మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

పడమటి మహారాష్ట్రలో అరణ్య ప్రాంత ,మైన గంగా మాల్ లో పండిత రమాబాయి 23-4-1858 న జన్మించింది .తండ్రి అనంత శాస్త్రి గోప్పపండితుడే కాక సంఘ సంస్కర్త కూడా .తొమ్మిదేళ్ళ చిన్న పిల్లను పెళ్లి చేసుకొని ,ఆమె కు విద్య నేర్పాడు .ఊరి బ్రాహ్మణులు దీనికి ఒప్పుకోక సంఘ బహిష్కరణం చేస్తే అరణ్య ప్రాంతానికి వెళ్లి ఇల్లు కట్టుకొని ఉండిపోయాడు .భార్య లక్ష్మి బాయ్ కి ఇక్కడికి రావటం ఇష్టం లేదుకాని సరి పుచ్చుకొని ఉండిపోయింది .రమా బాయ్ పుట్టిన తర్వాతా అనేక అడవులు ,పట్నాలు తిరిగారు .ఎక్కడికి వెళ్ళినా శాస్త్రి గారు స్త్రీ విద్య నేర్వాలని ఉపన్యసించేవారు .1877కరువు కాలం లో రమాబాయి తలిదంద్రులిద్దరూ చనిపోయారు .వారిద్దరూ ,చెల్లెలు తను చూస్తుండగానే ఆకలితో మరణించటం ఆమె జీర్ణించుకోలేక పోయి ఆ దృశ్యం జీవితాంతం వెన్నాడుతూనే ఉంది .ఆమె తన అన్నగారితోకలిసి మళ్ళీ దేశ సంచారం ప్రారంభించింది .1878లో కలకత్తా చేరే వరకు ఎండల్లో వానల్లో చలిలో ఆకలిలో వారిద్దరూ అనుభవించిన వేదన వర్ణనాతీతం .కలకత్తా పండితులు ఆమె విద్యా వైదుష్యాన్ని గుర్తించి ,సంస్కృతం లో ఆమెకున్న పరిజ్ఞానానికి ఉపన్యాస ధోరణికి అబ్బుర పడ్డారు ..

 

Pandita Ramabai

తండ్రి ఇచ్చిన సంస్కారాన్ని ఇద్దరూ నిలబెట్టాలనుకొన్నారు .అప్పటికే రమాబాయి మంచి ఉపన్యాసకురాలుగా పేరు పొందింది .కలకత్తా పండితులు ఆమె వైదుష్యాన్ని స్వయం గా పరీక్షించి సంతోషించి ఆమె కు ‘’పండిత ‘’’’,సరస్వతి’’ అనే బిరుదుల నిచ్చి సత్కరించారు .కొద్ది  కాలానికి అన్నగారు చనిపోయాడు .రమా బాయి  తనతో బాటు  ఆధునిక భావాలున్న  ఫిలాసఫర్ లాయర్  బాపు బిపిన్ బిహారీ దాస్ మాధవి అనే తక్కువ కులం అతన్ని వివాహం చేసుకొని అందరికి ఆశ్చర్యం కలిగించింది .అప్పటికే దేశం లో బ్రహ్మ సమాజ భావాలు బలం గా వ్యాపించాయి .అస్సాం లో ఉండగా భర్తకు బాప్టిస్ట్ మిషిన్ వాళ్ళు ఇచ్చిన బెంగాలీ భాషలో ఉన్న ‘’గాస్పెల్ ఆఫ్ లూకాస్ ‘’ను అధ్యయనం చేయటం ప్రారంభించింది .భర్త చనిపోగానే రమా బాయి  పూనా చేరింది .అక్కడ ‘’ఆర్య మహిళా సమాజ్  ‘’ను ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ప్రోత్సాహ మిచ్చింది .

