ఆహ్వానం -శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి

Sreepaada Invitation for 23 Apr 2015

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం

ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) ఎన్నికలంటే.. ఎప్పుడు జరిగాయో.. ఎప్పుడు ముగిశాయో సామాన్యులకు తెలిసేది కాదు. అదంతా ఫిల్మ్‌నగర్‌ వ్యవహారం అనుకునేవారు. కాని ఈ సారి వేసవి ఉక్కపోతలాగ.. ఫిల్మ్‌నగర్‌ మొత్తం ఎన్నికల హీట్‌తో ఉడికిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. రాజకీయ పార్టీలను తలపించాయంటే అతిశయోక్తి కాదు. ఉత్కంఠరేపిన ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ అనూహ్య విజయం సాధించారు. నటీనటుల అభినందనల ఆనందహేళలో తడిసిముద్దవుతున్న ఆ నట కిరీటి ఏమంటున్నారో చూద్దాం..
ఈ సారి ‘మా’ ఎన్నికలకు ఎందుకింత క్రేజ్‌ ఏర్పడింది?

ఎందుకో ఈ ఎన్నికల మీదే అందరి దృష్టి పడింది. సామాన్య ప్రజలు కూడా చాలా ఆసక్తి కనబరిచారు. ఇదివరకు ‘మా’ ఎన్నికలంటే కేవలం నటులు మాత్రమే పట్టించుకునేవారు. ఇప్పుడు మీడియా పుణ్యమాని ఈ ఎన్నికలకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు.. చూపిస్తూ వచ్చింది. మార్పు అవసరం అనే విషయం అందరికీ అర్థమైంది. ఊరిలో ఉన్న మా అన్నయ్య కూడా మొన్న ఫోన్‌ చేసి.. ‘రిజల్ట్ట్‌ ఎప్పుడొస్తుంది? ఇక్కడ టెన్షన్‌తో ఎదురుచూస్తున్నాం. మా పక్కింటి వాళ్లు ఏమైంది ఏమైంది అని పదే పదే అడుగుతున్నారు..’ అని అడిగాడు. మా అన్నయ్యే కాదు. ఎక్కడెక్కడి నుంచో నాకు ఒక్కటే ఫోన్లు. అమెరికా, ఆసే్ట్రలియాల్లోని తెలుగు వాళ్లు కూడా ఆరా తీశారు. వాటీజ్‌ రాజేంద్రప్రసాద్‌, వాటీజ్‌ మా ఎలక్షన్స్‌ అన్నది ఒక్క పెద్దటాపిక్‌ అయిపోయింది. నేను ‘మా’ అధ్యక్షుడిని ఎందుకు అవ్వాలనుకుంటున్నాను’ అన్నది అందర్నీ ఆకట్టుకుంది. నా మీద ఇంతమంది ఆశపెట్టుకున్నారు కనక.. ఇప్పుడు నూరుశాతం బాధ్యత పెరిగింది.

మీరు బలవంతంగా ఈ పోటీలోకి దిగారా? ఎప్పుడైనా ఎందుకొచ్చానురా దేవుడా అనిపించిందా?

నేను దేని గురించి అయినా చాలా ఆలోచిస్తాను. అయితే ఒక్కసారి ఆలోచించి రంగంలోకి దిగానంటే చావో రేవో తేల్చుకునే వరకు వెళతాను. అవసరమైతే పోరాడుతూ పోయినా పరవాలేదనుకునే మనస్తత్వం నాది. పోటీకి ముందు పరిశ్రమకు చెందిన కొందరు ఆత్మీయులు నావద్దకు వచ్చి.. ‘మీరు అయితేనే ఈ పోటీకి కరెక్టు. అందరికీ కావాల్సిన వారు. దయచేసి కాదనకండి’ అని అడిగారు. ‘మీ అందరి అండ ఉంటే నేను తప్పక నిలబడతాను’ అని వారికి హామీ ఇచ్చాను. చెప్పినట్లే పోటీకి నిల్చున్నా. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పరిశ్రమలోని చిన్న కళాకారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మద్దతు ఇచ్చారు. 37 ఏళ్లుగా నేను నటునిగా అందర్నీ నవ్విస్తున్నాను. రోజూ టీవీల్లోను, సినిమాల్లోను నన్ను చూస్తూనే ఉన్నారు. అందుకని సామాన్య ప్రజలు కూడా నేను గెలవాలని కోరుకున్నాను.

ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. మళ్లీ ఆర్టిస్టులంతా ఐకమత్యంగా ఉండగలుగుతారా..?

ఎందుకు ఉండమూ! మేమెప్పుడూ కలిసే పనిచేస్తాము. ఒకర్నొకరు పొడుచుకోలేదు కదా! కళాకారునికి ఒక సౌలభ్యం ఉంది. వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ.. కెమెరా ముందుకు వెళ్లాక నవ్వించే సీన్‌ వస్తే నవ్వించాలి అంతే! నటన అన్నిటినీ మరిచిపోయేలా చేస్తుంది. కాబట్టి అన్ని మరిచిపోయి అందరం కలిసి మళ్లీ నటనలో మునిగిపోతాము. ఏదీ మనసులో పెట్టుకోము. పాలకుండలో మూడు విషపు చుక్కలు పడినట్లు.. కొందరు కావాలనే పనిగట్టుకుని మా అధ్యక్ష ఎన్నికలను ఇలా చేశారు కాని.. ఇంతకుమించి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.

తెలుగు నటులకు మీరు కొత్త అధ్యక్షునిగా ఏం చేయాలనుకున్నారు?

నేను ఎన్నికైనా వెంటనే నటీనటులకు పెన్షన్లు, హెల్త్‌కార్డుల మంజూరుకు కృషి చేస్తాను. కొత్తకాపురం పెట్టగానే అయిపోదు కదా! ఇప్పుడే పెళ్లి అయింది. మిగిలినవన్నీ మెల్లమెల్లగా జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమీక్షిస్తాను. అనుకున్న పనులన్నింటినీ అమలయ్యేలా కృషి చేస్తాను. ఈ నిమిషం నుంచి నేను మా కార్యాలయం వెళ్లినప్పుడు కనీసం టీ కూడా తాగను. అంత కచ్చితంగా ఉంటాను.

ఈ గెలుపుతో కృష్ణానగర్‌కు, ఫిల్మ్‌నగర్‌కు మధ్యనున్న గోడ బద్ధలైందా?

అందరూ కోరుకున్నట్లే ఇప్పుడు పగిలిపోయిందిగా. ఇక శుభ్రం కావడమే మిగిలింది.
ఎన్నికలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మళ్లీ ఎలా కలిసిపోగలరు?
మేమందరం కళాకారులం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇలా అందరం ఒకే చోట కలిసి బతుకుతున్నాం. నేను ఇతరుల గురించి ఆలోచించే మనిషిని. నేను ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు అటూఇటూ నిల్చున్న వాళ్ల ప్లేట్ల వైపు చూసి.. ఒకవేళ అన్నం లేకపోతే.. నా ప్లేట్‌లోని అన్నం ముద్దను తీసి వారికి పెట్టే అలవాటు నాది. కాబట్టి ప్రతి కళాకారుని కష్టం నాకు తెలుసు.

ఇప్పటి వరకు ‘మా’కు ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు. జయసుధ మీద పోటీకి నిల్చున్నప్పుడు మీకేమనిపించింది?
అసలు ఆమెకు పోటీగా నిల్చునేకంటే ముందు తోటి మద్దతుదారులతో కలిసి ఈ విషయం మీద చాలా ఆలోచనలు చేశాము. ‘పోటీకి దిగిన ఒక ఆడపిల్లకు మనమేమైనా అన్యాయం చేస్తున్నామా?’ అని అంతర్మథనం చేశాం. అయితే ఒక మహిళను అధ్యక్షురాలిని చేయాలన్న నిజాయితీతో ఆమెను ఎదుటి వర్గం నిల్చోబెట్టలేదు. కావాలనే మహిళను ఎంచుకుని పోటీకి పెట్టినట్లు నాకు అనిపించింది. అందుకనే తప్పనిసరిగా నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. అంతకు మించి నాకు ఎవరి మీద ద్వేషం లేదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మస్తాన్ బాబుకు ఒక ప్రేమలేఖ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వారసత్వమే భావికి వారధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ విదేశీపర్యతనలో మెరుపులు -మరకలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -3

ఆనంద రామాయణ

శ్రీరాముని దిన చర్య

శ్రీరాముడు ఉదయాన్నే లేచి కాలోచిత విధులు నిర్వహించి పల్లకీ ఎక్కి సరయూ నదికి మహా వైభవం గా వెళ్ళేవాడు .నదిని పరిశుద్ధి చేయాలనే సంకల్పం తో ఇసుకపై కాలి  నడకన ప్రవాహం ఉన్న చోటికి చేరేవాడు .బ్రాహ్మణులు  చెప్పినట్లు స్నానాదులు పూర్తీ చేసి నిత్య కర్మలను అనుస్టించేవాడు .గోవులను బంగారాన్ని ధాన్యాలను బెల్లాన్ని డబ్బును మొదలైన దానాలతో సరయూ నదికి ,విప్రులకు పూజ చేసి సమర్పించేవాడు .

బంగారు గొలుసులతో అలంకరింపబడ్డ  ,పట్టు బట్టలు  బంగారు త్రాళ్ళు ఉన్న గుర్రాలు లాగే  రధమెక్కి స్నానం చేసి మడికట్టుకొన్న సారధి తోలుతుండగా పురజనులు చూస్తుండగా రాజమార్గం లో  ప్రయాణించేవాడు .నగర స్త్రీలు పుష్ప వృష్టి కురిపిస్తుండగా నిజ మందిరం చేరే వాడు .సీత ఇచ్చే అర్ఘ్య పాద్యాదులను స్వీకరించేవాడు .అగ్ని హోత్ర శాలకు చేరుకొని ధర్మ పత్ని సీతతో కలిసి అగ్ని హోత్రునికి ఆహుతులను సమర్పించేవాడు .’’గత్వాగ్ని హోత్ర శాలాయాం సీతాయాసన సంస్థితః –అగ్ని హోత్రాది విధినా వహ్నిం హుత్వా తతః పరం ‘’.

లోక శిక్ష కోసం విధి విధానంగా శ్రీ సాంబశివ శంకరుని ఆరాధించేవాడు .సీత చేసిన నైవేద్యాన్ని సమర్పించేవాడు .విప్రులకు దానాలిచ్చి సంతోష పెట్టేవాడు .వారి ఆశీర్వాదాలు గ్రహించి గోపూజ చేసి ,అశ్వత్థ వృక్షాన్ని అర్చి౦చేవాడు .తర్వాత సూర్యారాధన చేసి  బ్రహ్మ యజ్ఞాన్ని విధి విధానం గా పూర్తీ చేసేవాడు .వసిస్టమహర్షి పురాణ ప్రవచనం చేస్తుంటే శ్రద్ధగా సీతా సమేతం గా విని మహర్షిని సత్కరించేవాడు .బంధుమిత్రులు చేరగా వారితో సరస సల్లాపాలు ఆడేవాడు .సీతాదేవి అనేక సార్లు కోరిన మీదట దివ్య మైన నేతితో చేసిన పక్వాన్నాన్ని ,ఫలాలను ఉపాహారంగా తీసుకొనేవాడు .భార్య ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించి ,దివ్య వస్త్రాలు కట్టుకొని ,అద్దం లో చూసుకొనే వాడు .జానకీదేవి కటాక్షాన్ని పొంది రధమెక్కి మంత్రులు ,దూతలు  పరి వేష్టించి ఉండగా మాత్రు మందిరాలకు వెళ్లి తల్లులను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దీవెనలు పొందేవాడు .

తీర్ధ రూపుల వారి రాజమందిరం చేరి సింహాసనాధిస్టు డైన తండ్రి దశరధ మహా రాజును సందర్శించి ,ప్రణామం చేసి ,అక్కడకు చేరిన పురజనుల విన్నపాలు విని పరిష్కరించేవాడు .ప్రతి క్షణం రాజు గారి గౌరవ మర్యాదలను కాపాడేవాడు .తర్వాత తన మందిరం చేరేవాడు .పత్ని ఇచ్చిన  అర్ఘ్య పాద్య ఆచమనాదులు స్వీకరించి ,ఆమెతో సరసోక్తులతో కాలక్షేపం చేసేవాడు .పిమ్మట సరయూ నదిలోమధ్యాహ్న స్నానం చేసేవాడు .ఆయన స్నానించిన ఘట్టాలకు ‘’రామ తీర్ధం ‘’అనే పేరు వచ్చింది .ఇక్కడ చైత్రమాసం లో స్నానం చేస్తే విశేష ఫలితం వస్తుంది –‘’నిత్యం యత్రా కరోత్ స్నానం సరయ్వాం  నిర్మలే జలే –తదాఖ్యాయా భవాత్తీ ర్ధం  -రామ తీర్ధ మితి స్పుటం ‘’.

తర్వాత మాధ్యాహ్నిక ఇష్టులు నిర్వహిస్తాడు .బ్రాహ్మణులు మంత్రులతో కలిసి మూడుకాళ్ల పీటల మీద స్వర్ణ పాత్రలలో  భోజనాలు చేస్తాడు .సీతాదేవి కంకణ మంజీర కింకిణీ నూపురాదుల కలస్వనం కమ్మగా వినిపిస్తుండగా సీతా దేవి వడ్డన చేస్తుండగా అందరితో  కలిసి భోజనం చేసే వాడు .చేతులు కడుక్కొని ,తాంబూలం వేసుకొని సంతోషిస్తాడు .కొద్దికాలం నిద్రపోయి విశ్రాంతి తీసుకొంటాడు .లేచి నూత్న వస్తధారణ చేసి ధనుర్బాణాలు ధరించి శస్త్రాలు తీసుకొని రధమెక్కి ,వైభవం గా పుష్ప ఉద్యానవనం చేరుకొంటాడు .అక్కడ విహరించి మంగళ వాద్య ధ్వనులు విని పిస్తుండగా తన మందిరం చేరుకొంటాడు .

సాయం స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తీ చేస్తాడు .అగ్నిని ఉపాసిస్తాడు .పరమేశ్వరుని పూజిస్తాడు .నైవేద్యాదులు సమర్పిస్తాడు .ఆహరం తీసుకొంటాడు .దివ్య పర్యంకం చేరుకొని సీతా సాధ్వి తో కలిసి హాస్య ,వినోద గీత సంగీత నృత్య వినోదాలు చూస్తాడు .ఆ తర్వాత సుఖం గా నిద్రిస్తాడు .ఇలా అయోధ్యలో సీత దేవితో పన్నెండేళ్ళు సఖ జీవితం గడిపాడు రాముడు .దిన కృత్యం లో మార్పేమీ ఉండేదికాదు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శీలా సుభద్ర గారి అస్తిత్వ భావ రాగం -2

 

 

‘’నా ఆకాశం నాదే ‘’

ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది .ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి . సుభాద్రాదేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా .కాత్యాయనీ విద్మహే ‘’నా కృషి కురుతే కావ్యం ‘’ అనే భావాన్ని ఎక్కించుకొని కొత్తజన్మ ఎత్తని వాళ్ళు హేతువాదిగా ,సమతా వాదిగా కాలేరు .సుభద్రా దేవిగారిది కులమతాలకు అతీతమైన భావన .బాల్యం కోల్పోయినవారిని ,బతుకును క్రీడగానో ,కలగానో మార్చుకొన్న వాళ్ళను ,ఆర్ధిక దౌర్భాగ్యాలకు విలవిల లాడే మధ్య తరగతి వాళ్ళ ఆరాట ,పోరాటాలకు దిగిన వాళ్ళను గురించి రాశారు ‘’అన్నమాటలు ఇక వేరెవరూ అదనంగా చెప్పాల్సిన అవసరం లేదనిపించేవే .కనుక నా పని చాలా తేలికయినది .ఈ సంపుటిలో 34 కవితలు వివిధ శీర్షికలతో ఉన్నాయి ఇవి వివిధ పత్రికలో ముద్రణ పొందినవే ..అన్నీ అర్ధ వంతమైనవే నని పిస్తాయి చదువుతూ పోతుంటే .ఒక విహంగ వీక్షణం వేద్దాం .

తల్లి ‘’తులసి కోట దగ్గరే కొడి గట్టిన దీపమయ్యింది ‘’ఇక ఇంటి బాధ్యతా ఈమెదే .కొత్తబిచ్చగాడు పొద్దేరగడన్న సామెతగా ఆశాకిరణాలతో అంతా అలంకరించింది .’’ముళ్ళకు తాకిన పాద ముద్రల్ని అద్ది ‘’ అరుణారుణ రంగ వల్లికలతో’’ముంగిలి అలంకరిం చింది .మరి ‘’ఆశే కదా జీవితానికి పునాది !’’అని వేదాంతమూ వచ్చింది .’’రూపాంతరాలు చెందుతున్న మహిళల వెతల్ని విసిరిపారేయటానికి  ‘’పూనుకొని కొత్తతరాన్ని స్వాగతి౦చ టానికి సిద్ధమైంది .’’ఇక తూర్పువాకిలి తెరవటమే తరువాయి ‘’గా మిగిలింది అంటారు ‘’కొత్త పొద్దు ‘’అనే మొదటికవితలో .

naa aakasham nade 2 001 naa akasham nade -1 001

 

మగాళ్ళు ‘’మృగాళ్ళు ‘’గా చెలామణి అవుతూ విర్రవీగి వీధుల్లో తిరుగుతుంటే ‘’తల్లినీ సోదరినీ కూడా గుర్తించని కామం పొగమంచు ‘’ప్రపంచ దేశాల మీదుగా కప్పేసి౦దన్నారు .ఈ మృగాలు గ్రామాలు దాటి నగర ప్రవేశం చేస్తుంటే సుభద్రా దేవిగారికి ‘’యుగాంతం వచ్చినట్లే ‘’అనిపించింది ఇది సహజం .మాదక ద్రవ్యాలు ,కాలుష్యాలు ,సోదరిభావనే లేని కర్కోటక కీచకులు పెట్రేగి పోతున్నప్పుడు యుగాంతం వచ్చిందనే అనుకోవాలి .’’అనేకానేక బందురూపాలన్నీ కలగలసిపోయి –ఒకే ఒక్క మగాడిగా మాత్రమే తనను తానూ మలచుకోన్నప్పుడు ‘’ఆడది అనేది సుఖానికే కాని దేనికీ కాదనే భావం ప్రబలమై గర్భం లోనే చిదిమేస్తున్న వికృత పోకడలు పెరిగిపోయినప్పుడు ,రేపటి కాలం లో ‘’అద్దెకి కూడా గర్భం దొరకని కార్యేషు దాసుల ‘’గూర్చి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అన్నారు .ఇవన్నీ యుగా౦తా నికి సూచనలే అని తెలియ జెప్పారు .యుగా౦తా నికి గ్రహగతులు తప్పనక్కర లేదు  ,భూకంపాలు రానక్కరలేదు .’’రేపు కాకపొతే మరో రోజు పునరుత్పత్తి ఆగిపోతే –‘’అదే యుగాంతం కాదా ?అని ప్రశ్నించారు .నిజమే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది .దీనికి మనమందరం సమాధానం ఆలోచించాలి .బాధ్యతా వహించాలి .మౌలిక ప్రశ్న ఇదే ఇప్పుడు .

‘’ రేపటి తోలి వేకువ కోసం  నవ చైతన్యం తో ఆహ్వాన గీతికల్ని ‘’ఆలపించి స్వాగతి౦చటానికి పూనుకొంటే ‘’నిద్ర అమ్మైతన ఒడిలోకి –పొదుగు కొని తననీ తన ఆలోచనలను జోకోడుతుందోనని  ఒక ‘’ఉదయం కోసం ‘’ ఎదురు చూసే భావ చిత్రం గీశారు .’’స్పందన జీవ లక్షణం ‘’అని తెలియ జేస్తూ ‘’కనబడని రాతి గుండెని శరీరం లో దాచి –రాతి ముఖానికి మొసలి తొడుగు తగిలించి –జనాల మధ్య తిరిగి కార్చే కన్నీళ్లు ‘’ఉత్త ఉప్పు  నీళ్ళే కాని తన కోసం చెమర్చేవి కావు ‘’ అని హెచ్చరిస్తారు .’’నీకు నువ్వే ఆసరావై –మరొకరి చేతికి కర్రవై బతుకు, బతికించు –‘’అని సలహా చెప్పి రాతి మొకాన్ని మాత్రం తగిలించుకొని కనపడవద్దన్నారు .క్రికెట్ ఆటల్లో మజా అనుభవిస్తూ ,ఉద్రేకం తో నరాలు తె౦పు కొంటూ ఊగిపోతూ  డబ్బూ సమయం వ్యర్ధం చేసుకొనే వ్యసన పరులకు కూడా గాఢ హెచ్చరిక జారీచేసి ‘’గెలుపోటములు ముందే నిర్ణయమై పోయి –ఎవరు గెలిచినా ఎవరు ఓడినా –లాభ పడేది వాళ్ళే ‘’అంటే మాచ్ ఫిక్సింగ్ మాన్స్ ఫీల్డ్ లే బెట్టింగ్ అప్పారావు లే  అన్న నవీన క్రికెట్ సత్యాన్ని తెలియ జెప్పారు .ఇవన్నీ ‘’మెత్తటి ఉరి తాళ్ళు ‘’అని సార్ధక నామధేయం తగిలించారు .’’మాచ్ ఫిక్సిం గ్  రాజకీయ క్రీడలో –వెర్రిబాగుల  ప్రేక్షకులమై పొతే –మన మెడలకు కూడా క౦డువాలే ఉరి తాళ్లై మెత్తగా బిగుసుకొంటాయ్’’కనుక తస్మాత్ జాగ్రత్త –జాగ్రతోం జాగ్రత  . ‘’కవిత పేపరు మీద వాలితెకాని –నిద్రా దేవి రెప్పల పాన్పు పై విశ్రమించదు’’అని ‘’ఆలోచనకీ అక్షరానికి మధ్య’’ సంబంధం తెలుపుతూ ‘’అక్షరాలు మూటకడితేకాని అంతరాత్మ శాంతించదు’’అన్న ‘’కవి సత్యాన్ని’’ చెప్పారు .రాచకీయ నాయకమ్మన్యుల ప్రలోభాలకు వాగ్దానాలకు మెరమెచ్చులకు లొంగిపోయి చేతనున్న ఆయుధాన్ని విసిరిపారేసే ‘’నిరాయుదులం కాము ‘’అంటూ ‘’గోటి తోనో ఓటు తోనో ‘’వారి వాగ్దానాల బుడగల్ని ‘’టుప్’’మనిపించే సమర్ధులం అని  వార్నింగ్ ఇచ్చారు .

తనకు ఏ భావననైనా ప్రకటించుకొనే సావకాశం లేదట .లోపల సముద్రాలు గర్జిస్తాయి .అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి .లావా ఎగసి పడుతూనే ఉంటుంది .కాని వీటిని తెలుసుకోవాలంటే  గుండె  మీద వాలి వినాలి లేకపోతె అక్షరీకరించుకోవాలి .అంతేకాని మొగానికి ఆ భావాలను అతికి౦చు కోలేదట .అందుకే ‘’వేదనో నిర్వేదమో అంటూ చిక్కని ‘’మోనాలిసా చిరునవ్వు’’ లోని చిదంబర రహస్యాన్ని నేను ‘’అని చాలా భావ గర్భితం గా చెప్పారు .

‘’పుస్తకం శీర్షిక కవితాశీర్శికయే ‘’నాఆకాశం నాదే ‘’లో తన ధోరణిలో తనను నడవనిమ్మని ,ఏ దృష్టి కోణాన్ని ఏ రంగటద్దాలని తగిలించవద్దని ఏ ఛట్రం లోనూ బంధించవద్దని  వేడుకొంటారు సుభద్రాదేవి .’’రాత్రి పొడువునా సాహితీ బయళ్ళలో స్వేచ్చావిహారం చేయాలను ‘’కొంటారు .’’నాచేతనైనట్లు నాకోసం నేను –అచ్చంగా నాది అనుకొనే స్వంత గడ్డపై ‘’విహరిస్తుంటే తన వెనక పరుగేమిటి? అని నిలదీస్తారు .’’చెమ్మగిల్లిన గింజల్ని ఏరుకోన్నట్లు –పదాల్నియేరు కోవటమే ‘’తానూ చేస్తున్నాని నిజాయితీగా ప్రకటించారు .బక్క రైతు వేదన ,అహంకార బలదర్పాలకు బలి అయిన మూగ జీవి వేదన, స్వార్ధపు పెనుకోరల్లో చిక్కి విలవిల లాడే అభాగ్యునికి ఊరట తన కవితా వస్తువులని ‘’ఈ దృశ్యాల్ని సాహిత్యం లో అల్లుకొనే గూటి పక్షిని ‘’అనీ అంటారు .గూటి పక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని తానూ ఆలోచల్ని ఆలాపిస్తుంటే ‘’ఏ పంజరం లోనో బంధించి –ఏ చూరుకో వేలాడ దీయాలని ‘’చూడవద్దంటారు. తన స్వేచ్చ తనకు కావాలనిదానికి హద్దులు పెట్టవద్దని ‘’ కరాఖండీగా చెప్పిన తెగువ సుభద్రా దేవిగారిది .ఏ ఇజం ముద్ర తనకు తగిలించవద్దని కోరిన మనస్తత్వం ఆమెది  .తనకు అందరూకావాలి అందరికీ తానుకావాలనే విశాల హృదయ .

‘’కాలుష్య సంస్కృతిని ఎలాకాల్చాలో –అక్షరాల్లోనైనా అస్తిత్వ పోరాటాల్లోనైనా  ‘’కలిసి నడుద్దాం అంటూ ‘’కాసింత కలం అందివ్వండి ‘’అని సాయం కోరారు. అక్షర జీవుల్ని ఆసరాగా నిలవమని ప్రబోధమే అది .’’ఒక వర్షం లో మూడు దృశ్యాలు ‘’చూశారు సుభద్రా దేవి .ఏసీ రూమ్ లో బతుకు కోసం ఆడే అమ్మాయి శరీరాన్ని తలపోస్తూ ‘’రాక్ సంగీతం లో వంపులు తిరుగుతోందట వర్షాధార .అద్దాల్లోంచి చూస్తె త్రీడీ ఫోటోగ్రాఫ్ గా మనసుకు ఆహ్లాదమిస్తోంది . రెండో సీన్ లో చెట్టు నీడలోనో  చూరుకిందో గడిపే అమ్మాయి –‘’వర్ష ధార చుర కత్తి అయి చల్లగా శరీరాన్ని కోస్తోంది –బతుకు బట్ట చాటున గుండె కుంపటి రగిల్చి –కళ్ళ దీపాలని వెలిగించుకొంటూ ‘’ జీవన యానాన్ని ఆపకుండా ‘’జొన్న పొత్తుల చిటపటలతో చలిని తరిమి కొడుతోంది ‘’ఒక ముసలిది .ఉరమబోయిన మేఘం ‘’కళ్ళనిండా మెరుపుతో –ఓ నిమిషం విస్తుబోతూ ఆగిపోయింది .’’శ్రీశ్రీ భిక్షు వర్షీయసి మనకిక్కడ జ్ఞాపక మోస్తుంది .

