విద్యా వేత్త వితరణ శీలి శ్రీ మైనేని గోపాల కృష్ణ
దాదాపు పది సంవత్సరాలుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారితో నాకు పరిచయం ఉంది .ఆయన ఎప్పుడూ ఇతరులను ‘’ఎలివేట్’’ చేయించటానికే శ్రమ పడతారు కాని తనను గురించి చెప్పుకోవటానికి ఇస్ట పడని మొహమాటం, బిడియం ఉన్న వ్యక్తీ .అయిదేళ్లుగా సరస భారతికి అంతకు ముందు అయిదేళ్ళు సాహితీ మండలికి ఆయన అభిమాని. సరస భారతి ప్రచురించిన .’’’సిద్ధ యోగి పుంగవులు ,’’,మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలు మైనేని వితరణ వల్లనే తేగలిగాము .ఇప్పుడు ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’పుస్తకాన్ని నేను రాయటానికి ప్రోద్బలం వారిదే .దాని ముద్రణ బాధ్యత అంతా తానే వహిస్తానని చెప్పి ముందుకొచ్చి కావలసిన ధనాన్ని ఎప్పుడో పంపించేశారు . ఈపుస్తకాన్ని మైనేని గారి బావ గారు ప్రముఖ వైద్యులు ,ఆంధ్రాంగ్ల కవి ,రచయిత అనువాదకులు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ గారికి అంకిత మివ్వాలని భావించాను .ఆయన మహదానంద పడ్డారు .అందుకని నేను ఆలోచించి ఈ పుస్తకం లో గోపాల కృష్ణ గారి గురించి పరిచయం కూడా ఉండటం భావ్యమని పించి , వారి నుంచి బయో డేటా సేకరించాను .దాన్ని ఆధారం గా వారిని గురించి సంక్షిప్త సమాచారం అందిస్తున్నాను . .
మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరు కు దగ్గర లో ఉన్న కుమ్మ మూరు గ్రామం లో మైనేని వెంకట నరసయ్య ,సౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935నఆరవ సంతానం గా జన్మించారు .వీరి అన్నలు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనే రాజశేఖర్ .అక్కయ్యలు శ్రీమతి అన్న పూర్నాదేవి ,స్వర్గీయ కనక దుర్గా దేవి, శ్రీమతి భారతీ దేవి .చెల్లెళ్ళుశ్రీమతి హేమలతా దేవి ,శ్రీమతి సత్యవాణి . వీరి బాల్యం లోనే తండ్రిగారు కుటుంబాన్ని పిల్లల చదువుల కోసం ఉయ్యూరుకు మార్చారు .ఉయ్యూరు లోచిన్నతనం లో గోపాల కృష్ణ గారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి వద్ద చదువుకొన్నారు .ఆయనే నాకూ గురువు గారు కూడా .నాలుగవ తరగతి వారి వద్దే చదివాను మా ఇంటికి దక్షిణాన రెండో ఇంట్లో దేవుల పల్లి సీతమ్మ గారింట్లో అద్దెకుండేవారు .ఆ మేస్టారంటే మైనేని గారికి అత్యంత భక్తీ విశ్వాసాలు .ఆయన్ను స్మరించ కుండా ఉండనే లేరు ‘గురువు ‘’గారు అని ఏంతో గౌరవం గా సంభావించి సంభాషిస్తారు .దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితం చదువు చెప్పిన గురువు గారిని ఈ నాటికీ గుర్తుంచుకొని స్మరించటం ఆయన సంస్కారం .అంతే కాదు ఆ మేస్టారి పేర ఏదో చేయాలనే తపన ఈ మధ్య ఎక్కువై ఆయన ఫోటో సంపాదించటానికి తీవ్ర కృషి కూడా చేసిన ఉత్తమ శిష్యులు శ్రీ గోపాల కృష్ణ గారు .మేస్టారే తన పుట్టిన రోజు ను నమోదు చేసి స్కూల్ లో చేర్పించారని గర్వం గా చెప్పుకొంటారు .ఆయన శిక్షణ ను మరవలేనని అంటారు .తన దగ్గర చదివే విద్యార్ధులలో తప్పు దిద్దుకొనే వాడిని ‘’వెధవ ‘’ అంటే ‘’వెయ్యేళ్ళు ధన ధాన్యాల తో వర్ధిల్లు ‘’అని ,ఎన్ని సార్లు చెప్పినా మారని వాడిని ‘’ఎదవ ‘’అంటే ‘ఎల్లప్పుడూ దరిద్రం తో వర్ధిల్లు ‘’అని తమాషా గా తిట్టే వారని మైనేని గుర్తు చేసుకొంటారు ‘’అనుమానస్తుడికి ‘’అదేదో ‘’ఆరు చోట్ల అంటుకుంటుంది ‘’అని సామెతను తనకు వర్తించేట్లు అనేవారనీ గో పాల కృష్ణ గారు చెప్పుకొన్నారు ..
