ఆమెకు శునకాలే కన్నకొడుకులు

ఇవే కన్న కొడుకులు

మనుషులు చూపే ప్రేమలో వెనకాముందు ఆలోచనలేవైనా ఉంటాయేమో కాని.. శునకాలు చూపించే వాత్సల్యంలో నూటికి నూరు శాతం సహజత్వం ఉంటుంది. అందుకే మనుషులకు లేని విశ్వాసం కుక్కలకు ఉంటుందంటారు. ఆలాంటి మూగజీవులను చేరదీసి.. ఇద్దరు కొడుకులు లేరన్న లోటును తీర్చుకుంది విజయవాడకు చెందిన పాలడుగు సుజాత.
తను చేరదీసిన ఆ వీధిశునకాలు కన్నబిడ్డలకంటే ఎక్కువయ్యాయిప్పుడు. జీవితంలో ఎదురైన పెను విషాదాన్ని సైతం తుడిపేశాయవి. ఆ విషయాలనే ‘నవ్య’తో పంచుకున్నారు సుజాత..
‘‘మాది విజయవాడ. భర్త బాబూరావు వన్‌టౌన్‌లోని పాలఫ్యాక్టరీ ఉద్యోగి. నాకు చదవడం తప్ప రాయడం రాదు. అందుకనే గృహిణిగానే ఉండిపోయాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు సాయితేజ బీటెక్‌ పూర్తిచేశాడు. విజయవాడలోనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగం వచ్చింది. రెండో అబ్బాయి సందీప్‌ విశాఖపట్టణంలో ఎంబీఏ చేస్తున్నాడప్పుడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయం అది. ఒక రోజున – ఢిల్లీలోని నోకియా కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని తమ్ముడిని కూడా వెంటబెట్టుకెళ్లాడు సాయితేజ. పదిహేను రోజుల తర్వాత ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది మాకు. ఆ వార్త విని కుప్పకూలిపోయాం. మా ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని, అక్కడే లోయలో పడి చనిపోయారని తెలిసింది. కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టంత కొడుకులు, జీవితమంతా ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకులు.. హఠాత్తుగా మాయమైపోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత చెప్పేదేముంది? భరించిన వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ! ఒక దశలో నేను పిచ్చిదాన్ని అవుతానేమోనన్నంత భయం. ఇక ఎవరి కోసం బతకాలన్నంత కుంగుబాటు. అంతా శూన్యంలా తోచేది. పిల్లలు లేని జీవితం ఇక ఎందుకు? ఏం సాధించాలని? ఎవరి కోసం బతకాలని? అనిపించేది.
అవే నా లోకం..
నా భర్తతో కలిసి కారులో వెళుతున్నప్పుడు – షడన్‌గా కారు డోర్‌ ఓపెన్‌ చేసి రోడ్డు మీద పడి చచ్చిపోవాలని చాలాసార్లు అనుకున్నాను. రెండేళ్లపాటు అవే ఆలోచనలు పట్టి పీడించాయి నన్ను. ఎవరితో మాట్లాడుతున్నా కళ్లలో నీళ్లు మెదిలేవి. అలాంటి విషాద సమయంలో ఒక రోజున – మా ఇంటి ముందు కాళ్లు ఈడ్చుకుంటూ బాధతో మూలుగుతూ ఒక శునకం కంటపడింది. దాని వెనక కాళ్లు రెండు నుజ్జు నుజ్జు అయిపోయాయి. బహుశా ఏదో వాహనం దాని మీద నుంచి వెళ్లినట్లుంది. ఆ కుక్క అవస్థను చూస్తూనే నా గుండె కరిగిపోయింది. అప్రయత్నంగానే అమాంతం వెళ్లి రెండు చేతుల్లోకి తీసుకున్నాను. అప్పుడది నా వైపు కృతజ్ఞతాభావంతో చూసిన చూపుకు మాటలు రాలేదు. అప్పటికప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశాను. అది కాస్త తేరుకుంది. ఇంట్లో ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా నా వెనకే వచ్చేది. కొద్ది రోజుల్లోనే దాంతో అనుకోని బంధం ఏర్పడింది. ఆ కుక్కకు నేను పెట్టుకున్న ముద్దు పేరు శేషు. ఆ తర్వాత – మెడకు ఏదో బిగుసుకుపోయి దిక్కుతోచక పరుగులు తీస్తున్న మరో కుక్క నాకు తారసపడింది. దాన్ని అక్కున చేర్చుకుని వైద్యం చేయించాను. కొన్నాళ్లకు అది కూడా తేరుకుంది. ఈ రెండో శునకానికీ జిమ్మీ అని నామకరణం చేశా. ఆ రెండు పేర్లతో నేను పిలవగానే ఎక్కడున్నా అవి పరుగు పరుగున నా వద్దకు వచ్చి.. రెండు కాళ్లతో ఆప్యాయంగా నా మీదికి ఎగిరి.. ఎక్కడలేని ప్రేమను చూపించేవి. అలాంటిదే మరో కుక్కకు ఆశ్రయం ఇచ్చాను. ఆ మూడింటి పోషణ నాకొక వ్యాపకంగా మారిపోయింది. నాలో నాకు తెలియకుండానే.. నా ఇద్దరు కొడుకులు లేరన్న బాధ మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. పిల్లల మీదున్న ఆ ప్రేమను ఈ శునకాల్లో చూసుకునేదాన్ని.
