ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు
- 01/12/2014
శ్రీకాకుళం, నవంబర్ 30: పవిత్ర తపోవనాలు, భక్తి, ముక్తి, బాధ్యతలను ప్రసాదించే అసలైన వేదికలని, ఎందరో మహనీయులు ప్రాచీన కాలంలో ఇలాంటి వన, జ్ఞాన సంపదల నుంచి తపస్సు చేయడం ద్వారా ఆధ్యత్మిక మార్గాలను పామురులకు సైతం అందించగలిగారని రాష్టప్రతి పురస్కార గ్రహీత, సూర్యపీఠం అధిపతి సద్గురు కృష్ణయాజీ పేర్కొన్నారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పెద్దబాడాం అమరగురు బాబాజీ సిద్ధయోగ తపోవనం మంగళకర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన పీఠాపధితులు, స్వామిజీల వేదికలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తల్లి సౌజ్ఞానం, తండ్రి అక్షరజ్ఞానం అందిస్తారని ప్రజ్ఞానం గురుబ్రహ్మలే బోధిస్తారంటూ గురుతర బాధ్యతను తపోవనం వ్యవస్థాపకులు, పరమేశ్వరానంద గిరి స్వామిజీ ధన్యులన్నారు. సర్వసంగ పరిత్యాగులైన సాధుసజ్జనులు అసలైన దైవస్వరూపులని, వారి సూక్తులను ఆచరించి జీవితాన్ని పునీతం చేసుకోవాలని భక్తులకు హితవుపలికారు. ఈ సందర్భంగా వేదికపై గల పీఠాధిపతులు, సాదుపుంగవులను దుస్సాలువాతో కప్పి ఫల, పుష్పాలు సమర్పించి పాదాభివందనం చేసి అందరికీ గురుబాధ్యతను గుర్తుచేశారు. నెమలికొండ శాంత్యాక్రమ దత్త పీఠాధిపతులు సద్గురు సదానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ, తపోవనం అందరి భాగ్యమని, విశ్వకల్యాణం కోసం ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దైవత్వాన్ని గురించి దైవికంగా జీవించాలన్నారు. పాత్యాశ్చ దేశాల్లో లేని బ్రహ్మ, ఆత్మజ్ఞానాలను, శాంతి ఆనందాలను ఈ దేశంలో చూడవచ్చునన్నారు. నాది-నేను- నావారు అనే ధ్యాసలో దైవానికి దూరం కారాదని సూచించారు. అదేవిధంగా ఆనందాశ్రమం వ్యవస్థాపకులు, స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ, ఉత్తరాంధ్ర సాదుపరిషత్ గౌరవ అధ్యక్షులు, దుర్గాపీఠం వ్యవస్థాపకులు సమతానంద సరస్వతీ, నైమిశారణ్యాశ్రమ పీఠాధిపతి బాలబ్రహ్మనందస్వామి వారి ప్రసంగాల ద్వారా జన్మరహస్యం తెలుసుకోవాలని, రామాయణ, భారత, భాగవతం వంటి సనాతన ధర్మాన్ని ఉపదేశించే గ్రంథాలను పారాయణం చేయాలన్నారు. ఆశ్రమాలు, తపోవనాలను సంరక్షించడం ద్వారా జన్మను ధ్యానం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
చిత్రం.. కార్యక్రమంలో మాట్లాడుతున్న కృష్ణ యాజీ
