మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి

        బ్రిటిష్ ప్రభుత్వకాలం లో మొదటి తరం మహిళా పట్టభద్రురాలే కాక పాశ్చాత్య వైద్య శాస్త్రం లోశిక్షణ పొందిన  మొదటి తరం డాక్టర్ శ్రీమతి కాదంబినీ గంగూలీ .1861జులై 18న బీహార్ లోని భాగల్పూర్ లో బ్రహ్మ సమాజ మతస్తుడు వ్రజ కిషోర్ బాసుకు కుమార్తెగా జన్మించింది . తండ్రి హెడ్ మాస్టర్ గా పని చేసేవాడు . భాగల్పూర్ లో మహిళా విమోచనోద్యమాన్ని అభయ చరణ్ మాలిక్ తో కలిసి నడిపినవాడు .భారత దేశం లోనే మొదటి మహిళా సమాజాన్ని భాగల్ పూర్ లో1863 లోనే స్థాపించిన ఆదర్శ పురుషుడు .

   కాదంబిని ప్రాధమిక విద్య వంగ మహిళా విద్యాలయం లో ప్రారంభమైంది .1878 లో అక్కడ బెతూన్ స్కూల్ ఏర్పడింది ఈ స్కూల్ నుండి కలకత్తా విశ్వ విద్యాలయం లో ప్రవేశ పరీక్ష రాసిన తొలి మహిళ గా కాదంబినీ  గుర్తింపు పొందింది .ఆమె ప్రయత్న ఫలితం గా బెతూన్ కాలేజి  ఇంటర్ కోర్సును ,తర్వాత డిగ్రీ కోర్సును1883 ప్రారంభించటం విశేషం .బెతూన్ కాలేజి నుండి కాదంబినీ ,చంద్ర ముఖి బసు లు మొదటి సారిగా డిగ్రీ సాధించి రికార్డ్ నెలకొల్పారు .దీనితో బ్రిటిష్ ప్రభుత్వకాలం లో మొట్ట మొదట డిగ్రీ పొందిన భారతీయ మహిళలుగా   చరిత్ర  సృష్టించారు .

            కాదంబినీ కలకత్తా మెడికల్ కాలేజి లో చేరి మెడిసిన్ పూర్తి చేసింది .1886లో బెంగాల్ మెడికల్ కాలేజి డిగ్రీ ని పొందింది .ఈ ఘన విజయాన్ని అప్పుడు సాధించిన వారు ఇద్దరే ఇద్దరుమహిళలు . ఒకరు కాదంబినీ ,రెండవవారు ఆనంది గోపాల్ జోషి .పాశ్చాత్య వైద్య శాస్త్ర అభ్యాసానికి అనుమతి సాధించిన వీరిద్దరూ గర్వకారణమైనారు 1881లో అబలా బోస్ అనే ఆమె కూడా ప్రవేశ పరీక్ష పాస్ అయినా మెడికల్ కాలేజి లో ప్రవేశం లభించక పోవటం వలన మద్రాస్ వెళ్లి అక్కడ చేరినా మెడిసిన్ పూర్తి చేయలేక పోవటం విచారకరమైన విషయం . మొదట్లో ఉపాధ్యాయుల నుంచి, చాందస భావాల మనుష్యుల నుంచి కాదంబినికి అడ్డంకులేర్పడినా క్రమంగా ఆమె అచంచల విశ్వాసం దీక్షలతో అధిగమించి పురోగమించింది .1882లో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ  ఎడింబర్గ్ లో L.R.C P.ను ,గ్లాస్కో లో L.R.C.S..ను డబ్లిన్ నుండి  G.F.P.Sను సాధించింది .లేడి డబ్రిన్ ఆస్పత్రి లో కొద్దికాలం విద్యా సేవలందించి తర్వాతా స్వంతం గా ప్రాక్టిస్ మొదలు పెట్టింది .

               సంఘ సంస్కర్త ,స్త్రీ విముక్తి ఉద్యమ నాయకుడు బ్రహ్మ సమాజ అనుచరుడు అయిన ద్వారకా గంగూలీ ని కాదంబినీ 1883లో వివాహమాడింది .తూర్పు భారతంలోని బొగ్గుగని కార్మికుల జీవన పరిస్తితులు మెరుగు పరచటానికి ,మహిళా విముక్తి సాధనకు ఈ  దంపతులు చిరస్మరణీయ మైన సేవలు  చేసి గుర్తింపు పొందారు .1889 లో భారత జాతీయ కాంగ్రెస్ కు హాజరైన ఆరుగురు మహిళలో కాదంబిని ఒకరు .1908లో బెంగాల్ విభజన తర్వాత కలకత్తా లో కాదంబిని మహిళా సమావేశాన్ని నిర్వహించింది . దక్షిణాఫ్రికా లోని ట్రాన్స్ వాల్ కార్మికుల సమ్మెకు సాను భూతిగా కలకత్తాలో సత్యాగ్రహం జరిపింది . వారి సహాయం కోసం ధన సేకరణ చేసింది .ఎనిమిది పిల్లలకు తల్లి అయిన కాదంబినీ గంగూలీ కుటుంబ బాధ్యతలనూ అతి శ్రద్ధగా నిర్వహించేది .కుట్టుపని అల్లిక లలో ఆమె బహు నేర్పరి .అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ఈ దంపతుల అన్యోన్య ప్రేమ సేవాభావం అనితర సాధ్యమైనవి  అని రాశాడు అప్పుడున్న పరిస్తితులను అధిగమించి గంగూలీ దంపతులు సాధించిన విజయాలు అసామాన్యమైనవి .బెంగాలీ స్త్రీల విముక్తి సాధన లో వారిద్దరి కృషి నిరుపమానం .63ఏళ్ళ వయసులో 1923లో అక్టోబర్ మూడున కాదంబినీ గంగూలీ కను మూసింది .

                  –  గబ్బిట దుర్గా ప్రసాద్

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.