వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి

 

వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా….

వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు ఉద్యోగం చేపట్టినప్పటికీ ఆయన మనసు అందులో నిలవలేదు. ఆయన తండ్రి కుప్పా లక్ష్మణావధాని. అనంతర కాలంలో ఆయన శ్రీజనార్దనానన్ద సరస్వతీ స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన వేద విద్వత్తు ఆయనను ఆధునిక విద్య, ఉపాధి మార్గం నుంచి వేదాల వైపు నడిపించింది. ఫలితంగా ఆయన 37వ ఏటనే బ్యాంకు ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి వేద పరిరక్షణ, వేద విజ్ఞాన వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తున్నారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో పట్టు ఉండటం వల్ల వేద విజ్ఞానాన్ని సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో అందించే సామర్థ్యం వీరి సొంతమైంది.
ఆధునిక – వేద విజ్ఞానాల సంగమం
అటు ఆధునిక విజ్ఞానం, ఇటు వేద విజ్ఞానాల మేలు కలయికగా ఉండే కృష్ణమూర్తి అవధూత దత్తపీఠంలో విద్యాధికారిగా, ట్రస్టీగా పనిచేశారు. 1986లో శ్రీదత్తదర్శనం చిత్రానికి సంభాషణలు కూడా రాశారు. ఆ తరువాత దశాబ్ద కాలం క్రితం వేదాలపై శాస్త్రీయ పరిశోధన సంస్థ (ఐసర్వ్)ను స్థాపించి వేదాల వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 36 జాతీయ సమ్మేళనాలు రచించారు. 30కి పైగా ఆధ్యాత్మిక, వైజ్ఞానికి గ్రం«థాలు ప్రచురించారు. 11 ఆధునిక వైజ్ఞానికి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఆయుర్వేదం, పాణినీయ వ్యాకరణం ద్వారా నూతన కంప్యూటర్ లాజిక్ ఆవిష్కరణ, నవీన వైజ్ఞానిక రీతులలో పురాతన సంఘటనల కాలనిర్ణయం, సనాతన భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్ర, వైదిక పద్ధతుల్లో భూకంపాది ఉత్పాతాల నిర్ణయం, అధర్వణ వేద పరిశీలన వంటి పరిశోధన ప్రాజెక్టులను అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు.
30 గ్రంథాల రచన
ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషల్లో ఆయన ఇప్పటి వరకు 30 గ్రంథాలు రచించారు. యోగావశిష్ఠ హృదయం నాలుగు గ్రం«థాలు తెలుగు వచనం, ఆంగ్లంలో కూడా రచించారు. గురు తత్వ, గురు సచ్చిదానంద సద్గురు చరిత్ర, అధ్యాయ శ్లోకావళి, యోగ తారావళి, రుద్ర ప్రపంచ సత్వం ఆయన రచించిన గ్రంథాల్లో మచ్చుకు కొన్ని. ్‌భక్తి మాల* అనే ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. వేద గణితంపై పుస్తకాలు రచించడంతో పాటు అనేక పరిశోధన వ్యాసాలు కూడా సమర్పించారు. వేద పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక రంగానికి చేస్తున్న సేవలకు గాను 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఉగాది పురస్కారంతో సత్కరించింది. జ్ఞాన సరస్వతి పురస్కారం, కల్యాణ భారతి ప్రతిభా పురస్కారం, మహర్షి విజ్ఞాన పీఠం నుంచి జ్ఞాన కులపతి పురస్కారం, డాక్టర్ పైడి లక్ష్మయ్య ప్రతిభా పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ధర్మనిధి పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గురుదేవుల ఆదేశం మేరుకు ఐసర్వ్ సంస్థను ఏర్పాటు చేసి, వేదాల్లో ఉన్న అనంతమైన విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు వీరు చేస్తున్న కృషి అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుకుంటోంది.

అభినందన సభ
వేద విజ్ఞాన పరిరక్షణ దీక్షితులు కుప్పా వేంకట కృష్ణమూర్తిగారికి ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు రాజధానిలోని తెలుగు విశ్వవిద్యాలయం కళామందిరంలో అభినందన సభ నిర్వహిస్తున్నట్టు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ శ్రీసీతారామ వేద సంస్కృత విద్యాపీఠం వెల్లడించింది. అభినందన సభతో పాటు వివేక చూడామణి, చతుస్సూత్రీ తాత్పర్య దీపిక, శ్రీమత్ భాగవత రహస్యము, ఈశావాస్యోపనిషత్తు, శ్రీమద్ భగవద్గీత 1-6 అధ్యాయాల ఆంగ్ల తరగతులు ఆడియో సిడిల అవిష్కరణ కూడా జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ ఎ.యజ్ఞరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డి.జి.పి. కె. అరవిందరావు, పుల్లెల శ్రీరామచంద్రుడు తదితరులు పాల్గొంటారు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.