‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20
రామయ్య గారి మిత్రబృందం లో మరి కొందరు ప్రముఖులు
రెజెర్ ఫోర్డ్ ను తన స్నేహితుడు అని చెప్పుకొనే సాహసం చేయలేను అంటారు రామయ్య .మహోన్నతుడైన ఆ మహానుభావుడి పరిధిలో జీవించాను అని గర్వ పడ్డారు. ఆయనకు రామయ్యగారంటే మహా అభిమానం .కాని మర్యాదకు ఆయన మాత్రం రామయ్య గారిని ‘’నీకు తెలుసా మిత్రమా ?’’అని సంబోది౦చే వాడట .అలాగే ఎకడమీషియన్స్ గుబ్కిన్ ,నమేట్కిన్ కూడా అదే తీరున మాట్లాడేవారు .రబీందర్ సరే సరి .రబీందర్ తో బాంధవ్య విషయం లో మర్యాద పూర్వకమైన దూరాన్ని కలిగి ఉండేవాడినని,ఆతను తనకు నిజమైన మిత్రుడు అనటం లో ఏ సందేహమూ లేదన్నారు. ఆతను కూడా రామయ్య గారిని అలానే భావించేవాడు .
వెర్నాడ్ స్కి
వెర్నాడ్ స్కి మాత్రం ఆశ్చర్యకరమైన మనిషి .ఆయనకున్న అపార జ్ఞానం రామయ్యగారిని సంభ్రమ పరచింది. ఆయనతో మాట్లాడటం ఏంతో సంతోషంగా ఉండేది . అతనికి ఇండియన్ ఫిలాసఫీ పై ఉన్న అపార జ్ఞానానికి ,పట్టుకు అతనిపై గౌరవం పెరిగింది కూడా .ప్రపంచ దృష్టిలో భారత దేశం పై గౌరవం వెర్నాడ్ స్కివలన పెరిగింది అనుకొనేవారు .అతని శాస్త్రీయ కీలక భావనలకు రామయ్య గారు తోడ్పడ్డారు. .అందులో ఆనందాన్ని అనుభవించానని రామయ్య గారు చెప్పుకొన్నారు .
లెనిన్ శిష్యుడు – క్రేజినోవ్ స్కి –
ఎకడమీషియన్ క్రిజినోవ్ స్కి తన మీద గొప్ప ప్రభావం కలిగించాడు అంటారు రామయ్య .అతనిలో రష్యా విప్లవ చాయలు దర్శించానన్నారు .ఆయన రష్యా రివల్యూషన్ కు ప్రతీక గా భావించారు రామయ్య .అంతే కాదు రష్యా దేశపు శాస్త్రీయ ఆధారం ,చారిత్రాత్మకంగా దాని అవసరం అన్నీ ఆయనలో కనిపిస్తాయట .ఆయన విదేశీయ విధానం లో కమిషరేట్ వర్కర్ అనిపిస్తాడు .అదే రామయ్య గారి మనసుపై భద్రమైన ముద్ర వేసింది .ఇద్దరూ ఒకే విధమైన భావాలు కలిగి ఒకే తీరున వ్యవహరించటం ఒకే రీతిలో రూపు దిద్దుకోవటం ఆశ్చర్యమేసేది రామయ్యగారికి .చాలా శక్తి గలవాడే అయినప్పటికీ సహృదయ సంపన్నుడు . ఈ ఇద్దరూ విదేశీ విధాన వాతావరణం లో గణనీయమైన, భావాత్మక మైన ,సగుణాత్మకమైన మార్పులు తెచ్చారు .వీరిద్దరిని చూస్తే ధ్వని శాస్త్రం లో ఉపయోగించే ‘’ట్యూనింగ్ ఫోర్క్ ‘’లా అనిపించేవారట రామయ్యగారికి .అయితే ఇందులో క్రేజేనోవ్ స్కి అంటేకొంచెం ఎక్కువ వీరాభిమానం ఉండేదట .అసదృశ వ్యక్తీ అనిపిస్తాడట .పవర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అయిన ఆయన లోపలి భావాగ్ని తో నిత్యం రగులుతూ ఉండేవాడట .