శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2
76-‘’క్షేత్ర స్వరూపా ,క్షేత్రేశీ.క్షేత్ర క్షేత్రజ్న పాలినీ –క్షయ వృద్ధి వినిర్ముక్తా క్షేత్ర పాల సమర్చితా ‘’‘’
సమయానుకూలంగా క్షీణించటం శరీర ధర్మం .కాని ఉన్నంతవరకు తను నశిస్తూ ,తనలోని ఆత్మకు అక్షయమైన రక్షణ కల్పి౦చటమే శరీరం పని ..అందుకే దాన్ని’’ క్షేత్రం ‘’అంటారు .నిజానికి ఈ క్షేత్రం పరమేశ్వరి రూపమే .విశ్వం లో ఆణువణువు లోను సర్వేశ్వరి అస్థిత్వం వ్యాపించి ఉన్నట్లే ,శరీరం లోని అంగాగం లోను శ్రీ దేవి అనంత లావణ్యం వ్యాపించి విరాజిల్లుతుంది .మానవ శరీరం లోనిసౌ౦దర్యం ,సామర్ధ్యం,శోభ లలో పరమేశ్వరి అంశ ఉంటుంది .క్షేత్రం మనకు శరీర రూపం లో మన కర్మాను సారం దేవి తేజం లభిస్తుంది .కనుక ఈ పరమేశ్వరీవరాన్ని యధధోచితంగా ,యధేస్టం గా ఉపయోగించటం ప్రతి వివేకవంతుని కర్తవ్యంగా భావించాలి .
క్షేత్ర రూపం లో విరాజిల్లే ‘’క్షేత్ర స్వరూప ‘’శ్రీ దేవియే క్షేత్ర ‘’అధిష్టాత్రి’’ .అందుకే ఆమె ‘’క్షేత్రేశి ‘’అయింది .శరీరం క్షేత్రం అయితే ,శరీరరహస్యం తెలుసుకొన్నవాడు’’ క్షేత్రజ్ఞుడు’’ అంటారు .క్షేత్రానికీ ,క్షేత్రజ్నుడికీ తమతమ బాధ్యతలు నిర్వ హించే శక్తి క్షేత్రేశ్వరి వలన లభిస్తుంది.అందుకే ఆమెను ‘’క్షేత్ర క్షేత్రజ్న పాలిని ‘’అన్నారు .
కేవలం క్షేత్రమే క్షీణి౦చి నశిస్తుంది కాని క్షేత్రజ్ఞుడు ,క్షేత్ర పాలినీ నశించరు .కనుక వృద్ధి పొందేది క్షేత్రమే .పోషణలో వృద్ధి పొంది కాలక్రమం లో వాడి వడలి నశించటం క్షేత్ర ధర్మం .శరీరం లోని జీవాత్మకాని ,జీవాత్మను పెంచి పోషించి శాసించే పరమాత్మకాని ఈ బాహ్య వృద్ధి క్షయలను అనుభవించరు .అంటే పెరగరు తరగరు .శరీరం మాత్రమే ఈ రెండూ అనుభవి౦చి నశిస్తుంది .ఇలా నశించే శరీరాన్నే తాత్కాలిక ఆవాసం గా చేసుకొనేఆత్మ మాత్రం ముక్తమౌతుంది .ఈ ఆత్మ రూపం లో పరమేశ్వరి శరీరం లో ఉంటుంది .కనుకనే ఆమె ‘’క్షయ వృద్ధి వినిర్ముక్త ‘’అంటారు .
