|
ఆధునిక ఆసియా నిర్మాతలలో ఒకరు, సింగపూర్ ప్రప్రఽథమ ప్రధాన మంత్రి లీ క్వాన్ యూ మరణించారు. సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్ యూ మరణం పట్ల యావత్ ప్రపంచం దిగ్ర్భాంతిని వ్యక్త పరిచింది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన మరణం పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. లీ క్వాన్ యూ గురించి సింగపూర్లో పౌరులు, అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల వాళ్లు అనేక విషయాలు కథలు-కథలుగా చెప్పుకుంటారు.
అతి కొద్ది కాలంలో సింగపూర్ అంతగా ఎలా అభివృద్ధి చెందింది? ప్రపంచ దేశాలలో అత్యంత ఆధునిక ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది బహుశా అక్కడేనేమో! సంపన్న దేశాలలో ముందు వరుస నున్న వాటిలో సింగపూర్ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ప్రధాన ద్వీప దేశం ఇది. గణతంత్ర సింగపూర్గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్ వలస రాజ్యంగా వున్న సందర్భంలోను, పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్య్రం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ-ఆర్థిక చరిత్రలో సింగపూర్ ప్రత్యేక స్థానం సంతరించుకుంది. లీ క్వాన్ యూ రాసిన 800 పేజీల బృహత్ గ్రంథం దొరికింది. ‘ఫ్రం థర్డ్ వరల్డ్ టు ఫస్ట్’ అనే ఆ పుస్తకంలో, ఆ దేశ ఆవిర్భావం నుంచి గత శతాబ్దం చివరిదాకా ఎదురైన చేదు-తీపి అనుభవాల గురించి, ఆటుపోట్ల గురించి వివరంగా ఉంది. సింగపూర్ అభివృద్ధి ఆషామాషీగా జరిగింది కాదని, దేశ స్థిరత్వానికి, అభివృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు, తన కాలం నాటి నాయకులు, ఆ తరువాత వచ్చిన వారు ఎంతో కృషి చేశారని ఉదాహరణలతో సహా వివరించారు. కేవలం 640 చదరపు కిలో మిటర్ల విస్తీర్ణంలో, సహజ వనరులనేవి ఏ మాత్రం లేకుండా, చైనా-బ్రిటీష్ ఇండియా-డచ్-ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారి మధ్య ఐక్యత సాధించుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం వెనుక వున్న సుదీర్ఘమైన చరిత్ర రాశారు.
1942-1945 మధ్య కాలంలో, జపాన్ ఆక్రమణ కింద సింగపూర్ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ క్వాన్ యూ. సింగపూర్ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్ యూ, ఆయన సహచరులు, సింగపూర్ను మలయాలో విలీనం చేస్తే బాగుంటుందని నమ్మడం, సెప్టెంబర్ 1963 లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు, మలేసియా నుంచి సింగపూర్ వేరు పడడానికి దారితీశాయి. ఫలితంగా, ఆగస్ట్ 1965 లో సింగపూర్, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్ యూ దేశ ప్రథమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 28, 1990 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్ టోంగ్ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రివర్గంలోనే సీనియర్ మినిస్టర్ గా పని చేశారు. కేవలం 67 సంవత్సరాల వయసున్నప్పుడే, నవంబర్ 1990 లో, లీ క్వాన్ యూ ప్రధాని పదవి నుంచి స్వచ్చందంగా వైదొలగారు. తన వారసుడిగా మంత్రివర్గ సహచరుడైన ‘గో చోక్ టోంగ్’ నియమించి, ఆయన మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా కొనసాగారు. దేశ ప్రధానిగా పాతిక సంవత్సరాలకు పైగా వున్న వ్యక్తి, సీనియర్ మంత్రిగా తన జూనియర్ కింద పనిచేయడం బహుశా ఒక అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. తన మంత్రివర్గ సహచరులు, తన వారసుడి మంత్రివర్గ సహచరులు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు, సివిల్ సర్వెంట్లు, నైపుణ్యంతో, నిబద్ధతతో పాలనా బాధ్యతలు నిర్వహించడం వల్లనే, దేశాభివృద్ధి సాధ్యపడిందని తన పుస్తకంలో రాశాడు లీ. ఆయన, ఆయన సహచరులు, ఎప్పటికప్పుడు కొత్త ముఖాలను రాజకీయాల్లోకి తేవాలని భావించేవారు. విలువలతో కూడిన వ్యక్తులను తమ వారసులుగా చూడాలనేదే వారి అభిమతం. 1968 ఎన్నికలలో పలువురు పీహెచ్డీలను, మేధావులను, ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను, వృత్తి నైపుణ్యం కల ఇంజనీర్లను, డాక్టర్లను, లాయర్లను, పాలనానుభవం కల ఇతరులను పోటీకి దింపారు. లీ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. నెగ్గిన 58 మందిలో 18 మంది కొత్త వారే!
ఆరేళ్ల వయసులో, కట్టెతో చేసిన ఎద్దుల బండిలో, సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి, తండ్రి పొలంలో పనిచేసిన లీ క్వాన్ యూ, ఏబై ఏళ్ల తరువాత, సూపర్ సానిక్ విమానంలో, మూడు గంటలు మాత్రమే ప్రయాణం చేసి లండన్ నుంచి న్యూయార్క్ చేరుకున్న విషయం తన పుస్తకంలో ప్రస్తావించి, దానికి కారణం విశ్వవ్యాప్తంగా జరిగిన సాంకేతికాభివృద్ధి అంటారు. మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు, తమకు పాలనానుభవం లేకపోయినా, తమ నిబద్ధత, సమాజాన్ని బాగుచేయాలన్న తపన, ముందుకు సాగిపోయే ట్లు చేసిందంటారు. ‘ఆన్ ద జాబ్ ట్రెయినింగ్’ లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపుదిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్ టోంగ్ కు బదలాయించారు. గో చోక్ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్ లూంగ్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశారు. వారిద్దరూ కూడా తమ మంత్రివర్గంలో, తమ ముందున్న ప్రధానులను, ఉప ప్రధానులను సీనియర్ మంత్రులుగా కొనసాగించారు.
పారిశ్రామికంగా, సాంకేతికంగా, ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా, ఔత్సాహికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సింగపూర్ ముందుంది. భవిష్యత్ లో సింగపూర్ ఇదే విధంగా కొనసాగుతుందా? లీ క్వాన్ యూ ఆశయం నెరవేరుతుందా?
|