పని యెడల ఆయనకున్న అమితాసక్తి, దీక్ష ,అంకితభావం అంటువ్యాధిలా అందరికీ సోకుతుంది .అదీ ఆయన ప్రభావం .లెనిన్ నాయకత్వం వహించిన బోల్షేవేక్ పార్టీకి చెందినవాడని చూడంగానే చెప్పేయచ్చు .జీవించి ఉండగా రామయ్య గారు లెనిన్ ను చూడలేక పోయారు .కాని క్రేజినవ్ స్కి ని చూస్తె లెనిన్ ఎలా ఉండేవాడో ఊహించుకో వచ్చు ట.శిష్యుడిని చూసి గురువు స్వభావాన్ని తెలుసుకో వచ్చుకదా అంటారు
గ్లేబ్ మాక్షి మిలియోనోవిచ్ తో తాను తన సైంటిఫిక్ సమస్యలను చర్చి౦చేవాడి నని ,ఈయన కూడా పని విషయం లో క్రేజేనోవ్ స్కి లాగే చరిత్ర సృష్టించాడని చెబుతారు .ఎందరో స్నేహితులు .,వారు పాడే విప్లవ గీతాలు రామయ్యగారికి బాగా ఇష్టం .అందులో ‘’వర్షావ్యాంకా ‘’గీతం మరీ ఇష్టం రామయ్య గారికి .ముసలి తనం లోనే కాదు యవ్వనం లోనూ ఆ గీతం ప్రభావితం చేసిందిట .ఒకప్పుడు దేశాన్ని ఉర్రూత లూగించి విప్లవోన్ముఖులను చేసిన ఈ గీతం ఇప్పుడు జానపద గీతమై పోయింది .ఈ గీతాన్ని క్రేజోనోవ్ స్కి రాశాడని తెలిసి రామయ్యగారికి వీరాభిమానం మరీ పెరిగిపోయింది .సోవియట్ సైన్స్ కు గొప్ప నిర్దేశకుడు ,నిర్వాహకుడు ,లెజెండరీ పర్సనాలిటి, మర్యాదాపురుషుడు ,ఎప్పుడూ సర్వసిద్ధం గ ఉండేవాడు అయిన క్రిజినోవ్ స్కి నిజం గా అద్భుత వ్యక్తీ కాదా ?అవును అవును అవును .
సామాన్య అసామాన్య కృషి
వీళ్ళందర్నీ గుర్తుకు తెచ్చుకొంటు౦టే వారిలో సామాన్యుడు అసామాన్యుడు కలిసి ఉండటం యాదృచ్చికం కాదని పించింది రామయ్యగారికి .సామాన్య విషయాలలో వారి అసామాన్యత ప్రతి ఫలింఛి సోవియెట్ దేశ ప్రగతికి తోడ్పడేది .కొత్త తరహా వ్యక్తిత్వం ఆవిష్కరింప బడేది .కొత్తపాటలు బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి .వాటిని గాయకులు పాడుతుంటే అందులోని భావ గాంభీర్యానికి ముగ్దులయ్యేవారు .క్రిజనేస్కి రచయిత ,ఆయన ,ఒక ప్రాఫెట్ లాగా ,ఒక బోధకుడులాగా సామాన్య జనాలకు అతీతంగా ఉన్నట్లు కనిపించేదికాదు .ఆయన కామ్రేడ్ లలో ఒక కామ్రేడ్ లాగా ఉండేవాడు .అంటే వాళ్ళపని తనపని అనుకోవటమే ఇందులో ఉన్న విశేషం .పోక్రాస్ ఇంటి పేరున్న సైంటిస్ట్ లతో రామయ్య గారు పని చేశారు .పండగ ,పబ్బాలలో,ఉత్సవాలలో వాళ్ళతోకలిసి రామయ్యగారు ‘’మాస్కో ఇన్ మే ‘’గీతం ,ఉత్సాహం గా పాడేవారు .ఈ పాట సోవియట్ యూనియన్ అంతటా బహుళ వ్యాప్తమైంది అంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదని ఈ గీతాన్ని వారి సోదరులే రాశారని తెలిసి కూడా ఆశ్చర్యపడలేదు అన్నారు.
