గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-18
  విషాద ఛాయలు
1911 ఘోష్ కుటుంబం లో అత్య౦త విషాదం రేపింది .రెండు దశాబ్దాలు మంచాన పడి తీసుకొన్న శిశిర్ కుమార్ ఘోష్ ఎక్కువ భాగం కలకత్తాకు దూరంగా గడిపి జనవరి 10 కన్ను మూశాడు .పత్రిక భారం మోతీలాల్ పై పూర్తిగా పడింది .పావు శతాబ్దం శిరశిరకుమార్ అమృత బజార్ పత్రికకు సంపాదకుడు .దాని రూపానికి అస్తిత్వానికి,ఆత్మకూ  రూపకర్త .సంపాదకీయ అభిప్రాయాలు ఆయనవే .అందరూ ఆయనను గౌరవంగా ‘’మహాత్మా ‘’అనే సంబోధించేవారు .ఔదార్యం ,నిరాడంబరత అంకిత భావం ఆయన సొమ్ములు .ఆయన రాసిన శ్రీచైతన్య జీవితగాధ 1870లో బెంగాలీ  కుటుంబాలలో కీర్తనలుగా వ్యాపించాయి .అన్నగారిని గురించి మోతీలాల్ రాస్తూ –‘’ఆయన మాకు అత్య౦త విలువైన సోదర ప్రేమ పంచారు. అది అన్ని ప్రేమలకు పునాది .సోదరుని కోల్పోవటం అంటే హృదయం ముక్కలు ముక్కలవటమే .దాదాపు 60ఏళ్ళు ఆయన సోదర ప్రేమను చవి చూశాం .మేము సాధించింది ఏమైనా ఉంటె అన్నగారి పాదాలకే సమర్పిస్తున్నాం .ఉన్నత జీవిత లక్ష్యాలను ,రాజకీయ పాఠాలను ఆయన మాకు నేర్పారు .సిద్ధాంతాలు చెప్పటమే కాదు జీవితం లొఅనుసరి౦చ టమూ నేర్పిన మా గురుమూర్తి ఆయన .మానవ సేవద్వారా మాధవ సేవ చేయాలన్న మహోన్నత ఆశయం నేర్పించారు .ఆయన లేని లోటు మాకు ఎన్నటికీ తీరేదికాదు.శిశిర్ అన్నయ్య మాకు చిరంజీవి ‘’అన్నాడు .
  ఉమ్మడి కుటుంబ వ్యాపార సంస్థ ప్రారంభించిన అమృత బజార్ పత్రిక ,40ఏళ్ళ తర్వాత లిమిటెడ్ సంస్థగా రిజిస్టర్ అయింది . .అందులో వాటాలు ఘోష్ కుటు౦బానివే .ఆర్ధిక వ్యవహారాలూ హేమంతకుమార్ ,ఆయనతర్వత గోలాప్ లాల్,హేమంత కొడుకు మృణాల్ కాంతి చూశారు .పత్రికపై వచ్చే ఆదాయం అతి స్వల్పం .కుటుంబ పోషణకేకాక పత్రిక గడవటానికీ ,స్వగ్రామం లోని భూములపై రాబడీ అవసరమయ్యేది .కలకత్తాలో మోతీలాల్ కు అగ్రశ్రేణి స్థానం లేదు .దానికి ఆయన అర్రులు చాచనూ లేదు .సామాన్యుల బాధలు పట్టించు కోవటమే ఆయన ,బలం ,గుర్తింపు .
  జాత్యహంకారంతో భారతీయులపై ,ముఖ్యంగా విద్యావంతులపై బ్రిటిష్ యాజమాన్యం లోని పత్రికలూ రెచ్చ గొట్టే ధోరణి అవలంబించటం చూసి గోపాలకృష్ణ గోఖలే ‘’ప్రతి ఆంగ్లో ఇండియన్ రచయితా తనకలాన్ని సర్కారు వారి ఇంకులో ముంచి రాస్తున్నారు .ఇది అసంబద్ధం హానికరం ‘’అని రాశాడు .1912 మే 18న లార్డ్ కార్మి చెల్  మోతీలాల్ కు ఒక లేఖ రాస్తూ ‘’ఏయే సమస్యలని నేను వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని పరిష్కరించాలో నాకు తెలియ జేస్తే నేను కృతజ్ఞుడుగా ఉంటాను .మీపత్రికలో వీటికోసం ఎదురు చూస్తూ ఉంటాను బెంగాలీలు సుఖ శాంతులతో ఆనందంగా వర్ధిల్లటానికి శాయశక్తులా పని చేస్తాను .ప్రజలు మా పట్ల అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలుసు .నేను వారికి సేవ చేయలేక పోతున్నాననీ తెలుసు .తక్షణ సమస్యలలో నేను ఏం చేయాలో మీరే చెప్పాలి .నా బదులు మరో గవర్నర్ వచ్చినా ,భాష రాకపోతే అతడూ ఏమీ చేయలేడు.గవర్నర్ పదవిలో ఉన్నవాడు ఎన్నో చేయాలనుకొంతాడుకానీ ఏమీ చేయలేడు.తనకు తోచిన దృష్టితోకాక వేరే దృష్టితో చూడటమే అతడు చేయగల పని అనిపిస్తోంది ‘’‘అని రాశాడు .అన్ని తరగతులమధ్య సామరస్యం సాధించాటానికి ఆయన ప్రయత్నం చేశాడు .కానీ హో౦ శాఖ సభ్యుడు లాస్ రీనాల్డ్ క్రాడాక్ మాత్రం పత్రికలే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాయనీ బెంగాల్ వెనుకబాటుతనమూ కారణం అనీ అసలు బెంగాలీలు ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపరు ‘’అని భావించాడు .కార్మిచేల్ ,క్రాడాక్ లమధ్య విభేదాలు పెరిగాయి .ప్రజలు కార్మిచేల్ ను నమ్మారు .ఆయన మోతీలాల్ తో స్నేహ హస్తం చాచాడు .కార్మిచేల్ తన అభిప్రాయాలమేరకు పని చేస్తూనే ఉన్నాడు .క్రాడాక్ పత్రికా స్వేచ్చపై కత్తి దూశాడు .అమృతబజార్ పత్రిక అంటే అతడికి సింహస్వప్నం .సిల్హెట్ జిల్లా అరుణాచల ఆశ్రమ వాసులపై పోలీసులు జరిపిన భీభత్సకాండ ను పత్రిక ప్రచురించగా ,అస్సాం ప్రభుత్వం సుప్రీం గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయగా ప్రభుత్వానికి ఉక్కుపాదం మోపటానికి అవకాశం దొరికింది .
  ఆ ఆశ్రమం దయానంద అనే వైష్ణవ గురు పీఠం.ఇక్కడ గౌరవ ఉన్నత కుటుంబాల స్త్రీ పురుషులు సంకీర్తనలు చేస్తారు .తమకు నిద్రాభంగం కలిగిస్తున్నారని గిట్టనివారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ,గురువుకు ఆశ్రమవాసులకూ పదేసి రూపాయలు జుల్మానా విధించారు .అయినా రాత్రిళ్ళు భజనలు వారు మానలేదు .ఆశ్రమవాసులు ఒక బాలుడిని అపహరించారని మళ్ళీ ఫిర్యాదు చేస్తే,పోలీసులువస్తే వారిని లోపలి రానివ్వ లేదు .ఆశ్రమం ఉగ్రవాద సంస్థగా ఉందని ,మిలిటరీతో దాడి జరిపించగా ,స్త్రీలపై చేయి చేసుకొన్నందుకు ఆశ్రమవాసులు తిరగబడ్డారు .సన్యాసుల త్రిశూలాలను పోలీసులపై విసిరారు .కాల్పులు జరిపి పోలీసు బృందం ఒక ప్రముఖుడిని చంపి ,ఏడుగుర్ని గాయ పరచింది .దీనిపై ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తె అనైతిక అశ్లీల కార్యక్రమాలు ఆశ్రమం లో జరుగుతున్నాయని,బ్రిటిష్ పాలన నుంచి తాము విముక్తులం అయినట్లు ఆశ్రమవాసులు ముందే ప్రకటించారని  రిపోర్ట్ ఇస్తే ,మోతీలాల్ ఘోష్ ప్రభుత్వపు తప్పుడు రిపోర్ట్ ను తూర్పారబట్టితే ,కేంద్ర ప్రభుత్వం పత్రికపై 5వేల రూపాయల ధరావతు విధి౦చి చార్నేల్ కు పంపితే ఆయన తిరస్కరించినా ఫలితం లేకపోయింది ..ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ గార్డియన్ పత్రిక బ్రిటిష్ ప్రభుత్వం తప్పుడు చర్యలను బయటపెడుతూ –‘’ఇండియాలోకానీ ,మరెక్కడా కాని అమృత బజార్ వంటి పత్రిక లేనేలేదు .ప్రజాభిప్రాయానికి అద్దంపట్టే పత్రిక అది .మోతీలాల్ సంపాదకత్వాన వెలువడుతోంది .ఆయనే పత్రిక పత్రికే ఆయన .లార్డ్ విల్టాన్ వైస్రాయి గా వచ్చినప్పటి నుంచి అది బెంగాలీ ప్రజాభిప్రాయ సాధనంగా ఉంది .అందులో పతాక శీర్షికలు ముఖ్యవార్తలు అన్నీ మోతీలాల్ మాత్రమె రాస్తారు .నిర్దాక్షిణ్యంగా తనకలాన్ని ఝడిపిస్తాడు .ఆయన ధనవంతుడు కాదుకానీ  ఆ డబ్బు  చెల్లించ గలడు’’అని రాస్తే దిపాల్ మాల్ గెజిట్ ‘మోతీలాల్ జాతి వినాశకారికాడు .ముఖంపై చిరునవ్వు చిందించే మర్యాదా పురుషుడు .యూరోపియన్ ల వేష భాషలను అనుకరించని జ్ఞాన వయో వృద్దు .ఆయన కలం గంధకాన్ని చిమ్ముతుంది అంతమాత్రాన విప్లవవాది కాదు .ప్రభుత్వాధికారులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు .బెంగాలీ కుటుంబ సంప్రదాయాలు పాటిస్తూఉమ్మడికుటుంబం లో ఉంటూ ఒకే ఒక తుండుగుడ్డ మొలకు చుట్టుకొని ,పాదాలపై పని వాళ్ళు పడిమొక్కుతూ ఉంటె ,ఆయన పాతకుర్చీలో కూర్చుని గంధకం లాంటి రచనలను ముఖం పై చెదరని చిరునవ్వుతో రాసుకు పోతూ ఉంటాడు .’’అని రాసింది .సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేయమని కార్మినల్ రెండు సార్లు చెప్పినా క్రాడేక్ తిరస్కరించాడు .అది జుల్మానాగా మారకుండా రెండు సార్లు అడ్డుపడ్డాడు కార్మినల్ . 
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.