ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77

33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )

పెసిమిస్ట్ కవులలో ఉమర్ ఖయ్యాం’’రుబాయత్ “’ కవితలని ఇంగ్లాండ్ కు చెందిన ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఆంగ్లం లోకి అనువదించటం తో దాని ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది .అలాగే లాటిన్ ప్రొఫెసర్ , కవి ఆల్ఫ్రెడ్ ఎడ్మండ్ హూస్మన్ మనిషి దుర్మార్గాన్ని హత్య ,ఆత్మహత్యలని దేవుడి ద్వేషాన్ని గురించి  రాసిన ‘’ఏ శ్రోఫైర్ లాడ్’’కూడా అంతే విఖ్యాతమైంది .యువప్రేమికులు మాత్రమేకాదు  నైతిక బాధ్యతతో జీవించే వారూ ఈ రెండిటికి బ్రహ్మ రధం పట్టారు .ఈ రెండూ చిన్న గ్రంధాలే అయినా ,విక్టోరియాన్ భావాలపై గొప్ప తిరుగుబాటే చేయించాయి .క్రమశిక్షణ గల ఇ౦ పీరియలిజం నుంచి ‘’బేఫర్వాఆనందోబ్రహ్మా’’  కు జనం మారిపోయారు .వీటి ప్రభావం అంతగా ఉండేది .’’తిను, తాగు, ఆనందించు ‘’అనే మూడు మాటల మంత్రమే అందర్నీ శాసించింది .పురాణ గ్రందాలమధ్య మనవాళ్ళు ‘’చలం పుస్తకాలు ‘’పెట్టుకొని చదివినట్లు వీటిని పెట్ట్టుకొని రహస్యంగా చదివే సంఖ్య గణనీయంగా పెరిగింది .ముఖ్యంగా ఏ శ్రోఫైర్ లాడ్ ‘ను అలా చదివి రహస్యంగా ఆనందించేవారు .

26-5-1859 న  యింగ్లాండ్ లోని శ్రో షైర్ కొండల దగ్గరున్న వార్సేస్టర్ షైర్లో  పుట్టిన హూస్మన్ కు ఆ కొండలే చిన్నప్పుడు విహార స్థలాలు .ఏడుగురు సంతానం లో పెద్దవాడు హూస్మన్ .బ్రూమస్ గ్రూవ్ లో స్కూల్ చదువు పూర్తీ చేసి ఆక్స్ ఫర్డ్ లో సెయింట్ జాన్ కాలేజిలో చేరాడు .కుటుంబం లో అందరికి అభిమాని .ఆక్స్ ఫర్డ్ వదిలేసరికి చాలామారిపోయాడు .ప్రేమ వ్యవహారం విషాదమవటం ఒక కారణం అ౦టారుకాని రుజువుల్లేవు .ఇరవై ఏళ్ళకే అసా౦ఘికంగా ,ఏదీపట్టించుకోని వాడుగా మారి జీవితాంతం అలానే బతికాడు .అతని సమకాలికకవి విల్ఫ్రిడ్ స్కావెన్ బ్లాంట్ ‘’ సిగరెట్ తాగడు .కొద్దిగా డ్రింక్ చేస్తాడు .ఎవరూ కదిలించకపోతే చాలా ప్రశాంతం గా ఉంటాడు ‘’అన్నాడు .స్నేహం చేసేవాడే కాని నిలబెట్టుకోవటం లేదు .పెళ్లి చేసుకోలేదు .అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం ఇష్టం .దేవుడున్నాడనే నమ్మకం పదమూడవ ఏటి నుంచే ఉండేది .ఇరవైఎనిమిదవ ఏటనుండి నాస్తికుడు ఐపోయాడు .ఆనర్స్ పరీక్ష’ డింకీ కొట్టటం’’కూడా ఈమార్పుకు కారణం అని కొందరి ఊహ .బహుశా ఇది సరైనకారణమే కావచ్చు . కాని అతను ఇబ్బందిలేకుండా గ్రాడ్యుయేట్ అయినా 32వ ఏట యూని వర్సిటి కాలేజి లో ఉద్యోగం వచ్చేదాకా డిగ్రీ చేతికి రాకపోవటం తో హతాశుడయ్యాడు . టీచర్ అవటానికి ముందు పదేళ్ళు బ్రిటిష్ పేటెంట్ ఆఫీస్ లో హయ్యర్ డివిజన్ క్లార్క్ గా లండన్ లో పని చేశాడు .ఈకాలం లో ఏకాంత జీవనమే చేశాడు .కుటుంబానికి సంబంధం లేకుండా .1892లో ఆఫీస్ లో ఉద్యోగం మానేస్తూ ‘’యెంత తక్కువ చేయాలో అంత తక్కువ పని చేశా ‘’అని చెప్పి యూనివర్సిటికాలేజి లో లాటిన్ ప్రొఫెసర్ గా చేరాడు .

19 ఏళ్ళ తర్వాత 52 వ ఏట  ట్రినిటీ కాలేజ్ కి మారాడు .ఇక్కడే క్లాసిక్స్ బోధిస్తూ ఇతర లాటిన్ వాళ్ళను విమర్శిస్తూ ,అడపా దడపా కవితలు అల్లుతూ జీవితాంతం ఉన్నాడు . దీన్ని రాసినా మళ్ళీ మార్పు చేసేవాడు కాదు .చివరి పాతిక ఏళ్ళు ఆగస్టన్ యుగానికి చెందిన’’మానిలస్ ‘’కవి గ్రంధానికి వ్యాఖ్యానం రాస్తూ గడిపాడు .ఇదిపూర్తి అయిన ఒక ఏడాదికి హూస్మన్ ను ఒక కొత్త నీరసం ఆవహించింది .గుండెకు సంబంధించిన జబ్బు అని తెలుసుకొని మృతువు సమీపించిందని గ్రహించాడు .అయినా క్లాసులకు రెగ్యులర్ గా  వెళ్లి యధాప్రకారం బోధిస్తున్నాడు .బోధనలో డ్యూటీతోబాటు ఆనందాన్ని పొందాడు .తనకు ఇష్టమైన కవి’’ హోరేస్’’ పై ఉపన్యాసాలను తయారు చేసుకొన్నాడు .కాని పూర్తీ చేయకుండానే హూస్మన్ కు సెకండ్ ఎటాక్ వచ్చి 78 వ ఏట 30-4-1936న మరణించాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-15-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.