రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

  • – చివుకుల రామమోహన్
  • 27/10/2014
TAGS:

హిందువులందరికి భారతదేశములోని నలు దిశలా వెలసియున్న అనేక పుణ్యతీర్థాలను అనవరతం దర్శించి, విశేష పూజలు చేయుట, విశేషించి పర్వపు రోజులలో క్షేత్ర దర్శనం పుణ్యప్రదమని, ముక్తిదాయకమని భక్తజనుల నమ్మిక. అందుకు తగినటులనే ఈ పుణ్యక్షేత్రము నదీ పరీవాహక ప్రాంతములలోనే ఎక్కువగా కొలువు తీరుట కూడా పుణ్యనదీ తీర్థ స్నానాదుల కొరకేయని నిశ్చయంగా చెప్పవచ్చు.
కృష్ణానదీ తీరాన వెలసియున్న ప్రసిద్ధమైన ‘‘టేకుపల్లి’’ శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర ప్రాముఖ్యత ఇంతింత అని చెప్పరానిది. ఆదిశంకరులు భారతదేశాన్ని మూడు పర్యాయాలు పర్యటించి నాలుగు పీఠాలను ఏర్పాటుచేశారు. అంతేగాకుండా ఆలయాల పునరుద్ధరణా కార్యక్రమం కూడా విరివిగాజరిగింది.
‘టేకుపల్లి’ (కృష్ణాజిల్లా)లోని శ్రీ రామేశ్వరస్వామి దేవాలయం కూడా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని వెలసింది. దీనిని అగస్త్యముని ప్రతిష్ఠించారు. శతాబ్దాలుగా ఆరాధన జరుగుతున్న ఒక విశిష్ఠ క్షేత్రరాజము ఈ టేకుపల్లి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయం. గత శతాబ్దంలో 1930 సంవత్సరంలో యడివల్లి రంగమ్మ కళ్ళేపల్లి గ్రామంలోవున్న తన 4 ఎకరాల సారవంతమైన మాగాణి భూమిని గుడి నిత్య పూజాది కార్యక్రమాలు జరుపు నిమిత్తం దానంగా అందజేశారు. అదే రీతిలో అద్దేపల్లి కుటుంబ సభ్యులు 56 సెంట్ల మాగాణ స్థలాన్ని ఆలయ ఖర్చులకు గాను అందజేశారు. అనంతరం విష్ణ్భుట్ల అన్నపూర్ణమ్మ ధ్వజస్థంభ నిర్మాణం చేయగా, ఐ.డి.బి.ఐ రిటైర్డ్ డైరెక్టరు పిల్లుట్ల నరసింహం 2010 దేవాలయానికి పునఃప్రతిష్ట చేశారు. ఈ మధ్యకాలంలో టేకుపల్లి శ్రీ రామేశ్వరస్వామిని దర్శించటానికి విశేష సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తున్నారు.
క్షేత్ర దేవతలు
శ్రీ రామేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ బాలాపార్వతి అమ్మవారు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వార్లు విచ్చేసి ఉన్నారు. ఆలయ దైనందిన కార్యక్రమం మరియు నిత్య పూజాది కార్యక్రమములు మరింత పటిష్టంగా నిర్వహించుటకు యడవల్లి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని శ్రీ కంచి కామకోటి పీఠమునకు 19.06.2014 దత్తతగా ఇవ్వటం జరిగింది. తదాదిగా ఈ దేవాలయంలోని అన్ని కార్యక్రమాలు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్రసరస్వతి స్వామివారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిస్వామివార్ల అనుగ్రహముతో జరుపుతున్నారు.
ఈ దేవాలయం శ్రీ వల్లీ దేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొనియున్న మోపిదేవి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరములోను అలాగే కృష్ణానదీ సముద్ర సంగమమైన పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గానాగేశ్వరస్వామి దేవస్థానమునకు 5 కిలోమీటర్ల దూరములో వున్నది. ఈ మూడు దేవాలయములు 11కిలోమీటర్లలో మధ్యస్తంగా వుండటం ఒక విశేషం.
టేకుపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామేశ్వరస్వామి దర్శించగోరు భక్తజనులు, విజయవాడ, మచిలీపట్నం, రేపల్లె పట్టణాల నుండి వస్తే చల్లపల్లి గ్రామంలో గాని లేదా మోపిదేవి గ్రామాన గాని బస్సుదిగి ఆటోరిక్షాలో సౌకర్యవంతంగా చేరవచ్చు. మరొక ముఖ్య విశేషం ప్రపంచప్రఖ్యాతమైన కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధమైన కూచిపూడి గ్రామం ఇచ్చటకు 25 కిలోమీటర్లదూరములోనే వున్నది.
విశేష పూజలు
ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు శ్రీ బాలాపార్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. దైనందినంగా శ్రీ రామేశ్వరస్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం మరియూ అమ్మవారికి లక్ష్మి అష్టోత్తర, దుర్గస్తోత్ర, బాలసహస్ర నామార్చన. శ్రీ ఆంజనేయస్వామివారికి, వీరభద్రస్వామి వార్లకు అర్చన, ధూపదీప నైవేద్యములు నిత్యం జరుగుతుంటాయ. సాయంత్రం వేళ బాల పార్వతిదేవికి లలితాసహస్ర నామవళి పఠిస్తారు. క్షేత్రదర్శనం ఉపాసనాపరంగానే గాక, భక్తితత్పరతతో క్షేత్ర దేవతామూర్తులను కొలచినవారికి సకల శుభాలు జరుగుతాయని ఇక్కడి ప్రజల నమ్మిక. సర్వరోగ నివారణార్థం, సకలాభివృద్ధికి శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర దర్శనం అత్యంత శుభప్రదం.
ఇక్కడ ఆవిర్భవించిన ఈ స్వయంభూః శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర దర్శనం సకల శుభప్రదం మోక్షదాయకం. కనుక భ క్తజనులందరూ స్వామివారిని, అమ్మవారిని దర్శించి వారి అనుగ్రహ పాత్రులవ్వాలని ఆశిద్దాం.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.