పక్కింటి మీనాక్షమ్మ – కథ

పక్కింటి మీనాక్షమ్మ – కథ

  • 07/12/2014
TAGS:

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్‌గా సోఫాలో కూర్చుని ‘ఒసేవ్! ఆండాళ్లూ! కాఫీ పట్రా’ అంటూ కేకపెట్టాడు సదాశివం. ‘ఆ! వస్తున్నానండీ..’ అంటూ స్టౌ దగ్గర కాఫీ కలుపుతూ అక్కడే నిలబడి ‘పక్కింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్లాయన కొనిచ్చే నగలు నట్రా చూశారా? మీరూ ఉన్నా రు, ఎందుకు? ఓ ముద్దూలేదు, ముచ్చటా లేదు. ఊ.. ఊ..’ అంటూ ఏడుపు రాగంతో శోకగీతమాలపిస్తోంది.
‘ఇదిగో తెస్తానన్నది కాఫీ. ఇంకా తేలేదేమిటి? ఆ పాట ఎక్కడో రేడియోలో విన్నట్లుందే! టీవీలొచ్చాక రేడియో లెక్కడున్నాయి. అయినా మనింట్లో రేడియో లేదాయె!’ అంటూ సోఫాలో నుంచి లేచి వంటింట్లోకి వెళ్లి చూశాడు సదాశివం.
ఆండాళ్ మళ్లీ అదే పాట రిపీట్ చేస్తోంది. భర్తని చూడగానే చీర కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుంది. శోకగీతం వాయిస్ మరికాస్త పెంచింది.
‘నువ్వా.. ఆ పాట పాడేది. ఎక్కడో రేడియోలో నుంచి వినిపిస్తోందనుకున్నాను. నేను నీ ముద్దూ ముచ్చట తీర్చటం లేదా? ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చాక నువ్వడిగినన్ని ముద్దులిస్తున్నానుగా! ఇంకా ఎందుకేడుస్తావు?’ కాస్తంత కటువుగానే కోప్పడ్డాడు.
‘ఓయబ్బో! మహా ఇచ్చారులే ముద్దులట! ముద్దులు!! ఊరికే ఇచ్చేవి, ఎన్నయినా ఇస్తారు’ మెటికలు విరిచింది ఆండాళ్లు.
‘మరైతే నీకేం కావాలంటావు? రేపటి నుంచి అవీ మానేస్తాను. ఏం కావాలో చెప్పు’ అని గద్దించాడు.
‘మన పెళ్లయినప్పటి నుంచి ఒక నగ కొన్నారా? చేతికి గాజులు చేయించారా? నడుముకి ఒడ్డాణం చేయించి పెట్టారా? మా పుట్టింటి వాళ్ళు పెట్టిన మెళ్లో ఈ తాడు తప్ప, మరేమైనా ఉన్నాయా? ఆ మీనాక్షిని చూడండి! మెడ నిండా ఎనె్నన్ని నగలు దిగేసుకుంటుందో..! రోజుకో పట్టుచీర కడుతుంది. ఇంటి నిండా ఖరీదైన సామానులున్నాయి. రోజూ నాకు చూపించి తెగ మురిసిపోతుంది’ పక్కింటావిడ చిట్టా విప్పింది ఆండాళ్.
‘ఓహో! అదా అసలు సంగతి. వాళ్లాయన అందరి దగ్గరా లంచాలు తీసుకొని రెండు చేతులా సంపాదిస్తాడు’ చిరాగ్గా అరిచాడు సదాశివం.
‘మీరూ ఆ పని చేయచ్చుగా! ఇందులో తప్పేముంది?’
‘లంచం తీసుకోవటం మహా నేరం. పట్టుబడితే ఇంతే సంగతులు. కటకటాలు లెక్కబెడుతూ కూర్చోవాలి. ఆ సంగతి నీకు తెలీదా?’ గద్దించాడు.
‘ఓ! మాగొప్పగా చెప్పొచ్చారులెండి. తెలివితేటలుంటే సరి. మీనాక్షి వాళ్లాయన చేయటం లేదా? నగలు చేయించటం చేతగాకపోతేసరి. కబుర్లకేం బాగానే చెప్తారు. పోనీలెండి! నా ఖర్మ ఇంతేననుకొని సరిపెట్టుకొంటాను. చేతగాని మొగుణ్ణి చేసుకుంటే ఏం లాభం?’ అంటూ ముక్కు చీదింది.