ఆసరా కావాలిప్పుడు..
విజయవాడలోనే కాళీకృష్ణ భగవాన్‌ ఆలయానికి సమీపంలోని ఓ అద్దె ఇల్లు వీటి నివాసం. నెలకు రెండువేలు అద్దె. ఒక్కొక్కటిగా తోడైన శునకాలు 34 అయ్యాయి. అవన్నీ షావుకార్లు పెంచుకున్న జాతికుక్కలు కాదు. వీధి శునకాలు. ఏ దిక్కూమొక్కులేని నిర్భాగ్య మూగజీవులు. వీధుల్లో తిరుగుతూ ఏ ప్రమాదాలకో, జబ్బులకో గురైనవి. నా బిడ్డలకంటే ఎక్కువయ్యాయి. ఇప్పుడు శునకాలే నా లోకం. వాటి ఆలనా పాలనతోనే సమయం గడిచిపోతోంది. ప్రతి రోజు ఉదయం ఆరింటికే బిస్కెట్లు తినిపించి, పాలు తాగిస్తాను. మధ్యాహ్నం మజ్జిగ అన్నం పెడితే ఆవురావురుమని తింటాయి. రాత్రికి కూడా ఏదో ఒక తిండి ఉంటుంది. ఆది, బుధవారాలప్పుడు మాత్రం మాంసాహారం అందజేస్త్తాను. శుక్రవారం నాడు మజ్జిగ అన్నానికి బదులు.. సాంబారు అన్నం వడ్డిస్తాను. ప్రతి ఆరు మాసాలకోసారి అన్ని శునకాలకు వైద్య పరీక్షలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి వ్యాధినిరోధక ఇంజక్షన్లు తప్పనిసరి చేశాను. ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురున్న కుటుంబం గడవడానికే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇన్నేసి మూగజీవులకు తిండి సమకూర్చడం ఆషామాషీ వ్యవహారం కాదు. శునకాల కోసం తీసుకున్న ఇంటి అద్దె, తిండి, వైద్యం ఇలా అన్నీ కలుపుకుంటే సుమారు నెలకు పాతికవేలు అవుతోంది. ఈ మొత్తంలో ఓ పదివేలు మాత్రం నా భర్త సమకూరుస్తున్నాడు. మిగిలిన డబ్బును నా సోదరి ముగ్గురు కూతుళ్లు తలా ఒక చేయి వేస్తున్నారు. అందరి ఔదార్యంతోనే బండి సజావుగా సాగుతున్నా.. ఈ మధ్యనే ఒక ఇబ్బంది వచ్చిపడింది. శునకాల కోసం తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తోంది. వీధికుక్కల వల్ల చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు వస్తున్నాయని ఇల్లును ఖాళీ చేయమన్నారు. దీంతో ఈ కుక్కలన్నింటినీ ఎక్కడికి తరలించాలో అర్థం కావడం లేదు. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న వీటిని ఉన్నఫలంగా నడి రోడ్డుమీద వదిలేయలేము కదా! నాకిప్పుడు కాస్త దాతల ఆసరా కావాలి. ఎవరైనా మూగజీవుల మీద ఔదార్యం చూపించే సహృదయ మానవతామూర్తుల అండ కావాలి. ప్రభుత్వం కూడా స్పందించి ఒక మార్గం చూపిస్తే అదే పదివేలు.
పాలడుగు సుజాత ఫోన్‌ : 99493 45644
‘‘మా ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని, అక్కడే లోయలో పడి చనిపోయారని తెలిసింది. కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టంత కొడుకులు, జీవితమంతా ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకులు.. హఠాత్తుగా మాయమైపోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత చెప్పేదేముంది? భరించిన వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ! ఒక దశలో నేను పిచ్చిదాన్ని అవుతానేమోనన్నంత భయం. ఇక ఎవరి కోసం బతకాలన్నంత కుంగుబాటు. అంతా శూన్యంలా తోచేది. పిల్లలు లేని జీవితం ఇక ఎందుకు? ఏం సాధించాలని? ఎవరి కోసం బతకాలని? అనిపించేది..
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.