గోపాల కృష్ణ గారు తాడంకి హైస్కూల్ లో 1950 వరకుచదివి ఎస్ ఎస్ ఎల్ సి .పాసయ్యారు .తరువాత విజయవాడ లో ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ కాలేజిలో చేరి ఇంటర్ చదివి 1953 లో ఉత్తీర్ణులయ్యారు .అప్పటికే కుటుంబం ఆర్ధికం గా చితికి పోయింది .ఈయన కూడా చదువు మీద అంతగా శ్రద్ధ చూపించలేదు .కాలేజి నాటకాలతో కాలక్షేపం చేశారు .ఆత్రేయ రాసిన ‘’యెన్ జి వొ.’ ‘’ఎదురీత’’’నాటికల లో చిన్న పాత్ర ధరించారు . విజయవాడలో సోషలిస్ట్ పార్టీ పై ఆకర్షణ ఏర్పడింది .ఆ సభలూ సమావేశాలలో తిరుగుతూ కాలేజికి ‘’డుమ్మా ‘’కొట్టేవారు .’’బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్ ‘’స్థాపకులతో చేరి ,హోటల్ యాజమాన్యం ,కస్టమర్లు ‘’హోటల్ క్లీనర్ల ‘’ను అసభ్య పదజాలం తోను ,అమానుష పధ్ధతి లోను వేధించే విధానాన్ని అరికట్టె టందుకు , వారి జీవన పరిస్తితులు మెరుగు పరచటానికి చేసిన కృషిలో పాల్గొని తన వంతు కర్తవ్యం నిర్వహించారు . . బెజ వాడ అనుభవం తో ఉయ్యూరులో స్నేహితులతో కలిసి ‘’డ్రమాటిక్ అసోసియేషన్ ‘’ను1953-54లో స్థాపించి ఆత్రేయ యెన్ జి వొ ను ప్రాక్టీస్ చేశారుకాని ప్రరదర్శన ఇవ్వలేక పోయారు .1954-55లో ఒక కజిన్ భర్త కున్న ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేశారు .1955-1958-కాలం లో విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీ మెయిన్ సబ్జెక్ట్ గా ,ఎడ్యుకేషనల్ ,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ లు మైనర్ సబ్జేక్టులుగా తీసుకొని .చదివి 1959లో ఏం ఏ డిగ్రీ సెకండ్ రాంక్ తో సాధించారు .
1959-60లో మహా రాష్ట్ర లోని పూనా లో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ ఆడిటర్ అప్పర్ డివిజన్ క్లెర్క్ (యు డి సి )గా ట్రెయినింగ్ పూర్తి చేసిన వెంటనే , బొంబాయి నావల్ అకౌంట్స్ కు బదిలీ చేస్తే విసుగెత్తి ఉద్యోగానికి నీళ్ళు ఒదిలి పెట్టి వచ్చేశారు .1960లో గుటూరు జిల్లా రేపల్లె తాలూకా నల్లూరు గ్రామవాసి స్వర్గీయ పరుచూరి భావనారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకున్నారు .
1960-61లో అమెరికా వెళ్లి మిన్నే పోలిస్ లోని మిన్నే సోటా యూని వర్సిటిలో ఎడ్యు కేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు .’’ఫాదర్ ఆఫ్ క్రియేటివిటి ‘’అని అందరూ ఆప్యాయం గా గౌరవం గా పిలుచుకొనే డాక్టర్ పాల్ ఇ .టారెన్స్ ’అప్పుడు బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చి అధిపతిగా ఉండి, సృజనను ఏంతో ప్రోత్సహించాడు .1961-62లో మాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అను బంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికి సహాయ పడుతూ ,కొన్ని లైబ్రరి కోర్సులను పూర్తి చేశారు .1962లో ఇండియా తిరిగి వచ్చి 1964వరకు రెండేళ్ళు ఉద్యోగం లేక ,కుటుంబాన్ని పోషించటానికి చాలా ఇబ్బందులు పడ్డారు .
