తాతమ్మ కలకు యాభై ఏళ్ళు

నలభై ఏళ్ల ‘తాతమ్మకల’
మహానటుడు డాక్టర్‌ ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తాతమ్మకల’ చిత్రం శనివారంతో నలభై ఏళ్లు పూర్తి చేసుకొంది. 1974 ఆగస్ట్‌ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కథానాయకుడు బహు కుటుంబీకుడు. ఐదుగురు సంతానంతో పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, పిల్లలు పలు అగచాట్లు పడతారు. అతని ఐదుగురు పిల్లల్లో చివరివాడు తప్ప మిగిలిన అందరూ చెల్లాచెదురవుతారు. చివరకు పల్లెసీమలోనే కష్టపడి పనిచేసుకుంటే బాగుంటుందనే నమ్మకంతో స్వగ్రామం చేరతాడు. ఈ కథ వింటే అధిక సంతానం వద్దనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఆరంభంలోనే ‘ఎవరన్నారు ఎవరు కలగన్నారు’ అనే పాటలో కృష్ణుడు అష్టమగర్భంలో జన్మించలేదా.. గాంధీ వాళ్ల తల్లికి ఎన్నోవాడు?’ అనే పదాలు ఉండటం గమనార్హం. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండ టంతో కుటుంబనియంత్రణ తప్పనిసరి అనే విధానం అమలులో ఉండేది. అందుకే ఎన్టీఆర్‌ దాన్ని వ్యతికరేకిస్తూ ఈ చిత్రం నిర్మించారు. అదే అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ‘తాతమ్మకల’ చిత్రాన్ని నిషేధించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది కూడా. అయితే ‘కుటుంబనియంత్రణ’ బలవంతంగా అమలు చేయడం తప్పని చెప్పామనీ, సినిమాలో కూడా సంపాదన బాగుండి పోషించగలిగినవారికి అధిక సంతానం ఉన్నా తప్పులేదని చెప్పామనీ నిర్మాతగా ఎన్టీఆర్‌ వాదించారు. ఏమయితేనేం ఈ సినిమాను ప్రభుత్వం నిషేధించకముందే ఎన్టీఆర్‌ ఆపేసి, మళ్లీ తను అనుకున్న అంశం జనానికి సూటిగా చేరేలా ‘తాతమ్మకల’ చిత్రాన్ని రీషూట్‌ చేసి 1975 జనవరి 8న విడుదల చేశారు. ఇలా ఒకే చిత్రం రెండు సార్లు విడుదల కావడమన్నది ఎక్కడా లేదు. అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్‌ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డ్‌ అందుకోవడం విశేషం. ఓ స్టార్‌ హీరో ‘బెస్ట్‌ రైటర్‌’గా ప్రభుత్వ అవార్డ్‌ అందుకోవడం అదే ప్రథమం.
‘తాతమ్మకల’ చిత్రంలో తాతమ్మగా భానుమతీరామకృష్ణ నటించగా, ఆమె భర్త, మనవనిగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఎన్టీఆర్‌ తనయులుగా ప్రసాద్‌, రాజబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, కూతురుగా రోజారమణి నటించారు. హరికృష్ణకు ఇది మూడో చిత్రం కాగా, బాలకృష్ణ ఈ సినిమాతోనే తెరకు పరిచయం కావడం విశేషం. ఇదే బాలకృష్ణకు తొలి సినిమా కాబట్టి నటుడిగా ఆయన కూడా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నట్లే లెక్క. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం ఎన్టీఆర్‌ నిర్వహించగా, సంభాషణలు డి.వి.నరసరాజు రాశారు. రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కొసరాజు, సినారే పాటలు రాశారు.
బాలకృష్ణ
అరుదైన రికార్డ్‌
‘తాతమ్మకల’తో నటజీవితం ప్రారంభించిన బాలకృష్ణ ఓ అరుదైన రికార్డ్‌ను నమోదు చేశారు. తెలుగునాట నటవారసుల్లో తొలి సూపర్‌స్టార్‌గా నిలిచిన బాలకృష్ణ 1974 నుంచి 2014 వరకూ గ్యాప్‌ లేకుండా నటిస్తూనే ఉండటం విశేషం. ఈ నలభై ఏళ్లలో ప్రతి సంవత్సరం బాలకృష్ణ నటిస్తూనే ఉన్నారు. అయితే 1981, 2013 సంవత్సరాల్లో మాత్రమే ఆయన నటించినప్పటికీ ఆ సినిమాలు ఆ ఏడాది విడుదల కాలేదు. ఏది ఏమైనా నటవారసుల్లో నలభై ఏళ్లు ఏకధాటిగా కెరీర్‌ను కొనసాగించిన ఘనత మనదేశంలో బాలకృష్ణకే దక్కింది. అదీగాక నటునిగా నలభయ్యో ఏట కూడా ‘లె జెండ్‌’తో ఒక బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో జమ చేసుకోవడం మరింత విశేషంగా నిలిచింది. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ నలభై ఏళ్ల కెరీర్‌లో ఏకధాటిగా నటిస్తూ అప్పుడు కూడా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసిన ఘనత ఒక్క బాలకృష్ణకే దక్కడం గమనార్హం. సంచలన చిత్రం ‘తాతమ్మకల’తో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ కెరీర్‌లోనూ నలభయ్యో ఏట సంచలనం సృష్టించారన్న మాట. అలాగే అప్పటికి నిర్మాణంలో ఉన్న రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై రూపుదిద్దుకొన్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.
కర్టెసీ : కొమ్మినేని వెంకటేశ్వరరావు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.