‘నేనేమైపోయినా ఫరవాలేదు. నీక్కావలసింది నగలే కదా! అలాగే చేయిస్తానులే’ అన్నాడు కోపంలోనూ కొంత శాంతించి. వారం రోజుల్లో మీనాక్షి వాళ్ల ఇంటి మీద ఏసిబి దాడులు జరిగాయి. ఇల్లంతా సోదాలు చేసి మీనాక్షి ఒంటి మీద నగలే కాకుండా అంతకుముందున్న పాత నగలు కూడా లెక్కలు చూపించి పట్టుకెళ్లిపోయారు. మీనాక్షి వాళ్ళాయన్ని పోలీసులొచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. మీనాక్షి ఏడుస్తూ చెప్పింది విషయమంతా ఆండాళ్‌కి.
‘పాపం! ఎంతపని జరిగిపోయింది. మీనాక్షిని చూస్తుంటే జాలేస్తోంది. ఖరీదైన వస్తువులన్నీ పట్టుకుపోయారు. నా అంత గొప్పవాళ్లు లేరని మీనాక్షి ఎగిరెగిరి పడింది. అంతాపోయాక ఇంట్లోంచి బయటికి రాలేక లోపలే కుమిలిపోతోంది. తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే మరి. మా వారికి ఆ గతి పట్టకూడదు. పాపిష్టిదాన్ని. నగల కోసం ఆయన్ని లంచం తీసుకోమని పోరాను. నా భర్త నాకు క్షేమంగా ఉంటే చాలు’ అనుకుంటూ సమాధానపడింది ఆండాళ్లు.
సదాశివం ఇంట్లోకి వస్తూనే ‘ఆండాళ్ళూ..! చూశావా? నీ కోసం ఏంతెచ్చానో! త్వరగా రా!..’ అంటూ కేకలేశాడు.
అందమైన బాక్స్‌లో నుంచి ఎరుపు, తెలుపు రాళ్ల నెక్లెస్, పెద్ద హారం! బయటికి తీసి ఇవిగో నువ్వడిగినవి తెచ్చాను. రేపటి నుంచి అలక మానేయాలి సుమా! వంటింట్లో గినె్నలు విసిరికొట్టడం, నన్ను దూరం పెట్టటం మానుకోవాలి’ అంటూ నెక్లెస్ తీసి మెడలో వేయబోయాడు సదాశివం.
‘ఏమండీ! ఆ నగలు నాకొద్దండీ. మిమ్మల్ని జైలుకి పంపడం నాకిష్టం లేదండీ. ఆ మీనాక్షి గతి ఏమైందో తలుచుకుంటేనే బాధగా ఉంది. లంచం తీసుకుని కొన్న ఆ నగలు నాకొద్దండీ. బుద్ధితక్కువై అడిగాను. ముందా నగలు ఎక్కడకొన్నారో అదే షాపులో ఇచ్చి రండి’ ఏడుపు లంకించుకుంది ఆండాళ్లు.
‘ఇప్పటికైనా తెలిసిందా? తోటివాళ్లు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటానన్నదిట నీలాంటావిడ! పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో మనల్ని పోల్చుకోకూడదు. నాగురించి నీకా భయం అక్కర్లేదులే! ఇది లంచం డబ్బుతో కొన్నది కాదు. మంచి బంగారం అసలే కాదు. ఒన్ గ్రాము గోల్డ్ నగలు. అచ్చం బంగారం లాగానే ఉన్నాయి. పెట్టుకో! భయమేమీ లేదు!! కావాలంటే ఇలాంటివి ఎన్నయినా కొనిపెడతాను’ అంటూ భార్య మెడలో నెక్లెస్ అలంకరించాడు సదాశివం. అద్దంలో చూసుకుని ‘చాలా బాగుందండీ. బంగారం లాగానే ఉంది కదండీ! మీరు ప్రేమతో నిజాయితీగా ఇచ్చిన గిల్ట్ నగలైనా చాలు. మీరెంత మంచివారు’ అంటూ భర్త ఎదపై వాలిపోయింది. మీనాక్షి తన భర్తతో కలిసి నాటకమాడిన సంగతి పాపం ఆండాళ్‌కి తెలియదు. అందుకు సంతోషించి ముసిముసిగా నవ్వుకున్నాడు సదాశివం.

