘట్టం లో ఇదంతా మనకు తెలుస్తుంది. వారసత్వం గా వైష్ణవ మత కవితా విద్య  సంక్రమించినవాడు కనుక కాలభావన మహా ఉదాత్తంగా చేయగలిగాడు ‘’అని మెచ్చారు తుమ్మపూడి .భారతీయ రాజపరంపర పొందిన అపజయాలు మనదేశం పొందిన దౌర్భాగ్య స్థితి కి మూలం ఈ కాలమే అని వ్యంగ్యార్ధకంగా చెప్పారు .కథలోవిద్యారణ్య స్వామి విజయనగర స్థాపనకు  ,శంకు స్థాపన ముహూర్తం నిర్ణయించటానికి ,,దానిలోని లోపానికీ ఈ కాలమూర్తిఖండిక ‘’వ్య౦జకం ‘’అని జరుగబోయే దానికి ఇక్కడే బీజాలు వేశారని ఆచార్యశ్రీ వివరించారు .

ఈభావన విస్త్రుతే ఈ కావ్యం .ఆ పునాదిపై కట్టిన మహా సౌధం .కవిసామ్రాట్ విశ్వనాథ కూడా ‘’ఝాన్సీ రాణి ‘’అన్నతన కావ్యం లో ఆమె అపజయాలకు కారణాలను ప్రతి ఆశ్వాసాంత పద్యాలలో గతిని వర్ణించారు .అంటే అపజయం కాలప్రభావం అని ధ్వనితం చేశారు అన్నారు కోటేశ్వరార్య .

‘’ అసలు ఈ ఖండిక రాయాలన్న భావన మొవ్వ వారికి కలగటమే మెచ్చుకోదగ్గ విషయం .’’యస్య వశాత్ అగాత్ స్మృతి పథం కాలాయ తస్మైనమః ‘’అని భగవాన్ భర్తృ హరి అని అందుకే అన్నాడు .అంతా పోయి౦దనుకోవటం బాధపడటం ,ఈ బాధను కావ్యం లో వ్యక్తీకరించటం కళ.అందుకే రాజతరంగిణి లో కల్హణ కవి –‘’క్షణ భంగినిః జ౦తూనాం స్ఫురితే పరి చి౦తితే –అర్దాభిషేకం శాంతస్య రసస్యాత్ర విచార్యతాం ‘’అన్నాడు .దీనిభావం ఏమిటి అంటే జాతి జీవనమంతా క్షణ భంగురం .కనుకనే శాంత రసానికి పట్టాభి షేకం జరిగింది అని .అయితే ఇదంతా తాత్విక ధోరణి .తత్వ చింతన లేని చోట ఇది కుదరని విషయం కూడా అని తేల్చారు ఆచార్య .

ఇష్ట దేవతా స్తుతిని కవి  తెలుగు రాయలతో ప్రారంభించటం పరమ ఔచిత్యం .కావ్య వస్తువు విజయనగర ప్రభువు ఆముక్తమాల్యదా మహా కావ్య నిర్మాత శ్రీ కృష్ణ దేవరాయల కథ .ఇతడేకన్నడ రాయడు .ఈకన్నడ రాయడు  వచ్చి ‘’తెలుగు రాయని ‘’దర్శనం చేయటం  చేత  ఆ మహా ప్రబంధం మనకు దక్కింది .విశ్వనాధ వారి ‘’ఆంద్ర ప్రశస్తి ‘’ఖండ కావ్యం శ్రీకాకుళస్వామి సంకీర్తనతోనే ప్రారంభమైంది .అతడే మొదటి చక్రవర్తిగా శ్రీకాకుళం రాజధానిగా తెలుగు మహాసామ్రాజ్య నిర్మాతగా ప్రసిద్ధుడైనాడు .కనుక ఎవరు ఆంధ్రుల చరిత్ర రాసినా ముందుగా శ్రీకాకుళస్వామి కి నమస్కరించాల్సిందే .ఆయనకు ప్రధమ తాంబూలం సమర్పించాల్సిందే .అందుకే ఈ మహాకావ్య ప్రారంభం పరమ ఔచిత్యంగా ఉంది అన్నది .ఇందులో సీతాదేవి ప్రార్ధన అచ్చ తెలుగులో చేశాడుకవి –కారణం ఈ కవి కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణానికి వ్యాఖ్యానం రాసి ప్రచురించాడు. .

‘’జన్నపు నేల దున్ను తరి జక్కని బంగరు పెట్టె బుట్టి ,పెం –పన్నుగ దండ్రిపేర నలరారెడు రేని  బిడారు నందు ,దా

విన్నను వొంది ,బేసి కను వేలుపు వింటిని ద్రుంచి నట్టి రా –మన్నను బెండ్లి యైన జవరాలిని గొల్చెద,నేల బుట్టువున్’’ అనిశ్లాఘించారు తుమ్మపూడివారు మొవ్వవారిని .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-18 –ఉయ్యూరు

,

 

 

 

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1

కొన్ని పరిచయాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి .వాటితో ఏర్పడిన బంధం స్పూర్తి నిస్తాయి .ఇదిగో అలాంటి అరుదైన సాహితీ బంధమే డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారితో కిందటి డిసెంబర్ 24 గుంటూరు జిల్లా రేపల్లెలో సరస భారతి ‘’గ్రంథ ద్వయం ‘’ఆవిష్కరణ సందర్భంగా ఏర్పడింది .వారూ మా అతిధులు అవటం వారి సమక్షం లో కవి సమ్మేళనం నిర్వహించటం వారు ప్రేరణ పూర్వక ప్రసంగం చేసి తమ అద్భుత కంఠం తో తాము రాసిన పద్యాలు వినిపించి వీనుల విందు చేయటంజరిగింది .వేదికపైననే వారు నాకు తమ రచన ‘’ ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’’అందజేయటం నేను చదివి తప్పక నాభావం తెలియజేస్తానని చెప్పటం జరిగిది .వారు ‘’మీరూ ఆంజనేయస్వామి పైనా రాశారని తెలుస్తోంది .మీ పుస్తకాలు పంపండి ‘’అనటం,నేను మర్నాడే వారికి పంపటం జరగటం అందినట్లు వారు ఫోన్ చేసి చెప్పటం వెంటనే వారి 1-శ్రీ కసాపురాన్జనేయ మహాత్మ్యం అనే పద్యకావ్యం 2- శ్రీ ఆంజనేయ విజయం అనే బృహత్ వచన గ్రంథం పంపారు .రాయవిజయం అప్పుడే మొదలు పెట్టి 6-3-18 కి పూర్తి చేశాను .తర్వాత వీలుని బట్టి మిగిలిన రెండూ చదివి నిన్ననే పూర్తి  చేశాను .వెంటనే వారికి నిన్న నే ఒక కార్డ్ రాసి నా ఆనందాన్ని వ్యక్తం చేశాను .అనంతపురం జిల్లాలోని శ్రీ కసాపుర ఆంజనేయ మహాత్మ్యం లోని కథ ను ‘’స్వామి’’ కలలో వినిపించటం వలన ప్రభావితులై కవి గారు రాసినట్లు చెప్పుకున్నారు .తనకూ అలాంటి అనుభవాలే జరిగాయని సమర్ధించారు శ్రీ శ్రీ కుర్తాళం పీఠాదిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ).కథమనకు చాలా కొత్తగా ఉంటుంది .ప్రతి అధ్యాయం లో ముందు వచనం లో కథ వివరించి తర్వాత దాన్ని పద్యాలలో అందంగా రాశారు .ఒకరకంగా విన్నదీ కన్నదీ అయినదానికీ పౌరాణిక నేపధ్యం అద్ది స్వపోల కల్పితం చేశారన్నమాట . కనుక ఇబ్బంది లేదు .మూడవది అయిన శ్రీ ఆంజనేయ విజయం అంతా 716  పేజీల హనుమ లీలామృతమే .భక్తీ ,ప్రపత్తీ కలబోసిన ఉద్గ్రంథాలవి .వీటిని చదివే అదృష్టం కలిగించారు వృషాద్రిపతి గారు .జననాంతర సౌహృదం అంటే ఇదే నెమో .

కవి పరిచయం –1-ఉపనిషద్వాణి 7 భాగాల 12 ఉపనిషత్తులకు శంకర భాష్య వ్యాఖ్యానం తో పద్యానువాదం 2-శ్రీ పద్మావతీ శ్రీనివాసీయం –పద్య ప్రబంధం 3-హరి హరాత్మక విజయం -1200 పద్యాల ప్రబంధం 4-తపస్సిద్ధి –పద్యకావ్యం 5-సోమనాద్రి –పద్యకావ్యం 6- భారత జ్యోతి –శ్రీ పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర పద్యకావ్యం 7-విశ్వ గాయత్రి 8-లలితాస్తవం   9-గుంటూరు పురస్త బృందావన వేంకటేశ్వర స్తవం,10-కన్నెవాగు 11-కసాపుర క్షేత్ర మాహాత్మ్యం 12-రాణి దుర్గావతి(చారిత్రిక పద్యకావ్యం ) 13- రఘునాధ విజయం 14-శ్రీ బాలకృష్ణ లీలా విలాసం 15-భావమందాకిని ఖండకావ్యం 16-విరిదండ –పద్య సంకలనం 17- వేంకటేశ్వర శతకం 18-కసాపుర ఆంజనేయ శతకం 19-భ్రామరీ శతకం 20- మాల్యాద్రి నృసింహ శతకం 21- రేపల్లె వీరాంజనేయ శతకం 22-కన్యకా విజయం ,23 –జ్ఞానతరంగాలు 24-విదురనీతి సారం 25-శ్రీ కృష్ణ రాయ విజయం 26-క్రిష్ణవేణీ పుష్కరావిష్కారం (వచన రచనలు )27-ప్రతిజ్ఞార్జునీయం 28-దాన రాధేయ (నాటకాలు )29- నీలాసున్దరీ పరిణయం అనే కూచిమంచి తిమ్మకవి కావ్యానికి ‘’సుగంధి ‘’అనే తొట్టతొలి వ్యాఖ్యానం 30-అచ్చతెలుగు రామాయణం కు ‘’మలయ సమీర ‘’వ్యాఖ్య 31-(చంద్ర హాస విజయం ,సాయీ విజయం ,స్వామి అయ్యప్ప ,మహిషాసుర పర్దిని ,మదాలస ,నరనారాయణ విజయం ,కిరాతార్జునీయం ,విశ్వనాధ నాయకుడు ,మోషే విజయం మొదలైన 8 అముద్రితాలు )

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి స్వర్ణపతకం తో తెలుగు ఎం. ఏ. ,  ఆంద్రోపన్యాసకులు,పదవీ విరమణ అనంతరం రేపల్లెలో స్థిరవాసం  .శ్రీ ప్రసాదరాయ కులపతి గారి అంతేవాసి.ఎన్నెన్నో భువనవిజయాలు ,అష్టావధానాలు ,భారతం పై తుదితీర్పు వంటి వాటిలో అద్వితీయ నటన చేసినవారు .

శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం

దాదాపు 1129  పద్యాలతో రెండు భాగాలు -1-విజయ నగర తరంగిణి పూర్వ రూపం -292 పద్యాలు ,,ద్వితీయాశ్వాసం ఉత్తరరంగం,173 పద్యాలు ,తృతీయాశ్వాసం ఉత్తరరంగం 659 పద్యాలు ,-ఇవికాక ఇష్టదేవతా స్తుతి, కృతిపతి ,కృతికర్త మొదలైన వివరాలతో పద్యాలు .  ఒకరకంగా చారిత్రిక బృహత్ గ్రంధం అయిన ప్రబంధ పారిజాతం .దీనికి డా.తుమ్మపూడి కోటేశ్వరరావు గారి విపుల వ్యాఖ్యానం మరొక గొప్ప అలంకారం .తుమ్మపూడి వారి వ్యాఖ్యానం లో అందరూ తెలుసుకోదగిన అనర్ఘ రత్న రాసులున్నాయి .వాటిలో ముఖ్యమైనవి ముందుగా మీకు తెలియ జేస్తాను .

‘’ఆకచటతప యాద్యైః సప్తభిః వర్ణ వర్గైః—విరచితముఖ బాహ్వాపాద మధ్యాఖ్య హృత్కా

సకల జగదధీశా శాశ్వతీ  విశ్వ యొనిః-వితరతు పరిశుద్ధం చేతసః శారదావః ‘’

అని ప్రపంచ సార తంత్రం చెబుతోంది .ఏ తల్లి చనుబాలతో  ఈ మహా కావ్యం ఆరంభమౌతోందో ఆమె అక్షర స్వరూపిణి .ఈ అక్షరాపు౦జ౦ ఏ అవయవ రూపమో విపులంగా ప్రపంచసారం తెలియ జేసింది అన్నారు డా చిమ్మపూడి కోటేశ్వరరావు గారు .ఆ మహా సరస్వతినే ఆలంకారికులు –‘’వందే కవీంద్ర వక్త్రేందు లాస్యమందిత నర్తకీం

దేవీం సూక్తి పరిస్పంద సుందరాభన యోజ్వలాం ‘’అని వక్రోక్తి జీవితం చెప్పింది .ఈ కావ్య అవతారిక 54 పద్యాలతో వివృతమైంది .1- సరస్వతీ స్తుతి-నాంది పద్యకృతులు  2-ఇష్ట దేవతాస్తుతి ౩-అంజలి 4- కాలమూర్తి 5 –వంశావతారం 6-పూర్వకవి స్తుతి 7-నాసోదె 8-ఆంద్ర పద్య వ్యధ 9-కుల ప్రసక్తి .ఈ ‘నవకం ‘’ఈ కావ్య ప్రపంచ ప్రతీక .9 సంఖ్య సృష్టికి ప్రతీక .10 వ్యక్త ప్రపంచాతీత సత్పదార్ధం –అదే సరస్వతీ దేవి .ఆమె అవయవ స్వరూపమే అక్షరం .అక్షరమే సృస్టి గా పరిణమించి౦దని తంత్రోక్త విషయం .దీనినే శబ్ద బ్రహ్మ౦ అని వైయాకరణులన్నారు .దీనికి ‘’పరా ‘’వాక్కును కలిపింది కాశ్మీర శివాద్వైతం .ఈమె యేసృష్టి కర్త్రి ,వాగ్దేవి ,ఆద్యాశక్తి ,.ఏదన్నా ఒకే అర్ధం అని గ్రహించాలి .ఈ వాగ్దేవతా స్తుతి ఈ కావ్య తిలకం ‘’అని విశ్లేషించారు తుమ్మపూడి వారు .ఇలాంటి వెన్నో మహా వ్యాఖ్యానాలు చేశారు ఆచార్య తుమ్మపూడి .అవి తెలియ జేసే ప్రయత్నమే ఇదంతా .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-18 –ఉయ్యూరు

,

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం )

‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం )

ఇప్పుడు మూర్తిగారి కధానికా సుస్రవంతిలో జలకాలాడుదాం .అందులో మొదటిది  చదివితే సునిసిత హాస్యం  ,పెదవి దాటే చిరునవ్వు ,పగలబడి నవ్వించే సరస౦, దాంపత్యం లో చిలిపి సరదాలు  అన్నీ కనులముందు ప్రత్యక్షమౌతాయి .ఆయనలో ఒక భమిడిపాటి రామగోపాలం ,ఒకముళ్ళపూడి ,ఒక కే .ఆర్ .కే .మోహన్ కనిపిస్తారు .ఆ కథల్లో గోదారి చల్లదనం ,తాపేశ్వరం కాజా ,కాకినాడ కాజా  ,పాలకొల్లు అల్లం మురబ్బా ,వేరు సెనగ చెక్కలు ,కోనసీమ కొబ్బరి లౌజులు ,మామిడి తాండ్ర ,మహా రుచి మంతంగా ,శుచిమంత౦ గా అనుభవైక  వేద్యం అవుతాయి. ఆ హాయి అనితర సాధ్యమని పిస్తుంది .ప్రతిదీ ఒక రస గుళిక . హాస్యానికి చాలా పెద్ద పీట వేశారు మూర్తిగారు .17 కథానికల సంపుటి ఇది .ఇందులోని ఒకకథ పేరే సంపుటికి సముచితంగా పెట్టారు .

సంభాషణలో ఈ నాటి నేటివిటీ చాలాబాగా కనిపిస్తుంది .ఉపమానాలు ఉప్మాపెసరట్టు లాగా మహా రుచికరంగా ఉండటం ప్రత్యేకత .పుస్తకం చేతిలోకి తీసుకుంటే యిట్టె పూర్తి  చేయిస్తుంది .ఆ వేగం గోదారి ని తలపి౦పజేస్తుంది .చతుర సంభాషణలు మనసుకు హత్తుకు పోతాయి .య౦గ్ కపుల్ రాజేశ్వరి  కృష్ణ .ఆషాఢ మాసం లో కొత్త జంట విరహానికి కమ్మని లలిత సంగీత ట్యూనే ఈ కథ.డబ్బు ఖర్చుపెట్టి ఆవార్డ్ లు కొనుక్కోవటాలు ,సన్మానాలు చేయి౦చు కోవటాలు హాస్యరసభరితంగా ఉన్నాయి .ప్రేమ బంధం యెంత మధురం లో ఎంతో మధురం చేశారు .స్నేహం బంధంగా మారిన కత’’అమలాపురం అబ్బి గాడు ‘’

2- తుంగ చాప కథలు

మూర్తిగారి 14 కధలు ఈ పేరుతో వచ్చాయి .ఇందులోనూ తుంగ చాప కథ సంపుటికే శీర్షికై శిరోభూషణమైంది .కృతజ్ఞతకు పరాకాష్ట ఈ కథానిక. గురువు కూర్చుని చదువు చెప్పిన తుంగ చాప ,ఆయన మరణం తర్వాత శిష్యుడు ఎవరి ద్వారానో  డబ్భు ఇచ్చి కొని భద్రంగా దాచుకుంటాడు .దాన్ని చూసి అంతా నవ్వు కుంటారు .చివరికి తాను కూడా ఆ చాపపైనే కాలం చేస్తాడు .మనసులను కదలించే కధానిక .పెళ్ళిళ్ళలో కవి సమ్మేళనాలు  దానికి చేతి చమురు భాగోతం కడుపుబ్బా నవ్వించే దే’’వారెవ్వా క్యా సమ్మేళన్ హై ‘’.పాలకువాస్తవాలుతెలియజేసే కలాలు మౌనం వహించటమే కాదు కన్నీరూకార్చాయి అశక్తత తో ఆవేదనతో ‘’కలం కార్చిన కన్నీళ్లు ‘’లో .ఇందులో ఒకటి రెండు కధలు మిగిలిన సంపుటులలోనూ కనిపిస్తాయి .అన్నీ చాలా పకడ్బందీగా కూర్చినవే. చదివి ఆనంది౦చా ల్సినవే .

ఈ రెండు సంపుటులలో ప గొ జి లోని అనేక ప్రదేశాల ప్రస్తావన అక్కడి విశేషాలు చదువరులు తెలుసుకొంటారు .

3-  తెలుగు కథానిక 2016

విహారి ,కోపూరి ,మూర్తిగారు ,యర్రమిల్లి  విజయలక్ష్మి ,వేంపల్లె షరీఫ్ ,రామాచంద్ర మౌళి మొదలైన లబ్ధ ప్రతిస్టులైన కధకులు రాసిన 15 కదల సంకలనం ఇది .విహారి రాసిన ‘’బహుళత్వం’’ లో ఈనాటి బాంధవ్యాలు ఎలా మసకబారుతున్నాయో తెలియ జేస్తుంది .’’గాలిలో ఓ క్షణం ‘’లో మూర్తిగారు అక్కను తల్లి చేసిన వాడిపై  చెల్లెలు ఎలాప్రతీకారం తీర్చుకోన్నదో తెలిపింది .గ్లోబల్ హాస్పిటల్ కల్చర్ విస్తరిల్లుతున్న కాలం లో ప్రవాహానికి ఎదురీదలేమని ‘’విశ్వమానవుడు ‘’లో యర్రమిల్లి విజయలక్ష్మి చెబితే ,కోపూరి పుష్పాదేవి దేనికైనా పోరాడి సాధిస్తేనే విలువ ఉంటుంది అని నిజం చెప్పారు ‘’ప్రస్థానం’’లో .కుటుంబాలలో సమస్యలు వచ్చి దూరమవ్వటం సహజం .తర్వాత  పశ్చాత్తాపం లో అన్నీ మరచి కలిసి పోతారని తేల్చారు ‘’బంగారు గాజులు ‘’లో సోమావజ్ఝల .తటవర్తి నాగేశ్వరి ‘చినుకు చినుకు మధ్య ‘’మంచి కధే నడిపించారు .ప్రెస్ ,పోలీసులు ,అధికారులు ,రాచకీయ నాయకులు కలిసిపోతే సామాన్యుడికి న్యాయం దక్కదు అని చెప్పారు ‘’యజ్ఞం ‘’లో గన్నవరపు .అద్దేపల్లి జ్యోతి ‘’ఆ జ్ఞానం ‘’బాగా కలిగించారు .రామాచంద్రమౌళి ‘’ మనిషి తన జీవితాన్నితానే నిర్మించుకొని తానె జీవించాలి’’అని ‘’తాత్పర్యం ‘’చెప్పారు .ఉండవిల్లి ఎం’. ’ఫేస్ బుక్ ‘’లో అది చేస్తున్న వికృతాలను వెలుగులోకి తెచ్చారు .

హాయిగా చదివించి జీవిత సత్యాలను ఆవిష్కరించిన సంకలనం ఇది .మూర్తిగారి బహుముఖీన ప్రజ్ఞకు తార్కాణం .మరి౦త సాహితీ సేద్యం చేసి మూర్తిగారు బంగారు పంటలను పండించాలని కోరుకుందాం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-18 –ఉయ్యూరు

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2

మూర్తి గారి జీవిత విశేషాలు వారి సాహితీ సేద్యం తెలుసుకున్నాం .ఇప్పుడు వారు పంపిన కవితలలోని సారం అందుకుందాం –

1-గోదారమ్మా దండాలమ్మా –దీర్ఘ కవిత

శ్రీ సత్యనారాయణ మూర్తి గారు రాసిన సుదీర్ఘ కవిత ఇది .గోదారి వంతెన ప్రక్క తల్లి గోదారికి మూర్తి గారు భక్తి ప్రపత్తులతో వందనమాచరిస్తున్న ముఖ చిత్రం చూడముచ్చటగా ఉన్నది .దీనిని పెనుగొండ పురాధీశ్వరుడు శ్రీ నగరేశ్వర స్వామి ,జగన్మాత శ్రీ మహిషాసుర మర్ధనీఅమ్మవార్ల పాదపద్మాలకు సభక్తికంగా సమర్పించారు .గోదారి పులకించి ప్రవహించిన ప్రదేశాలన్నిటినీ ఈ కవితలో చిరస్మరణీయం చేశారు .ఆమె ‘’జ్ఞాన మోక్ష ప్రదాత ‘’అన్నారు .గోదావరీ తీరం లో జన్మించి తమ సృజనతో   జీవితాలను సార్ధకం చేసుకున్నవారందరినీ స్మరించారు .తాము చిన్నతనం లో మొదటి సారి గోదావరిలో చేసిన స్నానం గుర్తు తెచ్చుకున్నారు .’’అమృతం  లాంటి నీ నీళ్ళు –గ్రుక్కెడు త్రాగగానే గుండె నిండా హుషారొచ్చేది’’అని కీర్తించారు .’’నీ చల్లని గాలి మాకు ఉచ్చ్వాస నిశ్వాసాలు – నీ జలధారలు –మా జీవదారలు –కలలో ఇలలో నీవై మా దేవతవు ‘’అని ప్రపత్తి గా పరవశం పొందారు .ఇందులోని ప్రతికవితా పంక్తీ గుండె లోతుల్లోంచి పెల్లుబికింది కనుక గోదారి అంత కమనీయంగా స్వచ్చంగా ,పవిత్రంగా ఉన్నది .

