అనంత పద్మ నాభ రావు గారి అనంత పాటవం

 

బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరుపొందిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడున్నర దశాబ్దాల పాటు పని చేశారు.21వ ఏటనే అష్టావధానం చేసిన ఈ ప్రజ్ఞాశాలి కవిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి మొదటి నుంచీ విశిష్ఠ సేవలందిస్తున్నారు.దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చేస్తున్న ఆధ్యాత్మిక, సాహిత్య సేవల గురించి అనంత పద్మనాభరావు చెబుతున్న సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు…

మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామం. నా పాఠశాల చదువు ముగిశాక నెల్లూరులోని వీఆర్ కళాశాలలో డిగ్రీ, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివాను. యూనివర్శిటీలో పీజీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఉన్నత విద్య పూర్తి కాగానే నాకు ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. ఎనిమిదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశాక, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆకాశవాణిలో తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా చేరాను. కడప, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేస్తూనే 1982వ సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించి ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టరుగా చేరాను. 1987వరకు హైదరాబాద్ ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసి, ఢిల్లీలోని ఆకాశవాణి స్టాఫ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టరుగా పదోన్నతిపై వెళ్లాను. మూడేళ్లపాటు ఢిల్లీలో పనిచేశాక, 1990లో ఆకాశవాణి స్టేషన్ డైరెక్టరుగా పదోన్నతి లభించింది. స్టేషన్‌డైరెక్టరుగా న్యూఢిల్లీ, విజయవాడ, కడప, అనంతపూర్‌లలో పదేళ్లపాటు పనిచేశాను. అనంతరం చెన్నయ్, ఢిల్లీల్లో జాతీయ ఛానల్‌కు డైరెక్టరుగా పనిచేశాను. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పనిచేస్తూ 2005 ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశాను. నాకున్న ముగ్గురు పిల్లలు వివిధ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. దీంతో నా సెకండ్ ఇన్నింగ్స్‌లో దేవుడి సన్నిధిలో సాహిత్యసేవలు చేద్దామని నిర్ణయానికి వచ్చాను.

శ్రీ వెంకటేశ్వరుని సేవలో…
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్‌మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం నేను శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పాను. దీంతో ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్‌గా చేరాను. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు పనిచేశాను. అప్పుడే భక్తి ఛానల్ పనులు పర్యవేక్షించాను. టీటీడీ ఆధ్వర్యంలోనే 2008లో ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియోను ఆరంభించాను.

సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు
సివిల్ సర్వీసులో శిక్షణ ఇస్తున్న నారాయణ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రెండేళ్లపాటు పనిచేశాను. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా ఉంటూ సివిల్స్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాఠాలు చెబుతున్నాను. కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పలు కళాశాలల విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు చెబుతున్నాను. హైదరాబాద్ స్టడీ సర్కిల్, అప్పా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్, హైదరాబాద్, పద్మావతి, ఢిల్లీ జామియా మిలియా తదితర 15 యూనివర్శిటీల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాను.

సాహిత్యసేవలు
సాహిత్యంపై మక్కువతో ఒకవైపు పుస్తకాలు రాస్తూనే, పలు పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాస్తున్నాను. ప్రతి రోజూ 20 పేజీలు రాయనిదే నాకు నిద్ర పట్టదు. అందుకే యోజన, ఉద్యోగ విజయాలు, ఆరాధన, దర్శనమ్, సప్తగిరి తదితర మాసపత్రికలకు వివిధ అంశాలపై వ్యాసాలు రాస్తున్నాను. కవిగా, అవధానిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి నాకు వీలైనంతగా సేవలందిస్తున్నాను. ఇప్పటికే నేను రాష్ట్రపతి వి.వి. గిరి, ప్రకాశం, రాయలసీమ రత్నాలు పేరిట ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు నవలలు, అనువాదాలతో కూడిన 70కు పైగా పుస్తకాలు రాశాను. నా 21 వ ఏటనే అష్టావధానం ఆరంభించి తెలుగు నాట యాభైకి పైగా అష్టావధానం కార్యక్రమాల్లో పాల్గొన్నాను. రామాయణాన్ని స్త్రీ పాత్రల ద్వారా ‘అంతరంగ తరంగం’ పేరిట రాశాను. విశ్వనాథవారి ‘వేయి పడగలు’ పుస్తకాన్ని మరో ఇద్దరు రచయితలతో కలిసి ఆంగ్లంలోకి ఇటీవల అనువదించాను. ఆకాశవాణి ఏటా జరిపే జాతీయ కవి సమ్మేళనానికి జాతీయ తెలుగు కవిగా నన్ను ఎంపిక చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

అందరూ రచయితలే
నాతోపాటు కుటుంబ సభ్యులందరూ రచయితలే కావటం విశేషం. నేను రాసిన 70 పుస్తకాలు ప్రచురితమైనాయి. నా సతీమణి శోభాదేవి అన్నమాచార్యపై నాలుగు పుస్తకాలు రాశారు. నా పెద్ద కుమారుడు రమేశ్ చంద్ర జాబ్ ఇంటర్వ్యూ, మారథాన్ రేస్ టు సివిల్ సర్వీసెస్, దటీజ్ ఐటి పుస్తకాలు రాశాడు. నా చిన్న కుమారుడు వేదిక్ గణితం, ఎథిక్స్‌పై పుస్తకాలు రాశాడు.

