జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్‌. ఆయన ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు…

మత మార్పిడుల గురించి ఏమంటారు?
మతమార్పిడిలు రాజకీయపరమైన విషయం. దానికీ ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఆఫ్రికాను చూస్తే… సగం జనాభా ఇస్లాంలోకి, మిగిలిన సగం జనాభా క్రైస్తవ మతంలోకి మారిపోయారు. మతంలోకి మారకపోతే దేవుడు శిక్షిస్తాడని భయపెట్టడంతో వారందరూ మతాన్ని మార్చుకోవటం మొదలుపెట్టారు. మతం అనేది మనిషి ఉన్నతికి కారణమవ్వాలి. అంతే తప్ప ప్రజల్లో భయాన్ని రేకెత్తించకూడదు. వారిలో తప్పు చేస్తున్నామనే భావనను రేకెత్తించి… మతమార్పిడులకు గురిచేయకూడదు. హిందూ ఆధ్యాత్మికవాదం ఎప్పుడూ అలా చేయదు. అందరినీ కలుపుకుపోతుంది.

మనుషులు ఆనంద స్వరూపులు కదా.. అటువంటప్పుడు ఇంత సంఘర్షణ ఎందుకు ఏర్పడుతోంది?

జీవితం మంచి, చెడుల మిశ్రమం. మంచి, చెడు- దైవం, దెయ్యం-ఇలా పూర్తిగా విభిన్నమైన భావాల స్వరూపమే మన జీవితం. చెడు మీద మంచి విజయం సాధిస్తుందని చెప్పేదే మానవ జీవితం. ఎప్పుడైనా చూడండి.. వెలుతురు వస్తే చీకటి పోతుంది. ఈ మొత్తమంతా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఇందుకు మీకో ఉదాహరణ చెబుతాను. ఒక విత్తును నాటితే చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుంచి మళ్లీ విత్తు వస్తుంది. ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించటం ద్వారా ఈ చక్రాన్ని ఛేదించవచ్చు. దీనిని ఎలా పొందాలనే విషయాన్ని జీవితమే మనకు బోధిస్తుంది.

ప్రజలు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు?

అజ్ఞానం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. జ్ఞానం దారిని చూపిస్తుంది. కానీ ఆ జ్ఞానం పొందటం ఎలా అనేది ఒక సమస్య. దీనిని పొందగలిగినప్పుడు సంఘర్షణలు తొలగిపోతాయి. దీనికి సాధనే మార్గం. అందరిని గౌరవించమని.. అందరి ధర్మాలను సమదృష్టితో చూడమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకొమ్మని, మన సనాతన ధర్మం చెబుతుంది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ దీనిని నమ్ముతుంది. అందుకే ఎక్కడ సంఘర్షణ జరిగినా- ఆ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. లంక, ఇరాక్‌, ఇరాక్‌, గాజా – ఇలా ఎక్కడ అశాంతి ఏర్పడినా అక్కడి ప్రజలను ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఇరాక్‌లో సంక్షోభం ఏర్పడింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. వారిని ఆదుకునేందుకు మా వలంటీర్లు అక్కడకు వెళ్లారు. ఈ నెల 19వ తేదీన నేను కుర్థిస్థాన్‌ వెళ్తున్నాను. అక్కడ ‘యజ్ది’ తెగకు చెందిన 500 కుటుంబాలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ దత్తత తీసుకుంది. ఒకప్పుడు యజ్ది తెగకు చెందిన వారు రెండు కోట్ల మంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పది లక్షలు మాత్రమే. మిగిలిన వారందరినీ హతమార్చారు. మిగిలిన వారిలో చాలా మందిని ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. వీరందరికీ బతకటానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. మన దేశంలో వారికి ఆశ్రయం ఇస్తే బావుంటుంది.

ప్రపంచంలో హిందు మతం ఎలాంటి ప్రభావం చూపగలదు?

ప్రపంచంలో అన్ని చోట్ల హిందూ ఆధ్యాత్మికత అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా- చివరకు చేరేది పరమాత్మ దగ్గరకే. ఆ పరమాత్మకు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ‘నీ పాపాలన్నింటినీ నేను కడిగేస్తాను.. రాత్రి పగలు నీతోనే ఉంటాను..’ అని క్రీస్తు చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు. వేల దేవుళ్లు మనకు కనిపిస్తారు. ఒకరే దేవుడు.. మిగిలిన వారు సైతానులు అనే భావన హిందూ ధర్మంలో కనిపించదు. ఇదే హిందూ మతం గొప్పతనం. అయితే భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్న లోపమేమిటంటే- మన శాస్త్రాలలో, పురాణాలలో ఉన్న విషయాలను స్థానిక భాషల్లో ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఇలా చెప్పగలిగితే ప్రజలకు వాటి గొప్పదనం తెలుస్తుంది.

