రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )

 

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )

ఆనంద గజపతి మహారాజు ‘’అరబీ ,పారసీ గ్రీకు లాతినుతెలుగా౦గ్ల౦బు గీర్వాణముల్ –పరి పూర్ణముగ నేర్చియన అన్నిటను’’ కావ్యాలు రాశాడు .దీనికి విజయనగర మోతీ మహల్ సాక్ష్యం .హరిశాస్త్రి ,పేరివెంకట శాస్త్రి గార్లు ఆచార్యులై శబ్ద శాస్త్ర రహస్యాలు నేర్పితే మహా పాండిత్యం పొంది ‘’రచనలు చేశాడు .అప్పుడు ప్రతి ఇల్లు శారదా నివాసమే .విజయనగరం భోజుని ధారా నగరమే .గానం ,వేదఘోష శాస్స్త్ర చర్చ ,నాట్య కేళి నిరంతర౦ మహా వైభవంగా సాగాయి .గాన్ధర్వా౦శులైన వైణికులున్నారు .ఆనంద రసం నిత్యప్రవాహమే అక్కడ .రాజు వైణిక శిఖామణి కూడా ‘’

ఆయన చల్లని పాలనలో సంస్కృత కళాశాల ప్రవర్ధమానమై రాయుడు శాస్త్రిగారు ఉపాధ్యాయులయ్యారు .రామానుజా చార్యులు ప్రిన్సిపాల్ .వీరిద్దరికీ కేమిష్ట్రి బాగా కుదిరింది .తారకనామంలాగా భాష్యాంతం చదివేవారు ఆర్ధిక ,తర్క మీమాంసలు నేర్చేవారు ,వ్యాకరణం  అవపోసన పట్టిన వారు  అక్కడ విద్యార్ధులుగా చేరి బాగా ఎదిగిపోయారు .హూణ విద్యలూ నేర్చారు .వ్యాకరణ బోధలో రాయుడు శాస్త్రిగారిని మించిన వారు లేరు అన్న గొప్ప ఖ్యాతి పొందారు .విద్యార్ధులకు గజపతి ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహించాడు  .కూరెళ్ళ సూర్యనారాయణ శాస్త్రిగారి వద్ద తర్కం అభ్యసించారు .ఆలూ బిడ్డల్ని వదిలేసి కాశీ వెళ్లి ప్రాయం అంతాకరగించి నేర్చిన శ్రీపాద సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద నడిమింటి సంగమేశ శాస్త్రిగారు సుశ్లోకుడు రాజుగారితో నిత్య చర్చలు చేసేవారు .ఈయనవద్ద కాణాదం,గౌతమీయం నేర్చారు రాయుడు శాస్త్రి .కొల్లూరి కామేశ్వర శాస్త్రి గారి వద్ద ‘’శంకర గురూత్తంబైన భాష్య త్రయం ‘’నేర్చారు .కావ్యాలు నాటకాలు బులుసు సుబ్బయ శాస్త్రి గారి వద్ద ,రుద్రాభట్ల రామ లక్ష్మణ శాస్త్రి సోదరులవద్ద వ్యాకరణం ,సంగమేశ్వరులవద్ద తర్కం ,కామేశంగారిదగ్గర శంకర భాష్య భారతి ,సూర్యనారాయణ శాస్త్రిగారి వద్ద గాన్ధర్వకళ ఇలా ఒకటేమిటి రాయుడు శాస్త్రిగారు సకల కళా శాస్త్ర వల్లభుడయ్యారు .లౌకికం లో, వేద శాస్త్రాలలో ఎదురులేనట్లు భాసించారు రాయుడు శాస్స్త్రి .తమ౦త వారు లేరని తొడలు కొట్టే కాశీ పండితులు ఈయను చూసి కిమిన్నాస్తి అయి పోయారు  గురువు గారిలాగా అక్షరం కూడా తప్పకుండా పాఠం చెప్పేభాగీరధ శాస్త్రి ,ప్రతివాది గర్వ నిర్వాపకుడు రాయప్ప శాస్త్రి ,గ్రంధకర్తలకు అర్ధం కాని సందేహాలు తీర్చే దిట్ట సూర్యనారాయణ సూరి ,పాణి ణీయాన్ని పుక్కిలిపట్టిన నరసింహశాస్త్రి లు రాయుడు శాస్త్రిగారి శిష్యులై మొదటిసారి మొదటి శ్రేణిలోకాశీ పండితుల కళ్ళు ఎర్రబడేట్లు  ఉత్తీర్ణులయ్యారు . అంతటి ఘనగురువు రాయుడు శాస్త్రిగారు .సంతానం కలగలేదు .భార్య’’సతియగు సూరమాంబ గ్రహచార వశాన నకాల మృత్యు గత’’అయింది .ద్వితీయంగా కాశీ నాద శాస్త్రి గారికుమార్తే పాప సోదెమ ను చేసుకొన్నారు .ఈమెతో దా౦పత్య౦  చక్కగా వర్ధిల్లి ,ఆమె శిష్యులపాటి తల్లిగా వ్యవహరిస్తూ ఆలనాపాలనా చూసేది .ఈ కొత్త దంపతులకు ఇద్దరు కుమారులు కల్గారు .పెద్దవాడు సూర్యనారాయణ శాస్త్రి ఆంగ్లం లో నిష్ణాతుడై ,ఏం ఎస్ సి పాసై ఆంద్ర విశ్వ విద్యాలయం లో రిసెర్చ్ స్కాలర్ అయ్యాడు .రెండవవాడు సన్యాసం తీసుకొన్నాడు .పెద్ద కూతురు బాల .చిన్నమ్మాయి, పెళ్లి ళ్ళుచేశారు.చిన్నకూతురు ‘’అసాధ్యరోగం పాలై తల్లిని చేరింది ‘’అల్లుడూచనిపోయాడు కొద్దికాలానికి దెబ్బ మీద దెబ్బ తీసింది విధి .