2-జలవాణి

108 మంది ప్రసిద్ధ కవుల కవితలను ఆహ్వానించి ‘’జలవాణి ‘’గా సంకలనంచేసి అందించారు మూర్తి గారు ..దీనికి స్వర్గీయ అద్దేపల్లి రామమోహనరావు గారు సందర్భానికి తగిన అమూల్య మైన పీఠిక రాసి జలవాణికి మరింత శోభ చేకూర్చారు .ఇందులోని కవిత్వమంతా అమరవాణిగా ఉన్నదని చెప్పాలి .నాకు నచ్చిన కొందరి కవితా పంక్తుల్ని స్ప్రుశిస్తాను- జలం జీవాలకు చుక్కానికావాలి గాని  .-జీవిత నౌకకు చిరిగిన తెర చాప కాకూడదు ‘’అన్నారు ‘’దాహార్తి ‘’లోశ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు –కావేరీ జలతగాదాను పురస్కరించి .’’సశ్రీ –‘తన సహజ ధోరణిలో ‘’స్వార్ధపు బైర్లు కమ్మిన కళ్ళని పీకి –ఎదుటి వాళ్ల బాధల్ని కడిగే –కన్నీళ్ళయి ప్రవహిద్దాం ‘’అన్నాడు .’’నీటి గుప్పిట్లో దాగున్న –జీవరహస్యాన్ని బతికిద్దాం –నీటి గొంతుక ఆలపించే –ఆర్త నాదాన్ని అర్ధం చేసుకొందాం ‘’అన్నాడు కొండ్రెడ్డి కవితాత్మకంగా .’’లంకె బిందేల్ని చూసినవాడికి దాహం తీరు తు౦దేమోకాని ధనదాహం తీరుతుందా ?’’అని ప్రశ్నించాడు చెన్నై శ్రీ ఉప్పలధడియం వేంకటేశ్వర .’’నీరుంటేనే నేను –నేను౦టేనే ఈ దేశం –ఉదకం రక్షంతు రక్షితః ‘’అని వీరభద్రమూర్తి ‘’జలసూక్తం ‘’చెప్పాడు .’’చిల్లరేస్తే చిలకరించే నవ్వుల్నికొనుక్కునే కళ’’పక్షులకేం తెలుస్తుందని  మన అస్తిత్వాన్నిప్రశ్నించాడు పెరుగు రాధాకృష్ణ .’’తప్పంతా వర్షం దేగా –ఉన్న కాస్త బడ్జెట్టు –మంత్రుల్ని దాటి –సేక్రటరీలను  ఆఫీసర్లను ,ఉద్యోగస్తులను కాంట్రాక్టర్లను దాటి –మేఘం దాకా చేరలేకపోయిందని ‘’చమత్కరించాడు ఈతకోట సుబ్బారావు .

నీరు లో కన్నీరు కూడా భాగమేగా .దీనినీ గొప్పగా వర్ణించి కన్నీరు తెప్పించిన కవితలున్నాయి .నీటి పొడుపు ,యాజమాన్యం ,కలుషితంకాకుండా చూడటం ,సుజలధార అందరికీ అందుబాటులో తేవటం ,నీటి వ్యాపారాలు ,నీటి తగాదాలు ,’’పానీపట్టు యుద్ధాలు ‘’,అదృశ్యమైపోతున్న చెరువులు   నదులు గురించి తీవ్ర ఆందోళన చెంది కవిత్వం రాశారు .ఇందులో అన్ని ప్రాంతాలకు చెందిన కవులు జలదారలాంటి కవితలు రాసి సమస్యలను ఏకరువు పెట్టి ,పరిష్కారానికి మార్గాలూ సూచించారు .జలఖడ్గం విరుచుకు పడి జీవితాలను అతలాకుతలం చేయటమూ వర్ణించారు .ఒక్కొక్కరిది ఒక్కో అనుభూతి .ఇలా జలం పై అద్భుత కవితా వృష్టి కురిపించి ‘’జలవాణి’’వినిపించిన మూర్తిగారి ఆలోచన ,అనుసరణ ,ఆవిష్కరణ యెంత మెచ్చినా తీరనిదే .

౩- నాదేశం

భారత దేశ ప్రధమ స్వాతంత్ర్య సమరం 1857 లో జరిగింది .మనకు స్వతంత్రం 1947 లో వచ్చింది .2007 కు తొలి స్వాతంత్ర సమరానికి 150 ఏళ్ళు అయిన సందర్భంగా మూర్తిగారు తమ‘’రమ్య భారతీ సమితి ‘’ఆధ్వర్యం లో ‘’నాదేశం ‘’కవితా సంకలనం తెచ్చి మాతృదేశ ఋణం తీర్చారు .దేశభక్తికే ప్రాధాన్యత కలిపించిన 30 కవితలివి .దీనికి శ్రీ ఆర్ వి ఎస్ ముందుమాట రాసి చైతన్యం కలిగించారు .మొదటికవిత ‘’కాలాన్ని కలిపే అగ్నిసూత్రం ‘’ను ప్రముఖ కవి విమర్శకులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు .’’స్వాతంత్ర్యం బోదె లోంచి –బానిసత్వపు చెట్టు-ఎందుకు శాఖోప శాఖలుగా పెరుగు పోతోంది ?’’అని ప్రశ్నించారు .20 07 లోకి 1857 ను ఆవాహన చేయమని కోరారు .’’చల్లని మంటల్లో హింస దహించుకు పోవాలని –భారతీయత స్వాతంత్ర్య పతాకమై ఎగరాలనీ ‘’  ఆకాంక్షించారు జ్ఞానవయో వృద్ధులు అద్దేపల్లి .’’నీ జండా నువ్వు ఊపుకుంటూ సాగిపోమ్మన్నాడు రసరాజు . సబర్మతీ యతిని స్మరిస్తూ చిల్లర భవానీదేవి ‘’బుద్ధుని మహాభి నిష్క్రమణ లా’’మరలరాని యతివై సబర్మతి విడిచావు-‘’అని మహాత్ముని స్మరిస్తూ దాన్ని గుర్తుంచుకొని జాతికెక్కిన విదేశీ రక్తం విరిగిపోయేట్లు చేసుకోమని ‘’నవనాడుల్లో నవ్యస్పూర్తి నెలకొల్పుకో ‘’మని సందేశమిచ్చారు .’’స్వాతంత్ర్యాన్ని ఎలా చేజార్చుకున్నామో ఆలోచించమని హితవు చెబుతూ ‘’మనమట్టికి మన భాష నేర్పు కుందాం ‘’ అని తక్షణ కర్తవ్య బోధ చేశారు డా కొండ్రెడ్డి .స్వాతంత్ర్య పోరాటం లో వాడపల్లి నిర్వహించిన పాత్ర కళ్ళకు కట్టించి ‘’వాడపల్లి లో బ్రిటిష్ బలగం చిక్కి చొంగను కార్చుకుంది’’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు   ఎస్ ఆర్ పృథ్వి .’’మనిషిని నేల వెలివేసే పరిస్థితి తెచ్చుకున్నది మనం కాదా ?అన్నాడు చిమ్మపూడి –‘’జాతీయత ఒకతపస్సు –త్యాగ నిరతి ఉషస్సు ‘’అనీ చెప్పాడు .

‘’భారత జన సముద్రం లో ఉద్భవించిన –సునామీ తాకిడికి –ఆంగ్ల సైన్యాలు అతలాకుతలమైనాయి ‘’అని నాటి  ప్రభంజనాన్ని  నేటి సునామీతో సందర్భోచితంగా పోల్చారు మాధవీ సనారా .హింసా వాదుల్ని నిలదీయాలని కోరుతూ ‘’ఈ పచ్చని పూదోటపై –కన్నెర్ర జేసె వెన్ను పోటుదారులకు –పెద్ద పులిగా దర్శనమివ్వాలి ‘’అని కోరాడు గుండాన జోగారావు .’’దేశాన్ని జిల్లాలవారీగా అమ్మబడును ‘’అని సెటైర్ చిలికాడు వై శ్రీరాములు .’’మానవత్వం మతంగా మారి-ఐకమత్యం ఊపిరి గా రూపు దాల్చి –సమానత్వం ఇంటి తోరణాలై –మమతానురాగాల గీతికలతో –ప్రతి ఇల్లూ స్వాగతం పలకాలి ‘’అని సంప్రదాయ బద్ధంగా ఆలోచించారు శ్రీ మూర్తిగారు .’’క్విట్ ఇండియా ‘’అంటూ ఉగ్రవాదుల్ని తరిమికొట్టటానికి బాపు మళ్ళీ పుట్టాలన్నాడు కెవి రమణారెడ్డి .’’నామానాన నేను హాయిగా బతుకుతున్నాను –ఏ సమస్యా లేకుండా –ఎవరికీ సమస్య కాకుండా ‘’అని నేటి వేదాంతం ఒలకబోశారు డా ఉప్పలధడియం .మరోకోణం లో చూసిన ఈతకోట సుబ్బారావు –‘’నిరుద్యోగం మనిషి నీడై పోయింది –మొరవినే వాడు బ్రహ్మ శిల’’అంటూ నిట్టూర్చాడు –‘’మాచుట్టూ అమెరికా డాలర్లవల –అరబ్బు దీనార్ల కంచే –ఇక్కడెక్కడా బతుకు శ్వాస అందడం లేదు –మా గాలి విదేశాల్లో వీస్తుంది ‘’అని మన చేతకాని తనానికి ,పరాయీ భావనకు చివాట్లు పెట్టాడు .మువ్వన్నెల జండా కు మోకరిద్దాం ‘’అని ఒకరంటే ఈ దివ్య ధాత్రిఅని ,బంగారు దేశం అని   మరొకరు పొగిడితే కన్నీటి జెండాను ఎజెండా చేశాడు సరికొండ .చలపాక కు ‘’తెగిన గాలిపటం ‘’కనిపించింది .

ఎంతో స్పూర్తిగా ఈ సంకలనం’’నాదేశం ‘’ తెచ్చి మూర్తిగారు  మరొక్కమారు మాతృభూమి ఋణం తీర్చుకునే అవకాశం కవులకేకాక చదువరులకూ కలిపించారు .

తర్వాత కథానిక లోకి ప్రవేశిద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-18 –ఉయ్యూరు

‘’

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1

మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1

బహుశా నాకు గుర్తున్నంత వరకు మూర్తిగారిని మొదటిసారిగా హైదరాబాద్ లో శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికానుంచి వచ్చి   బాపు –రమణ ల స్నేహ షష్టి పూర్తి నీ,  రెండు రోజులు నిర్వహించిన ప్రపంచ తెలుగు సభలలో  చూశాను .నేను తీస్తున్న ఫోటోలు చూసి తన ఫోటోకూడా తీయమంటే తీయగా ఫోటో కాపీలు పంపమని అడ్రస్ ఇవ్వగా భీమవరం పంపిన జ్ఞాపక౦ .  ఇదంతా సుమారు పదేళ్ళ క్రితం సంగతి .కృష్ణాజిల్లా రచయితల సంఘం జరిపిన అనేకానేక కార్యక్రమాలలో నేను అతిధులను వేదికపైకి కఆహ్వానించటం ,లేక అతిధులను సభకు పరిచయం చేయమంటే చేయటం చేశాను .మూర్తిగారు ఆసభలలో పాల్గొనే ఉంటారు కానీ నేను గుర్తు పట్టి ఉండలేక పోవచ్చు .వారు ప్రముఖంగా ఉపన్యాసాలు చేసీ ఉండవచ్చు .కాని నాకు గుర్తు లేక పోయి ఉండవచ్చు .కానీ అదే సంఘం 20 17 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా శ్రీకాకుళం శ్రీ ఆంద్ర మహావిష్ణువు ప్రాంగణం లో జరిపిన ‘’పద్య బ్రహ్మోత్సవాలు ‘’లో మూర్తిగారు నా దగ్గరకొచ్చి ‘’ప్రసాద్ గారూ !నేను మీ బ్లాగ్ ను చాలా ఆసక్తిగా చదువుతాను ‘’అని అంటే అందరూ చెప్పెమాటే గా అని ‘’లైట్ ‘’తీసుకున్నాను .మళ్ళీ 2018 లో అక్కడే జరిగిన ‘’తెలుగు సదస్సు ‘’లో మళ్ళీ వారిని శ్రీ వసుధ బసవేశ్వరరావు గారు పరిచయం చేశారు .మూర్తిగారిద్వారా మంచికవి ‘’మంకు శ్రీను గారికి సరసభారతి పుస్తకాలు అందజేశాను .20 17 డిసెంబర్ 24 న గుంటూరు జిల్లా రేపల్లె లో ఆవిష్కరింపబడిన రెండు ఉద్గ్రంధాలు శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ ,శ్రీ డి విజయభాస్కర్ గార్లకు  అందజేశాను. అంతకు ముందు మూర్తిగారు నా చేతిలోనుంచి వాటిని తీసుకొని ‘’చూసి మంచి ప్రయత్నం బాగున్నాయి .మీబ్లాగ్ కు రెగ్యులర్ ఫాలోయర్ ను నేను ‘’అన్నా ,అదీ నాకు మామూలే అనిపించి పట్టించుకోలేదు .ఉయ్యూరులో జరిగే ఆ రెండు సంవత్సరాల కవి సమ్మేళనానికి అందరితోపాటు వారికీ ఆహ్వానం ఇచ్చానేమో కాని ప్రత్యేకంగా  ఆహ్వాని౦చనూ లేదు . కారణం ఆయన నాలాగా ఎక్స్పోజ్ ఆయె రకం కాదు .’’నాడబ్బా నేను కొట్టుకున్నాను ‘’.నాచేష్టలకు ఆయన నవ్వుకొని ఉంటారని పిస్తోంది .

జూన్ 10 ఆదివారం  విజయవాడ టాగూర్ లైబ్రరీలో  ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యం లో ‘’ఆంద్ర ప్రదేశ్ ‘’పై జరిగిన ‘’ఏక దిన కవి సమ్మేళనం ‘’లో మరలా మూర్తిగారిని చూశాను. మన ‘’వసుధైక కుటుంబం ‘’కవితా సంకలనం ఇచ్చాను .ఆయన ‘’ముద్దోస్తున్నావోయ్ గోపాలం ‘’అనే తమ కథా సంపుటి నాకు ఇచ్చారు .అంతే తప్ప ఒక్కమాట కూడా’’ లయన్ బందా’’ గారన్నట్లు ‘’తద్దినం ‘’(అంటే ఆ రోజు )నాడు అస్సలు మాట్లాడుకోలేదు ఇద్దరం .

సోమవారం వారికి ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’పంపాను .రెండుమూడు రోజులతర్వాత మూర్తిగారు 1-‘’గోదారమ్మా దండాలమ్మా ‘’అనే స్వీయ దీర్గకవిత పుస్తకం 2-జలవాణి ౩-నాదేశంకవితా సంకలనాలు 4-స్వీయ కధలు ‘’తుంగ చాప ‘’సంపుటి 5-తెలుగు కధానిక 20 16 సంకలనం ఆత్మీయంగా పంపారు .అంటే నేను పంపిన రెండు పుస్తకాలకు నాలుగు పుస్తకాలు బోనస్ గా వచ్చాయన్నమాట .’’గోపాలం ‘’ను సోమవారం నుండే చదివటం ప్రారంభించి మిగతా నాలుగూ నిన్నా ఇవాళ పూర్తి  చేశాను .అప్పుడు అనిపించింది ‘మూర్తి గారిలో ‘’నాకు తెలియని అపరిచితుడు ‘’ఉన్నాడు అని .చాలా ఆనందం వేసింది .నిండు కుండ తొణకదు’’అని పెద్దలు ఎందుకన్నారో నాకు అర్ధమయింది .ఆయనకున్న విషయపరిజ్ఞానం ,సాహితీ మూర్తిమత్వం ,స్నేహశీలత ,మానవత్వం పై మమత వెలకట్టలేనివి అని  తెలిసింది  ఆయన ఒక విశ్వ విద్యాలయం .ఆయన చేస్తున్న అపార సాహితీసేవ నిరుపమానమైనది .ప్రముఖులతో ఆయనకున్న గాఢ పరిచయాలు ఆయన రాసిన,ప్రచురించిన  పుస్తకాలు ,ఎందరెందరో సాహితీ ప్రియులకు చేసిన సన్మాన సత్కారాలు ,పొందిన బిరుదులూ చూస్తే ఆయన సాహితీ విరాట్ స్వరూపం నాకు  అవగతమైంది  .సాహితీ బంధువులకు మూర్తిగారిని పరిచయం చేయటం అంటే కొండను అద్దం లో చూపటమే .నేను వారి వ్యక్తిత్వ ఆవిష్కరణకు ఏమాత్రమూ తగిన వాడిని కాను అని వినమ్రంగా తెలియ జేసుకొంటూ ,వారి పుస్తకాల ద్వారా నాకు లభించిన  నేను తెలుసుకున్న విషయాలను మీకు అందజేసి   వారి బహుముఖ శేముషిని తెలియబరచే  చిరు ప్రయత్నం చేస్తున్నాను .

 

 

పుట్టుక ఎదుగుదల

మూర్తి గారు అంటే శ్రీ మలపాక రామవెంకట సత్యనారాయణ మూర్తి .అందరికి ఎం .ఆర్ .వి .సత్యనారాయణ మూర్తి గా పరిచయం. శ్రీ మలపాక సుబ్రహ్మణ్యం శ్రీమతి యజ్నమ్మ దంపతులకు 30-9-1951 ప .గో. జి .పెనుగొండలో జన్మించారు .పెనుగొండశ్రీ  వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు జన్మించిన పవిత్ర క్షేత్రం .మూర్తిగారు విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసి రిటైరయ్యారు .శ్రీ మతి రాజేశ్వరిని వివాహమాడి   ఏకైక కుమార్తె రమ్య గాయత్రికి జన్మనిచ్చారు  కవి ,రచయిత మాత్రమేకాదు గొప్ప గాయకుడు కూడా.వ్యాఖ్యాత ,నటుడు, దర్శకుడు అదనపు అర్హతలు .రేడియో ,టి.వి.ఆర్టిస్ట్ గా సుప్రసిద్ధులు.

సాహితీ మూర్తిమత్వం

ఇప్పటిదాకా 200 కథలు  ,300 కవితలు ,20 నాటికలు ,20 గేయాలు ,20 వ్యాసాలూ రాసిన సాహితీ స్రష్ట .

వీరి స్వంత రచనలలో –అక్షర దీపాలు గేయ సంపుటి ,అక్షర భారతం  సమైక్య భారత్ నాటికలు  ,అమ్మకోరిక ,పెళ్లి చూపులు ,ఆమే గెలిచింది,తూరుపు వెళ్ళే రైలు ,తుంగ చాప ,నందిని –నందివర్ధనాలు మూడో కొడుకు ,మా వూరి కోరిక ,కథా ,సంపుటులు ,ఆశ ,అమ్మే జీవనవేదం , వెన్నెలవాన ,కవితా సంపుటులు ,కాగితప్పడవలు నానీలు ,, అక్షరం నామార్గ దర్శి ,మినీకవితా సంపుటి , గోదారమ్మా దండాలమ్మా-దీర్ఘ కవిత .

స్వీయ సంపాదకత్వం లో అభినందనం ,నీరాజనం ,ప్రత్యేక సంచికలు ,స్పందన ,ముత్యాలసరం ,నేటి ప్రపంచం ,హరివిల్లు ,మొదలైన కవితా కదల సంకలనాలు సంపుటులు వెలువరించారు పశ్చిమ గోదావరి జిల్లాస్వాతంత్రోద్యమ చరిత్ర పై సమగ్ర పరిశోధన గ్రంథం రాశారు . ఆంగ్లం లో ‘’వాయిస్ ఆఫ్ వాటర్ ‘’కవితా సంకలనం తోపాటు 20 14 నుండి ప్రతి సంవత్సరం ‘’తెలుగు కధానిక ‘’సంకలనాన్ని తెస్తున్నారు .అంటే మూర్తి గారు స్పృశించి సువర్ణమయం చేయని సాహితీ ప్రక్రియలేదు ‘.

రమ్య సాహితీమూర్తి

తాము జన్మించి వర్ధిల్లిన పెనుగొండ లోనే  ‘’రమ్య సాహితీ సమితి ‘’అనే సాహిత్య సంస్థ ను నెలకొల్పి  వ్యవస్ధాపక అధ్యక్షులుగా తీర్చి దిద్దుతున్నారు . ఈసంస్థ ద్వారా ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పుస్తక ప్రచురణ చేస్తూ ,పెనుగొండకు ‘’సాహిత్య అండ ‘’గాభాసిస్తున్నారు . మూర్తిగారు ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షులు .పెనుగొండ సీనియర్ సిటిజెన్ వెల్ ఫేర్ సంఘ కార్యదర్శి కూడా .

పురస్కారమూర్తి

మూర్తి గారి ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకున్నారు .అందులో ముఖ్యమైనవి –గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం ,ప.గొ జి ఉగాది పురస్కారం ,తుంగ చాప కదా సంపుటికి అమెరికా వంగూరి ఫౌండేషన్ పురస్కారం ,గీతం పురస్కారం ,నవ్యరాగ మాసపత్రిక పురస్కారం ,హాస్య లఘు నాటిక కు ‘’మళ్ళ జగన్నాధం స్మారక పురస్కారం వంటివెన్నో ఉన్నాయి ‘.

బిరుదమూర్తి

మూర్తిగారి ని వరించిన బిరుదులెన్నో సార్ధకం చెందాయి  -అందులో ప్రముఖమైనవి –సాహిత్య రత్న ,ఆంద్ర రత్నం ,ఆంద్ర దేశం లోని వివిధ సాహితీ సంస్థలు మూర్తి గారిని ఆహ్వానించి గౌరవించి పురస్కారాల౦దించాయి ‘’ఉత్తమకవి ‘’పురస్కార గ్రహీత .

విస్తృత సాహితీ మూర్తి

వీరి సాహితీ వ్యాసంగం బహు విస్త్రుతమైనది .వందకు పైగా కవి సమ్మేళనాలు ,పది శతాధిక కవి సమ్మేళనాలు ,మూడు అంతర్జాతీయ కవిసమ్మేళనాలలో తమ కవితాగానం వినిపించిన కవి వరేణ్యులు మూర్తిగారు .ఆకాశవాణిలో 30 ప్రసంగాలు చేశారు .30 కదానికలకు ,30 నాటికలకు గాత్ర ధారణ చేశారు .వీరు నటించిన ‘’అన్వేషణ ‘’రేడియో నాటకం జాతీయ స్థాయిలో మూడవ స్థానం పొందింది .వీరికవితలు ఆంగ్లం ,ఉర్దూ హిందీ భాషలలోకి ,కధలు ఆంగ్ల ,కన్నడ భాషలలోకి అనువాదం పొందాయి . కనుక మూర్తిగారు ‘’సాహితీ విశ్వమూర్తి ‘’.శ్రీ విహారి అన్నట్లు ‘’అక్షర తపస్వి ‘’.

