విస్మరించలేని సాహిత్య గుణాలు
- – ఒబ్బిని, 9849558842
‘‘తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…’’
– కట్టమంచి రామలింగారెడ్డి
ఈ వాక్యాలు మనకు సాహిత్యం యొక్క బాధ్యత గురించి తెలియజేస్తాయి. అలాగే బాధకి పర్యాయపదంగా కవిత్వాన్ని నిర్వచించడం కూడా ఇంతవరకూ మనం ఎరిగిన విషయం. అంతేకాదు ఆవేశ మూలకమైన కళల్లో ఆవేదనా ఆహ్లాదాలు కూడా ఉబుకుతాయి. ఇదే వొరవడిలో ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి కూడా చేరతాయి. కవితా కళా విధుల్లో భాగంగా ‘‘తన సోదర భారతీయులు తన దేశంలో స్వాతంత్య్రం నిమిత్తం త్యాగాలు చేస్తుంటే తాను ఇక్కడ కూర్చోటం ఆయనకు అన్యాయంగా తట్టింది. దాంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆకాంక్ష తీవ్రమైంది’’ అంటూ డా.సంజీవదేవ్ ఓ వ్యాసంలో హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయగారి గురించి చెప్పడాన్ని మనం ‘బాధ్యత’గా తీసుకోవచ్చు. ఏ తత్త్వానికైనా ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి రెండూ నికరంగా అవసరమైనవే. ఇండిగ పిక్కతో బురదనీటిని తేటమయం చేసినట్టు ఈ రెండూ స్వచ్ఛ విషయావిష్కరణలు తోడ్పడేవే. ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి మానవ చైతన్యంలో భాగంగా ఉంటాయి. ఈ ఇంగితమూ, బాధ్యతా పరస్పరమూ మనిషి ప్రేరణకు తోడ్పడి ప్రగతి పథంలో సాగడానికి ఉపకరిస్తాయి. కుటుంబంలోగాని, సమాజంలో కాని, దేశంలోగాని, లోకంలో ఎక్కడైనా పై రెండింటితో, ఆ స్వభావంతో మానవ మనుగడ సాగుతుందనడంలో ఎట్టి సందేహం ఉండదు. అలాగే కళలు, సాహిత్యంలో కూడా వీటి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. భవన నిర్మాణానికి ప్రణాళికలు ఎలాగో, ఈ రెండూ కూడ సుసాహితీ శిల్పాల నిర్మాణాల్లో ఆ విధంగా తోడ్పడతాయి.
నిర్దిష్ట కులానికి, మతానికి చెందిన ప్రజల నిర్దిష్ట జీవితానుభవంనుండి కలిగిన స్వీయజ్ఞానం అనిర్దిష్టమైన శ్రామికవర్గ చైతన్యం కన్నా లోతయినది, నిండయినది. అది ఇచ్చే ఆత్మవిశ్వాసం బలమైనది. అది చైతన్యం దగ్గర ఆగిపోకుండా కొత్త జ్ఞానాన్ని- వారి నిర్దిష్టమైన జీవితానుభవంనుండి పుట్టిన జ్ఞానాన్ని సృష్టించగలదు. ఒక కొత్త రాజకీయ సమీకరణే కాక కొత్త మేధావి వర్గం ఆవిర్భావానికి కూడా అది దారి తీయగలదు…’’ (కె.బాలగోపాల్ ‘మనిషి-మార్క్సిజం’ నుండి). అది చదివినపుడు ఓ విశేష జ్ఞానం సంతరించుకుంటారని, అది బాధ్యత గలదై వుంటుందని సామాన్యుల ఇంగితానికి దగ్గరగా ఉంటుందని, పదుగురికీ ఉపయోగపడుతుందని ఆశించడం జరుగుతుంది. అటువంటి విశేషత లేకపోగా తారుమారు ఫలితాలు మనం చూడగల్గుతున్నాం.
అలాగే ఓ కవి- ‘‘ఆదివారం బొగ్గుబావుల సంతల్లో నేనమ్మిన కోడిపెట్టలు, చింత చిగురు కుప్పలు, ఐస్క్రేట్స్, కారేపల్లి కిరాణా దుకాణాల్లో గుమాస్తాగా నేనమ్మిన సరుకులు, ఇంటింటికీ పంచుకుంటూ తిరిగిన పత్రికలు-నా ఆకలితీర్చిన అమ్మలు’’ అని వాపోవడం జరిగింది. కాని తన కవితా సంపుటి సారంలో మాత్రం తన పునాది గురించి తపన లేశమాత్రం కనబడకపోవడం మాట అటుంచి, తన మతాంతర వివాహం, తన మతం గురించి ఓ ఫండమెంటలిస్టుగా, అపరాధ భావానికి లోనైన వాడిలా, కనీసం సంస్కరణ భావాలైనా లేకుండా మూడొంతులు వాపోవడం జరిగింది. ఏ దిశా నిర్దేశాన్ని చేయకుండా, అనగా ఎటువంటి బాధ్యత లేకుండా, దర్శనం లేకుండా సామాన్యులు అన్నమాటనే క్రాంత దర్శి అయిన కవి కూడా పలికితే విశేషతేముంటుంది. సవాలక్ష సామాజిక అవలక్షణాలు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఏ ఒక్కదాన్నయినా విడమరచాలి, విరుగుడు ఆలోచించాలి.