శరీరం స్థూల వస్తువు .అందులోని మనసు ,బుద్ధి ,అహంకారం సూక్షం వస్తువులు .వీటన్నిటి సమ్మిశ్రిత రూపమే జీవాత్మ .జీవాత్మ కూడా సూక్ష్మ పరమాత్మయే .పరమాత్మ మాయా వినీలీలామయ శక్తి పరమేశ్వరి . అందుకేక్షేత్ర క్షేత్రజ్న ,క్షేత్రపాలురు ఈ క్షేత్రేశ్వరిని ఆరాధిస్తారు .ఈ శ్లోకం లోని చివరినామం ‘’క్షేత్ర పాల సమర్చిత ‘’కు ఇదే అర్ధం అని గ్రహించాలి .నశించే శరీరం లో అనశ్వర ఆత్మ తత్వ రూపం లో ప్రతిస్టితమైన పరమేశ్వరి సాక్షాత్కారం ఎలా లభిస్తుంది ?తరువాత శ్లోకం దీనినే వివరిస్తుంది .
77-‘’విజయా విమలా వంద్యా వందారు జన వత్సలా –వాగ్వాదినీ ,వామ కేశీ ,వహ్ని మండల వాసినీ ‘’
ఇందులో మొదటి పేరు ‘’విజయ ‘’.ఎప్పుడూ ఎవరికి విజయం లభిస్తుందో ఆమె విజయ .ఆమెను సాక్షాత్కారించుకోవటం కోసం శరీర ధారులు విజయ సాధన చేయాలి .లోపల, బయటి శత్రువులలతో పోరాడి విజయం పొందాలి .గెలిచినవారి జీవితమే సార్ధకం. ఆధ్యాత్మిక జీవితం లో లోపలి శత్రువులను అణచటం ముఖ్యమైన విషయం .కామ క్రోధాది వికారాలను జయించే దాకా మనశ్శాంతి ఉండదు. అంతరంగం ‘’ప్రశాంతి నిలయం ‘’అయితేనే ఆధ్యాత్మిక సిద్ధి ఆత్మ సాక్షాత్కారం లభిస్తాయి .కనుక తనపై తాను విజయం సాధించి ,తనను తాను తెలుసు కోవట౦ ఒక్కటే మార్గం .అందుకే ‘’మనోజయం జగజ్జయం ‘’అన్నారు’
శరీరం, మనసు స్వాధీనమైనప్పుడు మనసు నిర్మలమౌతుంది .నిర్మలమైన మనస్సులో ఆత్మ లోకం నిశ్చలమైన నీటిలో సూర్య చంద్రులు స్పష్టంగా కనిపించినట్లు కనిపిస్తుంది .ఇంద్రియాలు మనసుపై విజయం సాధించాక అంతః కరణాన్ని నిర్మలం గా ఉంచుకోగలిగితే ఆత్మానంద ప్రాప్తి సిద్ధిస్తుంది .కనుక శ్లోకం లోని రెండు నామాలైన విజయ ,నిర్మల ఈ సాధనా మార్గాలను సూచించింది .విజయం అంటే ఆత్మ విజయం .విమలం అంటే సమ్యక్ జ్ఞాన స్వచ్చ ప్రకాశం. అజ్ఞానం ఆశరీరిని ,శరీర మాయా మోహం లో పడేసే మాలిన్యం .అది తొలగి పొతే అంతః కరణం విమలం ,నిర్మలం అవుతుంది. చీకటి పోయి వెలుగు రావాలంటే భాను ప్రభ కావాలి .అలాగే జీవుడి అజ్ఞాన రూప అంధకారం జ్ఞాన ప్రకాశంగా మారటానికి పరమేశ్వరి కృపా ప్రభ కావాలి .
మనో నిర్మలతకు ఒక బాహ్య లక్షణం వినమ్రత .నిర్మల మనస్కునికి వినమ్రత అలంకారం .శ్రద్ధకు అనుకూలంగానూ ఉంటుంది .కనుక విజయ విమలత్వాలకు మూలం వినమ్రత అని గ్రహించాలి .నమస్కారం లో గొప్ప చమత్కారం ఉంది .వందనం చేస్తే దేవీ దేవతలు ఫ్లాటై పోయి సంతృప్తి పడతారు .ఈ భావాన్నే ‘’వంద్య , వందారు జనవత్సల’’నామాలు సూచిస్తాయి .ఇందులో వందన మహిమ కనిపిస్తుంది .వాల్మీకి మహర్షి రామాయణం లో సీతామాతను ‘’ప్రణిపాత ప్రసన్న’’అని శ్లాఘించాడు .అంటే ఒకసారి శ్రద్ధాభక్తులతో నమస్కారం చేస్తే చాలు ప్రసన్ను రాలై పోతు౦దని అర్ధం .శరీరం చేసే నమస్కారం ,మనసు చేసే ‘’మననం’’ కు బీజమవుతుంది .విశ్వ వంద్య ఐన దేవికి నమకరిస్తే ఆమె కృప, వాత్సల్యం పుష్కలంగా లభి౦చి అనుగ్రహం కలుగుతుందని భావం .