మూర్తిగారి పుస్తక విశేషాలను తరువాత తెలియ జేస్తాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-18 –ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Attachments area

Posted in రచనలు | Tagged | Leave a comment

పుల్లూరు హైస్కూల్ 1989-90 బాచ్ తో ఇప్పుడు ,అప్పుడు ఫోటోలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూగ బోయిన వేయి గొంతుక” మాధవ వేణు ”జ్యోతి-20-6-18

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత
వరంగల్: మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో ఆయన జన్మించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1947లో పదహారేళ్లకే ఆయన తన కెరీర్ ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో మిమిక్రి ప్రదర్శన చేసిన తొలి తెలుగు వ్యక్తి. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఏయూ, కేయూ, ఇగ్నోల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1978లో ఏయూ నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు. వరంగల్ కొత్తవాడలో ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ, ఉర్దూల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. చిలకమర్తి ప్రహసనాల్లో నటించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. సంక్షిప్త వార్తలు ‘అలా న‌డ‌వ‌డం’ దేవ‌సేన త‌ప్పు కాదు భీష్ముడు గురించి తెలియని కొన్ని నిజాలు రాహుల్ గాంధీ పుట్టిన రోజు, ప్రధాని మోడీ శుభాకాంక్షలు మిమిక్రీ కళలో ఆయన ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. నేరెళ్ల ప్రతిభకు మెచ్చిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.. శివదర్పణం సంపుటిని అంకితం ఇచ్చారు. నేరెళ్లపై ఐవీ చలపతి రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ పుస్తకాలు రాశారు. ప్రముఖ నిర్మాత బీఎన్ రెడ్డి ప్రోద్బలంతో సినిమాల్లో నటించారు నేరెళ్ల వేణుమాధవ్. దాదాపు పన్నెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పీవీ నర్సింహా రావు సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంగా నామకరణం చేశారు.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆత్మీయత చిలికించిన చిలుకూరి వారి గూడెం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

ఆత్మీయత చిలికించిన చిలుకూరి వారి గూడెం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

14 వ తేదీ గురువారం రాత్రి -8- 23 కు పుల్లూరు అనే చిలుకూరివారి గూడెం హైస్కూల్ పాత విద్యార్ధి తిరుపతి రావు ఫోన్ చేసి ‘’సార్ !మే ఫోన్ నంబర్ కోసం రెండు రోజుల్నించీ ప్రయత్నిస్తున్నాం ,ఎప్పుడో ఒకసారి మీ అబ్బాయి రమణ జర్నలిస్ట్ అని చెప్పినట్లు జ్ఞాపకం ,జర్నలిస్ట్ లిస్టు లో ఆయన పేరు కనుక్కుని ఫోన్ చేసి ఆయనద్వారా మీనంబర్ సంపాదించి ఫోన్ చేస్తున్నాను .ఆదివారం 1989-90 బాచ్ టెన్త్ విద్యార్ధుల సమ్మేళనం హై స్కూల్ లో ఏర్పాటు చేస్తున్నాం .మీరు ,మేడంగారు ఇద్దరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి .వెహికిల్ మేము ఏర్పాటు చేస్తాం .రేపు మళ్ళీ మీకు తెలియజేస్తాను తప్పక రండి ‘’అన్నాడు .’’సరే ‘’అన్నాను .మర్నాడు అతని నుంచి ఫోన్ రాలేదు .శనివారం ఉదయం అతనికి నేనే ఫోన్ చేసి ‘’నువ్వు చెప్పిన కార్యక్రమం ఈ ఆదివారమేనా ?”’అని అడిగాను .అతను’’అవును సార్.  నేనె ఫోన్ చేద్దామ నుకుంటుంటే మీరే చేశారు ధాంక్స్ సార్.రాత్రి మేము మీ కోసం ఏ .సి .వెహికిల్   పంపాలని నిర్ణయించాం .డ్రైవర్ ఫోన్ నంబర్ మీకుమేసేజ్ పెడతాను .అతని కి మీ నంబర్ ఇచ్చాను తప్పకరండి’’ .అన్నాడు .పుల్లూరు వెళ్ళటం అంటే ఫుల్ హుషార్ నాకు .డ్రైవర్ కు ఫోన్ చేసి ఆదివారం ఉదయం 7 గం.కు ఉయ్యూరు లో బయల్దరేట్లు రమ్మని చెప్పాను .సరేఅన్నాడు .అక్కడికి వెడితే హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవులు ను కలవాలని అనుకోని ఆయన ఫోన్ నంబర్ అతనిద్వారా తెలుసుకొని వస్తున్నట్లు తెలిపితే ,తనకు ఆహ్వానం లేదని కనుక రాలేనని అక్కడ మీటింగ్ అవగానే కలుద్దామని అన్నారు ఓకే అన్నాను .తిరపతిని ఎందరు విద్యార్ధులు వస్తారని అడిగితె తమ బాచ్ 38 మంది అని అందులో ముగ్గు రు చనిపోయారని మిగిలిన వాళ్ళందర్నీ కాంటాక్ట్ చేశామని కనీసం 30 మంది వస్తారని ,టీచర్స్ లో నేనూ ,హిందీ మేడం మాత్రమె వస్తున్నారని చెప్పాడు .కనుక రాఘవులుగారికి ఒక సెట్ ,విద్యార్దులకోసం 35 సరసభారతి పుస్తకాలు అన్ని రకాలు ఉండేట్లు తీసుకు వెళ్ళటానికి సిద్ధం చేశాను

  ఆదివారం ఉదయం 5 కే లేచి స్నానం సంధ్య పూజాదికాలు పూర్తి  చేసి రెడీగా ఉన్నాం .7 గంటలకల్లా ఏ సి కారు తో డ్రైవర్ క౦కిపాడునుంచి వచ్చాడు .బయల్దేరే సరికి 7-15 .అప్పటికే రెండుసార్లు కాఫీ లాగించాను .టిఫిన్ దారిలో ఎక్కడైనా చేయచ్చు అనుకున్నాం .డ్రైవర్ బాబి చలాకీ కుర్రాడు .బయల్దేరేటప్పుడు కాఫీ ఇస్తే కాఫీ టీలు అలవాటు లేదన్నాడు .క౦కి పాడువాడు .పుల్లూరులో బంధువులున్నారట .వాళ్ల ద్వారా కుదిర్చాడు తిరుపతిరావు .కంకిపాడు ,గన్నవరం ,బాహుబలేంద్ర గూడెం అగిరిపల్లి ,గణపవరం మైలవరం మీదుగా చిలుకూరి వారిగూడెం చేరాం .గంటా నలభై అయిదు నిమషాల్లో వచ్చేశాం కనుక దారిలో టిఫిన్ గట్రా ఏమీ చేయలేదు .ఉదయం 9 కి స్కూల్ దగ్గరున్నాం .అప్పటికే తిరుపతిరావు రాధాకృష్ణ, శివరాం  వరలక్ష్మి మొదలైన వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ కనిపించి పలకరించి ఆత్మీయంగా ఆహ్వానించారు .మేడం గారిని తీసుకురావటం వాళ్లకు ఎంతో బాగా సంతోషం కలిగించింది .టిఫిన్ చేశారా అంటే ‘’లేదు తొమ్మిది లోపు చేసే అలవాటు లేదు ‘’అన్నాం .వెంటనే ఇడ్లీలు తెప్పించారు .వేడివేడిగా బాగున్నాయి  నాకిష్టమైన పల్లీ చట్నీ .మామూలుగా రెండే తినే వాడిని రుచి బాగుండటం తో మూడు ఇడ్లీలు లాగించా .తర్వాత కాఫీ ఇచ్చారు .క్రమంగా అందరూ చేరేసరికి 10 అయింది .అందరికీ సమోసాలు తెప్పించిపెట్టారు .కాఫీ టీ లు ఇచ్చారు .హిందీ టీచర్ వరలక్ష్మిగారు భర్తా వచ్చారు  ఆవిడమాకు నాలుగు పెద్దరసం లాంటిమామిడి పళ్ళు ఇచ్చింది .తిరపతి నా దగ్గరకొచ్చి ‘’సార్! ఎలా నిర్వహించాలో మాకు తెలీదు మీరు గైడ్ చేయాలి ‘’అని కోరగా అలాగే అని చెప్పి సూచనలిచ్చాను .

 ఉదయం 11 గంటలకు వందేమాతరం తో  సమావేశం ప్రారంభైంది  .వేదికమీదకు మాదంపతులను ,వరలక్ష్మి దంపతులను ఆహ్వానించారు .వెనకాల తెరపై ఆబాచ్ ఆనాడు తీయించుకున్న ఫోటో బాక్ డ్రాప్ గా పెట్టి నిండుతనం తెచ్చారు .మంచిమంచి పుష్పాలతో కలర్ఫుల్ గా వేదిక ఏర్పాటు చేశారు .ముందుగా ఆ బాచ్ కు చదువు చెప్పి తనువు చాలించిన 1- లెక్కలమేస్టారు శ్రీ పురుషోత్తమాచారి 2-  సోషల్ మాస్టారు శ్రీ గురుప్రసాద్ ,౩-సెకండరి టీచర్ శ్రీ శేషగిరిరావు 4- శ్రీ నరసింహా రావు ,లకు మరణించిన ముగ్గురు విద్యార్ధులకు అందరం  లేచి నిలబడి మౌనం పాటించి వారి ఆత్మకు శాంతికలగాలని ప్రార్ది౦చా౦  .

 తర్వాత ఆడపిల్లలు సారీ అప్పుడు పిల్లలు కాని ఇప్పుడు 47ఏళ్ళు దాటిన పిల్ల తల్లులు అంటే గృహిణులు తమను తాము వరుసగా పరిచయం చేసుకున్నారు .అందులో సుజాత అనే ఆనాటి స్కూల్ ఫస్ట్ విద్యార్ధిని తాను ఏం ఎసి  బిఎడ్ చేసి రెండుమూడు సార్లు టీచర్ పోస్ట్ కు ప్రయత్నించి విఫలమై హైదరాబాద్ లో లెక్కల లెక్చరర్ గా ప్రైవేట్ కాలేజిలో పని చేస్తున్నాని ,తనభర్త కూడా పెద్ద ఉద్యోగస్తుడే అని ,పిల్లల సంగతీ చెప్పింది .ఆమె మాట్లాడిన తీరు అందరికీ కౌన్సెలింగ్ చేసినట్లుగా ఉంది .మిగతా వాళ్ళు కూడా తమగురించి కుటుంబం గురించీ ,పిల్లల చదువులు ,ఉదోగాలగురించి వివరించి చక్కగా ఆత్మీయంగా పరిచయం చేసుకున్నారు .

  తర్వాత మగపిల్లలు అంటే ఈనాటి గృహస్తులైన ఆ నాటి  విద్యార్ధులు తమ గురించి ,తమకు విద్య నేర్పిన గురువుల గురించి వివరంగా చెప్పారు .అందులో శివరాం అనే కుర్రాడు ముదురుగడ్డం, మీసం తో సినీ హీరో లా ఉన్నాడు .తాను నాలుగైదు టివి సీరియల్స్ లో నటించానని ,ఇటీవలే విడుదలైన ఒక సినిమాలో హీరోగా చేశానని ,ఇంకో సినిమా ఒకవారం లో మొదలౌతు౦దని చెప్పి ‘’ఈ హెడ్ మాస్టారు మాకు ఇంగ్లీష్ అద్భుతంగా చెప్పారు. అదంటే మాకున్నభయం పోగొట్టారు .తేలికగా ఎలా రాయాలో చక్కగా వివరించేవారు .ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ‘’అన్నాడు .చాలా సార్లు మా దంపతులకు పాదాభి వందనం చేసి తన వినయాన్ని తెలియ జేశాడు .నా కోరికపై మాతో ఫోటో లు దిగాడు .అలాగే తిరుపతి రావు ,రామారావు మొదలైన వాళ్ళు అందరూ చాలా ఆప్యాయంగా తమవిషయాలు నా విషయాలు చెప్పారు .రామారావు ఇప్పుడు ఈ స్కూల్ కమిటీ చైర్మన్ కూడా .కొందరైతే ‘’ఈ హెడ్మాస్టారు రాకపోయి ఉంటె మనలో చాలామంది పాస్ అయి ఉండేవాళ్ళం కాదు .ఎక్కువ మంది పాస్ అవటానికి చాలాకస్టపడి మమ్మల్నీ చదివించి స్కూల్ లోనే ఉంటూ రాత్రి వేళ మమ్మల్ని స్కూల్ లో పడుకునే ఏర్పాటు చేసి దోమ తెరలో పడుకుని ఉన్నా ‘’ఒరేయ్ .నిద్రపోతున్నావ్ .లేచి మొహం కడుక్కొని చదువు ‘అంటూ ఎలాకని పెట్టి చెప్పేవారో ఆశ్చర్యం వేసేది ‘’అన్నాడు .అలా అందరూ తమ అనుభవాలను తమకు తోచిన విధంగా వివరించారు .ఇంగ్లీష్ మాత్రమేకాదు హెడ్ మాస్టారు లెక్కలు సైన్స్ లనూ మాకు బోధించి వాటిలోనూ మార్కులు బాగా వచ్చేట్లు చేశారు అన్నాడు రాధాకృష్ణ .

  తర్వాత హిందీటీచర్  తమ అనుభవాలను చెప్పారు .తన క్లాసును నేను ఎలాపర్యవేక్షి౦చి  ఏయే సలహాలు ఇచ్చానో వాటిని పాటించి విద్యార్ధులకు ఎలా ఉపయోగపడ్డారో చెప్పారు తర్వాత ఆమె భర్త సైన్స్ మాస్టర్ చేసి రిటైర్ ఆయన ఆయన మాట్లాడారు .

చివరగా నేను మాట్లాడాను –‘’1989 సెప్టెంబర్ లో ఈ స్కూల్ లో చేరా .నాముందు హెడ్ మాస్టర్ శ్రీ హనుమంతరావు  నాతర్వాత హెడ్ శ్రీ రామారావు నాకు బి ఎడ్ లో క్లాస్ మేట్స్ .ఇక్కడ పని చేయటానికి ఉయ్యూరునుంచి రావాలి అంటే దాదాపు 8 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి .అందుకని తెల్లవారు జామున 4 కే లేచి స్నానం సంధ్య పూజ పూర్తి  చేసి అప్పటికే మా ఆవిడ చేసిన టిఫిన్ టిని కారీర్ లో పెట్టిన భోజనం తెచ్చుకుని ఇక్కడికి నానాతంటాలు పడి చేరేసరికి 9-30 అయ్యేది .వచ్చిన దగ్గరనుంచి ఉరుకులు పరుగులు. శ్రీ అప్పిడి వెంకటేశ్వరరెడ్డి గారు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ మంచి సహకారం ఇచ్చారు .లెక్కల మేస్టారి తల్లి ,భార్య గార్లు తమ కుటుంబ సభ్యుడిగా ఆదరించారు .ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో ఈ స్కూల్ లో టీచర్ గా చేరి హెడ్ మాస్తారాయి అప్పర్ ప్రైమరీ చేసి హై స్కూల్ తెప్పించి దీని అభి వృద్ధికి కృషి చేసిన శ్రీ కృష్ణ దాస్ గారి సేవ మరువ రానిది .ఆయనతర్వాట అన్గాలూర్ దయట్ లెక్చరర్ అయి తర్వాత డి ఇ వో ఆఫీస్ లో ఎక్సామినర్ అయ్యారు .నాకు రోజూ కూరలు పచ్చళ్ళు పంపేవారు ఆచారిగారు .వార్డెన్ రాఘవులు గారు రెండుపూట్ల హాస్టల్ నుంచి గడ్డ పెరుగు విడిగా తోడు పెట్టించి పంపేవారు .లేక్కలమేస్టారు ,నేనూ శేషగిరిరావు గార్లు ముగ్గురం అత్యంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం .వాళ్ల సపోర్ట్ తో స్కూల్ లో అద్భుతాలు సృష్టించాం..ఇక్కడి విద్యార్ధులు చాలా వినయ విదేయతలున్నవారు. కాని చదువులో బాగా వెనకపడి ఉండేవారు .అందులో హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ .వారికి అక్కడ చదువులో గైడెన్స్ లేదు .అందుకని వార్డెన్ గారికి చెప్పి వాళ్ళను రాత్రి పూట స్కూల్ లోనే పడుకో బెట్టె ఏర్పాటు చేశాను .నేను నాహెడ్ మాస్టర్ రూమ్ వెనకాల బీరువాల మధ్య టేబుల్ పై వంట చేసుకొనే వాడిని .ఉదయం విద్యార్ధులకు9-30 వరకు  లెక్కలు ఇంగ్లీష్ బోధించేవాడిని .రాత్రి వేళ చదివి౦చేవాడిని  దీనితో వాళ్ళలో ఉత్సాహం కలిగింది.కష్టపడాలన్న ఆలోచన వచ్చింది .సబ్జెక్ట్ లనుసి౦ప్లి ఫై చేసి బోధించమని టీచర్స్ కు చెప్పేవాడిని .వాళ్ళు ఆ సూచనలు పాటించి పాసవటానికి తగినట్లు చెప్పేవారు .మెరిట్ స్టూడెంట్స్ కు ప్రత్యెక శిక్షణ ఇచ్చేవాళ్ళం నేనూ లేక్కలమేస్టారు   అందుకేఆ సంవత్సరం బాగా పాసై స్కూల్ కు పేరు తెచ్చారు ఈబాచ్ వాళ్ళు .ఇందులో రాంబాబు అనే పొట్టి కుర్రాడు హాస్టల్ లో ఉంటూ స్కూల్ లో పడుకుని చదివి ,నా అంట్లు తోమి నీళ్ళు తెచ్చి పెట్టేవాడు .చదువులో చాలాపూర్ .కానీ చివర్లో బాగా కృషి చేయించాను .వాడూ పాసైనాడు .రిజల్ట్స్ రాగానే నాదగ్గరకొచ్చి ’’సార్!మీ అంట్లు తోమటంవలన నేను పాసయ్యానుసార్ ‘’అన్నాడు అమాయకంగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తోచక .రాధాకృష్ణ పాసై సుమో నడిపాడు .నన్ను మైలవరం నుంచి డబ్బులు తీసుకోకుండా ఇక్కడ దించేవాడు .సుజాత బాగా చదివేది .స్కూల్ ఫస్ట్ వచ్చింది .తర్వాత బాచ్ లో శేషగిరిరావు గారబ్బాయి శ్రీనివాస్ స్కూల్ ఫస్ట్ .నాగార్జున సాగర్ కు విహార యాత్రకు తీసుకు వెళ్లాం. ఈ బాచ్ రెండు సెక్షన్లు చేశా .ఒక సెక్షన్ కు ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ నేనె పూర్తిగా బోధించా. రెండో సెక్షన్ కు పి ఎస్ చెప్పా .ఇంత హెవీ వర్క్ చేశాను ఇక్కడ .వార్షికోత్సవాలు జరిపాం .బహుమతులిచ్చాం .స్వాతంత్రదినోత్సవం రిపబ్లిక్ డే ఉపాధ్యాయ దినోత్సవాలు ఘనంగా చేశాం .విద్యార్దులనుంచి వసూలు చేసిన దబ్బు అంతా వాళ్ళకూ స్కూల్ అభి వృద్దికే ఖర్చుచేశాం .ఇంతటి ప్రేమ అనురాగం ఆప్యాయత గౌరవం మన్నన మమకారం మీ రంతా మా పట్ల చూపించి మా వయసును 28 ఏళ్ళు తగ్గించేశారు .మాలో మళ్ళీ యువక రక్తం ప్రవహించేట్లు చేశారు .మీరందరూ ఇంతఖర్చుపెట్టి ఈసమ్మేళనం జరిపి  మాఆశీస్సులు కోరటం మీ సంస్కారాన్ని తెలిజేస్తోంది .కనుకమీర౦దరూ మీ కుటుంబాలతో వంశాలతో అభి వృద్ధి సాధించి ఇలాగే వీలైనప్పుడల్లా కలుసుకొంటూ తీయనిజ్ఞాపకాలను నెమరు వేసుకోవాలి .ఈ పాఠ శాల అభి వృద్ధికి మీవంతు సహకారం అందించి మెప్పు పొందాలి .’’అని చెప్పి తర్వాత సరసభారతి విషయాలన్నీ తెలియజేసి టేబుల్ పై నేను తెచ్చిన పుస్తకాలు పెట్టి ,ఎవరికి కావలసిన పుస్తకం వాళ్ళు తీసుకోమని చెప్పి అందరూ తలొక పుస్తకం తీసుకునేట్లు చేసి ఇంకాకావలసినవారు అందులో ఉన్న నా అడ్రస్ కు ఫోన్ చేసినా, మెయిల్ చేసినా పుస్తకాలు ఉచితంగా పోస్ట్ ఖర్చులు మేమే భరించి పంపిస్తామని చెప్పి అమెరికా అయిదు సార్లు వెళ్ళివచ్చిన సంగతి అక్కడ సరసభారతి శాఖ ఏర్పాటు చేసిన విషయం ,అక్కడి మాకార్యక్రమాలు వాటిని ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’గా తెచ్చి ఇక్కడా అక్కడా ఆవిష్కరించటం తెలిపాను .

  తర్వాత అందరూ కలిసి మా దంపతులకు ,వరలక్ష్మి దంపతులకు నూతనవస్త్రాలుఅంటే పాంట్ ,షర్ట్  లతో ,శాలువా  కప్పి  ఆనాటి ఫోటో జ్ఞాపికగా ఇచ్చి ఘన సత్కారం చేశారు అందరూ పాద నమస్కారాలు చేయగా అక్షితలతో ఆశీర్వ దించాం .ఒక శిష్యుడు ప్రత్యేకంగా రెండు తెల్లని షర్ట్ బిట్స్ చేతిలో పెట్టి ‘’సారర్ !ఇవి మీకు బాగా ఉంటాయి తప్పకుండా నాకోసం కుట్టి౦చు కోవాలి ‘’అని ప్రాధేయ పడ్డాడు సరేనన్నాను  .అలనాతిఫోతోలో నేను వేసుకున్నది తెల్లని షర్ట్ .అందుకే అలా చేశాడేమో .

  తర్వాత అందరికీ విందుభోజనం .రెండు స్వీట్లు రెండు హాట్లు పప్పు కూర పచ్చడి బిర్యాని సాంబారు మోడల్ డైరీ గడ్డ పెరుగు తో మంచి భోజనం పెట్టారు .

 అందరి భోజనాలు అయ్యాక మరొక్క సారి సమావేశమై మాతో ఆ నాటి  విద్యార్ధులందరికీ జ్ఞాపికలు అందజేయించారు .మళ్ళీ  కృతజ్ఞతలు  తెలిపారు .మా శ్రీమతిని మాట్లాడమని కోరారు ఆమె ‘’ఇక్కడి ఆడపిల్లలు అందరూ మా అమ్మాయిలూ, మగపిల్లలంతా మా అబ్బాయిలు లాగా కనిపించారు మనమంతా ఒకే కుటుంబం అనే భావన కలిగించారు మీ అందరికీ మంచి జరగాలని కోరుతున్నాం ‘’అనిముగించింది .నేను మళ్ళీ పది నిమిషాలు మాటాడి వాళ్లకు ఉత్సాహం కలిగించా .

  అందరికి మరోసారి ఆశీస్సులు పలికి ,కారు ఎక్కి దారిలో చండ్ర గూడెం ఆంజనేయ  స్వామిని దర్శించాం  .ఇక్కడి నూతిలో అతి చల్లని జలం మంచినీళ్ళు గా  బాటసారులకు అందజేస్తారు అదీ ప్రత్యేకం. ఇక్కడి మల్లెపూలు ఉయ్యూరు దాకా సువాసనలీను తాయి. ఇది మరో ప్రత్యేకత .కాని కొందామంటే మల్లెపూలు లేవిక్కడ నిరాశ చెందాం .లెక్కల మేష్టారు ఉయ్యూరు శ్రీ హనుమజ్జయంతి కి  మా పెద్దబ్బాయి శాస్త్రి పెళ్ళికి మల్లెపూలు తెచ్చిన విషయాలు జ్ఞాపకం వచ్చాయి .అక్కడనుంచి మైలవరం వెళ్లి వార్డెన్ రాఘవులు గారింటికి చేరి వారిచ్చిన చల్లని పానీయాలు సేవించి మన పుస్తకాలు ఆయనకు అందజేసి ఆనాటి ముచ్చట్లు చెప్పుకుని ,మళ్ళీ బయల్దేరి వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి,పాయకాపురం పైపులరోడ్డు మీదుగా రామవరప్పాడు ముత్యాలంపాడు కామినేని హాస్పిటల్ మీదుగా తాడిగడప కంకిపాడు మీదుగా ఉయ్యూరు కు సాయంత్రం 6-30 కి చేరుకున్నాం .దిగగానే తిరుపతిరావు కు ఫోన్ చేసి అభినది౦చి అందరినీ అభినందించినట్లు చెప్పమన్నా .అతని  పక్కనే ఉన్న రాదాక్రిష్ణకూడా మాట్లాడి మేమిద్దరం వచ్చినందుకు పొందిన ఆనందం వర్ణించలేనిది అన్నారు .ఇంతటి ఆత్మీయ వాతావరణం లో నిన్నటి ఆత్మీయ కలయిక జరిగి చిరస్మరణీయం చేసింది .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-18 –ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

1989-90 బాచ్ పుల్లూరు విద్యార్థుల ఆత్మీయ కలయిక -పేపర్ వార్తలు

1989-90 బాచ్ పుల్లూరు విద్యార్థుల ఆత్మీయ కలయిక -పేపర్ వార్తలు

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

27-6-18 ఆదివారం పుల్లూరు అనే చిలుకూరివారి గూడెం హై స్కూల్ 1989- 90బాచ్ పదవతరగతి విద్యార్ధులఅపూర్వ సమ్మేళనం , ఉపాధ్యాయ సత్కారం ,చంద్రగూడెం ఆంజనేయస్వామి సన్నిధిలో ,మైలవరం లో వార్డెన్ రాఘవులు గారింట్లో మేమిద్దరం

27-6-18 ఆదివారం పుల్లూరు అనే చిలుకూరివారి గూడెం హై స్కూల్ 1989- 90బాచ్ పదవతరగతి విద్యార్ధులఅపూర్వ సమ్మేళనం , ఉపాధ్యాయ సత్కారం ,చంద్రగూడెం ఆంజనేయస్వామి సన్నిధిలో ,మైలవరం లో వార్డెన్ రాఘవులు గారింట్లో మేమిద్దరం

 

https://photos.google.com/share/AF1QipMcRZDROThct7MZfeKDFo5zUiarqaF7jN_1yCS7XvfseWlTyVd_i5tSzJO-cqjT5g?key=YXdTTEYwTjJqZXdMb1pYcmtEcEFJOHNBOGFyLU1B

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం )

కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం )

పందిపై పార్ధుడు భయంకలిగించే తెల్లని లోహపు కొనఉన్న గోటి ఆకారం కల బాణాన్ని వేశాడు .దాని అగ్రం’’కోపించిన యముని చూపుడు వేలులాగా ‘’ఉన్నదట ‘’కుపితా౦త తర్జనా౦గు లిశ్రీః’’అంటాడు భారవి .ఇది ధనుంజయుని శత్రు సంహారక సామర్ధ్యాన్ని సూచిస్తుంది .వరాహం పై వాయునందనుడి తమ్ముడు  ప్రయోగించిన ‘’పరమాస్త్రం ‘’ ఆ అరణ్యాలలో ఉల్క లాగా ప్రకాశిస్తోందట .వందలాది పక్షుల అరుపుల శబ్దాన్ని కలిగిస్తోంది –‘’ పరమాస్త్ర పరిగ్రహోరు తేజః స్పుర దుల్కాకృతి విక్షిపన్వేషు’’.ఆబాణ ప్రయోగవేగం ఊహించిన దానికంటే ముందే లక్ష్యా న్ని చేరుకొనేట్లుగా ఉన్నదట .అతనా బాణ ప్రయోగ వేగం, లక్ష్య సామర్ధ్యం లను కవి భారవి మంచి శ్లోకం లో నిక్షిప్తం చేశాడు –

‘’అవిభావిత నిష్క్రమ ప్రయాణః-శమితాయమ ఇవాతి రంహసా సః

సహ పూర్వతరం ను చిత్త వృత్తే-రపతిత్వా ను చకార లక్ష్య భేదం ‘’

ఈ వరాహ సంహార పరాక్రమం కొద్ది సేపట్లో జరిగే కిరాతార్జునీయ యుద్ధానికి నేపధ్యమై౦ద న్నమాట .