ఏదో ఒక కాన్ఫరెన్స్ లో సహోద్యోగి రామయ్యగారితో ఒకతన్ని చూపించి ‘’ఈయన ఎవరో తెలుసా? ఫాదీవ్- లేవిన్ షన్ కేరక్టర్.కు తానే మాటలు రాసుకొన్నాడు .’’అని చెప్పినా ఆశ్చర్యం కాలేదు అదేమీ పెద్ద ప్రాధాన్య మైన విషయం అనిపించలేదు . తన ముందు ఫదీవ్ రాసిన ప్రసిద్ధ నవలలోసజీవ నాయకుడు ఉన్నాడు .అయినా మామూలు విషయం గానే తోచింది .అంతర్యుద్దం ముగిసిన తర్వాత ఈ హీరో గారు మామూలు పనిలో చేరి కొత్త దేశ పునర్నిర్మాణం లో భాగస్వామి అయ్యాడు .ఇలాంటి హీరో లెందరితోనో రామయ్య గారు పని చేశారు .వీరంతా చాలా సాదా సీదాగా, ధైర్యంగా గొప్ప పనులు చేసుకు పోయేవారు .ఇందులో ఎక్కువ మంది పుస్తకాలు రాయలేదు .రచయితలూ వీరిలో కొద్దిమందే ఉండేవారు వీరిలో చాలామంది తాము చేస్తున్న పని మహత్కార్యం అని ఎన్నడూ విర్ర వీగలేదు .కర్తవ్యమ్ చేస్తున్నాం అనే అభిప్రాయమే వారికి ఉండేది .అందుకే సామాన్యుడికి ,అసామాన్యుడికి అందరికి పనికి వచ్చే ‘’కామ్రేడ్ ‘’అనే గొప్ప మాట పుట్టి సార్ధకమయింది అంటారు రామయ్య .
రామయ్య గారి సంస్కారం
వీరందరితో తరచుగా సమావేశాలు జరపటం విషయ చర్చ,సమస్య పరిష్కారం చేయటం నిజంగా ఆనంద దాయకమైన విషయం గా ఉండేది రామయ్య గారికి .అంతేకాదు ఆసియా ఆఫ్రికా దేశాలు ‘’కాలనీ కాడిని ‘’విప్పి అవతల పారేసి తమతో చేతులు కలిపినప్పుడు సైన్స్ లో వారికి ఏమికావాలన్నది కూడా చర్చించేవారు .సైన్స్ చరిత్ర గురించి, దాని భవిష్యత్తు గురించి ,ప్రజల భవితవ్యాన్ని గూర్చి విపులంగా చర్చ జరిగేది .గొప్ప సైంటిస్ట్ లందరూ వీరిలో నుంచే వచ్చారు. వారు సైన్స్ కు ,ప్రజలకు చేసిన సేవ నిరుపమానం .వారి ప్రజాస్వామ్య భావాలు దెబ్బతిన కుండా వారి ప్రకృతికి విరుద్ధం కాకుండా ,పౌర జీవితం అందించటం ఒక పెను సవాలుగా ఉండేది .వెర్నాడ్ స్కి చెప్పిన ‘’మా ప్రజాస్వామ్యం లో ఆదర్శాలు సహజ ప్రకృతితో కలిసే ఉంటాయి .అందుకే మా భవిష్యత్తుపై నమ్మకం ,భరోసా కలిగి ఉంటాం .అది మాచేతుల్లో ఉన్నపనే ,దాన్ని జారిపోనివ్వం ‘’అని చెప్పిన మాట రామయ్య గారి చెవిలో అనుక్షణం ప్రతిధ్వనించేది .ఈ మాటలు చెప్పిన వాడు ముసలి వాడుకాదు .నవ యువకుడు .జీవిత ప్రాంగణం లోకి అడుగు పెడుతున్నవాడు ,సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తున్నవాడు అతనిలో ఎంతటి ఆత్మ విశ్వాసం ఉందో నని పించింది .ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ వలన ఏర్పడిందన్నారు రామయ్య. సోవియట్ దేశపు సైన్స్ స్వభావం వలన ఏర్పడిన ఆశ ,ఆత్మ విశ్వాసం అది అంటారు రామయ్య .అదే దాని నిర్మాతల(ఫౌండర్స్) కృషిలో దర్శనమిచ్చింది .
