సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు
September 12, 2013
జువ్వాడి గౌతమరావు గతించి అప్పుడే సంవత్సరమయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మరి అంతటి సాహిత్య సాహసి కరీంనగర్లో కానీ మరోచోట కానీ కనబడడు, వినబడడు. అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉండగలం?
సాధారణంగా సామ్యవాదం, సాంప్రదాయం రెండూ ఒకేచోట ఇమడవని అంటుంటాం. కానీ గౌతమరావులో అవి ఇమిడాయి. ఎందుకు ఇమిడాయంటే, అతడు సాంప్రదాయంలో కూడా సత్సాంప్రదాయానికి చెందినవాడు కనుక. తరచి చూస్తే సత్సాంప్రదాయవాదానికీ సామ్యవాదానికీ తేడా లేదు కనుక. సత్సాంప్రదాయమంటే ఒకానొకప్పటి సంప్రదాయంలోని అనేకానేక దురాచారాలు, మూఢాచారాలు పోగా పోగా, వదిలేయగా, వదిలేయగా మిగిలేది. గడిచిన కాలాల నుంచి నడుస్తున్న కాలంలోకి దిగుమతి చేసుకోబడేది. అది ఎప్పటికప్పుడు నవ్యమౌతూ నవ్యమౌతూ పోయేది. సాంప్రదాయంలోని ఎన్నో కొన్ని దురాచారాలు, మూఢాచారాలు మిగిలినా అవి అట్టే కాలం కొనసాగక మరుగున పడుతూ పడుతూ మాయమౌతూ ఆయా సాంప్రదాయాలలోని విలువలు మాత్రమే మిగిలి అది సత్సాంప్రదాయం అవుతూ పోతుంది కనుక. ఒకడు సాంప్రదాయవాది మూడు విధాలా అవుతాడు. కేవలం ఆచారాలను పాటించడం ద్వారా, కేవలం విలువలు పాటించడం ద్వారా, లేక రెండింటినీ పాటించడం ద్వారా. సాధారణమైన ఆచారాలు ఆయాకులాలకు, కుటుంబాలకు, ప్రాం తాలు మున్నగువాటికి మాత్రమే చెందేవి. అవి అన్ని చోట్లా అందరిచే పాటించబడేవి కావు. అవి సమయానుకూలంగా మారుతూ ఉండేవి.
కానీ సదాచారాలు విలువల నంటిపెట్టుకొని ఉండేవి. అవి మారవు. అవి సార్వకాలీనమైనవి. ఉదాహరణకు సత్యం, ధర్మం, న్యాయం, పాతివ్రత్యం, సమతాభావం, మమతాభావం, కరుణ, ప్రేమ, కృతజ్ఞతా మున్నగునవి. ఇవి మతాచారాలు కావు. ఇవి దైవభక్తికి చెందిన విశ్వాసాలు కావు. ఇవి మూఢత్వానికి, మూర్ఖత్వానికి చెందినవి కావు. ఇవి వివేచనకు, విచక్షణకు, ‘రీజన్’కు అన్ని కాలాల్లో నిలబడేవి. అందరికీ సమ్మతమయ్యేవి, ఏ మతానికి, యిజానికి, ప్రాంతానికి చెందిన వారికయినా వర్తించేవి. ఇలాంటి సత్సంప్రదాయాలకు, మానవతావాదానికి, సామ్యవాదానికి ఏ తేడా లేదు. ఇవి సాంఘికమైనవి. మానవీయమైనవి.