కిరాత వేషం లో ఉన్న శివునితో అర్జునుడు చేసిన యుద్ధం ,చూపిన పరాక్రమం శ్రేష్ట తరం ,అనుపమం .శివుడు అనేక మహిమలు చూపి,హింసించినా అడుగు వెనక్కి వేయకుండా తన పోరాట పటిమ ఆవిష్కరించాడు పార్ధుడు .చివరికి కిరాతుని పాదాలు పట్టుకుని గిరగిరా తిప్పి విసరి వేసే దాకా సాగింది .ఈ పరాక్రమోన్నతికి పరమ శివుడు పరమాశ్చర్యం పొందాడు .ఆయన హర్షాతి రేకంతో ధనుంజయుని ఆప్యాయంగా కౌగిలించుకొని తన మెప్పును చూపాడు .అప్పడే కిరాత రూప శివుడు మాయం చేసిన అర్జునుని కవచ ,గాండీవ, అమ్ములపొది మళ్ళీ ఆర్జునుడిని అలంకరిస్తాయి .విస్మితుడైన ధనుంజయుడు శివస్వామిని పరిపరి విధాలుగా స్తోత్రాలతో స్తుతించి యెనలేని తన భక్తి  ప్రపత్తులను ప్రదర్శిస్తాడు .ఇక్కడ భారవి  రచించిన స్తోత్రం ఎంతో ప్రాచుర్యం పొందింది .అది పరమేశ్వర తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది .మనసునిండా అర్జున పరాక్రమాన్ని మెచ్చుకున్న మహేశ్వరుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ,ధనుర్వేదాన్ని అనుగ్రహిస్తాడు .శివుని ఆజ్ఞతో దిక్పాలకులూ ఆశీస్సులతోపాటు వివిధాస్త్రాలు ప్రసాదిస్తారు .ఈవిధంగా లక్ష్య సాధనలో భీభత్సుడు దిగ్విజయం సాధించాడు .

భారవికవి చిత్రించిన అర్జునుడు తొందర పాటు లేని స్థిర సంకల్పుడు .యుద్ధం తక్షణ కర్తవ్యం అని ద్రౌపది భీముడు ధర్మరాజుపై పరిపరి విధాల అంతకు ముందే ఒత్తిడి తెచ్చారు .అర్జునుడు ఒక్కడే సంయమనం పాటించాడు  .తన అభిప్రాయం మాత్రం చెప్పడు .అన్న ధర్మన్నపై అర్జునుని భక్తివిశ్వాసాలు అపారమైనవి .అన్నగారిఆజ్ఞను తూచా పాటిస్తాడు .వృద్ధ ముని వేషం లో వచ్చిన ఇంద్రునికి అతడు తన వృత్తాంతాన్నినివేదించి తాను ‘’ దాయాదులచేరాజ్య భ్రస్టు డై ఉంటున్న  జ్యేష్ట భ్రాత శాసనం లో  ఉంటున్న వాడినని –‘’స్థితః ప్రాప్తస్య దాయాదైః భ్రాతుః జ్యేష్టస్య శాసనే ‘’అనిపిస్తాడు భారవి .’’నేను లేని వియోగంతో మా అన్న ధర్మరాజు ద్రౌపదితోను సోదరులతోనూ రాత్రి వేళలో ఎక్కువ బాధ పడతాడు అంటూ ‘’మయా వినా భ్రుశం అభితవ్య తే’’అంటాడు .

మంచి ఆలోచనా పరుడైన అర్జునుడు మంచి చెడ్డల విషయం లో గొప్ప వివేకం కలవాడు .దుష్టులైన కౌరవులతో మైత్రి అంటే ‘నీడకోసం నదీ తీరాన్ని చేరటం లాంటిది ‘’అని ముని వేషం లో వచ్చిన ఇంద్రునికి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు .-

‘’ధార్త రాస్ట్రైః సహప్రీతి ర్వైర మస్మా స్వసూయత –అసన్మైత్రీ హి దోషాయ కూల చ్ఛేయేవ సేవితా ‘’

నీడ కోసం నది ఒడ్డుకు చేరితే అది కాసేపట్లోనే కూలి పోయి పెద్ద ప్రమాదమే కలిగిస్తుందని ,అలాంటిదే కౌరవులతో మైత్రి అనీ అంటాడు .ఇక్కడే అభిమానవంతుడి స్వభావాన్ని భారవి చాలా శ్లోకాలలో వర్ణిస్తాడు .మూకాసురుడు భయంకరం గా మీదకు విరుచుకు పడుతుంటే ‘’పూర్వ జన్మ లో నాతో శత్రుత్వం ఉన్న దానిలాగా వరాహం వస్తున్నట్లు ఉంది .నామనసు కల్మషం చేసి నన్ను చంపటానికి వచ్చే శత్రువై ఉండాలి .అరణ్యం లోని ఏ జంతువుకూ లేని పౌరుష పరాక్రమాలు దీనిలో కనిపిస్తున్నాయి .కనుక ఇది వేషం మార్చుకు వచ్చిన దానవుడో రాక్షసుడో అయి ఉండాలి .కాకపొతే దుర్యోధనుడికి ప్రీతికల్గి౦చ టానికి ఎవడో ఈ పందిరూపు ధరించి వచ్చి ఉంటాడు .ఒకవేళ ఖాండవ దహనం వలన ప్రతీకారేచ్చ తో తక్షకుని కొడుకు ఈ రూపం లో వచ్చాడేమో ?కాకపొతే భీముడి కోపానికి గురైన వాడెవడో ఇలావచ్చాడా ‘’?అని పరిపరి విధాల వితర్కి౦చు కున్నాడు .ఇవన్నీ అర్జునుని నిశిత ఆలోచన సరళికి దృష్టాంతాలు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-18 –ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు 

పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు

1989-90 బాచ్ పదవ తరగతి పుల్లూరు అంటే మైలవరం దగ్గరున్న చిలుకూరివారి గూడెం హై స్కూల్    పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేపు 17-6-18 ఆదివారం జరుగుతుందని ,అప్పటి హెడ్ మాస్టర్ ను నేనే కనుక నన్నూ  మా శ్రీమతినీ ,అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించారు .మేమిద్దరం రేపు ఉదయం బయల్దేరి వెడుతున్నాం -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 సరసభారతి 126 వ కార్యక్రమ0 ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు

ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు

 

సరసభారతి 126 వ కార్యక్రమ0గా  ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు  1-  ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు  ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి  మాజీ తెలుగు లెక్చరర్  శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన పూడి సులోచనా రాణి గార్లను డిగ్రీ విద్యార్ధులైన నవతరం యువతకు పరిచయం చేసే అవగాహన సదస్సు ,ఉయ్యూరులో స్థానిక ఎ .జి. అండ్. ఎస్. జి .డిగ్రీ కళాశాల  తెలుగు శాఖ తో కలిసి సంయుక్తంగా  30-6-2018 శనివారం మధ్యాహ్నం 1-30 నుండి 4-30 వరకు సెమినార్ హాల్ నందు నిర్వహిస్తున్నాము . సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

కార్యక్రమం

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –డా.శ్రీ డి.బాలకృష్ణ ,ప్రిన్సిపాల్

గౌరవ అతిధి ,సమన్వయ కర్త –డా .శ్రీ జి.వి .పూర్ణ చ౦ద్,ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా రచయితల  సంఘం –విజయవాడ

ఆత్మీయ అతిధులు –శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి – రిటైర్డ్ స్టేషన్ డైరెక్టర్-ఆల్ ఇండియా రేడియో  విజయవాడ-రజని గారి బహుముఖీన ప్రతిభ పై ప్రసంగం

శ్రీమతి బాలాంత్రపు ప్రసూన -లెక్చరర్  సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి –విజయవాడ(రజని గారి కోడలు )-రజని గాన వాహిని పై ప్రసంగం

శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ –ఇంగ్లిష్ లెక్చరర్ ,ప్రముఖ సాహితీ వేత్త –విజయవాడ-పెద్ది భొట్లవారి కథా సాహిత్య విశిష్టత పై ప్రసంగం

శ్రీమతి గుడిపూడి  రాధికారాణి- టీచర్ ,యువ సాహితీకెరటం  –మచిలీపట్నం-యద్దనపూడి నవలలలో స్త్రీ వ్యక్తిత్వచిత్రణ పై  ప్రసంగం

కార్యక్రమ నిర్వహణ –శ్రీ జి.శ్రీనివాస్  , శ్రీ జి .వేణుగోపాల రెడ్డి  –తెలుగు లెక్చరర్స్

శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి

మనవి –   ఈ’’ విద్యుల్లేఖ’’ నే ఆహ్వానంగా భావించి అతిధులు ,సాహితీ ప్రియులు విచ్చేసి జయప్రదం చేయ మనవి

ఆహ్వాని౦చు వారు

డా. డి  బాలకృష్ణ ,ప్రిన్సిపాల్ ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీకళాశాల-ఉయ్యూరు

గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు-ఉయ్యూరు

ఉయ్యూరు ,14-6-18


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం లో అర్జునుడు

కిరాతార్జునీయం లో అర్జునుడు -1

కావ్య నాయకుడైన అర్జున పాత్ర చిత్రణలో  భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న  దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌపది .అందులో అతడు త్వరలో ఇంద్రుని అనుగ్రహం పొందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం ‘’అనే పదాన్ని సార్ధకంగా ప్రయోగించి తనకు శబ్డంపైగల సాధికారతను తెలియ జేశా డని ఆచార్య సార్వభౌములంటారు .దీనికి మహావ్యాఖ్యాత మల్లినాద సూరి ‘’కుప్యాదన్య దకుప్యం ,హేమరూపాత్మకం ‘’అని వివరణ ఇవ్వకపోతే అర్ధం ఎవరికీ సులభంగా తెలిసేదికాదని వారన్నారు –

‘’విజిత్య యః ప్రాజ్యమయ చ్చదుత్తరాన్-కురూనకుప్యం వసు వాసవోపమః

స వల్కవాసాంసి తవాధునా హరన్ –కరోతి మన్యుం న కథం ధను౦జయః ‘’

వ్యాసమహర్షి తన మంత్రోపదేశానికి అర్హత కలవాడు ,కఠోరమైన తపస్సు చేయాల్సినవాడు  యుద్ధం లో పితామహ, ద్రోణాదులను జయించే సామర్ధ్యం కలవాడు అర్జునుడే అని గుర్తించి  ధర్మరాజుతో  ఇలా అంటాడు –

‘’యయా సమాసాధిత సాధనేన –సుదుశ్చ రామా చరతా తపస్యాం

ఏతే దురావం సమవాప్య వీర్య –మున్మీలితారః కపి కేతనేన ‘’

ఇక్కడ కపి కేతన శబ్దం సాభిప్రాయంగా కవి ప్రయోగించాడు. రామరావణ యుద్ధం లో సర్వ రాక్షససంహారకారకుడు హనుమంతుడు .అతడే ‘’జెండాపై కపి రాజు ‘’గా ఇప్పుడు అర్జునుని జెండా పై ఉండబోతున్నాడని సూచ్యార్ధం .కనుక అర్జునుడికి ఎదురు అనేది ఉండదని భావం .విద్యను ఉపదేశించేటప్పుడు కూడా ‘’యోగ్య తమాయ తస్మై వితతార ‘అంటాడు మహర్షి .అంటే ఆతడు యోగ్యతముడు అని తేల్చి చెప్పాడన్నమాట .

సరే వ్యాసర్షి ఉపదేశంతో  తపస్సుకు బయల్దేరాడు ధనుంజయుడు .ఏవైనా ఆట౦కా లేర్పడి కర్రాబుర్రా పారేసి చటుక్కున తిరిగొస్తాడేమో అనే ముందు చూపుతో బయల్దేరటానికి ముందే   తాను పూర్వం కౌరవులవలన పొందిన పరాభవాలనన్నిటినీ ఏకరువు పెట్టి౦ది .సహజంగానే సౌమ్యుడైన అతడు ఇప్పుడు భయంకరమైన శరీరం ధరించి బయల్దేరాడని భారవి వర్ణన .అప్పుడు అతడు ‘’క్రియా రూపం పొందిన అభిచారిక మంత్రం ‘’లాగా భీషణ రూపుడైనాడనివర్ణించాడు –‘’బభార రమ్యోపి వపుస్స భీషణం గతః క్రియాం మంత్ర ఇవాభి చారికీం ‘’అని ప్రత్యక్షం చేస్తాడు .సహజంగా ప్రకృతి ప్రేమికుడైన అతడుఇంద్ర కీలద్రికి వెళ్ళే  దారిలో నీటి జాడలలో  చేపల గంతులు ,ఆలమందల గమనం , గోపకుల జీవన విధానం ,పర్వత శోభ దర్శించి పులకించి పోతాడు .

కీలాద్రి చేరి తాను దేనికోసం వచ్చాడో ఆపని అంటే ఘోర తపస్సులో మునిగిపోతాడు .యోగ్యతముడైన అతడు తపోనిస్టలో  ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు భారవి –

‘’శిరసా హరిన్మణినిభః స వహన్ –కృత జన్మ నోభిష వణేన జటాః

ఉపమాం యయా వరుణ దీధితిభిః-పరి మృస్ట మూర్ధని తమాలతరౌ ‘’

భావం –

మరకత మణి  కాంతి తో సమానమైన కా౦తి కల అర్జునుడు నిత్యస్నానం వలన అతని శిరోజాలు సంస్కారం లేక జడలు కట్టేసి ఎర్రగా  మారిపోయాయి .శిరస్సుపై యెర్రని కాంతులు వ్యాపించటం వలన అతడు తమాల వృక్షం లాగా భాసిస్తున్నాడు .యధాప్రకారం ఎవరు తపస్సు చేస్తున్నా భంగం కలిగించే ఇంద్రుడు దేవకా౦తలను ప్రయోగించగా వాళ్ళు హావభావ శృంగారాలతో రెచ్చ గొట్టే ప్రయత్నం చేసి అతని  జితే౦ద్రి యత్వ౦ ముందు  పరాభవం పొందారు .అంతే కాదు చివరికి వాళ్ళే కామోద్రిక్తలైపోయారట .దీనినే భారవి ‘’మదన ముప పదే స ఏవ తాసాం ‘’అని అత్యద్భుతంగా వర్ణించి చెప్పాడు .అంటే సీన్ రివర్స్ అయిందన్నమాట .కనుక వ్యాసోపదేశం , ద్రౌపది హెచ్చరిక సార్ధకమైనాయని కవి వాక్కు .

కొడుకు తపస్సుకు మెచ్చి ఇంద్రుడే ముసలి ముని వేషం లో దిగివచ్చితపస్సు చాలించమంటాడు .చలించని అతని మనమెరిగి ,పరమేశ్వరారాధనకు ప్రోత్స హిస్తాడు .

చివరి పరీక్ష లో మూకాసురుడు భయంకర వరాహ రూపం అవక్ర పరాక్రమం తో  అర్జునుని చంపటానికి రావటం ,అతడు అనేకరకాలుగా ఆలోచించి చివరకు ‘’కురు తాత తపా౦స్య మార్గ దాయీ విజయా యేత్యల మన్వశాన్మునిర్మాం ‘’అని స్మరించి బాణం ప్రయోగించి పందిని చంపటానికి నిశ్చయించాడు .ఆ భీకర భయంకర ధనుంజయ రూపాన్ని కిరాత వేషంలో ఉన్న శివుడు చూసి ఆశ్చర్యపోతాడు .దీన్ని భారవికవి పరమాద్భుతంగా ఇలా చెప్పాడు –

‘’దదృశే థ  సవిస్మయం శివేన –స్థిర పూర్ణాయుత  చాప మండలస్థః

రచితస్తి సృణా౦ పురాంవిధాతుం –వధ మాత్మేన భయానకః పరేషాం ‘’

నిజానికి శివుడు తనంతటి వాళ్ళతోనే యుద్ధం చేస్తాడుకాని అల్పులతో యుద్ధం చేయడు .కనుక అర్జునుడికి త్రిపురాసుర సంహారం నాటి పరమేశ్వరుడుగా గోచరించాడు .కనుక సరి యోధుల మధ్య యద్ధం జరగబోతోంది .అతడి రుద్రత్వం భావి కురుక్షేత్ర సంగ్రామం లో కూడా కనిపిస్తుందని పిండితార్ధంగా పండిత ఆచార్య సార్వభౌముల వాక్కు .తరువాత ఏం జరగబోతోందో తర్వాతే తెలుసుకుందాం .

ఆధారం –భారవి భారతి –ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

 

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా

ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా

‘’పోలవరం కట్టాడంటా అదంతా మనం నమ్మాలంటా.అక్కడ డయాఫ్రం వాల్ గురించి బాబుగారు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు .అసలు డయాఫ్రం అంటే ఏంటండీ ?పలుచని పొర అని సైన్స్ లో మనం సదూకో నుండ్లా .చెవిలో ఉంటుంది .స్పీకర్ లో ఉంటాది .అదీ డయాఫ్రం .ఉఫ్ఫని ఊదితే పగిలి పోతుంది .అలాంటి దానికి ఇంతప్రచారమా ?ఇన్ని కోట్లు ఖర్చా అని అడుగుతా ఉన్నా .అందులోనూ డయాఫ్రం ఒకటిన్నర మీటర్ల వెడల్పంట .ఎవరి చెవిలో పువ్వు పెడతాడు బాబు .జనం నవ్వు తారనీ సిగ్గూ శరం కూడా లేదనీ అనాల్సోస్తోంది .ఎక్కడో నాలుగు అంగుళాల జాగాలో ప్రాజెక్ట్ కట్టి ,ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అనీ వాయిస్తున్నాడు ఆయన. మోడీ గారు ధనకనక వర్షం కురిపిస్తున్నా  ,ఈ చిన్నప్రాజేక్ట్ పూర్తి కావటానికి ఇంత కాలం పడుతుందా ?ఏ ఖజానాలో దాచారు ఈ డబ్బంతా అని నాలాగా అడిగే వారు లేరా ?పైగా మోడీ గారు డబ్బు ఇవ్వటం లేదని యాగీ .మహా మాయనాడులో కేంద్రం పై దుమ్మెత్తి పోయటం నామీదవిరుచుకు పడటం తప్ప అక్కడ సాధించింది ఏమైనా ఉన్నదా అని సూటిగా అడుగుతున్నా .వీటికి జవాబు ఇచ్చుకొనే స్థితి బాబు అండ్ కొ కు లేనేలేదు .దీనికి తోడు ఆయన కొడుకు ఒక బచ్చా .ఆయనకు మంత్రి వర్గం లో స్థానం ఇచ్చి కుక్కను ఉసి గొల్పి నట్లు జనం మీదికి ముఖ్యంగా మా ఫాన్ పార్టీ మీదకు ఉసి గొల్పుతున్నాడు .ఆయనగారేమో తెగ రెచ్చి పోతున్నాడు. వీళ్ళకు పగ్గాలు వేసే వాళ్ళు లేరా అని మిమ్మల్ని ప్రశ్నిస్తాఉన్నా  .