తాటికోల పద్మావతి,
గుంటూరు.
మొబైల్ : 9441753376

మార్పు తెచ్చిన కాలం

చిన్ని కథ

కృష్ణలంకలో భగవతి గారింట్లో అద్దెకుండే రోజుల్లో వారి ఏకైక పుత్రరత్నం కులాంతర వివాహం చేసుకుని, ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. కొడుకుని క్షమించలేని ఆయన అరిచిఅరిచి గుండెపోటుతో పోయాడు.
‘సర్దుకుపోవడం రాలేదాయనకి’.. అంది భగవతి. కోడలిని కూతురిలా చూసుకునేది. ఆ పిల్ల కూడా నాకు అమ్మలేని లోటు అత్తగారు తీర్చారంటూ ఒకరిని ఒకరు పొగుడుకుంటూ వుండేవారు. ఆ అత్తాకోడళ్లని చూసి ముచ్చటపడ్డారు అందరూ. భవానీపురంలో ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయారు. ఇరవై సంవత్సరాల తరువాత చందన బ్రదర్స్‌లో షాపింగ్ చేస్తూ.. ‘ఆ పిల్లని గుర్తుపట్టారా?’ అడిగింది మా ఆవిడ.
నాకు గుర్తురాలేదు. ‘్భగవతి గారి కోడలు’ అంది. ‘బొమ్మరిల్లు’ జెనీలియాలా వుండే పిల్ల ‘కితకితలు’ గీతాసింగ్‌లా మారిపోయింది. ముఖాన బొట్టు లేదు. అయినా మా ఆవిడ గుర్తుపట్టింది.
‘బాగున్నావా అమ్మా’ అని పలకరించి వాసు ఎక్కడ? అని అడిగింది. ‘యాక్సిడెంట్లో పోయారు’ పుల్లవిరుపుగా సమాధానం.
‘మీ అత్తగారు ఎలా వున్నారు?’ అని అడిగింది.
‘గుండ్రాయిలా వుంది.. తండ్రీకొడుకులిద్దరినీ మింగింది. నాకు బిపి, షుగర్, నన్ను కూడా..’ అంటూ ఆపేసింది.
గుడ్లప్పగించి చూస్తుండిపోయాం. మా ముందు నుంచే పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది.
‘ఆ అమ్మాయి అలా మాట్లాడుతోందేమిటి?’ తేరుకుని అడిగేను.
‘కాలం చాలా మార్పుల్ని తెస్తుంది. ఒకప్పుడు దేవతలాంటి అత్తగారు ఇప్పుడు దెయ్యాంలా కనిపిస్తున్నారామెకు’ అంది మా ఆవిడ.
‘మగవాళ్లిద్దరూ పోయారు. ఇంటికి తనే మహారాణినని అనుకుంటోంది. మొన్న సుశీలగారు కనిపించి ఆ ఇంటి విషయాలు చెప్పారు. తల్లీ, పిల్లలు పెద్దావిడని నానామాటలూ అంటారట. భగవతిగారు పూజగదిలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారట. ‘కుక్కకి వున్న విశ్వాసం ఈ మనిషికి లేదయ్యోయ్’ పాట వినిపిస్తోంది. అది ‘ఇలాంటి వాళ్లకి సరిపోతుంది’ అంది మా ఆవిడ బాధగా!

