మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి

మహా భక్త శిఖామణులు

10-ఖోజేజీ స్వామి

జీవితమంతా హరినామ సంకీర్తనతో గడిపిన ఖోజేజీ స్వామి ఉత్తరభారతానికి చెందినవాడు .తన అవసాన దశ దగ్గరకు వచ్చిందని గ్రహించి ఒకరోజు శిష్యులను దగ్గరకు పిలిచి ‘’నేను ఈలోకం వదిలి వైకు౦ఠానికి వెళ్ళే సమయమొచ్చింది .నేను వైకుంఠం చేరగానే ఆశ్రమం లోని శంఖం ఘంట ,ఇతరవాయిద్యాలు వాటంతటికి అవే మ్రోగుతాయి .ఆ శుభ ధ్వని విని ,నా దేహానికి అంత్యక్రియలు చేయండి ‘’అని చెప్పాడు .కొద్ది నిమిషాలలోనే స్వామీజీ ప్రాణాలు వదిలాడు .కాని శుభానాదం వినిపించలేదు .ఆశ్రమంలోని వాయిద్యాలన్నీ ఎక్కడపెట్టినవి అక్కడే ఉన్నాయికాని వాటిలోంచి నాదం రానేలేదు .శిష్యులదుఖానికి అంతం లేదు విశుద్ధవర్తనుడు నిర్మలమనస్కుడు ఐన స్వామి వైకుంఠం తప్పక చేరతాడని వారి విశ్వాసం కాని ఇప్పుడా సూచన కనిపించలేదు .ఈ స్వామితో సమానుడైన శిష్యుడు యోగానంద సరస్వతి ప్రక్క ఊరిలోనే ఉంటె వెళ్లి తెలియ జేయగా ఆయన హుటాహుటిన వచ్చాడు .స్వామి పార్ధివ దేహానికి నమస్కరించి శిష్యులు చెప్పిందంతావిని ,ఆశ్రమం నాలుగు మూలలా పరికించి చూశాడు .అక్కడ ఉన్న మామిడి చెట్టు,దానికి పండిన పండు  చూసి ‘’’’మన గురూజీ వైకుంఠం చేరలేక పోయారు .అందుకే శంఖధ్వని వినబడలేదు .దీనికి ఒక కారణం కనిపిస్తోంది .దేహ త్యాగ సమయం లో ప్రాణికి దేనిపైన అయిన భోగేచ్చ కలిగితే  వెంటనే దానికి అనుకూలమైన చోట శరీరం ప్రవేశిస్తుంది .మనసు పూర్తిగా స్వాధీనమై కోరికలు పూర్తిగా నశిస్తేనే పునర్జన్మ ఉండదు .లేకపోతె పునరపి జననం పునరపి మరణం తప్పదు.ఈ మామిడి చెట్టుకున్న పండుమీద స్వామి  వాంఛ ఉండటం చేత ,అది ఆపండుమీదే వాలి ఉంది .ఆయన పునర్జన్మ కూడా అందులోనే ఉన్నది .ఆపండుకోసి తెచ్చి ,రెండు ముక్కలు చేసి చూడండి .అందులో మనస్వామి పురుగుగా ఉండటం గమనిస్తారు ‘’అన్నాడు .

  యోగానందుడు చెప్పినట్లే శిష్యుడు మామిడి పండు కోసి తెచ్చాడు .యోగానంద జాగ్రత్తగా పండును రెండుముక్కలు చేయగా ఆయన చెప్పినట్లే ఒక పురుగు అందులో కనిపించింది .వెంటనే ఆపురుగు చచ్చిపోయింది .ఆ వెనువెంటనే వైకు౦ఠపతి శ్రీ మహా విష్ణువు దివ్య రధం లో కూర్చుని క్షణకాలం దివ్య దర్శనమిచ్చి అంతర్ధానమయ్యాడు  .ఆ వెంటనే ఆశ్రమం లోని స్వామి శంఖం,ఘంటం  మొదలైన వాయిద్యాలు దివ్య నాదం చేశాయి .ఆచార్య శేఖరుడు వైకు౦ఠం చేరాడని చాలా సంతోషించారు శిష్యబృందం .తర్వాత స్వామి పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేశారు .

మరణ సమయం లో ఎకోరిక ఉంటె ఆకోరిక తీరేదాకా మరో జన్మ ఎత్తుతారని మన శాస్త్రాలు భగవద్గీత చెప్పాయి .కనుక  అంత్య సమయంలో  చిత్తం ఈశ్వరా౦కితం గా ఉంచుకోవాలని ఒక సూచన ఇందులో ఉన్నది .