‘’ పట్టి సీమ ప్రాజెక్ట్ తో కోస్తా జిల్లాలలన్నీ మూడేళ్ళ  నుంచి సస్య శ్యామలం అయ్యాయని వేలాది ఎకరాలు సాగు లోకి వచ్చి ఎకరాకు నలభై బస్తాల వరి దిగుబడి జరుగుతో౦దని బడా ప్రచారం .డబ్బా కొట్టుకుంటున్నారు .అసలు మా కడపకు నీళ్ళు ఇచ్చామని విషప్రచారం .నిజమేనని మావాళ్ళు కూడా డూడూ బసవన్నల్లాగా తానా అంటే తందానా అంటున్నారు ఆయనెవరో ‘’పోలవరం చూశారా ?’’అని అడుగుతున్నాడు నన్ను .వెళ్ళా కాని నిజాలు చూసి తట్టుకోలేనేమో నని కనిపించని నల్లకళ్ళ అద్దాలు పెట్టుకున్నా అందరికీ నేను చూసినట్లే అనిపిస్తుస్తుంది నాకేమో అసలు అక్కడేమీ కనిపి౦చదు.ఇదీ కిటుకు ..మరి దీని గురించి ఎలామాట్లాడుతున్నారు అని అదిగో ఆ తల్లి ఎవరో ప్రశ్నిస్తాఉన్నాది .అమ్మా నాకు విజయసాయి రెడ్డి స్క్రిప్ట్ రైటర్ .లేకపోతే అమిత్ షా అర్జెంట్ గా ఏం మాట్లాలో వాట్సాఫ్ పంపిస్తాడు. అవే ఆధారం .మా వాళ్ళు నాతోనే ఉంటూ నాకే గోతులు  తవ్వుతున్నారు . ఇదెక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా .ఏదో కడపజిల్లాకు నీళ్ళిచ్చారు బానే ఉంది .వాటిని బీహార్ కు పంపించక్కర్లేదా ?అస్సాం కు  ఎక్కిం చక్కర్లేదా ?ఉత్తరాది రాష్ట్రాలవాళ్ళు మనవాళ్ళు కారా ?ఇదేమి బాబు  గారూ ?పోనీ బీహార్ కు కాక పొతే ఉత్తరాఖండ్ కో కాశ్మీర్ కో గోదావరి నీళ్ళు పంపకూడదా !ఇదేమీ చెయ్యకుండా ఏదో అద్భుతాలు అంటూ ఈ రెండు ప్రాజెక్ట్ లగురించి మీడియాలో యాడ్స్ .డబ్బు వీటికే ఖర్చు చేస్తే ఇక ప్రాజెక్ట్ లకేం ఖర్చు పెడతాడు బాబు !అందుకే పాదయాత్ర చేస్తూ  మీ కష్టాలకు గోదారిలా కన్నీళ్లు కారుస్తూ మిమ్మల్ని పట్టుకుని కుదిపి కుదిపి ఓదారుస్తూ  రాబోయే ఎన్నికలలో నేనే  ముఖ్యమంత్రినని హామీ ఇస్తున్నాను .అప్పుడు అన్నీ మవ ఇష్టం వచ్చినట్లు  చేసుకోవచ్చు .అడ్డూ ఆపు ఉండదు. అడిగే వాడు అసలు ఉండరు. అడిగితే రోజూనేను బాబును అన్నట్లే బంగాళాఖాతం లో పారేయిస్తా .నో డౌట్.ట్రస్ట్ మి .దేవాలయాలు మసీదులు చర్చి లు తిరిగి తిరిగి కాళ్ళు వాచి పోతున్నాయి .వాగ్దానాలు చేసి చేసీ ఉబ్బి   పోతాఉన్నా. పాద యాత్ర చేసిననవాళ్ళంతా సిఎం లో, పిఎం లో అయిపోతా ఉన్నారు  .నాకే చాన్స్ వచ్చిచావటం లేదు .నాచుట్టూ కోటరీ ఉన్నా, వాళ్ళు నాకు ‘’టెంటకిల్స్ ‘’లా తయారై నాకే ఉచ్చు బిగిస్తున్నారు .రెండేళ్ళ  నుంచి రాజీనామా రాజీనామా అని ఊరిస్తున్నాం .ఇప్పుడు మళ్ళీ ఇమ్మంటే మావాళ్ళు ఇచ్చారు . ఇదో డ్రామా అంటున్నాయి విపక్షాలు .’’నామాలు ‘’తీసుకుని మాకు నామాలు పెట్టి స్పీకర్ గారు విదేశాలకు చెక్కేశారు .ఆవిడ వచ్చేదాకా మళ్ళీ సస్పెన్స్ .సస్పెన్స్ ఏముంది లెండి .ఆమోదించినా  ఏడాదిలోపుఎన్నికలు రావు గందా .మైనారిటీలో పడిన మోడీ గారికి దీనివలన మెజార్టీ సాధించిపెట్టి ఆయన’’ ఉప్పు’’ తిన్నపాపానికి ఈ మాత్రం సాయం చేశాం . అయినా ఎన్ని నాటకాలు ఆడకపోతే రాజకీయం రక్తి కడుతుంది బాబూ !నీ లాగా స్ట్రెయిట్ ఫార్వార్డ్ అయితే గంగలో దూకాలి . నీపైన కేసుల్లేవు .పెట్టినా నిలవవు .నాపై అన్నీ కేసులే .కోర్టు చుట్టూనే తిరగనా , అసెంబ్లీకే వెళ్ళనా .నా బాధ మీకు అర్ధంకాదు  .ఇంతకీ ఎవరిని అని ఏం లాభం ?మా’’ బాబు’’ అధికారం లో ఉండగానే నన్ను చంకన ఎక్కి౦చు కోకుండా దూరం పెట్టాడు .ఇప్పుడు ఆయన భజన చేస్స్తున్నా కనికరం లేకుండాపోయింది .పాపం కొంగు చాటు బిడ్డలా మా నాయన సంపాదించిన దానికంటే చాలా రెట్లు నొక్కేశా .పాపం బాబుకు ఈ తెలివి తేటలు లేవు . చచ్చు దద్దమ్మ .నన్ను చూసి ఇదైనా నేర్చుకోడు .ఎవరినైనా కొంటా ,ఎవరి పాదాలన్నా పట్టుకుంటా .ఏదో రాల్చేదాకా వదిలి పెట్టను .ఇంత నమ్మకస్తుడు ఏపార్టీ కి ఊతంగా  దొరుకుతారు .అయినా నన్ను నమ్మలేక పోతున్నారు .ముఝే మాలూం నై . పోలవరం ,పోలవరం పోలవరం ‘’

 ‘’ఒరేయ్ అబ్బాయ్ జగనూ ! ఏమిట్రా పోలవరం పోలవరం అని కలవరిస్తున్నావు .అక్కడికి వెళ్లి అంతా చూసోచ్చావా ?నిజం తెలిసిందా .బుకాయింపులు ఎల్లకాలం చెల్లవు .మేము అడ్డం వస్తున్నామని నన్నూ మీ చెల్లినీ దూరం చేశావ్ .మాకు కనువిప్పు కలిగిందికాని నీకు జ్ఞానోదయం కాలేదు .  ఇప్పటికైనా నామాట విని పులివెందలలో గుడికట్టి గోదావరి దేవిని ప్రతిష్టించి ఋణం తీర్చుకో .అప్పుడు నీ వదరు బోతుమాటలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది లే నాయనా లేలే. పాదయాత్రకు టైం అయింది .వందిమాగధులు వచ్చేశారు ‘’అని వాళ్ళమ్మ చెవిలో ఇల్లు కట్టుకుని పోరగా ,పోరగా జగన్ పోరడు అమాంతం లేచి ఉరికిండు .

  ఊకే నవ్వుతాలకి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-18 –ఉయ్యూరు

   
— 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం

నాదారి తీరు -115

బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం

అడ్డాడ హయ్యర్ సెకండరీ లో పనిచేసి  ఇక్కడి విద్యార్ధుల అభ్యున్నతికై అవిరళ కృషి చేసి ,ఇంగ్లీష్ లో ఎం .ఏ .చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా సేవలందించి రిటైరై నూజివీడు కేంద్రంగా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి’’మహాత్ములు నడచిన బాటలో ‘’అనే ఆత్మకథ ను వినమ్రంగా రచించిన బాలసాహిత్యం లో యెనలేని కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ ముదునూరు వెంకటేశ్వరావు గారు .వారి ప్రభావాన్ని ఇప్పటికీ అడ్డాడ జనం చెప్పుకుంటారు .అలాంటి వారిని ఆహ్వానించి స్కూల్ తరఫున సత్క రిస్తే బాగుంటుంది అని పించి౦దినాకు .స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరి ఆమోదం కోరాను.తప్పని సరిగా చేయాల్సిందే నని అభిప్రాయం వెలిబుచ్చారు .విద్యార్ధులకూ ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలియ జేస్తే వాళ్ళూ అంగీకరించారు .

ఆయన నూజి వీడు లో ఉంటున్నారు .మా బావమరది ఆనంద్ ఏలూరు స్టేట్ బాంక్ లో పని చేస్తున్నాడు .ఇద్దరికీ మంచి అనుబంధం ఉన్నది .కనుక ఆయన్ను తీసుకు వచ్చే బాధ్యత మా వాడి పై పెట్టాను .సరే అన్నాడు .అప్పుడు మరో ఆలోచన నా మనసులో మెదిలింది.వాడు గొప్ప పెయింటర్ కదా  వాడి తో వాడు గీసిన చిత్రాల ఆర్ట్ ఎక్సి బిషన్ ఏర్పాటు చేసి ,పెద్దతరగతి పిల్లలో డ్రాయింగ్ పెయింటింగ్ లో ఆసక్తి కలిగిస్తే అతని రాకసార్ధకమవుతుంది కదా అని పించి అందరి అంగీకారం తీసుకుని ఈ కార్యక్రమం అంతా ఒక స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏర్పాటు చేశాం .ఏ సంవత్సరం అన్నది గుర్తు లేదు .వాళ్ళిద్దరికీ ముందే తెలిపాం వారూ బాగుందని అన్నారు

ఆర్ట్ ఎక్సి బిషన్  ,డిమాన్స్ట్రేషన్ లెసన్

ఆనంద్  ,ముదునూరువారిని స్కూటర్ పై అడ్డాడ తీసుకు వచ్చాడు .రాగానే స్టాఫ్ అందర్నీ పరిచయం చేసిఅసెంబ్లీ ఏర్పాటు చేశాం .ముఖ్య అతిధిగా వచ్చిన ముదునూరి వారితో పతాకావిష్కరణ చేయించి  విద్యార్ధులచే వారికి గౌరవ వందనం చేయి౦చి  విద్యార్ధులకు ప్రేరణాత్మకమైన ప్రసంగం చేయించాం , తరువాత స్టాఫ్ అందరు వారిద్దరితో కలిసి కాఫీ టిఫిన్లు చేశారు .

తర్వాత సైన్స్ రూమ్ లో మా వాడు వెంట తెచ్చిన తాను పెయింట్ చేసిన చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయించాం .విద్యార్ధులు ఆసక్తిగా అన్నీ చూసి చిత్రలేఖనం పై అభి రుచి ఏర్పరచుకున్నారు .ఆతర్వాత అక్కడే అతనితో ఎంత తేలికగా డ్రాయింగ్ గీయవచ్చునో, యెంత సులభంగా చిత్రాలు చిత్రి౦చవచ్చునో  బోర్డ్ మీద గీస్తూ ,పిల్లలను ప్రశ్నిస్తూ ,అడిగిన వాటికి చక్కని సమాధానాలు చెబుతూ బాగా బోధించాడు .పిల్లలందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు .ఏదో మహా విద్య నేర్చుకున్నాం అనే ఆనందం వాళ్ల ముఖాలలో ప్రస్పుటంగా కనిపించింది .అందరూ మావాడిని అభినందించి మెచ్చుకున్నారు .ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులూ పాల్గొని సంతృప్తి చెందారు .

ముదునూరు వారికి సత్కారం

క్రాఫ్ట్ రూమ్ అనే కామన్ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేశాం .దీనిని విద్యార్ధులే ఉపాధ్యాయుల సూచనలతో చక్కగా నిర్వహించారు .శ్రీ ముదునూరువారు ముందుగా తనకు ఈ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ,తర్వాత భారత దేశం స్వాతంత్రం సాధించటానికి పడిన పాట్లు ,పొందిన అవమానాలు ,మొక్కవోని మహాత్ముని ప్రేరణ ,నాయకత్వం తో సాధించిన విధానం అంతా చాలా నాటకీయంగా స్వీయ అనుభవాన్ని జోడించి ప్రసంగించారు తర్వాత విద్యార్ధులు నవభారత నిర్మాణం లో నిర్వహించాల్సిన పాత్ర గురించి వాళ్లకు అర్ధమైన భాషలో ప్రేరణాత్మకంగా మాట్లాడి విద్యార్ధుల హృదయాలను ఆకర్షించారు .ఆయన ప్రసంగం లో పాట, పద్యం, గీతం, గేయం, నాటకం అన్నిటిని సమపాళ్ళలో రంగరించారు .పిల్లలు మహా మురిసి పోయారు .ఒకరకంగా ‘’హి కాప్టివేటేడ్  ది ఆడియెన్స్ ‘’.వారి ప్రసంగానికి ముందు కొందరు విద్యార్ధినీ విద్యార్ధులు , ఉపాధ్యాయులూ మాట్లాడారు .అంతకుముందు విద్యార్ధినీ విద్యార్ధులు దేశభక్తి గీతాలను ఆలపించి కార్యక్రమానికి మంచి నేపధ్యం కలిగించటం తో ముదునూరు వారి ప్రసంగానికి  మార్గం సుగమం  అయింది ..

పిమ్మట ముదునూరు వారిని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టి ,అన్ని తరగతుల విద్యార్ధి నాయకులతో  స్కూల్ ప్యూపిల్ లీడర్ లతో పుష్పగుచ్చాలు ఇప్పించాం .తర్వాత స్టాఫ్ సెక్రెటరి,  ఫస్ట్ అసిస్టెంట్  నేనూ ,కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రామబ్రహ్మ౦ గారి తో పుష్పహారం వేయించి,  శాలువా కప్పి గంధం పూయించి పన్నీరు చల్లి  కొంత నగదు కూడా తాంబూలం లో పెట్టి ఘన సత్కారం చేశాం .అలాగే మా బావమరది ఆనంద్ ను కూడా సత్కరించి గౌరవించాం.ఇద్దరు పరమానంద భరితులయ్యారు .తాను పని చేసిన  స్కూల్ లో ఇంతటి ఘన సన్మానం తమకు జరిపించినదుకు  ప్రధానొపాధ్యాయుడి నీ ,ఉపాధ్యాయ బృందాన్ని ,విద్యార్ధి గణాన్నీ అభినందించారు శ్రీ వెంకటేశ్వరరావు గారు .ఇది చిరస్మరణీయం అన్నారు .ఆనంద్ మాట్లాడుతూ విద్యార్ధులకు డ్రాయింగ్  చిత్ర లేఖనం లలో ఆసక్తి కలిగించే ఆలోచన రావటం దానినిఆచారణలో పెట్టటం దానిలో తనను భాగస్వామిని చేయటం మరువరాని విషయం అనీ విద్యార్ధుల క్రమ శిక్షణ ,వారు నిర్వహించిన పాత్ర , నేర్చు కోవటానికి చూపిన శ్రద్ధాసక్తులు మెచ్చదగినవని అన్నాడు .ఇందుకు ఇక్కడి విద్యాకుటుంబం మొత్తాన్ని అభిన౦దించాలి అన్నాడు .

నేను మాట్లాడుతూ ఈ పాఠశాల లో ఏదైనా ఒక కార్యక్రమం తలబెడితే దాన్ని దిగ్విజయం చేయటానికి అందరూ బాగా కృషి చేస్తారని చక్కని సమన్వయము ఉండటం వలననే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని ,అందరి సహకారం మరువలేనిదని ముఖ్యంగా లేడీ టీచర్లు బాగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని ,కమిటీ సహకారం కూడా గొప్పగా ఉంటుందని అందరికీ ధన్యవాదాలు తెలియ జేశాను .

తర్వాత ఆనంద్ ,ముదునూరు వారు నూజి వీడు బయల్దేరి వెళ్ళారు .మేమందరం ఇళ్ళకు చేరుకున్నాం .

ముదునూరు వారికి ఉయ్యూరు లో సరసభారతి సన్మానం

ఉయ్యూరు లో 24-11-2009 నసరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థను నా అధ్యక్షతన  ఏర్పాటు చేసి, మొదటి కార్యక్రమం గా శ్రీమతి సింగరాజు కల్యాణి గారి చే’’సంగీత విభావరి ‘’.నిర్వహించాం .29 వ  కార్యక్రమగా 27-9-20 11 మంగళవారం శ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో బాల సాహిత్య చక్రవర్తి , 88 ఏళ్ళ ముదుసలి శ్రీ ముదునూరు వేంకటేశ్వర రావు గారిని సన్మా నించాం.  మా బావమరది ఆనంద్ తో వీరిని సభకు పరిచయం చేయించాం .సరస్వతీ పుత్రా శ్రీ నున్న అన్జారావు ,బాలసాహిత్యం లో కృషి చేసన శ్రీమతి భమిడి పాటి బాలా త్రిపుర సుందరి  ,స్థానిక అమరవాణి హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పి.వి .నాగరాజు ఆత్మీయ అతిధులు .వివిధ పాథశాల విద్యార్ధులకు ‘’పద్య మకరందం ‘’పోటీలు నిర్వహించి గెలుపొందినవారికి ముదునూరు వారితో బహుమతులిప్పించాం .ఈబహుమతులకు స్పాన్సర్  ప్రముఖ కవయిత్రి ,కథా రచయిత్రి శ్రీమతి కోపూరి పుష్పాదేవి .

ముందుగా శ్రీ వెంకటేశ్వరావు గారిని అర్చకులతో ఆలయ మర్యాదతో సత్కరింప జేశాం,తర్వాత సరసభారతి చందన తాంబూలాలు  నూతన వస్త్రాలు శాలువా పుష్పహారం  నగదు కానుక లతో ఘనంగా సత్కరించాం .అలాగే ఆనంద్ కు కూడా చేశాం .ఇద్దరూ హైదరాబాద్ నుంచి ఉదయమే వచ్చారు .మా ఇంట్లో భోజనాదికాలు ఏర్పాటు చేయించాం .ముదునూరు వారు పొందిన ఆనందం వర్ణనాతీతం .తమ ఆనందాను భూతిని కనుల చేమర్పు తో గొప్పగా స్పందించి చెప్పారు .మాకూ ఇదొక మధురస్మృతి గా మిగిలింది .రాత్రికి ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి పోయారు . ఆతర్వాత చాలాకాలం వారితో ఫోన్ సంభాషణ చేశాను.  వారి పుస్తకాలు నాకు పంపేవారు .సరసభారతి పుస్తకాలు వారికి పంపేవాడిని .

ఆరేళ్ళ క్రితం మా బావమరది ఆనంద్ కుమార్తె స్పందన వివాహం హైదరాబాద్లో జరిగితే వనస్థలి పురం లో ఉన్న  వెంకటేశ్వరావు గారిని కారులో వివాహ వేదికను నేనే వెళ్లి తీసుకు వచ్చాను .ఆశీస్సులు కానుక అందించి  వారు వారబ్బాయి తో తిరిగి కారులో వెళ్లి పోయారు .అదే చివరి సారి చూడటం .ఆతర్వాత కొద్దికాలం ఫోన్లో మాట్లాడుకొన్నాం  నాలుగేళ్ళనుంచి అదీ లేదు .ఇప్పటికి వారికి 96 సంవత్సరాల వయసు ఉంటుంది .ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకొంటారు .వారు నాకు అందజేసిన ‘’మహాత్ములు నడిచిన బాటలో ‘’అనే ఆత్మగ్రంధం చదివి నాస్పందనను నెట్ లో ‘’ముదిమి లోనూ  యవ్వనోత్సాహి-శ్రీముదునూరు వెంకటేశ్వరావు  ‘’  అనే శీర్షికతో 6 ఎపిసోడ్లు రాసి అందరికీ పంపి ప్రింట్ అవుట్ తీసి వారికి పంపిస్తే మహదానందం పొంది వెంటనే ఫోన్లో నన్ను అభినందించిన సహృదయ మూర్తి .అందులో మొదటి భాగం లో ఉన్న మొదటి పేరాలు మీకోసం –

‘’కృష్ణా జిల్లా ముదునూరు గ్రామస్తులు ,బాలసాహిత్యం లో దశాబ్దాలపాటు కృషి చేసి ,అంతులేని బాలసాహిత్యాన్ని సృష్టించి,ఊరూరా ‘’బాలభారతి ‘’స్థాపించి ,ఆకాశవాణి బాలకార్యక్రమాలను రెండు దశాబ్దాలు నిర్వహించి ,ఆంగ్ల అధ్యాపకులుగా శాఖాధిపతి గా సేవలందించి ,ఆంగ్ల –తెలుగు నిఘంటువును అసహాయ శూరులుగా తానొక్కరే నిర్మించి ,తన స్వీయ చరిత్రను చారిత్రిక నేపధ్యంగా రచించి ,బహు గ్రంథ కర్తలుగా ప్రసిద్ధి చెంది ,సమాజ సేవలో ధన్యులైన ‘’బాల సాహిత్య చక్రవర్తి ‘’బిరుదాంకితులు శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారు –  88 ఏళ్ళ  వృద్ధుడు .వృద్ధాప్యం రెండో బాల్యం అన్నారు కదా .అందుకని బాలుడే .అయితే ,ఆయన నిత్య జీవితం క్రియా  శీలత్వం ,సామాజిక సేవ ,నిరంతర పఠనం ,రోజుకు  కనీసం పన్నెండు గంటల రచనా వ్యాసంగం ,ఈ వృద్ధాప్యం లో,గమనిస్తే ,ఆయన నిత్య యౌవనుడు గా కని పిస్తారు .ముఖం పై ముడుతలు వచ్చినా ,కళ్ళు తెల్లబడు తున్నా,అందులో విజ్ఞాన జ్యోతి ప్రకాశించటం ,ప్రసరించటం చూస్తాం .ఒక రాజకీయ నాయకుడో ,సంఘ సంస్కర్తో ,సామాజిక కార్య కార్తో ,ఉత్తమ ఉపాధ్యాయుడో,నిర్వహించ వలసిన కార్య క్రమాలను అన్నిటినీ ,తానొక్కడే ,కొద్ది మంది సహాయం తో,నిర్వహించిన  ,అనుక్షణ కార్య కర్త ,.ఆ నిర్వహణ లో అలుపు లేదు ,విశ్రాంతి లేదు .అకుంఠిత దీక్ష ,సమాజ సేవా తపన ఉత్తమ బోధ నంది౦చాలన్న ఆరాటం ,తన చుట్టూ వున్న సమాజం తన తో పాటు అన్ని రంగాల్లో అగ్రగామి గాఉండాలన్న   ఆకాంక్ష ,సంపూర్ణ వికాసం తో ,జీవితాలు వెలగా లన్న దృఢ సంకల్పం ఆయన్ను ,ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబడేట్లు చేసింది ..సమాజం లో అన్ని వర్గాలు ,కులాలు ,ఆబాల వృద్ధులు తన వాళ్ళే అనే విశాల దృక్పధం ,ఆయన్ను అందరి కంటే అగ్రేసరుడిని చేసింది .ఆయన సాధించిన విజయాలు ఇన్నో ,అన్నో కావు .ఎక్కడ ఏ పరిస్థితులలో సమాజానికి తాను అవసరమైతే అక్కడ ఆయన ప్రత్యక్షం .నీతికి ,నిర్భీతికి,పేరుగా నిలిచి,వ్యక్తిత్వం తో ,జీవితాన్ని పండించుకొని ,”బహుజన హితాయ -బహుజన సుఖాయ ”గా జీవితం గడుపుతూ ,అందరిని ప్రేమ ,ఆప్యాయత ,మమతాను రాగాల తో ,తన వాళ్ళను చేసు కోని ,తన వాక్కే వేద వాక్కు గా అందరు భావించే స్ఫూర్తిని కలుగ జేసి సకల కళా రహస్యాలను అవగాహన చేసుకొని,ఇతరులకు తెలియ జెప్పి ,పెద్దన్నగా గుర్తింప బడి ,తాను చేసిన దేదో ,మహత్కార్యం అనీ ,సమాజ సేవ అనీ భావించక ,అదొక మానవ ధర్మంగా ,కనీస విధిగా భావించి ,తన మార్గాన తాను నడుస్తూ ,ప్రేరణ పొందిన వారిని తనతో కలుపు కొంటు ,ద్వేషం ,అసూయ ,అహంకారం కోపతాపాలకు ,అతీతం గా ,అజాత శత్రుత్వం తో ,వ్యవహరిస్తూ ,తాను నమ్మిన ”రాముని ”బంటు గా వ్యవహరిస్తూ ,కుటుంబానికీ ,గ్రామానికీ ,పరిసర ప్రదేశాలవారికీ ,తలలో నాలుక గా నడుస్తూ ,పెద్దరికాన్ని నిల బెట్టు కుంటూ ,ఆదర్శం లో ,ఏమాత్రం అటు ఇటు లేక నవ్య ,సవ్య పథగామి గా వుంటూ ,బాల సాహిత్యసేవ లో ధన్యులై ,యువకులకు  ఉత్చాహ పాత్రులై ,తోటి ఉపాధ్యాయులకు ఆదర్శ మూర్తి యై ,విశ్రాంత ఉపాధ్యాయులైనా ,అవిశ్రాంత కృషి చేస్తున్న వారు,కర్మ యోగి ,క్రియా శీలి ,”బాల సాహిత్య చక్ర వర్తి ,మాన్యులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు .

శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిది ఓకే ప్రత్యేక  స్కూల్ అఫ్  థాట్ .ఆయన ఒక విశ్వ విద్యాలయం .knowledge pool . జ్ఞాన ఖని .విశుద్ధ మనస్కులు .నిరామయ జీవి .నిర పేక్ష కార్య శూరుడు .ఆయనజీవితాన్ని   అర్ధం చేసు కోవ టానికి,ఆయన వివిధ దశల్లో చేబట్టిన కార్య క్రమాలనుపరామర్శించటానికి ,  ,ఆదర్శ శిఖరా రోహణ౦  చేయ టానికీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే .ఆయన రచనా శైలి ,నిరాడంబరం .,మెత్తని పూల మీద నడుస్తున్నట్లుంటుంది . .ఏది చెప్పినా సుతి మెత్త గా,సూటిగా మనసుకు తాకేట్లు చెప్పటం ఆయన ప్రత్యేకత .పదాడంబరం వుండదు .ఎక్కువ తక్కువలుండవు .అతిశయోక్తులకు దూరం .యదార్ధ వాది-కాని లోక విరోధి మాత్రం కాక పోవట౦ఆయన  ప్రత్యేకత .అదే ఆయన విశిష్ట వ్యక్తిత్వం .ఆయన కార్య క్రమాలను,,జీవితం తో అనుసంధానం చేస్తూ ,వివిధ దశల లో వింగడించి తెలుసు కొందాం’’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 —11 -11 .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-18 –ఉయ్యూరు

— 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

  సరసభారతి 126 వ కార్యక్రమ0      ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు 

ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు

 

సరసభారతి 126 వ కార్యక్రమ0గా  ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు  1-  ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు  ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి  మాజీ తెలుగు లెక్చరర్  శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన పూడి సులోచనా రాణి గార్లను డిగ్రీ విద్యార్ధులైన నవతరం యువతకు పరిచయం చేసే అవగాహన సదస్సు ,ఉయ్యూరులో స్థానిక ఎ .జి. అండ్. ఎస్. జి .డిగ్రీ కళాశాల  తెలుగు శాఖ తో కలిసి సంయుక్తంగా  30-6-2018 శనివారం మధ్యాహ్నం 1-30 నుండి 4-30 వరకు సెమినార్ హాల్ నందు నిర్వహిస్తున్నాము . సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

కార్యక్రమం

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –డా.శ్రీ డి.బాలకృష్ణ ,ప్రిన్సిపాల్

గౌరవ అతిధి ,సమన్వయ కర్త –డా .శ్రీ జి.వి .పూర్ణ చ౦ద్,ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా రచయితల  సంఘం –విజయవాడ

ఆత్మీయ అతిధులు –శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి – రిటైర్డ్ స్టేషన్ డైరెక్టర్-ఆల్ ఇండియా రేడియో  విజయవాడ-రజని గారి బహుముఖీన ప్రతిభ పై ప్రసంగం

శ్రీమతి బాలాంత్రపు ప్రసూన -లెక్చరర్  సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి –విజయవాడ(రజని గారి కోడలు )-రజని గాన వాహిని పై ప్రసంగం

శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ –ఇంగ్లిష్ లెక్చరర్ ,ప్రముఖ సాహితీ వేత్త –విజయవాడ-పెద్ది భొట్లవారి కథా సాహిత్య విశిష్టత పై ప్రసంగం

శ్రీమతి గుడిపాటి రాధికారాణి- టీచర్ ,యువ సాహితీకెరటం  –మచిలీపట్నం-యద్దనపూడి నవలలలో స్త్రీ వ్యక్తిత్వచిత్రణ పై  ప్రసంగం

కార్యక్రమ నిర్వహణ –శ్రీ జి.శ్రీనివాస్  , శ్రీ జి .వేణుగోపాల రెడ్డి  –తెలుగు లెక్చరర్స్

శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి

మనవి –   ఈ’’ విద్యుల్లేఖ’’ నే ఆహ్వానంగా భావించి అతిధులు ,సాహితీ ప్రియులు విచ్చేసి జయప్రదం చేయ మనవి

ఆహ్వాని౦చు వారు

డా. డి  బాలకృష్ణ ,ప్రిన్సిపాల్ ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీకళాశాల-ఉయ్యూరు

గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు-ఉయ్యూరు

ఉయ్యూరు ,12-6-18

 

 


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

10-6-18 aadivaaram vijayavada tagore library lo andhra pradesh rachayitala sangham aadhvaryam lo jarigina ‘yekadina kavi sammelanam”

10-6-18 aadivaaram vijayavada tagore library lo andhra pradesh rachayitala sangham aadhvaryam lo jarigina ‘yekadina kavi sammelanam”

 

https://photos.google.com/share/AF1QipP8CZ1tmA-M5-86LAsZv59Li__BRgFyJYT1za6Wo0DiYxFTBnueV9HC0VTA7ZtJmw/photo/AF1QipP_M9xEUktGu_x7xrclLIZz7IZzCySOD8XnDv-L?key=MldfN2JxMEJGaGJvblFtZDRFYjhuVFRBcHd6S0J3

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ?

ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ?

 బాలనటి గా తన సహజ నటనను ప్రదర్శించి సుమారు రెండేళ్లనుంచి ”ఫ్రేస్ట్రేటెడ్  వుమన్ ”సీరియల్ ను ఎంతో ఆకర్షణీయంగా నటించి తీస్తూ ప్రజలకు మరింత దగ్గరయింది .ఆహావభావాలు, డైలాగ్ డెలివరీ అనితర సాధ్యం అనిపిస్తాయి .తీసుకున్న సమస్యలన్నీ అర్ధవంతమై  వాటిని తీసిన విధానమూ ఉత్కృష్టంగా నే ఉన్నాయి . నేను ఆమె ఫాన్ అయిపోయాను . ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాడిని .కానీ – 

 ఇటీవల అయిదారు ఎపిసోడ్ లనుండి ఆమె తన అసిస్టెంట్ ను,అడిగిన వాళ్ళనూ  చావగొడుతూ  భీభత్సం సృష్టిస్తోంది .చొక్కాపట్టుకోవటం ఏరా వెధవా అంటూ నీచంగా మాట్లాడుతుంటే నీచంగా జుగుప్సకలిగించేవిగా    ఉండటం తో చూడాలంటేనే భయమేస్తోంది .ఒకరకంగా సాడిస్ట్ గా మారిపోయిందేమో ననిపిస్తోంది .కనుక వీక్షకుల మనోభావాలకు దెబ్బతగలకుండా ,మరింత మంచి సమస్యలపై దృష్టిపెట్టి ఆహ్లాదంగా హాయిగా నవ్వు కొనేట్లు తీయమని ఆమెను కోరుతున్నాను .గ్రాఫ్ పడిపోతే మళ్ళీ పైకి ఎక్కటం చాలాకష్టం  .సమస్యలను ఎంతో  బాగా తీసే సునయన మళ్ళీ మా అందరి అభిమానం సంపాదిస్తుందని కోరుతూ ఆశిస్తున్నాను -దుర్గాప్రసాద్ .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

  నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం

నాదారి తీరు -114

బాలబందు ను సత్కరించ లేక పోయాం

తెలుగులో బాలసాహిత్యం రాసిన వారు బహు అరుదుగా ఉన్నారు .శ్రీ చింతా దీక్షితులుగారు బాలసాహిత్యం లో అపూర్వ సృష్టి చేశారు .’’లక్కపిడతలు ‘’మొదలైన ఆయన రచనలు బాగా వ్యాప్తి చెందాయి .ఆ తర్వాత తరం లో బాలబందు శ్రీ బి వి నరసింహారావు ,బాలసాహిత్య చక్రవర్తి శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు ,సోమంచి రామం అని పిలువబడే శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తి ముఖ్యులు .దాదాపు మూడు నాలుగు దశాబ్దాలు వీరు బాలసాహితీ సృజన చేశారు  .ఉపాధ్యాయులుగా ,స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా బాలబందు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే సాహిత్య సృష్టి చేసి బాలలు మాట్లాడు కొనే భాషలో రాయటమేకాదు అలా పలకటమూ చేసి తనకున్నసంగీత  నృత్య ప్రాభవాన్ని రంగరించి వారి హృదయాలకు చాలా దగ్గరయ్యారు .శ్రీ ముదునూరువారు ‘’బాలభారతి ‘’స్థాపించి అనేక కధలు పాటలు నాటికలు రాసి  పిల్లలతో వేయించి ,రేడియోలో కార్యక్రమాలు నిర్వహించి తనకూ బాలసాహిత్యానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టి’’ బాల సాహిత్య చక్రవర్తి ‘’అని పించుకున్నారు .సోమంచి రామం గారు  కృష్ణా  జిల్లా పరిషత్ లో సోషల్ టీచర్ గా ,సమర్డులైన ఆదర్శ ప్రధానోపాధ్యాయులుగా  ,ప్రెసిడెంట్ అవార్డీగా , ప్రముఖులయ్యారు .కొత్తగా పదవి చేబట్టే హెడ్ మాస్టర్స్ కు  కరదీపికగా ఆయన  చిన్న పుస్తకం రాశారు .మాలా౦టివారందరికీ ఆయనా ,ఆయన పుస్తకం మార్గ దర్శకం .యవ్వనం నుండీ ఆయన గొప్ప కథకులు  వందలాది కథలను పిల్లలకు పెద్దలకోసం రాశారు .పాటలు, చిన్న నాటికలుకూడా  రాశారు  .విజయవాడ రేడియో లో అవి అనేకసార్లు పునః ప్రసారాలు .రామంగారు నాకు ,శ్రీ ఆంజనేయ శాస్స్త్రి, శ్రీ కోసూరి ఆదినారాయణ వంటి వారికి మెంటార్.ఆయన మాట మాకు సుగ్రీవాజ్నే .ఇప్పటికి సుమారు గా 95 ఏళ్ళు వచ్చి ఉంటాయి .అయిదారు ఏళ్ళ క్రితం  వరకు తరచూ కలుసుకొనే వాళ్ళం  ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళం .ఆయనకు వినికిడి శక్తి తగ్గటం తో కుదరటం లేదు .ఆయన సమకాలీన సమస్యలపై గొప్ప కథలు రాసేవారు .వృద్ధాప్యం లో ఉన్న సమస్యలపై రాసేవారు .అవి ప్రచురణ అవగానే లేక ప్రసారం అవగానే నాకు పంపటం నేను కార్డు మీద మిల్లీ మీటరు కూడా ఖాళీ లేకుండా నా స్పందన తెలియ జేయటం అరిగేది  .వెంటనే ఆయన ఫోన్ చేసి తమ ఆనందాన్ని వ్యక్త పరచేవారు .

శ్రీ పాలంకి శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ కే సభా వంటి వారు కూడా బాలసాహిత్యం లో అద్భుత కృషి చేశారు .తర్వాత శ్రీమతి డి.సుజాతాదేవిని పేర్కొనాలి .ఈమె ఉస్మానియాలో బాల సాహిత్య శాఖలో ఉండేవారు . ఉయ్యూరు సాహితీమండలి కి ఈమెను ఆహ్వానించి కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ఆధ్వర్యం లో ఒక నడివేసవి సాయంత్రం సన్మా నించాం .ముదునూరు వారినీ అడ్డాడ హై స్కూల్ కు ఆహ్వానించి ఘన సత్కారం చేశాం .సరసభారతి ఏర్పాటు చేశాక వారిని ఉయ్యూరు లో సన్మానించాం  కూడా .ఒక్క బాలబందు గారినే అడ్డాడ హై స్కూల్ లో సత్కరించలేక పోయిన దురదృష్టం మాది .

నాకు గ్రాయకం వచ్చిన దగ్గరనుండి బాలబందు గారి గురించి వింటూ, చదువుతోనేఉన్నాను .నేను ఉయ్యూరు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనను ఆహ్వానించి ,పిల్లలకు ఆయనచేత అద్భుత ప్రసంగాన్ని వినిపించి గొప్ప ప్రేరణ కలిగించాం .ఆయన స్వరం బహు సున్నితంగా ,’’ఫెమినైన్ క్వాలిటీ ‘’తో ఉండటం ప్రత్యేకం .ఆయన అభినయం బహు విధాలుగా చూపరులకు ఆకర్షణీయంగా ఉండేది .మాటలు బహుమెత్త గా ఉండేవి .పాటలు బహుకమ్మగా పాడేవారు .పాడుతూ ఆయన చేసే అభినయం చూస్తే హృదయాలు రసప్లావితమయ్యేవి .ఎన్ని వేలమంది ఉన్నా ఆయన ప్రసంగం అమితంగా ఆకర్షించేది .నాట్యం చేస్తే అప్సర చేసినట్లు ఉండేది .సకల కళా వల్లభుడు ఆయన .ఆయనతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్ అనిపించేది .ఉయ్యూరు స్కూల్ లో చూసినతర్వాత మళ్ళీ ఆయన్ను ఎక్కడా కలుసుకోలేదు .కలిసి మాట్లాడాలని లోపల కోరిక గాఢంగా ఉండేది .

అడ్డాడ లో చేరిన తర్వాత బాలబందుగారు గుడివాడలోనే నే విశ్రాంత జీవితం గడుపుతున్నట్లు పేపర్ల ద్వారా తెలిసింది .మా స్టాఫ్ మెంబర్లు ఒకరిద్దరిని వారి గురించి వాకబు చేయమని చెప్పాను .వారు వివరాలు సేకరించి చెప్పారు .గుడివాడ మెయిన్ రోడ్ లో రెండస్తుల స్వంత భవనం లో వారు ఉంటున్నారని వారబ్బాయి ,లోకల్ స్కూల్ లోనో జిల్లాపరిషత్ స్కూల్ లోనో లెక్కల మేష్టారు అనీ తెలిపారు ..బాలబందు ను ఎలాగైనా కలిసి మాట్లాడి వారిని అడ్డాకు ఆహ్వానించి వారి చేత విద్యార్ధులకు ప్రేరణ కలిగించాలన్నది నా తాపత్రయం .అందుకే ఇంత తపన .డ్రిల్ మాస్టర్ నాగేశ్వర రావు ను వారింటికి వెళ్లి  ఫలానా రోజు మేము వారిని చూడటానికి వస్తున్నామని తెలపమన్నాను .ఆయన అలాగే వెళ్లి వారిని కలిసి  అంగీకారం తీసుకున్నాడు .ఒక రోజు సాయంత్రం స్కూల్ అయ్యాక నేనూ నాగేశ్వరావు ,సేకండరీగ్రేడ్ వీరభద్ర రావు కలిసి గుడివాడ వెళ్లి నరసింహా రావు గారింటికి వెళ్లాం .ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు .తేనె రంగు దేహ చ్చాయ వారిది .ముసలితనం లోనూ బహు చలాకీగా ఉన్నారు .ఉయ్యాలబల్లపై ఊగుతూ కనిపించారు .కాఫీ ఫలహారాలు ఇప్పించారు .వారితో సంభాషణ సాగించాం .వారు తమకొచ్చిన అవార్డ్ లు ,జరిగిన సత్కారాలు ,రచించిన బాలసాహిత్య పుస్తకాలు చూపించి తమ ప్రతిభా సర్వస్వాన్ని ఆవిష్కరించారు .అప్పటిదాకా వారి గురించి నాకు తెలిసింది బహు స్వల్పం అని పించింది వారి శేముషీ వైభవం సంపూర్తిగా ఇప్పుడు అర్ధమయింది .వారితో మాట్లాడుతూ ఉంటె కాలమే తెలియలేదు. అంత ఆనందంగా సమయం గడిచింది .మాకూ వారికీ అనుకూలమైన రోజున అడ్డాడ హై స్కూల్ కు విచ్చేసి తమ బహుముఖ ప్రజ్ఞా పాటవాలను విద్యార్ధులకు తెలియజేసి వారికి స్పూర్తి కలిగించాలని కోరాం.వారు మా ఆహ్వానం తమకు ఎంతో సంతృప్తి కలిగించిందని తప్పక అతి త్వరలోనే వస్తానని ,అది తన ధర్మ౦ అని  అంగీకారం గా తెలిపారు.  చాలా సంతోషించాం ముగ్గురం .వారికీ కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి బయల్దేరి వచ్చేశాం .

బాలబందును ఆహ్వానించి ప్రేరణాత్మక ప్రసంగం చేయించటానికి స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరి అంగీకారం

 

తెలుసుకొన్నాక విద్యార్ధులకు కూడా అసెంబ్లీలో  తెలియ బరిస్తే  వాళ్ల ఆన౦దానికి అవధులు లేవని పించింది .అడ్డాడ కు అత్యంత సమీపం లో గుడివాడ లో ఇంత గొప్ప లెజేండరి పర్సన్  ఉన్నట్లు చాలా మందికి తెలియదు .దీన్ని సార్ధకం చేసి వారిని ఈ స్కూల్ విద్యార్ధులకు పరిచయం చేసి దానివలన వారికి స్పూర్తి కలిగించాలని ఎంతో ఆలోచించాం .అందరికీ అత్యంత ఇష్టమైన కార్యక్రమంగా భావించాం  .     కాని మాకు వారిని ఆహ్వానించి సన్మానించే అదృష్టం దక్కలేదు .మేము వారిని కలిసి వచ్చిన కొద్ది రోజులలోనే వారు మరణించారని తెలిసి హతాశులయ్యాం   వారి భౌతిక కాయాన్ని దర్శించి నివాళు లర్పించి వచ్చాం .అంతా మన చేతులలో లేదు అంటారందుకే  అనుకోవటమే మనిషిపని .అనుకున్నవన్నీ జరగవు కొన్ని అన్నపాట ఈ వేదాంతం లోంచి వచ్చిందే .

కంకిపాడు మండలం తెన్నేరు లో శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఉన్నారు .ఆయన కు గన్నవరం దగ్గర పెద అవటపల్లిలో హై టెక్ ప్రింట్స్ సంస్థ ఉండేది .మంచి మోతుబరి .అక్కడ అమెరికా స్టైల్ లో గొప్ప రాజప్రాసాదం కట్టుకున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం లోదిట్ట .చుట్టుప్రక్కల చాలాగ్రామాలకు ఆయన ఆదర్శం .కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి వెన్ను దన్నుగా ఉండేవారు .డియివో గారు యేర్పాటుచేసే ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన స్పాన్సర్ గా ఉండేవారు . ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్న భోజం సాయంకాలం స్నాక్స్ అన్నీ ఆయనే ఏర్పాటు చేసేవారు . విద్యారంగం పై అంత మక్కువ ఉండేది  .సమావేశానికి ఎజెండా తయారు చేయటం ,దానికి పేపర్స్ ప్రిపేర్ చేయటం అన్నీ ఆయన ఇంటి దగ్గరే జరిగేట్లు చూసి  అందరినీ స్వంత బంధువులులాగా చూసుకోనేవారు. వారి శ్రీమతి కూడా వారికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేవారు .ఆతిధ్యం ఇవ్వటం అంటే అంత సరదా వారిద్దరికీ .శ్రీమతి ప్రమీలారాణి,నేను ,రామ౦ గారు, ఆదినారాయణ ,రాజు ,విశ్వం మొదలైన వారందరం ఆయనకు బాగా సన్నిహితులం .తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం .మేమందరం రిటైర్ అయినా విద్యాసంబంధమైన ఏదో ఒక విషయం పై వారింట్లో సమావేశం జరిపేవారం .మమ్మల్ని తీసుకువెళ్లటం దింపటం అక్కడ సాపాటు అంతా ఆయనదే .ఒక బయటి వ్యక్తి విద్యా విషయాలలో ఇంత ఆసక్తి చూపటం ,ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయటం ఆశ్చర్యకర విషయం .

మధుసూదనరావు గారు తమ తల్లిగారు ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’స్థాపించి ఎన్నౌఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. చాలా పుస్తకాలు ముద్రించి స్కూళ్ళకు లైబ్రరీలకు అందించారు .శ్రీరరమణ రాసిన ‘’మిధునం ‘’కథ ను పునర్ముద్రించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు .బాలబందు అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం .బాలబందు సమగ్ర సాహిత్యాన్ని మూడు భాగాలుగా చాలా అందంగా ముద్రించి అందరికీ ఉచితంగా ప్రత్యేక నారసంచిలో పెట్టి అందజేశారు. ఆవిష్కరణసభకూ మాకు ఆహ్వానం వస్తే పై బృందం అంతా వెళ్లాం .మొదటిభాగం లో జీవన రేఖలు ,బివి వ్యాసాలూ ,,బివి గురించి మిత్రుల కొత్తవ్యాసాలు ,చలంతో లేఖలు ఉన్నాయి . దీనికి ప్రముఖ చిత్రకారులు సంజీవ దేవ్ ముందుమాట రాశారు .రెండవ భాగం లో కథలు ,గేయాలు ,గేయనాటిలున్నాయి .మూడవ భాగం లో బాలవాజ్మయం ,పద విపంచి ,ఆంద్ర పదావళి ,అమృతాంశం ఉన్నాయి .ఇలా సమగ్ర బాలబందు సాహిత్యం ముద్రించి బాలసాహిత్య స్పూర్తి కలిగించి నరసి౦హా రావు గారి ఆత్మకు శాంతి కలిగించారు దేవినేని గారు .

ప్రపంచ ప్రసిద్ధ ఆర్దికవేత్త మా ఉయ్యూరుకు చెందిన కాలిఫోర్నియా వాసి శ్రీఆరిగపూడి ప్రేమ్ చ౦ద్ గారిని ఆహ్వానించి  20 08 డిసెంబర్ లో ఉయ్యూరులో సాహితీ మండలి తరఫున శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పూనిక సౌజన్య సహాయ  సహకారాలతో సన్మాని౦చినపుడు దేవినేనిగారు విచ్చేసి మాట్లాడారు .మైనేనిగారితో దేవినేని గారికి గొప్ప అటాచ్ మెంట్ ఉండేది .దేవినేనిగారికి ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి స్వర్గీయ దేవినేని రమణ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది .హెడ్మాస్టర్స్ మీటింగ్ కు రమణ గారిని ఆహ్వానించి జయప్రదం చేయటమేకాదు దాని స్పాన్సర్ బాధ్యతకూడా ఆయనే తీసుకున్నారు  .విద్యారంగం పై  అభిరుచి ,పాధ్యాయులపై ఆయనకున్న గౌరవం  వెలకట్ట లేనివి .మేమందరం రిటైర్ అయినా మాకు ప్రేరక శక్తిగా ఆయన ఉన్నారు .ఇంకా విద్యారంగానికి ఏదోచేయాలన్న తపన ఆయనది .ఇంత మక్కువ ఉన్నవారు ఉండటం అరుదైన విషయం .మరొక్కసారి బాలబందును బాలలకే కాదు సాహిత్య ప్రియుల౦దరకు సన్నిహితం చేసిన ఘనత సాధించిన శ్రీ దేవినేని మధుసూదనరావు గారికి అభినందన శతం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-18 –ఉయ్యూరు

— 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం

కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం

అడ్డాడ కు రాకముందు మేడూరు లో పని చేశానని ,అక్కడ నూజి వీడు డివిజన్ ఉప విద్యాశాఖాదికారిణి జూలై లోనే పాఠ శాల వార్షిక తనిఖీ చేశారని ,అక్కడ అన్ని రంగాలలో అభివృద్ధి ,శిక్షణ, క్రమశిక్షణలకు ఆమె ఎంతో సంతృప్తి చెందారని ఇదివరకే మీకు తెలియ జేశాను .చివరలో ఆమె నన్ను ఒంటరిగా పిలిచి ‘ హెడ్ మాస్టారూ ! మీ స్కూల్ ప్రోగ్రెస్, మీరు చూపిన చొరవ , బడి తెరచిన రెండు నెలలోనే చూపిన అభి వృద్ధి ,గతఏడాది మీరు సాధించిన ప్రగతి చూసి చాలా సంతోషం కలిగింది .నేను పశ్చిమ గోదావరి నుంచి ఈ జిల్లాకు వచ్చాను .అక్కడ ఎక్కడా ఇలాంటి మోడల్ స్కూల్ నాకు కనపడలేదు .స్టాఫ్ అందరి సహకారం, గ్రామస్తుల ,కమిటీ వాళ్ల సహాయం తో మీరు సాధించిన ప్రగతి అభినందనీయం .ఈ సంవత్సరం జిల్లాస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డ్ కు నేను మిమ్మల్ని ప్రత్యేకం గా రికమెండ్ చేస్తాను .అప్లికేషన్ ఫిలప్ చేసి పంపండి. అంతే మిగతాది నేను చూసుకొంటాను ‘’అని మరీ మరీ చెప్పారు .నేను వెంటనే ‘’అమ్మా !ఈ అప్లికేషన్ పెట్టటం వగైరాలు నాకు నచ్చని పని .వీటికి పైరవీలు ఉంటాయని అంటారు .నేను అలా ‘’పాకలేను’’ .నాకన్నా సీనియర్స్ ,అర్హులు ఇంకా చాలా మంది ఉన్నారు. వారికిస్తే నాకు ఇచ్చినట్లే ‘’అన్నాను .దానికి ఆవిడ ‘వారి సంగతి తర్వాత ఆలోచిద్దాం .ఈ ఏడాది మొదటి ఇన్స్పెక్షన్ మీ స్కూల్ లోనే చేశాను .బాగా సంతృప్తి చెందాను .దానికి తగినట్లు గా మీకు అవార్డ్ ఇప్పించాల్సిన బాధ్యతనాది .నేను ఒక్కదాన్ని మాత్రమె ఇంప్రెస్ కాలేదు, పానల్ గా వక్చిన వార౦దరిదీ అదే మాట .నూజివీడులోకూడా చాలామంది టీచర్లు, హెడ్ మాస్టర్లు మీ గురించి మంచి అభిప్రాయం తో ఉన్నారు .మీకు ఇప్పించకపోతే  మీకు నేను అన్యాయం చేసిన దాన్ని అవుతాను .నేనే  అప్లికేషన్ మీకు అందేట్లు చేస్తా .పూర్తి చేసి మా ఆఫీస్ కు సమయం లోపల అందజేయండి ‘’అని మరీ మరీ చెప్పారు .ఇదంతా రహస్యంగా నే ఉంచాం .సరేనని ధన్యవాదాలు చెప్పాను .