చావలి సూర్యం, కార్పొరేషన్ ఆఫీసు, విజయవాడ.

వెంటాడే పద్యం..

మూర్ఖంగా ప్రవర్తిస్తే మూడినట్లే..!

మకర ముఖాంతరస్తమగు మానికమున్ బెకలింపవచ్చు, బా
యక చలదూర్మికా నికరమైన మహోదది దాటవచ్చు, మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు, మ
చ్ఛిక ఘటియించి మూర్ఖజన చిత్తముదెల్పన సాధ్యమేరికిన్!
మొసలి నోటిలో వున్న మాణిక్యాన్ని కష్టపడి బయటకు తీయవచ్చు. వీడకుండా వచ్చే మహోగ్రమైన అలలతో కూడిన సముద్రాన్నైనా దాటవచ్చు. కాలకూట విషాన్నిగక్కే పామునైనా మెడలో దండవలే ధరించవచ్చు. బుజ్జగించి గానీ, ఎన్ని మంచి మాటలు చెప్పినా గానీ మూర్ఖుడి మనసును లేశమాత్రమైనా మార్చలేము- అని ఈ పద్య భావము.
ఇది భర్తృహరి రాసినది. ‘సుభాషిత త్రిశతి’ పేరిట మూడు వందల శ్లోకాలను సంస్కృతంలో రాశాడు. దీన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన రాశారు. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రాసినది. లోకంలోని నీతి రీతులను బోధిస్తూ ఎన్నో పద్యాలు రాశారు. కవి నీతిని, మానవీయ మూల్యాలను, సాంస్కృతిక విలువలను, సంఘ వ్యవస్థను తన పద్యాల్లో అపూర్వంగా ప్రబోధించారు
మానవుణ్ణి దివ్యునిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఈ పద్యం మానవునిలో ఉన్న అంతర్గత మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తుంది. వీరి శతకాల్లోని పద్యాలు ఒక్కో పద్యం ఒక్కో అనర్ఘ మహారత్నంగా భాసిల్లుతుంది. మానవుడు మూర్ఖత్వం వీడి జ్ఞానాన్ని పొందాలంటారు కవి. ఈ పద్యం చదువుతున్నప్పుడు విష్ణుశర్మ, చిన్నయసూరి పంచతంత్ర కథలు గుర్తుకు వస్తాయి. ఈ పద్యానికి ఉదాహరణగా చిన్ని కథ –
ఒక విపినములో ఒక జింక, నక్క, గాడిద, ఒక ఎలుగుబంటు స్నేహం చేస్తూ కలసిమెలసి కష్టసుఖాలు పంచుకుంటూ జీవిస్తుండేవి. జింక సాధు జంతువు. తను రోజూ అడవికి వెళ్లి వేటాడి తనకు దొరికిన ఆహారాన్ని మువ్వురు స్నేహితులకూ పంచేది. గాడిద కూడా అలుపెరుగని అమాయకపు జంతువు. తను కూడా సంపాదించిన దాంట్లో స్నేహితులకి పంచేది. ఇక జిత్తులమారి నక్క తను వేటాడకుండా మాయమాటలు చెప్పి తన స్థానం కదలకుండా మిత్రులు తెచ్చిపెట్టేది భుజిస్తూ సుఖంగా జీవనం సాగించేది. ఎలుగుబంటు పైముగ్గురు మిత్రులకన్నా బలవంతుడననీ, తెలివితేటలు కలవాడననీ, అందరూ తనకే తెచ్చిపెట్టాలనీ దౌర్జన్యంతో బెదిరిస్తూ స్నేహితులు సంపాదించేది భుజిస్తూ కాలం వెళ్లబుచ్చేది.