“…cronyism often overshadowing merit and system and process being undermind by power and influence” అన్నది ఈ నాటి సామాజిక స్వరూప సారం. ఈ నేపథ్యంలో ‘సమసమాజ ధ్యేయం మనుషులు చైతన్యవంతంగా ఎంచుకునే రాజకీయ లక్ష్యమే తప్ప అణచివేతనుండి అనివార్యంగా పుట్టే ఆకాంక్ష కాదు’ అన్న ప్రకటన తీసుకున్నప్పుడు ఏ ధ్యేయమైనా లేక బాధ్యతైనా ఓ మనిషి చైతన్యం నుండి అంకురిస్తుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా పైనుదహరించిన అనుభవాలు ఏ ప్రగతి చైతన్యాన్ని అందించలేకపోయాయని అర్థమవుతుంది మనకు. మానవతా గుణాలు అని చెప్పుకునే కరుణ, మైత్రి, ధైర్యం, ఉత్సాహం, ఆశావాదం, నిస్వార్థత, సహిష్ణుత అన్నవి ఈ ఇంగిత జ్ఞానమూ, బాధ్యతలతో కూడుకున్నవే. ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి ఈ రెండూ. నిష్పూచీతనంతో సమాజంలో వికృతతత్వం చోటుచేసుకున్నప్పుడు ఈ రెండింటి కలయికతోనే సామరస్యం సాధించబడుతుంది సమాజంలో. కనీస ధర్మాలైన ఈ ఇంగిత జ్ఞానమూ, బాధ్యతా అన్నవి కొరవడడం మూలాన గొప్ప గొప్ప అనర్ధాలు చరిత్రలో చోటుచేసుకున్న సంగతులు మనకు అనుభవనీయమే. ‘మైత్రే తంతి అక్షరం’ అని నిర్వచించుకుంటున్న ప్రయోజనం నెరవేరదు ఈ ఇంగితమూ, బాధ్యతా లోపించినపుడు. ‘లజ్జ’ శీర్షికతో నవల వెలువడడానికి ఈ రెండే ప్రధాన మూలకాలు అని మనం భావించవచ్చు. అలాగే ఈ రెండూ ఎవరిలోనైనా ప్రోది చేసుకున్నప్పుడు మానవాభివృద్ధి కారక ఔచిత్యమైన అసంతృప్తితో కూడిన రచనలు చోటుచేసుకోవచ్చు.
“….infact the history of progress of mankind is a hisory of informed dissent, much of crative activity of high quality in all areas of human endeavour at any given time has been a reflection of such dissent…”
ఈమధ్యే మన ఉన్నత న్యాయస్థానాలు బాధ్యతాయుతమైన తీర్పులను వెల్లడించిన సంగతి మనం గమనించవచ్చు. అవినీతి మానవహక్కుల్ని హరిస్తుందని, ఆర్థిక అసమానతలని వ్యాపింపచేస్తుందని. కానీ మనం చూస్తున్నది నేడు మన సమాజంలో ఓ నిష్పూచీతనం ఓ బాధ్యతా రాహిత్యం, ఇంగితం లేని తనం, సోయలేనితనం, నిర్లజ్జగా సాగిపోతున్న దోపిడి. సానుకూలాంశాలు సాహిత్యంలో ప్రతిఫలించడమన్నది ఈ ఇంగితమూ, బాధ్యతల పరస్పర రసాయనమే. ఈ రెండు మూలకాలూ కేవలం గడ్డిపొలాల్నే కాకుండా పంట పొలాలనీ, ఫలసాయాన్నీ అందిస్తాయి. నిజానికి యజ్ఞాల్లాంటివి ఈ రెండూ సాహిత్యాన్ని ఉన్నతీకరించడానికి, అవ్యవస్థీకరణ దశను దాటి ఉచ్ఛస్థితిని చేరడానికి – ఈ బాధ్యతా ఇంగిత జ్ఞానాలన్నవి వసంతకాలపు చిగుళ్లలాంటివి. శోభాయమానమై, శుభ పరిమళాలు అందచేస్తాయి. ఇంకా ఇవి సెలయేళ్లలా ప్రవహించి సాహితీ శిల్పాన్ని నిర్మిస్తాయి.
పాలనా గద్దెలనుండి ప్రసరించే అవరోహణా కిరణాలను తిప్పికొట్టి నేలమీది పాదాలనుండి పాకే ఆరోహణా కిరణాలను ఆవిష్కరించడంలో, ఆదరించడంలో, ఆచరించడంలో ఈ బాధ్యత, ఇంగిత జ్ఞానాలన్నవి సాహిత్యంలో పరిపూర్ణ విధులను నిర్వర