నిత్య విద్యార్థి
ఒక వైపు ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాను. ఎంఏ తర్వాత ఉద్యోగంలో చేరినా, ఆ తర్వాత పీహెచ్‌డీ చేశాను. జర్నలిజంలో డిప్లమా, పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లమా, ఆస్ట్రాలజీలో పీజీ డిప్లమాలు చేశాను. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏలో ప్రథమ ర్యాంకు సాధించి బంగారు పతకాన్ని సాధించాను. పబ్లిక్ రిలేషన్స్‌లో బంగారు, కాంస్య పతకాలు లభించాయి. ఏటా నాలుగు పుస్తకాలు రాయడం, అవధానాల్లో పాల్గొంటుంటాను. నేను రాసిన పుస్తకాలపై అయిదుగురు విద్యార్థులు పరిశోధనలు చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. అవధానం చేయడం, నవలలు రాయడం, అనువాదాలు చేయడం, కవితలు, కథలు, గేయ, వచన, పద్య రచనలు ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ నాకు ప్రవేశముంది.

సేవా సంస్థలతో అనుబంధం
సుమారు 37 ఏళ్లపాటు కళాశాల, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఉద్యోగం చేయడమే కాదు, పదవీ విరమణ చేశాక వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసుడిగా కొనసాగుతున్నాను. మద్రాసు తెలుగు అకాడమి గౌరవ అధ్యక్షుడిగా సేవలందించాను. మా నాన్న జ్ఞాపకార్థం అనంత లక్ష్మీకాంత సాహీతీ పీఠాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఏటా కళాకారులు, కవులను సన్మానిస్తున్నాను. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసు పరీక్షల్లో మన తెలుగు గిరిజన అభ్యర్థులు ఎంపికయ్యేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దీని కోసం భీమవరంలోని వశిష్ఠ ఆశ్రమం ఆధ్వర్యంలో ఏర్పాటైన గిరిజన పరిశోధన సంస్థ గౌరవ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మరో వైపు ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాను** అంటూ ప్రముఖ సాహీతీవేత్త అనంత పద్మనాభరావు తన సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు ముగించారు. ఆరు పదుల వయసు దాటిన తరువాత పునఃప్రస్థానంలోనూ ఒకవైపు సేవలతో పాటు అక్షర పద్మాంజలితో సాహిత్యసేవలు చేస్తున్న డాక్టర్ అనంత పద్మనాభరావుని మనమూ అభినందిద్దాం.

ఎన్నెన్నో అవార్డులు
తెలుగు సాహిత్యానికి విశిష్ఠ సేవలందించిన డాక్టర్ అనంత పద్మనాభరావుకు పలు అవార్డులు లభించాయి. ఈయనకు 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమి నుంచి ఉత్తమ అనువాదక బహుమతి లభించింది. ఈయన చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా 1999లో ఢిల్లీ, మద్రాసు తెలుగు అకాడమీల అవార్డులు వచ్చాయి. 2004లో డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు, దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు, 2003లో చెన్నయ్‌లో భారతీయ సమైక్యతా పురస్కారం, 2002లో ఢిల్లీలో రాష్ట్ర్టీయ ఏక్తా అవార్డు, 2000 సంవత్సరంలో నాగభైరవ కళాపీఠం అవార్డు, 1996లో విజయవాడలో ఈకే అవార్డు, 1991లో కవిత్రయ అవార్డు, 1992లో ఎస్. ఆంజనేయులు అవార్డులు లభించాయి. 1993లో ఉత్తమ అనువాదకుడిగా తెలుగు యూనివర్శిటీ పురస్కారం పద్మనాభరావుకు దక్కింది. సనాతన« దర్మ ఛారిటబుల్ ట్రస్టు ఇటీవల ఈయనను శ్రీరామ నవమి పురస్కారంతో సత్కరించింది. గత ఏడాది డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో అవధానిగా అనంత పద్మనాభరావును సన్మానించారు. న్యూయార్క్‌లో జరిగిన ఆటా సభలో ఈయన్ని సత్కరించారు. రేడియో నాటకాలపై పరిశోధన చేసేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ పద్మనాభరావుకు ఫెలోషిప్‌నిచ్చింది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.