 

.ఆన౦ద గజపతి   తర్వాత అలక్ నంద రాజయ్యాడు .శాస్త్రి గారి కీర్తి మరీ పెరిగింది .ఉర్లాం ,పిథాపురం మొదలైన సంస్థానాలు రాయుడు శాస్త్రిగారిని ఆహ్వానించి ఘన సన్మానాలు చేశాయి.కాశీలో అఖిలభారత రాజ సమావేశం జరిగింది .అక్కడ శాస్త్రిగారిని ఘనం గా సన్మానించారు .రాజమండ్రిలో జరిగిన శ్రౌతమార్గ విద్రాజుల గోష్టిలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు .వేదసంపదకు బ్రహ్మావతారం ,కోపం లో దుర్వాసుడు ,ముక్కవలి బ్రహ్మావధానులు రాయుడు శాస్త్రి గారి ఉపన్యాసం విని ఫిదా అయ్యాడు .అక్కడి సభలకు మధ్యవర్తి రాయుడు శాస్త్రిగారే .నిష్పక్షపాతమైన తీర్పు ఆయనది .అందరూ శిరసున దాల్చాల్సిందే .శ్రీపాద నరసింహ శాస్త్రి రామ శాస్త్రి ఉద్దండులె అయినా శాస్త్రిగారి తీర్పుకు బద్దులే ..’’భరత ఖండా వతంస దీప్తి మెరయనొనర్చిన తీర్ధకరుడు ‘’రాయడు శాస్త్రి .సేతు సీతాచలపర్యంతం ఆయన పేరు మారుమోగింది .శాస్స్త్రిగారి శిష్యులను లెక్క పెట్టాలంటేఆది శేషుడుకూడా జారు కొంటాడు.

చివరిపద్యం –‘’కౌముదీ సుకుమార కాంతి కందలబృంద –పశ్యతో హరకీర్తి భారవాహు

డిందు శేఖర పదా స్పంద సద్భక్తి మం-జషాయమాణ ధీ శోభితుండు

బాభాష్యమాణ షడ్వదన దేవ భ్రాంతి- కారి వాన్ముఖ చమత్కార జలధి

కాశికా పండితాఖండల వినుత వి-జ్ఞత్వ హేతు గురుప్రసాదసుకృతి

సకల తంత్ర స్వతంత్రు డత్యకుటిలాధ్వ-తర్కనిది నిష్కళంకతాతా కులాంబు

నిధి కళానిధిసుబ్బరాట్సుధి చెలంగు –గాత శిష్యోపశిష్య సంఘములతోడ ‘’

ముందే చెప్పినట్లు ఈ ‘’రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక’’కావ్యాన్ని రచించినకవి శాస్త్రిగారి ముఖ్య శిష్యులు శ్రీ వెంపరాల సూర్య నారాయణ శాస్త్రి గారు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.