గౌతమరావు గారు ఇలాంటి సత్సాంప్రదాయాలకు చెందిన సాంప్రదాయవాది. ప్రధానంగా అతడు మానవతావాది. ఆ పిదపే ఏదైనా. అందుకే అతడు మొదట లోహియా వాదిగా చాలానాళ్లు రాజకీయాలలో పనిచేసి సామ్యవాదాన్ని విశ్వసించి, పాటించి, దానిని ప్రచారం చేసి, దాని వైపున ఎన్నికల్లో పాల్గొని, రాజకీయాలలోని కుళ్లును, అవకాశవాదాన్ని, విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో నెగ్గడాన్ని, కుటిలాన్ని, ద్వేషాన్ని, కుల, మత, ప్రాంతీయ భావాలను భరించలేక వాటి నుంచి విరమించుకున్నాడు. ఆ పిదప ఉత్తమ సాహిత్యవేత్తయిన విశ్వనాథ సత్యనారాయణ వైపు, అతని సాహిత్యం వైపు మొగ్గాడు. అతడు విశ్వనాథనే కాక, చక్కని చిక్కని సాహిత్యవేత్తలందరినీ చదివాడు. ఒక్క తెలుగు సాహిత్యమే కాదు, అతని చిన్న నాటి నుంచి ఆంగ్లేయ సాహిత్యం, సంస్కృత, హిందీ సాహిత్యాలు కూడా పుష్కలంగా చదివాడు. ఏది చదివినా చాలా జాగ్రత్తగా చదివేవాడు. ఆషామాషీగా కాదు. నిష్కామంగా చదివేవాడు,Prejudiced గా, biased గా, pre-conditioned గా చదివేవాడు కాదు. గౌతమరావు విశ్వనాథ సాహిత్య పక్షపాతి అని అనుకుంటారు చాలామంది నన్ననుకున్నట్లే. మేమిరువురమూ అలాంటి వారం కాము.We are open minded, open hearted. We like any good literature written by any one in any language.. ‘నేను కమ్యూనిస్టునే కాని నాస్తికుణ్ణి కాను’. ”I am communist as well as theist’ అని అన్నారు ఒకసారి విశ్వనాథ. గౌతమరావు కూడా అలాంటివాడే.
ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. సత్యనారాయణ గారు, గౌతమరావు గారు, ఇరువురూ అచ్చమైన, స్వచ్ఛమైన మానవతావాదులుగా, సామ్యవాదులుగా బ్రతికినవారే. జీవితమంతా అతి ‘సింపుల్’గా, సాదాసీదాగా జీవించినవారే. అలా వారిరువురూ మాటల్లో, వ్రాతల్లోనే కాక చేతల్లో కూడా, నడవడికలో కూడా సామ్యవాదులూ, సత్సాంప్రదాయవాదులూ కూడా. నిద్దాగా, నిలకడగా, నిబద్ధతతో నిష్కామంగా జీవించారు. వారి విచారమంతా స్వంతానికి చెందిన విచారం కన్నా సాంఘిక క్షేమ సంక్షేమానికి, లోక కల్యాణానికి చెందిన విచారమే. వారిరువురూ మానవీయ విలువల కొరకే జీవించారు. భారతీయ సంస్కృతి, సత్సంప్రదాయాల పరిరక్షణ కొరకే జీవించారు.
జీవులను, వారి నడవళ్ళను, నీతి నిజాయితీ యను కొలబద్ధతో కొలిచారు. ఇద్దరూ అపరిమితమైన స్నేహశీలురే. బంధువులంతా వారికి సింధువులే! కానీ వారికి సాహిత్యమే మొదట, సంస్కారం ఆ వెనుకే. వేయి పడగలలో అరుంధతి ఈ విషయాన్ని అక్షరాలా చెబుతుంది. కొత్తగా సంసారానికొచ్చిన అరుంధతి తన భర్త ధర్మారావుకు (ధర్మారావంటే విశ్వనాథే) అందరికన్నా అన్నిటికన్నా తానే దగ్గరని అనుకుంటుంది. కానీ, ధర్మారావుకు శ్రీకృష్ణదేవరాయల ‘అమూక్తమాల్యద’ అంతకన్నా దగ్గరని అపుడపుడే అర్థమవుతుంది. గౌతమరావు గారికి కూడా విశ్వనాథ వారు ‘మ్రోయుతుమ్మెద’లో అన్నట్లు సంసార లంపటత్వంలో మోజెక్కువే (వారు తమ సతీమణిని వెల్లూరు హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయించినప్పుడు రాసిన ఒక లేఖ ద్వారా ఇది నాకు తెలిసింది – నేను జగిత్యాల కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసినపుడు). కానీ వారికి కూడా అది సాహిత్యం పిదపే. అది కూడా విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షం’ పిదపే. ఎన్ని మరచినా రామాయణాన్ని మరచిపోయే వారు కాదు, ఎన్ని మరచినా విశ్వనాథను మరచిపోయే వారు కాదు. ఆ రెండు పేర్లూ వినవస్తే ఎంత తెరవరాని కళ్ళనైనా తెరచి తేరిపార చూచేవారు వారి తుదిశ్వాస వరకు.
