గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
177- వేణీ కృపాల -అమరచంద్ర కవి
అమరకవి లేక అమరచంద్ర కవి అన్హిల్ వద్ లోని వాగట నగరానికి చెందిన వాడు .జైన గురు సంప్రదాయానికి చెందిన వాడు .జినదత్త సూరి శిష్యుడు .సిద్ధ సరస్వతి మంత్రాన్ని ఉపాసించి ,సరస్వతీ దేవి కటాక్షం తో అశేష కవితా సామర్ధ్యం పొందాడు .గుజరాత్ రాజు విశాల దేవుడికి ఈ కవి సామర్ధ్యం తెలిసి తన రాజధాని ధవలక్కక కు ఆహ్వానించాడు .అక్కడ సోమేశ్వర ,నానక మొదలైన పండిత కవుల చేత కవిని పరీక్షింప జేశాడు .అమరుని కవితా ప్రాగాల్భ్యానికి వారందరూ ఆశ్చర్య పోయి గొప్పకవి అని ప్రకటించారు .రాజు ఘన సన్మానం చేశాడు .విరాధ వాల రాజు కొడుకు విశాల దేవుడు 1243-1262మధ్య లో పాలన చేశాడు .కనుక అమర చంద్రకవి పదమూడవ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడు .అమర కవి బాలభారతం లో సూర్యోదయ వర్ణన పరమాద్భుతం గా చేశాడు .ఈ వర్ణన వలననే కవికి ‘’వేణీ కృపాల ‘’బిరుదు లభించింది .
అమర చంద్రుని ఇతర కృతులలో బాల భారతం ప్రసిద్ధి చెందింది .మహా భారత పర్వాలను అనుసరిస్తూ రాశాడు .ఉదాత్త కవిత్వం రాయటం వలన కావ్యాన్నికాళిదాసు రఘు వంశం సరసన చేర్చారు .అలంకార శాస్త్ర గ్రంధం ‘’కావ్య కల్ప లత’’ను ఛందస్సుపై ‘’ఛందో రత్న వల్లి ‘’ముక్తావళి ‘’రాశాడు .సాకేతిక విషయ పరంగా ‘’కలాకలాపం ‘’పద్మానంద కావ్యం ‘’,లేక జినేంద్ర చరిత్ర కూడా చేశాడు .ఇందులో జినుని పుట్టుక నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .అమర చంద్రుడు తన స్నేహితుడి రచన ‘’కావ్య కల్ప లత’’ను పూర్తీ చేసి దానికి కి వ్యాఖ్యానంగా ‘’కవి శిక్షా వ్రుత్తి ‘’రచించాడు .
178-సరస్వతీ పుత్ర- వస్తుపాల రాజ కవి
ఆచరాజు ,కుమార దేవి ల కుమారుడే వస్తుపాలుడు .వీరు ప్రసిద్ధ పఠాన్ల వంశం వారు .ముత్తాత చందపుడు రాజ ప్రముఖులలో సూర్యుడు అని గుర్తింపు పొందాడు .ఆయనకు నలుగురు కొడుకులు .చండప్రసాద్ ,సూరా ,సోమ ,అశ్వ రాజు .పెద్ద వాడు రాజ ముద్రికకు అధికారి .రాజ్యం లో మిగిలిన ముగ్గురూ అత్యున్నత ప్రభుత్వాదికారులే .భార్య అభూ అనే సైన్యాధికారి కూతురు .అతను ధోకా రాజు వరద వాల కు ముఖ్య మంత్రి .. అతని శక్తి సామర్ధ్యాలు అపూర్వం ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి దక్కన్ ,లతా గోద్రా రాజుల దండయాత్రలను సమర్ధంగా ఎదుర్కొని రాజ్యాన్ని రక్షించాడు .1221చిరస్మరణీయ మౌంట్ ఆబూ యాత్ర చేశాడు .అక్కడ దేవాలయాలకు భూరి దానాలు చేశాడు అవి శిలాఫలకాలపై కనిపిస్తాయి .అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది .1242లో చనిపోయాడు .సోమేశ్వర కవి తన ‘’కీర్తి కౌముది ‘’లో వస్తుపాల గుణగణాలను దాతృత్వాన్ని భక్తిని శీల సంపదను విశేషంగా వర్ణించాడు ..
వస్తుపాలుడు స్వయంగా కవి .ఇతరకవుల ప్రతిభను మెచ్చాడు .సోమేశ్వరునిపై అసూయ ఉన్నా హరిహర కవిని ఆదరించాడు .మూడు గొప్ప గ్రంధాలయాలను స్థాపించాడు .విలువైన వ్రాత ప్రతులను సేకరించి వాటిలో భద్ర పరచాడు .నరచంద్ర సూరి రాసిన ‘’కదా రత్న సాగరం ‘’ను ప్రోత్సహించాడు .నరేంద్ర ప్రభుని ‘’అలంకార మహోదధి ‘’ని కూడా సమాదరించాడు .దీని వలన విలువైన సాహిత్యం వచ్చింది .వస్తుపాలుని జ్ఞానం అసాధారణ మైనది ‘’సరస్వతీ పుత్రుడు ‘’అనే బిరుదు పొందాడు .’’కవి కున్జర’’’’ కవి చక్రవర్తి’’ ఇతర బిరుదులు .కవి జనాశ్రయం తో దర్బారు సరస్వతీ సామ్రాజ్యం అని పించేది .అందుకే వస్తుపాలుని ‘’లఘు భోజుడు ‘’అని కీర్తించారు .అతని ఆస్థానం లో ఉద్దండకవులు సోమేశ్వర ,అరిసింహ ,నానక మొదలైన వారుండేవారు .
వస్తుపాలుడు రాసిన ‘’నర నారాయణా నంద ‘’కావ్యం పదహారు కాండలు కలది.నర నారాయణ స్వరూపులైన అర్జున శ్రీ కృష్ణుల దివ్య చరిత్ర ఇందులో రాశాడు .గిర్నార్ అడవులలో వారిద్దరి సంచారం ,సుభద్రను అర్జునుడు ఎత్తుకు వెళ్లి వివాహం చేసుకోవటం మొదలైన కధలున్నాయి .ఉత్ప్రేక్షకు వైభవంతెచ్చి ఆ వర్ణనలతో కావ్య పరిపుష్టి కలిగించాడు .శిశుపాల వధ ను అనుసరించి రాశాడు .కదా కధనం లో అనేక సూక్తులు చెప్పాడు వస్తుపాలుడు .వాటినన్నిటిని సేకరించి ఒక పుస్తకం గా ప్రచురించారు .జల్హణుని ‘’సూక్తి ముక్తావళి’’ లో ఇందులోనివి చాలా భాగం చోటు చేసుకొన్నాయి .అతని ‘’ఈశ్వర మనోరధ మయ స్తోత్రం ‘’భక్తికి, ఆధ్యాత్మికతకు విశిస్ట మైనదిగా గుర్తింపు పొందింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-15 –ఉయ్యూరు