  నూజివీడు హైస్కూల్ లో శ్రీ విష్ణుశర్మ గారు అనే సోషల్ మాస్టారు ఉన్నారు .ఆయన ఇంగ్లిష్ లో మహా దిట్ట .ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ క్లాసెస్ నిర్వహించటానికి ఆయనను డిపార్ట్మెంట్  బాగా వినియోగించుకొంటుది. సమర్ధుడు కనుక జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం లోనూ ఆయనకు పలుకుబడి హెచ్చు .ఇక నూజివీడు ఉపవిద్యాశాఖ కార్యాయం లోనూ ఆయనకు తెలీకుండా ఏదీ జరగది వినికిడి .ఒకరోజు ఆయన ఎవరిద్వారానో నాకు పురస్కారానికి పెట్టాల్సిన అప్లికేషన్ ఫారం పంపించి ,త్వరగా పూర్తి చేసి నూజివీడు వచ్చి స్వయంగా తనను కలిసి ఇమ్మని కబురు చేశారు  .ఇదంతా నాకు కొత్త .దీనికి వ్యతిరేకిని కూడా .సమర్ధతను వాళ్ళే గుర్తించి అవార్డ్ ఇవ్వాలని నా సిద్ధాంతం .కానీ సిద్ధాంతానికీ ఆచరణకు ఆమడ దూరం కదా .అన్ని వ్యవహారాల్లోనూ ఇంతే .నాకు పంపిన అప్లికేషన్ నేను పూర్తి  చేసి నూజివీడు వెళ్లాను .అప్పటికి ఇంకా మాఇంట్లో ఫోన్ సౌకర్యం లేదు .అక్కడ ఆయన ఇల్లు కనుక్కుని వెళ్లేసరికి ఆయన ఇంట్లో లేరు .ఆయన మేనమామ గారు శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు అనే రిటైర్డ్ సోషల్ మాస్టారు ,ఇంగ్లిష్ లెక్చరర్ ,జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ శర్మగారింట్లో ఉన్నారు .ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించి వచ్చిన పని తెలుసుకొని శర్మగారు ఎక్కడికో బయటికి వెళ్ళారని  తప్పక వస్తారని వచ్చేదాకా ఉండమని కోరారు .టిఫిన్ కాఫీ మర్యాద జరిగింది .వెంకటేశ్వరావు గారిని చాలాఏళ్ళ తర్వాత ఇదే చూడటం .ఉయ్యూరులో బాలభారతి ప్రారంభానికి శ్రీ వంగల కృష్ణ దత్తు దత్తుగారింటికి వచ్చినప్పుడు చూడటమే .వారి గురించి బాగా తెలుసు .రేడియోలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు .సౌజన్యం మూర్తీభావి౦చినవారు .కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాం .ఇంతలో రాత్రి 8 తర్వాత విష్ణు శర్మగారు వచ్చారు .నన్ను చూసి కౌగలించుకొని ఆత్మీయ పరామర్శ చేశారు వారికి అప్లికేషన్ ఇచ్చాను .’’ప్రసాద్ గారూ!మేడం గారు మీరంటే అత్యంత అభిమానం తో ఉన్నారు .మీకు రావటం లో ఎలాంటి ఇబ్బందీ ఉండదు .నావంతు ప్రయత్నం నేను చేస్తాను ‘’అని చెప్పారు .భోజనంచేసి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్ళమని మరీ మరీ కోరారు  .నేను రాత్రిపూట ఎక్కడా ఉండను అర్ధరాతయినా అపరాత్రి అయినా ఇంటికి  చేరాల్సిందే అని చెప్పి ధన్యవాదాలు తెలిపి బయటపడి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరే సరికి రాత్రి 11 దాటింది  .ఇక ఈ విషయం మర్చేపోయాను .

   సెప్టెంబర్ 5 దిన పత్రికలో నాకు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రకటించారు .నాతోపాటు కొంతమంది ప్రదానోపాధ్యాయులకు ,బి.ఎడ్, సెకండరీ  తెలుగుపండిట్ లకూ ఇచ్చారు .ఉదయం స్కూల్ కు వెళ్ళగానే ఉపాధ్యాయులు విద్యార్ధులూ హర్షాతి రేకంతో నాకు అభినందనలు తెలిపారు .అందరికి ధన్యవాదాలు చెప్పాను .స్టాఫ్ సెక్రటరి వెంటనే డ్రిల్ మాస్టారు తో అసెంబ్లీ  ఏర్పాటు చేసి,నాతో పతాకావిష్కరణ చేయించి విద్యార్ధులచే సాల్యూట్ చేయించారు .నేనేదో కొద్ది సేపు మాట్లాడి కృతజ్ఞతలు తెలిపాను .

  తర్వాత స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయమని సెక్రటరి కోరితే ఏర్పాటు చేశాను .అప్పటికప్పుడు  గుమాస్తా అంజిరెడ్డి నిగుడివాడ పంపించి స్వీటు హాట్ ఖరీదైన మంచి శాలువా తెప్పించారు .హోటల్ నుంచి  టీ వచ్చింది .అందరూ ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడి శుభా కాంక్షలు తెలియ జేశారు .నేనూ ఉచిత రీతిలో కృతజ్ఞతలు చెప్పాను .ఆతర్వాత ప్రతి సెక్షన్ వాళ్ళూ నన్ను ఆహ్వానించి దండలు వేసి చాక్లెట్స్ పెన్నులు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు .ఒక రకంగా పులకి౦చి పోయాను .నన్ను తమ అభిమానం గౌరవాలతో ఉక్కిరి బిక్కిరి చేశారు .జీవితం లో మరచి పోలేని  సంఘటన ఇది .ఈసన్మానం నిజంగా మేడూరు హై స్కూల్ లో నేను సాధించిన దానికి గుర్తింపు .కాని ఇక్కడ వీళ్ళు అంతా తమ అడ్డాడ హై స్కూల్ కు దక్కిన అరుదైన  గౌరవం గా భావించారు .నూజి వీడు ఉపవిద్యాశాఖాదికారిణి గారు తాము అన్నమాట నిలబెట్టుకుని ,నాకు పురస్కారం లభించేట్లు చేశారు .వారి సౌజన్యానికి కృతజ్ఞతలు .తర్వాత ఆమె మళ్ళీ ఏలూరు వెళ్లి పోయినట్లు విన్నాను .విష్ణుశర్మ గారి తోడ్పాటుకూ కృతజ్ఞతలు .ఇదే నేను పొందిన మొట్టమొదటి ప్రభుత్వ పురస్కారం .

  కామన్ హాల్ లో మీటింగ్ పెట్టి కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామ బ్రహ్మం గారిని ఆహ్వానించి  ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిపాం .నాకు చిరస్మరణీయ సత్కారం చేశారు అందరూకలిసి .అందరి ముఖాలలో  ఆనందం  ప్రస్పుటంగా కనిపించింది .అడ్డాడలో చేరిన నెలరోజులలోపలనే నాకుఈ  పురస్కారం రావటం తో, ఇదే అక్కడ మొదటి ఉపాధ్యాయ దినోత్సవం అయింది. అంటే మొదటి సత్కారం నాకే జరిగింది .ఆ తర్వాతే ఇంతకూ ముందు రాసిన కార్యక్రమాలన్నీ జరిగాయి .ముందే నా డబ్బా నేను కొట్టుకోవటం ఇష్టం లేక చాలా  ఎపిసోడ్ లతర్వాత వినమ్రంగా ఈ ఉదంతాన్ని ఇప్పుడు రాశాను . పురస్కారం ఈ స్కూల్ లో లభించినందుకు ఆస్కూల్ కూ గొప్ప అనిపించింది .ఎవరికి వాళ్ళు తమకే వచ్చినంత సంబర పడ్డారు .మర్చిపోదామన్నా మరువలేని సంఘటన, తీపి గుర్తు ఇది .ఈ ఆనంద సమయం లో బడిని అయిదు పీరియడ్లు మాత్రమే జరిపాం .

  లెక్కలమేస్టారు రాజుగారు  బందరులో అందజేసే పురస్కారానికి తాను కూడా వస్తానని తన టి .వి .ఎస్ .పై బందరు వెడదామని అన్నారు. సరేనని బయల్దేరాం .చేరేసరికి సాయంత్రం నాలుగు దాటింది .ఎక్కడో హోటల్ లో కాఫీ టిఫిన్ లు లాగించి పురస్కార ప్రదేశానికి చేరుకున్నాం .ఏ స్కూల్ లో జరిగిందో గుర్తు లేదు .ఏర్పాట్లు ఘనం గా చేశారు. విద్యార్దులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించారు .ఆతర్వాత ఉపన్యాసాలు .అప్పటి డి.యి. వో. గారి పేరుకూడా నాకు జ్ఞాపకం లేదు  .ముందు ప్రధానొపాధ్యాయు లకు ఆతర్వాత బి ఎడ్ లకూ  ఆతర్వాత మిగిలిన వారికీ చేసినట్లు గుర్తు .పుష్పహారం ,శాలువా  సర్టిఫికేట్ లతో జిల్లా విద్యాశాఖాదిగారు అందరినీ సత్కరించారని జ్ఞాపకం . జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు కూడా వచ్చే ఉంటారని అనుకొంటున్నా .కార్యక్రమం చాలా పకడ్బందీ గా గ్రాండ్ గా జరిగింది .అంతా అయ్యేసరికి రాత్రి 9 దాటి  ఉంటుంది .నన్ను బస్ స్టాండ్ లో ది౦పమని రాజుగారికి చెప్పి ,అక్కడ బస్ ఎక్కి ఉయ్యూరు చేరేసరికి రాత్రి 11 అయి ఉంటుంది . మర్నాడు నేను పురస్కారం అందుకున్న సందర్భంగా స్టాఫ్ కు మంచి టీపార్టీ ఇచ్చాను .విద్యార్ధులకు బిస్కెట్స్ చాకోలేట్స్ ఇచ్చి వారు చూపిన ఆదరాభిమానాలకు ప్రతిస్పందన తెలియజేశా .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-18 –ఉయ్యూరు .

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -112 పద్యనాటక౦

నాదారి తీరు -112

  పద్యనాటక౦

ఒక సారి బెజవాడ  బుక్ ఎక్సిబిషన్ లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని  గారు రాసిన ‘’భారతావతరణం ‘’పద్యనాటకం పుస్తకం క౦టపడగానే  కొనేశా .చిన్నపుస్తకమే .పది రూపాయలు మాత్రమె .అది చదివాక స్కూల్ పిల్లలతో దీన్నివేయిస్తే బాగుంటుంది అనిపించింది .పిల్లలకు చెప్పి వాళ్ల ఇష్టం తెలుసుకున్నా .వాళ్లకు బాగానే ఉందనిపించినా ,ఆ మాటలు పలకగలమా, పద్యాలు నోటికి వస్తాయా అనే సందేహం నాతొ మాటు వాళ్ళకూ వచ్చింది .చిన్ననాటకం .నన్నయ్య ,నారాయణ భట్టు ,రాజరాజనరేంద్రుడు మూడే పాత్రలతో నాటకం అడి౦చాలనుకున్నాం  .పాత్రల సెలక్షన్ నేనేచేశా .ఆందులోభూషణం బాబు అనే ఒక కుర్రాడున్నట్లు మేము కిందటి ఏప్రిల్ లో అమెరికా  వెళ్ళినప్పుడు ,అప్పుడప్పుడు వాట్సాఫ్ లో ఆతను మాట్లాడినప్పుడు గుర్తు చేశాడు. తాను ,నన్నయ  వేశానని అన్నాడు మిగిలిన వాళ్ళు నాకు గుర్తులేరు .స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసి  ఎవరి పోర్షన్ వాళ్లకు చెప్పి రాయించి ,ఆపాత్ర చెప్పాల్సిన డైలాగ్ కు ముందు ఏపాత్ర మాట్లాడుతోందో అందులో చివరివాక్యం ఏమిటో కూడా రాయించి ప్రాక్టీస్ చేయించా .బాధ్యత అంతా నేనే తీసుకున్నా.నాకూ వాళ్ళకూ ఖాళీ ఉన్న సమయాలలో క్రాఫ్ట్ రూమ్ లో ప్రాక్టీస్ చేయి౦చేవాడిని .  చాలా కష్టంగా ఉండేది వాళ్లకు ,నాక్కూడా .వాళ్ళు సరిగ్గా పలక లేకపోతె చాలా చిరాకు పడేవాడిని. కాని వాళ్ళు ఎస్సి ,బి సి విద్యార్ధులు .స్వచ్చంగా పలకటం వాళ్లకు అలవాటు లేనిపని .అందులో పద్యాలు కొంత రాగ యుక్తంగా భావ యుక్తంగాపలికితేనే దాని స్వారస్యం తెలుస్తుంది .అందుకని ఎక్కడ లేని ఓపికా తెచ్చుకుని ,ప్రతి కుర్రాడికీ ప్రత్యేక శిక్షణ నిచ్చి సుమారు నెలలోపు వారిని నిష్ణాతులను చేయగలిగాను .  నాగలక్ష్మి చేత రికార్డ్ చేయించి వాళ్ళకే వినిపిస్తే మహా ఆశ్చర్య పోయారు వాళ్ళు .తర్వాత స్టాఫ్ అందర్నీ సమావేశ పరచి పద్యనాటకం ఆడించా .పద్యనాటకం అంటే డ్రెస్ లేమీ లేకుండానే అని గుర్తుంచుకోండి ,స్టాఫ్ ముందు కూడా నదురూ బెదురూ లేకుండా చక్కగా సుశబ్దంగా సంభాషణలు ,పద్యాలు పలికి వాళ్ళకూ ఆశ్చర్యం కలిగించారు మా పిల్లలు .’’తివిరిఇసుమున తైలంబు తీయవచ్చు ‘’అన్నదానికి ఉదాహరణే ఈ పద్యనాటకం .తర్వాత దీన్ని ఒక వార్షికోత్సవం నాడు వాళ్ళతో ప్రదర్శింప జేసినట్లు జ్ఞాపకం .తలిదండ్రులూ ముచ్చట పడి బోల్డు ఆశ్చర్యం ప్రకటించి మమ్మల్ని బాగా అభినందించారు .ఇదంతా పిల్లల అమోఘ కృషి మాత్రమె ,నాప్రయత్నం కొంత తోడ్పడింది .మంచి పని చేయటానికి యెంత కష్టపడాలో ఈ నాటకం మాకందరికీ నేర్పింది .రాసిన దివాకర్లవారికి ఎంతైనా రుణపడి ఉంటాం .

                   అ౦గలూరు డయట్ వారి ప్రశంసలు

 ప్రతి ఉపాధ్యాయ దినోత్సవానికీ విద్యార్ధులందరి భాగస్వామ్యం ఉండేట్లు చేసేవాడిని .ఉపాధ్యాయులకు అసెంబ్లీ లో శుభాకాంక్షలు తెలియజేయటం ,తర్వాత ప్రతి తరగతి లో ఆతరగతి క్లాస్ టీచర్ కు పుష్పగుచ్చాలు సమర్పించి సాల్యూట్ చేయటం ,విద్యార్ధులందరికీ స్వీట్స్ కొని పంచిపెట్టటం జరిగేది .ఇదంతా అయ్యాక  అంగలూరు దయట్ నుండి ఎవరో ఒకరిద్దరు లెక్చరర్ లను ఆహ్వానించి సమావేశ హాల్ లో విద్యార్దుల౦దర్నీ  కోర్చోబెట్టి పాటలు పాడించి డాన్సులు చేయించి వాళ్ళతోనే ముందుగా ఉపన్యాసాలు చెప్పించి తర్వాత దయట్ లెక్చరర్ లను మాట్లాడమనే వాళ్ళం .వాళ్ళు ఈ ఆర్భాటం హడా విడి చూసి ‘’డ౦గ్’’అయిపోయేవారు .సభా ముఖంగా నే వారు ప్రశ్నించేవారు ‘’ఎన్ని వేలు ఖర్చు చేశారు ?అని .’’మూడు నాలుగు వందలు ‘’అని చెప్పగానే మరింత ఆశ్చర్యపోయేవారు .వాళ్ళు ‘’ఇదే ఫంక్షన్ ఇదే తీరులో మా డయట్ లో జరపటానికి పదివేలు ఖర్చు చేస్తారు. కాని అందులో ఇక్కడున్న ఆప్యాయతా ,ఆత్మీయతా గౌరవం క్రమశిక్షణా కనిపించవు .మీరందరూ మనసు హృదయం బుద్ధీ చక్కగా పెట్టి దీన్ని ఇంత శోభాయమానంగా దిగ్విజయంగా చేశారు .మీ అందరికీ మా అభినందనలు .మీ హెడ్ మాస్టర్ గారి చొరవ ఆలోచనా మెచ్చదగినవి .మీ ఉపాధ్యాయుల  మీ విద్యార్ధుల సహకారం గొప్పది .మీరందరూ ఒకే కుటుంబంగా ఇలా ఈ ఉత్సవం జరిపి  మాకే తెలియని ఎన్నో విషయాలు నేర్పుతున్నారు ‘’అని చెప్పేవారు .అందులో తెలుగు లెక్చరర్ శ్రీ ఆంజనేయులుగారు అద్భుత ప్రసంగాలు చేసి విద్యార్ధులకు గొప్ప స్పూర్తి కలిగించేవారు .సాధ్యమైనంతవరకు ఆయన వచ్చేట్లు ప్రయత్నం చేసేవాడిని  పిల్లలే తమ ఇల్లదగ్గరున్న పువ్వులు తెచ్చేవారు లేడీ టీచర్ల సాయంతో దండలూ బొకేలు తయారు చేసేవారు .పదవ తరగతి విద్యార్ధులు తలాకాస్తా డబ్బు వేసుకొని టీచర్లకు పార్టీ ఇచ్చేవారు .అతిధుల సత్కారం అంతా స్కూల్ భరించేది .కనుక డబ్బు ఖర్చు చాలాతక్కువ .అందరి పార్టిసిపేషన్ ఉండటం తో రెట్టింపు ఉత్సాహం తో కలిసి పని చేసేవారు. ఎవరికీ బర్డెన్ అనిపించేదికాదు .ఒకరిద్దరు పాఠశాల ఉపాధ్యాయులకు సత్కారం చేసేవాళ్ళం .వాళ్ళకీ ఆనందంగా ఉండేది .

  అలాగే డయట్ ప్రిన్సిపాల్ డా. శ్రీ చాగంటి వెంకటేశ్వరరావు కూడా ఒకసారి వార్షికోత్సవానికి విచ్చేసి  మా అందరికీ ప్రేరణ కలిగించారు. అద్భుతమైన వాగ్ధాటి ఆయనది .తెలుగులొ. ఇంగ్లీష్ లో ఆయన ప్రసంగిస్తుంటే నోళ్ళు తెరుచుకుని వినాల్సిందే .గంగా ప్రవాహమే .కొన్ని దేశాలుకూడా తిరిగొచ్చిన అనుభవం ఆయనది .జిల్లాలో ఆయన ఉన్నకాలం బంగారుకాలంగా గుర్తుండి పోయింది .ఆయన వలన విద్యార్ధులకు అనేక విధాలుగా ప్రయోజనం కలిగింది .

                       గణితావధానం

 ఉయ్యూరు హై స్కూల్ లో నాశిష్యుడు  మా స్కూల్  డ్రాయింగ్ మాష్టారు నాకు గురువు,అదే స్కూల్ లో నాకు సహ ఉపాధ్యాయులుగా పనిచేసిన    శ్రీ తాడినాటి శేషగిరిరావు గారబ్బాయి ఫణి రాజమోహన్ లెక్కలలో దిట్ట .నాదగ్గర ట్యూషన్ చదివినవాడు .అనేక గణిత ఒలింపియాడ్ లో పాల్గొని ప్రైజులు అందుకున్నాడు .జిల్లా సైన్స్ ఫెయిర్ లలో ఎప్పుడూ ఉపాధ్యాయుడుగా ,విద్యార్ధులతో   ప్రాజెక్ట్ లు చేయించటం లోనూ బహుమతులుందుకున్న సృజన శీలి .అతనితో మేము ఉయ్యూరులో మా సాహితీ మండలి ఆధ్వర్యం లో ఒక ఆదివారం సాయంత్రం ‘’గణిత అష్టావధానం ‘’చేయించి అరంగేట్రం చేయించాం .బాగా చేశాడు .పత్రికలన్నీ మంచి కవరేజ్ ఇచ్చాయి .దీని పూనిక నాదే .స్పాన్సర్లుగా కెసీపి కెమిస్ట్ హాస్య, నాటకరచయితా కవీ   స్వర్గీయ   శ్తీ టి వి సత్యనారాయణ ,బీరువాల మీసాల రెడ్డిగారు .అప్పటినుంచి చాలాస్కూల్స్ లో ఆతను గణితావధానాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న లెక్కల మాస్టారు .

  ఈ ఫణిరాజ మోహన్ తో అడ్డాడ హైస్కూల్ లో ఒక వార్షికోత్సవానికి ‘’గణిత అష్టావధానం ‘’చేయించాం .తెలివిగల విద్యార్ధినీ విద్యార్ధులను లేక్కలమేస్టారు రాజుగారితో ఎంపిక చేయించి ప్రుచ్చకులుగా ఏర్పాటు చేశాం .వీరిలో నాగలక్ష్మి, పావని మొదలైన పిల్లలున్నట్లు గుర్తు పిల్లలు బాగా ప్రశ్నించారు  .అవధాని దీటుగా సమాదానాలు చెప్పి గొప్ప ప్రేరణ కలిగించాడు .అవధాన ప్రక్రియ విద్యార్ధులకు అందుబాటు లో తెచ్చినందుకు అందరం ఆనందించాం .బహుశా ఈ వార్షికోత్సవానికే ననుకుంటా డయట్ ప్రిన్సిపాల్ చాగంటి వారు ముఖ్య అతిధిగా గా వచ్చి ఇక్కడి విశేషాలకు అబ్బురపడి ,అవధానం చేయించినందుకు అభినందించి అవధానికీ ఆశీస్సులు అందజేశారు .అవధాని ,నాశిష్యుడు ఫణి కి గొప్ప సన్మానం చేశాం అతనూ ఎంతో మురిసిపోయాడు .

               శ్రీ బసవలింగం గారికి సత్కారం

శ్రీ నల్లూరి బసవలింగం గారు పామర్రు హైస్కూల్ లో సీనియర్ తెలుగుపండిట్ .తెలుగు కావ్యాలలో దిట్ట .రాగయుక్తంగాపద్యం పాడి పాఠం చెప్పటం లో అందెవేసిన చేయి .గొప్ప హరికధకులు కూడా .రేడియోలో చాలా హరికధలు చెప్పారు. గ్రామాలలో పామర్రు సెంటర్ లో  కూడా ధనుర్మాసం లో హరికధలు చెప్పేవారు .ఆయనగాత్రం అపర ఘంటసాల అనిపిస్తుంది .పద్యరచనలో మహా ప్రావీణ్యం ఉన్నవారు .నాకు అత్యంత ఆప్తులు .మా ఉయ్యూరు సాహితీ మండలికి తరచుగా వచ్చేవారు .మాఇంటికి వస్తే  భోజనం చేయకుండా పంపించేవాళ్ళం కాదు భోజనం ముందూ తర్వాత ఆయన పద్యాలను శ్రావ్యంగా గానం చేసి తన్మయులను చేసేవారు .అందులో నర్తనశాల ,  భీష్మ  సినీపద్యాలు , కరుణశ్రీ కుంతీకుమారి,  జాషువా కాటిసీను పద్యాలు పాడాల్సిందే. విని చప్పట్లు మోగించాగిల్సిందే .వాగ్దానం సినిమాలో రేలంగి చెప్పిన ఘంటసాల  హరికధ బసవలింగం గారి  గొంతు ద్వారా వింటే దాని రుచే వేరు . ఆయన పాటలుపాడితే  ఊగిపోవాల్సిందే .మాధుర్యం శబ్ద స్వచ్చత మనసులను యిట్టె ఆకర్షిస్తాయి .గాంధర్వ లోకం నుండి జారిపడిన వాడేమో అనిపించేది .గొప్ప ఇమిటేషన్ చక్రవర్తి కూడా శంకరాభరణం లో ఒక చిన్నపిల్లకు సంగీతం చెప్పే మాస్టారు ,సోమయాజులకు సంగీతం రాదనీ చెప్పే శీను ఆయన మక్కీకి మక్కి రెండు పాత్రలను అభినయించి చ్చ్పే అభినయం అమోఘం .స్కూల్ లో ఆయన కన్నడం కూడా నేర్పేవారు దానికోసం ట్రెయినింగ్ కూడా పొందారు .దీనికి  ప్రత్యెక ఇన్సెంటివ్ ఆయనకు దక్కేది .వేసవిలో బెంగుళూరు వెళ్లి పునశ్చరణ తరగతులలో పాల్గొనేవారు  వస్తానన్న టీచర్స్ ను తనవెంట తీసుకు వెళ్ళేవారు .ఆయన కన్నడం మాట్లాడుతుంటే  కన్నడం వాడేనేమో అనే అనుమానం వస్తుంది. అంత స్వచ్చంగా మాట్లాడేవారు .

