గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 -167- ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

167-   ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

ఇప్పటి వరకు  ఏడర్దాలకావ్యం వరకే పరిమితమైన సంస్కృత సాహిత్యం లో శతపత్రం లాగా శాతాదికార్ధ కావ్యం ప్రభ వించింది. కర్త సోమప్రభా చార్య కీర్తి దశ దిశలా దాని పరిమళం లా వ్యాపించింది .ఒకే శ్లోకానికి వంద అర్ధాలు  వచ్చేట్లు రాసిన కవిత్వం ఇది .న భూతో అని పించింది .ఈ  కావ్యం తో ఆయనకు ‘’శాతార్ధిక ‘’బిరుదు లభించింది .సుమారుగా 1177లో దీనిని రాశాడు .ఉపోద్ఘాతం లో అయిదు శ్లోకాలు రాశాడు .అందులో సూచికలో తాను భావించిన వంద అర్ధాలను వివరించాడు .మొదట ఇరవై నలుగురు జైన తీర్ధంకరుల ను ,తర్వాత  వైదిక  దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వర నారద మొదలైన వారి  విషయాలను ,చివరలో తన సమకాలీన కవులైన వాది దేవ సూరి ,హేమచంద్రాచార్య ,లను వారితో బాటు జైనమత  పోషక రాజులైన   జయ సింహ దేవా ,కుమారపాల ,అజయ దేవ ,మూల రాజ , గుజరాత్ ను పాలించిన చాళుక్య రాజులను  సిద్ధిపాల అనే  గౌరవ నీయ కవి ,పౌరుడిని ,ధర్మాచార్యులైన అనిత దేవ ,విజయ సింహులను గురించి చెప్పాడు .కావ్యం చివరలో అయిదు శ్లోకాలలో ప్రశస్తి రాసి అందులో తన గురించి శిష్యులు కీర్తించిన విషయాలను చేర్చాడు .సోమ ప్రభాచార్యుడు ‘’శృంగార వైరాగ్య తరంగిణి ‘ అనే నీతి కావ్యం ’రాశాడు  .

ఇలా అనేకార్ధ కావ్యం ఆవిర్భవించింది సోమప్రభా చార్య కవితా ప్రభ వలన .ఒక అజ్ఞాత కవి ‘’నల హరిశ్చంద్ర ‘’కావ్యం రాశాడు .శ్లోకం మొదటి నుంచి చదివితే నల చరిత్ర ,చివరి నంచి చదివితే హరిశ్చంద్ర చరిత్ర వస్తుంది .దీనికి కామెంటరీ కూడా జోడించాడు .హరదత్త కవి ‘’రాఘవ –నైషదీయం ;;రాశాడు .ఇది రామ, నల  కద.ఈ కవి గార్గ్య  గోత్రీకుడు .తండ్రి జయ శంకరుడు  .దీని వ్యాఖ్యానం లో భట్టోజి దీక్షితులను ,భట్తమల్ల ,కేశవ ,రామ కృష్ణ ,రభస యాదవ మొదలైన  నిఘంటు కారులను పేర్కొన్నాడు .  ఇది పద్దెనిమిదవ శతాబ్ది తొలి కాలపు రచన .

అనంతసూరి   రచన ‘’హరిశ్చంద్రోదయం ‘’ఇరవవై కా౦డాల ద్వ్యర్దికావ్యం  .ఇందులో ఒక హరిశ్చంద్రుడు పురాణ పురుషుడైతే రెండవ హరిశ్చంద్రుడు కవి గారి పోషక రాజు .

సూర్యకవి లేక సూర్య దాస లేక దైవ జ్ఞాన పండితుడు ‘’రామ –కృష్ణ విలోమ కావ్యం ‘’అనే ముప్ఫై ఎనిమిది కాండాలు గా రాశాడు .మొదటి నుంచి శ్లోకాన్ని చదివితే రామ పరామైన అర్ధం ,రెండవ చివర నుండి చదివితే కృష్ణ పరమైన అర్ధం వస్తుంది .కవి భరద్వాజ గోత్రీకుడు తండ్రి జ్ఞానాది రాజు .పార్ధ పురం లో ఉండేవాడు .దేవగిరి రాజు రామ ఆస్థానం లో రామ కవి ఉండేవాడు .ఈ కవి ఖగోళ విజ్ఞాని .1539లో ‘’సూర్య ప్రకాశ ‘’రాశాడు .లీలావతి గ్రంధం  పై1542లో  విమర్శ రాశాడు .అతడు అయిదు కాండాలలోరాసిన ‘’నృసింహ చంపువు ;’’’బాల బోధిక ‘’వ్యాఖ్య ,దేవేశ్వరుని ‘’కవికల్పలత ‘’లభిస్తున్నాయి .

కృష్ణ మూర్తి అనే మేధావి ,కవి ‘’కంకణబంధ రామాయణం ‘’అనే ముప్ఫై రెండు అక్షరాల ఏకశ్లోకం రాశాడు .ఇది చేతిగాజు లాగా గుండ్రం గా ఉంటుంది కనుక కంకణం అనే పేరొచ్చింది .ఎడమ వైపు నుంచి మొదలు పెట్టి చదివినా కుడి నుంచి ఎడమకు చదివినా ,లేక ఏ అక్షరంనుంచి మొదలు పెట్టి చదివినా అరవై రెండు శ్లోకాలు వచ్చేట్లు రాసిన ఏక శ్లోక కావ్యం .కవి తల్లి గౌరీ తండ్రి సర్వజ్ఞుడు.వసిస్టగోత్రం .సర్కారు జిల్లాల వాడై ఉంటాడని ,పందొమ్మిదవ శతాబ్ది కవి అని తెలుస్తోంది .

ఇదే రకమైన కంకణ బంధ ఏక శ్లోక కావ్యాన్ని మరింత వృద్ధి  చేసి శ్రీ చర్ల భాష్యకార శాస్త్రి రాశారు .ఈయన కృష్ణా జిల్లా కాకర పర్తి గ్రామ వాసి .కంకణ  బంధ రామాయణం లో వచ్చే ప్రతిశ్లోకానికి వచ్చే అర్ధ భావాలనుతెలియ జేస్తూ, సంయుక్తాక్షరాలను విడదీసి అందులోనుంచి 128 శ్లోకాలను విడమర్చి చూపించాడు .

ఈ విధంగా అనేకార్ధ కావ్యాలు వాటిలో చమక్కులు జిమ్మిక్కులు విపరీతం గా పెరిగి పోయి సాహిత్యం ఒక సర్కస్ కింద మారింది .బుద్ధికి పదును పెట్టి౦ది కాని మనసుకు హృదయానికి స్థానం లేకుండా పోయింది .దీనికి తగిన సాహిత్య వైద్యం చేసే కవి ఆవిర్భ వించాల్సిన  అవసరం కలిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.