1882ప్రభుత్వం విద్యా కమీషన్ వేసి అభిప్రాయ సేకరణ చేస్తుంటే రమా బాయ్ ఉపాధ్యాయులకు శిక్షణ నివ్వాలని ,మహిళా ఇన్స్పెక్తర్లను నియమించాలని ,మహిళలు వైద్య విద్యాభ్యాసం చేసి డాక్టర్లు అయితేనే మహిళల ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయని సూచించింది .రమాబాయ్ సూచించినవి  విక్టోరియా మహారాణి దృష్టికి వెళ్ళాయి .దీని ప్రభావం గా ‘’లేడి డఫ్రిన్ ‘’నాయకత్వం లో ‘’మహిళా వైద్య ఉద్యమం ‘’వచ్చింది .జెండర్ రిఫార్మ్ మీద ఆమె అద్భుతం గా మాట్లాడేది .ఆమె ఉపన్యాసాన్ని ప్రారంభించటానికి ముందు సభ గందర గోళం గా ఉంది .ఆమె మాట్లాడకుండా కాసేపు ఉండి పోయింది .పూర్తీ నిశ్శబ్దం ఏర్పడిన తర్వాతా రమా బాయ్ ‘’నా దేశ వాసులారా !నా గొంతు చాలా పీలగా ఉంటుంది .మీరెప్పుడు స్త్రీ గొంతు విప్పి బిగ్గరగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు ‘’ అని ప్రారంభించి ఏంతో భావోద్వేగం గా చాతుర్యం గా ,మెచ్చికోలుగా మాట్లాడి అందరి హృదయాలను ఆకర్షించి అందరి చేత కరతాళ ధ్వనులను అందుకొన్నది .కావలసిన తీర్మానాలు హర్ష ధ్వానాల మధ్య  అంగీకరింప జేసి అనుకొన్నది సాధించింది. ఆమె తెగువకు ధైర్యానికి ,ముందు చూపుకు అక్కడ చేరిన అశేష జనం గౌరవ సూచకం గా లేచి నిలబడి హర్ష ధ్వానాలతో కరతాళ ధ్వనులతో మారు మోగించి ధన్యవాదాలు తెలియ జేసి చిరస్మరణీయం చేశారు .

ఇరవై ఏళ్ళ నుంచి ప్రజా జీవితం లో ఉంటూ ,ప్రజా సమస్యలు తెలుసుకొంటూ మహిళలకు జరుగుతున్నా అన్యాయాలకు సాక్షీ భూతం గా ఉన్న రమా బాయ్ ,అనుభవసారాన్ని విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి అణగారిన వారి పేదవారి అభ్యున్నతికి కృషి చేస్తూ  ప్రజల మన్ననలు అందుకొన్నది . 1883ఆమె కజిన్ ఆనందీ బాయ్ జోషి భారత దేశ మొట్టమొదటి మహిళా డాక్టర్ గా జరిగే  గ్రాడ్యుయేషన్ ఉత్సవం లో పాల్గొన టానికి  అమెరికా లోని ఫిలా డేల్ఫియా వెళ్ళింది .అక్కడ కూడా సంచల్లనమే సృష్టించింది రమాబాయి .అమెరికా స్త్రీ ఉద్యమ నాయకురాలు ఫ్రాన్సెస్ విల్లార్డ్ ,ఫిలడేల్ఫియా మెడికల్ కాలేజ్ డీన్  అయిన రాచెల్ బాడ్లీ మొదలైన అనేక మంది తో గాఢమైన స్నేహ సంబంధాలను ఏర్పరచుకోంది.ఫ్రీద్రిక్ ఫ్రోబెల్ స్థాపించిన కిండర్ గార్టెన్ స్కూల్ లాంటిది ఇండియాలో అగ్రకుల మహిళలకు ముఖ్యం గా బాల్య వితంతువులకోసం ఒక రేసి డేన్షియల్  స్కూల్ ను స్తాపించాలన్న ఆలోచన వచ్చింది .

ఇండియా కు తిరిగి రాగానే  బొంబాయి  లో మొదటి సారిగా ‘’శారదా సదన్ ‘’అనే గురుకుల పాఠ శాలనేర్పరచింది .తర్వాత దాన్ని పూనా కు మార్చింది .దీనికి హిదువుల నుంచి క్రిస్టియన్ ల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది .అందుకని ఒక బహిరంగ ప్రదేశం లో స్కూల్ ను నడిపి హిందూ ,క్రిస్టియన్ పుస్తకాలను ఉచితం గా అంద జేసింది .అప్పటికే రామాబాయ్ పేరు ప్రఖ్యాతులు దేశమంతా మారు మోగి పోతున్నాయి .ఇదే సమయం లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ లో ముఖ్య విభాగం అయిన ‘’జాతీయ సాంఘిక సమావేశం’’లో ఉద్రేక పూరిత ప్రసంగం చేసింది .ఇది చాలా మందికి ఇబ్బంది కలిగింది .ఆమె పై విమర్శలు పెరిగాయి .ఆమె శిష్యులు చాలామంది క్రిస్తియన్లు గా మారిపోయి ఆమె కు స్థానిక బలం లేకుండా చేశారు .

బొంబాయి ,పూనా లలో ఉన్న శారదా సదన్ లు  బ్రాహ్మణ స్త్రీలకు మాత్రమె .ముక్తికోరుకొనే వారందరికీ ప్రవేశం కల్పిచింది .అనతికాలం లో ఆ ప్రదేశమంతా ఆకలి తో అలమటించే వారితో బాల్య వితంతువులతో మధ్య భారతం లో కరువు పాలైన శరనణార్దులతో కిక్కిరిసి పోయింది . వీరందరి సంఖ్యా రెండు వేలు దాటింది .ముక్తి సదన్ అందరికీ ఆవాసం కల్పించింది .బాలలకు కిన్దర్ గార్టెన్ స్కూళ్ళు , హాస్పిటల్ ,విధి వంచితలైన స్త్రీలకూ శరణాలయం ,అరవై నాలుగు చేనేత మగ్గాలు ,అయిదు ప్రింటింగ్ ప్రెస్సులు ,కుట్టుపని , చేతివృత్తులు ,పిండిమర ,ఆయిల్ ప్రెస్ ,లాండ్రీ సౌకర్యాలు ఏర్పాటు చేసింది .వ్యవసాయ క్షేత్రం ,ఉద్యాన వనం ,ఫల వృక్షాలు ,మంచినీటి బావులు కూడా ఏర్పరచింది.వీటిని నిర్వహించటానికి పటిష్టమైన సంస్థనేర్పరచి క్రమ పద్ధతిలో సమర్ధ వంతం గా నిర్వహించింది .ఆమె కూతురు మనోరమ అమెరికా చదువు పూర్తీ చేసుకొని ఇండియా తిరిగి వచ్చి  ఆమెకు సహాయం చేస్తోంది .

పూనా దగ్గర ఖేద్గాం లో ఒక సంస్థ నేర్పరచి వితంతువులకు బీద మహిళలకు కుట్టుపని అల్లిక , వడ్రంగి పని మొదలైన వృత్తులలో శిక్షణ నిచ్చే ఏర్పాటు చేసి ,వారు స్వంత కాళ్ళ పై నిలబడేట్లు చేసింది .స్త్రీ ధర్మ నీతి అనే పుస్తకం రాసి తన’’ముక్తి  ప్రెస్ ‘’లోనే ముద్రించింది మరాఠీ లో బైబిల్ ను అనువదించి  ముద్రించింది .బైబిల్ చదివే తాను ఇంత దానినైనానని  గర్వం గా చెప్పుకొనేది .అమెరికా లోని ‘’ఎపిస్కోపల్ చర్చి ‘’ఆమెను సత్కరించింది .ఆమె కుమార్తె మనోరమ చనిపోయింది .దీనితో తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తీ అయింది అనుకొన్నది .ముక్తి సంస్థ సమర్ధం గా నిర్వహించే ఏర్పాటు చేసింది .5-4-1922లో 66  ఏళ్ళ వయసులో రమాబాయి చనిపోయింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.