చిన్నారి చైనా కతలు -3

చిన్నారి చైనా కతలు -3

శత్రువుకు కూడా ఒక ఆశ కల్పించాలి

క్రీ.పూ.206లో గొప్ప రాజకీయ వేత్త ,కళా కారుడు ,విద్యా వంతుడు సైన్యాధ్యక్షుడు ’’కావో కావో’’  చైనాలోని హ్యూగాన్ నగరం పైకి దాడికి బయల్దేరాడు .  ఆ నగరాన్ని  జయించటం మాటేమో కాని అక్కడికి చేరటమే చాల కష్టతరమైపోయింది .అది  యుద్ధం లో చాలా ప్రాముఖ్యమైన నగరం .విసుగు,  కోపం వచ్చి ‘’నేను ఆనగరం లోకి ప్రవేశించగానే అక్కడి వారందర్నీ సజీవం గా  భూస్తాపితం చేస్తాను ‘’అన్నాడు .ఈ మాటలు ఎలా చేరాయోకాని హ్యుయాంగ్ నగర వాసులకు అతని మాటలు తెలిసిపోయాయి .నిజం గా కావో కావో తమ నగరం లో ప్రవేశిస్తే తామందరం ఎదిరించలేక దేవుడిని ‘’కావొ కావో ‘’అని ప్రార్ధిం చాల్సి  వస్తుందని భయ పడ్డారు .అయినా ప్రాణాలు ఒడ్డి ధైర్యం గా ఎదిరించారు  దీనితో కావోకు మరీ కష్టమైంది ముందు అడుగు వేయటానికి .నెలల తరబడి కావో సైన్యం పోరాడుతూనే ఉంది .కాని నగరం లోకి ప్రవేశించలేక పోయింది .కావో కు కారం రాసినట్లై అసహనం తో ఊగిపోయాడు .

ఒక రోజున జెనరల్ కావో సైన్యాదికారులన్దర్నీ సమావేశ పరచి ‘’యుద్ధం లో శత్రువులను మరీ నిర్బంధం లో ఉంచకూడదని యుద్ధ శాస్త్రం చెబుతోంది .వాళ్లకు బతకటానికి కొంత అవకాశం ఇవ్వాలి .మనం వాళ్ళందర్నీ సజీవం గా పూడ్చేస్తామని గర్వం గా ప్రగల్భాలు పలికాం .అది వారికి తెలిసి పోయే ఉంటుంది .అందుకని వాళ్ళు తెగించి సర్వ శక్తులు ఒడ్డి విజయమో వీరస్వర్గమో అని యుద్ధం చేశారు  .నాకు అందిన వార్తల ప్రకారం మన శత్రువులకు నిలవ ఉన్న  ఆహార పదార్ధాలు దాదాపు ఖాళీ అయిపోయాయి .కనుక తిండికి ఇబ్బండులేర్పడ్డాయి వారికి .ఇప్పుడు మనం కొంచెం మన వ్యూహాన్ని మార్చి ,సడలించి వారికి కొంచెం బతికే వీలు స్వేచ్చ కలిపిస్తే ,వాళ్ళు యుద్ధం చేసి చావటానికి బదులు బతక టానికే ప్రయత్నం చేస్తారు .’’ అని చెప్పాడు .అందరూ అది బాగుందనే చెప్పారు .కొద్దికాలం యుద్ధం ఆపేశారు .హ్యూగాన్ నగర ప్రజలు వంతులువారిగా బయటికి వచ్చి కావో సైన్యం లో చేరిపోయారు .నగరాన్ని సంరక్షించ టానికి ఇప్పుడు పోరాడే యోదులే లేకుండా పోయారు .కావో వ్యూహం ఫలించి అతి సునాయాసం గా నగరాన్ని భీకర యుద్ధం తోపని లేకుండానే స్వాధీనం చేసుకొని అనుకొన్నది సాధించాడు .అదీ కార్య సాధకుడికి ఉండాల్సిన ఆలోచన .అవతలి వాడి బలాన్ని నిర్వీర్యం చేస్తే ,వాళ్ళే వచ్చి  లొంగి పోతారు .అప్పుడు విజయం సునాయాసం అని ఈ కద తెలియ జేస్తోంది .

కొండను ఢీకొని గెలిచిన పొట్టేలు

ఉత్తర చైనా లోని క్వియాన్ క్విన్ దేశం లో క్రీ శ.383లో పాలించిన రాజు’’ ఫు జియాన్ ‘’ఎనిమిది లక్షల యాభై వేల సైన్యం తో తూర్పు జిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి బయల్దేరాడు. చక్రవర్తి జియావు తన ముగ్గురు సైన్యాదికార్లు జీషి ,జీ యాన్ ,జీ జువాన్ లను ఎనభై వేల సైనికులతో శత్రు శైన్యాన్ని ఎదిరించమని ఆజ్న జారీచేశాడు .