తాను ఇంతకాలం సైన్స్ లో ఇలాంటి సామాన్య వర్కర్లతో పని చేశానని, వారు సిద్ధాంతాలనుజీవిత ప్రయోగాలు గా మార్చి ఫలితాలు అందించారని అంటారు రామయ్య .వాళ్ళ సుఖ దుఖాలలో తానూ పాత్రధారిగా ఉండే వాడినని నని అన్నారు .వారి క్రుతజ్ఞతకు పాత్రత వీరందరి సహకారం వల్లనే నన్నారు .ఈ యువత లేకపోతే తన సిద్ధాంత బీజం మొలకెత్తి వృక్ష రూపం పొందేదే కాదన్నారు. తమ విధానాలకు వాళ్ళు జీవం పోశారు .వాళ్ళే తనతో బాటు ఉండి పని చేసి తన ఆలోచనలకు రూపు రేఖ లేర్పరచి నవీన పరికరాల సృష్టిలో భాగ స్వామ్యులై తోడ్పడ్డారని గర్వంగా చెప్పారు రామయ్య .వీరందరి సహకారం వల్లనేసోవియట్ యూనియన్లో కొత్త సాంకేతికతలో ప్రమాణాలు (స్టాండర్డ్ లు) సాధించగలిగామని కృతజ్ఞతా భావం గా చెప్పారు .అదీ రామయ్యగారిలో ఉన్న విశేషం .అంతా తానే అయి చేశానని ఎన్నడూ ఎక్కడా చెప్పుకోలేదు .అందరి సహకారం వల్లనే అద్భుతాలు సాధించామంటారు .ఎవరి కృషినీ విస్మరించరు .సమష్టి భాగస్వామ్యం వల్లనే ఇవి సాధ్యాలయ్యాయని వినమ్రంగా ప్రకటించటం రామయ్య గారి ప్రత్యేకత .ఇందులో కొందరితో కొన్నేళ్ళు కలిసి పని చేశారు .ఒక రకంగా వారందరూ తనకు బంధువులయ్యారు అనటం రామయ్య గారి సంస్కారానికి గొప్ప ఉదాహరణ .వీడరాని ఆత్మీయ బంధమేర్పడింది. వారితో .’’In fact we had become in fact relatives ,in separable from the work into which I imported my scientific talents ‘’ అని రామయ్యగారు మాత్రమే నిగర్వంగా చెప్పగలరు .వారు తన కింద పని చేశారు అనలేదెప్పుడూ .వారితో తానుకలిసి పని చేశాను ,దానివల్ల తన విజ్ఞాననైపుణ్యం పెరిగింది అన్నారు ఈమాటలు అనటానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి. అది ఉంది కనుకనే ఆ మహానుభావుడు కోలాచల సీతా రామయ్య గారి గురించి ఇంత గా చెప్పుకొంటున్నాం .చెప్పుకొని మనం ధన్యులమవుతున్నాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15- ఉయ్యూరు
