సినీ గీతా మకరందం -2
లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’
అన్న పూర్ణా బానేర్ పై నాగేశ్వర రావు నిర్మించిన మొదటి చిత్రం దొంగ రాముడు .అదే సమయం లో రామా రావు ‘’జయ సింహ ‘’అనే జానపద సినిమా తీశాడు ,నా గ్ సాంఘిక చిత్రం తీసి రికార్డు సృష్టించాడు .సాంఘిక చిత్రాల లో ఆణిన ముత్యం గా కే వి.రెడ్డి దీన్ని తీర్చి దిద్దాడు .మాటా ,పాటా సీనియర్ సముద్రాల .సంగీతంసుస్వరానికి మాధుర్యానికి ‘’పెంద్యులం ‘’అయిన పెండ్యాల .అందరు కమ్మని వంట గాళ్ళే.అందుకే అంత కమ్మగా సినిమా తయారైంది .నాగేశ్వర రావు యవ్వన సౌందర్యం ,ఇంకా లావేక్కని సావిత్రి అందచందాలు, అభినయం ,వీటికి తావిని అందించాయి .హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,కొసరి మురి పించే పాట బుద్ధి చెప్పే పాట, గాంధీ తాత గొప్పతనాన్ని విడమర్చే పాట దేని కదే హాయి గూర్చాయి ,అన్నిటికి ‘’సాహిత్య సముద్రం’’ సముద్రాల కలకండ పదాలతో పాటలు రాసి వన్నె తెచ్చాడు .పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత వైదుష్యానికి సొగసు లద్డాడు. సరళ స్వరాలతో మనసు గిలి గింతలు పెట్టాడు .అలా విరిసిన
ఒక పుష్ప గీతమే సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం .ఆ అందాన్ని ,ఆ మక రందాన్ని ఆస్వాదిద్దాం .
‘’ఓ చిగురాకులలో చిలకమ్మా –చిన్న మాట విన రావమ్మా
మరు మల్లెలలో మామయ్యా –మంచి మాట సెలవీవయ్యా .
పున్నమి వెన్నెల గిలి గిం తలకు-పూచిన మల్లెల మురిపాలు
నీ చిరు నవ్వు కు సరి కావమ్మా –
ఓ—ఓ– ఓ –
ఎవరన్నారో ఈ మాటా తెలిసీ పలికిన నీ నోటా
ఆ –ఆ –ఆ—
వలచే కోమలి వయ్యారాలకు –తలచే మనసున తీయ దనాలకు కలవా విలువలు సెలవీయా ?
పై మెరుగులకే భ్రమ పడకయ్యా –మనసే మాయని సొగసయ్యా –
గుణమే తరగని గుణమయ్యా—
ఊ—ఊ-ఊ ‘’
ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది .తన మనసులో ఉన్నది చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .
ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత .ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .’సెలవీయటం ‘’సముద్రాల ఎంచుకొని వేసిన ‘యాప్ట్ పదం ‘’.అప్పుడాయుకుడికి ఆ మంచిమాటేమిటో సెలవిస్తాడు .ఆమె చిరు నవ్వుకు పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు సరికావు పొమ్మన్నాడు .ఆమె కు ఇది గొప్ప అభి నందన .అంత సున్నితం గానూ చెప్పాడు. కాదు చెప్పించాడు రచయిత .ఇక్కడ నాయికా నాయకుల అభినయమూ అద్భుతం గా ఉండేట్లు టీర్చి దిద్దాడు తన దర్శక ప్రతిభ తో కెవి రెడ్డి .ఆమె దాన్ని తేలిగ్గానే తీసుకోంది.ఎవరో అన్న ఈ మాటను నువ్వు తీసుకొని నాకు ఆపాదిన్చావు .అందులో భావాన్ని బానే అందుకొని నాకు అతికిన్చావు .నీ నోటితో ఇలాంటి కమ్మని మాట వినటం ఇంపుగా సొంపుగా ఏంతోరుచిగా ఉన్నట్లు ఉంది అందామె .
ఎప్పుడూ మనసులో మధురం గా తలచుకొంటూ ,వలచే కోమలి వయ్యారాలకు ,తలచే మనసున తియ్యదనాలకు విలువలు కట్టటం సరికాదు అసలు కట్టలేము అన్నాడు గడుసు కుర్రాడు దొంగ రాముడు .
ఆమె ఒక ఆకు ఎక్కువే చదివింది .పై మెరుగులకు భ్రమసి పోవటం చేటు తెస్తుంది .మనసు మాయని సొగసు కనుక గుణమే ప్రధానం .అది తరగని నిధి .దానికే విలువ ఎక్కువ అని జీవిత సత్యాన్ని కాచి వడ బోసి నట్లు సెలవిచ్చింది .ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు .అతడు కొద్ది రోజుల్లో నేరస్తుడు అనే ముద్ర వేయిచుకో బోతాడు అనే సూచన కూడా ఇందులో కనీ పిస్తుంది. రాబోయే కధకు సూచ్యార్ధ సూచన ఆమె వాడిన మాట .ఇన్ని విషయాలను సముద్రాల అతి సున్నిత పదజాలం తో ,సందర్భోచితం గా ఒక పల్లె టూరి యువ జంట పై రాసి వారి మనసులలోని భావాలను ,ఆంతర్యాలను మహా నేర్పుగా వెలువరించారు .ఈ పాటకు అంతకు మంచిన స్వరం తో, బాణీ తో ,రాగ బంధం గా మధురం గా గా మనసులకు గిలిగింతలు పెట్టేట్లు హాయిని కూర్చేట్లు పెండ్యాల స్వరకల్పన చేశారు. అంత కమ్మగా జిక్కీ ,ఘంటసాలలు పాడి దానికి అమరత్వం కల్గించారు .మధ్యలో వచ్చే ‘’ఓఓ లు ఉఊలు ,ఆ ఆ లు ‘’మాధుర్యాన్ని పెంచి వీనులకు విందు కూర్చి లలితా మనోహరత్వానికి ఆభరణం అయ్యాయి .ఈ మొత్తాన్ని అతి సహజం గా ఆకర్షణీయం గా ,వారి నిండు మనసుల కు ,ప్రేమ వలపుకు హృదయపు లోతులకు దర్పణం గా సెల్యులాయిడ్ పై చిత్రీకరించి సుమధుర కావ్యం గా ఈ పాటను చిత్రీకరించారు కే వి.రెడ్ది. అందరూ అందరే. అందుకే పండింది .మనసు నిండింది .అభినందనల నందుకొంది ఈ పాట. అందుకే నాకు గీతా మకరందం అయింది .
మరో మకరంద బిందువు తో కలుద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు
‘’
