రాష్ట్రపతి ఆవేదన మరియు అరబిందో జయంతి

యుద్ధభూమిగా పార్లమెంటు..రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన
పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
  • వేళ్లు బలంగా ఉన్నా ఆకులు వాడిపోతున్నాయి
  • ఈ విషయాన్ని అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు
  • పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • మానవత్వంపై నమ్మకాన్ని సడలనివ్వొద్దు
  • గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోంది
  • రాష్ట్రపతి ప్రణబ్‌పంద్రాగస్టు సందేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత సమాజం విలువలతో కూడుకున్నది. మనం పాటించే విలువల ద్వారా దేశాభివృద్ధిని చూపించవచ్చు. భారతదేశానికి పటిష్ఠమైన రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనది. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నాయి. కానీ, ఆకులు మాత్రం వాడిపోతున్నాయి. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉంటే.. ప్రజలు, వారి పార్టీలు తీవ్రంగా లోతుగా ఆలోచించాల్సిన తరుణం ఇదే. మనం కనక ఇప్పుడు స్పందించకపోతే, సరైన చర్యలు తీసుకోకపోతే, 1947లో భారత కలను సాకారం చేసిన యోధులకు మనం ఇస్తున్న గౌరవం, మర్యాదలను మన ముందు తరాలు మనకు ఇస్తాయా? దీనికి జవాబు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ, ఈ ప్రశ్నను మాత్రం వేసుకుని తీరాల్సిందే’’ అని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. భారత జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని సహనంతో, చాకచక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్ల దేశ ఆర్థిక ప్రగతి ప్రశంసనీయంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోందని ఆందోళన చెందారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులు తమ భూభాగాన్ని అడ్డాగా మార్చుకోవడానికి పొరుగు దేశాలు సహకరించకూడదని గట్టిగా హెచ్చరించారు.

అరబిందో… ఒక నిశ్శబ్ద చైతన్యం ! (14-Aug-2015)
ఆగస్టు 15న అరబిందో జయంతి
మానవ పరిణామ ప్రక్రియను పురోగమన దిశలో నడిపించే క్రమంలో శ్రీ అరవిందులు మానవ జాతికి చేసిన సేవ అపూర్వమైనది. శ్రీ అరవిందుల జీవితాన్ని రెండు అంకాలుగా విభజిస్తే.. మొదటిది భారతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి విప్లవాత్మక భావాలతో, అనర్గళ ఉపన్యాసాలతో, ‘ఆర్య’ పత్రిక స్థాపనతో జాతిని ఉత్తేజితం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు అరబింద్‌ఘో్‌షగా కనిపిస్తారు. రెండో అంకంలో భౌతికాధ్యాత్మికతల సమన్వయంతో మానవజాతిని భవబంధశృంఖలాల నుంచి విముక్తం చేసి, అతిమానస సాధన వైపు తీసుకుపోయే మహాయోగిగా అనిపిస్తారు.
1872 ఆగస్టు 15న తేదీన జన్మించిన అరబిందో చిన్న వయసు నుంచే ఇంగ్లండ్‌లో విద్యనభ్యసించారు.
ఆ సమయంలో మన దేశంలో ఐపీఎస్‌ పరీక్ష అతి కష్టమైనది. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైనది. అలాంటి పరీక్షలో 21 ఏళ్లకే ఉత్తీర్ణుడైన అరబిందోకు ఉద్యోగం నచ్చలేదు. ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు రాగానే ఒక విస్తృతమైన ప్రశాంతత, నిశ్శబ్దాలు ఆయనను ఆవరించాయి. జనచైతన్యం కోసం ఉద్యమాన్ని విస్తృతం చేయాలనే భావన బలపడింది. అదే సమయంలో ఆయన మహారాష్ట్రకు చెందిన విష్ణుభాస్కర్‌ లేలే అనే యోగిని కలిశారు. మూడు రోజుల ధ్యానం ఆయన జీవితాన్ని మార్చేసింది. బ్రహ్మచైతన్య అనుభవాన్ని పొందగలిగారు. ఒక వైపు ఆధ్యాత్మిక మార్గం, మరోవైపు దాస్యశృంఖలాలను తెంపటానికి చేసే స్వాతంత్య్ర ఉద్యమం. ఈ రెండింటిలోను అరబిందో తనదైన ముద్రను వేయగలిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక ఏడాదిపాటు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అతివాద రాజకీయవాదిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరబిందో ఆ తర్వాతి కాలంలో మహాయోగి అరవిందులుగా మార్పు చెందారు. యోగకార్య నిమిత్తం పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు. శక్తిస్వరూపుణి శ్రీమాత మిర్ర ఆగమనంతో పాండిచ్చేరి ఆచరణాత్మక పూర్ణయోగ సాధనకు నిలయమైంది.
జ్ఞాన సారంశమిది..
ప్రస్తుతం మానవజాతి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఆధ్యాత్మికత కానీ, హేతువాద భావనలు కానీ, విజ్ఞాన శాస్త్ర ప్రగతి కాని వేర్వేరుగా అడ్డుకోలేవు. ఈ మూడు సమన్వయంతో పనిచేసినప్పుడే- ఈ సంక్షోభం తొలగిపోతుంది. జీవితాన్ని శత్రువుగా భావించే ఏ ఆదర్శమూ మానవునికి వెలుగుబాట చూపలేదు. అదేవిధంగా అంతరాత్మను కాదనే ఆధునిక దృక్పథం కూడా పరిష్కారం కాదు. జీవితానికి, ఆధ్యాత్మికతకు జరుగుతున్న సంఘర్షణ పూర్తి అవగాహనతో తొలిగిపోవాలి. అప్పుడు జీవితమంతా యోగమే (all life is yoga) అవుతుంది. పదార్థం నుంచి జరిగిన పరిణామంలో మానవుడు ఇంకా మధ్యంతరస్థిలోనే ఉన్నాడు. దివ్యచైతన్య ఆవిర్భావంతో ఈ స్థితి నుంచి దైవం వైపుగా పయనించగలడు. అసమగ్రంగా ఉన్న భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలలో పరివర్తన జరగాలి. అప్పుడే దివ్యచైతన్యం భూమి మీద అవతరించి భూమి మానవ జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. అరవిందుల పూర్ణయోగ, హఠయోగ, రాజయోగ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాలన్నీ మనుషులను ఈ మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. తన జీవితాన్ని మానవహితానికి త్యాగం చేసిన మహర్షి అరవిందులు 1950 డిసెంబర్‌ 5న దేహపరిత్యాగం చేశారు. ‘సింథసిస్‌ ఆఫ్‌ యోగ’, ‘లైఫ్‌ డివైన్‌’, ‘గీతావ్యాసాలు’, ‘వేదోపనిషత్తుల వివరణలు’, ‘యోగలేఖలు’, ‘భారతీయ సంస్కృతి పునాదులు’ వంటి ఎన్నో అద్భుత రచనలు దివ్య చైతన్య ప్రవాహంలా ఆయన కలం నుంచి జాలువారాయి.ఆయన రచించిన ‘సావిత్రి’ మహాకావ్యంలో ప్రతి పద్రమూ మంత్రాక్షరంగా పనిచేసి, చైతన్య విస్తారం జరిగి నిశ్శబ్దస్థితిని ప్రసాదిస్తుంది.
సునీత శేఖర్‌,
934623546741
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.