హిందూమతంలో కొన్ని వర్గాలు, కొన్ని వర్ణాలకే ప్రాధాన్యం ఉందనే విమర్శలున్నాయి….
కొందరికే ప్రాధాన్యం ఉందనే వాదన సరికాదు. ఇది కూడా కొందరు కావాలని చేసిన ప్రచారమే. మీకో ఉదాహరణ చెబుతాను. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంధాలను రాసిన వ్యాసుడు, వాల్మీకి- దళితులేగా.. మనకు వేల సంఖ్యలో రుషులు ఉంటే వారిలో బ్రాహ్మణులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. మధ్య యుగాల దాకా మన సమాజంలో కులవ్యవస్థ బలంగా లేదు.
జాతి నీతి కులగోత్ర దుర్గం
నామరూప గుణదోష వర్జితం

అని శంకరుడు ఎప్పుడో చెప్పాడు. మానవులందరూ పరబ్రహ్మ స్వరూపాలే. చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- మనను పాలించిన రాజుల్లో కూడా 70 శాతం మంది వెనకబడిన వర్ణాల వారేగా.. బ్రిటిష్‌ వారు మన దేశంలో కులవ్యవస్థ ప్రోది చేశారు. క్రమేపీ అది బలంగా వేళ్లూనింది. దీనితో హిందూ మతంలో ఇలాంటి తేడాలు తీవ్రంగా ఉన్నాయని భావించటం మొదలుపెట్టారు. కొన్ని దేశాల్లో హిందూ మతానికి సంబంధించి ఒక ఆట ఆడిస్తారు. అదెలా ఉంటుందంటే బ్రాహ్మణుడు కుర్చీలో కూర్చుంటాడు. క్షత్రియుడు వెనక నిలబడతాడు. వైశ్యుడు వంగి ఉంటాడు. దళితుడు నేల మీద కూర్చుంటాడు. ఇలాంటి ఆటలు ఆడించటం వల్ల మన దేశంలో కుల భావన బాగా చొచ్చుకుపోయిందనే ఆలోచన పిల్లల్లో కూడా కలుగుతోంది.

మన దేశాన్ని పాలించిన విదేశీయులందరూ- విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరించినవారే. ఒక సమాజంలో ప్రజలను విభజించాలంటే ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. అది కులం కావచ్చు.. మతం కావచ్చు. నా దృష్టిలో ఈ కులాలు కేవలం రాజకీయ లబ్ది కోసం కొందరు సృష్టించినవి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

చాలా మంది హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు కదా..

ఆకర్షణ.. భయం- ఈ రెండింటి వల్ల హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు. ఒకప్పుడు తమకు అదనంగా ఏదో చేకూరుతుందనే ఆశతో.. తృణమో, ఫణమో లభిస్తుందనే ఆకర్షణతో ఇతర మతాలకు మారిపోయేవారు. కానీ ఇప్పుడు నరకం అనే భయంతో మారిపోతున్నారు. మన చరిత్రలో ఈ విధంగా భయంతో మతం మారటం చాలా అరుదైన విషయం. ఇప్పుడది జరుగుతోంది. తమ దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారని బలంగా నూరిపోస్తున్నారు. ఉదాహరణకు ఆఫ్రికానే తీసుకోండి. ఈ భయం వల్లే ఆ ఖండంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆసియాపై దృష్టి సారించారు. హిందూ ధర్మంలో బయటకు వెళ్లటమే తప్ప.. లోపలికి తీసుకువచ్చే మార్గమే లేదు. శంకరుడి తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఏమీ రాలేదనే విమర్శ కూడా ఉంది.. పరమాత్మ అందరివాడని సనాతన ధర్మం చెబుతుంది. ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మ మొక్కటే..’ అని అన్నమయ్య కూడా చెప్పాడు కదా.. అయితే కొందరు తమ స్వార్థం కోసం కులాల గోడలను నిర్మించారు. దాని వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఇక హిందూమతంలో రావాల్సిన మార్పుల గురించి చర్చ అప్పుడే ప్రారంభమయ్యింది. ఈ ఆధునిక సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి తగ్గట్టుగా మతం కూడా మారాలి. ఒకప్పుడు ఇలాంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు చర్చ ప్రారంభమయింది. ముఖ్యంగా యువతీయువకుల్లో ఇలాంటి విషయాలపట్ల ఆసక్తి మొదలయింది. ఇది చాలా మంచి పరిణామం.

యువతకి మీరిచ్చే సందేశమేమిటి?

గతంతో పోలిస్తే యువత చాలా త్వరగా పరిణతి చెందుతోంది. చిన్నవయస్సులోనే లోకజ్ఞానం అలవడుతోంది. యువత చెడుమార్గంలో ప్రయాణించకుండా తల్లితండ్రులు, గురువులు మార్గం చూపించాలి. అందుకు తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేయగలగాలి. ‘మీ పరిధిని విస్తృతం చేసుకోండి.. మీ మూలాలను బలోపేతం చేసుకోండి..’ ఇదీ నేను యువతకు ఇచ్చే సందేశం.. మా సంస్థలో ఎక్కువగా యువతే కనిపిస్తారు. ప్రతి యువకుడిని రోజుకు ఒక గంట సమయాన్ని దేశం కోసం కేటాయించమని కోరుతున్నాం. ఒక ఏడాది కాలాన్ని దేశంలోని గ్రామాలకు, ప్రజలకు కేటాయించమని కోరుతున్నాం.

మీరు ఐసిస్‌ ఉగ్రవాదులతో శాంతి గురించి మాట్లాడారా?
లేదు.. భవిష్యత్తులో వారితో మాట్లాడతాననే ఆశ మాత్రం ఉంది. వారితో మాట్లాడటం కూడా ఒక సవాలే. ఎందుకంటే- ఇద్దరి మధ్య సంభాషణ అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడే వీలవుతుంది. అవతల వ్యక్తి డెవిల్‌ అని భావిస్తే- చర్చకు ఆస్కారమే ఉండదు కదా. గత 35 ఏళ్లుగా ఈ ప్రక్రియను నడుపుతున్నాం. ఆ అనుభవాలను రంగరించి వారితో కూడా మాట్లాడగలమనే విశ్వాసం ఉంది.
నవ్యడెస్క్‌

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.