1964-65లో విజయవాడలో మిల్క్ పౌడర్ ఫాక్టరీ నిర్మాణం చేస్తున్నస్నేహితుడికి చెందిన సమ్మిట్ అల్లైడ్ వర్క్స్ అనే కాంట్రాక్టర్ సంస్థలో సైట్ సూపర్వైజర్ ,గా కాషియర్ గా ,పని చేశారు .1965-66లో మళ్ళీ నిరుద్యోగి .ఉయ్యూరు లోని స్వర్గీయ పుచ్చా శివయ్య శ్రీ అన్నే హనుమంతరావు లు స్థాపించిన ‘’సరస్వతి ట్యుటోరియల్ కాలేజి ‘’లో పిల్లలకు సోషల్ చేబుతూ హాస్టల్ వార్డెన్ గా ఒకే ఒక్క వారం రోజులు పనిచేసి నిలబడ్డారు . . .అదే సమయం లో స్వర్గీయ మన్నే శివరాం (నెత్తురు కలం ఫేం )ఏర్పాటు చేసిన రామమనోహర్ లోహియా కృషికార్ లోక్ పార్టీ కి కృష్ణా జిల్లా సెక్రెటరి గా ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు .
1966-68మధ్య ఉయ్యూరు కే సి పి షుగర్ ఫాక్టరీలో పంచదార సంచుల లోడింగ్ ఆపరేటర్ అసిస్టంట్ గ ,ఆఫీస్ అసిస్టంట్ గా,స్క్రాప్ మెటల్ ను లారీలకు లోడ్ చేసే చోట తూకం తూచే వాడిగా, ఏ పని చెప్పినా హీనం గా భావించకుండా ‘’డిగ్నిటి ఆఫ్ లేబర్ ‘’గా భావించి చేస్తూ , ,అనేక షిఫ్ట్ లలో పని చేస్తూ ఫాక్టరీకి రైతులు ఎడ్ల బండ్ల తోలిన చెరుకు నాణ్యాన్ని పరిశీలించమంటే అదీ చేస్తూ ,పక్వానికి రాని చెరుకు దంట్లను, వాటర్ షూట్ లను ఏరిపారేస్తూ ,,మనసులోనే భావాలను అణచు కొంటూ ,ఈ వ్యవస్థలో తాను ఇమడ లేక పోతున్నానని బాధ పడుతూ,అసలు వ్యవస్థలోనే ఏదో లోపం ఉందేమో అని అనుమానిస్తూ. ఇదంతా తన బలహీనత ,ఖర్మ .అనుకొంటూ కాలం గడిపారు .
ఈ క్షోభ నుండి విముక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గోపాల కృష్ణ గారికి అదృష్టం తలుపు తట్టి అవకాశం అంది పుచ్చుకోంది.1969లో అమెరికా వెళ్లి టేన్నేసి లో లైబ్రరి సైన్స్ లో ఏం ఎస్. చేసి,అందరి అభిమానాన్ని , ,గౌరవాలనుపొంది డిగ్రీ తీసుకొని సంతృప్తి చెందారు .ఉయ్యూరులో పడిన శ్రమకు, మానసిక వేదనకు విముక్తి కలిగింది ..డిగ్రీ ఇంకా నాలుగు నెలలకు పూర్తీ అవుతుంది అనగానే లూ విల్ లోని కెంటకి యూని వర్సిటి లో కేటలాగర్ ,అండ్ ఇంస్ట్ర క్తర్ ఇన్ లైబ్రరి సైన్స్ కు ఎంపికై నారు .ఉద్యోగం లో చేరే నాటికి ఇండియా నుంచి భార్య సత్యవతి గారు కొడుకులు కృష్ణ రవి తో కలిసి వచ్చి చేరారు .
న్యు యార్క్ పబ్లిక్ లైబ్రరీని సందర్శించారు .మేచీన్ రీడబుల్ కేటలాగింగ్ కు ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ ను నిర్వహించారు .ఆబ్స్ట్రాక్ట్ ఆఫ్ అకాడెమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కు సహకరించారు .లాంగ్ రోల్ బడ్జెట్ ,పెర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలు అందించారు ..యూని వర్సిటి ఆఫ్ లు విల్ లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అంద జేయటం లో ప్రముఖ పాత్ర వహించారు .పై అధికారుల చేత ప్రశంసలను అందుకొన్నారు .తోటి ఉద్యోగుల చేత ఆత్మీయ మిత్రుడిగా అభినందనలు పొందారు .1997లో అసోసియేటెడ్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటి లైబ్రేరియన్ గాపదవీ విరమణ చేశారు . కెంటకిలో సదరన్ బాప్టిస్ట్ థియలాజికల్ సేమినరి .ముర్రే స్టేట్ యూని వర్సిటి లలో ‘’హిందూ ధర్మం ‘’పై ప్రసంగాలు చేశారు .లూవిల్ యూని వర్సిటిలో రెలిజియస్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధ ధర్మం ‘’పై దార్మికోపన్యాసం చేశారు .