జింక చిన్న జంతువు కావటం వల్ల ఆహార సముపార్జన కష్టతరమై శక్తిహీనురాలైంది. ఎలాగో భారంగా రోజులు గడిపేస్తోంది. ఎలాగా జీవనం అని తనలో తనే కుమిలిపోయేది జింక. చివరకు భారమంతా గార్ధవముపై పడింది. భారంగా ఆహారం సంపాదిస్తోంది మిత్రుల కోసం గాడిద. మిత్రులు తెచ్చే ఆహారం అందరికీ సరిపడటం లేదు. టక్కరి నక్కకు అసహనం ఎక్కువైపోతోంది. వారిద్దరూ అక్కడే ఆరగించి మిగిలినది తమకు తెస్తున్నారని ఎలుగుబంటుకు మిత్రుల మీద చాడీలు చెప్తోంది. సోమరిపోతు ఎలుగుబంటు నక్క తియ్యని మాయమాటలు నమ్మేది. మిత్రుల మీద దానికి ఆగ్రహం పెరిగిపోతోంది. వారిని ఎలా దెబ్బతీయాలా? అని ఆలోచిస్తోంది ఎలుగు. నక్కకి సంతోషం పెరిగింది. చివరకు కలహాలు మొదలయ్యాయి వారిలో వారికి.
ఒకరోజు జింక తన మిత్రులతో ‘మనలో మనకు వైరాలు తగవని, కలసిమెలసి ఉందామని’ హితవు చెప్పింది. నక్క, ఎలుగుబంటు మిత్రుని మాటలు పెడచెవినపెట్టి ‘నీవా మాకు నీతులు చెప్పేది? నీ మాటలు మేము వినాలా? ఛీ! ఛీ! వెళ్లిపో ఆవలకు’ అని ఛీకొట్టాయి. ఇలా అనునిత్యం ఏదో ఒక సందర్భంలో తగవులాడుకుంటూనే ఉన్నాయి. మేము గొప్పంటే మేము గొప్పనీ, నాతో పెట్టుకోవద్దనీ హెచ్చరికలు చేసుకుంటున్నాయి.
ఓరోజు ఈ రీతిగా మూర్ఖపు ఎలుగుబంటు, నక్క తగవులాడుకుంటూ రక్తాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడుకుంటున్నాయి. అదే సమయంలో అటుగా సింహం వెళుతూ వాటిని చూసింది. తనకు ఆహారం దొరికిందని సంతసిస్తూ అమాంతం వచ్చి ఎలుగుబంటును దొంగదెబ్బ తీసి చంపేసింది. జిత్తులమారి నక్క తన యుక్తితో ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంది. మూర్ఖపు ఎలుగుబంటు ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోక తన ప్రాణాలకు తనే అపాయం తెచ్చుకుని జీవితాన్ని కోల్పోయింది చివరకు.
ఈ కథనుబట్టి ‘కలసి వుంటే కలదు సుఖం అనీ, మూర్ఖత్వాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలని, చెప్పుడు మాటలు వింటే తగిన శాస్తి జరుగుతుందనీ మనకు అర్థవౌతుంది. చిన్నయ సూరి నీతికథలు, విష్ణుశర్మ కథలు బాలల వికాసానికి దోహదపడతాయి. నీతి శతకాల్లోని పద్యాలు మానవునిలోని అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలి జ్ఞానం అనే వెలుగులను ప్రసాదిస్తాయి. ఈ పద్యాలు విద్యార్థులు, యువతలో వికాసం, సంస్కార భావాలు నాటుతాయి. ఈ పద్యాలు చదివిన ప్రతీ మనిషి నిత్యం జ్ఞానమార్గాన్ని అనే్వషిస్తూ నైతికతను పాటిస్తూ సమాజంలో ఉన్న వైషమ్యాలను పారదోలి నీతివర్తనుడై మనుగడ సాగిస్తాడు. అందరూ అలానే మనుగడ సాగిస్తారని ఆశిద్దాం!

రావూరి ఇందుమతి (ఇందునాథ్),
తెలుగు పండిట్,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
మొబైల్ : 9533721776

మనోగీతికలు..

హత్య!
మనసిచ్చిన ఒక మగవాడు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.