  బందరు స్పాట్ వాల్యుయేషన్ లో ఆయన ఒక గొప్ప అట్రాక్షన్ .తెలుగు పేపర్లు దిద్దేవారంతా ఆయన నాయకత్వంలో గొప్ప సభల్లాంటివి జరిపేవారు .ఆయనతో పాటలు పద్యాలు పాడించేవారు .అక్కడ ఆయనను కలవటం మధురానుభూతి నిచ్చేది .బోళా మనిషి, కల్లాకపటం లేని వ్యక్తి .వీటన్నిటినీ మించిన మరొక విషయం ఉంది.పింగళి సూరన రాసిన ‘’కళాపూర్ణోదయం ‘’ప్రబంధం ఆయనకు పూర్తిగా కంఠతా వచ్చు .ఎక్కడ ఏపద్యం చెప్పమన్నా క్షణం లో చెప్పగలరు .కానీ అందులోని కథ గుర్తుపెట్టుకోవట చాలాకష్టం .దాన్ని ఆయన కరతలామలకం చేసుకున్నారు . ఎక్కడా ఎవరికీ విసుగు రాకుండా మహా నేర్పుగా చెప్పేవారు .వీటిని చాలాసార్లు రేడియోలో ధారావాహికంగా చెప్పారు అవి అనేకసార్లు పునః ప్రసారితాలై ఆయన ప్రతిభకు గీటు రాళ్ళుగా ఉండిపోయాయి .ఉయ్యూరు సాహితీమందలిలోనూ చెప్పారు బహుముఖ శేముషీ వైభవం ఆయనది .ప్రముఖ కవుల అష్టావధాన శతావధానాలలో ప్రుచ్చకులుగా ,అప్రస్తుత ప్రసంగ కర్తగా ప్రశంసలు పొందారు .ఇంతటి విద్వాంసుడు నాకు గొప్ప అభిమాని అవటం నా అదృష్టం .ఆంద్ర దేశం లో ఆనాటి సమకాలీన ప్రముఖ కవులందరితో ఆయనకు పరిచయం ఉన్నది

   శ్రీ బసవ లింగం గారిని రెండు సార్లు అడ్డాడ హైస్కూల్ కు ఆహ్వానించి ,పిల్లలకు ప్రేరణాత్మక సందేశాలిప్పించి ఘనంగా సత్కరించాం .ఆయనా నేనూ రిటైర్ అయ్యాకకూడా మా సాహితీ బాంధవ్యం చాలాకాలం కొనసాగింది .ఆయన ఆతర్వాత ఎక్కడో రెండు మూడు చోట్ల  ప్రైవేట్ కా  లేజీలలో  తెలుగు లెక్చరర్ గా పని చేయటంఅంతగా నచ్చక ఉండలేకపోవటం నాకు తెలుసు . ,వీలైనప్పుడల్లా మా ఇద్దరిమధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరగటం ఉండేది .క్రమ౦ గా తన ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు  రాసేవారు .మరొకసారి పెన్షన్ డబ్బు అంతా బళ్లారిలో పొలం కొని వ్యవసాయం చేయలేక ,చేసినా గిట్టుబాటు కాక  అయినకాడికి అమ్మేసి తెగ నష్టపోయి ఉయ్యూరువస్తే ఆయన ముఖం లో కాంతి ,ఉత్సాహం కనిపించలేదు .ఇంటివద్ద పరిస్తితులు కూడా అనుకూలంగాలేవని చెప్పారు .చాలా కృశించిపోయారు . కాని మాటల్లో ఆ హాస్యం మాత్రం తగ్గలేదు .ఆయనుంటే సందడే సందడి .మళ్ళీ ఎక్కడో ఉద్యోగం లో చేరి చాలా విసిగివేసారి పోయినట్లు రాశారు .ఆతర్వాతెప్పుడో ఆయన మరణవార్త తెలిసింది .స్నేహశీలి సహృదయుడు మంచిమనిషి, గొప్పకవి, భావుకుడు , మహావక్త గుణగ్రహణ పారీణుడు  కావ్యాల ను లోతుగా పరిశీలించినవాడూ , కన్నడం లోనూ చిక్కని కవిత్వం చెప్పినవాడు ముఖ్యంగా ‘’కళాపూర్ణోదయ౦ ‘’ను ఔపోసన పట్టిన’’చుళికీకృత సకల కళాపూర్ణోదయుడు, అభినవ గాన గంధర్వుడు శ్రీ నల్లూరి బసవలింగం గారి మరణం బాధాకరం .ఒక మంచి సాహితీ మిత్రుని కోల్పోయాను .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-18 –ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆం .ప్ర .ర. సంఘం ఆధ్వర్యం లో ఈనెల 10 ఆదివారం ఆంధ్రప్రదేశ్ పై ”ఏకదిన కవిసమ్మేళనం ”ఆహ్వానపత్రిక

ఆం .ప్ర .ర. సంఘం ఆధ్వర్యం లో ఈనెల 10 ఆదివారం ఆంధ్రప్రదేశ్ పై ”ఏకదిన కవిసమ్మేళనం ”ఆహ్వానపత్రిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మార్చినెల తెలుగు విద్యార్ధి లో శ్రీ జయేంద్ర సరస్వతి గారిపై నా వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గ దేవాలయం –బీజింగ్

స్వర్గ దేవాలయం –బీజింగ్

చైనా బీజింగ్ లో స్వర్గ దేవాలయం ఉన్నసంగతి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు .మధ్య బీజింగ్ కు ఆగ్నేయభాగం లో ఉన్న ఈఆలయాన్నిమింగ్ ,క్వింగ్ వంశానికి చెందిన అనేకమంది చక్రవర్తులు సందర్శించి ,మంచి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండేట్లు చేయమని  ప్రార్ధించారు.ఇది ప్రసిద్ధ టావోయిస్ట్ దేవాలయంగా గుర్తింపు పొందింది .

  ఈ ఆలయ సముదాయాన్ని యాంగిల్ చక్రవర్తి 1406లో నిర్మించటం ప్రారంభించి 14 ఏళ్ళు కస్టపడి 1420 లో పూర్తి చేశాడు .ఈయనే బీజింగ్ లో’’ ఫర్బిడెన్ సిటీ ‘’కూడా నిర్మించాడు .16 వ శతాబ్దిలో  దేవాలయాన్ని క్రమంగా అభి వృద్ధి చేసి జియాపింగ్ చక్రవర్తి దీనికి ‘’స్వర్గ దేవాలయం ‘’అని పేరు పెట్టాడు .ఈయనే తూర్పున సూర్య దేవాలయం ,ఉత్తరాన’’ భూ దేవాలయం’’ ,పశ్చిమాన ‘’చంద్ర దేవాలయం ‘’అనే మూడు దేవాలయాలు నిర్మించాడు .18 వ శతాబ్దం లో స్వర్గ దేవాలయాన్ని క్వాన్ లాంగ్ చక్రవర్తి ఆధునీకరించాడు .ఖజానాలో తగినంత డబ్బు లేకపోవటం వలన పూర్తి చేయలేకపోయాడు.

 రెండవ నల్లమందు యుద్ధం లో  ఈ ఆలయాన్ని ఆంగ్లో ఫ్రెంచ్ వారు ఆక్రమించారు .1900లో బాక్సర్ తిరుగుబాటు కాలం లో  ఎనిమిది దేశాల కూటమి ఆలయాన్ని ఆక్రమించి ఆర్మీ కమాండ్ గా వాడుకున్నది .దీనివలన ఆలయ రూపు రేఖలు మారి, వైభవం కోల్పోయి శిధిలావస్త కు చేరింది.ఆలయ నిర్వహణే వదిలేసి జల్సా చేశారు .క్వింగ్ వంశ పాలన అంతమయ్యాక మరీ నాశనమైంది దేవాలయం .

1914 లో రిపబ్లిక్ చైనా ప్రెసిడెంట్ యువాన్ షికాయ్ ఈ ఆలయం లో మింగ్ ప్రార్ధన ఉత్సవం నిర్వహించాడు . తర్వాత తానే చైనా చక్రవర్తి అని ప్రకటించాడు .1918 లో ఆలయం పార్క్ గా మార్చి మళ్ళీ ప్రజలకు దర్శనం చేసే వీలు కల్పించాడు .1998 లో ఈ స్వర్గ దేవాలయం ‘’యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ‘’గా పేర్కొనబడింది .ఇక్కడ వేసిన శిలాఫలకం పై ‘’ఇది అత్యద్భుత కళాఖండం .ప్రపంచ ప్రసిద్ధ 10  నాగరకతలలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది .దూర ప్రాచ్యం లో దీని శిల్ప నిర్మాణ ప్రభావం అనేక శతాబ్దాలుగా ఉన్నది.

  స్వర్గ దేవాలయం 2.7 3కిలోమీటర్ల వైశాల్యం లో ఉన్నది .ఇందులో ముఖ్యమైన మూడు నిర్మాణ సమూహాలున్నాయి .ఇవన్నీ అక్కడి ఆధ్యాత్మిక తాత్విక  భావనల ననుసరించే నిర్మించారు .అందులో ముఖ్యమైనది మంచి పంటలకోసం ప్రార్ధించే ప్రార్ధన మందిరం .ఇది మూడు అంతస్తుల వలయాకార భవనం .కింద అంతా చలువరాతి నిర్మాణం .పైన అంతా చెక్క తో చేయబడింది .ఒక్క మేకు కూడా వాడని నిర్మాణం .దీనిలోనే చక్రవర్తుల ప్రార్ధన చేసేవారు . 1889లో ఇది పిడుగుపాటుకు శిధిలమైంది .ఇప్పుడున్న భవనం చాలాకాలం తర్వాత కట్టబడింది .

 దీనికి దాక్షిణాన ‘’ఇంపీరియల్ వాల్ట్ ఆఫ్ హెవెన్ ‘’ అనే గొప్ప భవనం ఉంది .ఇది ఇంచుమించుగా  పైదానిలాగే కట్టబడి ‘’ఈకో వాల్ ‘’అంటే ప్రతిధ్వని గోడ తో శబ్దాన్ని ఎంతోదూరానికి వినిపించేట్లు చేస్తుంది .ఇది ప్రార్ధనామందిరానికి మెట్ల త్రోవద్వారా కలుపబడి ఉంటుంది .దీనికి కూడా బీమ్స్ ను వాడలేదు .ఇ౦పీరియర్ వాల్ట్ కు దక్షిణాన ‘’సర్కులర్ మౌంట్ అల్టార్’’భవనం ఉంటుంది .దీని నిర్మాణమూ ఆశ్చర్యం కలిగిస్తుంది . ఇదీ పై రెండిటి లాగానే మార్బుల్ బేస్ తో వర్తులంగానే ఉంటుంది .దీనిమధ్యభాగాన్ని ‘’హార్ట్ ఆఫ్ హెవెన్ ‘’అంటే  ‘’స్వర్గ హృదయం ‘’లేక ‘’సుప్రీం యాంగ్ ‘’అంటారు .ఇక్కడ చక్రవర్తి దేశం లో మంచి వాతావరణం కోసం ప్రార్ధనలు చేస్తాడు .ఇక్కడి ధ్వనులన్నీ ప్రతిధ్వనులుగా మారి ఎక్కడో సుదూరం లో ఉన్న స్వర్గానికి వినిపిస్తాయని వారి పూర్తి విశ్వాసం .1530 లో దీన్ని జియాజింగ్ చక్రవర్తి కట్టించాడు .ఇదికూడా 1740లో పునర్నిర్మి౦చ బడింది .

 చైనాలో చక్రవర్తులంతా ‘’స్వర్గ కుమారులు’’ అనే నమ్మకం బాగాఉంది .స్వర్గ లోకాధిపతి తరఫున భూమిని అతడు పరిపాలిస్తాడని విశ్వాసం .స్వర్గ దేవతకు అనేక బలులు ఇస్తారు .ఏడాదికి రెండు సార్లు చక్రవర్తి ప్రత్యేక దుస్తులతో ఫర్బిడెన్ సిటీ నుంచి ఇక్కడి సపరివారంగా విచ్చేసి ప్రార్ధనాదికాలు నిర్వహిస్తాడు .శీతాకాలం లో చక్రవర్తి భూదేవాలయానికి వచ్చి ప్రార్ధనలు చేయటం తో ఈ తంతు పూర్తి అవుతుంది .ఈ ఉత్సవాలలో ఏ చిన్న పొరబాటు జరగ కుండా జాగ్రత్త పడతారు .పొరబాటు జరిగితే దేశానికి అరిష్టం గా భావిస్తారు .

  ఆలయనిర్మాణం లో అంతరార్ధం తెలుసుకొందాం .భూమి చదరంగా ,స్వర్గం వర్తులంగా ఉంటుంది .అందుకే ఆలయ నిర్మాణం అలా చేశారు .మొత్తం ఆలయ సమూహం అంతా రెండు రక్షణ వలయాల గోడల తో ఉంటుంది .బయటి గోడ అత్యంత ఎత్తుగా అర్ధవలయాకారంగాఉత్తరం వైపుచివరలో  ఉంటుంది . ఇది స్వర్గానికి ప్రతీక ..దక్షిణ చివర గోడ ఎత్తు తక్కువగా దీర్ఘ చతురస్రాకారంగా ఉండి భూమికి సింబాలిక్ గా ఉంటుంది .ప్రార్ధనా మందిరం ,మౌంట్ ఆల్టార్ లురెండూ వలయాకారం గా చతురస్రపు భూమి పై ఉండి మళ్ళీ స్వర్గ౦  భూమి లకు ప్రతీకలుగా ఉంటాయి .సర్కులర్ మౌంట్ లొ 9 సంఖ్య చక్రవర్తికి చిహ్నం .ప్రార్ధనామందిరం నాలుగు లోపలి ,12 మధ్య ,12 బయట పిల్లర్ల తో కట్టబడింది .ఇవి నాలుగు రుతువులకు ,పన్నెండు నెలలకు ,12 చైనా సాంప్రదాయ గంటలకు ప్రతీకలు .మధ్య ,బయటి పిల్లర్లు మొత్తం మీద చైనా సౌర విషయాలను తెలియ జేస్తాయి .దేవాలయం లోపలి భవనాలన్నీ నల్ల రూఫ్ టైల్స్ తో స్వర్గానికి చిహ్నంగా ఉంటాయి .ప్రార్ధన మందిరం లోని ఏడు నక్షత్ర రాళ్ళ సమూహం తైషాన్ పర్వతానికున్న  ఏడు శిఖరాలకు ప్రతిరూపం .ఇదే క్లాసిక్ చైనా స్వర్గ లోక ప్రార్ధనా నిలయం .వీటిలోని డ్రాగన్ పిల్లర్లు సీజన్ లకు ప్రతిరూపాలు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –4-6-18 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా

త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా

ఇండోనేషియాలో ప్ర౦బనాన్ వద్ద  త్రిమూర్తులకు దేవాలయాలున్నాయి .వీటిలో మధ్యలో ఉన్న శివాలయం అన్నిటికంటే ఎత్తైనది .మిగిలిన రెండు బ్రహ్మ విష్ణు దేవాలయాలు .ప్రతి ఆలయం లో ప్రధాన స్థానం లో ఆ దేవుని విగ్రహం ,దానికి ఆనుకుని అనేక గదుల సమూహం ఉంటాయి .10 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ త్రిమూర్తి ఆలయ సముదాయం హిందూ శిల్ప నిర్మాణ వైచిత్రికి గొప్ప ఉదాహరణ .ఇక్కడ అంటే ప్ర౦బనాన్ లో మొత్తం 240 దేవాలయాల సముదాయం  .అందులో త్రిమూర్తులకున్న మూడు ఆలయాలతో బాటు ,మూడు వాహన ఆలయాలు  వగైరాలున్నాయి .ప్రధానాలయం శివాలయం ఎత్తు 130 అడుగులు .పెద్ద శివలింగం తోపాటు అమ్మవారు దుర్గాదేవి విగ్రహమూ పెద్దదే .

 ప్రాచీన జావా లో ఉన్న ఈ దేవాలయనిర్మాణం  క్రీ.శ 850 లో   సంజయ వంశానికి చెందిన రాకే పికటన్ ప్రారంభించాడు .బౌద్ధ  శైలేంద్ర వంశ రాజులు కట్టిన బోరోబుదూర్ ,సేవూ దేవాలయాలకు దీటుగా నిర్మించాడు .దీనితో హైందవ సంజయ వంశ పాలన మరలా ప్రారంభమైనట్లు ప్రపంచానికి చాటి చెప్పాడు  . అక్కడ అప్పటిదాకా ప్రబలం గా ఉన్న మహాయాన బౌద్ధం క్రమంగా హిందూ శైవ౦ గా మారిపోయింది .పికటన్ తర్వాత లోకపాల ,బైలుంగ్ మహారాజులు అభివృద్ధిచేశారు .856 లో వేసిన ‘’శివ గృహ’’ శిలాఫలకం ప్రకారం ఈ ఆలయం శివ మహాదేవునికి అ౦కితమివ్వబడింది .శివ గృహం అంటే శివాలయం .ఆలయానికి పడమర వైపు సమీపం లో ఒపాక్ నది ఉన్నది .ఇప్పుడానది ఉత్తర౦ నుండి దక్షిణానికి ప్రవహిస్తోంది .ఒకప్పుడు ఇది తూర్పువైపు ప్రవహిస్తూ శివాలయానికి అతి సమీపం లో ఉండేదని చారిత్రకులు తెలియ జేశారు .బైలుంగ్ మహారాజు మరణానంతరం శివలింగం లో ఆయన కోరిన మార్పులు జరిగినట్లు తెలుస్తోంది .తర్వాత మాతరం రాజులైన దక్ష ,తులోడాంగ్ ల పాలనలో ఆలయం అభివృద్ధి చెందింది .మాతరం రాజ వంశస్తుల కులదైవం ఇక్కడి శివుడు .వందలాది బ్రాహ్మణులు శిష్యగణం తో ఈ ఆలయం వెలుపల ఆవాసంగా ఉండేవారు .

  930లో రాజధాని తూర్పు జావాకు మార్చాడు రాజు ముంపు సి౦డొక్.అతని వంశాన్ని ఇసియాన వంశం అంటారు .ప్ర౦బ నాన్ నుంచి రాజధాని మార్చటానికి కారణం దీనికి ఉత్తరాన ఉన్న మౌంట్ మేరాపి అనే అగ్నిపర్వతం  బ్రద్దలవ్వటమే.దీనితో ఈ ఆలయ ప్రాభవం క్రమేపీ తగ్గిపోయి, ఆ ప్రదేశాన్నివదిలి వేయటం తో  క్షీణ దశ ప్రారంభమైంది .16 వ శతాబ్దం లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఈ ఆలయాన్ని పూర్తిగా శిధిలం చేసింది .ప్రధానాలయాలు ఉన్నప్పటికీ మిగిలిన వందలాది ఆలయాలు నాశనమై రాళ్ళు రప్పలతో  ఆ ప్రాంతం నిండి పోయింది .దీనిప్రాచీన వైభవం పై అనేక కధలు గాధలు ,పాటలు రూపం లో జానపదులలో ఇప్పటికీ ప్రచారం లో ఉన్నాయి.1755 లో మాతరం వంశం  చీలిపోయి యోగ్యకర్తా, సురకర్త సుల్తాన్ వంశాలుగా చీలిపోయాయి .వీరి సరిహద్దు నిర్ణయించటానికి ఈ శిధలాలు, ఒపాక్ నది  ఉపయోగపడినాయి .ప్రాచీన జావాలో ఇదే అతి పెద్ద హిందూ దేవాలయం .

 తర్వాత జావా స్థానికులు ఈ ఆలయాన్ని గుర్తించారు కాని వారికి చారిత్రిక విషయాలేమీ తెలీదు .అందువలన తరతరాలుగా ప్రచారం లో ఉన్న గాధలను భక్తీ ,వీరత్వం దట్టించి  బాగా ప్రచారం చేశారు .ఇవన్నీ లోరో జాన్గ్రాంగ్ లెజెండ్ గా గుర్తింపు పొందాయి .1811 లో బ్రిటిష్ పాలనలో డచ్ ఈస్ట్ ఇండీస్ ఉన్నప్పుడు కోలిన్ మెకంజీ అనే సర్వేయర్ అనుకోకుండా ఈ ప్రాంతాన్ని చూడటం తటస్తించింది .చాలాకాలం దేవాలయం ఉపేక్షకు గురైనట్లు గుర్తించాడు . డచ్ వాళ్ళు ఇక్కడి శిల్పాలను తమ పెరటి తోటలకు అలంకరణగా ,బిల్డింగ్ లకు ఫౌండేషన్ రాళ్ళుగా  ఉపయోగించారు .1880 లో పురావస్తు శాఖ అడ్డగోలు , నిర్లక్ష్యపు త్రవ్వకాల వలన మరింత దోపిడీకి గురైంది  .1953 లో శివాలయం పునర్నిర్మాణం పూర్తయి ‘’,సుకోమా’’తో ఆవిష్కరణ జరుపబడింది .అప్పటి నుంచే మరింత దోపిడీకి గురైంది .ఉన్నవాటిని ఉపయోగించి 75 శాతం ఆలయాలు పూర్తీ చేయగలిగారు .

 1990లో ప్రభుత్వం అక్కడ ఆక్రమించుకున్న మార్కెట్ యార్డ్ ను ఖాళీ చేయించి ,చుట్టుప్రక్కల గ్రామాలు ,పొలాలను స్వాధీనం చేసుకుని ‘’ఆర్కేలాజికల్ పార్క్ ‘’ఏర్పాటు చేసింది .ఒపాక్ నది ప్రక్కన అందమైన ఆరుబయలు రంగస్థలాన్ని ఏర్పరచి,సంప్రదాయ రామాయణ గాధను ప్రదర్శింప జేసింది  .ఈ నృత్యం శతాబ్దాల పురాతన జావన్ నృత్యం .దీనిని ప్రతి పున్నమి నాడు ప్రదర్శించేట్లు చర్యలు చేబట్టింది .ఇప్పుడు ప్ర౦బనాన్ దేవాలయం ఆర్కేలాజికల్ ,కల్చరల్ కేంద్రం గా రూపొందింది .1990నుండి  బాలీ, జావన్ దేశ  గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రమే అయింది .

 2006 లో యోగ్యకార్తా భూకంపం వలన శివాలయం మళ్ళీ కొంతవరకు  శిధిలమైంది .దైవ దర్శనం తాత్కాలికంగా రద్దు చేసి   పురాతత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపి కొద్దివారాలలోనే పునర్నిర్మాణం పూర్తీ చేసి మళ్ళీ భక్తులకు దర్శనసౌకర్యం కల్పించింది .2009 లో నంది దేవాలయనిర్మాణం పూర్తయింది .2014 నాటికి యాత్రికుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయింది .2012 లో బాలి ప్రెసిడెంట్ ఈ ప్రాంతాన్ని అంతటినీ  రక్షణ ప్రదేశంగా ప్రకటించాడు .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –3-6-18 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment