కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)
పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని
హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని
సుశబ్దశోభిత సురభిళ సుమహారమని
వేదికలపై చమత్కారమై మెరసి
అనుభూతిని గుండె నిండా కురిసి
తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు
తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు
అతడు ‘కవితాప్రాద’ భాసురుడు
కవితాకాశంలో అస్తమించని ప్రతిభా భాస్కరుడు
జనతా హృదయావిష్కృత విజయశేఖరుడు.
‘రాళ్ళబండి’కి కవిత్వపు రత్నాలను ఎత్తి
ఊరూరా పద్యమై ఊరేగినవాడు.
నిత్యం పద్యమై ప్రవహిస్తూ
తీయని సంభాషణల్లో మెరుస్తూ
‘కందం’లో అందమైన జగణంగా నిలుస్తూ
నన్నయ్య వారసుడిగా ఈ తరాన్ని పలకరిస్తూ
అన్నయ్య నాగభైరవను మనసులో తలుస్తూ
లోకానికి కవిత్వాన్ని
నాలాంటి ఎందరికో దుఃఖాన్ని మిగిల్చి
‘లఘువు’లా మాయమయ్యాడు
రేపటి పద్యానికి ‘గురువు’గా నిలిచాడు
అవధాన విద్యకు ఆధునికతను జోడించి
పద్యానికి సరికొత్త పరిమళాన్ని అద్దినవాడు
స్నేహసౌజన్యాలకు మారుపేరై
కార్యనిర్వహణలో నూతన ఒరవడిని దిద్దినవాడు
అతడు నిత్యప్రససాద భాసురుడు
ఏ భుజకీర్తులూ లేని అచ్చమైన భూసురుడు
– డా. బీరం సుందరరావు
ఇంకొల్లు, ప్రకాశం జిల్లా
నువ్వెప్పటికీ మా స్టూడెంట్‌ పండిట్‌వే’- ఎస్‌.ఎ. కరీమ్‌ (17-Mar-2015)
ఉగాది వచ్చినా… సంక్రాంతి వచ్చినా… తెలుగు టీవీ చానళ్ళలో పదహారణాల తెలుగు ఆహార్యంతో నిండుగా… నవ్వుతూ కనిపించేవాడు ప్రసాదరాజు. ప్రసాద్‌ ప్రసంగాలు – కవితలు ఆ తెలుగు ఉచ్ఛారణ… తెలుగుపై నా ప్రేమను పెంచేవి. ఈ ఉగాదికి నువ్వు లేవు. కానీ… తెలుగు వాళ్ళంతా నిన్ను తలుచుకుంటారు.
రాళ్ళబండి కవితాప్రసాద్‌ గురించి ఇలాంటి సందర్భంలో రాయాల్సి వస్తుందని నేనసలు ఊహించుకోలేదు. అసలు నాకు ఇలాంటి తలపే ఏనాడూ రాలేదు. మా ప్రసాదరాజు సాధించిన విజయాలపై గొప్పగా రాయాలనుకున్నా… మనం అనుకున్నా… అనుకోకున్నా… మనకు ఇష్టం ఉన్నా… లేకున్నా కొన్ని ఆగవు. జరిగిపోతాయి. నిండు నూరేళ్ళు నవ్వుతూ బతకాల్సిన మా ప్రసాదరాజు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాడని ఎవరనుకున్నారు?
రాళ్ళబండి కవితా ప్రసాద్‌ గురించి చెప్పాలంటే 38 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1976లో ఈ కథ మొదలైంది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నియోజకవర్గం సత్తుపల్లి. అటు పల్లె కాదు, ఇటు పట్నం కాదు. వెంగళరావు అండతో… చొరవతో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఊరది. వెంగళరావు చొరవతోనే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1976లో ప్రారంభమైంది. కొత్త కళాశాల కాబట్టి… విద్యార్థుల్ని ఆకర్షించాలన్న ఉద్దేశంతో మొదటి బ్యాచ్‌ వారికి ఉచిత విద్య – ఉచిత భోజన వసతి కల్పించారు. అది తెలుసుకున్న అనేక మంది పేద విద్యార్థులు కృష్ణా, పశ్చిమగోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చి సత్తుపల్లి కాలేజీలో చేరారు. ఇంటర్‌లోనే చదువు ఆపేసిన వాళ్ళు కూడా అనేక మంది పెట్టె బేడా సర్దుకుని సత్తుపల్లి వచ్చేశారు. అందుకే మొదటి బ్యాచ్‌లో ఎంతో వైవిధ్యం ఉండేది. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు… వయస్సులో కూడా చాలా పెద్దవాళ్ళు… పెళ్ళయిన వాళ్ళు… నూనుగు మీసాల వాళ్ళు… ఇలాంటి వాళ్ళంతా కలిసి సత్తుపల్లి కాలేజీ మొదటి బ్యాచ్‌ అయ్యింది. ఇక లెక్చరర్లు కూడా ఉద్దండులు. ప్రతి సబ్జెక్టులోనూ మెరికల్లాంటి లెక్చరర్లను సత్తుపల్లి బదిలీ చేయించారు వెంగళరావు. బీఎస్సీ, బీకాం, బీఏ… మూడు క్లాసులు మొదలయ్యాయి. అందులో బీఎస్సీ విద్యార్థి రాళ్ళబండి ప్రసాదరాజు. అప్పుడు అతని పేరు అదే. తర్వాత కవితా ప్రసాద్‌గా మార్చుకున్నాడు.
మా బ్యాచ్‌లో పిన్న వయస్కులు అతి కొద్దిమందిలో ప్రసాదరాజు ఒకడు. ప్రసాద్‌ స్వతహాగా ప్రతిభావంతుడు. మితభాషి. మృదుస్వభావి. సున్నిత మనస్కుడు. లెక్చరర్లు… తోటి విద్యార్థుల మనసు గెలిచినవాడు. ముఖంపై చెరగని చిరునవ్వు ప్రసాదరాజు ట్రేడ్‌ మార్క్‌. అందరిలో చిన్నవాడు కదా? అప్పుడప్పుడూ… కొందరు ఆట పట్టించేవాళ్ళు. ప్రసాదరాజు చిరునవ్వే అందుకు జవాబు. ఇక కాలేజీలో జరిగే వార్షికోత్సవాల్లో… సాహితీ విభాగం బహుమతులన్నీ ప్రసాదరాజు దక్కించుకునేవాడు. అందుకే మా లెక్చరర్లు ‘స్టూడెంట్‌ పండిట్‌’ అని బిరుద్దు ఇచ్చేశారు. ఆనాటి సత్తుపల్లి కాలేజీ నిజానికి ఒక గురుకులం. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే వాళ్ళు లెక్చరర్లు. వేమనపైన… నల్లమందు యుద్ధంపైన… ఇలా అనేక అంశాలపై ప్రత్యేక లెక్చర్లు ఉండేవి. శ్రీశ్రీ మహా ప్రస్థానంలో యువత ఉర్రూతలూగుతున్న కాలమది. ఎమర్జెన్సీకి ముందు – తర్వాత రాజకీయ వాతావరణాన్ని కూడా మేం అక్కడే పసిగట్టాం. లైబ్రరీలో నిండా పుస్తకాలు. ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు. అవన్నీ చదవండంటూ ప్రోత్సహించే లెక్చరర్లు. ముందు ముందు ప్రసాదరావు మంచి సాహితీవేత్తగా ఎదగడానికి కారణమయ్యింది ఆ వాతావరణం. స్వతహాగా సాహితీ అంశ ఉన్నవాడు. దానికి సత్తుపల్లి కాలేజీ సానపట్టింది. మా బ్యాచ్‌ వాళ్ళందరికి సత్తుపల్లి జీవితం ఒక చెరగని స్వప్నం. సత్తుపల్లి తర్వాత ఎవరి దారి వారిది.
ప్రసాదరాజు ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరోలో అధికారిగా చేరాడు. ఆ తర్వాత గ్రూప్‌-1 పాసై సోషల్‌ వెల్ఫేర్‌లో అధికారిగా వచ్చాడు. ఇక అక్కడి నుంచి ప్రసాదరాజు సాహితీ వ్యవసాయం నిరంతరంగా సాగిపోయింది. సాహితీ పరంగా చూస్తే… ఆధునిక భావాలున్న సంప్రదాయవాదిలా కనిపిస్తాడు ప్రసాద్‌. హైదరాబాద్‌లో అప్పుడప్పుడూ మాసాబ్‌ట్యాంక్‌ ఆఫీసులో కలిసేవాళ్ళం. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఫోన్లు, ఈ మధ్య ఒక ఫేస్‌బుక్‌ పలకరింపులు మాత్రమే. సాహితీ రంగంలో కొత్త కొత్త బాటలు వేసుకుంటూ బాటసారిలా సాగిపోయే ప్రసాదరాజులో చిన్న అసంతృప్తి ఉండేది. సోషల్‌ వెల్ఫేర్‌లో కాకుండా… రెవిన్యూలో పోస్టింగ్‌ వచ్చి ఉంటే… ఐఏఎస్‌ అధికారి అయ్యేవాడినని… అన్నాడు నాతో ఒకసారి. కానీ… ఇవ్వాళ ప్రసాద్‌ రావు వాటన్నంటికన్నా, ఎత్తుకు ఎదిగాడు. ఉగాది వచ్చినా… సంక్రాంతి వచ్చినా… తెలుగు టీవీ చానళ్ళలో పదహారణాల తెలుగు ఆహార్యంతో నిండుగా… నవ్వుతూ కనిపించేవాడు ప్రసాదరాజు. ప్రసాద్‌ ప్రసంగాలు – కవితలు ఆ తెలుగు ఉచ్ఛారణ… తెలుగుపై నా ప్రేమను పెంచేవి. ఈ ఉగాదికి నువ్వు లేవు. కానీ… తెలుగు వాళ్ళంతా నిన్ను తలుచుకుంటారు. నువ్వు వెళ్ళిపోయావు… నిజం. సత్తుపల్లి కాలేజీ మొదటి బ్యాచ్‌ అందరి గుండెల్లో నువ్వున్నావు. అదీ నిజమ్‌. వాళ్ళందరి తరఫున నీకిదే నివాళి. మా బ్యాచ్‌ తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాం. ప్రసాద్‌! నువ్వెప్పటికీ మా స్టూడెంట్‌ పండిట్‌వే. నిన్ను మేం అలాగే గుర్తుంచుకుంటాం.
ఎస్‌.ఎ. కరీమ్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.