11-లాలాచార్య స్వామి

 భగవద్రామానుచార్యుల వారి ముఖ్య శిష్యుడు , అల్లుడే లాలాచార్యస్వామి .గురువే దైవం అని సంపూర్ణంగా నమ్మినవాడు .పరమభాక్తాగ్రేసరుడు .ఒకరోజు నది ఒడ్డున తిరుగుంటే ఒక శవం కొట్టుకు రావటం చూసి ,దానికి అంత్యక్రియలు చేయాలనుకొన్నాడు .నదిలో దిగి శవాన్ని వీపుమీద మోసుకొని వచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళి  పుష్పాలతో శయ్య తయారు చేసి దానిపై పడుకోబెట్టి వైష్ణవ సంప్రదాయం లో అంత్యేష్టి  చేశాడు .స్నానం చేసి ఇంటికి వెళ్లి ఆ అపరిచితునికి  శ్రాద్ధం  కూడా పెట్టి ,బంధు మిత్రులను  భోజనాలకు పిలిచాడు లాలా .ఎవడో కోన్ కిస్కా కు ఈ పనులు చేయటమేమిటి అని ఎవ్వరూ వెళ్ళలేదు .మనసులో మిక్కిలి బాధపడి గురువు రామానుజులకు నివేదించాడు.’’నువ్వు చేసింది మహత్తర కార్యం .మూర్ఖులు నీ గొప్పతనం గుర్తించలేరు విచారించక ,ఇంటికి వెళ్ళు ‘’అని ఊరడించాడు .

  లాలాచార్య ఇంటికి వచ్చి ఒక అద్భుత దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు .ఇంట్లో ఎందరో అతిధులు దివ్యకాంతి శరీరులై  ఊర్ధ్వపుండ్రా లతో పరమ వైష్ణవ శిఖామణులుగా గోచరించారు .వారంతా పరవశంతో విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఆనందంతోనృత్యాలు చేస్తున్నారు .ఇంట్లో వండి న భక్ష్య భోజ్య  లేహ్య  చోష్యాలను కడుపారా వారంతా భుజించారు .ఇదంతా తన గురుమహిమాకటాక్షంగా భావించాడు లాలా చార్య .ఈ కోలాహలం చూసి ,ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి దివ్య సుందర విగ్రహాకారులు భోజనం చేయటం గమనించి అమితాశ్చర్య పడ్డారు .లాలాచార్య తమను ఎంతో మర్యాదగా భోజనాలకు ఆహ్వానిస్తే తూలనాడి తిరస్కరించి వెళ్లకపోవటం తప్పు అని గ్రహించి ఆయన పాదాలపై వ్రాలి క్షమాపణ కోరారు .అప్పుడు లాలా ‘’దుఖి౦చకండి .ఆమహాత్ములు తిని వదిలేసిన ఉచ్చిస్టం భుజించి అన్ని దుఖాలను చింతలను పోగొట్టుకొని పరమానంద విభూతి పొందండి ‘’అన్నాడు .వారంతా మహా ప్రసాదం అని అలాగే తిన్నారు .

  ‘’అనాధ ప్రేత సంస్కారం కోటి యజ్ఞఫలం ‘’అని మనం సూక్తి వల్లిస్తాంకాని ఆచరణ లో అవలంబించం .శవాన్ని చూస్తేనే పాపం అన్నట్లు ,ముట్టుకొంటే ఏదో మునిగిపోయినట్లు భావిస్తాం .శవంతో స్మశానానికి వెళ్ళటం నేరం ఘోరం అనుకొంటాం .ముస్లిం సోదరులు ఇందులో గొప్ప ఆదర్శంగా ఉంటారు .శవ పేటిక మోయటం పవిత్ర కార్యంగా భావిస్తారు .మన దక్షిణ దేశంలోకంటే ఉత్తర హిందూ దేశం లో శవాలను మోయటానికి ఏ పట్టింపూ ఉండదు .పిల్లా జెల్లా పిన్నా పెద్దాఅందరూ  ఆపని చేసి ఎంతో సంతోషిస్తారు.అది తమ విధిగా ఎంచుకొంటారు  . ఆ విశాల  హృదయం అందరికీ ఉండాలని కోరుకొందాం .

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.