గౌతమరావు గారికి వ్యక్తుల గురించి పూర్తి అవగాహన ఉండేది. వారి బలాల బలహీనతల గురించి, వారి సమర్థతల అసమర్థతల గురించి, సాహసాల పిరికితనాల గురించి. వారు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో చాలా బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. ఒకప్పుడు లోహియా గారి సోషలిస్టు పార్టీలో చురుకుగా పనిచేసే రోజుల్లోనే వారు చాలా మంచి వక్తగా పేరు గాంచారు. వారి విమర్శనాత్మక దృష్టి కూడా చాలా నిశితంగా, నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా ఉండేది. అందుకే ‘జయంతి’లో వారు రచించిన విమర్శలు, ఆంధ్రరాష్ట్రమంతటా ఆకట్టుకునేవి. అప్పట్లో విశ్వనాథ వారిని రెచ్చగొడితే ఎంత మంచి ఉపన్యాసం వస్తుందో, గౌతమరావుగారిని రెచ్చగొడితే అంత మంచి విమర్శ, అంతమంచి వెటకారం, వేళాకోళం వస్తుందని అనేవారు చాలామంది. వారు ‘జయంతి’ని సంపాదకులుగా నడిపిన రోజులు ఆ పత్రికకు నిజంగానే ‘బంగారు రోజులు’. అప్పట్లో దాని కొరకు ‘భారతి’ కన్నా ఎక్కువ ఎదురుచూసేవారు దాని పాఠకులు. గౌతమరావు గారికి ఛిౌn్టటౌఠ్ఛిటటజ్ఛీట ఎలా లేవదీయడం, వాటికి చలాకీ మాటలతో ఎలా సమాధానం చెప్పడం సరదాగా ఉండేది.
ఇతరులకు కూడా వారివి. అప్పట్లో చాలామంది మంచి సాహిత్యవేత్తలు కూడా వారికి సహాయసహకారాలందించేవారు. విశ్వనాథ వారు సరే సరి. కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, తుమ్మపూడి కోటేశ్వరరావు, ధూళిపాళ్ల శ్రీరామమూర్తి లాంటివారు. అన్నీ కలిసొచ్చిన రోజులవి. అంటే రచయితలు గట్టి వారుండేవారు. విమర్శకులు గట్టివారుండేవారు, చదువరులు కూడా చాలా గట్టివారుండేవారు. ఏరీ ఈ రోజుల్లో అలాంటివారు? ఎంతమంది దొరుకుతారు? అయినా ‘జయంతి’ ఇప్పటికీ తగినంత ప్రయత్నం చేస్తూనే ఉంది విశ్వనాథ వారి, గౌతమరావు గారి సాహిత్య సాంప్రదాయాలను ఎంతోకొంత కొనసాగించడానికి. దానికి మేము వెలువరించే ప్రత్యేక సంచికలే సాక్ష్యం.
– డా. వెల్చాల కొండలరావు
‘జయంతి’ సంపాదకులు
(జువ్వాడి గౌతమరావు ప్రథమ వర్ధంతి (12 సెప్టెంబర్ 2013) సందర్భంగా)