నవంబర్ లో శత్రువులు తూర్పు జిన్ దగ్గరున్న ‘’ఫి ‘’నది దగ్గరకు చేరుకొని వ్యూహాత్మకం గా రక్షణ కోసం  మొహరించారు . నదికి తూర్పున జిన్ సైన్యం ఉంది .జిన్ సైన్యం సంఖ్యలో చాలా తక్కువ .శత్రు శైన్యం ఎనిమిది లక్షలపైన ఉన్న భారీ సైన్యం .తమ స్వల్ప బలం తో జియాన్ రాజు సైన్యాన్ని ఎదిరించి పోరాడి గెలవటం అసాధ్యం అని పించింది సైన్యాధికారి ‘’జీ’’ కి .ముగ్గురు సైనికాధికారులు ఆలోచించి జియాన్  రాజు మేజర్ జెనరల్ ఫు రాంగ్ కు ఒక వర్తమానం పంపారు .దాని సారాంశం –‘’మీరు మా నది ఒడ్డున సైన్యం తో మా సరిహద్దు లోనే మొహరించి ఉన్నట్లు తెలిసింది .మీరు దీర్ఘ కాల యుద్ధానికి సిద్ధమయి ఉన్నారని మేము అనుకొంటున్నాం .మీరు మీ దేశానికి చాలా దూరం లో ఉన్నారిక్కడ మీ వెంట తెచ్చుకొన్న ఆహార నిల్వలు మీకు సరిపోవు ఎక్కువ కాలం ఇక్కడే ఉంటే సరఫరాలు రావటానికి మీకు చాలా కాలం పడుతుంది .కనుక మీరు కొద్దిగా వెనక్కి వెడితే ,మేము మా సైన్యం తో మీ దగ్గిరకే వస్తాం .రెండు వైపులా సైన్యాలు విజయం కోసం హాయిగా యుద్ధం చేయవచ్చు .లేక పొతే తిండిలేక మీ సై నికులు చాలామంది ‘’హరీ ‘’అనే ప్రమాదం ఉంది ‘’

ఈ వార్తా ను రాజు ఫు జియాన్ కు చేరవేశాదు జెనరల్ .రాజు పగల బడి నవ్వి ‘’యెంత మూర్ఖులు వాళ్ళు .మన భారీ బలగం తో పోరాడే శక్తి వాళ్లకి ఉందా?కోడతో పొట్టేలు ధీ కొన్నట్లుంది వాళ్ళ పని సరే మనమే వెనక్కి తగ్గి  వాళ్ళు నది దాటు తుండగానే వాళ్ళందరిని  నీటికి బలిద్దాం ‘’అని ప్రగాల్భాలు పలికాడు .రాజు సైన్యం క్రమం గా వెనక్కి వెళ్లి పోతోంది .కొన్ని సెకన్ల కాలం లోనే ‘’రాజు గారు ఓడిపోయారు రాజు గారు ఓడిపోయారు ‘’అనే వార్త బాగా ప్రచారమైంది .సైన్యం వెనక్కి వెళ్తోంది అంటే రాజు ఓడిపోయాడని సైన్యం లో వెనక ఉన్న వారు అనుకోని అలా అరిచారు .ఎందుకు సైన్యం వెనక్కి తగ్గిందో సరిగ్గా ఎవరూ ఎవరికీ ప్రచారం చేసి చెప్పలేదు .దాని ఫలితమే ఇది .అంతా గందర గోళం గా మారిపోయింది  ఒకడిమాట ఒకడికి తెలియటం లేదు .ఒకడిని ఒకడు నమ్మటం లేదు .కంగారూ ,కంగాళీ .ప్రాణాలు దక్కించుకోవటానికి ఒకరిని మించిఒకరు వెనక్కి పారిపోతున్నారు  అంతా గందర గోళం గా ఉంది  వారిని అదుపు చేయటం ఎవరికీ సాధ్యామే కాలేదు .చక్రవర్తి జిన్ సైన్యం ఒక్కసారిగా ఇదే అదను అనుకోని నడిదాటి శత్రువులపై పడి భీభత్సం గా యుద్ధం చేసి జియాన్ సైన్యాన్ని ఊచ కోత కోస్తున్నారు.  జియాన్ సైన్యాధ్యక్షుడు ఫు రాంగ్ ఆత్మా రక్షణ కోసం తెగించి పోరాడుతున్నాడు .అరుస్తున్నాడు రాజు ఓడిపోలేదని మొత్తుకొంటున్నాడు .కాని ఎవరూ వినిపించుకోలేని మహా గందర గోళం .సైన్యం అంతా చెల్లా చెదరై తలో దారి పట్టారు .జియాన్ రాజు కున్న భారీ సైన్యం ఎందుకూ పనికి రాని దై కొద్దిపాటి సైన్యం ఉన్న చక్రవర్త్రి సైన్యం గెలిచింది .నిజం గానే పొట్టేలు కొండనే ఢీకొని కొండను పిండి పిండి చేసింది . కనుక యుద్ధం లో బలం కన్నా గెలిచే వ్యూహం చాలా ముఖ్యమైంది అని కద సారాంశం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.