మూడో దృశ్యం –నట్టిళ్ళలోకి కాలనాగై జరజరా పాకి అర్ధ రాత్రి ఆక్రమి౦చుకోటానికి  వస్తున్న వర్షపునీరు కూడా ‘’అతలాకుతలం అవుతున్న కుటుంబాల్ని చూసి కంట తడిపెట్టుకొన్న ఇళ్ళు సైతం  జలజలా నీటిని కురిపిస్తున్నాయి .ఈ మూడు దృశ్యాలను వైవిధ్యం తో కళ్ళకు కట్టించి రూపకాలంకారానికి పట్టం కట్టి కనువిందు మనసుకు విందు కవిత్వపు పసందు కూర్చారు .తన ప్రతిభా వ్యుత్పత్తులు బహుమతులు తెచ్చిపెట్టాయి .ఇవి వ్యక్తిగతం కాకుండా తన సామాజిక వర్గానికే చేసిన మతలబు ఏమిటో అర్ధం కాలేదట సుభద్రా దేవిగారికి .అందుకే శీర్షిక ‘’!’’అయింది వింతగా విశేషంగా .వార్ధక్యానికి కూడా వార్నింగ్ ఇచ్చారు –‘’నిస్త్రాణగా సొమ్మసిల్లిన శరీరానికి సైతం –ఉత్తేజాన్ని డయాలిసిస్ చేసినట్లు –మనసూ శరీరమూ ఉరకల లెత్తుతున్నాయ’’ట .అందుకే అక్షరాలతో ఆడుకొనే ,సాహిత్యం తో సరాగాలు పాడుకొనే తమ జోలికి వార్ధ్యక్యాన్ని  రావద్దన్నారు .తమవద్ద దాని పప్పులేమీ ఉడకవని తెలిపారు .

‘’అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే –‘’కాని దానినే పైకి ఎక్కే మెట్లుగా మార్చుకోవద్దని మంచి సలహా చెప్పారు .ఆ సోపానం ఎక్కి ‘’అడ్డ దార్లు తోక్కితేనే తంటా’’అనీ హెచ్చరించారు. లోకం పోకడ గమనించి చేసిన హెక్చరికేఇది .’’పరిమళ ప్రస్తారం ‘’కవితలో సుభద్రా దేవి ‘’ఆడ దాన్నో ఈడ దాన్నో మాత్రమె కాదు –సాహిత్య సుగంధాన్ని దోసిట్లో తీసుకొని –హృదయాలకు హత్తుకొనే అన్ని ప్రాంతాల దాన్నీ ‘’అని తాను  అందరకు చెందిన దానినని చాటి చెప్పుకొన్నారు ‘’ఈ నేల మీదికి పాకే భూ గంధాన్ని –పరిమళించే కవితా పుష్పాన్ని –శిలగా కాదు –శబ్దించే శిలాక్షరాన్ని –(శీలా క్షరం ?)ఎప్పటికీ అలానే ఉంటాను ‘’అని వాగ్దానమూ చేశారు .తన ప్రయాణం ఎటో అనే సందేహం లో ఊగిపోయారు ‘’ప్రయాణం ‘’కవితలో. తాను  వెతుకుతున్నది తనలోని తాత్విక చి౦తననా లేక చింతనకు దూరమౌతున్న తాత్వికతనా?అని మధన పడ్డారు .ఇది పక్వ దశకు సూచనగా మనం బావించాలి .సాహిత్య యానం లో మరిన్ని మైలు రాళ్ళను ప్రతిస్టించు కోవాలని ఆకాంక్ష ఉంది ఆమెగారికి .అందుకోసం రెండవ బాల్యం లాగా ‘’మళ్ళీ మొదలుపెట్టాల్సిందే‘’అని చెప్పి ‘’నిరంతర నిర్విరామ చైతన్య శీలత్వం కలిగిన వాడే మనిషి ‘’అని గొప్ప నిర్వచనం చేశారు .

‘’ చీడ పీడలు పట్టిన సమాజం చెట్టుని –ధర్మాగ్రహం తో సమూలంగా పెకలించేందుకు ‘’నాలుగు చేతులూకలిసి గునపం గా మారాల్సి౦దేనంటారు .చిరుకదలిక కోసం పాళీకి మరింత పదును పెట్టాల్సిందే –కలిసి నడవాల్సిందే ‘’అంటారు ‘’ధర్మాగ్రహం ‘’లో .’’మాట’’ఎన్నిరూపాలు చెందుతుందో చెబుతూ ‘’సమస్యల చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు ముడులు విప్పి బయట పడేస్తుంది మాట .జీవిత నౌక తుఫానులో చిక్కుకోన్నప్పుడు తెరచాపై వాలుకు తీసుకొని వెడుతుంది .దుఖం తో తడిసి ముద్ద అయినప్పుడు చల్లని హృదయమై సేద తీరుస్తుంది .బాధల ఎర్రటి ఎండకు గొడుగై నీడనిస్తుంది .మనుషుల మధ్య వంతెనై కలుపుతుంది.అల్లు కున్న స్నేహలతకు విచ్చుకొన్న పరిమళ మవుతుంది .మనసుని మైమరపించే వెన్నెల సోన అవుతు౦ది .మాట.ఒక్కో సారి గుండెల్ని ముక్కలు చేసే తప్పుడు మాట అవుతుంది .హృదయాన్ని మధించే కవ్వమవుతుంది .పచ్చని బతుకుల్ని బుగ్గి చేస్తుంది. కనుక మాటను జాగ్రత్తగా వాడాలి .

‘’పరాయీకరణ ‘’ను గురించి బాధ పడుతూ ‘’నేనెక్కడో తప్పిపోయాను ‘’అని చెంప దెబ్బ కొడతారు .’’నాలోంచి నేను తప్పి పోతూనే ఉన్నాను .శూన్యం ఆవరించింది దాన్ని. నింపే ప్రయత్నం లో ‘’నాలోకి నేను నా ప్రయత్నం లేకుండానే చొచ్చుకు పోతున్నాను ‘’అని కలవర పడ్డారు .చివరికి ‘’ఈ కొత్త మేనుతో –నేను మనిషిని కాకుండా పోతున్నానా ?’’అని ఆవేదన వ్యక్తం చేస్తారు .ఆమె ఆరాటం మన౦దరిఆరటమే.మనమనసుని ఆమె అక్షరాల్లో ఆవిష్కరించారు అంతే .    ఈ రెండు సంపుటులలోని కవిత్వం ఒకే నాణానికి బొమ్మా బొరుసూ తప్ప వేరేమీకాదు అంతటి సన్నిహిత్వమున్నకవితలు .సుభద్రా దేవిగారి పరిపక్వ కవిత్వానికి ప్రతిదీ ఉదాహరణగానే చెప్పచ్చు .అద్భుత భావనకు అవసరమైన పదాల కూర్పు నేర్పు గా కనిపిస్తుంది .విషయం సూటిగా గుండెలోకి చొచ్చుకు పోతుంది .పదబంధాలూ ,పద చిత్రాలూ ఆకర్షణీయంగా ఉంటాయి .ఏదీ కృత్రిమంగా ఉండదు .సహజ సౌందర్యమే కనిపిస్తుంది  సుభద్రా దేవిగారికి కావాల్సింది వనితకు అభద్రతా భావం తొలగి సుభద్రత కలిగించటం .అబలకాదు సబల అని నిరూపించుకోవటం .స్త్రీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం .వాళ్ళ అస్తిత్వానికే పెద్ద పీట వేశారు .ఆడపిల్లల జీవితాలతో ఏ దశలోనూ ఆడుకోవద్దని ,ఏ దశలోనూ అడ్డుకోవద్దని మగజాతికి  హెచ్చరిక ఉంది .వ్యామోహాల వెంట పడి ‘’మబ్బు లోని నీళ్ళు చూసి ముంత వలక బోసుకో వద్దు ‘’అన్న ముందు చూపూ ఉంది .మహిళ అన్నిరంగాలలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి స్వయం వ్యక్తిత్వం తో భాసించాలి .ఎవరి దయా దాక్షిణ్యాలపై సానుభూతి పై  జీవించ రాదు .పరిస్తితిని తన చేతికి చిక్కించుకొని నిలబడి వాలుప్రవాహమైనా ఎదురు ప్రవాహమైనా ధైర్యం తో సాగాలి .పరిస్థితులకు బానిస కారాదు .రెండు సంపుటాలలోనూ స్త్రీయే కధా వస్తువు ఎక్కువ కవితలలో . మొదటిదైన ‘’అస్తిత్వ రాగం ‘’చూస్తె నాకు మాత్రం ఆధునిక భారతం లో ‘’స్త్రీ పర్వం ‘’అని పించింది . రెండవదైన ‘’నా ఆకాశం ‘’లో సుభాద్రాదేవిగారు ఒక తల్లిగా సోదరిగా హితైషిగా, సమాజ శ్రేయస్సుకోరే మానవీయ మూర్తిగా దర్శన మిస్తారు .ఈ రెండూ కలిస్తే శీలా సుభద్రా దేవి గారి ఆంతర్యమే ఆవిష్కరింప బడిందని అర్ధమవుతుంది .ఆమె కున్న సౌజన్యం, సహనం  ,సంయమనం కవితలలో వ్యక్తమవటం గొప్ప విషయం .

వీర్రాజు గారి కవిత్వం లోను ,సుభద్రా దేవిగారి కవిత్వం లోను ‘’కోటబుల్ కోట్స్ ‘’కోసం వెతుక్కోనక్కర లేదు .అంతేకాదు ఇద్దరి పుస్తకాలకు ఎవరి ము౦దు మాటలూ ,పరిచయాలు ఉండవు .అదొక ప్రత్యేకత కూడా .నిజంగా వారికీ ఆ అవసరమూ లేదు అని చదివితే మనకు తెలిసి పోయే విషయం .చదవాలి అనుభవించాలి .ఆనుభూతిని అందరితో పంచుకోవాలి అంతే .

ఈరెండు పుస్తకాలను నాకు అందజేసినందుకు శ్రీమతి  సుభద్రా దేవి గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ  వాటిని పరిచయం చేసే అదృష్టం సాహితీ బంధువులకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు
మన సంస్కృతిలో పతంజలి యోగ సూత్రాలకు ఒక విశిష్టమైన స్థానముంది. ఈ సూత్రాలను అర్థం చేసుకుంటే యోగం గురించి, మానవ జీవన విధానం గురించి ఉన్న రకరకాల సంశయాలు తొలగిపోతాయి. ఈ యోగసూత్రాలకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్‌ అందిస్తున్న వ్యాఖ్యానం..
సూత్రం అనే సంస్కృత పదానికి దారం లేదా తాడు అని అర్థం. వస్తువులను కలిపి ఉంచేది, సూత్రం అంటే క్లుప్తంగా చెప్పబడినది, సూక్తి అనే అర్థంలో కూడా వాడుతారు. యోగసూత్రాలను సంకలనం చేసినవాడు పతంజలి. యోగ సాధన అనుభవపూర్వకంగా ఎలా చేయాలి, వాటి వెనుక గల ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి మొదలైన విషయాల్ని క్లుప్తమైన సూత్రాల రూపంలో మనకు అందించాడు. గాలిపటం ఒకే దారపు పోగు(సూత్రం) సహాయంతో ఆకాశంలో ఎగురుతూ ఆశ్చర్యకరమైన ఎత్తుకు చేరుకుంటుంది. మన జీవితమనే గాలిపటానికి పతంజలి యోగసూత్రాలు దారాలవంటివి. ప్రతీ ఒక్క సూత్రమూ జ్ఞానం, యోగ సాధన, విధానాలతో నిండి మనకు లభించింది. ఈ సూత్రాలు మన బుద్ధిని సరియైున దారిలో పెట్టడం మాత్రమే కాదు, ఈ 21 వ శతాబ్దపు జీవనవిధానంలో మన శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునే మార్గాన్ని చూపుతాయి.
జ్ఞానదీపిక
జ్ఞానాన్ని అందించేందుకు అత్యంత విశిష్టమైనది, అద్భుతమైనది అయిన ప్రక్రియ ఏమంటే చెప్పదలచుకున్న దానిని ఒక కథగా మలచి చెప్పటం. కాబట్టి మనం ఇప్పుడు ఒక కథతో మొదలుపెడతాం.
అనగా అనగా, చాలాకాలం క్రితం, మునులు, ఋషులు అంతా కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. విష్ణువు ధన్వంతరి అవతారంలో ఆయుర్వేదం అనుగ్రహించి, రోగాలకు చికిత్సలను అందించినప్పటికీ, ప్రజలు ఇంకా అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారని విష్ణుమూర్తికి తెలిపి, ప్రజలు అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలో తెలుపమని శ్రీహరిని ప్రార్థించారు. కేవలం శారీరకమైన అనారోగ్యమే కాదు. మానసికమైన, భావనాపరమైన అనారోగ్యానికి కూడా చికిత్స అవసరమే కదా. కోపం, కామం, అసూయ, ద్వేషం మొదలైనవి అనారోగ్యాలే. మరి వీటిని పోగొట్టుకోవటం ఎలా? దీనికి చికిత్స ఏమిటి?
శ్రీమహావిష్ణువు వేయి పడగలు కలిగిన ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు. ఋషులు ఆయనను సమీపించగానే ఆయన వారికి ఆదిశేషుని ఇచ్చివేశాడు. ఆదిశేషుడంటే జాగ్రదావస్థ. మెలకువకు సంకేతం. ఆ ఆదిశేషుడే భూమిపై పతంజలిగా జన్మించాడు. ఈ విధంగా పతంజలి జన్మించి మనకోసం యోగ జ్ఞానాన్ని అందించాడు. అవే పతంజలి యోగ సూత్రాలుగా ఖ్యాతి పొందాయి. ఆ యోగ సూత్రాలు తెలుపటానికి కనీసం 1000 మంది ప్రజలు ఒకే చోట కూర్చుని ఉంటేగాని చెప్పను అని షరతు పెట్టడంతో, వెయ్యిమంది ప్రజలు వింధ్యపర్వతాలకు దక్షిణదిశగా సమావేశమైనారు. పతంజలి మరో షరతూ పెట్టాడు- వింటున్న శిష్యులకు, అతనికి మధ్యగా ఒక తెర ఉంచాడు. ఆ తెరను ఎవరూ తొలగించకూడదు. పాఠం మధ్యలో ఎవరూ లేచి వెళ్ళిపోరాదు. పూర్తయ్యేదాకా అందరూ అక్కడే ఉండాలి. ఆ విధంగా పతంజలి మహర్షి అక్కడ కూర్చున్న వేయిమంది శిష్యులకూ జ్ఞానప్రసారం గావించాడు. ప్రతీ ఒక్కరూ జ్ఞానాన్ని అందుకున్నారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తెరవెనుక, కనిపించకుండా గురువు- ఒక్కమాటైనా మాట్లాడకుండా తమకు అందరికీ జ్ఞానం అందటం- గురువు తమలో ప్రతీ ఒక్కరికీ విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చేస్తున్నారా అనేది అద్భుతంగా అనిపించింది. అందరూ అశ్చర్చచకితులై ఉండిపోయారు. వారిలో ప్రతీ ఒక్కరిలోనూ అద్వితీయమైన శక్తి, అనిర్వచనీయమైన ఉత్సాహం ఎంత ప్రవేశించిందంటే, దానిని తమలో ఉంచుకోవటమే కష్టమైంది. అయినా వారంతా క్రమశిక్షణను పాటించాల్సిందే కదా! అయితే వారిలో ఒకడు చిన్నపిల్లవాడు. అతనికి హఠాత్తుగా లఘుశంకకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అతడు బయటకు వెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా వెళ్ళి వచ్చేస్తే సరిపోతుందిలే అనుకున్నాడు. ఇంతలో మరొకరికి ఉత్సుకత పెరిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో చూద్దాం’’ అనుకున్నాడు.
ఆ పిల్లవాడు తెరవెనుకకు తొంగి చేసేడా? వచ్చేవారం తెల్సుకుందాం.
72 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- ుూనా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా…
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా
నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు,
చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవన వృక్షం

జీవన వృక్షం

మనిషి జీవితాన్ని వర్ణించడానికి చెట్టును ఉపమానంగా చెప్పడం వైదిక సాహిత్యం మొదలుగా చాలాచోట్ల చూడగలం. జనన మరణ చక్రంలో కొట్టుకుని తిరిగే మనిషి జీవితాన్ని వివరించడానికై యుజర్వేదానికి చెందిన కఠోపనిషత్తు అనేక అందమైన ఉపమానాల్ని చూపింది. అందులో ఒక ప్రధానమైన ఉపమానం చెట్టు. ఈ ఉపమానాన్నే భగవద్గీతలో(15-1) చూడగలం.
పై ఉపమానాన్ని వ్యాఖ్యానించిన పండితులు అది జీవితానికి ఎలా అన్వయిస్తుందో వివరించారు. చెట్టు ఎలాగ దృఢమైన వ్రేళ్లు నాటుకొని ఉంటుందో అలాగే మనిషి దృఢమైన బంధాల్ని పెంచుకొని ఉంటాడు. చెట్టుకు ఎలాగ బలమైన స్కంధం ఉంటుందో అలాగ మనిషికి నేను అనే భావన బలమైన స్కంధంలాగ ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొనే మిగతా కొమ్మలు, ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ ఉంటాయి. కోరికలు అనే నీటితో తడపబడి బలమైన వ్రేళ్ళు కలిగినదట ఈ చెట్టు. మనిషి చేసే మంచి, చెడు పనులకు అనుగుణంగా ఫలాలు, పుష్పాలు ఉంటాయట. సుఖం, దుఃఖం లాంటి అనుభవాలే వీటి రసం. ఫలాలు. పుష్పాలు రాలిపోవడం, కొత్తవి రావడం ఎల్లప్పుడూ మారుతూ ఉండే స్వభావానికి చిహ్నం. ప్రపంచంలో ఎన్నో ఆశగొలిపే విషయాలు మనల్ని ఊరిస్తూ కర్మల్ని చేయిస్తూ ఉంటాయి.
కానీ ఆశ్చర్యమేమంటే ఈ చెట్టు తలక్రిందులుగా ఉంటుంది. భూమిలో ఉన్న వ్రేళ్ళను ఎలా చూడలేమో అలాగే ఆకాశంలో ఉన్న దీని మూలాల్ని మనం చూడలేం. కిందివైపునకు వ్యాపించి ఉన్న చెట్టు యొక్క కాండము, విశాలమైన కొమ్మలు, వాటినుండి చిరుకొమ్మలు, ఫలాలు, పుష్పాలు, మొదలైనవన్నీ కనిపిస్తాయి. చెట్టులో ఉన్న తొర్రలు, పక్షుల గూళ్ళు మనిషి తన కర్మఫలంగా పొందే అనేక లోకాలకు చిహ్నాలు. ఇంత దృఢంగా కనిపించినా దీన్ని నరికివేయడానికి వైరాగ్యము, దాని వల్ల కలిగే జ్ఞానం అనే కత్తి ఉన్నదట. అందుకే ఈ చెట్టును అశ్వత్థం అన్నారు. సంస్కృతంలో ‘శ్వః’ అంటే రేపు అని అర్థం, ‘అశ్వత్థం’ అంటే రేపటికి నిలిచి ఉండనిది, అశాశ్వతమైనది అని అర్థం. జ్ఞానం కలగనంతవరకూ మనల్ని దృఢంగా బంధించి ఆశగొలిపే ఈ చెట్టు జ్ఞానం కలిగిన మరుక్షణంలో ఎండమావిలా తేలిపోతుంది.
కర్మయోగం గురించి వ్రాసిన మునుపటి వ్యాసాల్లో మనిషి చేసే వివిధ రకాల కర్మలు, వాటి ఫలాల గురించి గమనించాం. జీవితం అనే చెట్టు అనేక ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఫలాల్ని తింటున్నంత కాలం మనిషి జీవితం, మరణమనే చక్రంలో తిరుగుతూంటాడని కూడా చూశాం. ఈ కర్మఫలాన్ని తినకుండా ఉండటం అంటే నిష్కామకర్మ (మునుపటి వ్యాసాల్లో తెలుసుకున్నాం) చేయడం. అంటే జీవుడు పై చెట్టు ఫలాన్ని తినకపోవడం, శ్రీకృష్ణుడు ఈ విషయాన్నే అర్జునుడికి బోధిస్తూ కర్మకు ఫలితంగా వచ్చే జననమరణచక్రానికి నువ్వు కారణం కావద్దు అని చెబుతాడు. ఈ చెట్టుకు కారణమూ మనిషియే, దీని నాశనానికి కారణమూ మనిషియే. దీని నాశనానికి కారణమూ మనిషియే. శరీరం, ఇంద్రియాలు వీటన్నిటితో నేను అనే భావన ముడిపడి ఉన్నంతవరకూ అతడు జీవుడు, చెట్టుకు కారకుడు. పై భావన తొలగిపోయినప్పుడు జీవుడు తను ఆత్మ స్వరూపుడని తెలుసుకొని చెట్టును చేధించివేస్తాడు.
పై చెప్పిన చెట్టు, కర్మఫలం అనే ఉపమానాన్నే మరింత వివరిస్తూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ముండకోపనిషత్తులు చెప్పాయి. ఒకే చెట్టుపై రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఆ చెట్టుయొక్క ఫలాన్ని తింటుంది. మరొక పక్షి ఆ ఫలాన్ని తినదు కేవలం ప్రకాశిస్తూ ఉంటుంది. మనిషి యొక్క శరీరం, మనస్సు, ఇంద్రియాలే ఈ చెట్టు. జీవుడు, ఆత్మయే పక్షులు. కర్మఫలాన్ని తినే పక్షి జీవుడు. కర్మఫలం తినకుండా కేవలం శుద్ధచైతన్య రూపంలో ఉన్న పక్షి ఆత్మ. కర్మయోగాన్ని అనుసరిస్తే జీవుడు కర్మఫలాన్ని తప్పించుకుంటాడనీ, తన స్వరూపాన్ని ఆత్మగా తెలుసుకుంటాడనీ పై మంత్రాలయొక్క అర్థం. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు కూడా వివరించాడు.
బౌద్ధ, జైన సంప్రదాయాల్లో కూడా చెట్టును ప్రతీక (టడఝఛౌజూ) గా చెప్పడం గమనిస్తాం. పోతే ఇది తలక్రిందులుగా కాక నిటారుగా ఉన్న చెట్టు. బోధి వృక్షం క్రింద ధ్యానం చేస్తున్న బుద్ధునికి జ్ఞానోదయమైనదని మనం చదివాం. బుద్ధుడు ధ్యానం చేసినది జీవితమనే చెట్టు గురించి, దానిలోని ఆకర్షణలు, బంధాలు, వాటివల్ల కలిగే దుఃఖం గురించి. ఆ సమయంలోనే మన్మథుడు, అప్సరసలు మొదలైనవారు బుద్ధుణ్ణి తమవశం చేసుకోవడానికి ననప్రయత్నించడం, బుద్ధుడు వాటికి లొంగకపోవడం కూడా చదివాం. వీటన్నిటినీ ప్రతీకలుగానే గ్రహించాలి కానీ వారి మధ్య పెద్ద యుద్ధం జరిగినట్లు, బుద్ధుడిపై మన్మథుడు బాణాలు వేసినట్లు, ఆయన వాటికి చలించనట్లు భావించకూడదు. బుద్ధునికి జ్ఞానోదయం కావడం బుద్ధుని గొప్పదనమే కాని చెట్టు మహిమ కాదు. అయినా మనం బౌద్ధగయ వెళ్ళినపుడు జీవితాన్ని గురించి గాక ఆ చెట్టే జ్ఞానం ఇస్తుంది అన్నట్లుగా దాని క్రింద కొద్దిసేపు ధ్యానం చేసి వస్తూంటాం.
వైదిక సాహిత్యంలో చెప్పిన ఈ చెట్టు ఉపమానం మిగతా సంస్కృతుల్లో కూడా దాదాపు ఇదే పద్ధతిలో ఉన్నట్టు చూడగలం. ఉదాహరణకు ఆడం, ఈవ్‌ ల కథ. ఆ కథలో చెట్టు ఫలాన్ని తినేది ఈవ్‌. మన కథలో జీవుడితో ఈవ్‌ ను పోల్చవచ్చు. ఫలాన్ని తిననిది ఆడం, మన కథలో ఆత్మతో ఆడం ను పోల్చవచ్చు. ఫలాన్ని తిననంతకాలం వాళ్ళిద్దరూ దైవికజ్ఞానమనే ఆనందమయ స్థాయిలో ఉండేవారు. కర్మఫలాన్ని తిన్న జీవుడు ఎలా బంధాన్ని పొందుతాడో అలాగే ఆ చెట్టు ఫలాన్ని తిన్న ఈవ్‌ కు దైవికజ్ఞానం నశించి లౌకికజ్ఞానం కలుగుతుంది. అంతకు పూర్వం గర్భధారణ, ముసలితనం, మరణం అనేవి లేవు. ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయి. వారిద్దరూ అమాయకత్వాన్ని, ఆనందాన్ని కోల్పోవడం, దేహాభిమానం ఏర్పడి తాము నగ్నంగా ఉన్నామని భావించడం మొదలైనవన్నీ ఆ కథలో చూడగలం. అంతవరకూ మంచి, చెడు అనే భావాలకు అతీతంగా, భగవంతుడికి సన్నిహితంగా ఉండేవారు. ఫలం తిన్న తర్వాత మంచి, చెడు అనే ఆలోచనలు మొదలై భగవంతుడికి దూరమయ్యారు. జ్ఞాని అయినవాడు మంచి చెడులకు, వాటివల్ల కలిగే పుణ్యపాపాలకూ అతీతంగా ఉంటాడనీ, అలా కానప్పుడు పుణ్యపాపాల్ని పొందుతుంటాడని ఉపనిషత్తు చెప్పే భావాన్నే పై కథలో కూడా గమనించగలం.
పురాణాల్లో మనం గమనించే కల్పవృక్షం కూడా మనిషి జీవితానికి ప్రతీకయే. ఇది ఎక్కడో దేవలోకంలో ఉన్నదని భావించనక్కరలేదు. కల్పన అంటే ఒక వస్తువును గొప్పగా భావించడం, దానికై ప్రయత్నించడం. ఆ కోరిక తీర్చే చెట్టే కల్పవృక్షం. జీవితంలో ఎలాంటి కోరికలుంటాయో అలాంటి ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి ప్రయత్నం చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. మనకున్న శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహమే ఈ కల్ప వృక్షం. ఈ చెట్టు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అని భగవద్గీత చెబుతుంది.
పురాణాల్లో మనం గమనించే కల్పవృక్షం కూడా మనిషి జీవితానికి ప్రతీకయే. ఇది ఎక్కడో దేవలోకంలో ఉన్నదని భావించనక్కరలేదు. కల్పన అంటే ఒక వస్తువును గొప్పగా భావించడం, దానికై ప్రయత్నించడం. ఆ కోరిక తీర్చే చెట్టే కల్పవృక్షం. జీవితంలో ఎలాంటి కోరికలుంటాయో అలాంటి ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి ప్రయత్నం చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. మనకున్న శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహమే
ఈ కల్ప వృక్షం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోకలు చేరిస్తే స్టార్లవుతారా?…కైకాల సత్యనారాయణ నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

తోకలు చేరిస్తే స్టార్లవుతారా?…కైకాల సత్యనారాయణ నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

పూర్వం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. నటనలో ఒకరిని మించి మరొకరు చేయాలన్న పోటీతత్వం ఉండేది. అదే ఇప్పుడు చూసుకుంటే ఈర్ష్యాభావంతో ఉంటున్నారు. అవతలి వాడికి సాంగ్‌ ఉంటే నాకూ సాంగ్‌ ఉండాలనే రీతిగా ఉంటున్నారే తప్ప ఫలితం బాగుండాలనే వాతావరణం లేదు. దీనికి కొంతవరకు మీడియా కూడా కారణం. ఒకప్పుడు విమర్శ కూడా నిష్కర్షగా ఉండేది. మంచిని మంచిగా, తప్పుల్ని తప్పులుగా చూపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కలెక్షన్‌కింగ్‌, రెబల్‌స్టార్‌, మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ ఏంటి ఇవన్నీ… నటీనటులందరూ సమానమే కదా. మంచి ఉంటే పొగడండి, చెడు ఉంటే విమర్శించాలి. అప్పుడే నటులకి మంచి చేసిన వాళ్లవుతారు. అలాకాకుండా అనవసరంగా పొగడడం వల్ల కృషి లేకుండానే పెద్ద వాళ్లని చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
దాదాపు 800 సినిమాల్లో నటించిన అరుదైన తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా పలు పాత్రల్లో తనదైన ముద్రను వేసిన సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానానికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటికి సినీరంగంలో వచ్చిన మార్పులపైన ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
 
మీరు పోషించిన నవరసాల్లో మీకు బాగా నచ్చే పాత్ర ?
ఫలానాదే నచ్చుతుందని చెప్పలేను. అన్నీ బాగానే ఉంటాయి. శృంగార రసం బాగుంటుంది. కానీ మొరటుగా ఉన్నవాళ్లు శృంగార రసం ఒలికిస్తే చూసేందుకు బాగుండదు. హాస్య రసం చూసేందుకు, చేసేందుకు రెండు విధాలా బాగుంటుంది. ఎందుకంటే హాస్యరసం చేసేటప్పుడు బరువుగా అనిపించదు. మరీ బరువైనది భయానకం, రౌద్రం… ఇందులో హావభావాలతోపాటు శారీరకంగా కూడా పలికించాలి. నాకు కరుణరసం (సాత్వికం) అంటే మహా ఇష్టం. నేను నెంబర్‌ వన్‌ విలన్‌గా ఉన్న రోజుల్లోనే ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో పాథటిక్‌ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమాలో నా నటన చూసి ‘అత్తగారు కొత్త కోడలు’లో అవకాశం ఇచ్చారు. ‘శారద’ సినిమా అయితే నా జీవితాన్నే మార్చేసింది. ప్రేక్షకుల నుంచి రోజుకి వేల ఉత్తరాలు వచ్చేవి. వాటన్నిటి సారాంశం ఒకటే ‘‘జీవితంలో మాక్కూడా మీలాంటి అన్న ఉంటే ఎంత బాగుండేద’’ని. కరుణ రసం నాకు పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కామెడీ పాత్ర చేశాను. అప్పట్నించి కామెడీ పాత్రలు మొదలయ్యాయి. ఇన్ని రకాల పాత్రలు చేసే అవకాశం లభించడం నా అదృష్టం. దానికంటే కూడా ప్రేక్షకులు నన్ను అన్ని పాత్రల్లో అంగీకరించడం ఆనందించే విషయం.
మీ అభిరుచులు…
పాత సినిమాలు చూస్తాను, సరదాగా స్నేహితులతో కలిసి పేకాట ఆడతాను. ఈ మధ్య కాలంలో పవన్‌కల్యాణ్‌ సినిమా టీవీలో వస్తుంటే చూశాను. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే ప్రైవసీ ఉండదు. అందుకే వెళ్లను. పూర్వం సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఇండస్ర్టీలో ఉన్న ప్రొడ్యూసర్లని, దర్శకులని, నటీనటుల్ని పిలిచి ప్రివ్యూ వేసేవారు. కాని ఇప్పుడు… ఉన్న కొద్దిమంది పాత ఆర్టిస్టుల్ని పిలిచి గౌరవంగా సినిమా వేసి చూపిద్దామని ఏ ఒక్క నిర్మాతకి గాని, హీరోకి గాని లేదు. ఆఖరికి మేం నటించిన సినిమాలు కూడా మాకు చూపించడంలేదు. ఇంట్లోనే పాత సినిమాలు చూస్తుంటాను. ఆ సినిమాల్లో చక్కటి సెంటిమెంట్‌, మోరల్‌, మంచి సంగీతం ఉంటాయి. మైథాలజీలు చూస్తుంటే కళ్లకి, చెవులకి విందు. పాతాళభైరవి సినిమాలో ‘కలవరమాయె మదిలో…’ పాటను ఆరు షాట్లతోనే చిత్రీకరించారు. ఆ ఆరు షాట్లలో నటీనటుల ముఖ కవళికలు, హావభావాలు, అందచందాలు ఎంత చక్కగా చూపించారు. పాట వింటే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడొస్తున్న సినిమా పాటల్లో ఒక్క ముక్కా వినిపించదు. అర్థం కాదు. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం? చూసి ఆనందించడానికే కదా. అంతేగాని హత్యలు, కేకలు, పెట్రోల్‌ పోసి తగలబెట్టడాలు, గొడ్డళ్లతో నరుక్కుంటుంటే చూసేందుకా వెళ్లేది. మిగతా వాళ్ల సంగతేమో గాని నేను మాత్రం అలాంటివి చూడను. సినిమా ఈజ్‌ మెంట్‌ ఫర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అంతే ఉండాలి కాని జుగుప్స కలిగించే విధంగా, భయంకరంగా, భీకరంగా ఉండకూడదు. చూసినంత సేపు ఎంజాయ్‌ చేసి రిలాక్స్‌ అవ్వాలి.
ఆరుతరాల నటీనటులతో కలిసి నటించారు కదా. అప్పటికి… ఇప్పటికి ఏమైనా తేడాలు కనిపించాయా?
సిఎ్‌సఆర్‌, నాగయ్యగారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌. కృష్ట, శోభన్‌ బాబు, జగ్గయ్య, కాంతారావు. చిరంజీవి, సుమన్‌. బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌. ఎన్టీఆర్‌, మహే్‌షబాబు. ఇలా మొత్తం ఆరు తరాలతో కలిసి నటించాను. ముఖ్యంగా చెప్పాలంటే ముందు తరాల వాళ్లలో అంకితభావం కనిపించేది. ఒక పాత్ర ఇస్తే అందులో లీనమైపోయేవారు. కళని దైవంగా భావించేవారు. పూర్వం నటనను ప్రకృతికి ప్రతిబింబంలా భావించే వాళ్లు. ఇప్పుడంటే అంతా స్పీడుమయం. రోజుకి నాలుగైదు సీన్లు చేయిస్తుంటారు. అదే పూర్వం రోజుల్లో తీసుకుంటే ఎల్వీప్రసాద్‌, బిఎన్‌రెడ్డి, కెవిరెడ్డిగార్లు ఒక రోజుకి ఒక సీన్‌ని ప్లాన్‌ చేస్తే ఆ ఒకటే చేయించేవాళ్లు. దాని తాలూకు షూటింగ్‌ నాలుగ్గంటలకల్లా పూర్తయితే ప్యాకప్‌ చెప్పేసేవాళ్లు. టైం ఉంది కదా అనడిగితే… ‘‘రేపు చేద్దాం ఏంపోయింది. చక్కగా తీసుకుందాం’’ అనేవాళ్లు. ఆ తరం వాళ్లకు కళ పట్ల తపన ఉండేది. సహజత్వం ఉండేది. అలాగే టైంకి మేకప్‌ వేసుకుని సెట్‌లో ఉండేవాళ్లం. పొద్దున్నే నాలుగున్నరకి లేపి టీ ఇచ్చి వెళ్లేవాళ్లు. మళ్లీ అరగంటకి వచ్చే వాళ్లు. ఆ అరగంటలోపులో స్నానం చేసి, పది నిమిషాలు వ్యాయామం చేసి సిద్ధంగా ఉండేవాళ్లం. ఐదుంబావుకల్లా బయల్దేరి స్టూడియోకి వెళ్లిపోయి మేకప్‌, డ్రస్సింగ్‌ చేసుకునేవాళ్లం. టిఫిన్‌ చేసి సెట్‌లోకి వెళ్లే వాళ్లం. అప్పట్లో ఎవరు పెందలకడ వస్తే వాళ్లు గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద ఆర్టిస్టులు కదా. అంత తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. నటనాపరంగా కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకరికంటే ఒకరు బాగా చేయాలనుకునేవాళ్లు. ఇప్పుడు ఈర్ష్యాభావంతో ఉంటున్నారే తప్ప ఆరోగ్యకర వాతావరణం కనిపించడం లేదు.
మీ కుటుంబ సభ్యులకి మీరు పోషించిన పాత్రల్లో వేటిని ఎక్కువగా ఇష్టపడతారు?
ఆవిడకి సెంటిమెంట్‌ ఉన్న పాత్రలు నచ్చేవి. మా అమ్మాయిలయితే అవి చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు కూడా. విలన్‌ పాత్రలు నచ్చేవి కావు. ఇప్పుడు నా సినిమాలు నా మనవళ్లు, మనవరాళ్లు చూస్తారు. మాకు ఇద్దరమ్మాయిలు ఇద్దరబ్బాయిలు. పెద్దమ్మాయి మద్రాసులో ఉంటుంది. పెద్దబ్బాయి హైదరాబాద్‌లో ఉంటాడు. రెండో అబ్బాయి బెంగళూరులో, రెండో అమ్మాయి రెండేళ్లక్రితం వరకు అమెరికాలో ఉండి ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేసింది. మా కుటుంబం నుంచి నటనా రంగంవైపు ఎవరూ రాలేదు. మా తమ్ముడు, అబ్బాయిలు నిర్మాతలుగా ఉన్నారు. ‘రమ ఫిల్మ్స్‌’ పేరిట ఎనిమిది సినిమాలు తీశాం. మా రెండో అబ్బాయి కన్నడ సినిమాలు, సీరియల్స్‌ తీస్తున్నాడు. ఈ మధ్య మా రెండో అమ్మాయి కొడుకు నటనపట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. కాని పిల్లలు కదా వాళ్ల ఆలోచనలు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. నా వరకు మాత్రం మంచి కథతో, నాకు తగ్గ పాత్ర వస్తే నటించేందుకు సిద్ధం.
దాదాపు 800 సినిమాల్లో నటించిన మీ నటనా జీవితంలో మర్చిపోలేని సంఘటనలేవైనా…
మద్రాసులో ఉండి సినిమాల్లో ప్రయత్నిస్తున్న రోజుల్లో ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేయమని ఒత్తిడి ఉండేది. నాకేమో ఏం సాధించకుండా వెనక్కి తిరిగి వెళ్లాలనిపించలేదు. ఒక సాయంత్రం పనిపిల్లని పంపించి కాఫీ తెప్పించుకుని తాగాను. ఆఖర్న చూస్తే కాఫీ గ్లాసు అడుగున చచ్చిన సాలీడు కనిపించింది. నాతోపాటు రూమ్‌లో ఉన్న వాళ్లు సాలీడు విషంతో సమానం. డాక్టర్‌ వద్దకు పోదామన్నారు. డాక్టర్‌ దగ్గరకి రానన్నాను. తెల్లారి లేచేసరికి బతికుంటే భవిష్యత్తు ఉన్నట్టు. ఒకవేళ పోయానా ప్రాణంతో పాటు నా కష్టాలూ పోయినట్టేనని నిద్రపోయాను.
యుగపురుషుడు సినిమా షూటింగ్‌లో రామారావుతో ఫైటింగ్‌ సీన్‌. ఆయన నాగలి వంటి ఆయుధంతో నన్ను కొడతారు. నేను తప్పుకుంటే అది పిల్లర్‌లో గుచ్చుకుపోవాలి. కాని ఆయన రాంగ్‌ టైంలో రావడంతో నా కణత పక్కగా దెబ్బ తగిలింది. అంతటితో అయిపోయిందనుకున్నాను. కాని డాక్టర్‌ వచ్చి మందు ఇచ్చాక కోలుకున్నాను.
అప్పట్లో సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఇండస్ర్టీలో ఉన్న ప్రొడ్యూసర్లని, దర్శకులని, నటీనటుల్ని పిలిచి ప్రివ్యూ వేసేవారు. కాని ఇప్పుడు… ఉన్న కొద్దిమంది పాత ఆర్టిస్టుల్ని పిలిచి గౌరవంగా సినిమా వేసి చూపిద్దామని ఏ ఒక్క నిర్మాతకి గాని, హీరోకి గాని లేదు. ఆఖరికి మేం నటించిన సినిమాలు కూడా మాకు చూపించడంలేదు.
ఇప్పుడొస్తున్న సినిమా పాటల్లో ఒక్క ముక్కా వినిపించదు. అర్థం కాదు. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం? చూసి ఆనందించడానికే కదా. అంతేగాని హత్యలు, కేకలు, పెట్రోల్‌ పోసి తగలబెట్టడాలు, గొడ్డళ్లతో నరుక్కుంటుంటే చూసేందుకా వెళ్లేది. మిగతా వాళ్ల సంగతేమో గాని నేను మాత్రం అలాంటివి చూడను.
సినిమా ఈజ్‌ మెంట్‌ ఫర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అంతే ఉండాలి కాని జుగుప్స కలిగించే విధంగా, భయంకరంగా, భీకరంగా ఉండకూడదు. చూసినంత సేపు ఎంజాయ్‌ చేసి రిలాక్స్‌ అవ్వాలి.
నటనను ప్రకృతికి ప్రతిబింబంలా భావించే వాళ్లు. ఇప్పుడంటే అంతా స్పీడుమయం. రోజుకి నాలుగైదు సీన్లు చేయిస్తుంటారు.
అప్పట్లో ఎవరు పెందలకడ వస్తే వాళ్లు గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద ఆర్టిస్టులు కదా.
పూర్వం నటనాపరంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకరికంటే ఒకరు బాగా చేయాలనుకునేవాళ్లు. ఇప్పుడు ఈర్ష్యాభావంతో ఉంటున్నారే తప్ప ఆరోగ్యకర వాతావరణమే కనిపించడం లేదు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శీలా సుభద్రా దేవి గారి అస్తిత్వ భావ రాగం

శీలా సుభద్రా  దేవి  గారి  అస్తిత్వ భావ రాగం

శ్రీ శీలా వీర్రాజుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా) ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా  ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా వీర్రాజుగారికి  బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధాంగి శ్రీమతి సుభద్రా దేవి గారిని చూశాను .అన్యోన్యమైన జంట .ఇద్దరూ సాహిత్యపు పంట పండించారు . వీర్రాజు గారి పుస్తకాలతో బాటు ఆమె రాసిన ‘’బతుకు పాటలో అస్తిత్వ రాగం  ‘’,నా ఆకాశం నాదే ‘’అనే రెండు కవితాసంపుటుల పుస్తకాలనూ నాకు అందజేశారు .కాని వాటిని ఒక పది రోజుల క్రితమే చదివే తీరిక దొరికి చదివాను .వీటిపై నాకు తెలిసిన విషయాలను  సాహితీ బంధువులకు అందజేయటమే నేను చేస్తున్న పని .వీర్రాజు గారి ప్రతిభకు ఏమాత్రం తీసిపోని ప్రతిభ సుభద్ర గారిది ఆమె భావనా ,పరిధి ఆమెదే . స్త్రీ అస్తిత్వవాదాన్ని తన వాదం గా భావి౦చి రాసిన కవితలే ఇవి .రెండుపుస్తకాలు  వీర్రాజుగారి  గొప్ప ముఖ చిత్రాలతో ఆకర్షణీయంగా ఉన్నాయి .ముందుగా ‘’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ఊరించి తెలుసుకొందాం . .

’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ .astitvaragam 001

ఇది దీర్ఘ కవితా విహారమే .ఏడు ఖండికలుగా ఉన్నది .పుట్టుక  నుంచి వృద్ధాప్యం వరకు జీవిత గమనమే కనిపిస్తుంది .ఆడపిల్ల పుట్టితే సహించలేని లోకాన్ని ,ముందు జాగ్రత్తకోసం లింగ నిర్ధారణ చేయింఛి ఆడపిల్లయితే ‘’శకలాలు శకలాఉగా చిదిమేయాలనే  రాక్షస ప్రయత్నాన్ని ‘’ఆమె ఎండగట్టారు .బిడ్డజననం తో ‘’బండరాళ్ళను బోసి నవ్వులు కరిగించవు –కేరింతలకు రాతి హృదయాలు చలించవు ‘’అని చెప్పి లింగ భేదం అంటే ఏమిటో తెలీని ఆ పసి గుడ్డు ‘’ఆత్మీయ స్పర్శకోసం దిశలు పరికిస్తూనే ఉంటుంది ‘’అని మానవ అల్పమనస్కతను తెలియ జేశారు .ఇంతటితో ఆ పిల్ల కస్టాలు తీరవు  .భ్రూణ హత్య కుదరక పొతే చంపటానికి సవాలక్ష మార్గాలున్నాయి .పసిపిల్ల నోట్లో వడ్లగింజ వేసి ,గాజురవ్వ వేసి ప్రాణాలు తీసే ఉపాయాలున్నాయి .వీటినీ తట్టుకొని బతికినా బిడ్డ కన్నవారికి భారమై ‘’చెత్త కుప్ప తొట్టెలో ‘’జాలిలేని లోకాన్ని అసహాయంగా చూస్తూ కన్ను మూయనూ వచ్చు .

సంక్షేమ హాస్టళ్ళలో క్షేమం ‘’some  ‘’మాత్రమె నని మనకు తెలుసు .అక్కడ ఈ మధ్య ‘’ట్రంకు పెట్టెలు సైతం పురిటి నొప్పులు’’ పడుతున్నాయి .రక్త సిక్తమై  ఊపిరి పీల్చుకోలేక పసికందులు తమలోకి  తామే ముడుచుకుకు పోతున్నాయి ‘’అని వాటి బండారం అక్కడ జరిగే వ్యభిచారం వాటి ఫలితంగా చదూకొనే పిల్లలకొచ్చే గర్భ ధారణ లను కాళ్ళ ముందు ఉంచారు .  .ఆక్కర లేని పిల్లలు గడ్డిపువ్వులై మట్టిలోనే తలవాలుస్తున్నాయని ఆవేదనా చెందారు ‘’ఒక్కో పాపాయి ఒక్కో చరిత్రకు ప్రారంభ మౌతుంది ‘’అని నిర్వచించి కాలం మాత్రం జీవన కావ్యాలు రాస్తూనే ఉ౦ టుందన్న చారిత్రిక సత్యాన్ని ఎరుక పరచారు .ఆడపిల్ల సీతాకోక చిలుకలని ఎగరేసుకొంటూ ఇల్లంతా సందడిగా తిరగాలని అంతటా తానై ఎదగాలని అప్పటినుండే ఆశతో ఉంటుంది .వాళ్ళంతా చిట్టిమొలకలు  .కాని వారిలో ఉన్నది అస్తిత్వ ఆలాపనయే అంటారు .

తల్లి ఒడిలో పెరుగుతూ నిశ్చింతగా ఒక బిడ్డ నిద్రలోకి జారుకొంటే ‘’ప్రభుత్వ ఆస్పత్రి పెరటి గుమ్మం లోనే తుది ఊపిరి జార్చుకొన్న పసి గుడ్డు నిర్జీవ శరీరం కోసం ఊరకుక్కలు నంజుకోటానికి సిద్ధంగా ఉండే హృదయ విదారక దృశ్యాన్ని ఆవిష్కరించారు .బాబాల వెంటబడి ,బూడిదతో పిండాలని పందడిస్తామంటే నమ్మి ,దేవుళ్ళను నమ్ముకొని ఉన్నవాళ్ళను గురించి చెబుతూ ‘’నిలువెల్లా ముద్దై కడుపులు పండించుకోటానికి పడే ఆరాటాన్ని కళ్ళారా చూపారు .బతుకు బండీలాగటానికి గతి లేక ,విధిలేక ఆశ్రమ స్కూళ్ళలో చేరే ఆడపిల్లల మానాలతో ఆడుకొని ఆగమాగం చేసి  ‘’అక్ష రాలకు బదులుగా పొట్టల్లో పిండాలు ‘’పొదిగి పెడుతున్నారు ‘’అని సమాజ కీచకులను చీదరించుకొన్నారు . .

అమ్మాయి పెరిగితే ‘’అబ్బురాల పంటై –ఇంటి నిండా పరుచుకొన్న రంగుల రాట్నం ‘’అవుతుంది .వెలుగులు నింపే హరివిల్లూ కావచ్చు నంటారు సుభద్ర గారు .అదే మరొక ఇంట్లో ‘’ఇరుకిరుకు మనస్సులో మరొకతై-కోరుకొని అతిధీ ‘’కావచ్చు .ఇంకో ఇంట్లో ‘’అమ్మకపు సరుకై బాల దమయంతి యై –అక్కున చేర్చుకొనే మరో వెచ్చని గూటికోసం ‘’ఎదురు చూస్తూ కలల్లో కూడా దిక్కుల్ని  వెదుక్కొనే దౌర్భాగ్య దామోదరి అవుతుంది .’’దారిపక్క కన్ను విప్పిన గడ్డిపూపాపాయికి –చిరుగాలే ‘’జోల కొట్టేది అని సానుభూతి చూపిస్తారు .’’పూల గుత్తి కుటుంబం లో గుచ్చేత్తే భద్రత కోసం –చూసే పసిచూపులు మన చుట్టూ ఎన్నో వేలాడుతున్నాయో ?అని ఆశ్చర్యపోతారు .

పిల్ల పెరిగి పెద్దదై’’నాన్న ఒడిలో కులుకుతున్న చిట్టి తమ్ముడి ని ఆప్యాయం గా లాలించ బోతుంది .వాడెందుకు ఏడ్చాడో తండ్రి తనను ఎందుకు కసిరాడో తెలీక గుడ్ల నీరు కుక్కు కుంటుంది ఆ అమాయక ప్రాణి .ఆమెది ‘’తనదికాని తప్పును శిలువలా మోస్తున్న ‘’యేసు అవతారం .తలిదండ్రుల కలల్నితన కళ్ళలో అతికించు కొంటుంది .స్వంత కలలు కనే అదృష్టం లేనిది .ఇంట్లో తోబుట్టువులను సాకుతూ  బుజాన ఉన్న పుస్తకాల సంచీతో బాటు బాల్యాన్నీ మూలకు విసిరేసే విధి వంచిత అవుతోంది బాలిక .కొందరేమో వయసుకు  మించిన భారాన్ని చంకనేసుకొని ‘’పసితనం లోనే ఆరిందా లైపోతున్నారు ‘’అని జాలి పడ్డారు .’’నర్సరీ క్లాసు పంజరం పక్షి ఆమె ‘’.బడిపిల్లలతో నిండిన ఆటోలు పరిగెత్తే ఫ్లవర్ వాజులు ‘’గా కనిపిచాయి సుభద్రగారికి .చిదిమేయబడిన బాల్యం గల ఒకపిల్ల ‘’మంది ఇళ్ళల్లో అంట్ల గిన్నెలని కన్నీళ్ళతో కడిగి దిగులు మొకాలతో ‘’భవిష్యత్తు తెలీకుండా గడుపుతున్నందుకు బాధ పడ్డారు

అనాధ శరణాలయాల్లోవిదిలించే మెతుకుల్ని  ‘’రుచి ఎరగని నోట్లో కుక్కుకొనే ‘’అనాధలను పుస్తకాలైనా తమ బతుకుల్లో తెరచుకొని చీకట్లను తరిమి కోటి ఆశల్ని పూయిస్తాయని ‘’ఆశించే అభాగ్యులెందరో ?పనీ పాటా చేసే పిల్లల గురించి చెబుతూ ‘’గుడిసె కప్పు నిండా సూర్యుళ్ళని నింపుకొని –కలల తూనీగల రెక్కల్నిచిదిపెసేవి పుస్తకాలే ‘’అని వాపోయారు వారి దౌర్భాగ్యానికి .వీళ్ళు ‘’శ్రమ విలువని అణా పైసల్తో సహా ఖచ్చితంగా –లెక్క వేయ  గలుగుతున్న చిన్నారి శ్రమజీవులు ‘’అన్నారు .మరికొందరు ‘’తాము కోల్పోయిన హక్కు ఏమిటో తెలియని ‘’వారు చెత్త కుప్పలో చిత్తుకాగితాల్ని ఏరుకొంటూ  బాల్యాన్ని పోగొట్టుకొన్న వీధి బాలికలు .ఇలా సమాజం లో భోగం ,దౌర్భాగ్యం పాపల జీవితాలతో ఆడుకొంటోంది అని స్పష్ట పరుస్తారు .

బాలిక పెరిగి కన్నె వయసు వస్తే ‘’కొత్త అందాలు శరీరమంతటా పరచుకొని ‘’ప్రతిదీ కొత్తగా దర్శన మిస్తూ పొందాలన్న తపన పెరిగి ‘’సృష్టిలోని అందాలన్నిటినీ సొంతం చేసుకోవాలనే కాంక్ష  రగుల్తుంది ఇది సహజం వయసు ధర్మం కూడా . ఇక్కడా తర తమ భేదాలున్నాయి .కొందరు ‘’లక్ష్య సాధనలో  గ్రంధ ‘’ వాల్మీక’’లై అనుకొన్నది సాధించి అపర సరస్వతులౌతారు .మరికొందరు తళుకు బెళుకు ప్రపంచపు భ్రమలకు లోనై ,రంగుల కలలు కని  తప్పటడుగులు వేసి  జీవితం ముళ్ళ బాట చేసుకొంటారు .’’అందమే తొలి మెట్టు అనే భ్రమ మెస్మరిజం చేసి అందాల్ని అతికి౦చు కొనే దారిలో కొందరు ,’’కామ దావానలం చుట్టూ ముట్టి –నిగ నిగల నాజూకు ఆకు పచ్చని జీవితం ‘’బూడిద కుప్పగా మార్చుకొనే వారు కొందరుంటారు .మరికొంతమంది ‘’ప్రేమికుడి వెనకాల పెంపుడు జంతువుగా మారిన బాలనాగమ్మలై ‘’బలై పొతూఉంటారు .నిజం తెలిసి ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా జీవిత రంగం నుండి నిష్క్రమిస్తారు .దీనికి తోడూ ‘’వెండి తెర వేల్పుల విన్యాసాలూ’’ చూసి  ‘’జీవితమంటే ప్రేమనే రెండక్షరాల మంత్రం ‘’అనుకోని మోసపోతారు .ఈ వయసులో ‘’కాలాన్నీ జీవితాన్నీ ‘’గురించి   సుభద్రగారు ఉద్బోదించి ‘’చేజారిన నిమిషాన్ని తిరిగి వెనక్కి తెప్పించుకోలేం ‘’అని వార్నింగ్ ఇస్తారు .ప్రేమించలేదని యాసిడ్ దాడులు బ్లేడ్ల కోతలు నిత్యం చూస్తూనే ఉన్నాం .రాక్ష ప్రేమ ఇది .దీన్నుంచి సమాజం బయటపడాలి. దీనిలో అందరి బాధ్యతా ఉందని చెప్పకుండానే చెప్పారు .

చదువులు పూర్తయి ‘’డాలర్ల గింజల కోసం వీసా రెక్కలు విదిలిస్తూ –గూడు వదిలిన పక్షి కూనలౌతున్నార’’ని అంటారు కవయిత్రి .అయితే ‘’తమదైన జీవిత శిల్పాన్ని చెక్కుకోటానికి వేడుతున్నందుకు ‘’సంబరపడతారు .వీళ్ళంతా చదువు’’ కొనుక్కోగలిగే’’ జనం .మరి కొనుక్కోలేనివారు –‘’కోరికల్ని కట్టగట్టి ఇంటి చూరులో నో గుండె సరంబీ లోకో విసిరి కొట్టి ‘’బతుకు పోరాటం చేస్తారు .గంతకు తగ్గ బొంత ను కట్టుకొని ఇల్లే స్వర్గం గా జీవితం వెళ్ళ మారుస్తారు .ఇందులోనూ అదృష్టవంతులు దురదృష్ట  వంతుతులూ ఉంటారు .’’భర్త చుట్టూ కుటుంబం చుట్టూ కోరికల్నీ ఆశల్నీ అల్లుకొని తనజీవితాన్ని అందులోనే మమైకం చేసుకొంటారు .’’.స్త్రీకోసం అందరూకలిసి ‘’స్వర పెటికపై పొదుపు కొని-ఆర్తిగా గొంతుకలుపుదాం ‘’రారమ్మని సుభద్రా దేవిగారు పిలుపు నిచ్చారు .

కన్నె ముత్తయిదువై  అత్త వారింట అడుగు పెట్టిన  శుభ సందర్భం .భర్త నే దైవంగా భావించి పూజించే వైనం .కడుపు పండే సమయం .’’పొట్టలో పాపాయి ఊపిరి పోసుకోన్నది మొదలు ‘’ఎన్నెన్నో కలని గుది గుచ్చుకొంటుంది ఆ తల్లి .తల్లి గుర్తుకొచ్చి ‘’తనకై అమ్మ పడిన ఆరాటపు జాడల్ని –కళ్ళల్లోకి తెచ్చుకొని కన్నీళ్ళతో కడిగి అందులో తన ప్రతిబింబాన్ని చూసు కొంటుందట ‘’అద్భుత భావ చిత్రణ .కర్తవ్యమే ఇప్పుడు ఆమె జీవిత నావకు చుక్కాని అవుతుంది .’’తనకు దక్కని జీవన పరిమళాలని –పిల్లల దోసిట్లో నింపటానికి ’’ఆరాట పడుతుంది ..ఇప్పటి మహిళా జీవితం అనేక రంగాల్లో ఉంది .కార్యాలయాల్లో  గృహాలయాల్లో బాధ్యత నిర్వహిస్తుంది .’’సహకరించని శరీరాన్ని ఉత్సాహ పరచుకొని ‘’సమాధాన పడుతుంది .కెరీర్ కు పగ్గం వేసి ,సంపాదనకు ఫుల్ స్టాప్ పెట్టి ,జీవితం తో రాజీపడి పిల్లల ఆటపాటలతో మమేకమై ‘’సంపూర్ణ గృహ లక్ష్మి ‘’అవతారం ఎత్తు తుంది .ఆమెలో సహనం ఓర్పూ ,పట్టుదల ముప్పేటలా అల్లుకొని ఇంటికే సర్వం సమర్పిస్తుంది .ఆదర్శ గృహిణి అని పించు కొంటుంది .ఇందులో సంతృప్తి ఆనందం అనుభవిస్తుంది .ఇల్లే స్వర్గ సీమ అవుతుంది ఆమెకు .

‘’శ్రమకు తగ్గ ఫలితం చెమటై జారి పోతున్నా –ముళ్లబాటలో శరీరం చీరుకు పోతున్నా –కడుపు పంటకు మాత్రం ముళ్ళు తాక కూడదని ‘’నిర్విరామంగా పని చేసే యంత్రమే అవుతుంది .కడుపుకట్టుకొని ‘’స్వేదజలాన్ని పైసలుగా మార్చి –పిల్లల దోసిట్లో విద్య గా ధారపోసి ‘’వాళ్ళు ఏ రోజుకైనా ‘’లోహపు రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోయి ‘’నిలువెల్లా డాలరు పూలతో అభిషేకిస్తారని కొండంత ఆశ తో బతుకుతుంది మందికోసం .’’స్వప్నాలను మాత్రం వెలిగించు కొంటుంది –కంటి దీపాన్ని ఆశతో ఎగ దోసు కొంటూ ‘’అదీ ఆమె ప్రస్తుత పరిస్తితి .తనలాంటి అభాగ్యుల సేవలో తరించాలన్న తలంపు ఆమెను బతికిస్తుంది .’’మూలాల్ని నిరంతరం తడుముకొంటూ –నవ చైతన్యం తో అక్షరీకరించుకొని ‘’సమస్యకూ సమస్యకూ మధ్య నడుస్తుంది సామాజిక కార్యకర్తగా జీవితాన్ని పునీతం చేసుకొని సార్ధకం చేసుకొంటుంది .వారి ‘’పురోగమనానికి దీప ధార అవుతుంది ‘’ఇదీ ఉత్కృష్టమైన మార్పు .

కోరికల పంచకల్యాణి గుర్రాలెక్కి స్వారీ చేసే సంతానాన్ని చూసుకొని మురుస్తూ ,అప్పుల అడుసులో కాలుపెట్టి లోతుకు ,ఇంకా లోతుకు దిగిపోతూ అసహాయయై ఆసరాకోసం దిక్కులు చూస్తుంది .విధి వక్రించి జీవిత భాగస్వామిని దూరం చేస్తే సముద్రం లో ఏకాకి నావ అయి ,విద్య సమకూర్చిన ధైర్యం తో ముందుకే సాగిపోతుంది .అధైర్యాన్ని నిలువు లోతున పాతేస్తుంది .’’ధైర్యే సాహసే లక్ష్మీ ‘’అని పించు కొంటుంది .కాలం తో సమానం గా ‘’మరాతన్ రేస్ ‘’లో పాల్గొంటుంది .’’మెనీ మెనీ బాధలు పెట్టె మెనో పాజ్ ‘’నుండి బయట పడటానికి అవయవాలను యుద్ధ రంగం గా మార్చుకొంటుంది .’’గర్భ సంచీ నిండా అండ పిండ బ్రహ్మాండాల నన్నింటినీ సర్దుకొని –బుజాన వేసుకొని హడావిడి చేసి పోతుంది .ఇదొక నరక యాతన .ఆ బాధ నుంచి  గట్టెక్కి  సరైన ఆరోగ్యం పొందటం ఏంతో కష్టం  .’’ఎప్పటికీ ఎండిపోని జీవజలం ఆత్మా విశ్వాసం తో –మనసును నింపి సజీవం చేసుకొంటుంది ‘’.అందుకే ‘’ప్రతి గుండె తలుపు తట్టి –ప్రతి హృదయం పై అస్తిత్వ జండా ప్రతిష్టించి ‘’దిక్కులు ప్రతిధ్వనించేలా పాడమని కెప్టెన్ లక్ష్మిలాగా సలహా ఇస్తారు సుభద్రా దేవి .

కాల చక్రం ఎవరి కోసమూ ఆగదు .తరానికి తరానికీ మధ్య అంతరాయాలు పెరుగుతాయి .వైరుధ్యాలు చోటు చేసుకొంటాయి .పిల్లలు డాలర్ల వర్షం లో విదేశాలలో హర్షం పొందుతుంటే ,తనకోసం వస్తారన్న ఆశ అడుగంటి పోతుంటే ఇన్నాళ్ళ ,ఇన్నేళ్ళ శ్రమ వృధా అనిపించి జీవితంపై ఆశ నశించటం సహజం .వారికోసం’’ నిరీక్షణ చేతికర్రకు ఆనుకొంటూ –మనసు ముంగిట్లోనే లైట్ హౌస్ గా స్తంభించి పోతుంది ఆ వృద్ధ నారి ‘’.ఒకవేళ కన్నపేగు చీరుకు పొతే –ఆశల బుడగలు చిట్లి పోతుంటే –కన్నీరు వర్షించటం మర్చి పోయిన పొడి కళ్ళతో ‘’కూల బడి పోతుంది .

చివరి క్షణాలలో అనాధ జీవచ్చవమై –నిర్వేదానికి , నిర్లక్ష్యానికి  గురికాక ‘’ఏ ఆడదానికీ తప్పటం లేదని నిర్వేదం చెందారు సుభద్రా దేవి .ఉమ్మడి కుటుంబాలు ‘’కుంచించుకు పోయి అతి చిన్న పరమాణు కేంద్రం లో ఇమిడి పోతున్నాయి ‘. ఇప్పుడు దేశాలన్నీ ‘’వ్రుద్దాశ్రమాలయ్యాయి ‘’అని యదార్ధ పరిస్తితిని వివరించారు .ఉద్యోగ విరమణ చేసినా ‘’ఇంటి చాకిరీకి విరమణ ఉండదు ‘’.అమ్మ రాజీనామా ‘’కు అవకాశమే లేదు .’’సెకండ్ ఇన్నింగ్స్ గా మనవళ్ళు మనవరాళ్ళను ‘’తీర్చి దిద్దే బాధ్యతా మీద వేసుకొంటుంది .’’సిరి చుక్క పెట్టిన స్వంత ఆలోచనల్ని మరో సారి తడుముకొని  ఇష్టమైన వ్యాపకాలలో కష్టమైనా తనివితీరా ఈదు లాడుతుంది .ఇప్పటిదాకా పిల్లలకోసం దాచి పెట్టి తినిపించింది ఇప్పుడు తానూ తినాలనుకొంటే ‘’అనారోగ్యాలు నోటికి ప్లాస్టరు అంటించి బెదిరిస్తాయి .తినే యోగం ఇప్పుడు లేనే లేదు .’’మైసిన్లు ‘’తో కాలక్షేపం .

జీవన సంధ్య వచ్చేస్తుంది .’’చర్మం పై అలలు అలలు ‘’గా ముడుతలు ఆవరించుకు పోతాయి. శిరసుపై వెండితీగలు మెరుస్తాయి .ఎదురీతల్లో అయిన గాయాల మచ్చలు వగైరాలన్నీ ‘’జీవితానుభవాల పరిపక్వతకు కొలమానాలే ‘’అంటారు .’’చేవ లేదనీ గొంతు పెగలటం లేదనీ –నిరాశ సూదితో పెదాల్ని కుట్టేసు కొంటుంది ‘’. ఇక్కడే సుభద్రా దేవి మేలుకోలుపు పాడారు ‘’మధుర జీవితానుభవాల సారాంశాన్ని నింపి –అస్తిత్వ జండాను గుండె గుండెకు తాకించి ‘’కొత్తపాటకు జీవితార్ధాన్ని నేర్పించి ఆలపించమన్నారు .’’సామూహిక అస్తిత్వ ఆలాపనలతో –ప్రతి హృదయం లోను గమకాల్ని మీటి –ప్రతిమనసును తట్టి లేపాలని ‘’అస్తిత్వ రాగాలాపన చేసి జాగృతం చేశారు .

ఆడది గర్భం లో పిడమై ఊపిరి పోసుకొన్న దగ్గర్నుంచి –చిద్రమై శకలాలుగా జారి పోకుండా ప్రాణాన్ని నిల బెట్టుకొనే వరకు –మొదలైన అస్తిత్వ పోరాటాన్ని కడదాకా కొన సాగించాల్సి వస్తున్నందుకు విచారించారు .ఎక్కడ ఏ రకమైన విచక్షణ ఉన్నా సమైక్య నినాదం తో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు .’’ఎప్పుడూ ఏ నాడూ కూడా తెగిపోని విధంగా విస్తరింప జేస్తూ –వినువీధుల నిండా అల్లుకొనేలా –చేతుల్నీ హృదయాల్నీ కలుపుకొంటూ –మాటల్నీ మనసుల్నీ విస్తరిస్తూ –సజీవ స్వరాల అల్లిక జిగిబిగితో –రేపటి తరాలకు కొత్త ఊపిరి లందిస్తూ ‘’ముందుకు సాగాని అభిలషించారు .ఈ కొనసాగింపు ‘’కడదాకా –ఊపిరి కొసదాకా –అనంతంగా –‘’కొనసాగిద్దామని అందరికి ఎరుక పరచారు సుభద్రా దేవిగారు .

‘’జనం బాధ శ్రీ శ్రీ బాధ ‘’అయితే మహిళా జనం బాధ శీలా సుభద్రా దేవిగారి బాధ .ఇదొక అస్తిత్వ నిరూపణ గాధ.ప్రతి అడుగులో పొంచి ఉన్న ప్రమాదాల ఘోష .ఒక రకం గా ‘’మహిళాయణం ‘’  మహిళా వేదం .స్త్రీ త్వ నిరూపణం .అవరోధాలను  అధిగమించి ముందుకు సాగే స్థిర సంకల్పం .అనుకొన్నవి జరగవని ,జరగనివాటికోసం విచారిస్తూ కూర్చోటం కాదు –ఉన్నదానిలో సరిపుచ్చుకొని ముందుకు సాగటమే అవుతోంది స్త్రీజీవితం .ఆమెకు విముక్తి లేదు .కనుక ఇది ఒక విముక్తి గీతం .అయితే సాధారణ ఫెమినిస్ట్ రచయిత్రుల్లాకాకుండా సుభద్ర గారికి ఎవరిపైనా కోపం ద్వేషం లేదు .పగ సాధింపు లేదు .అశ్లీలం ,అసభ్య పదజాలం లేదు .మార్పు రావాలన్న ఆరాటమే కనిపస్తుంది .స్త్రీ స్వయం సిద్ధ అవ్వాలన్న తపనే ఉంది .ఊహల్లో తేలిపోకుండా నేలమీద నిలవాలన్న హితవు ఉంది .భద్రమైన జీవితం మహిళలకు ఉండాలని సుభద్ర గారు కోరుకొన్నారు .స్త్రీ అస్తిత్వ జండాను బుజాన వేసుకొని అస్తిత్వ నినాదం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినదించిన స్త్రీ మూర్తి ఆమె .ఆమె ఆరాటం ,పోరాటం దీనికే .అందుకే అందరినీ సమైక్యమవ్వమని పిలుపు నిచ్చారు .

సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’సంపుటి పై  తరువాత తెలియ జేస్తా.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ టి రంగస్వామి గారి స్పందన

డా శ్రీ టి రంగస్వామిగారునాకు  చాలాకాలం గా ఆత్మీయ సాహితీ మిత్రులు ”హనుమ కొండ రాజధానిగా సాహితీ సామ్రాజ్యాన్ని” ఏలుతున్న బహుగ్రంధకర్త ,వక్త ,ప్రచురణకర్త ,సాహిత్య సంస్థ  కు అధిపతి .వారిపుస్తకాలు మనకు ,మనపుస్తకాలు వారికీ బట్వాడా అవుతుంటాయి .విశ్వనాధ  వారికి  పరమ అంతరంగికులు శ్రీ రంగస్వామి .వారి ఆత్మీయ స్పందనే ఈ ఉత్తరం -దుర్గాప్రసాద్ rangasvami 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోనియాను మోసేందుకు జనతా ఏకతా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మావొఇస్టూ లో -విఫల రాజ్యము

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”మరణము దక్క మరి తీరుబడి లేని ”వీరేశ లింగం పంతులుగారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

60 ఏళ్ళ రోజులుమారాయి – నేతాజీ ఫైళ్ళపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భైరవ కోన –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాళి తెంచు శుభ వేళ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనాతో నవ్యాంధ్ర అనుబంధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాకు నీతులు చెప్పొద్దు -ధనిక దేశాలకు మోడీ హెచ్చరిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంబేద్కర్ రాజకీయం –

Posted in వార్తా పత్రికలో | Leave a comment

మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..95 yella kondapalli koteshvaramma

మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..
ప్రజాయుద్ధంలో ఆరితేరిన ‘నిర్జన వారధి’ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఆవిడ పోరాటం బాల్యం నుంచే మొదలైంది. కొండపల్లి సీతారామయ్య సహచరిణిగా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామురాలై.. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చలించక ఎంచుకున్న మార్గంలోనే నడిచిన ధీర మహిళ ఆమె. నూరేళ్ల జీవితానికి అయిదు అడుగుల దూరంలో ఉన్న కోటేశ్వరమ్మ.. తన జీవన ఆరోగ్య సూత్రాలను ఇలా చెప్పుకొచ్చారు..
‘ఇతరులకు అపకారం చేయని వారు, సమాజానికి మేలు చేసే వారు ఎక్కువ కాలం బతుకుతారు..’ అని నాతో ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య చెప్పారు. ఈ వాక్యాలు నా విషయంలో నిజమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే నేను ముందుకు నడిచాను. ఇంత కాలం ఆరోగ్యంగా బతకడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. పరుల కోసం పాటు పడాలన్న తపన మరికొంత కాలం జీవించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. చాలా మంది మాదిరిగానే నా జీవితంలోను అనేక కష్టాలు ఎదురయ్యాయి. నా కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, నా కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు- ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు- అనేక మంది మిత్రులు నాకు తోడుగా నిలిచారు. అలాంటప్పుడు- కార్యశూరులు, త్యాగధనులనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితుడవుతాడేమో.. వారి ఓదార్పు ఊపిరులూదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే నేను ఇన్నాళ్లు జీవించానేమోనని కూడా అనిపిస్తుంది. కొందరు వృద్ధాప్యం నరకంలాంటిదంటారు. రకరకాల సమస్యలతో బాధపడుతూ నిరాశతో నిత్యం బతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కన్నా- మంచి పనిచేశాననుకుంటూ, మనిషిలా బ్రతికాననుకుంటూ మనశ్శాంతితో కన్నుమూయటం మంచిదేమో అనిపిస్తుంది. ఇలా బతకాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉంటే సమయానికి తిండిలేకపోయినా, నిద్ర లేకపోయినా అనారోగ్యం దరిచేరదు.
మానసిక స్థయిర్యమే ప్రధానం..
సంస్కరణోద్యమం కారణంగా వీరేశలింగం ప్రభావం మా కుటుంబంపై తీవ్రంగా ఉండేది. అందుకే బాలవితంతువైౖన నాకు కొండపల్లి సీతారామయ్యతో వివాహం జరిగింది. ఆయన స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో చురుకైన పాత్ర వహించేదాన్ని. ఉద్యమాలంటే తెలిసిందే కదా! సమయానికి తిండి దొరకదు. నిద్ర ఉండదు. ఇక యూజీ (అండర్‌ గ్రౌండ్‌)లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిడి ఒక ఎత్తు అయితే- వ్యక్తిగత జీవితంలో నాకు ఎదురయిన సవాళ్లు మరో ఎత్తు. అలాంటి సమయంలో కూడా నాకు ఎదురయిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానంటే- నా మానసిక సైర్థ్యమే ప్రధాన కారణం.
నలభై ఏళ్లు హాస్టల్‌లోనే..
ఉద్యమాల సమయంలో తిండి, నిద్ర ఉండేది కాదని చెప్పాను కదా. ఆ తర్వాత ఎక్కువ కాలం హాస్టల్‌లో ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే హాస్టల్‌ అంటే క్రమశిక్షణ. సమయానికి తిండి ఉండేది. నిద్ర ఉండేది. దీనితో తిండి విషయంలో క్రమశిక్షణ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ! చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని. ఏ రోజూ ఆహార నియమాలను పాటించలేదు. ఇది తినకూడదు, అది తినకూడదు అన్న నిబంధనలేవీ లేవు నాకు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మితాహారిగా మారాను. అవసరం మేరకే తింటున్నాను. ఏదైనా నచ్చింది కదాని మితిమీరి తినే అలవాటు లేదు. రాత్రి పడుకునే ముందు మాత్రం పుస్తకాలు చదువుతాను. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. వీటన్నిటికీ తోడు.. నన్ను అభిమానించేవాళ్లను ఎంతో మందిని సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారిని పొందగలిగాను. వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం అనిపిస్తుందిప్పుడు. ఆ బలం ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి.. సంఘసేవలో తరించానన్న సంతృప్తితోనే నేటికీ ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను.
బాధాకరమైన సంఘటనలు, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. ఎందుకంటే అసలే ఆ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉంటారు. దానికి తోడు మరింత కుంగిపోతే మరీ బలహీనపడతారు. ఆ వెనకే అనారోగ్యం చుట్టుముడుతుంది.
జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఉన్నంత కాలం సంతృప్తిగా బతకడమే తెలుసు. ఆ సంతృప్తే జీవాయుష్షును పెంచుతుంది అన్నది నా అభిప్రాయం.
మంచి పని చేశాననుకుంటూ, మనిషిలా బతికాననుకుంటూ.. మనశ్శాంతితో కన్ను మూయడం మంచిది అనిపిస్తుంది..
నా జీవిత చరిత్ర ‘నిర్జన వారధి’కి సంబంధించిన రాయల్టీని రెండు సంస్థలకు విరాళంగా ఇచ్చాను. ఇటువంటి పనులు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి.
ఉద్యమ నేపథ్యం..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాల్య వితంతువును. ఆ రోజుల్లో నేను చదివింది కేవలం ఎనిమిదో తరగతే! పాటలు బాగా పాడేదాన్ని. దీంతో అందరూ నన్ను ‘నైటింగేల్‌.. నైటింగేల్‌’ అంటూ ఏడిపించేవారు. ఆ బాధ పడలేక చదువు మానేశాను. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. జాతీయోద్యమంలో పాల్గొనడం బాధ్యతగా భావించేవారు. ఆ విధంగా నాలుగు ఉద్యమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అదే నా జీవనమార్గం అయ్యింది. సీతారామయ్యగారితో వివాహం అయిన తర్వాత సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాను. మా సంస్థలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాం. ఈ ఉద్యమ సమయంలోనే నా భర్త దూరమయ్యాడు. నా బంగారమంతా పార్టీకి ఇచ్చేశాను. ఇద్దరు పిల్లలను పోషించలేని దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నా. పిల్లలు నాకు దూరంగా ఉన్న సమయంలో- వాళ్లకు కథలు చెబుతున్నట్లు ఊహించుకుంటూ- ‘అమ్మ చెప్పిన కథలు’ రాశాను. ఆ తర్వాత కూడా అనేక రచనలు చేశాను. వాటికి లభించిన ప్రశంసలు నా ఆయుష్షును మరింత పెంచాయనిపిస్తుంది! ఇప్పుడు పుస్తకం నాకు తోడు.. నాకున్న గొప్ప నేస్తం. అందుకే వైజాగ్‌లో జరుగుతున్న పుస్తకప్రదర్శనకు కూడా వెళ్లా.. ఆ పుస్తకాలను చూస్తుంటే కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.
వాసు, విశాఖపట్టణం
ఫోటోలు : విజయ్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -2

ఆనంద రామాయణ విశేషాలు -2

రావణుడు కౌసల్యాదేవి వివాహానికి విఘ్నాలు కలిగించటం

మనకు ఏ రామాయణం లోనూ కనిపించని కొత్త విషయాలు ఆనంద రామాయణం లో కనిపిస్తాయి రావణుడు కౌసల్యను చెరబట్టటం మనం ఇంతకూ ముందు ఎక్కడా విని ఉండలేదు .ఆ విషయం దీనిలో సవివరంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .

బ్రహ్మ దేవునివలన తన మరణం కౌసల్యా సుతుని వలన కలుగుతుందని  తెలుసుకొన్న రావణా బ్రహ్మ  ఆమెకు వివాహం కాకుండా ఉండటానికి ఎన్నో పన్నాగాలు పన్నాడు .అప్పటికి అయిదు రోజుల్లో కౌసల్యా దశరదుల వివాహ ముహూర్తం  నిర్ణయించారని  బ్రహ్మ రావణా బ్రహ్మకు చెప్పాడు .లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు రావణుడు రాక్ష సమూహం తో అయోధ్య కు వెళ్ళాడు .దశరధ మహారాజుతో యుద్ధం చేసి ఓడించి ఒక నౌకలో ఉన్న దశరధుని చూసి నౌకను కాలితో తన్ని సరయూనదిలోవిరిగి పడేట్లు  మునిగేట్లు చేశాడు .దీనికి వాల్మీకి శ్లోకాలు –‘’అయోధ్యాం సత్వరం గత్వా  రాక్శసైహ్  పరివేస్టితః –నౌకాస్తం తమ్ దశరధం జిత్వా యుద్ధైస్సు దారుణైః-బభంజ నిజ పాదేన తాం నౌకాం సరయూ జలే ‘’.  ఆనీతిలో అందరూ చనిపోయారు .కాని దశరధుడు సుమంత్రుడు మాత్రమె బతికి బట్టకట్టి ఆ నౌక ముక్క పై ప్రయాణం చేసి గంగానదిని చేరారు .అక్కడినుండి సముద్రం లోకి కొట్టుకు పోయి ఎలాగో బతికారు .

రావణుడు కోసల దేశానికి వెళ్లి యుద్ధం చేసి కన్య కౌసల్యను అపహరించి ,లంకకు  ఆకాశమార్గం లో వెడుతూ సముద్రం లో ఈదుతున్న ఒక పెద్ద తిమింగిలాన్ని లాన్ని చూసి దానికి కౌసల్యను ఎరగా వేస్తె పీడా వదిలి పోతుంది అది ఆమెను మింగేస్తే కౌసల్య కద కంచికే కదా ఆమెకిక పిల్లలు పుట్టటం, పుట్టినవాడు తనను చంపటం ఉండదుకదా అని ఆలోచించి ఒక పెట్టెలో పెట్టి సముద్రం లోకి తిమింగిలం ఉన్న చోట పడేశాడు .ఇక ఆమె వలన ఏ భయమూ లేదని నిశ్చింతగా లంకకు చేరాడు పదితలలవాడు .తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తున్దికదా.ఆ తిమింగిలం ఇతర జల జీవులతో పోట్లాడి జయించాలని కోరిక కల్గి నోటితో ఆ పెట్టును లాక్కుపోతూ సముద్రం ఒడ్డున దాన్ని ఉంచి మళ్ళీ సముద్రంలోకి చేరి జలచరాలతో కల హిస్తోంది .సుమంత్రుడు రాజు దశరధుడు ప్రయాణం చేస్తున్న నౌకా ఖండం అప్పుడే అక్కడికి చేరింది .అక్కడున్న పెట్టెను చూసి ఇద్దరూ ఆశ్చర్య పోయారు .పెట్టె తెరచి చూస్తె కౌసల్య కన్య కనిపించింది .ఒకరికొకరు పరిచయమై ప్రేమ పెంచుకొన్నారు అవ్యవధానం గా ఇద్దరూ గాంధర్వ విధిలో వివాహం చేసుకొన్నారు . -‘’భార్యా భర్తా సుమంత్రుడు ముగ్గురూ కూడా ఆ పెట్టెలో దూరిరి మూత వేసేసుకొన్నారు .తిమింగిలం శత్రువులను జయించి వచ్చి మళ్ళీ ఆ పెట్టెను నోట కరచుకొని సముద్రం లో దిగింది .

లంక చేరిన రావణుడు బ్రహ్మను పిలిపించి ఆయన చెప్పిన మాట అబద్ధం అయ్యిందని ప్రగల్భాలు పలికాడు .నవ్విన బ్రహ్మ దేవుడు ‘’ఓం పుణ్యాహం ‘’అని గట్టిగా అన్నాడు .అర్ధం కాక రావణుడు షేక్స్ పియర్ ఫేస్ పెట్టాడు .బ్రహ్మ ‘’కౌసల్యా దశరదుల వివాహం జరిగి పోయింది కదా !’’అన్నాడు .విషయం తెలుసుకొన్న పదితలలవాడు తిమింగిలానికి ఎరగా వేసిన పెట్టెను తెప్పించాడు .అందులో చిలకా గోరింకల్లా కౌసల్యా, పదిరదాల దశరధుడు నవ్వుకుంటూ కుల్కుతూ కనిపించారు .క్రోదా వేశం  తో రావణుడు ఖడ్గం తీసి వారిని చంపబోయాడు .బ్రహ్మ వారిస్తూ ‘’నువ్వు పెట్టెలో కౌసల్యను ఒక్కదానినే పెట్టావు .ఇప్పుడు అందులో ముగ్గురున్నారు .కాసేపట్లో కోట్లకొలది జనం కాగలరు ‘’ ’’కౌసలై స్తాపితా శ్యాం పటికాయాం త్వయాపురా –త్రయస్త్రతు సంజాతా భవిష్యం త్యత్ర కోటిశః-‘’ అని భయపెట్టాడు .నువ్వు ఇప్పుడే వీళ్లిద్దర్ని చంపితే ఇప్పుడే రాముడు పుట్టి నిన్ను  చంపేస్తాడు జాగ్రత్త .భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు కనుక నవ వివాహ దంపతులను సుఖం గా సాకేత రాజధానికి పంపించేయ్యి .నా మాట విను .కాస్తకాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు ‘’అన్నాడు .భయపడిన రావణుడు బ్రహ్మ చెప్పిన మాట విని ఆ పెట్టెను కోసల దేశానికి  భద్రం గాపంపించేశాడు .ప్రజా సమక్షం లో కోసల రాజు మళ్ళీ వారిద్దరికీ అపూర్వంగా వివాహం జరిపించాడు .తన రాజ్యాన్ని దశ రదునికి కానుకగా ఇచ్చేశాడు .అప్పటినుంచే సూర్య వంశ రాజులు’’ కౌసలేన్ద్రులు’’ అని పిలువ బడ్డారు .

తర్వాత దశరధుడు మగధ రాజ సుత సుమిత్రను పెళ్లి చేసుకొన్నాడు .ఆ తర్వాత కేకయ రాజకన్య కైకేయినీ వివాహమాడి ముగ్గురు రాణులతో స్వర్గ సుఖాలు అనుభవించాడు .అన్నీ ఉన్నాయికాని దశరధునికి సంతానం కలగలేదు ముసలి వాడై పోతున్నాడు .ఈ బెంగ బాగా బాధిస్తోంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-4-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -1

ఆనంద రామాయణ విశేషాలు -1

శ్రీమద్రామాయణం మన తొలికావ్యం .వాల్మీకి మహర్షి కృతం .ఈ మహర్షి ఆనందరామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,వాసిష్ట రామాయణం అనబడే యోగ వాసిస్టం కూడా రాశాడు . ఆనందరామాయణం లో శ్రీరాముని ఆనందమయ స్వరూపునిగా అభివర్ణించాడు వాల్మీకి .ఇందులో మనం ఇదివరకు వినని చూడని విశేషాలున్నాయి .వాటిని తెలియ జేయటానికే ఈ ప్రయత్నం .శివుడు పార్వతికి చెప్పిన కధలే ఇవన్నీ . బ్రహ్మశ్రీ సిద్ధాంతి శివ శంకర శాస్త్రులుగారు తెలుగు తాత్పర్యం రాసిన  ఈ గ్రంధాన్ని మూడు సంపుటాలుగా ‘’సర్వారాయా ధార్మికవిద్యా  ట్రస్ట్ –కాకినాడ- తూర్పు గోదావరిజిల్లా -533001’’వారు 2005లో పునర్ముద్రించారు .దీన్ని ఉయ్యూరు లైబ్రరీలో నుంచి తెచ్చి చూశాను .ఆ విశేషాలు అందరికి తెలియజేయాలనే ఉత్సుకతే ఈ ప్రయత్నం .

రాముడు  జరుపుకొన్న దీపావళి

సీతారాముల వివాహమై అయోధ్యలో హాయిగా ఆనందాన్ని అనుభ విస్తున్నారు .శరత్కాలం లో ఆశ్వయుజమాసం లో జనకమహారాజు వియ్యంకుడు దాశరధ మహా రాజును మిధిలకు సగౌరవం గా ఆహ్వానించటానికి మంత్రులను పంపాడు .దశరధుడు వారికి యధోచిత అతిధి మర్యాదలు నిర్వహించాడు .వారిని వచ్చిన కారణం అడిగాడు .అప్పుడు మంత్రులు ‘’దీపావల్యుత్స వార్ధం త్వాం సకుటుంబ సమంత్రిణం-పౌర జాన పదైస్సౌక మాహ్వాయామాస తేసుహృత్ ‘’అన్నారు ‘’మహారాజా!మీ మిత్రులు జనక మహారాజు మిమ్మల్ని సకుటుంబ పరివారం గా దీపావళి మహోత్సవానికి దయ చేయవలసినదిగా ప్రార్ధించారు ‘’అని వినయంగా చెప్పారు .

దశరధుడు అంగీకరించి ఈ విషయాన్నిదేశం లో  అందరికి తెలియ జేసేట్లు చాటింపు వేయించాడు .మంచి ముహూర్తం చూసుకొని పౌరులతో సకుటుంబం గా మిధిలకు ప్రయాణం సాగించాడు .శ్రీ సీతారామ లక్ష్మణులు ,కౌసల్యాది మాతలు ,సీత మొదలైన రాజ పత్నులు ఏనుగులను ఎక్కి ,దాస దాసీ జనాలతో మహా వైభవం గా ,మహోత్సవంగా బయల్దేరారు .వియ్యంకుని రాక  విషయం తెలిసిన మిదిలాదీశుడు అంతే వైభవం గా వారికి స్వాగత సత్కారాలు చేయటానికి సన్నద్ధుడై బంధు మిత్ర పరివారసమేతంగా ఎదురు వెళ్లి స్వాగతించాడు .మంగళ వాద్యాలతో నృత్యం చేసే నర్తకీ మణులతో మేడ పైభాగాలనుండి  పౌర స్త్రీలు చల్లే పుష్ప వర్షం తో మిధిలా అంతా పండుగ వాతావరణం లో ఉంది అందరికీ తమ ఇంటికే అమ్మాయి అల్లుడు వస్తున్న అనుభూతి పొందారు .దశరాదులకు ఆర్గ్య పాద్యాదులు సమర్పించి బందుగణాన్ని సాదరంగా జనకర్షి ఆహ్వానించి రాజభవనానికి తోడ్కొని వెళ్ళాడు .

అందరికి నూతన వస్త్రాలు సమర్పించి ,మ్రుస్టాన్న భోజనాలతో విందు చేసి అల్లుళ్ళను రత్నదీప కాంతులతో అలరించాడు .’’జనకః పూజయామాస దీపావల్యాం మహాదినే –దీపోత్సవై ర్మహా పుణ్యే బలిరాజ్యం ప్రవర్తితే –ఆనంద సర్వలోకానాం మంగళాని గృహే గృహే ‘’మహా పుణ్యమైన దీపావళి రోజున ప్రతి ఇంటా సర్వలోకానందం వెల్లి  విరిసేట్లు మహా ఉత్సవం జరిపించాడు .అప్పుడు బలి రాజ్యం సర్వ శోభాయమానమై వెలిగిపోతుంది .అల్లుళ్ళకు అభ్యంగన స్నానాలు చేయించి భోజన భాజనాదులు సమకూర్చి గోవులు దాస దాసీజనం ,చతురంగ సైన్యం సమర్పించి సంతృప్తి చెందాడు .అలాగే జానకీ మొదలైన కుమార్తెలకు సముచిత పుట్ట్టింటి మర్యాదలు జరిపాడు .వచ్చిన అయోధ్యావాసులన్దరిని మహా గౌరవం గా సత్కరించాడు .జనక మహారాజు ఎవరికీ ఏ లోపమూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు .వియ్యంకుని ఇంటిలో దీపావళి మహోత్సవాన్ని కుమారులు కోడళ్ళు భార్యలు మంత్రి పురోహితులు ,పురజనుల సమేతంగా సంతృప్తిగా ఆనందంగా జరుపుకొని దశరధుడు మరల అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు .ఇదీ ఆనంద రామాయణం లో రామాదులు జరుపుకొన్న మొదటి దీపావళి పండుగ .

దారిలో ఉండగా సీతా స్వయం వరం లో ధనుర్భంగం చేయలేక హతాశులైన వివిధ రాజులుఅందరు కలిసి  పగ బట్టి శదశరధుని  పై కి దండ యాత్రగా వచ్చి ముట్టడించారు .కంగారుపడ్డాడు దశరధుడు .రాముడు లక్ష్మణ సమేతం గా తండ్రిని సమీపించి తానూ ఉండగా భయ పడాల్సినదేమీ లేదని తండ్రికి చెప్పాడు .అప్పుడాయన ‘’నీకు పదహారు ఏళ్లుమాత్రమే .వాళ్ళు నామీదకు వచ్చారు .నేనే తేలుస్తాను ‘’అన్నాడు .రాముడు ‘’నేను చేయలేనప్పుడు మీరు నాకు సహాయం రావచ్చు .మనవారందరి యోగ క్షేమాలు చూస్తూ ఉండండి ‘’అని విన్న వించాడు .ఆలస్యం అమృతం విషం అని శ్రీరాముడు ధనుర్బాణాలు తీసుకొని తండ్రి రధం ఎక్కి  శత్రురాజులపై కి వెళ్ళాడు  .మహా తేజం తో ఉన్న రాముని చూసి వారందరూ  ముందుభయపడినా తర్వాత యుద్ధానికి దిగారు .భీకర యుద్ధం జరిగింది .లక్ష్మణ భారత శత్రుఘ్నులూ యుద్ధానికి దిగారు .శత్రురాజులు భారత శత్రుఘ్నులను బాణాలతో మూర్చ పోయేట్లు చేశారు .ఆగ్రహించిన లక్ష్మణుడు కూడా వారితో తాలపడ్డాడు కాని శక్తి చాలక పోయింది .ఇక ఉపేక్ష చేయరాదని రాముడు రాజులపై వారి సైన్యం పై వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ,సముద్ర తీరం వరకు తరిమేశాడు .మిగిలిన వారిపై మోహనాస్త్రాన్ని ప్రయోగించి మూర్చిల్ల జేశాడు .

భరతుని ఒడిలోకి తీసుకొని కైక ఏడవటం ప్రారంభించింది .వారిని అందర్నీ సమాధాన పరచి లక్ష్మణుడిని దగ్గరలో ఉన్న ముద్గల ముని ఆశ్రమానికిఆయుధాలు లేకుండా  వెళ్లి అక్కడున్న సంజీవిని మొదలైన ఓషధులను అడిగి తీసుకొని రమ్మని పంపాడు .శిష్యులవలన లక్ష్మణ ఆగమన వార్త విని ముని సంతోషించి సంజీవిని ని ఇచ్చి పంపాడు. దానితో భారత శత్రుఘ్నుల మూర్చ  నుండి రాముడు తేరుకోనేట్లు చేశాడు .ముని దశరాధులకు స్వాగతమిచ్చి శ్రీరామ దర్శనం తో పులకి౦చిపోయాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షేక్స్ పియర్ మహాకవి 129 వ సానెట్ కు డాక్టర్ యెన్ .ఎస్.రాచకొండ అనువాదం

షేక్స్ పియర్ మహాకవి 129 వ సానెట్ కు డాక్టర్ యెన్ .ఎస్.రాచకొండ అనువాదం

ఆంగ్లమూలం

SONNET 129

The expense of spirit in a waste of shame
Is lust in action; and till action, lust
Is perjured, murderous, bloody, full of blame,
Savage, extreme, rude, cruel, not to trust,
Enjoy’d no sooner but despised straight,
Past reason hunted, and no sooner had
Past reason hated, as a swallow’d bait
On purpose laid to make the taker mad;
Mad in pursuit and in possession so;
Had, having, and in quest to have, extreme;
A bliss in proof, and proved, a very woe;
Before, a joy proposed; behind, a dream.
All this the world well knows; yet none knows well
To shun the heaven that leads men to this hell.

_________

శీర్షిక

‘’ పరిభవ వ్యర్ధ ముత్సాహ వ్యయము ‘’

పరిభవ వ్యర్ధ ముత్సాహ వ్యయము రతియు

కార్య రూప పూర్వము కళంక భరితమ్ము

ఆటవికత మోస చరిత్ర ,మోటుతనము

అప్రమాణమ్ము అమితాశ హత్య తలపు

క్రూరతయు రుధిర ప్రసక్తి కూడి యుండు

తృప్తి నొందిన వెంటనే త్రోసి వేయు

తన్ను ఉద్రేక పరునిగా చేయదలచి

ఎరను మ్రింగించి పన్నిన హేతువగుచు

మొదటి హేతువునే కూడి తుదకు రోయు

వెంబడించ వెర్రి ,వశమైన వెర్రి ఇంక

పొందినను పొందు చున్నను పొందబోవు

చున్న వయినను తీవ్రత మిన్ను తాకు

మంచి చెడ్డల బాధించు మాట  లేదు

సుఖము శోభింప రుజువౌను దుఖ మేను

సంతసము కోర లభియించు స్వప్నమొకటే

ధరణి మనుజుల కిది సర్వ మెరుక కాని

నరకమునకు బాట యగు నీ నాక సుఖము

రోయు టెరుగ రెవ్వరైన రూఢి గాను .

13-4-15

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

కమనీయం కావ్యం

కమనీయం కావ్యం

Added At : Sat, 04/11/2015 – 23:17

కమనీయం కావ్యం లోకోత్తర వర్ణనా నిపుణులైన కవి యొక్క కర్మయే కావ్యమని మమ్మటాచార్యుడు అన్నారు. కవి శబ్దం మొదట వేదములందు గోచరించుచున్నది. వేదాలలో కవి శబ్దమును పరమాత్ముని అర్థమున వాడబడును. ఆ తర్వాత అది పరమాత్‌ స్వరూపులైన ఋషులకు వాడబడును. వేదమంత్రములు దర్శించుట వల్ల మహాఋషులు వారే కవులు. నా కృషి కురుతే కావ్యమ్‌ అనే వాక్యాన్ని బట్టి ఋషికానివాడు కవి కాలేడు అని కవికానివాడు కావ్యం రచించలేడు. అంటే ఋషి కావ్య నిర్మాణం చేయగలడని తెలుస్తున్నది. వేదాలను, పురాణాలను బాగా నెరింగిన కవి కావ్యాన్ని అల్లుతాడు.
కావ్యములో వేదాలలో గల శాసన రూప శక్తిని పురాణాలలో హితవుతో కూడిన శక్తిని కావ్యంలో రసోచితంగా విషయాన్ని అందిస్తాడు కవి. లోకోత్తర ప్రాంగణానైపుణ్యం ప్రతిభ వలన సాధ్యమగుచున్నది. ప్రతిభ దేవతానుగ్రహం వలన సంప్రాప్తమగును. దేవతానుగ్రహం, తపస్సాం పద్యం, తపస్సు ఋషి వ్యాపారం అందుచేతనే ఋషి కానివాడు కావ్యం నిర్మింప జాలడన్న మాట కలిగినది.
కావ్యాంగము కాని, శబ్దము కాని, న్యాయం కాని, విద్యాకాని, కళ కానిది లేదు. క్రీ.శ. 5వ శతాబ్దా నికి చెందిన ‘భామహుడు’ శ్రవ్యకావ్య చర్చ గావించి సహితంలైన శబ్దార్ధమును కావ్యమని చెప్పిరి. భామహుని అభిప్రాయం అనుసరించి శబ్ధముగళమ కావ్య శరీరం, అలంకారలు సౌందర్యమును కలిగించు భూషణములు. క్రీ.శ. 6వ శతాబ్దికి చెందిన దండి అనేకవి ఇష్టార్థవ్యవ స్థితమైన పద సమూహమే కావ్యమని అన్నాడు. ఇష్టార్థ మనగా కమనీయమైన అర్థం ఇటువంటి శబ్దాలతో కూడుకొన్న సమూహమును కావ్యమని చెప్పారు.
క్రీ.శ. 6వ శతాబ్ది వాడయినటువంటి వామనుడు గుణములచే ఏర్పడురీతి కావ్యాత్మ అనీ, అలంకారమును తత్‌ సౌందర్య పోషక ముల నియు నుడివినారు. ఆనందవర్ధనుడు విశిష్టంగా చెప్పకపోయినా, అభి నవగుప్తుడు చెప్పిన రీతినే బలపరిచినాడు.
మహిమ భట్టు, కుంతకుడు మొదలగు వారు శతార్థయుగళము కావ్య శరీర మని సూచించిరి.
రస గంగాధర కర్తయైన జగన్నాథుడు దండి శబ్దమునకు ప్రాధాన్య మొసంగెను. శబ్ధార్థములు రెండూ అవినాభావ సంబం ధం కలిగి ఉండును. కాళిదాసు అర్థం, భావం, శబ్దమును ఆశ్రయించియే ఉండు నని చప్పి ఉన్నాడు.
సహితములైన శబ్దార్ధములు కావ్యమని భామహుడు, ఇష్టార్థ వ్యవశ్చిన్న మైన పదావళి కావ్యమని దండి, గుణాలంకార యుక్తములైన శబ్ధార్ధములు కావ్యమని వామ నుడు, అదోషములు, సుగుణములు, సాలం కార ములైన శబ్దార్ధములు కావ్య మని మమ్మటుడు, రసాత్మక వాక్యం కావ్యమని విశ్వనాథుడు, గుణాలంకార రీతి రసోపేతమైన సాదు శబ్ధార్థమ్‌ కావ్యమని పీయుషుడు, రమనీయార్థ, రమణీయార్థ ప్రతిపాదిక కావ్యమని జగన్నాథుడు, రసాలంకారయుక్తం అయినది కావ్యమని కేశవ మిశ్రుడు అన్నారు.
శబ్ద రత్నాకరముననుసరించి ప్రబోధం అంటే మేలు కొలుపుట అని అర్థం. ఈ ప్రబోధము రెండు విధాలుగా ఉండును. 1. మత పరమైనవి 2. సాంఘిక రాజకీయ పరమైనవి.
స్వాతంత్య్రం రాక పూర్వం మన భారతదేశ కవులు వివిధ భాషలల్లో ప్రబోధములు రచించారు. మత ప్రచారం కొరకు ఆయా మతాలవారు ప్రబోధ ప్రవచనాలు చేసారు. చేస్తూ ఉన్నారు.
జైన, బౌద్ధ మతాలవారు ఆయా మతాలవారు జనుల ప్రబోధార్థం జాతక కథలు, కొందరు కావ్యాలు రచించారు. శివవైష్ణవ మతాల వ్యాప్తికి ద్విప దలు, ప్రబంధాలు వెలి సాయి. పాలుకురికి సోమనాథుడు ప్రబోధాత్మక శతకం రచించాడు. ”బసవా బసవా బసవా వృషాధిప” అనే శతకం ద్వారా మత వ్యాప్తి నాశిం చాడు. అట్లాగే ఇతర మతాలవాళ్లు పాటలు మొదలైన సాహిత్యాన్ని ఉప యోగించు కున్నారు.
దాస్య తిమిరా వళిలో పడి పరాధీన శృంక లాల తగిలి కొట్టు మిట్టాడుతున్న జాతిని ఉద్ధరించ డానికి కవులు కలం పట్టారు. అట్ట డుగున పడి సమా జంచే వెలియేయ బడ్డ వారం తా ఒక్కు మ్మడిగా విజృం భించి జాతిని ఉత్తేజ పరి చారు. వారు రాసిం దంతా ప్రబోధ సాహి త్యమే.
దవులపల్లి వారు తన ”సారస్వత నవనీతం” లో అంటారు – నిద్రాణమై ఉన్న జాతిని మేలు కొలుపు టకు సాహిత్యం కన్న మహత్తరమైన సాధనం మరొక్కటి లేదనీ, రూజువెల్డు వాల్టేరు లు రచనల వలన ఫ్రెంచి విప్లవం వచ్చిందనీ.
ఇంతెందుకు టాలిస్టాయ్‌, మాక్సింగోర్కి డాసో వస్కీ ప్రభృతులు రష్యా వాఙ్మయం ద్వారా ఆదేశా లల్లో అద్భుతమైన ప్రబోధం కలిగించారు.
బ్రిటిష్‌ పరిపాలన కింద అణగారి పోయిన భారతీ యులను తమ విద్యుక్త ధర్మాలను పాలింప వలసినదిగ ప్రబోధించి, మేలు కొలిపినది వాఙ్మ యమేనని చెప్పవచ్చు. మన స్వాతంత్య్రోద్యమ చరిత్ర ఒక ఉద్యమంగా వ్యాప్తి చెందుటకు వాఙ్మయ ప్రాబ ల్యమే నని చెప్పవచ్చు. ప్రబుద్ధ భారతానికి తొలి వైతాళికులు రచ యితలేనని నిర్ధారణ చేయవచ్చు.

యం.వి. నరసింహారెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ నేతల అనవసర రాద్ధాంతం

తమిళ నేతల అనవసర రాద్ధాంతం

  • – ముదిగొండ శివప్రసాద్ ఫోన్ :040-27425688
  • 08/04/2015
TAGS:

ఆంధ్రుల ఆస్తులు తగులబెట్టండి – ఆంధ్రుల హోటళ్లపై ఆస్తులపై దాడులు చేయండి అంటూ నాన్ తమిళ కచ్చి అనే ఒక తమిళ పార్టీ మంగళవారం మధ్యాహ్నం పిలుపునిచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటాన్ని తగులబెట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొసలి కన్నీరు పెట్టారు. వైగో అనే మరొక తమిళనేత, తమిళుల మృతి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇళంగోవన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని బెదిరించారు. ఇంతకూ అసలు జరిగిందేమిటి? ఎన్నో సంవత్సరాలుగా తమిళనాడులో, కర్ణాటకలో శేషాచలం అరణ్యాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతోంది. శేషాచలం అడవులు ప్రతి ఏప్రిల్ నెలలోను తగులబడుతుంటాయి.
ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్ అనే గజదొంగ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ అనే నటుడిని అపహరించాడు. అతడిని విడిపించుకోవడం కోసం రహస్యంగా కోట్లాది రూపాయలు ఆనాటి కర్ణాటక ప్రభుత్వం దొంగల ముఠాకు సమర్పింకొంది. ఎర్రచందనం వస్తువులకు చైనావంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ కారణం చేత కావేరీ నదిలో ఎర్రచందనం దుంగలు నరికి పడేస్తుంటారు. వాటిని పట్టుకొని మరపడవల ద్వారా మాఫియా ముఠాలు గమ్యస్థానానికి చేరుస్తుంటాయి. ఈ అంశంపై లోగడ తమిళంలో రెండు సినిమాలు కూడా వచ్చాయి. ఎర్ర చందనం స్మగ్లర్లు బడా పారిశ్రామిక వేత్తలు రాజకీయ ప్రాబల్యం కలవారు.
శేషాచలం అడవుల్లోని చందనం దొంగలు ఎక్కువమంది తమిళ కూలీలు. వారు పూట గడవక ఈ రహస్య వ్యాపారంలోకి దిగారనేది బహిరంగ సత్యం. ఐతే అసలు విషయం అదికాదు. ఇన్నాళ్లు ఎర్రచందనం దొంగలు ఫారెస్టు ఆఫీసర్ల మీద దాడులు చేస్తూ వచ్చారు. పోలీసులను చంపారు. అడవులు తగులబెట్టారు. సోమవారం సాయంత్రం కొందరు పోలీసులు అడవుల్లో నిఘా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే వారిపై చందనం దొంగలు కొడవళ్లతో, వేటకత్తులతో దాడి చేశారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో దాదాపు ఇరవై మంది దొంగలు హతులయ్యారు. అందుకు ప్రతీకారంగా తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. ఇది మానవహక్కుల ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి ప్రకటన విడుదల చేశారు. మానవహక్కులు హరింపబడ్డాయి అంటూ మానవ హక్కుల సంఘాలవారు కోర్టుకు వెళతామంటూ బెదిరించారు. కోర్టుకు వెళ్లవచ్చు. అందులో తప్పేమీ లేదు. కోర్టు తీర్పు ఎలాగైనా రావచ్చు. కాకుంటే పోలీసులు మానవులు కాదా? వారికి మానవహక్కులు ఉండవా? వారు ఆత్మరక్షణార్ధం కాల్పులు జరపడం భయంకరమైన నేరమా? మానవహక్కులు మృగాలకు కూడా ఉంటాయా? ఎర్ర చందనం దొంగలు, అంతర్జాతీయ ఉగ్రవాదులు, సాయుధ చైనా ప్రేరేపిత బీభత్సకారులు, ‘మానవుల’నే పిలువబడుతారా? శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లినప్పుడు దానిని పరిరక్షించ వలసిన బాధ్యత భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వానికి ఉంటుంది. ‘‘మాకు భారత రాజ్యాంగంపై గౌరవం లేదు’’ అనే చందనం దొంగలు, సిమీ ఉగ్రవాదులు, రాజ్యాంగ చట్టాల పరిధిలోకి రారు.
హైదరాబాదు సమీపంలో పెంబర్తి వద్ద మంగళవారం ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో కరుడు కట్టిన వికారుద్దీన్ జిహాదీ ఉగ్రవాద ముఠా హతమైంది. అంతకు ముందు రెండు రోజుల క్రితం సూర్యాపేట వద్ద జరిగిన ఘటనలో మరో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు హతులైనారు. వీరు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్‌ఐ సిద్దయ్య తీవ్రం గా గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పు లు జరిపారు. సిద్దయ్య రెండు రోజులు మృత్యువుతో పోరాడి మంగళవారం సాయంత్రం కామినేని ఆసుపత్రిలో కన్ను మూసారు. పోలీసులు చనిపోయినప్పుడు నోరెత్తని మానవహక్కుల సంఘాలు, ఉగ్రవాదులు చనిపోతే గౌతమ బుద్ధుని శాంతి సూక్తాలు ఎందుకు పఠిస్తున్నారు?
పాపం ముస్లింలు చనిపోయారంటున్నారు. అంటే ఉగ్రవాది ముస్లిం అయితే అతడు మైనారిటీల రక్షణ పరిధిలోకి వస్తాడా? తమిళనాడుకు చెందిన నిమ్నజాతి చందనం దొంగలను చంపడం దారుణం అని కరుణానిధి ప్రకటించాడు. అంటే ఒక ఉగ్రవాది తమిళ జాతీయుడైనా అతనిపై చర్య తీసుకోకూడదు. అతడు తక్కువ కులంలో జన్మించినవాడైతే అతనిని వదిలిపెట్టవలసిందే. సింహళంలో వేలుపిళ్లై ప్రభాకరన్ అంతర్జాతీయ ఉగ్రవాది. అతనికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యక్షంగా మద్దతునిచ్చింది. ఫలితంగా అప్పుడు కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. తమిళ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని శ్రీ పెరంబుదూర్‌లో పొట్టన పెట్టుకున్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదులను సమర్ధించడం ఏమిటి? చంద్రబాబు నాయుడును ఇరుకున పెడితే మళ్లీ రఘువీరారెడ్డి లేదా సోనియాగాంధీ అధికారంలోకి వస్తారా? అంటే రాజకీయ లబ్దికోసం దేశాన్ని వెండిపళ్లెంలో పెట్టి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్‌కు అందజేయడానికి కాంగ్రెస్ నాయకులు, తమిళ రాజకీయ పార్టీల వారు సిద్ధంగా ఉన్నారనేది ఇక్కడ సారాంశం. భారతదేశ చరిత్రలో ఇలా చాలాసార్లు జరిగింది.
తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో చనిపోతే తమిళ నాయకులు చెన్నైలోని తెలుగు హోటళ్లపై దాడి చేస్తారట. జయలలితను కర్ణాటక కోర్టు శిక్షిస్తే బెంగళూరులోని కన్నడ హోటళ్లలో విధ్వంసానికి తమిళ సేన బెంగళూరుకు చేరడం ఇటీవలి చరిత్రయే.
‘‘సిమి ఉగ్రవాదులంతా మా పిల్లలు, మా సమాజ్‌వాది పార్టీ పొలిటికల్ వింగ్ అనుబంధంగా ఉండే విద్యార్థి సాంస్కృతిక విభాగం (స్టూడెంట్స్ కల్చరల్ వింగ్)’’..ఈ మాట అన్నది స్వయంగా ములాయం ఖాన్ సింగ్! ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడీయన. ఈయన 75వ జన్మదిన వేడుకలకు రాంపూర్‌లో కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత డబ్బు మీకెక్కడిది? అని ప్రశ్నిస్తే..‘‘మాకు మాఫియా గ్యాంగ్ లీడర్ దావూద్ ఇబ్రహీం ఇచ్చాడు’’ అని పార్టీ నాయకులు చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్లా మన రాజకీయ నేతలు?
కరుణానిధి కుమార్తె కనుమొజి బంధువులు మారన్ ప్రభృతులు 2-జి వాయు తరంగాల విక్రయం కేసులో వేల కోట్లు దిగమింగారు. అందుకు కనుమొజిని తీహార్ జైలులో పెట్టారు. అందుకు కరుణానిధి ఢిల్లీ వెళ్లి ‘నా కూతురును వదిలిపెట్టి కేసులు రద్దు చేస్తారా? లేక యుపిఎ ప్రభుత్వానికి నా మద్దతును ఉపసంహరించుకోమంటారా?’’ అంటూ కేంద్రాన్ని బెదిరించాడు. వీళ్లా మన రాజకీయ నాయకులు? వీళ్ల చేతిలో భారత జాతి సురక్షితంగా ఉంటుందా?
ఇప్పుడు కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అంతర్జాతీయ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాద ముఠాలకు, చైనా ప్రేరేపిత సాయుధ ఉగ్రవాదులకు, తమిళనాడు నాస్తిక ఉగ్రవాదులకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఎర్ర చందనం వ్యాపారాలు జరుపుతున్నది తమిళనాడుకు చెందిన బడా రాజకీయవేత్తలే. ఈ చనిపోయిన కూలీలు పొట్టకూటికోసం ఉగ్రవాద ముఠాల చేతిలో పావులుగా ఉపయోగపడ్డారు.
వేలుపిళ్లై ప్రభాకరన్ చేసిన దారుణాలకు జాఫ్నా, కచ్చైతీవు, వంటి ప్రాంతాలలో వేలాది మంది అమాయక తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మురుగన్ (కుమారస్వామి), పిళ్లియార్ (గణేశ్ దేవాలయాలు) నేలమట్టమైనాయి. ప్రభాకరన్ సకుటుంబంగా భారీ మూల్యం చెల్లించాడు. చివరి దశలో వృద్ధ తమిళ నేత కరుణానిధి ఇంకా ఉగ్రవాదులను వెనుకేసుకురావడం ఏమిటి?
1948 ప్రాంతంలో మద్రాసు ప్రావెన్సీస్‌లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం సాగింది అప్పుడు 60శాతం తెలుగు భాషా ప్రాంతాలైన మద్రాసు, తిరుత్తరణి, కృష్ణగిరి, హోసూరు వంటి వాటిని తమిళనాడుకు వదులుకున్నారు. ఇప్పుడు అక్కడి తెలుగు మీడియం పాఠశాలను నడిపితే (కృష్ణగిరిలో) దాడి చేశారు. పాండిచ్చేరిలో సంస్కృ త శిక్షణా శిబిరం నడిపితే దాడి చేశారు. తమిళ భాషీయులైన స్మగ్లర్లను వెనకేసుకొని వస్తున్నారు. చిదంబరం.. కనుమొజి, కరుణానిధి, దయానిధి, కళానిధి మారన్‌ల వేల కోట్ల కుంభకోణాలను కేవలం తమిళ భాషీయలనే సాకుతో ఉపేక్షించారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా? స్వచ్ఛ భారత్- మేకిన్ ఇండియా చాలా మంచి నినాదాలే. కానీ ఉగ్రవాదం, నేటి అగ్రవాదం, దీనిని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వంవారు ఎలా సమర్ధవంతంగా ఎదుర్కొంటారన్నది ఇక మీద చూడాలి.
మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి, ఉగ్రవాదులు సవాలు విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ మద్దతు కోల్పోతామేమోనన్న సంకుచిత దృష్టి పోకడతో తెలంగాణ సర్కార్ వ్యవహరించరాదు. ఎందుకంటె భారతదేశంలోని అన్ని ఉగ్రవాద కార్యకలాపాల జాతీయ మూలాలు హైదారాబాదు పాతబస్తీలోనే ఉన్నాయి.
మక్కా మసీదు, గోకుల్ ఛాట్, దిల్‌సుఖ్ నగర్ సాయిబాబాగుడి, సూర్యాపేట బస్టాండ్, పెంబర్తి (నేటి ఘటన)- ఇవన్నీ ఉగ్రవాద సంఘటనలే. ఉగ్రవాదులను నిర్లక్ష్యం చేస్తే నేడు సిద్దయ్య, నాగరాజు వంటి తెలంగాణ ముద్దుబిడ్డలైన పోలీసులు చేసిన త్యాగాలు నిష్ఫలవౌతాయి. ఆనాటి దొడ్డి కొమురయ్య, ఐలమ్మ, కొమురం భీం బలిదానాల వంటివే నేటి నాగరాజు, సిద్దయ్యల ఆత్మార్పణం. నష్టపరిహారం ద్వారా త్యాగాలకు విలువ కట్టలేం. ఉగ్రవాదాన్ని హైదరాబాదులో నిర్మూలించడమే వారికి సరియైన నివాళి. సీమాంధ్రలో అటు చంద్రబాబునాయుడు, ఇటు నాయని నరసింహారెడ్డి, ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌లకు ఇదొక పరీక్ష వంటిది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీ ప్రభుత్వంపై కత్తిగట్టిన చర్చి

మోదీ ప్రభుత్వంపై కత్తిగట్టిన చర్చి

  • srramanujan@gmail.com- cell:8008322206
  • 10/04/2015
TAGS:

గుడ్ ఫ్రైడే నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) తీసుకున్న నిర్ణయంపై అదే కోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ వ్యక్తం చేసిన తన నిరసనలో ‘వ్యక్తిగతం ఏమీ లేదు’ అన్నారు. నిజమే ఇందులో ‘వ్యక్తిగతం’ ఏమీ లేదు. ఎందుకంటే విస్తృత ప్రాతిపదికన ఒక ప్రణాళికా బద్ధంగా ‘చర్చి’ నిర్వహిస్తున్న కుట్రను అమలు జరపడంలో ఆయన కూడ ఒక సైనికుడుగా ఉన్నాడు! భారత్‌లోని శాంతి కాముకులైన క్రైస్తవుల పట్ల మోదీ ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తున్నదంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడమే ఆ కుట్రలోని అంతరార్థం. ఈ వ్యూహాత్మక ప్రణాళికకు సెక్యూలర్ పోరాటవాదులైన మీడియా సంపూర్ణ మద్దతు. భారత్‌లోని క్రైస్తవులు ముట్టడిలో చిక్కుకున్నారని వీరి ప్రచారం. జాతి ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్న దేశంలోని ఒకే ఒక సంస్థ, జాతీయ మీడియా. దానికి ప్రతి రోజూ ఏదో ఒక వివాదం కావాలి. దాన్ని రచ్చ చేసి ఎంపిక చేసుకున్న రీతిలో విషాన్ని విరజిమ్మాలి. కోల్‌కతాలోని బేలూర్ మఠంలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనపై, అదేవిధంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ ఊహాగానాలు కల్పించడంలో జాతీయ మీడియా ఎంతటి వివక్షాపూరితంగా వ్యవహరించిందో మనం చూశాం.
పరిస్థితులు ఏవిధంగా పరిణమిస్తున్నాయో పరిశీలించండి. ప్రజా జీవితానికి సంబంధించి వివిధ రంగాల్లోని ప్రముఖులు చర్చి విద్వేషపూరిత ప్రోత్సాహంతో ఏవిధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి..జస్టిస్ జార్జ్ కురియన్ లేఖ రాస్తూ, ‘ఇటువంటి సమావేశాలకు, కేవలం క్రైస్తవుల పర్వదినాలనే ఎందుకు ఎంచుకుంటున్నారు? దసరా, దీపావళి, ఈద్ వంటి ఇతర పండుగలను ఎందుకు ఎంపిక చేయరు?’ అని ప్రశ్నించారు. దీనికి సిజెఐ సమాధానమిస్తూ, ‘ప్రతివారు వ్యక్తిగత ప్రయోజనం కంటే జాతి ప్రయోజనాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. అంతకు ముందు ఇదే మాదిరిగా ఒక మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జి రాసిన లేఖకు సిజెఐ బదులిస్తూ, ‘ఒక వేళ మీకు కష్టం వాటిల్లిందని భావిస్తే…తక్షణమే దానిపై పిటిషన్ వేయవచ్చు’నని స్పష్టం చేశారు.
మరి ఇటువంటివన్నీ ఫలితాలనివ్వనప్పుడు సహజంగానే ‘బంతి చర్చి కోర్టు’కు చేరుతుంది. ఈ విషయంలో కూడా సరీగ్గా అదే జరిగింది. గుడ్‌ఫ్రైడేకి వారం రోజుల ముందు క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సిజెఐకి ఒక లేఖ రాసింది. అందులో ‘క్రైస్తవుల చట్టబద్ధమైన మనోభావాలను, పరిగణలోకి తీసుకోవాలి’ అని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిని పరిశీలిస్తే మనకు ఒక్కటి స్పష్టమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉన్న క్రైస్తవ అధికార్లకు, చర్చికి మధ్య గాఢమైన సంబంధమున్నదన్న వాస్తవం వెల్లడైంది. వారు జూలియస్ రబిరో, అడ్మిరల్ సుశీల్ కుమార్, జస్టిస్ కురియన్..ఏవరైనా కావచ్చు.
ఒకవేళ జస్టిస్ కురియన్‌కు తన మత విశ్వాసం ప్రకారం చట్టబద్ధంగా సెలవు తీసుకోవాలనుకుంటే..సిజెఐ ఛాంబర్‌లోకి వెళ్లి, ఈ సమావేశానికి హాజరు కాకుండా తనకు మినహాయింపునివ్వాలని కోరవచ్చు. అందులో తప్పేం లేదు. అందుకు బదులుగా ఆయన దీనికి మతం రంగు పులమడానికి యత్నించారు. ఈవిధంగా చేయడం ద్వారా చర్చి ఈ విషయంలో కలుగజేసుకోవడానికి కావాలనే అవకాశం కల్పించినట్టయింది. ఇక దీనికితోడు ఛానళ్లవారు ఎలాగూ సిద్ధంగానే ఉన్నారు. ఇటువంటి సంఘటనలకు విపరీత ప్రచారం కల్పించి, మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలపాలని మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా మైనారిటీల పట్ల మోదీ ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తోందంటూ విపరీతంగా ఊదరగొట్టడమే వీటి పని. 2014కు ముందు నుంచీ వారు ప్రచారం చేసేది దీనే్న. కాకపోతే ఇప్పుడు తమను తాము సమర్ధించుకోవడానికి ఋజువులకోసం యత్నిస్తున్నారంతే.
తాను మతంరంగు పులమడానికి యత్నించలేదంటూ తర్వాత జస్టిస్ కురియన్ వివరణ ఇచ్చారు. కానీ అది కేవలం తాను చేసిన పనినుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే. ఎందుకంటే ఆయన తన లేఖలో ఇతర పండుగలతో ఎందుకు సరిపోల్చాల్సి వచ్చింది? గుడ్‌ఫ్రైడే ఎంతో ప్రాధాన్యమైన పండుగ. క్రైస్తవులు అత్యంత భక్తి ప్రపత్తులతో దీన్ని పాటిస్తారు. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. గుడ్‌ఫ్రైడే అనేది జాతీయ సెలవుదినమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమంటే…మొత్తం జనాభాలో కేవలం మూడుశాతం ఉన్న క్రైస్తవులకోసం మిగిలిన 80శాతం మంది మెజారిటీ ప్రజలు ఎందుకు పనిచేయకుండా ఉండాలి? దేశం స్తంభించి పోవాలా? మైనారిటీల ప్రయోజనం కోసం మెజారిటీలు సాధనంగా మారాలా? అనారోగ్యగ్రస్తులైన మన ఉదారవాదులు..తాము ప్రజాస్వామ్యానికిచ్చే నిర్వచనం ప్రకారమే వ్యవహరిస్తారు. ఎంత అద్భుతం!?
ఇప్పుడు మన మీడియా పాత్ర విషయానికి వద్దాం. తాము చేసే ప్రచారాన్ని ఆమోదించేవారికోసం అది చూస్తున్నది. ఆర్థిక వేత్త జగదీశ్ భగవతి వీరి ప్రచారాన్ని ఆమోదించకపోవడంతో, వెంటనే రిటైర్డ్ అడ్మిరల్‌ను రంగంలోకి దించి తమ ఎజెండాను ఆమోదింపజేసుకుంది. ఎప్పుడూ టివి ఛానళ్లలో కనిపించని ముంబయికి చెందిన ఒక సిస్టర్ చేత..మోదీ ప్రభుత్వానికి నాజీలకు తేడాలేదని చెప్పించారు. మరో ప్యానలిస్టు వెంటనే ఆమె మాటలను ఖండిస్తే…యాంకర్ రంగంలోకి దిగి ‘కేవలం ఉపమానం కోసమే ఆమె అలా అన్నారు’ అంటూ వెనకేసుకురావడానికి యత్నించాడు. ఆమె ఆవిధంగా సరిపోల్చడం తప్పని సదరు యాంకర్ ఒక్కమాట కూడా అనలేదు. అనడు..!ఎందుకంటే వారిద్దరిదీ ఒకే ఎజెండా మరి!
ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్/తెలంగాణల్లో రెండు ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఒక మత ప్రచారకుడిపై ఆరోపణలు వచ్చాయి. దేవుడికి ఇష్టం కనుక మహిళలు నగ్నంగా ప్రార్ధనలు చేయాలంటూ అతగాడు ఒత్తిడి తీసుకొచ్చాడట! ఖమ్మం జిల్లా చర్లమండలం, దేవన్నపేట గ్రామంలో మరో సంఘటన జరిగింది. 22 ఏళ్ల గిరిజన బాలికపై 40 ఏళ్ల మత ప్రచారకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. మరి ఈ వార్తలు ఏ జాతీయ ఛానల్‌లోనైనా ప్రసారమయ్యాయా? కానీ పశ్చిమ బెంగాల్‌లో కానె్వంట్ విద్యార్థుల బెదిరింపు అనేది మాత్రం జాతీయ స్థాయి వార్త! మరి ఇదెందుకు జరిగిందంటే..‘క్రైస్తవం ముట్టడిలో ఉన్నది’ అని ప్రచారం చేయడానికి! చెన్నై నుంచి ప్రచురితమయ్యే ఒక డైలీ మాత్రం ఈ వార్తను ప్రచురించే సమయంలో తగిన ‘జాగ్రత్తలు’ తీసుకుంది. సదరు ‘మత ప్రచారకుడి’ మతాన్ని మాత్రం రాయలేదు!
ఇదే సమయంలో ఒక ఛానల్‌ను మాత్రం ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. సామాజిక మీడియా ఈ ఛానల్‌ను ‘అవమాన’ పరచినప్పటికీ..అది ప్రసారం చేసింది మాత్రం వాస్తవం. చర్చిలపై జరిగిన దాడులపై కొన్ని గణాంకాలను విడుదల చేసింది. వీటిని పరిశీలిస్తే యుపిఎ ప్రభుత్వం హయాంలో జరిగిన, దాడులు, ప్రస్తుతం జరిగిన దాడులు సమానంగానే ఉన్నాయి. 2013, మే 26 నుంచి, 2014, మార్చి 31 వరకు ‘క్రైస్తవ వ్యతిరేక దాడుల’’ సంఘటనలు కేవలం పది మాత్రమే జరిగాయి. వీటిల్లో సగానికి సగం ఇంతవరకు పరిష్కారం కాలేదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 మార్చి వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు చర్చిల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కేసులు కూడా ఉన్నాయి. అయితే రానాఘాట్ సంఘటనకు బంగ్లాదేశ్ మూలాలున్నట్టుతేలింది.
కోస్తా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి గ్రామంలో చర్చ్‌లు ఉన్నాయి. వీటిని ఇండియా టుడే వ్యక్తీకరణలో చెప్పాలంటే ‘స్వేచ్ఛా ప్రచారకులు’(ఫ్రీలాన్సర్స్ ఆఫ్ గాడ్) నిర్వహిస్తున్నారు. దేశంలో స్వంతత్ర చర్చిల సంఖ్య విపరీతంగా పెరిగితోతున్నదని, వీటికి విదేశీ నిధులు పుష్కలంగా అందుతున్నాయని ఇదే మ్యాగజీన్ కొనే్నళ్ల క్రితం రాసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రశ్న..‘‘మీడియా సహకారంతో చర్చ్ ఎందుకింత గగ్గోలు పెట్టడం?’’ మోదీ ప్రభుత్వం పుణ్యమాని బిలియన్లకొద్దీ తమకు వస్తున్న విదేశీ నిధులకు ఎక్కడ గండి పడుతుందోనన్న అనుమానమే వీరినిలా పురికొల్పుతోంది. జిత్తులమారితనంలో చాలా ఎన్‌జిఒలు నిరుపేద దళితులను, గిరిజనులను మతమార్పిడులు చేస్తున్నాయి. అటువంటి ఎన్‌జిఒలు స్కానర్ కిందికి రావచ్చు. ఇదిలావుండగా ‘ఘర్‌వాపసీ’ కార్యక్రమం మత మార్పిడులపై చర్చకు దారితీసి చివరకు మతమార్పిడుల నిరోధక చట్ట రూపకల్పనకు దారితీస్తుందేమోనన్న భయం కూడా చర్చిని పీడిస్తోంది. ఒకవేళ ఆ చట్టానికి రూపకల్పన జరిగి కచ్చితంగా అమలు జరిపితే పరిస్థితి ఏమిటన్నది కూడా అవి ఆందోళన చెందుతున్నాయి. ‘మతమార్పిడుల’కు రాజ్యాంగం హామీ ఇచ్చిందన్న తప్పుడు అభిప్రాయం తో అవి ఉన్నాయి. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. మతాన్ని అవలంబించడం,ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పిస్తోంది. ఇక్కడ ప్రచారం అంటే మతమార్పిడి కాదు!
మత మార్పిడి అనేదే తప్పు. ఏ నాగరిక సమాజం దాన్ని ఆమోదించదు. ‘సర్వధర్మ సమభావా’నికి అది పూర్తి విరుద్ధం. దీన్ని మన ఉదారవాదులు దీన్ని ఎప్పుడూ ఉదహరిస్తుంటారు. దీనికి ఎంతో కొంత విలువ ఉన్నదనే వారి భావం. ఒక్కసారి నువ్వు మతమార్పిడి చేసావంటే, నీ మతమే గొప్పదని..ఇతర మతం నీ మతం కంటే తక్కువ అని బావిస్తున్నట్టు లెక్క. ప్రపంచంలోని పెద్ద మతాలన్నీ తప్పుకాని, ఒప్పు కాని తాము మాత్రమే భగవంతుడు లేదా స్వర్గానికి తీసుకెళ్లగలమని, ఇతర మతాల వారు తప్పుడు దేవతలను పూజిస్తున్నారన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ‘సర్వమత సమభావన’ అనేది కేవలం హాస్యాస్పదంగా మిగిలిపోతుంది. మరటువంటప్పుడు సద్భావం ఎక్కడ ఉంది?


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మొదటికొచ్చిన కశ్మీర్ వ్యథ…

మొదటికొచ్చిన కశ్మీర్ వ్యథ…

  • 13/04/2015
TAGS:

స్వదేశంలోనే శరణార్థులుగా బతుకుతున్న కశ్మీరీ పండితుల వ్యథ సమీప భవిష్యత్తులో తొలగిపోయే అవకాశం లేదని మరోసారి స్పష్టమైంది. 1947వ 1990వ సంవత్సరాల మధ్య జమ్ము కశ్మీర్‌లోని ‘లోయ’ ప్రాంతంనుండి తరిమివేతకు గురైన లక్షలాదిమంది ఈ హిందువులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలన్న ‘స్వప్నం’ ఎప్పటికి సాకారవౌతుందన్నది ఎవ్వరూ చెప్పలేని విషయం! ఈ ‘చెప్పలేనితనాన్ని’ కేంద్ర ప్రభుత్వం మార్చి పదవ తేదీన స్వయంగా ఆవిష్కరించడం ‘కథ’ మొదటికి వచ్చిందనడానికి నిదర్శనం. జమ్ములోను, వివిధ రాష్ట్రాలలోను, శరణార్థుల శిబిరాలలోను, తాత్కాలిక ఆవాసాల సముదాయ ప్రాంగణాలలోను పడిగాపులు కాస్తున్న పండితుల పునరావాసం కోసం కశ్మీర్ లోయ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇళ్లను, పల్లెలను నిర్మించడం గురించి కేంద్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా ప్రచారం చేస్తోంది. 2004వ సంవత్సరానికి పూర్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన భారతీయ జనతాపార్టీ, 2014వ సంవత్సరం వరకు పెత్తనం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ కూడ కశ్మీరీ పండితులకు లోయ ప్రాంతంలో పునరావాసం కల్పించడంలో ఘోరంగా విఫలం కావడం చరిత్ర…ఇందుకు ప్రధాన కారణం జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ ప్రభుత్వపు తొత్తులైన ‘జిహాదీ’ హంతకులు కొనసాగిస్తున్న బీభత్సకాండ, రక్తపాతం ఆగకపోవడం! ఈ హత్యాకాండ జమ్ము కశ్మీర్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులకు వ్యతిరేకంగా కొనసాగుతోంది! గత ఏడాది భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పండితుల పునరావాసం గురించి మళ్లీ చిగురించిన ఆశలపై జమ్ము కశ్మీర్ ప్రభు త్వం నిప్పులను చల్లుతోంది! కశ్మీర్ పండితులు ‘లోయ’ తిరిగి వెళ్లి శాశ్వతంగా అక్కడ నివసించడానికి వీలుగా ప్రత్యేక పట్టణ వాటికలను ఏర్పాటు చేయాలన్న దీర్ఘకాల ప్రతిపాదనకు ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తిమహమ్మద్ సరుూద్ తుది రూపం ఇచ్చారు. ప్రత్యేక పట్టణ వాటికల నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించడానికి, కేంద్ర ప్రభుత్వ సహాయంతో పట్టణ వాటికలను నిర్మించడానికి ముఫ్తి అంగీకరించాడు. కానీ ఇలా అంగీకరించి కశ్మీర్‌కు తిరిగి వెళ్లిన ముఫ్తి రెండురోజుల్లోనే ‘మాట’ మార్చాడు! ఎందుకంటే పండితులకు ప్రత్యేకంగా పట్టణ వాటికలను నిర్మించరాదని కోరుతూ పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద సమర్ధక బృందాలవారు లోయ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు. ఈ ప్రదర్శనలలో పోలీసులు గాయపడుతుండడం సరికొత్త సమాచారం! ‘పండితులు’ తిరిగి వచ్చి నివసించడానికి వీలుగా పట్టణ వాటికలను నిర్మించడం లేదని ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ముఫ్తి శాసనసభలో స్పష్టం చేశాడు! కేంద్ర ప్రభుత్వం ‘ఊకొట్టడమే’ విస్మయకర పరిణామం!
పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత పైశాచిక కాండకు బలైపోయి కశ్మీర్ లోయనుండి నిర్వాసితులైన ‘పండితులు’ తిరిగి స్వస్థలాలకు చేరుకోరాదన్నది దశాబ్దుల తరబడి కశ్మీర్ ప్రభుత్వాలు అనుసరించిన విధానం. ప్రస్తుత ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ -పిడిపి-అధినేత ముఫ్తి మహమ్మద్ సరుూద్ ఈ విధానాన్ని మార్చి తొమ్మిదవ తేదీన జమ్ము కశ్మీర్ శాసనసభలో పునరుద్ఘాటించడం ఆశ్చర్యకరం కాదు! ఎందుకంటే ఇళ్లను, పల్లెలను, పొలాలను, పశువులను, గుడులను వదిలిపెట్టి ‘లోయ’నుండి పారిపోయిన ‘పండితులు’ తిరిగి రావడానికి వీలులేదన్న విధానాన్ని ‘పిడిపి’ ఏళ్ల తరబడి అనుసరిస్తోంది! ఈ విధానం సర్వమత సమభావ-సెక్యులర్-రాజ్యాంగ వ్యవస్థకు విఘాతకరం. ‘హురియత్’లోని మెతక ముఠా, ముదురుముఠా, జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటి దేశ విద్రోహ సంస్థలు పాకిస్తాన్‌లో వలెనే మనదేశంలో కూడ ఒకే మతం ఉండాలని, ఇక్కడ కూడా ఇస్లాం మత రాజ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని కోరుతుండడం సహజం! ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనుకూల విద్రోహపు తండాలు ‘జిహాదీ ఉగ్రవాదాన్ని’ సమర్ధిస్తున్నాయి. మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచమంతటా ఇస్లామేతర మతాలన్నింటినీ నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాద్’ లక్ష్యమన్నది చారిత్రక వాస్తవం. ఈ ‘జిహాదీ’ లక్ష్యానికి అనుగుణంగానే పాకిస్తాన్ ప్రభుత్వ అనుకూల హంతకులు 1947వ, 1990 సంవత్సరాల మధ్య కశ్మీర్ లోయనుండి హిందువులను నిర్మూలించారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, మతం మార్చారు…మిగిలిన హిందువులను తరిమివేశారు. ఈ మతోన్మాదాన్ని ‘జిహాద్’ను బహిరంగంగా సమర్ధిస్తున్న ‘హరియత్’ తదితర సంస్థలు సమర్ధించడం ఆశ్చర్యకరం కాదు. కానీ భారత రాజ్యాంగంపట్ల విధేయతను నిష్ఠను ప్రకటించిన కశ్మీర్ ప్రాంతీయ రాజకీయ పక్షాలు కూడ ‘ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’ను కశ్మీర్‌లో నెలకొల్పాలని యత్నించడమే వైపరీత్యం. ఈ వైపరీత్యానికి సరికొత్త సాక్ష్యం జమ్ము కశ్మీర్ శాసనసభలో ముఖ్యమంత్రి ముఫ్తి చేసిన ప్రకటన! విచ్ఛిన్నవాదులను ప్రభావితం చేసి వారిని జాతీయ ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడానికై భారతీయ జనతాపార్టీ వారు ‘పిడిపి’తో చేతులు కలిపి ఉండవచ్చు! కానీ ‘్భరతీయ జనతాపార్టీ’ ప్రభావితవౌతుండడం మరో జాతీయ వైపరీత్యం…
జమ్ము కశ్మీర్‌లో ప్రధాన సమస్య జిహాదీ ఉగ్రవాదం. 1947లో దేశ విభజన జరిగిన తరువాత నెలలు గడవక ముందే పాకిస్తాన్‌నుండి హిందువులను ‘జిహాదీలు’ వెళ్లగొట్టారు. మానభంగాలకు, హత్యలకు గురైన హిం దువుల సంఖ్య లక్షలకు చేరింది. దాదాపు కోటిమంది హిందువులు పశ్చిమ పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చేశారు. ఇలా తమ దేశంలో హిందువులను నిర్మూలించిన పాకిస్తానీ ప్రభుత్వం మనదేశంలో హిందువులు అల్పసంఖ్యాకులుగా కశ్మీర్ లోయ ప్రాంతంనుడి కూడ హిందువులను నిర్మూలించడానికి పూనుకొనడం దశాబ్దుల బీభత్సకాండకు కారణం! కిరాయి గూండాలు, పాకిస్తాన్ సైనికులు 1947లో కశ్మీర్‌లోకి చొరబడ్డారు. మూడవ వంతు కశ్మీర్ పాకిస్తాన్ అక్రమ అధీనంలో మిగిలిపోవడంతో ఆ ప్రాంతంనుండి హిందువులు నిర్వాసితులై మన అధీనంలో మిగిలిన కశ్మీర్‌లోకి వచ్చేశారు. కానీ మన అధీనంలో మిగిలిన కశ్మీర్‌లోయ ప్రాంతంలోని హిందువులు నిరంతరం హత్యాకాండకు గురయ్యారు. 1990 వరకు సాగిన ఈ ‘కాండ’ ఫలితంగా ‘లోయ’నుండి హిందువులందరూ పారిపోవాల్సి వచ్చింది!! యుగయుగాలుగా కశ్మీర్‌లోయ ప్రాంతంలో నివసించిన హిందువులు తమ జన్మస్థలాలనుండి ప్రాణాలను గుప్పెటలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోవలసి రావడం ఘోరమైన చారిత్రక వైపరీత్యం!
కశ్మీర్ లోయ ప్రాంతం జనాభాలో పండితుల సంఖ్య పదిశాతం కంటే తక్కువే ఉంది. కానీ వీరు తిరిగి వెళ్లి లోయ ప్రాంతంలో స్థిరపడడంవల్ల, పట్టణ వాటికలు ఏర్పడడంవల్ల కశ్మీర్ మరో ‘పాలస్తీనా’లాగా తయారవుతుందని హురియత్ పెద్దలు వ్యాఖ్యానించడం దేశ విద్రోహకర పరిణామం! ఇలాంటి వ్యాఖ్యలను సహించడం కేంద్ర ప్రభుత్వం వారి ‘మెతక’దనానికి నిదర్శనం! పండితులకు ప్రత్యేక వాటికలు నిర్మించడం గురించి తుది నిర్ణయం జరగలేదని దేశ వ్యవహారాల సహాయమంత్రి కిరణ్ రిజ్జూ 10వ తేదీన ప్రకటించాడు. పండితులకోసం నిర్మించే గృహ సముదాయాలలో పండితులు కాక మరెవరు నివసించాలి?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేటి రాజనీతి -శీ లా సుభద్ర గారికవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొళ్లో జగ! నామిని కైగట్టిన కత

కొళ్లో జగ! నామిని కైగట్టిన కత
తెల్లారి పొయ్యింది. ఆ కోడాలు నిద్దర్లేచి మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్‌ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరా తీరా దొడ్డికి కుచ్చోనుబోతే ఎద్దల దొడ్డిలో, ఆవల దొడ్డిలో పేడకళ్ళనెత్తి ఎవురు దిబ్బలో పోస్తారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు ఎద్దల దొడ్డిలో ఆవల దొడ్డిలో పేడకళ్లనెత్తి, దిబ్బలో పోసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్‌ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరాతీరా దొడ్డికి కుచ్చోను బోతే కయ్యాగాలవ కాడ కష్టం జేసే నీ మొగుడికీ, కూలోళ్లకీ చద్దెవురు పోస్తారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు కయ్యాగాలవ కాడ కష్టం చేసే మొగుడికీ, కూలోళ్లకీ చద్ది పోసేసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తా త్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్‌ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరాతీరా దొడ్డికి కుచ్చోను బోతే ఎసురెవురు పెడతారు, సంగటెవురు కెలకతారు, కయ్యాగాలవ కాడ కష్టం జేసే నీ మొగుడికీ, కూలోళ్లకీ సంగటెవురెత్తక పోయ్‌ యేస్తారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు ఎసురుబెట్టి, సంగటి కెలికి, కయ్యాగాలవ కాడ కష్టం చేసే మొగుడికీ, కూలోళ్లకీ సంగటేసేసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్‌ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లోమాట నోట్లో వుండంగానే, ‘చింతకాయల కాలం, చింతపొండుకు యీనెదీసి, గింజిలెవరు కొడతారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు చింతపొండుకు యీనెదీసి, గింజలు కొట్టి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్‌ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే ‘సందల గూకింది. నువ్వు ఆరాతీరా దొడ్డికి కుచ్చోను బోతే రేత్రికి చారూకూడూ ఎవురొండుతారు, నీ మొగుడికీ బిడ్లకీ ఎవురు పెడతారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు చారూ కూడూ వొండేసి, మొగుడికీ, బిడ్లకీ, చారూ కూడూ పెట్టేసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! రాయల్‌ చెరువు-’ అని అత్తనడిగింది. ఆ అత్త, ‘యింక బొయ్‌ చావు!’ అనింది. కంటికి కడవడు నీళ్లు బెట్టుకోని ఆ కోడాలు రాయల్‌ చెరువు కట్టకాడికి పరిగెత్తి, తూముకు ఆ పక్క వొక కాలూ, యీ పక్క వొక కాలూ పెట్టి దొడ్డికి కూచ్చునింది. ముక్కింది మూలిగింది బొరోమని ఏడ్చింది. ‘ఆరా తీరా దొడ్డికి కుచ్చోను యవది లేని ఆడదాని శాపిని యీ జగానికి తగలాల’ అని చుక్క లకల్లా ఎగజూసి దండం బెట్టుకొనింది. ఇంకంతే. పెళపెళార్బాటాలతో పింటికలు రాతి కూసాల మాదిరి, కాటమరాజు గుండ్లు మాదిరి తూములోకి పడి తూము నిండిపొయ్యింది. వొక్కడుగులో రాయల్‌ చెరువు మింద చాటంత మబ్బెక్కింది. చెరువు నిండే వాన కొట్టింది. ఏకానికొగటిగా జొరోమని వాన. ఎక్కడుండే వంకలూ రాయల్‌చెరువు మిందికొచ్చి పడిపోతుండాయి. తూము నుంచి వొక్క చుక్క నీరు బైటికి రావడం లా. ‘వొకాడది ఆరాతీరా దొడ్డికి కూచ్చునే సౌక్రం లేని యీ బూమండలాన యింక ఎండలు కాయగూడదు. కొళ్లో జగ!’ అని శాపం బెట్టి తూము మింద కుచ్చున్నది కుచ్చున్నట్టే శిల అయిపొయ్యిందా కోడాలు. శిల మింద వాన, చెరువు మింద వాన. చెరువు నిండింది పొంగింది పొల్లింది కట్ట తెగిపొయ్యింది. వూళ్ల మింద నీళ్లు, యీ ఎండలు కాసే బూమండలమంతా నీళ్లు. కాళాస్ర్తి గోపురం మింద గువ్వొగటి వాలి మోర వంచకుండా నీళ్లు తాగతుండాది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”రాత తెలుగు కన్న తల్లి ” రాయల సీమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -95 బదిలీ ప్రహసనం

నా దారి తీరు -95

బదిలీ ప్రహసనం

సంవత్సరం మంగళాపురం లో పని చేసిన తర్వాత బుద్ధి మారి మళ్ళీ ట్రాన్స్ ఫర్ ప్రయత్నాలు శురూ చేశాను .ఎప్పుడూ నా ప్రయత్నాలేవో నేను చేసుకొనేవాడిని .పెనమకూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సూరపనేని వెంకటేశ్వర రావు రిటైర్ అవుతున్నారని తెలిసి ,అక్కడికి వెడితే ఇంటికి దగ్గర గా ఉన్నట్లు ఉంటుందనే ఆశ పుట్టింది. పుర్రెకు పురుగు తొలచినట్లు అదే ఆలోచన మనసులో సుళ్ళు తిరిగింది .అనుకోకుండా అప్పటికే నాకు శిష్యుడు పెనమకూరు వాడు వల్లూరు కరణం అయిన పెనమకూరు ప్రభాకర రావు కు నేను బదిలీ ప్రయత్నాలు తెలిశాయి అదీకాక నా చిన్ననాటి స్నేహితుడు కనకవల్లి వాడు మారేపల్లి చలపతి బావ మరది కీ తెలిసి ప్రభాకర రావు ద్వారా ప్రయత్నిస్తే పని జరుగుతుందన్నాడు .సరే అనుకొన్నా. ఎవరికీ చెప్పలేదు .దీనికి ఎలా ప్రారంభించాలో తెలియక గుంజాటన పడ్డా. ఇంతలో ప్రభాకర రావు సలహా ప్రకారం ఉయ్యూరు మండలం మాజీ అధ్యక్షుడు ,నాకు హైస్కూల్ లో క్లాస్ మేట్ దిరిసెం ప్రభాకరరావు చెబితే చైర్మన్ కోటేశ్వర రావు గారు తప్పక బదిలీ చేస్తారని చెప్పారు .ఇంకేముంది నా పని యిట్టె అయిపోతుందని పించింది .ప్రభాకరరావు ఉయ్యూరు గూడెం లో ఉంటాడు .ఎప్పుడూ అటు వెళ్ళే పని లేని నేను అక్కడికి వెళ్లి వచ్చిన పని చెప్పా .’’అదెంత పని ప్రసాద్ గారూ .నేనున్నాగా .పని అయిపోయినట్లే అనుకోండి .మనం అందరం కలిసి రుద్రపాక వెళ్లి  పిన్నమనేని ని కలిసి చెబుదాం .ఆయన కాదనరు .మనిద్దరం క్లాస్ మేట్స్ కదా హామీ ఇస్తున్నాను అన్నాడు ‘’.యెగిరి గంతేసినట్లయింది .రొట్టె విరిగి నేతిలో పడిందని పించింది  ముతకగా చెప్పాలంటే ‘’ముడ్డిమీద గుడ్డ నిలవ లేదు ‘’.

మోసం గురో

ఒక రోజు నేను ఇద్దరు ప్రభాకర రావు లు ,ఉయ్యూరు సమితి మాజీ అధ్యక్షుడు మొవ్వా మోహనరావు అందరం కారు లో రుద్రపాక వెళ్లి చైర్మన్ కోటేశ్వర రావు గారిని కలిశాం .వాళ్ళందరూ నన్ను పెనమకూరు కు ట్రాన్స్ ఫర్ చేయమని అడిగారు .తప్పకుండా చేద్దాం . మేస్టారిని  ముందు లాంగ్ లీవ్ పెట్టమనండి .ఒక నెల తర్వాత జాయినింగ్ పర్మిషన్ అప్ప్లైచేయమనండి .నా పని తేలికవుతుంది .’’అన్నారు .సరే అని చెప్పి  అటునుంచి అటు బందరు జిల్లా పరిషత్ ఆఫీస్  కు వెళ్లి పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కూడా అందరం కలిసి  ,నేను లీవ్ పెట్టబోతున్నట్లు చెప్పి గుమాస్తా శేషగిరి రావు గారికీ చెవిలో వేసి ‘’ప్రసన్నం ‘’చేసుకొని ,అందరం హోటల్ కెళ్ళి ఫుల్ గా ‘’మెక్కి ‘’సాయంత్రానికి ఉయ్యూరు చేరుకొన్నాం .దీనికి నాకు అయిన ఖర్చు ఆనాడే రెండు వేల రూపాయలు .ఇంత భారీగా నేనెప్పుడూ ట్రాన్స్ఫర్ కోసం ఖర్చు చేసి ఉండలేదు .గుండె గుభేల్ మంది . చేతులు అప్పటికే కాల్చుకోన్నాను .ఇక ఆకులవలన లాభం లేదని మనసులో అనిపించింది .నేను మంగళాపురం వెళ్లి లాంగ్ లీవ్ కు అప్ప్లై చేశా .

ఇక్కడి నుంచి కదం అడ్డం గా తిరిగింది .పెనమకూరు కమ్మ టూరు .రిటైర్ అయింది కమ్మ హెడ్ మాస్టారు .కమిటీ ప్రెసిడెంట్ వెంకట నారాయణ గారు అదే కులం .అడుసుమిల్లి సూర్యనారాయణ   కాంగ్రెస్ వాడు ఆయనదీ అదే కులం .అలాంటిది మనకు చెప్పకుండా ఒక బాపనోడు పెనమకూరు రావటమా ?అని వీళ్ళంతా కూడా బలుక్కోన్నారని తెలిసింది .రోజూ జిల్లాపరిషత్ కు వెళ్లి కాంప్ ఆఫీసర్ ను గుమాస్తాలను చైర్మన్ గారినికలిసే ‘’నాయుడు ‘’అనే కమ్మ తెలుగు మేష్టారు ఇక్కడ కింగ్ మేకర్ .పెనమకూరులో పని చేస్తున్నాడు .ఆయనకు తెలీకుండా ఈ ప్రాంతం  లో ఏ ట్రాన్స్ ఫరూ జరగదు .అతనే వెళ్లి ఆర్డర్ తెచ్చేంత చొరవ ఉన్నవాడు .ఉయ్యూరులో ఫైనాన్స్ నడపటం చైర్మన్ గారి గుడివాడ చిట్ ఫండ్ వ్యవహారాలూ చూడటం వలన అతనికి ఇంఫ్లుఎన్స్  ఎక్కువ .అతని చుట్టూ ఎప్పుడూ అరడజను మంది మేస్టార్లు పరి వేష్టించి ఉంటాడు .నాయుడు నాకూ మిత్రుడే .అతనిభార్య జి రంగయ్య గారు అని గరికపర్రు కు చెందిన ఉయ్యూరులో మాతో పాటు పని చేసిన  ఆయన గారి కూతురే. ఆ అమ్మాయి నా స్టూడెంట్ కూడా . నేను పెనమకూరు ప్రెసిడెంట్ నుకాని ,స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ ను కాని అసలు కలవనే లేదు అక్కడికి రావాలని ఉందని వాళ్లకు తెలియ జేయలేదు .అది ఒక రకం గా వాళ్లకు అవమానం అని పించవచ్చు .అంతకు ముందు కూడా సైన్స్ మాస్టారిగా నేను కమిటీ వారికి తెలియకుండా విస్సన్న పేటనుండి మూడు నెలల్లోనే బయటపడి పెనమకూరు వచ్చాను .అది వాళ్ళను కెలక వేస్తూనే ఉండి ఉండచ్చు . కనుక నేను అక్కడికి రాకుండా ఉండటానికి అన్ని రకాల పావులు కదిపారు .నేను ఈ ప్రభాకరరావు బృందాన్ని చలపాయి బామ్మర్దిని నమ్ముకోన్నాను .

నాయుడు ఉయ్యూరు సెంటర్ లో కనిపించినప్పుడల్లా ‘’ప్రసాద్ గారు ! ఆర్డర్ ఎప్పుడు వస్తుంది ?’’అని అడిగే వాడు తెలియనట్లు .నేను ‘’మీకు తెలీకుండా ఆర్డర్ ఎలా వస్తుంది ?’’అనేవాడిని ‘’మీకే వస్తుంది పెనమకూరు ‘’అని జోల పాడేవాడు  .నవ్వీ నవ్వకుండా నవ్వే వాడిని అంటే ఏడవ లేక నవ్వే  వాడి నన్నమాట .కాని నా వెనక ఏదో గూడు పుటాణీజరుగు తోందని అర్ధమయ్యింది .నన్ను పెనమకూరు వేయరని నమ్మకంగా తెలిసింది . .గుమాస్తాను కలిశా .పరమహంస గారినీ కలిశాను .అప్పుడు ఆయన ‘’మేస్టారూ ! మిమ్మల్ని పెనమకూరు వేసే ఆలోచనలో చైర్మన్ గారు లేరని తెలుస్తోంది .అక్కడ కమిటీ వారిని మీరు ప్రసన్నం చేసుకోలేదు .మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉన్నా సాయం చేయాలని ఉన్నా నేనేమీ చేయలేని పరిస్తితి .మీ ప్రయత్నాలు గట్టిగా చేసుకొని నస్టపడకుండా ము౦దు జాయింగ్ పర్మిషన్ పెట్టండి జాగ్రత్త  ‘’అని చాలా చక్కగా చెప్పారు ఏదీ దాచకుండా .అప్పటి దాకా నాకూ పరమహింస అని పించిన ఆయన ఇప్పుడు నిజం గా ‘’పరమ హంస ‘’అనిపించారు .ఆయన చెప్పినట్లే వెంటనే జాయింగ్ పర్మిషన్ కోసం అప్ప్లై చేశాను .

చేసేదేమీ లేదు .రోట్లో తలపెట్టాను రోకటి పోటుకు వెరవాల్సిన పనేముంది .అంతా మోసం గురో అనిపించింది ప్రభాకర్రావులు కాడి పారేశారు .మన సొమ్ముతో సోకు చేసుకొనే వాళ్ళు వీళ్ళు .తప్పు మనదే కనుక ఏదైతే అది అయిందని వాళ్ళ దగ్గరకు వెళ్ళటం మానేశాను .ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను.  చివరికి నా లీవ్ మంజూరై జాయినిగ్ పర్మిషన్ మైలవరం దగ్గర ఉన్న ‘’చిలుకూరి వారి గూడెం ‘’కు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్ వచ్చిందని తెలిసి జిల్లా పరిషత్ కు వెళ్లి ఆర్డర్ తెచ్చుకొన్నాను. అందరూ నా మీద సానుభూతి చూపించారు ..అది భరించటం కష్టమైంది .మొదటిసారిగా కాటా దెబ్బ  పీటీ దెబ్బ తిన్నాను .బుద్ధి వచ్చింది లేమ్పలేసుకోన్నాను .రాచకీయ నాయకుల్ని నమ్మటం యెంత తప్పో తెలిసింది .తెలిసి కూడా అడుసులో కాలు వేస్తాం ఒక్కొక్కప్పుడు అదే జరిగింది నాకు .చిలుకూరి వారి గూడెం ఎక్కడుందో తెలీదు .అసలు అలాంటి పేరుతొ ఒక ఊరు ఉందని తెలియదు .కాని సుబ్బారావు అనే తిరువూరు ఏం ఇ వొ ఒక సారేక్కడోకలిసి మైలవరం దగ్గరుందని, చాలా బాగా ఉంటుందని చాలా మంచి స్కూలు అని చెప్పారు .అక్కడ అప్పటిదాకా పని చేసిన హనుమంత రావు నాకు రాజమండ్రి ట్రెయింగ్ మేట్ .అతన్ని కాజ హైస్కూల్ కు మార్చి  నన్ను అక్కడికి వేశారన్నమాట .  ఒక మంచి రోజు అక్కడికి జాయిన్ అవటానికి బయల్దేరి వెళ్లాను .ఆవివరాలు తరువాత తెలియ జేస్తాను .ఇదీ ‘’మోసం గురో కద’’.ఇంతమోసానికి నేనెప్పుడూ గురికాలేదు .ఒక రకం గా భగవంతుడు బుద్ధి చెప్పాడేమో అనిపించింది .ఉన్న చోట ఉండక ఈ తిప్పలెందుకు ?అని పించింది .కాని ఊరుకోనిస్తు౦దా బుద్ధి ?

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-15 ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కృష్ణా జిల్లాలో (బందరు, ఉయ్యూరు, కుమ్మమూరు) గాంధీజీ 11 13 ఏప్రిల్ 1929

 unnamed (4) unnamed (3) unnamed (2) unnamed (1)

 

 


Posted in వార్తా పత్రికలో | Tagged | 3 Comments

మొదట్లో ఏరువాకా” లేదు -వహీదాలేదు ”రోజులు మారాయిలో

మొదట్లో ఏరువాకా” లేదు -వహీదాలేదు ”రోజులు మారాయిలోrojulu1 001 rojulu2 001 rojulu3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీటి పొదుపు – భావితరాలకు మనం ఇవ్వవలసిన వారసత్వ సంపద

నీటి పొదుపు – భావితరాలకు మనం ఇవ్వవలసిన వారసత్వ సంపద img103

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎక్కడ కాలు తోక్కేస్తానోనని నరేష్ భయ పడేవారు -నటి గీతా సింగ్ –

gita1 001 gita2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్టానికో నాటకం ఉంది

చట్టానికో నాటకం ఉంది

ఒక కథలో పోలీసు శాఖలోని లొసుగులను ప్రశ్నిస్తారు. ఇంకో కథలో చట్టంలోని లొసుగుల్ని వెలికి తీస్తారు. నాటకం ఏదైనా ఆయన కథా వస్తువు అంతా చట్టం, న్యాయం చుట్టూనే తిరుగుతుంది. వృత్తిపరంగా న్యాయవాది కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మూడు దశాబ్దాలుగా తన రచన, నటనా పటిమతో ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్న దిట్ట విశాఖపట్టణానికి చెందిన పి.టి.మాధవ్‌.
‘‘మాది తూర్పుగోదావరి జిల్లా భీమవరం. విశాఖపట్టణంలో పుట్టి పెరిగాను. చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి నుంచి నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ ఆసక్తితోనే దర్శకత్వం, నటనలో శిక్షణ తీసుకున్నాను. కేవలం నటనకే పరిమితం కాకుండా రచయితగా సమాజానికి మేలు చేసే అంశాలను జోడించి.. ప్రదర్శించాలన్నది నా ఆలోచన. ఒక వైపు నటిస్తూనే రాయడం మొదలు పెట్టాను. న్యాయవాదిగా పట్టా పుచ్చుకుని 1988లో ప్రాక్టీస్‌ ప్రారంభించాను. నగరమంతా నిద్రపోయాక రచనకు పూనుకునేవాడిని. న్యాయశాస్త్రంలోని అంశాలతో సమాజానికి మెసేజ్‌ ఇచ్చేలా రచనలు చేశాను. చట్టంలోని లొసుగులు, దర్వినియోగం అవుతున్న తీరు తదితర అంశాలతో ప్రజల్ని చైతన్యపరిచే నాటికలను రచించి సొంత దర్శకత్వంతోపాటు, పాత్రధారుడిగా కూడా బాధ్యతను నిర్వర్తించేవాడిని. అలాగే విశాఖ రత్నం అవార్డు, కూరెళ్ల సోమేశ్వరరావు ట్రస్టు ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం, కళా జగతి పత్రిక ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం ఎంతో సతృప్తినిచ్చాయి. స్వర్గీయ సుత్తివేలు, రాధాకుమారి, సాక్షి రంగారావు, పొట్టిప్రసాద్‌ వంటి ప్రముఖ నటులతో కలిసి ‘లేదు దుఃఖం జగతిలో’ పేరిట రూపొందించిన టీవీ సీరియలో నటించడంతోపాటు ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించడం గర్వంగా భావిస్తాను.
విశాఖలో మోడ్రన్‌ థియేటర్‌
కళారంగానికి జీవం పోయాలని, నా ఊపిరి ఉన్నంత వరకు నాటక రంగానికి సేవ చేయాలని మోడ్రన్‌ థియేటర్‌ను స్థాపించాను. ఇప్పటి వరకు ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చాను. యాక్టింగ్‌లో ఓనమాలు రానివారిని కూడా ఉత్తమ నటులుగా తీర్చిదిద్దాను. నాటికల్లో చట్టపరమైన సమస్యలను చర్చిస్తూ పరిష్కార మార్గాలను చూపుతూ, కథా గమనాన్ని అనుసరించి ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన ఆర్టిస్టులతో ప్రదర్శించడం మా మోడ్రన్‌ థియేటర్‌ ప్రత్యేకత. అందుకే ప్రజలంతా దీనిని ‘నేచురల్‌ థియేటర్‌’ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఇరవై నాటికలను రాశాను. నాలుగు నాటకాలు, ఏడు రేడియో నాటకాలు, నాలుగు టీవీ నాటికలు కూడా రచించాను. మొత్తంగా వెండితెరపై నాలుగు తెలుగు చిత్రాల్లో కూడా నటించాను. నేను కథ, మాటలు సమకూర్చిన ‘కోయిల’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏడాదికి కనీసం 60 ప్రదర్శనలకు తక్కువ లేకుండా సుమారు 30 ఏళ్లపాటు రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గినా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, రచయిత, హాస్యనటుడు, వంటి అవార్డులు దక్కాయి. ‘నన్కెక్కించండి బోను’ నాటకానికి యువకళావాహిని అక్కినేని పరిషత్‌లో ఉత్తమ రచయితగా పలుమార్లు అవార్డులు రావడం సంతోషకరం.
‘నన్నెక్కించండి బోను’
పోలీస్‌ శాఖలో ఉండే లొసుగులు తెలియజేస్తూ స్టాక్‌ విట్నె్‌సల మీద వారు ఎందుకు ఆధారపడుతున్నారో, సెర్చి వారెంట్‌ వారి చేతుల్లో ఎలా రూపుమారిపోతుందో, గ్రామీణ వాతావరణంలో యధార్థ సంఘటనల ఆధారంతో రాసిన నాటకం.
నల్లకోటు నవ్వింది..’
ప్రామిసరీ నోటుకున్న కాలపరిమితి, చట్టపరమైన లావాదేవీల గురించి తెలియకుండా అప్పుచేస్తే ఎన్ని పాట్లు పడాలో.. తెలిపే హాస్య నాటిక ఇది.
‘వెళ్లిపోకే చిన్నమ్మ…’
ఐపీసీ 498ఎ సెక్షన్‌ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నందున ఎన్ని కుటుంబాలు నాశనమవుతున్నాయో తెలియజేసే నాటిక ‘వెళ్లిపోకే చిన్నమ్మ’. అన్ని ప్రముఖ రేడియో స్టేషన్లలో నాటకంగా ఇది ప్రసారమైంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ కిక్ గంటసేపే-డైరెక్టర్ త్రివిక్రమ్ మనసులోమాట –