అతిదులపై ఆదరణ ,ఆత్మీయత, సానుభూతి,సహ వేదనలను చూపి వారితో స్వానుభవాన్ని పంచుకొని చేతనైన సాయం చేయటమే జీవిత పరమావధిగా భావించి జన్మ ను చరితార్ధం చేసుకొంటున్నారు. ప్రతిక్షణం ఉపయోగకరమైన పనిలో గడపటానికే కృషి చేస్తారు .’’భయం తలుపు తడితే విశ్వాసం ఇంట్లో ఎవరూ లేరు అని సమాధానం చెబుతుంది ‘అనే సామెతను నమ్మి పని చేస్తారు ‘’faith is reflected in courage to face reality ‘’అన్నది నమ్ముతారు .. అబ్బాయిలు కృష్ణ, రవి లు వివాహాలు చేసుకొని ,పిల్లలలతో ఇద్దరూ అమెరికాలోనే కోరుకున్న ఉద్యోగాలు చేసుకొంటూ తలిదండ్రులను కని పెడుతూ ఆదర్శ కుటుంబం గా ఉంటున్నారు .నిరంతరం సాహిత్యాధ్యయనం చేయటమే ఆయన హాబీ .చదివిన పుస్తకం బాగుంటే వెంటనే నా లాంటి వారికి కొని పోస్ట్ ఖర్చులు పెట్టి పంపటం మరో ‘’చెడ్డ గుణం ‘’.
అమెరికా లో ఉంటున్నా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు మీద అభిమానం ఏమీ తగ్గలేదు .ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసు కొంటూ ఉంటారు .ఉయ్యూరు లో ఏ .సి. లైబ్రరి నిర్మాణానికి అయిదు లక్షల రూపాయల భూరి విరాళాన్ని మచిలీ పట్నం లోని కృష్ణా విశ్వ విద్యాలయానికి ఇరవై వేల రూపాయలను , భగవద్ గీత లో రాణిస్తున్న ఛి మాదిరాజు బిందు దత్తశ్రీ కి ఉన్నత విద్య కోసం పది హీను వేల రూపాయలను, ఉయ్యూరు లో హిందూ శ్మశాన వాటిక ను ఆధునిక సౌకర్యాలతో అభి వృద్ధి చేస్తున్న రోటరీ క్లబ్ వారికి ఇరవై అయిదు వేల రూపాయలను అంద జేసిన వితరణ శీలి మైనేని .ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త ఉయ్యూరు వాసి ప్రస్తుత అమెరికా నివాసి శ్రీ ఆరికపూడి ప్రేమ చంద్ గారిని ఉయ్యూరు రప్పించి స్వయం గా డబ్బులు ఖర్చు పెట్టి మాతో సన్మానంచేయించిన వారి హృదయ వైశాల్యం గొప్పది .అలానే బౌద్ధ ధర్మ ప్రచారకులు శ్రీ అన్నప రెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారి కి సన్మానం చేయించి,వారి పుస్తక ముద్రణకు ధనసాయమూ చేసిన వదాన్యులు గోపాల కృష్ణ గారు .సరసభారతికి కొంగు బంగారం .’’సరస భారతి ప్రచురించిన’’సిద్ధ యోగి పుంగవులు ‘’మహిళా మాణిక్యాలు ‘’అనే రెండు పుస్తకాలకు ఆయనే స్పాన్సర్ .మొదటిది ఆయన తల్లి గారు స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ గారికి ,రెండవది తమ ప్రియతమ అర్ధాంగి శ్రీ మతి మైనేని సత్య వతి గారికి అంకితం ఇప్పించిన తీవ్ర మాత్రు భక్తీ ,సహ ధర్మ చారిణి యెడ గాఢమైన అనురక్తీ ఉన్న వారు. ఇప్పుడు రాసిన మాటలన్నీ యదార్దాలేనని అందరికీ తెలిసిన విషయమే .మరొక్క సారి గుర్తు చేయటమే నేను చేసిన పని .
ఇదంతా వారిని ఉబ్బేయటానికో ,స్వలాభా పేక్షకో రాసినదికాదు. వారి కస్టపడి పైకొచ్చిన జీవితాన్ని చూసి ఈ నాటి తరం స్పూర్తి పొందటానికి, వారిలాగా సమాజ సేవలో ధన్యం అవటానికి ,ముఖ్యం గా యువత మాతృదేశ సేవలో తరించటానికే కాక , అందరికి ప్రేరణ కలిగిస్తుందని మాత్రమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు
