ఆత్మ లింగ శతకం

ఆత్మ లింగ శతకం
‘’శ్రీ మదనంత సనాతన అచల బోధ సిద్ధాంత సద్గురు దత్తాత్రేయ పర౦ప రాచార్యులైన ఆకుల గురు మూర్తి యోగీంద్ర విరచిత ‘’ఆత్మ లింగ శతకం విజయనగర రామానుజ ముద్రాక్షర శాల లో ముద్రింపబడింది .125పద్యాల ఈశతకం ఎప్పుడు ముద్రి౦పబడిందో ,వెల ఎంతో తెలియదు .కవి గారి విశేషాలు లేవు..’’అఖిల జీవన సంగ ఆత్మలింగ ‘’అనేది మకుటం .అన్నీ గీత పద్యాలే .
‘’శ్రీ పరశివ నీదు శృంగారతత్వంబు –నీ మహీ తలంబు నెచ్చు గాను -నేను చెప్పబూన నేర్చితి నీ కృప –నఖిల జీవన సంగ యాత్మ లింగ ‘’అని కవి శతకం మొదలుపెట్టి ,తానేమీ శాస్తజ్నుడను ,పండితుడినికాదని ,వంకలు ఎంచకుండా ఆదరం గా చూడమని కోరాడు .మొదట జగములేక మూడు రేకుల చెట్టు –తుదనుకొమ్మలైదుతూగులాడి-కొమ్మకోమ్మలందు కోటి కాయలు గాచే ‘’అన్నాడు తాత్వికంగా .పత్రం పుష్పం ఫలం వేరు కూడా లేవు .అది వేత్తలకు కూడా తెలీని రహస్యం .మాయకు మూలం లేదు తెలియరాదుకూడా .మమత తో మద అహంకారాలుపుట్టాయి .పంచ వన్నెల పంజరం లో మంచి చిలుక మఠం తీర్చి ,మాణిక్యాలమాటల మూటలు పలుకుతుంది .ముక్తి కాంత చిక్కులు పెడుతుంది .అల్పమతులకు చిక్కదు.చూపు మనసులో పెట్టి చూడాలి .రెండుకొండలమధ్య రేవతి అనే చుక్క ,చుక్క మధ్యలో సుధపురం , పురం లో పురహరుడు కనిపిస్తాడు .
ధారణా దారి తెలిసిన యోగి ,మేరువు చేరి మేను మరచి ,తానుతాను అనే తలపే మర్చి ,పొతే మళ్ళీ జన్మించడు .’’తోలు కొండ దీని తొమ్మిది వందలు –గండుపులులు చుట్టూ గాచి యుండు –కొండ శిఖరమందు కోమలి యొకతుండు’’.అదికామరూపి దాన్ని కామించి ,కొండేక్కిపులుల వాత బడ్డారు ‘’అని అన్యాపదేశంగా చెప్పాడు .నల్లతామరాకు మధ్య రంధ్రం లో కుండలుపెట్టి పాము గుడ్లు పెట్టి –రెండు పిల్లల్ని ఈని రాత్రి పగలు అరుస్తోంది .అదే అఖిల వేదార్ధం .వాటం తెలిసి మాయ మాతను దాటాలి .విషయ గుణాలలో ఉన్నది విషమే .ఏదైనా ఏకాగ్ర చిత్తం తో చేస్తేనే చెల్లుబాటవుతుంది .తత్వ వేత్త అల్ప తలపు లేకుండా నిత్యం ఒకే రీతిగా నిజసమాధిలో ఉంటాడు .
కాయ సిద్ధికోరి ,గహనాలు చేరి ,వాయు భక్షణం చేస్తే ,మాయతనువు మట్టి పాలౌతుంది .’’బంటు లింద్రియములు పనులెల్ల జేయంగ –మనసు మంత్రిగాను ,మసలు చుండు –తననుతాను గన్న తత్వంబు తద్రూపు ‘’అంటాడు .ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కాలితే తత్వవేత్త తనువూ భూ సమాధి తప్పక చేయాలి .యోగిది నిద్ర కాదు నిర్వికల్ప సమాధి .కఠిననమనస్కులకు ఆచలయోగం అంటుకోదు .తుదీ మొదలూ లేదు తుర్యమూ తానుకాదుఅదీ పరమాత్మ రూపం .’’తన్ను తానూ గనదు –తానేది గనబోడు-మూర్చ నొందబోదు –మూర్ఖులకందదు .జడలుపెంచి జపతపాలు చేసినా అందుకోలేరు .కారణం శివుడు ,కార్యం జీవుడు .
చివరగా ‘’మంగళము మీకు మహిప్రకాశ –మంగళంబు జేసి మరిమరి మ్రొక్కెద
అవని నా కవిత్వ మాచంద్ర తారార్క-మగు విధంబుగాను నార్య మీకు –సమర్పణంబు జేసి యానంద మొందితి’’అంటూ కవి అచల బోధతత్వాన్ని నింపిన ఈ ఆత్మ లింగ శతకాన్ని పూర్తీ చేశాడు .
గహనమైన వేదాంతాన్ని అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు రాసిన ఆకులగురుమూర్తి సత్కవి యోగీంద్రుడు ధన్యుడు .చదివి మనమూ ధన్యత చెందుతాం .ఈకవినీ, శతకాన్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.