ఆ కిక్ గంటసేపే

త్రివిక్రమ్‌ అంటే ఓ బ్రాండ్‌… ఈ మాటలను వింటే నాకు భయమేస్తుందంటారాయన.
త్రివిక్రమ్‌ మాటల మాంత్రికుడు.. ఈ మాటలను గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు అని అంటారు.
త్రివిక్రమ్‌ సినిమాలకు ఓ స్థాయి ఉంటుంది… ఈ మాటలను అందరూ అంటుంటే వినడమే అని అంటారు.
ఏదేమైనా తెలుగు సినిమా మాటలను మలుపు తిప్పిన కొంత మంది రచయితల్లో త్రివిక్రమ్‌ ఒకరు. ఆయన కలంలోని సిరా వెటకారాన్నీ పలికిస్తుంది. అత్యంత ఘాటైన విమర్శలనూ చేస్తుంది. అన్నిటినీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. ‘అవును నిజమే కదా’ అని అబ్బురపోయేలా చేస్తుంది. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన
‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విడుదలైంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాటల మూటలు..
‘‘సన్నాఫ్‌ సత్యమూర్తికి రెస్పాన్స్‌ బావుంది. సత్యమూర్తి కొడుకు కథ అని ముందు నుంచే చెప్పాం. మనిషి ముందు మాట్లాడటానికి, లేనప్పుడు అతని గురించి మంచిగా మాట్లాడటానికీ చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో నేను తండ్రి గురించి చెప్పాలనుకున్నా. అందుకే తండ్రి గురించి కొద్దిగా చూపించి, చనిపోయిన తర్వాత, ఆయన పరోక్షంలో కథను నడిపించాం. నా మిత్రుల జీవితాల్లో జరిగిన ఘటనలనే సినిమాటిగ్గా చెప్పే ప్రయత్నం చేశాను. తండ్రి పోయాక కొడుకు మాటల్లో పంచ్‌ ఉండదు. కాసింత పెయిన్‌ ఉంటుంది. దాన్నే ఈ సినిమాలో చెప్పాం. తొలి సగానికి డల్‌ రెస్పాన్స్‌ వస్తుందేమోనని అనుకున్నా. అప్పటికీ
ఫస్టా్‌ఫలో పార్టీ సాంగ్‌ పెట్టా. అంతకన్నా అల్లరి చేయొద్దని, ఈ కథను ఇలాగే చెప్పాలనీ, ప్రేక్షకుల్ని మోసం చేయొద్దనీ అనుకున్నా. కానీ హీరో సంతకం చేసే సన్నివేశం, ఆటో నుంచి దిగే సన్నివేశానికి నేను క్లాప్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అందరికీ ఆ సెన్సిబిలిటీ కనెక్ట్‌ అయింది. హీరోయిన్‌ని డయాబెటిక్‌ పేషెంట్‌గా చూపించాం. మన దేశంలో షుగర్‌ ఉన్నవారు ఎక్కువ. కమల్‌హాసన్‌, గౌరవ్‌కపూర్‌, వసీమ్‌ అక్రమ్‌.. డయాబెటిక్‌ ఉన్నవారు. అయినా డిగ్నిటీతో హ్యాండిల్‌ చేస్తున్నారు. అదే ఓ అమ్మాయి డయాబెటిక్‌ పేషెంట్‌ అయి, ఆ విషయాన్ని క్యూట్‌గా హ్యాండిల్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆ పాత్రను పెట్టాను. హీరోయిన్లంటే దేవతలు కాదు, మనలాంటి వాళ్లేనని చెప్పే ఉద్దేశంతోనే అలా చేశా.’’
ప్రాసె్‌సలోనే మజా
‘‘ఈ సినిమాలో సంపత్‌ విలన్‌. అతను ఉపేంద్రను చంపాలనుకుంటే, యాక్సిడెంటల్‌గా హీరో ఫాదర్‌ పోతాడు. అలాగే హీరో కూడా కావాలని విలన్‌ని చంపడు. యాక్సిడెంటల్‌గా జరుగుతుంది. నేనెప్పుడూ హీరోతో విలన్‌ని చంపించాలని అనుకోను. అందులో నాకు కిక్‌ ఉండదు. బేసిగ్గా నేను ఒక మనిషిని డైరెక్ట్‌గా చంపడాన్ని నమ్మను. మనుషులు ఊరికే కొట్టుకుంటారని నేననుకోను. ఒకడు ఒకడిని కొట్టాలంటే నాకు చాలా పెద్ద కథ కావాలి. రీజన్‌ కావాలి ఆర్గ్యుమెంట్‌ ద్వారా ఒపీనియన్‌ మారదు. ఒక మనిషిని ఫిజికల్‌గా కొట్టడం ద్వారా ఒపీనియన్‌ మారదు. సిస్టమూ మారదు. ఆ విషయం మీకు నా అన్ని సినిమాల్లోనూ కనిపిస్తుంది..’’
ఏమనుకోవాలి?
‘‘ఖలేజా లాంటి సినిమా టీవీల్లో అమితంగా ఆడుతున్నందుకు ఆనందపడాలా? బాధపడాలో తెలియదు. ఒక రకంగా బాధగానే ఉంటుంది. ఆనందంగా అనిపించదు. టీవీల్లో ఆడుతోంది కాబట్టి దాన్ని గొప్ప సినిమా అనలేం. టీవీల్లో సినిమా చూసేటప్పుడు మనకు చాలా వెసులుబాటు ఉంటుంది. కావాల్సినప్పుడు ఫోన్లు మాట్లాడుకోవచ్చు. పక్కకెళ్లి పనులు చేసుకోవచ్చు. మరోవైపు యాడ్స్‌ వస్తుంటాయి. టీవీల్లో నచ్చని సీన్లు వస్తే అవాయిడ్‌ చేయొచ్చు .కానీ థియేటర్లో అవాయిడ్‌ చేయలేం. థియేటర్లో చూసే వ్యక్తులు వేరే ఎక్స్‌పీరియన్స్‌తో చూస్తుంటారు. అప్పుడే కొన్న టిక్కెట్ల వేడి కూడా దానికి తోడవుతుంది.’’
నేను చదవను
‘‘నేను వెబ్‌సైట్లు చూడను. ఈ మధ్య రాజమౌళి హీరోలతో నేనూ, నా హీరోలతో ఆయన సినిమాలు చేయలేదని ఓ ఆర్టికల్‌ వచ్చిందట. అలాంటి వార్తలు చదవకపోవడం వల్ల జీవితం ఎంతో సుఖంగా ఉంది. అయినా అందరు హీరోలతో పనిచేయాలని నాకూ ఉంటుంది. హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాయను అని అనడం అబద్ధం. నేను తప్పకుండా హీరోని దృష్టిలో పెట్టుకుంటాను. దానికి తగ్గట్టు నేను చెప్పాల్సిన విలువలను గురించి కూడా ఆలోచిస్తాను. వాటి రెండిటి మధ్య ఓ బ్యాలెన్స్‌ను కుదుర్చుకుంటాను. కాకపోతే కథ, కాల్షీట్లు కుదరాలంతే. స్ర్కిప్ట్‌ పూర్తయిన తర్వాతే బడ్జెట్‌ అనేది లెక్కలోకి వస్తుంది. నిర్మాతతో కూర్చుని స్టార్స్‌ ఎవరు? సినిమా పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలను గురించి ఆలోచించినప్పుడే బడ్జెట్‌ ఎంతనేది తెలుస్తుంది. అదే స్టోరీ కొత్తవాళ్లని డిమాండ్‌ చేస్తే మొత్తం లెక్కలన్నీ మారిపోతాయి.’’
మార్పు సహజమే
‘‘ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌లో గొప్ప మార్పు వచ్చిందని అంటున్నారు. ఒక్కొక్క సీజన్‌లో ఒక్కో రకంగా ఉంటామేమో. త్రివిక్రమ్‌ ఓ బ్రాండ్‌ అని ఎవరైనా అంటే భయమేస్తుంది. టెన్షన్‌ వస్తుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌కి దూరంగా ఉండేది అందుకే. నేనేదో నాకు వచ్చింది, నచ్చింది రాస్తా. తీస్తా. అది అందరికీ నచ్చితే హ్యాపీ. నచ్చకపోతే తిట్టండి. తెలుసుకుని ఇంకో రకంగా రాస్తా. అంతేగానీ నన్ను నేను అంత ఎక్కువ సీరియ్‌సగా తీసుకోను. నేను ఇలా సింపుల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టే నచ్చుతానేమో. అయినా అందరికీ ఉన్నట్టు నాక్కూడా చాలా ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. నాకూ ఈగో ఉంటుంది. కాంప్లెక్స్‌ ఉంటుంది. జెలసీ ఉంటుంది. నా సినిమాలే ఆడాలని ఉంటుంది. అవతలి వాళ్ల సినిమాలు పోవాలనీ ఉంటుంది. కానీ బయటికెళ్లి బాగా మాట్లాడాలనీ ఉంటుంది. అందరూ ఎలా ఉంటారో, నేనూ అలాగే ఉంటా. కాకపోతే వాటన్నిటినీ నాలో నుంచి తొలగించి మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నేను సినిమాకు వెళ్లేటప్పుడు చాలా ప్రిపేర్‌ అయి వెళ్తా. ఎక్కువ తెలివి తేటలు వాడకుండా ఓపెన్‌గా సినిమాలు చూడాలని అనుకుంటా. ‘అందరి సినిమాలు పోతే నీతో సినిమా చేయడానికి ఎవరొస్తాడ్రా?’ అని ప్రశ్నించుకుంటా. ఏడాదిలో ఒక వారం మాత్రమే నా సినిమా ఆడి, మిగిలిన వారాలు ఇంకే సినిమాలూ ఆడకపోతే సినిమాలు ఎవరు తీస్తారు? అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా. సినిమాకు వెళ్లేటప్పుడు భీమవరంలో ఉన్నప్పుడు సినిమాలు ఎలా చూసేవాడినో అలా చూడాలనుకుంటా. హ్యాపీగా చూడాలనుకుంటా. ఇదొక ఎక్సర్‌సైజ్‌. బేసిగ్గా ఏ ట్రేడ్‌లో ఉండేవారికైనా కొన్నాళ్లకు ఒక లగేజ్‌ వచ్చి చేరిపోతుంది. కొన్ని ఒపీనియన్స్‌ వస్తాయి. తెలియకుండా సి్ట్రక్ట్‌ అవుతాం.ఫ్లెక్సిబులిటీ పోతుంది. ఒక మేకర్‌గా నాక్కూడా అంతే. బావుందా? అని ఎవరైనా అడిగితే బావుంది.. ‘కానీ’ అని ఒక మాట అంటా. ‘కానీ ఎందుకురా?’ అంటే ఏమనాలి? ఏమీ చెప్పలేం. నార్మల్‌ ఆడియన్స్‌ భలే నవ్వుతారు. భలే ఏడుస్తారు. కానీ మనకలా కాదు. సినిమా మనకింకా నేక్డ్‌గా కనిపిస్తుంది. ‘దీని వెనకాల ఇలా జరిగి ఉంటుందా? అలా జరిగి ఉంటుందా?’ ఇలాంటి ఒపీనియన్స్‌తో సీన్‌ని చూస్తున్నప్పుడు తెలియకుండానే మనం ఆ సినిమాకు బయట ఉంటాం. అయినా సినిమాను చూస్తుంటాం. బట్‌ యు హావ్‌ బి ఇన్‌ ద ఫిల్మ్‌. అందుకే నేను ఫస్ట్‌డే మల్టీప్లెక్స్‌లకు వెళ్లను. అక్కడ ప్రతి రీల్‌కీ ఒపీనియన్‌ చెప్పేస్తుంటారు. నేను ‘ఛత్రపతి’ చూసి చాలా బాగా ఎంజాయ్‌ చేశా. కానీ ఒకడు అలా వెళ్తూ.. ‘ఫస్టాఫ్‌ బావుంది. సెకండాఫ్‌ చూడాలి?’ అని అన్నాడు. ఫస్టాఫ్‌ బావుందని చెప్పడానికి కూడా సుఖంగా లేదు అతనికి. ఇంటర్వెల్‌ పావుగంట సమయం ఉంది కదా? ఎంజాయ్‌ చేయొచ్చు కదా? కానీ అలా చెప్పరు. అతని మాటలు విన్నాక నాకే అంత విరక్తి వచ్చిందంటే రాజమౌళి అయితే ఏడ్చి ఉండేవాడు. ఎవరికైనా ఆ సిట్చువేషన్‌లో విరక్తి వస్తుంది. అందుకే నేను పస్ట్‌ డే ఉదయం మారుమూల థియేటర్లను వెతుక్కుని వెళ్తా. సినిమా విడుదలైన రోజు ఉదయాన్నే ఫోన్లు కూడా ఎత్తను. సినిమాకి వెళ్లకముందే మొత్తం చదివించేసేవాళ్లు ఉన్నారు. బావున్న విషయాన్ని బావుందని చెప్పడం వేరు. అవతలివాడికి ఇరిటేట్‌ తెప్పించేలా బావుందని చెప్పడం వేరు. అందుకే నా దృష్టిలో ఈజీగా ఉండటం ఈజీ కాదు. దాన్ని ప్రాక్టీస్‌ చేయాలి.’’
సిగ్గుతో తిరుగుతుంటా
‘‘ సినిమాను రూపొందించిన తర్వాత నేను చూసుకోలేను. నాకు బేసిగ్గా ఏ సినిమానూ నచ్చి చావదు. తీసిన వెంటనే నాకు లక్ష తప్పులు కనిపిస్తుంటాయి.. నాలో కూడా కొంత వెటకారం ఉంటుంది. నాకు నేనే పెద్ద విమర్శకుడిని. అందుకే సినిమా విడుదలైనప్పటి నుంచీ నేను సిగ్గుతో తిరుగుతుంటా థియేటర్ల బయట. ఇక్కడ ఇదే కరెక్ట్‌ అని నిక్కచ్చిగా చెప్పడానికి ఏదీ ఉండదు. ప్రతి దానికీ ఆప్షన్స్‌ ఉంటూనే ఉంటాయి. చిన్న ప్రెస్‌మీట్‌ సీన్‌ చేయాలంటే ఎన్నెన్నో ఆప్షన్లు
ఉంటాయి. కాకపోతే కొన్ని చేయకపోవడానికి కారణం బడ్జెట్‌ కావచ్చు. మరికొన్ని చేయకపోవడానికి కారణం ఎక్కడో ఆపాల్సిన అవసరం అయి ఉండవచ్చు. జర్నలిస్టులైనా తాము రాసింది చదువుకున్నాక, ఇంకేదో రాసి ఉంటే బావుంటుందని అనుకుంటారుగా? మేకర్‌గా నేను కూడా అంతే. అందుకే సినిమా ఎలా ఉందని మా ఆవిడని ఎప్పుడూ అడగను’’
సీరియ్‌సగా తీసుకోను
‘‘నేను బేసిగ్గా చాలా విషయాలను సీరియ్‌సగా తీసుకోను. కలెక్షన్ల గురించో, మారోదాని గురించో నెర్వస్‌ కాను. సినిమా హిట్‌ అవుతుందా? కాదా? అని ఎవరికీ తెలియదు. మనం బాల్‌ వేస్తామంతే. అది సిక్స్‌ కావచ్చు. ఫోర్‌ కావచ్చు. వైడ్‌ కావచ్చు. బౌన్స్‌ కావచ్చు. ఏదయినా కావచ్చు. మజా అనేది ప్రాసె్‌సలోనే ఉంటుంది. ఎవరైనా సినిమా సూపర్‌హిట్‌ అంటే ఆ కిక్‌ గంట సేపు ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. నాకు ఆనందంగా ఉందని అరవలేను కదా. సినిమా హిట్‌ అని తెలియగానే నేను బయటికొస్తే రకరకాల మనుషులు రకరకాల పనుల మీద వెళ్తుంటారు. వాళ్లని ఆపి నా ఆనందాన్ని చెప్తే అవతలి వాడు మంచి మూడ్‌లో ఉంటే ‘మంచిది’ అంటాడు. ఇంకొకడు చిరాకుగా ఉంటే కొడతాడు. ఒకవేళ ఫ్లాప్‌ అనుకో అప్పుడు కూడా బయటికెళ్లి ఏడవలేను. ఎవడినన్నా ఆపి ఏడ్చాననుకోండి, అవతలి వాడు వాడి కష్టాలు ఏకరువు పెడితే ఇద్దరం కూర్చుని ఏడవాలి. అందుకే ఎప్పుడూ ప్రాసె్‌సలోనే మజా ఉంటుంది. రిజల్ట్‌లో కానే కాదు. మంచి సీన్‌ రాసినప్పుడు కలిగే ఆనందం ముందు ఇంకేదీ నిలబడదు. ‘సన్నాఫ్‌ సత్యమూరి’్తతో ఓ డైనింగ్‌ టేబుల్‌ సీన్‌ ఉంటుంది. అందులో కామెడీ ఉండదు. కానీ కామెడీ పండాలి. అది రాయడం కష్టమైంది. తీరా సీన్‌ రాయడం పూర్తయ్యేసరికి వచ్చిన ఆనందం ముందు ఏదీ నిలబడలేదు.’’
పరభాషల్లో..
‘‘ఇతరులు పరభాషల్లో సినిమాలు చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు. ఇతర భాషల్లో సినిమాలు చేయాలంటే ముందు స్ర్కిప్ట్‌ అనుకూలించాలి. రాజమౌళి యూనివర్శల్‌ కాన్సె్‌ప్టలతో సినిమాలు చేస్తున్నారు. ‘ఈగ’, ‘బాహుబలి’ అలాంటివే. ఆ తరహా స్ర్కిప్ట్‌లకు మల్టీలాంగ్వేజ్‌సలో చేయడమే కరెక్ట్‌. నిజాయతీగా అలాంటి కథ దొరికి… రాసి, దానికి ఇంత కేన్వాస్‌ కావాలని అనుకుంటేనే చేయాలి తప్ప ఆషామాషీగా చేయకూడదు. బేసిగ్గా యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న స్టోరీని చెప్పడానికే అందరూ ఇష్టపడతారు. ప్రతి ఫిల్మ్‌ మేకర్‌ తన స్టోరీ చాలా మందికి రీచ్‌ కావాలనే అనుకుంటారు. నా వరకు నేను నా సినిమాల పట్ల హానె్‌స్టగా ఉంటాను. స్ర్కిప్ట్‌ని బలంగా, స్ర్టెయిట్‌ ఫార్వర్డ్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తాను’’
ఫ చల్లా భాగ్యలక్ష్మి

 

సన్నాఫ్ సత్యమూర్తి (09-Apr-2015)

‘రేసు గుర్రం’ తర్వాత అల్లు అర్జున్, ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’. అంతేకాదు…. ‘జులాయి’ సినిమా తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే! దాంతో సహజంగానే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి… మరి విలువలే ఆస్తి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యమూర్తి తనయుడు వాటిని ఏ మేరకు నిలబెట్టుకున్నాడో చూద్దాం.
కోట్లకు పడగలెత్తినా మానవీయ విలువల్ని మరిచిపోని వ్యక్తి సత్యమూర్తి (ప్రకాశ్ రాజ్). అతనికో అందమైన కుటుంబం. ఏ కష్టం లేకుండా ఇద్దరు కొడుకుల్నీ పెంచి పెద్ద చేస్తాడు. అయితే… ఊహించని విధంగా యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతాడు సత్యమూర్తి. దాంతో కుటుంబ బాధ్యతలన్నీ చిన్న కొడుకు విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) మీద పడతాయి. తండ్రికి వ్యక్తిత్వానికి మచ్చ పడకూడదనే ఉద్దేశ్యంతో ఆయన స్నేహితుడు సాంబశివరావు (రాజేంద్ర ప్రసాద్) ఐ.పీ. పెట్టమని సలహా ఇచ్చినా… ఉన్న 300 కోట్ల ఆస్తితో అప్పులు తీర్చేస్తాడు. కుటుంబ పోషణ కోసం చివరకు ఉద్యోగాల వేటలో పడతాడు. కోట్ల ఆస్తిని విరాజ్ చిన్న సంతకంతో వదిలేయడంతో… అప్పటికే పల్లవి (అదాశర్మ)తో జరిగిన నిశ్చితార్థాన్ని ఆమె తండ్రి (రావురమేశ్) కాన్సిల్ చేసేస్తాడు. స్నేహితుడి సహకారంతో వెడ్డింగ్ ప్లానర్ గా కొత్తజీవితాన్ని ప్రారంభించిన విరాజ్… పల్లవి పెళ్ళికే ఆ బాధ్యతలను నిర్వహించడానికి వెళతాడు. అక్కడే ఆమె స్నేహితురాలు సమీర ఉరఫ్ సుబ్బలక్ష్మి (సమంత)తో ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే సాంబశివరావుకు తన తండ్రి అమ్మిన స్థలాన్ని ధనరాజ్ (ఉపేంద్ర) అనే తమిళనాడుకు చెందిన గూండా కబ్జా చేశాడని తెలుస్తుంది. ధనరాజ్ నుండి ఆ స్థలం తనకు దక్కేలా చేసే బాధ్యత కూడా నీదే అంటూ విరాజ్ కు చెబుతాడు సాంబశివరావు. దాంతో ఐదు వేల అనుచరణ గణం, ఆరు వందల ప్రైవేట్ సైన్యం ఉన్న ధనరాజ్ ను విరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు? సాంబశివరావు దానిని ఎలా అప్పగించాడు? సమీరాతో విరాజ్ వివాహం జరిగిందా లేదా అన్నది మిగతా కథ.
కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడి కొడుకు… ఓ సామాన్యుడిగా మారి సమస్యలను ఎదుర్కొనడం… శత్రువు మనసు మార్చడం కోసం సతమతమవడం చూస్తే… మనకు ‘అత్తారింటికి దారేది’ సినిమానే గుర్తొస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్, అతని పక్కన ఉండే అలీని, కథానాయిక సమంతాను చూస్తే… పదేపదే ఆ మూవీనే మదిలో మెదులుతుంది. అయితే… అక్కడ విలన్ కోట చిత్తూరులో ఉంటే… ఇక్కడి విలన్ దేవరాజ్ రాష్ట్ర సరిహద్దు దాటి తమిళనాడులో ఉంటాడు. రాయలసీమ కక్షలు రొటీన్ అయిపోయాయని భావించాడేమో దర్శకుడు త్రివిక్రమ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు రౌడీని విలన్ గా ఎంచుకున్నాడు. కన్నుమూసిన తండ్రికి చెడ్డపేరు తీసుకురాకూడదని ఓ కొడుకు చేసే ప్రయత్నమే సినిమా అంతానూ. దాంతో టైటిల్ దానికి పెట్టిన కాప్షన్ కు బాగానే జస్టిఫికేషన్ జరిగింది!
ఇక నటీనటుల విషయానికి వస్తే… అల్లు అర్జున్, సమంత జోడీ బాగుంది. ప్రకాశ్ రాజ్ కనిపించేది కాసేపే అయినా తనదైన శైలిలో మెప్పించాడు. ‘జులాయి’లో అవుట్ అండ్ అవుట్ కామెడీ పండించిన రాజేంద్ర ప్రసాద్… ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఉపేంద్ర నటన గురించి. కన్నడలో ఇప్పటికీ హీరోగానే నటిస్తున్న ఉపేంద్ర గత కొంతకాలంగా పరభాషా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేయడానికీ వెనకాడటం లేదు. అలా ఉపేంద్ర చేసిన ఒకటి రెండు సినిమాలు కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. అయినా… వెనకడుగు వేయకుండా ఇందులో దేవరాజ్ పాత్ర చేసి మెప్పించాడు. అతని భార్యగా స్నేహ సైతం చక్కగా నప్పింది. రావు రమేశ్ కుమార్తెగా అదాశర్మ, దేవరాజ్ చెల్లిగా నిత్యామీనన్ ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. అదాశర్మ ఓకే గానే… నిత్యామీనన్ పాత్ర ఎంట్రీ, ముగింపు కూడా కంగాళీగానే ఉన్నాయి. తండ్రి విలువల్ని కాపాడుకునే ప్రయత్నం ఓ వైపు… ప్రేమలో ఎదురయ్యే ఊహించని మెలికలు మరోవైపుతో సన్నాఫ్ సత్యమూర్తి కాస్తంత తడబడ్డాడు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు, వాటిని తెరకెక్కించి తీరు పర్వాలేదు… నిర్మాత ఎస్. రాధాకృష్ణ చిత్ర నిర్మాణంలో మాత్రం రాజీపడలేదు. ఆ విషయం తెరమీద కనిపిస్తోంది. ఏ సన్నివేశానికి అది బాగానే ఉన్నా… మొత్తం సినిమాగా చూసుకుంటే మాత్రం సమ్ థింగ్ మిస్సింగ్ అనే భావన కలుగుతుంది. బహుశా నిడివి ఎక్కువ కావడం… అదాశర్మ, నిత్యమీనన్ తో అల్లు అర్జున్ ట్రాక్ ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు త్రివిక్రమ్ సినిమాల్లో ఉంటే ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాలో బాగా మిస్ కావటం కారణాలు కావచ్చు… అయితే తాను మాటల మాంత్రికుడినేనని ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ మరోసారి నిరూపించుకున్నాడు.
అటు ‘అత్తారింటికి దారేది’తోనూ, ఇటు ‘రేసు గుర్రం’తోనూ పోల్చుకుంటే… సత్యమూర్తి కొడుకు కాస్తంత నిరాశ పరుస్తాడు. మరి వేసవి సెలవుల్లో వచ్చాడు కాబట్టి… ఫ్యామిలీ ఆడియెన్స్ ఏమైనా ఈ కుర్రాడిని ఆదుకుంటారేమో చూడాలి!
3/5
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శుద్ధ సాహిత్యకారుడు జయకాంతన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి ఆత్మీయ సమావేశం స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతి

11-4-15 శనివారం సాయంత్రం 6 గం కు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి గారింట సరసభారతి ఫ్లోరా కలిసి 78 వ సమావేశం గా తెలుగు కధకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతి ,మరియు ఆత్మీయ సమావేశాన్నిజరిపాం .ప్రముఖ కదానికులు డా .శ్రీ వేదగిరి రాంబాబు ”,తెలుగు రధం ”అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ .ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ బాలి గార్లు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు జరిపాం .ప్రముఖ కదానికులు డా .శ్రీ వేదగిరి రాంబాబు ”,తెలుగు రధం ”అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ .ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ బాలి గార్లు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆ-లయ కారుడి విలవిల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్కౌంటర్ రాజకీయాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో ప్రారంభమైన రసం మామిడిపళ్ళ సీజన్

DSCN0570 DSCN0571

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుప్రసిద్ద నటుడు , రచయిత శ్రీ రావి కొండల రావు గారి తో రెండు సాయంత్రాలు – గబ్బిట కృష్ణ మోహన్

DSC00057 DSC00059 DSC00060 rk-1 rk-2

Posted in రచనలు | Tagged | Leave a comment