ఆత్మ సంయమనం ,నిర్మల మనసు ,వినమ్ర ఆచరణ ఉన్న వారికి మంజుల వాక్కు మధుర సంయోగం తో తోడైతే ఆత్మ అదికంగా ఆలోకితం అవుతుంది .ఈ వాక్కు అమ్మవారు ప్రసాది౦ చేదే .వాణి అంటే సరస్వతీ దేవికే వాణి ని అంటే వాక్కు ను ప్రసాదిస్తుంది లలితా పరాభాట్టారిక .అందుకే ఆమెను ‘’వాగ్వాదిని ‘’అన్నారు. వాక్కు నుంచి వాణి ని వెలువరించే సామర్ధ్యం శ్రీ దేవికే ఉన్నది .వాగ్దేవి దయవలన లభించిన వాణి ద్వారా మనం ఆమెను స్తుతించి నమస్కరిస్తాం .సదాచరణ, నిర్మల మనస్సు ,శుద్ధ వాణి కలిసి సాధకుని ముఖం పై దివ్య తేజస్సును తొణికిసలాడిస్తాయి .ఈ వర్చస్సుకు మూలాధారం ‘’వామ కేశి’’ అయిన శ్రీ దేవి .వామ అంటే ఎడమ వైపు అనీ వెదజల్లు అనీ రెండు అర్ధాలున్నాయి .ఎడమవైపుకు ముడేసిన జుట్టు ,వికిరణమై శోభాయమానంగా ఉంటుంది .స్త్రీల కేశరాశి మృదులంగా కోమలంగా వికిరణ శీలంగా ఉంటే సౌందర్యం,దివ్యత్వం వెయ్యి రెట్లు పెరుగుతుంది .ఇవన్నీ దేవిని ‘’వామ కేశి ‘’అనే నామం తో తెలియ జేస్తున్నాయి .అంటే శ్రీదేవి వాణి,ఓజస్సును ,కేశరాశి తేజస్సునూ ఒకే సారి ప్రకాశింప జేస్తున్నాయని అర్ధం .ఈ ఓజస్సు తేజస్సులు ఆమె ద్యుతి ద్యోతకాలు .ఈ జ్యోతిస్సునే ‘’వహ్ని మండల వాసిని ‘’తెలియ జేసింది .శ్రీదేవి నిరంతరం అగ్ని కుండ౦లో ఉంటుంది .ఆమె వెలువడే స్థానమే చిదగ్ని .ఒకటి బయటి అగ్ని రెండోది అంతరాగ్ని.ఇక్కడ బాహ్య అగ్నిని సూచించారు .ఈ రెండు అగ్నులు శక్తికి ప్రతీకలు .ఓజస్సు తేజస్సు, ద్యుతులకు మూల స్రోతస్సు అదే. అగ్ని తాపమూ కలిగిస్తుంది ,కాంతీ ఇస్తుంది . అమంగళం వినాశానికి తాపం ,మంగళ వర్ధనానికి ప్రకాశం కావాలి .రెండూ శ్రీ దేవి ప్రసాదాలే .అయితే ఈరెండు కార్య భారాలను దేవి ఎలా చేస్తుందో తెలిపేదే తర్వాతి శ్లోకం .
సశేషం
ఆధారం –డా శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’
శరన్నవరాత్రి శుభాకాంక్షలతో
మే-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-18-ఉయ్యూరు
